Friday 19 April 2024

మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావ్‌ : రేవంత్‌రెడ్డి


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది టచ్‌లో ఉన్నారన్న మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ..  'మా ఎమ్మల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. కారు పాడైపోయింది. ఇక షెడ్డు నుంచి బైటికి రాదని ఎద్దేవా చేశారు.' తమ హయాంలో పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామని. కానీ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఈ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా.. బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు.

Labels: , , ,

సార్వత్రిక సమరంలో తొలి విడుత పోలింగ్‌ ప్రారంభం


సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్‌ జరుగుతున్నది. దీనితోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 50  , సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. 60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీకి చెందిన 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో జరిగే పోలింగ్‌లో ఇదే పెద్దది. అలాగే కేంద్రంలో బీజేపీ రెండుసార్ల సంపూర్ణ మెజారిటీ సాధించడంలో కీలక రాష్ట్రాలైన యూపీలో 8, రాజస్థాన్‌లో 12 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలోని ముస్లిం, దళిత, ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడుత పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలో ఇవాళ జరుగుతున్న 8 స్థానాల్లో 2019లో బీజేపీ 3 స్థానాలు గెలుచుకోగా, బీఎస్పీ 3, ఎస్పీ రెండు చోట్ల గెలుపొందాయి. బీజేపీకి సంప్రదాయంగా మొదటి నుంచి మద్దతుగా ఉన్న రాజ్‌పూత్‌లు ఈసారి ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి నెలకొన్నది. అలాగే రాజస్థాన్‌లోని 12 చోట్ల ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నది. 

Labels: , , , , , , , ,

Thursday 18 April 2024

కాంగ్రెస్‌ పార్టీలోకి మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే



కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌  వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా ఆ జాబితాలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన త్వరలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలిపారు. నేడో, రేపు ఆయన తన అనుచరులతో కలిసి కారు దిగి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. 

చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాతే ఆయన బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్లలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పై పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో వికారాబాద్‌, తాండూరు, పరిగి మినహా మిగిలిన మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేర్‌లింగంపల్లి, చెవెళ్ల ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌కు చెందిన వారే. ఇప్పుడు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే పార్టీ వీడనుండటంతో ఇంకా ఎంతమంది ఈ జాబితాలో ఉండనున్నారన్న చర్చ జరుగుతున్నది. ప్రకాశ్‌గౌడ్‌ కొన్నిరోజుల కిందటే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ అభివృద్ధి పనుల విషయంలోనే సీఎంను కలిసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. కానీ నాటి ప్రచారమే నేడు నిజమైంది.

Labels: , , , ,

ఆ నాలుగు స్థానాల ఫలితాలపై ఆసక్తి


రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పూర్తి  స్థానాల్లో పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. నాలుగో విడతలో తెలంగాణలోని 17 స్థానాలకు పోలింగ్‌ జరగనున్నది. నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల కోలాహలం మొదలైంది. తొలిరోజే 42 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలున్నాయి. ఖమ్మంలోని 10 స్థానాల్లో 9, కరీంనగర్‌లోని 13 స్థానాల్లో (సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్‌ ,కోరుట్ల మినహా) మిగిలిన తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం  సాధించింది. అలాంటి ఈ రెండు జిల్లాల అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన పట్నం మహేందర్‌రెడ్డి సతీమణికి మల్కాజ్‌గిరి, రంజిత్‌రెడ్డి చేవెళ్ల, దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌, కడియం కావ్యకు వరంగల్‌ టికెట్‌ ఇవ్వడాన్ని సొంతపార్టీలోనే విముఖత వ్యక్తమౌతున్నది. ఈ స్థానాల్లో పార్టీల అభ్యర్థుల కంటే జాతీయ, రాష్ట్ర నాయకత్వమే ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఒకవేళ ఈ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ అభ్యర్థులు గెలిస్తే అది కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Labels: , , , ,

బీజేపీ బలం ఎంత?


అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఓట్ల శాతం పెంచుకున్నా ఆశించిన సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో అధికారంలోకి వస్తామని లేదా కింగ్‌ మేకర్‌ అవుతామని చేసిన ప్రచారమూ ఉత్తదేనని తేలిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవుతామన్న ఆపార్టీకి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులే కరువైన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, మహబూబాబాద్‌ స్థానాలకు బీఆర్‌ఎస్, పెద్దపల్లి, చేవెళ్ల నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకే టికెట్‌ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆపార్టీ గెలిచిన కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఆదిలాబాద్‌ మినహా ముగ్గురినే తిరిగి బరిలోకి దించింది. మల్కాజ్‌గిరి, భువనగిరి స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గతంలో చట్టసభలకు ఎన్నికైన వారే కావడం గమనార్హం. దీంతో మొత్తం 17 స్థానాల్లో ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌, ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులే. దీంతో బీజేపీ బలం ఎంత అన్నది ఫలితాల రోజున తేలనున్నది.

Labels: , , , ,

మోడీ వేవ్ లేదట


 

"పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటల కల్లా ఓటర్ల ను బూత్ కు తీసుకుని రావాలి. మోడీ వేవ్ ఉందనే భ్రమ లో ఉండకండి. 2019 లోనూ మోడీ వేవ్ ఉన్నది. కానీ నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను." అంటూ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్టు  వీడియో ఒకటి వైరల్ గా మారింది. 

మహారాష్ట్ర లోని తన సిట్టింగ్ నియోజకవర్గం ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇది తన ప్రత్యర్థి పార్టీలు శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) అస్త్రంగా మారింది.2019 లో ఆమె  ఎన్ సీపీ మద్దతు తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. నవనీత్ తాజా వ్యాఖ్యల పై స్పందించిన శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ "బీజేపీ నేతలు బహిరంగంగా నిజాలు చెబుతున్నారని " అన్నారు.

Labels: , ,

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం

 

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం


నెలకొంటుందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందన్నారు.  తెలంగాణ భవన్‌లో లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థులకు బీ-ఫామ్స్‌, ఎన్నికల ఖర్చు చెక్కులను అందించారు. 


ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ...ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. బస్సు యాత్ర రూట్‌ మ్యాప్‌ ఇవాళ ఖారారవుతుంది. కాంగ్రెస్‌ పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. రానున్న రోజులు మనవే. పార్లమెంటులో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.