ఇదే వారి చిత్తశుద్ది...
ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం తెలంగాణ పై ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజల ఆకాంక్ష కంటే తమకు పెట్టుబడిదారులే ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు. ఒక ప్రాంతీయ సమస్యను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలట. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. దీనికి ప్రాథమిక చర్చలు అని, మాధ్యమిక చర్చలు, ఫైనల్ చర్చలు పూటకో మాటలు కాంగ్రెస్ పార్టీ లోనే వారే మాట్లాడుతున్నారు. చేతగాని ప్రబుత్వంలో చేతగాని నేతలున్నారు యిప్పుడు. నిజానికి ఈ ఏకాభిప్రాయం అనే మాట కాంగ్రెస్ పార్టీ ఏడేళ్ళుగా చెబుతున్నదే. కాని ఇంత వరకు జాతీయ స్థాయిలో ఏమో గానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్యే ఏకాభిప్రాయాన్ని సాధించలేదు. సమస్యను పరిష్కరించాలనే చితశుద్ది ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాని ప్రజల ఆకాంక్షను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. దీనికి ఇక్కడి వెన్నుముక లేని కాంగ్రెస్ నేతలు కూడా తోడయ్యారు. వీరి వల్లే తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం ఈ దాగుడుమూతలు ఆడుతున్నది. పైగా ఇతర ప్రాంతాలలో అశాంతి రగులుతుండగా తెలంగాణ ఇవ్వడం సరికాదని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఈ దేశ దౌర్భాగ్యం. అంటే నలుగురు పెట్టుబడి దారులు కోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు అశాంతికి గురైన పరవాలేదు అన్నట్టు ఉంది. యిప్పుడు కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది. చంద్రబాబు కూడా తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పాము. ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే బాబు ఊసరవెల్లి రంగు బయటపడింది. ఇక మిగిలింది తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలను బొంద పెట్టడమే.
వార్తల్లో వాస్తవమెంత తెలంగాణకు ప్యాకేజిలని, రెండో ఎస్సార్సీ అని వార్త వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో ఎవరికీ తెలియదు. కాని సీమాంద్ర మీడియా మాత్రం దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న రాష్ట్రాలపై రెండో ఎస్సార్సీ వేయడం సాధ్యం కాకపోవచ్చు. ప్రాంతీయ పార్టీల పై మనుగడ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అవి ఒప్పుకోవు కూడా. కేవలం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్స్ ఈ ఎత్తుగడ వేసింది. ఆ ఎన్నికల్లో లబ్ధి కోసమే మేము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. పైగా రషీద్ ఆల్వి వంటి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాని తెలంగాణ ప్రత్యేకమైన అంశమని ఇప్పటికే ప్రణబ్ వంటి నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల పై ఇప్పటికే ఒక కమిటీ వేసింది కేంద్రం. ఆ కమిటీ తన నివేదిక ఇచ్చి కూడా చాల కాలం అయ్యింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆ కమిటీ ఒక చెత్త రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. తాజాగా తెలంగాణ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలతో ఇక ఈ అంశాన్ని తేల్చాల్సిందే అని ఒక నిర్ణయనికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ . అందులో భాగంగానే ఆజాద్ తో రెండు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు చేసింది. ఆయన కూడా తన రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్, ఆజాద్ రిపోర్ట్ రెండు దగ్గర పెట్టుకొని తెలంగాణ పై ఏ నిర్ణయం చెప్పకుండా సాగదీస్తున్నది కాంగ్రెస్ పార్టీ . యిప్పుడు రాష్ట్రం లోని రెండు ప్రాంతాల ప్రజలు ఈ అనిచ్చితికి తెర దించాలని కోరుకుంటున్నారు. కాని కొందరు పెట్టుబడి దారులు, వారికి వంత పాడుతున్నమీడియా మాత్రం రెండో ఎస్సార్సీ అని ఇరు ప్రాంతాల ప్రజలను గందరగోళం లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా తెలంగాణపై కాంగ్రెస్ ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అడ్డదిడ్డంగా వాదిస్తున్న సీమాంద్ర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎస్సార్సీకి అందరూ సహకరించాలి అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీమాంద్ర పెట్టుబడిదారుల అవకాశవాద రాజకీయాలు.
ప్రకటన ప్రకంపనలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సియే కాంగ్రెస్ పార్టీ విధానమని దిగ్విజై, రసిద్ఆల్వి లాంటి వాళ్ళు మాట్లాడడం లో వింత ఏమి లేదు. ఎందుకంటే వీరు యిప్పుడు రాహుల్ టీంలో చేరిపోయారు. అందుకే ఆ యువరాజు పార్టీ పగ్గాలు చేపట్టడానికి, ప్రధాని పదవికి అర్హుడే అని గొప్పలు చెబుతున్నాడు దిగ్విజై సింగ్. రాహుల్ త్వరలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈ యువరాజు గత ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడాని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సంకీర్ణ యుగం లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లు సొంతంగా కేంద్రం లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేని స్టితిలో ఉన్నాయి. ఏదో ఒక కూటమికి నేతృత్వం వహిస్తూ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో గత పదిహేనేళ్ళుగా కేంద్రం లో అధికారాన్ని చేలయిస్తున్నాయి. అందుకే మాయావతి ఉత్తరప్రదేశ్ ను మూడు లేదా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఇందుకోసం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదే జరిగితే గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇరవై స్థానాలను గెలుచుకున్నది. రాష్ట్ర విభజన జరిగితే దాని వల్ల మాయావతి లబ్ధి పొందుతారని యిప్పుడు ఈ రెండో ఎస్సార్సీని కాంగ్రెస్ పార్టీ ముందుకు తెస్తున్నది. అయితే ఈ రెండో ఎస్సార్సీని బిజెపి, వామపక్షాలు ఇప్పటేకే వ్యతిరేకించాయి. కొత్త రాష్ట్రాల డిమాండ్ పై కమిషన్లు వేస్తారో, ఎస్సార్సీ వేస్తారో కాంగ్రెస్ పార్టీ సొంత నిర్ణయం. దాన్ని తెలంగాణ కు ముడిపెడుతున్న సీమాంధ్ర నేతల తీరే గర్హనీయం. ఎందుకంటే తెలంగాణ పై ఇప్పటికే కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. అంతే కాదు మొదటి ఎస్సార్సీకి సూచనకు వ్యతిరేకంగా తెలంగాణాను ఆంధ్రతో కలిపారు. నాటి నుంచే దీన్ని వ్యతిరేకిస్తూ, ఐదున్నర దశాబ్దాలు తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. తెలంగాణ పై ఇప్పటికే ఎన్నో కమిటీలు, కమిషను వేశారు. అది ముగిసిన అధ్యాయం. గోడ మీద పిల్లి లాగ ఇప్పడు తమకు అనుకూలంగా ఏది ఉంటే దాన్ని పట్టుకో వేలాడడం టిజి, రాయపాటి, లగడపాటి వంటి సీమాంద్ర నేతలకు అలవాటే. తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యే లు ఆ పార్టీని వీడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎస్సార్సీ ద్వారా పరిష్కరిస్తామని అంటే ఇక ఆ పార్టీ తెలంగాణ లో మర్చిపోవలసిందే. ఈ విషయాన్నీ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు కూడా. దీంతో అంపశయ్య మీద ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడం ఖాయం.