Monday 28 November 2011

ఇదే వారి చిత్తశుద్ది...

అందరూ అనుకున్నదే జరిగింది. తెలంగాణ కోసం టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీ'నామాల'ను స్పీకర్ తిరస్కరించారు. తెలంగాణ పై తమకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదన్న ఈ నేతలు ఈ ఉత్తుత్తి రాజీనామాలు ఇంకా ఎన్నిసార్లు చేస్తారో? తెలంగాణ టిడిపి నాయకులైతే మొదటిసారి రాజీనామాలు చేసిన తరువాత, ఏదో సాధించామని బస్సు యాత్రలు చేశారు, తెలంగాణ ప్రజలపై 'రణ'భేరీలు మోగించారు. రెండో సారి కూడా జిల్లా పర్యటనలు చేశారు. చంద్ర బాబు రెండుకళ్ళ సిద్ధాంతంతో నియోజకవర్గాల్లో తిరగలేని వీళ్ళు  ఈ రాజీనామాలను అడ్డుపెట్టుకొని ఒక సారి చుట్టివచ్చారు. అయినా అక్కడక్కడ వారికి ప్రతిఘటన ఎదురైంది. రెండో సారి పర్యటనలో తెలంగాణ అంశం కంటే టి ఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు గోడుగుకింద పనిచేసే వీరు ఇంతకంటే ఏమి చేస్తారు. యిప్పుడు మళ్లీ ఏదైనా చేయాలంటే చంద్రబాబు పర్మిషన్ కావాలి. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణ కోసం కాకుండా, అయన కోసం, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే మరో కొత్త ఎత్తుగడ వేయాలి. దీనికి తెలంగాణ ముసుగును తగిలించాలి. ఇదీ తెలంగాణ టిడిపి నేతల వ్యవహారశైలి. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలది మరో దారి. యిప్పుడు వారుచేస్తున్న కృషి తమ రాజకీయ భవిషత్తు 'కిరణాల' కోసమే. కొందరు మంత్రి పదవులకోసమైతే, మరికొందరు తమ సొంత పనులకోసం తహతహలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ స్టీరింగ్ కమిటీ కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి, తమ అధినేత్రి సోనియా దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నది. కొందరు నేత లైతే ఆవేశంలో పార్టీ వదిలి పోయిన వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని చిలక పలుకులు పలుకుతున్నారు. వీరి పదవి లాలస వల్లే కేంద్రం తెలంగాణ అంశాన్ని నాన్చుతున్నది. తెలంగాణ కోసం పార్లమెంటులో గొడవ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు కాపాడుకోవడానికే ప్రయత్నించారు. ప్రధాని తెలంగాణ పై తొందరపడం అని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా వీరిలో స్పందన లేదు. శ్రీ కృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన  పొలిటికల్ మేనేజ్ మెంట్ లో వీరు భాగస్వాములయ్యారు. ఇలా ఒకరు చంద్రబాబు కనుసన్నల్లో, మరొకరు అధిష్టానం పై నమ్మకం తో పనిస్తున్నారు. ఇదే వారి దృష్టి లో తెలంగాణ పై చిత్తశుద్ది.

Saturday 26 November 2011

ఆమ్ ఆద్మీ అంటే ఇదేనా ?



 రిటైల్ మార్కెట్లోకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్ డిఐ) ఆహ్వానిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆమ్ ఆద్మీ అభివృద్దే తమ కర్తవ్యం అని అధికారంలోకి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యిప్పుడు చిరు వ్యాపారుల పోట్టగొట్టే నిర్ణయాలను తెసుకుంటున్నది. సామాన్యుల బతుకులను గాలికి వదిలేసి కార్పోరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. ఒకవైపు ఆహార భద్రత చట్టాన్ని ముందుకు తెస్తూనే మరోవైపు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకులు వెళ్ళదీస్తున్న వారికి ఎఫ్ డిఐ  లతో భద్రత లేకుండా చేసే చర్యలకు తెర తీస్తున్నది. ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల సామాన్యుడు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొన్నది. పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించే చర్యలు చేపట్టకపోగా, ప్రతి రెండు నెలల కొకసారి పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. దేశంలో లక్షలాది మంది యువత నిరుద్యోగంతో అల్లాడుతున్నది. ప్రభుత్వం వారికి ఉపాధి చూపించక పోగా ఉన్న ఉపాధిని పోగొట్టే విధానాలకు పచ్చ జెండా ఊపడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని రాహుల్ ఉత్తరపదేశ్ ఎన్నికల్లో ఓట్ల కోసం రోడ్డుపక్కన ఉన్న టి కోట్లల్లో చాయి తాగుతూ గొప్పగా నటిస్తున్నారు. ఇక ప్రజా సమస్యల కంటే ప్రపంచ బ్యాంకు విధానాలే ముద్దు అన్నట్టు మన్మోహన్ సర్కారు వ్యవహరిస్తున్నది. యుపి ఏ రెండో సారి అధికారంలోకి వచ్చాక అనేక అవినీతి కుంభ కోణాలు బయటపడ్డాయి, పడుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయి, రిటైల్ మార్కెట్ లోకి ఎఫ్ డిఐ లను ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం  ద్వారా పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థం అవుతున్నది. ఆమ్ ఆద్మీ అంటే ఇదేనా అని ప్రజలు నిలదీస్తున్నారు. సామాన్యుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదు.

Friday 25 November 2011

అ'విశ్వాసం' ఎవరికి ఉంది?



శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షం పూటకో మాట మాట్లాడుతున్నది. అయితే బల నిరూపణకు దిగుతున్నది మాత్రం కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీలు. ఈ రెండు పార్టీల సంఖ్యా బలాన్నేయిప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కిరణ్ సర్కార్ తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నదని పైకి చెబుతున్నప్పటికీ  లోపల మాత్రం జగన్ వర్గ ఎమ్మెల్యేల ఫోబియ పట్టుకున్నది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో  జగన్ క్యాంపులోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది సొంత గూటికి తిరిగి వస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొన్న లోటస్ పాండ్ లో జరిగిన జగన్ వర్గ ఎమ్మెల్యేల భేటికి ఎనిమిది మంది డుమ్మా కొట్టారు. దీనికి కారణాలు ఎలా ఉన్నా జగన్ వర్గం లో తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో కాంగ్రెస్ నేతలు సంతృప్తి చెందితే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇవ్వాళ జగన్ వర్గంలో తగ్గిన సంఖ్యా బలం రేపు మరింత తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. అది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు జగన్ తో కలిసి నడిచే ప్రజాప్రతినిధుల సంఖ్యా ఎంతో స్పష్టంగా ఎవరికీ తెలియదు. సమావేశాలకు వచ్చే వారినే ప్రామాణికంగా తీసుకుంటే, జగన్ ఇంతకు ముందు చేపట్టిన పలు దీక్షల సమయంలో ఒక్కో సమయంలో ఒక్కో సంఖ్యా కనిపించింది. యిప్పుడు ఆయన వర్గంలోని కొందరు ఎమ్మెల్యేల స్వరం మారడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. అందులో యిప్పుడు రాష్ట్రం లో ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోవడం, తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు ఆగిపోవడం, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండడం వంటి కారణాలతో మూడు అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టి సారించాలని ఆయా నేతలు భావించడం సహజమే. ఎందుకంటే అధికార పార్టీ సభ్యులుగా ఉండి, ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వారికి వచ్చే లాభం ఏమి ఉండదు. పైగా అభివృద్ధి పనులు జరిగితేనే వారికి కొన్ని డబ్బులు, కొంత పేరు, గౌరవం లభిస్తాయి. అలాగే ప్రతిపక్షం కూడా యిప్పుడు ఎన్నికలకు పోయే పరిస్థితిలో లేదు. ఇటు జగన్, అటు చంద్రబాబు ఆస్తుల పై సిబిఐ ఎంక్వైరీలు సాగుతున్నాయి. మరో వైపు తెలంగాణ అంశం ఇంకా తేలలేదు. ముఖ్యంగా తెలంగాణ సమస్య పరిష్కారం కానంత వరకు రాష్ట్రం లోని అధికార,ప్రతిపక్ష, వైఎస్ఆర్ పార్టీలు ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఒకవేళ ఎన్నికలకు వెళ్లినా ఈ మూడు పార్టీలు తమ బల బలాలను తేల్చుకోవలసింది సీమాంద్రలోనే. తెలంగాణ పై ఈ మూడు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని వదిలి ఒక్క సీమాంద్ర తోనే అధికారంలోకి రావడం కష్టమే కదా! అందుకే అవిశ్వాసం పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, దానిపై భయపడుతున్నది మాత్రం అధికార పార్టీయే !

Saturday 19 November 2011

నిలబెడితే.... పడిపోతారు జాగ్రత్త



జగన్ వర్గ ఎమ్మెల్యేలు కొంత మంది మళ్లీ కాంగ్రెస్ గూటిలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది అబద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేసినా, ప్రస్తుత పరిణామాలను చూస్తే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష నేతల నుంచి మాటలు వినిపిస్తున్న ఈ తరుణంలో జగన్ వర్గ ఎమ్మెల్యేల రాక కిరణ్ సర్కారుకు సంతోషం కలిగించవచ్చు. కానీ జగన్ వర్గ ఎమ్మెల్యేలు మాత్రం చెబుతున్న కారణాలు తెలంగాణ ప్రజాప్రతినిధుల బానిసత్వాన్ని సూచిస్తున్నాయి. ప్రభుత్వం పడిపోతే తెలంగాణావాదం బలపడుతుంది. కాబట్టి తెలంగాణ వాదాన్ని బలపడనీయం అంటున్నారు. సీమాంద్ర ప్రజప్రతినిదులు అలా మాట్లాడితే, వారి ప్రయోజనాల కోసం వారు ఈ పని చేస్తుండవచ్చు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏమి అవసరం వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోయడానికి. ఒక పక్క కిరణ్ సర్కార్ ఉద్యమాన్ని అణచడానికి చాప కింద నీరులా ఉద్యమకారులపై నల్ల చట్టాలు ప్రయోగిస్తుంటే, ఈ ప్రాంత నేతలు మిన్నకుండడం దేనికి సంకేతం. ప్రజలు ఏమైనా మాకు పరవాలేదు మాకు మాత్రం మా పదవులే ముఖ్యం అనుకుంటున్నారు. అధికారం ఉంది కదా ఇక మాకు ఎలాంటి డోకా లేదనుకుంటే పొరపాటే. యిప్పుడు తెలంగాణ వ్యతిరేకులతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కాపాడినా రేపు ఎన్నికల్లో ఓట్లు వేసేది మాత్రం ఈ ప్రాంత ప్రజలే. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ . దీనికి వంత పాడుతున్నది ఈ ప్రాంత కాంగ్రెస్ బానిస నేతలు. అయితే మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పే మాటలకు కాలం చెల్లింది. వచ్చిన తెలంగాణ ను అడ్డుకున్న సీమాంద్ర నాయకత్వంతో నడుస్తున్న నేతలకు ఇక శంకరగిరి మాన్యాలే దిక్కు.  సీమాంద్ర అవకాశవాద రాజకీయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలయ్యేది రేపు  మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలే, దీనికి టిడిపి నేతలు మినహాయింపు కాదు.


Friday 18 November 2011

ఎన్ని వేదికలు, ఎన్ని మాటలు



కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. ఒక్కో వేదిక పై ఒక్కో మాట మాట్లాడుతున్నారు.  మొన్న చిన్న రాష్ట్రాల విషయంలో రెండో ఎస్సార్సీ యే కాంగ్రెస్ విధానమన్నారు. ఇప్పుడేమో ఉత్తరపదేశ్ రాష్ట్ర విభజన విషయంలో మాత్రమే రెండో ఎస్సార్సీ మా విధానమని, తెలంగాణ ప్రత్యేక అంశం అని తాజా వ్యాఖ్యలు. మరి రాష్ట్రం లోని ఈ అనిత్చితిని తొలగించాలని ఇరు ప్రాంతాల ప్రజలు ముక్తకంటంతో కోరుతున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ పై చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే ఉద్యమకారులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది రాస్ర ప్రభుత్వం. దీనికి తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దమన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. వీళ్ళ మన నేతలు అని తెలంగాణ ప్రజానీకం అసహించుకుంటున్నది. చంద్రబాబు గొడుగు కింద తెలంగాణ టిడిపి నేతలు ఎన్ని ఉద్యమాలు చేసినా, కాంగ్రెస్ అధిష్టానం పై నమ్మకముందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. రాజ్యాంగ సంక్షోభం సృస్తిస్తామన్న ఈ ఇరు పార్టీల ప్రజాప్రతినిధులు ఇప్పడు వారి వారి అధినాయకత్వాలతో రాజీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇరు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు, రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న ఈ నాటకానికి ముగింపు పలకక పోతే ప్రజలు వీరికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం. అలాగే తెలంగాణ పొలిటికల్ జెఎసిలో కీలక పాత్ర పోషిస్తున్న రాజకీయ పార్టీలు కూడా తమ ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరముంది. ఉద్యమకారులు ఎదురుకొంటున్న నిర్బంధకాండ పై ప్రత్యక్ష కార్యాచరణను రూపొందించాల్సిన అవసరమున్నది.

Monday 14 November 2011

ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం తెలంగాణ పై ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజల ఆకాంక్ష కంటే తమకు పెట్టుబడిదారులే ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు. ఒక ప్రాంతీయ సమస్యను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలట. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. దీనికి ప్రాథమిక చర్చలు అని, మాధ్యమిక చర్చలు, ఫైనల్ చర్చలు పూటకో మాటలు కాంగ్రెస్ పార్టీ లోనే వారే మాట్లాడుతున్నారు. చేతగాని ప్రబుత్వంలో చేతగాని నేతలున్నారు యిప్పుడు. నిజానికి ఈ ఏకాభిప్రాయం అనే మాట కాంగ్రెస్ పార్టీ ఏడేళ్ళుగా చెబుతున్నదే. కాని ఇంత వరకు జాతీయ స్థాయిలో ఏమో గానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్యే ఏకాభిప్రాయాన్ని సాధించలేదు. సమస్యను పరిష్కరించాలనే చితశుద్ది ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాని ప్రజల ఆకాంక్షను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. దీనికి ఇక్కడి వెన్నుముక లేని కాంగ్రెస్ నేతలు కూడా తోడయ్యారు. వీరి వల్లే తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం ఈ దాగుడుమూతలు ఆడుతున్నది. పైగా ఇతర ప్రాంతాలలో అశాంతి రగులుతుండగా తెలంగాణ ఇవ్వడం సరికాదని ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఈ దేశ దౌర్భాగ్యం. అంటే నలుగురు పెట్టుబడి దారులు కోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు అశాంతికి గురైన పరవాలేదు అన్నట్టు ఉంది. యిప్పుడు కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది. చంద్రబాబు కూడా తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పాము. ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే బాబు ఊసరవెల్లి రంగు బయటపడింది. ఇక మిగిలింది తెలంగాణ ప్రజలకు ఈ రెండు పార్టీలను బొంద పెట్టడమే.

Friday 11 November 2011

వార్తల్లో వాస్తవమెంత తెలంగాణకు ప్యాకేజిలని, రెండో ఎస్సార్సీ అని వార్త వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతో ఎవరికీ తెలియదు. కాని సీమాంద్ర మీడియా మాత్రం దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న రాష్ట్రాలపై రెండో ఎస్సార్సీ వేయడం సాధ్యం కాకపోవచ్చు. ప్రాంతీయ పార్టీల పై మనుగడ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అవి ఒప్పుకోవు కూడా. కేవలం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాంగ్రెస్స్ ఈ ఎత్తుగడ వేసింది. ఆ ఎన్నికల్లో లబ్ధి కోసమే మేము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. పైగా రషీద్ ఆల్వి వంటి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాని తెలంగాణ ప్రత్యేకమైన అంశమని ఇప్పటికే ప్రణబ్ వంటి నేతలు స్పష్టం చేశారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తరువాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల పై ఇప్పటికే ఒక కమిటీ వేసింది కేంద్రం. ఆ కమిటీ తన నివేదిక ఇచ్చి కూడా చాల కాలం అయ్యింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆ కమిటీ ఒక చెత్త రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రజాస్వామిక వాదులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. తాజాగా తెలంగాణ లో జరిగిన, జరుగుతున్న పరిణామాలతో ఇక ఈ అంశాన్ని తేల్చాల్సిందే అని ఒక నిర్ణయనికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ . అందులో భాగంగానే ఆజాద్ తో రెండు ప్రాంతాల నేతలతో సంప్రదింపులు చేసింది. ఆయన కూడా తన రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్, ఆజాద్ రిపోర్ట్ రెండు దగ్గర పెట్టుకొని తెలంగాణ పై ఏ నిర్ణయం చెప్పకుండా సాగదీస్తున్నది కాంగ్రెస్ పార్టీ . యిప్పుడు రాష్ట్రం లోని రెండు ప్రాంతాల ప్రజలు ఈ అనిచ్చితికి తెర దించాలని కోరుకుంటున్నారు. కాని కొందరు పెట్టుబడి దారులు, వారికి వంత పాడుతున్నమీడియా మాత్రం రెండో ఎస్సార్సీ అని ఇరు ప్రాంతాల ప్రజలను గందరగోళం లోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా తెలంగాణపై కాంగ్రెస్ ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అడ్డదిడ్డంగా వాదిస్తున్న సీమాంద్ర కాంగ్రెస్ నేతలు మాత్రం ఎస్సార్సీకి అందరూ సహకరించాలి అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీమాంద్ర పెట్టుబడిదారుల అవకాశవాద రాజకీయాలు.

Thursday 10 November 2011

ప్రకటన ప్రకంపనలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సియే కాంగ్రెస్ పార్టీ విధానమని దిగ్విజై, రసిద్ఆల్వి లాంటి వాళ్ళు మాట్లాడడం లో వింత ఏమి లేదు. ఎందుకంటే వీరు యిప్పుడు రాహుల్ టీంలో చేరిపోయారు. అందుకే ఆ యువరాజు పార్టీ పగ్గాలు చేపట్టడానికి, ప్రధాని పదవికి అర్హుడే అని గొప్పలు చెబుతున్నాడు దిగ్విజై సింగ్. రాహుల్ త్వరలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈ యువరాజు గత ఎన్నికల నుంచి ఉత్తరప్రదేశ్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడాని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సంకీర్ణ యుగం లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లు సొంతంగా కేంద్రం లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేని స్టితిలో ఉన్నాయి. ఏదో ఒక కూటమికి నేతృత్వం వహిస్తూ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో గత పదిహేనేళ్ళుగా కేంద్రం లో అధికారాన్ని చేలయిస్తున్నాయి. అందుకే మాయావతి ఉత్తరప్రదేశ్ ను మూడు లేదా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఇందుకోసం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అదే జరిగితే గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇరవై స్థానాలను గెలుచుకున్నది. రాష్ట్ర విభజన జరిగితే దాని వల్ల మాయావతి లబ్ధి పొందుతారని యిప్పుడు ఈ రెండో ఎస్సార్సీని కాంగ్రెస్ పార్టీ ముందుకు తెస్తున్నది. అయితే ఈ రెండో ఎస్సార్సీని బిజెపి, వామపక్షాలు ఇప్పటేకే వ్యతిరేకించాయి. కొత్త రాష్ట్రాల డిమాండ్ పై కమిషన్లు వేస్తారో, ఎస్సార్సీ వేస్తారో కాంగ్రెస్ పార్టీ సొంత నిర్ణయం. దాన్ని తెలంగాణ కు ముడిపెడుతున్న సీమాంధ్ర నేతల తీరే గర్హనీయం. ఎందుకంటే తెలంగాణ పై ఇప్పటికే కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నారు. అంతే కాదు మొదటి ఎస్సార్సీకి సూచనకు వ్యతిరేకంగా తెలంగాణాను ఆంధ్రతో కలిపారు. నాటి నుంచే దీన్ని వ్యతిరేకిస్తూ, ఐదున్నర దశాబ్దాలు తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. తెలంగాణ పై ఇప్పటికే ఎన్నో కమిటీలు, కమిషను వేశారు. అది ముగిసిన అధ్యాయం. గోడ మీద పిల్లి లాగ ఇప్పడు తమకు అనుకూలంగా ఏది ఉంటే దాన్ని పట్టుకో వేలాడడం టిజి, రాయపాటి, లగడపాటి వంటి సీమాంద్ర నేతలకు అలవాటే. తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యే లు ఆ పార్టీని వీడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఎస్సార్సీ ద్వారా పరిష్కరిస్తామని అంటే ఇక ఆ పార్టీ తెలంగాణ లో మర్చిపోవలసిందే. ఈ విషయాన్నీ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు కూడా. దీంతో అంపశయ్య మీద ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడం ఖాయం.

Sunday 6 November 2011

ఒకటే దారి.. ఒకటే నినాదం

ఇవ్వాళ తెలంగాణ మొత్తం ప్రజానీకం కోరుతున్నది ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ విలీనానికి ముందున్న తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్దరించాలని. అంతే కాని వచ్చే తెలంగాణ ఇలా ఉండాలి, అలా ఉండాలని ఇప్పుడే ఎవరూ కోరుకోవడం లేదు. తెలంగాణలోని అన్ని వర్గాల వారి వివిధ పద్ధతుల్లో ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఈ మొండి ప్రభుత్వాల వైఖరి వల్లనే ఇప్పటికే ఏడు వందందలకు పై చిలుకు తెలంగాణ బిడ్డలు బలిదానాలు పాల్పడ్డారు. ఈ సమయం అందరూ ఒకే నినాదం తో కలిసి నడవాలి. మనలో మనమే కలహించుకుంటే అది శత్రువుకే లాభం చేకూరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర్రం సాకారం కావాలంటే అన్ని పార్టీల మద్దతు తో పాటు రాష్ట్రం లోని అన్ని వర్గాలు సంఘటితం కావాలి.