Monday 20 August 2012

ఊళ్లను మాయం చేస్తున్న ఉత్పత్తి



ఉత్తర తెలంగాణ అంటే మనకు గుర్తుకువచ్చేది సింగరేణి. పారిశ్రామిక ప్రాంతంగా పేరు పొందింది. సింగరేణి బొగ్గుబావుల్లో కార్మికుల కష్టంతో బయటికి వస్తున్న బొగ్గుతో ఉత్తరాది రాష్ట్రాలకు కరెంటు ఉత్పత్తి అవుతోంది. ఒకప్పువు 1,20,000 మందితో విలసిల్లిన సింగరేణి ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గింది. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి వేటలో ఉపాధిపై వేటు వేస్తున్నది. సంస్కరణల పేరుతో కార్మిక కుటుంబాలను సమస్యల సుడిగుండంలోకి నెట్టివేస్తున్నది. ఇప్పుడు సింగరేణి ప్రాంతమంతా ఓపెన్‌కాస్టుల విధ్వంసం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాదు, మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రాంతంలో ఇంకో దశాబ్దం తర్వాత మనిషి నివసించడానికి అనువుగా ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

సింగరేణి యాజమాన్యానికి తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిపై ఉన్న ప్రేమ అక్కడి స్థానిక ప్రజలపై లేదు. ముఖ్యంగా రామగుండం పరిసర ప్రాంతంలో దుమ్ము, ధూళితో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు శ్వాసకోస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికంతటికి కారణం ఓపెన్ కాస్టులే. భూగర్భ జలాలు ఇంకిపోయి సాగునీటికి, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి వెలికితీస్తున్న అధిక ఉత్పత్తే అభివృద్ధి అంటే ఎలా? స్థానిక నాయకత్వం కూడా చేష్టలుడిగి చూస్తోంది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసి, మనిషి అస్తిత్వాన్నే కోల్పోయి, ఉపాధి లేక ఊళ్లను వదలిపోయేలా చేస్తున్నా ప్రజాప్రతినిధులు మౌనంగా ఉంటున్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఎవరి జీవితాలను నాశనం చేస్తున్నారని ఏనాడూ ప్రశ్నించడం లేదు.

ఏ యేటికి ఆ యేడు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూపోతూ కార్మికులపై అధిక భారాన్ని మోపుతున్నారు. సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన కార్మికులు రిటైర్‌మెంట్ అయ్యాక పట్టుమని పదేళ్లు కూడా బతకడం లేదు. అంటే ఇంత కాలం పనిచేసే చోట వాళ్లు ఎంత కాలుష్య బారిన పడ్డారో అర్థమవుతుంది. పదవీవిరమణ పొందిన కార్మికులు తమ శేష జీవితాన్ని రోగాలతో నెట్టుకొస్తున్నారు. ఆ వయసులో వారి పిల్లలతో జ్ఞాపకాలు పంచుకోవాల్సిన వారు మందులతో మనుగడ సాధిస్తున్నారు. దేశాభివృద్ధికి పరిశ్రమలు ఎంత తోడ్పాటును అందిస్తాయో.. వాటివల్ల పర్యావరణం కూడా అంతే దెబ్బతింటున్నది. అందుకే ఏదేని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరుతో చేపట్టబోయే కార్యక్రమాల వల్ల సంస్థకు వచ్చే ఆదాయంతో పాటు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలి. పర్యావరణం దెబ్బతినకుండా ఉత్తత్తి సాధించాలి. అక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి. అంతేగానీ పచ్చని పల్లెలో కాలుష్యకుంపటి పెట్టేది అభివృద్ధి ఎంత మాత్రం కాదు.  ఇప్పటికైనా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు తమ తాత్కాలిక ప్రయోజనాలకు పక్కనపెట్టి ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి. లేకపోతే కొన్ని దశాబ్దాల తర్వాత ఉత్తర తెలంగాణ మొత్తం బొందల గడ్డగా మారే ప్రమాదం ఉంది. ప్రకృత్తి వనరుల ఉనికే లేకుండా చేసే ఉత్పత్తితో ఉపయోగం ఎవరికో ఆలోచించాలి. భావి తరాలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత పాలకులు ఈ దిశగా కృషి చేయాలి.
-రాజు

Wednesday 1 August 2012

బైరెడ్డి వ్యాఖ్యలు-బాబు మౌనం




తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు. పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదు. ఇవన్నీ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ! తెలుగుదేశం పార్టీ అధినేత మీడియా ముందు తరచుగా వాళ్ల పార్టీ గురించి చెప్పుకునే ఊకదంపుడు ఉపన్యాసాలు. కానీ బాబు చెప్పిన ఆ నీతి సూత్రాలు తెలంగాణ ప్రాంత నేతలకే వర్తిస్తాయి కాబోలు! అంతేమరి బాబు ప్రాపకం కోసం ఈ ప్రాంత నేతలు ఆయన ఏది చెబితే అదే చేస్తారు. తాజాగా టీడీపీ రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఒక కొత్త దుఖానం తెరిచారు. అదే ప్రాంతానికి చెందిన రాయలసీమ హక్కుల నేత ఒకసారి సమైక్యమని, మరోసారి రాయల తెలంగాణ అని ఆ ప్రాంత హక్కులను తనకు ఇష్టం వచ్చినట్టు మలుచుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డి ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి లేదా అనంతపురం జిల్లాను బెంగళూరులో కలపాలని వాదించారు.  అయితే సమైక్యాంధ్ర కన్వీనర్ మంత్రి శైలజనాథ్ కూడా రాయలసీమ ప్రాంతం వాడే కావడం గమనార్హం. అంటే ఈ నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధుల నుంచి నలభై మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలు వేరైనా ఎవరి ప్రయోజనాలకు వారికి ఉన్నాయి. అందుకే ఒకరి తర్వాత ఒకరు రాయలసీమ హక్కుల గురించి పదే పదే ఉచ్చరిస్తుంటారు. వారి ఆవేదన ఆచరణలో ఉంటే నిజంగా రాయలసీమ ప్రజలకు కొంత మేలు జరిగి ఉండేది. కానీ వారి లక్ష్యం అది కాదు. సమైక్య, రాయల ద్వంద్వ స్వరాలు వినిపించడం వారికే సొంతం. ఆ నలుగురి బాధే రాయలసీమ ప్రజల బాధ అన్నట్టు వ్యవహరిస్తుంటారు.

ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా నష్టపోయింది అని వాదించే నేతలకు కొన్ని ప్రశ్నలు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రాయలసీమ నేతలే. ఇప్పుడు కూడాఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షం నేత, కాబోయే ముఖ్యమంత్రి అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెబుతున్న జగన్ కూడా రాయలసీమ ప్రాంతం వాసులే. అయినా రాయలసీమ ఎందుకు వెనుకబడిందో ఈ వితండ వాదనలు చేస్తున్న వారే వివరణ ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి రాయలసీమ నేతే. విలీన సమయంలో ఈ రెండు ప్రాంతాల నేతలు చేసుకున్న ఒప్పందాలను ఆదిలో అణగదొక్కింది ఆ మహానుభావుడే. ఆంధ్రకు ముఖ్యమంత్రి పదవి లభిస్తే, తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాసుకున్న ఒప్పందాలను కాలరాసింది ఆ ప్రబుద్ధుడే. ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు వంటిది అని సెలవిచ్చింది వారే. ఇక అప్పటి నుంచి మొదలైన తెలంగాణ ప్రజల హక్కుల హననం ఇప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఈ ప్రాంత ప్రజలు హక్కులడిగితే అరదండాలే. అయినా ఏనాడూ వీటి స్పందించలేదు ఇప్పుడు రాష్ట్ర విభజనపై తలాతోకా లేని వాదనలు చేస్తున్న నాయకులు. అట్లనే తెలంగాణ తమ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ మహానాడు సమావేశంలో తీర్మానం చేసి, తీరా ప్రకటన వచ్చాక మాట మార్చింది బాబు టీడీపీయే. అప్పుడు మాట్లాడలేదు బైరెడ్డి. కానీ ఇప్పుడేదో ప్రళయం ముంచుకొచ్చినట్టు ప్రగల్భాలు పలుకుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలు, రాయలసీమలోని కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. వాటిని ఎవరూ కాదనరు. కానీ రాయలసీమ హక్కులకు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ముడిపెట్టడం సరికాదు. రాయలసీమ హక్కులు గురించి ఎవరు ఎవరితో చేసుకున్నారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. అలాగే రాయలసీమ హక్కులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంతో చేసుకున్న ఒప్పందాలను వలస పాలకులు తుంగలో తొక్కారనే దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల వందలాది మందికి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉందో టీడీపీది అంతే ఉంది. ఈ వాస్తవాలను పక్కనపెట్టి  రాయలసీమ హక్కుల పేరుతో రోజుకో రాగం తీస్తున్న నేతలు కోరుతున్నదేమిటి? రాయలసీమ అభివృద్ధా? లేక ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమా అన్నది వారికే తెలియదు. కనుక సీమ ప్రజలరా తస్మాత్ జాగ్రత్త!
-రాజు