Saturday 29 December 2012

నార్త్‌బ్లాక్‌లోఆ మూడుపార్టీల నాటకం



అఖిలపక్షం ముందు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. ఎందుకంటే ఈ అఖిలపక్ష భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య మార్పులు వస్తాయని ఎవరూ భావించలేదు. భ్రమ పడలేదు. కానీ తెలంగాణపై అస్పష్ట వైఖరి ఉన్న పార్టీల నుంచి స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతుండడానికి కారణం కాంగ్రెస్, టీడీపీలు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ కూడా. ఈ మూడు పార్టీల పీటముడి కారణంగానే రాష్ట్ర విభజనపై చిక్కుముడి వీడడం లేదన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇవే మూడు పార్టీలు ఏమీ తెలియనట్టు నటిస్తున్నాయి. అదే విధానాన్ని నార్త్‌బ్లాక్‌లో కూడా కొనసాగించాయి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. రాష్ట్ర విభజనపై అప్పటి కేంద్ర హోంమంత్రి డిసెంబర్ 9న ఒక ప్రకటన చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్, టీడీపీల వల్ల ఆవిరైపోయింది. పట్టుమని పదిహేను రోజుల్లోనే సీమాంధ్ర నేతల రాజ’కీ’యాలతో వెనక్కిపోయింది. అందుకే చిదంబరం రాష్ట్రంలో కొన్ని పార్టీలు తెలంగాణపై ‘యూటర్న్’ తీసుకున్నందున మరిన్ని సంప్రదింపులు జరగాలన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణకమిటీ, కాంగ్రెస్ అంతర్గత కమిటీల పేరుతో చేసిన హడావుడి విదితమే. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణపై ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె, తెలంగాణ మార్చ్ ఒక్కటేమిటి ప్రపంచంలో ఏ ఉద్యమంలో కనిపించని అన్ని రూపాలను ప్రదర్శించారు. వందల మంది బలిదానాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. అయినా సీమాంధ్ర నేతలకు మనసు కరగలేదు. చనిపోయిన అమరుల కుటుంబాలపై సానుభూతి కలగలేదు. నిజానికి వారి నుంచి సానుకూల స్పందన ఆశించడం తెలంగాణ ప్రజల అత్యాశే అవుతుంది తప్ప ఫలితం ఉండదు. మూడేళ్ల కాలం ఇట్టే కరిగిపోయింది. కానీ తెలంగాణ ప్రజల కన్నీళ్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం కనికరించలేదు. అందుకే తెలంగాణపై ఎప్పటికప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో ఈ ప్రాంత ఎంపీల ఒత్తిడి మేరకు అఖిలపక్ష సమావేశానికి ఒప్పుకున్నది. దాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి మొదలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, సీమాంధ్ర ప్రాంత నేతలు వ్యవహరించారు. ఆజాద్ అయితే ఏకంగా కేంద్ర హోంమంత్రిగా షిండే కొత్తగా బాధ్యతలు చేపట్టారు కనుక ఆయన అవగాహన కోసం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ది ఎప్పుడూ తెలంగాణపై కిరికిరే. అందుకే గతంలో ఈ అఖిలపక్ష సమావేశం భిన్నంగా ఉండదని ఎద్దేవ చేసినట్టు మాట్లాడాడు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ఈ సమావేశాన్ని వాయిదా వేయించడానికి విఫలయత్నం చేశాడు. అందరూ ఎదురుచూసిన అఖిలపక్ష భేటీ సమయం వచ్చింది. సమావేశమూ పూర్తయ్యింది.

ఇంతకీ అఖిలపక్షంలో తేలింది ఏమిటి? మళ్లీ ఆ మూడు పార్టీల తంతూ అదే. కాంగ్రెస్ రెండు వాదనలు వినిపించింది. తెలుగుదేశం పార్టీ ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ గురించి పాతపాడే పాడింది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ ఇడుపులపాయ ప్లీనరీ ముచ్చటే చెప్పింది. ఒక రకంగా ఈ మూడు పార్టీలు తెలంగాణపై తమ సస్పెన్స్ యథావిధిగా కొనసాగించాయి. కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణపై తాము స్పష్టంగా చెప్పామని టీడీపీ బీరాలు పలికింది. సమావేశంలో టీడీపీ ‘సీల్డ్‌కవర్’ ద్వారా ఏం చెప్పింది? షిండేకు రెండు లేఖలు ఇచ్చినట్టు సమాచారం అందులో మొదటి ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖ. రెండోది రాష్ట్రంలో అనిశ్చితికి కారణం కేంద్రమే. కనుక ఈ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉన్నదని చెప్పింది. అందుకే తెలంగాణవాదులు టీడీపీ లేఖలో స్పష్టత లేదు అంటే మొదటి లేఖలో తెలంగాణకు టీడీపీ సానుకూలంగా ఉన్నదనే వాక్యం ఉన్నదట. అందుకే షిండేకు ఇచ్చిన రెండు లేఖలు కలిపి చదువుకుంటే తెలంగాణపై టీడీపీ చిత్తశుద్ధి కనిపిస్తుందట. ఏమైనా అర్థం ఉన్నదా? టీడీపీ చెబుతున్న ప్రణబ్ కమిటీ యూపీఏ-1 ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన తర్వాత అది కాలగర్బంలో కలిసిపోయింది. ఆ తర్వాత తెలంగాణపై చాలా కమిటీలు వచ్చాయి. రాజశేఖర్‌రెడ్డి వేసిన రోశయ్య కమిటీ, కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ, ఈ అఖిలపక్ష సమావేశాని కంటే ముందు రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. వీటిలో ఏ ఒక్కదానిలో టీడీపీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పలేదు.  అందుకే టీఆర్‌ఎస్ నేతలు టీడీపీ వైఖరిని పెండ్లి ఎత్తగొట్టి, నిశ్చితార్థానికి కట్టుబడి ఉంటామంటే ఎలా అని నిలదీస్తున్నారు. అఖిలపక్ష భేటీకి టీడీపీ తరఫున ఈ ప్రాంత నుంచి వెళ్లిన కడియం శ్రీహరిగారు షిండే రికార్డు చేసిన మినట్స్ చూస్తే టీడీపీ తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో తేలుతుంది అంటున్నారు. దాన్ని బయటపెట్టించే దమ్ము కేసీఆర్‌కు ఉన్నదా అని ఛాలెంజ్ చేస్తున్నారు. ఒకవేళ శ్రీహరి వాదిస్తున్నట్టు టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే సీల్డు కవర్ సందేశమెందుకు? చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలోనే పాదయాత్ర చేస్తున్నారు కదా! ఆయన నోటి నుంచే 200లో తమ  పార్టీ మహానాడులో తెలంగాణపై చేసిన తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఒక మాట చెబితే సరిపోతుంది. కానీ వాళ్లు ఆ పని చేయడం లేదు. అయిపోయిన లేఖ గురించి పదే పదే ప్రస్తావిస్తూ అదే మా విధానమని అరిచి గీ పెడుతున్నారు. అలాగే టీడీపీ వైఖరి స్పష్టంగా లేదని ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే చెప్పడం లేదు. ఆ సమావేశానికి హాజరైన వాళ్లలో కొంతమంది అదే చెబుతున్నారు. లోపల ఒకటి బయట ఒకటి చెబుతున్నారని మండిపడ్డారు. ‘హిందూ’ లాంటి ఆంగ్ల పత్రిక కూడా తన సంపాదకీయంలో తెలంగాణపై టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల వైఖరి అస్పష్టంగా ఉన్నదని పేర్కొన్నది. అందుకే టీడీపీ నేతలు తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు అనడం కంటే ఆ పార్టీ అధినేతతో అనుకూలం అని చెప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని నర్సారావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. తాను సమైక్యవాదినని, దీనిపై తమ పార్టీ అధినేతతో చర్చిస్తాను అన్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు తాను నడుచుకుంటానని, అవసరమైతే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాను అన్నారు. దీన్ని నన్నపనేని రాజకుమారి కూడా సమర్థించారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాయలసీమ హక్కుల గురించి మాట్లాడారు. ఇలా సీమాంధ్ర నేతలు టీడీపీ తెలంగాణ సానుకూల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణవాదులు స్పష్టత గురించి డిమాండ్ చేస్తున్నారు. బాబు రెండు కండ్ల సిద్ధాంతం మొదటికే మోసం తెచ్చేలా ఉన్నది.

టీడీపీ వైఖరి అలా ఉంటే.. ఈసారి అఖిలపక్షంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతాన్ని పాటించినట్టు కనిపించింది. అందుకే మాజీ శాసనసభాపతి కేఆర్ సురేష్‌రెడ్డి తెలంగాణవాదం వినిపిస్తే, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి సమైక్యవాదాన్ని వినిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంపై మొదట భిన్నవాదనలు వినిపించాయి. సమావేశంలో గాదె వెంకటరెడ్డిని హోం మంత్రి షిండే మాట్లాడనివ్వలేదని, సురేష్‌రెడ్డి చెప్పిన అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండువాదనలపై మిగలిన పక్షాలు నిలదీస్తే.. సురేష్‌రెడ్డి అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నదని చెప్పినట్టు ప్రసార మాధ్యమాలు ప్రసారం చేశాయి. ఎందుకంటే అఖిలపక్ష సమావేశం తర్వాత గాదె వెంకటరెడ్డి పెద్దగా మాట్లాడకపోవడంతో ఈ వాదనకు బలం చేకూరింది. అయితే తర్వాత గాంధీభవన్‌లో గాదె ప్రెస్‌మీట్ పెట్టి మరి షిండే రెండు రాష్ట్రాల వాదనను తోసిపుచ్చారు. తన వాదనపై వస్తున్న వివాదాలకు వివరణ ఇచ్చారు. మా పార్టీ ఎవరిని అడ్డుకోలేదని, ఇద్దరి అభిప్రాయాలను చెప్పుకొమ్మన్నదని, అయితే ఎవరు ఏం చెప్పినా చివరికి అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే మాట చెప్పమన్నదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అఖిలపక్షం తర్వాత లగడపాటి ఏకాభిప్రాయం రాలేదు అంటున్నారు. గాదె వెంకటరెడ్డి కూడా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు. కనుక వీళ్లు రాష్ట్రం ఎన్నటికీ విడిపోదని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే దీన్ని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు విభేదిస్తున్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలంటున్నారు. అంతేకాదు ఈ అంశం రాష్ట్ర పరిధిలో నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లిందని, కనుక తెలంగాణపై ఇక రాష్ట్రంలో ఏకాభిప్రాయం అనే మాటకు అర్థం లేదంటున్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందంటున్నారు. గాదె వెంకటరెడ్డి, లగడపాటి, కావూరి, రాయపాటి, టీజీ వెంకటేశ్ వీళ్లు రాష్ట్ర విభజనపై చెబుతున్న శాస్త్రీయ విధానం సంకీర్ణ ప్రభుత్వంలో సాధ్యంకాదు. అది వారికీ తెలుసు.  ఈ రాష్ట్రం రావణకాష్టంలా మూడేళ్లుగా మండుతున్నది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విషయంలో మొదటి దోషి కూడా కాంగ్రెస్ పార్టీనే. అందుకే అఖిలపక్ష భేటీలో పార్టీల అభిప్రాయాలు చెప్పాలని కోరినప్పుడు కాంగ్రెస్ పార్టీయే ముందుగా తన అభిప్రాయం చెప్పాలని మిగిలిన పక్షాలు డిమాండ్ చేశాయి. కానీ దీనిపై కాంగ్రెస్ నేతలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాల్లో దేన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందో కూడా చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉన్నది. తెలంగాణ ప్రాంతం వారు షిండే రెండు రాష్ట్రాలు అన్నాడని, లేదు ఆయన అలా అనలేదని, అది నిరూపిస్తే తాను రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని గాదె స్పష్టం చేశారు. కనుక రాష్ట్రంలో నెలకొన్న అస్థిర పరిస్థితిని చక్కదిద్దాలి. ఇంకా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలిసిపోక తప్పదు.

ఈ రెండు పార్టీల వైఖరి ఇలా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీది సెంటిమెంట్ పేరుతో ఓట్లను సొమ్ము చేసుకునే కప్పదాటు వైఖరే. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికికే ఉన్నదని, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రమే తండ్రివలె ఈ సమస్యను పరిష్కరించాలన్నది ఆ పార్టీ. అందుకే షిండే సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నాం అంటే తెలంగాణ సానుకూలమేనా అంటే మౌనమే మైసూరరెడ్డి వంతు అయ్యింది. ఇంతకు మించి ఏమీ చెప్పలేమని వారు అన్నట్టు సమాచారం. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకమని స్పష్టమైంది. అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలనే వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరొకరి ఎంతో కొంత నిరాశ ఉండడం సహజమే. అందరిని సంతృప్తి పరచాలనే ఆ పార్టీ విధానమే తప్పు. పీడితులన పక్షాన నిలబడాల్సిన ఆ పార్టీ గోడ మీద పిల్లిలా నిలిచింది. తెలంగాణకు అనుకూలమా అని షిండే అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పలేదంటే ఆ పార్టీ తెలంగాణను వ్యతిరేకించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే రాజన్న రాజ్యం తెస్తామంటున్న ఆ పార్టీ  రాష్ట్ర విభజనపై రాజశేఖర్‌రెడ్డినే అనుసరిస్తుంది. ఆయన తెలంగాణను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇచ్చే శక్తి, తెచ్చే శక్తి లేదన్న ఆ పార్టీ కనీసం ఇవ్వండి అని చెప్పే సాహసం కూడా చెయ్యలేదు. పరకాల ఎన్నికల సమయంలో, షర్మిల పాదయాత్ర సందర్భంలో, జగన్ ఆర్మూర్ రైతుదీక్ష సందర్భంలో, విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంలో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్, టీడీపీల కంటే స్పష్టంగానే తెలంగాణ వ్యతిరేకతను చాటింది.
అఖిలపక్షంలో మిగిలిన పార్టీలో బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ జై తెలంగాణ అన్నాయి. సీపీఎం, ఎంఐఎం సమైక్యవాదాన్ని వినిపించాయి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించిన వారి ఆశలు అడియాసలే అయ్యాయి. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాజీనామాల డ్రామాలు ఆడిన కాంగ్రెస్, టీడీపీ లుఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అప్పుడు పీఆర్‌పీ స్థానంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన వైఎస్‌ఆర్‌సీపీ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి మాట మార్చి సమైక్యవాదమన్నారు. ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ స్టాండ్ ఏమిటో తెలిసిపోయింది కనుక కాంగ్రెస్, టీడీపీల సీమాంధ్ర నేతల అసమ్మతి సెగలో తాను భాగస్వామ్యం అవుతుందా లేదా అన్నది చూడాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. కేంద్ర హోంమంత్రిఇదే చివరి అఖిలపక్షం అన్నారు. కనుక తెలంగాణ ప్రజల సహనం నశించకముందే వారి ఆకాంక్షను నెరవేరిస్తే బాగుంటుంది.

Labels: , , , ,

Sunday 23 December 2012

మంచి నిర్ణయం


ఎట్టకేలకు సచిన్ వన్డే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి ఒక  మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ లోకి సచిన్ అడుగుపెట్టినప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. ఎంతో మంది యువ ఆటగాళ్ళు దేశవాళి క్రికెట్ లో రాణిస్తూ...భారత జట్టు తరఫున ఆడడానికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ అత్యున్నత రికార్డ్స్ నెలకొల్పాడు. ఇందులో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాని జూనియర్స్ అవకాశాలు రావాలంటే సీనియర్స్ సగౌరవంగా తప్పుకోవలసిందే. ఎందుకంటే గతంలో ఒక సెంచరీ కొడితే ఓ ఆర్నెల్ల వరకు మన ఆటగాళ్ళకు జట్టులో డోకా ఉండేది కాదు. ఇప్పుడు అలంటి స్థితి లేకున్నా..కొంత మంది సీనియర్లను పక్కన పెట్టలేని అగత్యం మాత్రం ఉన్నది. వారిని తప్పిస్తే ఒకవాదన లేకపోతే మరో వాదన. దీనితోనే సమయము గడుస్తున్నది, సీరీస్ లు అయిపోతున్నాయి. ఫలితంగా వరల్డ్ కప్ చాంపియన్స్ కాస్త ఈ మ్యాచ్ అయినా  గెలిస్తే చాలు అన్న గడ్డు కలం మాత్రం మన కళ్ళముందు కనపడుతున్నది. చివరికి ఇది ఎలా తయారయ్యింది అంటే  కొత్త నీరు లేని సముద్రంలా మారింది. నీళ్ళు ఉన్నా నిరుపయోగమే. అందుకే అంతర్జాతీయంగా మన క్రికెట్ మళ్ళీ పుంజుకోవాలంటే పోటీ తప్పనిసరి. ఇది సఫలం కావాలంటే గత కీర్తిని పట్టుకుని వేలాడితే..వర్తమానం స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ విషాదాలు  మనల్ని వెంటాడుతాయి. అందుకే గతం మంచి జ్ఞాపకంగా ఉండాలంటే వర్తమాన భారత క్రికెట్లో యువతకు జట్టులో చోటు మాత్రమే దక్కితే సరిపోదు. వాళ్ళకు ఆడే అవకాశము కల్పించాలి.   

Labels: ,

Wednesday 19 December 2012

సవాళ్లు కాదు, స్పష్టత కావాలె



తాను సమైక్యవాదినని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణకోసం టెన్‌జన్‌పథ్ వద్ద చావడానికి నేను సిద్ధం. కేసీఆర్ అందుకు సిద్ధమా అని సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉన్నది. కొండా దంపతుల ఆరాటం అంతా జగన్‌కు అధికార పీఠంపై కూర్చోబెడదామనే తప్ప తెలంగాణ కోసం కాదు. పరకాల ఉప ఎన్నిక కూడా ఆమె వైఎస్ జగన్ కోసం రాజీనామా చేస్తేనే వచ్చింది. అందుకే తాను తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పినా ప్రజలు  విశ్వసించలేదు. దీంతో పరకాల ఫలితం ప్రతికూలంగా వచ్చింది. దీన్ని ఇప్పటికీ కొండా దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. షర్మిల పాదయాత్ర ప్రజల కష్టాలు తెలుసుకోవడానికని, టీఆర్‌ఎస్ పల్లెబాట ఓట్ల కోసమట. రాష్ట్రంలో ఓట్ల రాజకీయం ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. అఖిలపక్షభేటీలో తెలంగాణపై  వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని అడిగితే అది నేరమట. మమ్మల్ని ఎందుకు అడుగుతారు అంటారు.  తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుడూ, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీని, ఉద్యమనాయకత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని తాను తెలంగాణ బిడ్డనే అని చెప్పుకుంటున్నారు కొండాసురేఖ. వైఎస్‌ఆర్‌సీపీ ని తెలంగాణపై ఎందుకు స్పష్టత అడగవలసి వస్తున్నది. పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్నది నిజం కాదా? ద దీనిపై ఆయన గానీ ఆయన పార్టీ వాళ్లు ఇంతవరకు వివరణ ఇచ్చాడా. కేవలం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామంటే సరిపోతుందా? వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదంటే సమైక్యఉద్యమంలో జగన్‌పై నమోదైన కేసును ఉపసంహరించకున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన జీవో అబద్ధమా? అఖిలపక్షభేటీ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల్లో గుబులు మొదలవుతున్నది. ఎందుకంటే తెలంగాణపై ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నది ఈ మూడు పార్టీలే. జేఏసీ ఇప్పటికే ఈ మూడు పార్టీలకు డెడ్‌లైన్ విధించింది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో అసహనంతో తెలంగాణ ప్రాంతంలోని కొండాసురేఖ, జగ్గారెడ్డి, ఎర్రబెల్లి, మోత్కుపల్లి వంటి నేతలను ఆయా పార్టీలు తెలంగాణ ఉద్యమనాయకత్వాన్ని విమర్శించడానికి ఉసిగొల్పుతున్నాయి. అయినా తెలంగాణ కోసం ఆత్మహత్యలు వద్దు. పోరాడి సాధించుకోవాలని పార్టీలకు అతీతంగా అంతా కోరుతున్నారు. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ వంటి వాళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ వస్తుంది. తెలంగాణను తాను చావడానికి సిద్ధం. కేసీఆర్ సిద్ధమా అని రెచ్చగొట్టడం ఎందుకు? కొండా సురేఖ ముందు అఖిలపక్ష భేటీలో వైఎస్‌ఆర్‌సీపీ చేత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పిస్తే చాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొండాసరేఖ భావోద్వేగాలు అన్నీ జగన్ కోసమే తప్ప, తెలంగాణ కోసం కాదనేది వాస్తవం. అఖిలపక్ష భేటీలో ఏమీ తేలదని పైకి అంతా గుంభనంగా ఉన్నా లోలోప మాత్రం తెలంగాణపై స్పష్టత లేని పార్టీలో ఆందోళన మొదలైంది. అందుకే సీమాంధ్రలో కావూరి, లగడపాటి లాంటి వాళ్లు, ఇక్కడ కొండాసురేఖ, జగ్గారెడ్డి, ఎర్రబెల్లి లాంటి వాళ్లు తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎందుకంటే చంద్రబాబును విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదని ఎర్రబెల్లి అంటున్నాడు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాసింది చంద్రబాబే కదా. వాళ్ల పార్టీ పరంగా తెలంగాణపై స్పష్టత ఉంటే బాబే అఖిలపక్షానికి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలి. అలాగే కేంద్రం తెలంగాణ ఇస్తే తాము అడ్డుకోబోమని వైఎస్‌ఆర్‌సీపీ ప్రకటించింది. అదే విషయాన్ని అఖిలపక్షభేటీలో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున విజయమ్మ చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నది ఇదే. దీనికే సవాళ్లుపతిసవాళ్లు ఎందుకు? అందుకే ఈ మూడు పార్టీలు ముందున్న ముప్పును అధిగమించాలంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలి. అంతేకానీ రెచ్చగొట్టే చర్యలతో అసలు ఇష్యూను పక్కదారి పట్టించాలని చూస్తే పాట్లు పడేది ఈ మూడు పార్టీలే అని విషయాన్ని గమనించాలి.

Labels: , , ,

Wednesday 12 December 2012

ఇచ్చేది, తెచ్చేది, చచ్చేది

నిన్న పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాతృరాష్ట్రంలో ఏకాభిప్రాయం వస్తేనే రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమవుతుందని ప్రకటించారు. దానికి కొనసాగింపుగానే తెలంగాణపై అఖిలపక్షభేటీ పార్టీకి ఇద్దరు చొప్పున రావాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్రంలోని తొమ్మిది పార్టీలకు వర్తమానం అందింది. 2001 నుంచి తెలంగాణ సమస్య కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉన్నది. 2004 నుంచి నేటి వరకు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమూ ఆ పార్టీకే ఉన్నది. కానీ తెలంగాణపై తేల్చకుండా ఏకాభిప్రాయం అనే పాటను మార్చిమార్చి పాడుతున్నది. అఖిలపక్షభేటీ తేదీ ఖరారైనప్పటి నుంచి అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఒక్కరినే పంపాలని తెలంగాణ ప్రాంత నేతలంటే, ఇద్దరని పంపాలని సీమాంధ్ర నేతలు అన్నారు. తెలుగు మహాసభల పేరుతో అఖిలపక్షభేటీని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి విన్నపాన్ని షిండే తిరస్కరించినా, ఈ అంశాన్ని అంత త్వరగా తేల్చబోమనే ‘‘తీపికబురు’’ మాత్రం ఆయనకు అందించారు. అందుకే కాబోలు ఆయన ఈ అభిలపక్షభేటీ గతంలో కంటే భిన్నంగా ఉండదని ముందే చెప్పారు. తెలంగాణపై తేలాలంటే ఏకాభిప్రాయమైనా మరే అభిప్రాయమైనా రావాలంటే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల్లోనే రావాలి. ఎందుకంటే తెలంగాణపై రెండు వాదనలు వినిపిస్తున్నది ఇవే పార్టీలు. ఈ మూడు పార్టీలు తమ ముసుగును తీసేసి ఒకే అభిప్రాయం చెబితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల అవస్థలు తీరుతాయి. అలాగే అఖిలపక్షభేటీ ఘనత ఎవరిదనే విషయంపై కూడా ఇంతవరకు చర్చలు జరిగాయి.  ఇది తమ అధినేత రాసిన లేఖ ఫలితమే అని తెలుగు తమ్ముళ్లు తెగ సంబరపడిపోయారు. చంద్రబాబు పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినాటి నుంచి ఆయన కూడా కాంగ్రెస్‌లా ఏకాభిప్రాయం అనే మాట కాకుండా వ్యతిరేకం కాదనే పదాన్నే తన ఆయుధంగా ఎంచుకున్నారు. హస్తినలో జరిగే అఖిలపక్షభేటీలోనే తమ పార్టీ అభిప్రాయం స్పష్టంగా చెబుతామంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కొణాతాల రామకృష్ణ ఈ మధ్యే మీడియా ముందు అఖిలపక్షభేటీకి తమకు ఆహ్వానం అందింతే కాంగ్రెస్, టీడీపీల వలె కాకుండా ఒకే అభిప్రాయం చెబుతామన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు చెప్పినట్టు ఒకే అభిప్రాయం చెబితే తెలంగాణపై కాంగ్రెస్ కాలయాపనకు కాలం తీరుతుంది. లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర హోంమంత్రి షిండేలు చెప్పినట్టు తెలంగాణ చర్చలు కొనసా...........గుతూనే ఉంటాయి. అందుకే ఆరుదశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ ఆటలో భాగస్వాములు కాకుండా ఉంటే మంచిది. అప్పుడు  తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది, లేకపోతే చచ్చేది మేమే అని చెబుతున్నవాళ్లుకు తెచ్చే అవకాశం, ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమవుతున్నది. కనీసం వాళ్లకు చచ్చే అవకాశం అన్నా టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు ఇస్తే మంచిది.

Labels: , , , ,

Tuesday 11 December 2012

కావూరి కట్టుకథలు

అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అదే ప్రాతిపదికన దేశంలోని చాలా రాష్ట్రాలను ముక్కలు చేయాల్సి వస్తుంది. అసలు కేంద్రం ఏ ప్రాతిపదికన తెలంగాణ ఇవ్వాలని చూస్తోందో అర్థం కావట్లేదని, అసలీ విషయాన్ని మూడేళ్లుగా ఎందుకు నానబెడుతున్నది? కేంద్రంలోని అధికారపక్ష నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఈ వివాదానికి ఎప్పుడో ఫుల్‌స్టాప్ పెట్టేవాళ్లు. తెలంగాణ నాయకులకు రాష్ట్రాభివృద్ధి ము ఖ్యం కాదు. సామాజిక న్యాయం అంతకంటే కాదు. విద్యార్థుల భవిష్యత్తు కూడా వారికి అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్రం వస్తే హైదరాబాద్‌ను దోచుకుని పందుల్లా మెక్కవచ్చనే ఆశతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. స్వార్థం, అవినీతి పెరిగిపోయిన రాజకీయ నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని ముక్కలు చేయగలిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇవన్నీ శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ఏలూరు ఎంపీ సాంబశివరావు ఆవేదనతో... సారీ ఆవేశంగా మాట్లాడారు.

నిజంగా కావూరికి రాష్ట్రాభివృద్ధిపై ఎంత ప్రేమ ఉందో! దాని కోసం ఆయన ఎంతగా తపిస్తున్నారో? హైదరాబాద్‌లో టోల్‌గేట్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ దాన్ని కూడా అభివృద్ధిలోనే భాగంగా చూస్తున్నారు ఈ ఉదారవాది. ఇక కావూరి వారు సామాజిక న్యాయం గురించి కూడా తెగ లెక్చర్లు దంచేశారు. దేశంలో ఎఫ్‌డీఐ వల్ల చిల్లర వర్తలకులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కావూరి మంత్రి పదవి రాలేదని ఎంపీ పదవికి రాజీనామా చేసి,  దాన్ని జనవరి వరకు ఆమోదించవద్దని స్పీకర్‌ను వేడుకొని ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేశారు. అదీ సామాజిక న్యాయం అంటే? అలాగే తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఎందుకు నానబెడుతున్నదని కావూరి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుతున్నది కూడా అదేగదా. కేంద్రం ఈ సమస్యను నానబెట్టడానికి కారకుల్లో మీరు కూడా ఒకరు కాదా? ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలని చూస్తున్నదని కావూరికి అనడం గురువింద సామెతను గుర్తుచేస్తున్నది. ఈ ప్రశ్న 2001లో తమ నాయకుడు వైఎస్ 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కావాలని సోనియాగాంధీకి లేఖ రాయించినప్పుడు అడగాల్సింది. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు అడగాల్సింది. మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేవనెత్తాల్సింది. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టినప్పుడు ప్రశ్నించాల్సింది. రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టినప్పుడు నిలదీయాల్సింది. అంతేందుకు తెలంగాణ గురించి 2009 డిసెంబర్ 10న ఉభయ సభల్లో ప్రణబ్, చిదంబరం హామీ ఇచ్చినప్పుడు ప్రస్తావించాల్సింది. మరీముఖ్యంగా రాష్ట్రపరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు అడ్డుకోవాల్సింది. ఇన్ని జరగుతున్నా ఇంత కాలం కళ్లున్న కబోదిలా నటించిన, నటిస్తున్న కావూరి వారు ఇప్పుడు స్వార్థం, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడిన వారు పదవులు రాగానే మిన్నకుండి పోయారన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని వదులుకున్న కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కావూరికి లేదు. ఎందుకంటే ఇదే కావూరి గారు కేంద్రంలో మంత్రిపదవి రాలేదని అలక వహించి ఎంపీ పదవి రాజీనామా చేసి, దాని ఇంకా కట్టుబడి ఉన్నానంటూనే... దాన్ని ఆమోదించుకోకుండా, అధికార పార్టీకి అండగా ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేసి వచ్చారు. ఇలాంటి వాళ్లు విద్యార్థులకు నీతులు చెప్పి తమకు మాత్రం అవి వర్తించవు అన్నట్టు వ్యవహరించడమే నేటి విషాదం.

Labels: , ,

Monday 10 December 2012

నల్లారి వారి నిజస్వరూపం


ప్రపంచ తెలుగు మహాసభలను సాకుగా అఖిలపక్ష భేటీని వాయిదా వేయించడానికి ముఖ్యమంత్రి శతవిధాలా ప్రయత్నించారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు, రాయపాటి వంటి నేతలు వంతపాడారు. ఒక ప్రాంత ప్రజల తమ ఆకాంక్ష కోసం ఆరు దశాబ్దాలుగా ఉద్యమిస్తన్నారు. ముఖ్యంగా మూడేళ్లుగా ఆ దశాబ్దా కల సాకారం కోసం నినదిస్తున్నారు. అయితే ఇంత కాలం తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము కూడా కోరుతున్నట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు మహాసభలు జరుగుతున్నందున రాష్ట్ర విభజనపై చర్చలు బాగుండవంటున్నారు. అలాగే ఈ అఖిలపక్ష భేటీ గతంలో కంటే భిన్నంగా ఏమీ ఉండదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మరికొందరు సీమాంధ్ర నేతలు హస్తిన ఆంతర్యాన్ని ముందే చెబుతున్నారు. అలాగే ఏకాభిప్రాయం రానిదే తెలంగాణ సాధ్యం కాదన్న లగడపాటి విజయవాడలో తెలంగాణ ఏర్పడితే మనల్ని బతకనీయరు అని రెచ్చగొడతారు. ముఖ్యమంత్రి తాను మూడో తరగతి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూస్తున్నాను అంటారు. ప్రజలు ఏమైపోయినా పరవాలేదు కానీ తమ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు వీళ్లు వ్యవహరిస్తున్నారు. నేను హైదరాబాదీనే అని చెప్పుకునే కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీమాంధ్ర ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎటూ తేల్చకుండా మూడేళ్లుగా కమిటీలని, ఎన్నికలని, పండుగలని, సోనియా అనారోగ్యం అని, ఆజాద్, వాయలార్ రవిలు విదేశీ పర్యటనలో ఉన్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని చాలా కథలపేరుతో చేసిన కాలయాపన ముగిసింది. ఈ మూడేళ్లలో రాష్ట్రం అనిశ్చిత పరిస్థితిని తొలగించకుండా కాంగ్రెస్ పెద్దలు ఆడిన నాటకానికి ఈ రాష్ట్ర ప్రజలు బలికావాల్సి వస్తున్నది. ఇది చాలదన్నట్టు కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణపై చర్చలు కొనసాగుతూ.....................
....నే ఉంటాయని వెటకారంగా మాట్లాడుతున్నారు. అయినా సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణపై ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం పొరపాటే. అందుకే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, కిరణ్ పాలన అద్భుతం అని, మాకు అభివృద్ధే కావాలి తెలంగాణ అవసరం లేదనే వాళ్లు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలవైపా? పార్టీ వైపా? అని.

Labels: , ,

Saturday 8 December 2012

ఆందోళనలో ఆంధ్రా ఆక్టోపస్


తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి లగడపాటి రాజగోపాల్ అన్ని పాత్రలు వేశాడు. ఇప్పుడు అసిపోయి అఖిలపక్ష భేటీలో నేతలు సమైక్యవాదాన్ని వినిపించేలా ఒత్తిడి తేవాలని విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జిల్లాలకు వచ్చే నేతలను నిలదీయాలని వారికి సూచించాడు. ఇదే లగడపాటి రాజగోపాల్ అఖిలపక్షభేటీలో ఏమీ తేలదని ఇంతకు ముందే ప్రకటించాడు. మరి రెండురోజుల్లోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో? అఖిలపక్ష భేటీ గురించి తెగ ఆందోళనపడుతున్నాడు. అంతేకాదు అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ పార్టీ రెండో ఎస్సార్సీ తమ పార్టీ విధానం అని చెబుతుందని కూడా చెప్పాడు. అఖిలపక్ష భేటీకి ముందే భవిష్యవాణిని వినిపిస్తున్న ఈ ఆంధ్ర ఆక్టోపస్ విజయవాడ వేదికగా విద్యార్థులను ఈ విన్నపాలు ఎందుకు కోరుతున్నాడు?అలాగే తెలంగాణలో అరవైశాతం మంది సమైక్యవాదాన్ని కోరుతున్నారని అబద్ధాలు చెబుతున్నాడు. తెలంగాణవాదుల్లో మూడేళ్ల కిందట ఉన్న భావోద్వేగాలు ఇప్పుడు లేవంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని విషయాలు అనర్గళంగా మీడియా ముందు చెబుతున్న లగడపాటికి అఖిలపక్షం గురించి అంతగా ఎందుకు కలవరపడుతున్నాడో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి.ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు. ఎందుకంటే మూడేళ్ల కిందటే ప్రజలు మానసికంగా విడిపోయారు. ఇక మిగిలింది భౌగోళిక విభజనే.

Labels: , ,

Friday 7 December 2012

వ్యక్తి అవగాహన కోసం అఖిలపక్షం వేదికా?



తెలంగాణపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటున్న పార్టీలు... ఇప్పుడు ఏ అభిప్రాయంతో ఉన్నదీ తెలుసుకుంటామన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సమెక్యాంధ్రకు అనుకూలంగా కొన్ని పార్టీలు, వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కొన్ని పార్టీలు రెండు వాదనలను వినిపిస్తున్నాయి. పైగా... కేంద్ర హోమంత్రిగా సుశీల్ కుమార్ షిండే కొత్తగా బాధ్యతలు చేపట్టారు. అందువల్ల, అన్ని పార్టీల తాజా అభిప్రాయాలను మరోసారి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నాం’’
అఖిలపక్షంపై ఆజాద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇవి.

ప్రాంతాలకు అతీతంగా ప్రజలు రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి తొలిగిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష భేటీతోనైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై పరిష్కారం చూపకపోతుందా అనే ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రసార మాధ్యమాలు అప్పుడే ఏదో జరిగిపోయినట్టు కంగారు పడి ప్రజలను కన్‌ఫ్యూజన్ చేసే పనిలో మునిగిపోయాయి. అందుకే ఒక చానల్ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసిందా అని చర్చ పెట్టింది. మరో చానల్ తేలుస్తారా? నానుస్తారా అని ఓ స్టోరీ చేసింది. వీరి ఆంతర్యం సమస్య పరిష్కారం కంటే అపరిష్కృతంగానే ఉంటేనే బాగుండు అన్నట్టు ఉంటుంది.అందుకే తెలంగాణను వ్యతిరేకిస్తున్న శైలజానాథ్, లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్ వంటి వాళ్లను తెరమీదికి తెస్తారు. మరో నేత గాదె వెంకటరెడ్డి అఖిలపక్ష భేటీకి పార్టీకి ఇద్దరు చొప్పున పిలవాలి అంటారు. లగడపాటి చెప్పింది కూడా అదే. అందుకే అఖిలపక్ష భేటీకి ముందే వీళ్లు భిన్నవాదనలు చేస్తున్నారు. ఆజాద్ చెప్పినట్టు పార్టీలు ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటున్నాయి అంటున్నారు. నిజమే కానీ ఏ పార్టీలు? కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలే తెలంగాణపై గోడమీది పిల్లి వాటంలా వ్యవహరిస్తున్నాయి. మిగిలి పార్టీలన్నీ స్పష్టమైన విధానంతోనే ఉన్నాయి. కనుక అభిప్రాయాలు మార్చుకుంటున్న పార్టీలో కాంగ్రెస్ కూడా ఉందనే విషయాన్ని ఆజాద్ గుర్తించుకోవాలి. ఎఫ్‌డీఐ, అణుఒప్పందంల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తర్వాత ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్నది. మరి తెలంగాణ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదు? చిన్న రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అప్పుడప్పుడు ప్రెస్‌మీట్‌లలో చిలుక పలుకులు పలుకుతారు. అందుకే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే చెప్పకున్నా అఖిలపక్షభేటీలో కాంగ్రెస్ అభిప్రాయం కూడా చెబుతామంటే, రాష్ట్ర విభజనపై భిన్నాభిప్రాయాలు ఉన్న పార్టీలు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా షిండే గారి అవగాహన కోసం అఖిలపక్షం అంటే దానికి అందరిని పిలవడం ఎందుకు? ఇదే ఆజాద్ కూడా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే అనేకసార్లు సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక నివేదికను వారి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించారు. కనుక ఇప్పుడు పార్టీ పరంగా ఇద్దరు నేతలను పిలవడం కంటే మీ చర్చల సారాంశం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నదో ప్రజలకు తెలియజేస్తే బాగుటుంది. ఇప్పటికే యాభై కోట్లు ఖర్చుపెట్టి శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్టు కూడా తమ దగ్గర ఉన్నది. 2009 డిసెంబర్ 7న రోశయ్య గారి నేతృత్వంలో అఖిలపక్ష భేటీకి సంబంధించిన రిపోర్టు తమ వద్దే ఉన్నది. (దీని ఆధారంగానే కేంద్రం  2009 డిసెంబర్ 9 ప్రకటన చేసింది) ఆ తర్వాత కూడా రెండుసార్లు అఖిలపక్ష భేటీ జరిగింది. ఆ చర్చల సారాంశం కూడా మీకు తెలిసిందే. ఇన్ని సమావేశాలు, ఇన్ని కమిటీలు, ఇన్ని అభిప్రాయాలు ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ దగ్గరే పెట్టుకుని మళ్లీ అఖిలపక్ష భేటీ అనడం, దానికి ముందే తమ వైఖరి చెప్పకుండా ఒక వ్యక్తి అవగాహన కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆజాద్ చెప్పడం గర్హనీయం.

ఇక అఖిలపక్ష భేటీ తమ ఘనతే అని జబ్బలు చరుచుకుంటున్న ఈ ప్రాంత ఎంపీలు అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల అసలు రంగు బయటపడుతుంది అంటున్నారు. కానీ భేటీకి ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు బయటపడుతున్నాయి. కర్రవిరగకుండా పాముచావకుండా సమస్యను పరిష్కారించాలనుకే హస్తిన పెద్దల ఆటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దలకు ప్రజా ఉద్యమాలపై, సమస్య పరిష్కారంపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో కనబడుతున్నది. దీనికి తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న పార్టీలు కూడా మినహాయింపు కాదు. ఇంతకూ అఖిలపక్షభేటీకి ఇద్దర్ని పిలుస్తారా? లేక ఒక్కర్ని పిలుస్తారా అనేది మరో వారం రోజుల్లో తేలుతుంది. కానీ ఒక్కర్నే పంపాలని తెలంగాణవాదులంటుంటే, ఇద్దర్ని పిలవాలని సీమాంధ్రు నేతలు అంటున్నారు. ఇద్దర్ని పిలిస్తే జరిగేది ఏమిటో లగడపాటి కేంద్రం అఖిలపక్షం అనగానే మీడియా ముందుకు వచ్చే జోస్యం చెప్పారు. దానికి ఏకాభిప్రాయం అని ఒక ట్యాగ్ కూడా తగిలేశారు. నిజంగా ఏకాభిప్రాయం కావాలంటే తెలంగాణపై ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్న పార్టీలను పిలిచి మాట్లాడండి. లేదా పార్టీల వారీగా దీనిపై చర్చించుకోండి. అప్పటికి ఏకాభిప్రాయం సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని లిఖిత పూర్వకంగా చెప్పండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వచ్చే వరకు మాట్లాడకుంటే మంచిది. కానీ మూడేళ్లుగా తెలంగాణ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న మూడు పార్టీల వల్లే (మూడు పార్టీల్లో అప్పుడు వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ఇప్పుడు పరోక్షంగా వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి అలాగే ఉన్నది)ఈ సమస్య సాచివేతకు, రాష్ట్రంలో సంక్షోభానికి కారణమవుతున్నాయి. అందుకే అఖిలపక్ష భేటీకి ముందే ఈ మూడు పార్టీలు తమ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది మేమే అంటే టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. దీంతో అధికార పార్టీని నిలదీసే అవకాశం లభిస్తుంది. లేకపోతే కేంద్రం ఆడుతున్న ఈ నాటకంలో పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రసారమాధ్యమాలు పాత్రధారులైతే... ప్రజలు ప్రేక్షులుగా మిగిలిపోవాల్సి వస్తుంది.

Labels: , , , ,

Thursday 6 December 2012

అఖిలపక్షంతోనే ఆకాంక్ష తీరదు

తెలంగాణపై ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చింది. డిసెంబర్ 2న అఖిలపక్షభేటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇక తేల్చుకోవాల్సింది పార్టీలే. ఇంతకాలం తెలంగాణ ద్రోహులు మీరంటే మీరని ఒకరినొకరు నిందించుకున్నారు. రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం ఏమిటంటే భిన్నాభిప్రాయాలు చెప్పారు.  పార్టీకి ఒక్కరినే పిలుస్తామని కేంద్రహోం మంత్రి చెప్పారు అనితెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. అదే గనుక నిజమైతే రెండు కండ్లు, ఇచ్చే శక్తి తెచ్చే శక్తి లాంటి మాటలకు అర్థం ఉండదు. అలాగే కాంగ్రెస్ చెబుతున్న ఏకాభిప్రాయం మాటకు కాలం చెల్లింది. ఎందుకంటే తెలంగాణకు అనుకూలంగా కేంద్రంలో మెజారిటీ పార్టీల మద్దతు ఉన్నది. ఏకాభిప్రాయానికి రావాల్సింది రాష్ట్ర పార్టీలేనని గతంతో చిదంబరం చెప్పిన విషయాన్ని గమనించాలి.

అలాగే ఇంత కాలం అఖిలపక్షం అన్న పార్టీలు ఇప్పుడు దీన్ని మరో నాటకంగా చిత్రించడం విడ్డూరంగా ఉన్నది. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ వంతుగా ప్రయత్నం చేసి, అఖిలపక్షానికి ఒప్పించారు. ఎఫ్‌డీఐల ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువగా ఉండి అందుకు తలొగ్గిందా అనేది అప్రస్తుతం. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాలయాపనపై ఎంపీలు కన్నెర్ర చేశారనే చెప్పవచ్చు. అఖిలపక్ష భేటీ తర్వాత ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే పార్టీల అసలు రంగు మాత్రం బయట పడడం ఖాయం. అఖిలపక్ష భేటీని రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా సమస్య పరిష్కారానికి పోరాడాలి. ముఖ్యంగా చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని పదే పదే చెబుతున్నారు. అదే విషయాన్ని అఖిలపక్ష భేటీలో స్పష్టంగా చెప్పాలి. ఆ పార్టీ నేతలు కూడా చంద్రబాబే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. బాబు కూడా అఖిలపక్ష భేటీలో తమ అభిప్రాయం చెబుతామని అన్నారు కనుక దీన్ని స్వాగతించాలి. చంద్రబాబు చెబుతున్నట్టు తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ టీడీపీ దెబ్బతీయాలని చూస్తుంది అనుకుంటే అఖిలపక్ష భేటీలో తెలంగాణపై స్పష్టంగా మీ అభిప్రాయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గనుక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశం ఉంటుంది.  అలాగే వైఎస్‌ఆర్‌సీపీ కూడా కేంద్రం తెలంగాణ ఇస్తానంటే తాము అడ్డుకోబోమని ప్రకటించింది. దానికి ఆ పార్టీ కట్టుబడి ఉండాలి. అన్నికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలి. ఎందుకంటే అఖిలపక్ష భేటీ ఖరారైందని మీడియాలో వార్తలు రాగానే లగడపాటి రాష్ట్రం విడిపోదు అని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అఖిలపక్షభేటీ తెలంగాణ ప్రాంత విజ్ఞప్తి మేరకే ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పడం చూస్తుంటే ఆయన ఏ హోదాలో దీనిపై స్పందిస్తున్నారో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చెప్పాలి. ఎందుకంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి మొదలు పీసీసీ అధ్యక్షులు చెబుతున్నారు. కనుక మూడేళ్లుగా రాష్ట్రంలోని ఒక ప్రధాన సమస్యపై కేంద్రం ఒక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఈ తరుణంలో లగడపాటి రాజగోపాల్ వంటి నేతల వ్యాఖ్యలు ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇలాంటి వారి వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్ఠానంపై ఉన్నది.

ఇక సీమాంధ్ర మీడియా కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న, సమర్థిస్తున్న వాళ్లను తెరమీదికి తెచ్చి వాళ్ల వ్యాఖ్యలను బ్రేకింగ్ న్యూస్ చేసి ప్రజలను గందరగోళపరచవద్దు. ప్రజలను సంయమనం కోల్పోవద్దు అని చెప్పే మీడియా ముందు ఆ పని తాను చేయాలి. సమస్య సానుకూలంగా పరిష్కారం కావాలంటే అందులో మీడియా పాత్ర ఎంతో ఉంటుంది. అందుకే మీడియా కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరుల ద్వారా చెప్పించి ప్రజలను రెచ్చగొట్టకుండా వ్యవహరిస్తే అదే పదివేలు. ఎందుకంటే చాలాకాలంగా ఈ సమస్య పరిష్కారం కావాలని రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇందులో రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్నవారూ లేకపోలేదు. ఏదైనా ఒక అంశంపై ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం కాదు. బాధితుల పక్షాన నిలవాల్సిన బాధ్యత పార్టీలపై ఉన్నది. తెలంగాణ అంశం ఈనాటిది కాదు ఆరు దశాబ్దాలుగా ఉన్నదే. అభివృద్ధి మండళ్లు, ప్యాకేజీలు ఈ ప్రాంత ప్రజలకు ఆమోదయోగ్యం కావు. గతంలో ఈ ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. ఇంకా ఈ ప్రాంతాన్ని ప్రయోగశాలగా ఉపయోగించుకోకుండా ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉన్నది. ఎందుకంటే ఇచ్చేది తెచ్చేది మేమే అని ఇంత కాలం ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ వారే. అయితే అఖిలపక్ష భేటీకి సంబంధించిన అధికార తేదీ ఖరారైంది కానీ విధివిధానాలు ఎలా ఉంటాయో వెల్లడికావాల్సి ఉన్నది. అంతవరకు ముఖ్యంగా నేతలు ప్రగల్భాలు పలకడం మానుకోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ ప్రయత్నం ఎవరిదైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏకతాటిపై నడవాలి. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండేలా ఒత్తిడి తేవాలి. ఇందుకు పార్టీల జెండాలు పక్కన పెట్టి తెలంగాణ అజెండాగా పనిచేస్తేనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇంతవరకు వేసిన కమిటీలకు కొనసాగింపుగా ఈ అఖిలపక్ష మిగులుతుంది తప్ప, ప్రయోజనం ఉండదు.

Labels: , , , ,

నరంలేని నాలుక



తెలంగాణ ప్రాంతంలోని కొందరు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న తరణం ఇది. ఇందుకోసం వాళ్లంతట వాళ్లే డిసెంబర్ 9 డెడ్‌లైన్ కూడా విధించుకున్నారు. వాళ్లలో ఎంత మంది ఆ మాటకు కట్టుబడి ఉంటారో తెలియదు. కానీ వాళ్ల చిత్తశుద్ధిని మాత్రం శంకిచాల్సిన పనిలేదు. అయితే వచ్చిన సమస్యల్లా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతోనే. వీళ్లు ఇంకా మాకు మా అధిష్ఠానంపై నమ్మకం ఉందంటారు. అధిష్ఠానానికి లేఖలు రాస్తారు. అధిష్ఠానంపై ఒత్తిడి తేవాడానికి ఢిల్లీ యాత్రలు చేస్తారు. ఇదంతా ఈ ప్రాంత ప్రజల ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికేనని ఈ ఈ ప్రాంతంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా తడుముకోకుండా జవాబు ఇస్తాడు. ఇదీ ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల వైఖరి.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొంతమంది గతంలో రాజశేఖర్‌రెడ్డి అనుయాయులు పోషించిన పాత్రను ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కోసం చేస్తున్నారు. అందులో భాగంగానే జగ్గారెడ్డి వంటి నేతలు అసలు తెలంగాణే అవసరం లేదంటారు. తెలంగాణ కంటే తమకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ముఖ్యమంటారు. అసలు ఈ ప్రాజెక్టుకు జాతీయ సాధ్యమవుతుందా అనే ప్రశ్నార్థకమే. అంతేకాదు ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై భిన్నవాదనలు జరుగుతున్నాయి. ఇక జాతీయహోదా అనేది కూడా అసంభవమే. ఎందుకంటే ఒక రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టులకు జాతీయహోదా లభించకపోవచ్చు. నీటిపారుదల నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అలాగే  ఇప్పుడు జగ్గారెడ్డి చేస్తున్న వాదనకు మద్దతు ఎంతమంది ఇస్తున్నారో తెలియదు. కానీ జగ్గారెడ్డి ఎవరి మెప్పుకోసం తెలంగాణ వద్దంటున్నాడో వారే పోలవరం నిర్మించి తీరుతామంటున్నారు. లక్షలాది ఎకరాల భూములను, ఆదివాసులను ముంపుకు గురిచేసి తెలంగాణ ప్రాంతాన్ని నిలువునా ముంచే ప్రాజెక్టును మాత్రం జగ్గారెడ్డి వ్యతిరేకించడం లేదు. కానీ తెలంగాణ ఎందుకు వద్దో తాను ఢిల్లీకి వెళ్లి అధిష్ఠాన పెద్దలను కలిసి వివరిస్తాను అంటున్నారు. ఇక జగ్గారెడ్డి చేస్తున్న తెలంగాణ వ్యతిరేక వాదనలను ఆయన పార్టీకి చెందిన మంత్రులు తప్పుపడుతున్నారు. వాళ్లకు ఆయన సమాధానం చెప్పకుండా హస్తినకు వెళ్లి తన అంతరంగాన్ని వివరిస్తాను అనడం ఆయన అవివేకమే. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కోసం ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాదిమంది బలిదానాలు చేసుకున్నారు. సీమాంధ్ర పార్టీలకు ఈ ప్రాంతంలో మనుగడే లేకుండా చేయాలని ప్రజలంతా ఏకమై నినదిస్తుంటే, ఈ ప్రాంతంలోనే పుట్టి, ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి వలసవాదులకు కొమ్ముకాసే విధంగా జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారు.

గతంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాకు తెలంగాణ కంటే అభివృద్ధే ముఖ్యమని చెప్పిన నేతల రాజకీయ భవితవ్యం ఏమైందో అందరికీ ఎరుకే. సొంత ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను సీమాంధ్ర పాలకుల దగ్గర తాకట్టు పెట్టాలనుకునే వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అది చరిత్రలో రుజువైంది కూడా. ఒక పార్టీ, ఒక వ్యక్తి పట్ల ఉన్న వ్యతిరేకతతో జగ్గారెడ్డి వంటి నేతలు నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను అవమాన పరిచేవిధంగా మాట్లాడితే అది క్షమించరాని నేరమే అవుతుంది. ఆయన మొదట తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని మరిచిపోతున్నారు. రాజశేఖర్‌రెడ్డి ‘ఆపరేషన్ ఆకర్ష’కు ఆకర్షితులై ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు కిరణ్ కోసం తెలంగాణపై కిరికిరి చేయాలని చూస్తున్నారు. హస్తిన పెద్దల సాచివేతపై సమరం మోగిస్తున్న ఈ సమయంలో జగ్గారెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే దాని వెనుక ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. స్వలాభం కోసం జగ్గారెడ్డి వంటి వారు ఈ ప్రాంత మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. అంతేకాదు ఇలాంటి నేతలు రేపు పోటీ చేయబోయేది తెలంగాణ ప్రాంతంలో అనే విషయాన్ని మరిచిపోతున్నారు. అధికారంలో ఉన్నాం కదా అనే అహంభావం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే అది ఎంతో కాలం నిలవదు. ఇప్పుడు జగ్గారెడ్డి తెలంగాణ అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నా, లోలోపలే ఆయన మాటలను సమర్థిస్తున్న వారు కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు. అలాంటి వారు కూడా త్వరలో బయటపడతారు. అందుకే ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నది ఏమిటి? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ తెలంగాణవాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్యే ఉంటాయి అంటున్నారు. అప్పుడు గెలిచేది ప్రజల ఆకాంక్షనా, లేక సీమాంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతున్న వారి అహంకారామా అనేది. ఈ పరిణామలు కూడా తెలంగాణ ప్రజలకు ఒకింత మంచిదే. వచ్చే ఎన్నికల్లో మనం ఎవరితో యుద్ధం చేయాలో ప్రజలకు ఇప్పటికే స్పష్టమైంది. అందుకే కాళోజీ చెప్పినట్టు ప్రాంతం వాడు మోసం ప్రాంతంలోనే పాతరపెట్టాలి. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరదాకా తరిమికొట్టాలి అనేది ఆచరణలో చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

Labels: , ,

Tuesday 4 December 2012

ఆంధ్రా పార్టీలపై అలసత్వం వద్దు!


కేసీఆర్ హస్తిన చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎటూ తేల్చలేదు. ఢిల్లీలో ఒకవైపు ఆయనతో చర్చలు చేస్తూనే కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు పూటకోరకంగా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై మోసం చేయబోతున్నదనే అంచనాకు వచ్చారు కేసీఆర్. ఇక కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ ఢిల్లీ చర్చలపై ఇంటా బయటా విభిన్న వాదనలు ముందుకొచ్చాయి. దీంతో అయోమయంలో ఉన్న క్యాడర్‌కు హస్తిన చర్చల విషయాలను వెల్లడించేందుకు కరీంనగర్‌లో రెండు రోజుల పాటు ‘మేథోమధన’ సదస్సును ఏర్పాటు చేశారు. అందులో పార్టీలోని పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా కన్వీనర్‌లు మొదలు అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నారు.  తాను కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో చేసిన చర్చల సారాంశాన్ని ఆ సమావేశంలో వారితో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదనే అంచనాకు  వచ్చారు. ఇక ఆ పార్టీతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పార్టీలోని అందరి అభిప్రాయం కూడా అదే. ఆ తర్వాత మీడియా సమావేశంలోనూ కేసీఆర్ చర్చల సారాంశాన్ని వెల్లడించిన విషయం విదితమే.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని అవసరానికి వాడుకొని,  తర్వాత ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకే జేఏసీ కూడా కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా ఉద్యమకార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ కోసం ఎన్ని రూపాల్లోనూ ఉద్యమించినా కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయం, సంప్రదింపుల పేరుతో మూడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంపశయ్యపై ఉన్నాయి. కనుక ఎన్నికలు ఏ సమయంలోనైనా రావొచ్చుననేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలంటే ఉద్యమాల ద్వారానే అది సాధ్యం అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఉద్యమాలతో పాటు రాజకీయ ప్రక్రియ కూడా అవసరమే అన్నది కూడా మరికొందరి అభిప్రాయం. అందుకే కేసీఆర్ సొంత రాజకీయ అస్తిత్వం ద్వారా తెలంగాణను సాధించుకుందానే నిర్ణయానికి వచ్చారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు తెలంగాణలో సీమాంధ్ర పార్టీలకు చోటులేకుండా చేయాలని నొక్కిచెప్పారు. వంద అసెంబ్లీ, 16 పార్లమెంటు స్థానానాలు సాధిస్తే కేంద్రంలో ఎవరు ఉన్నా తెలంగాణను అడ్డుకోలేరని మేథోమధన సదస్సులో వెల్లడించారు. అట్లాగే జేఏసీతో టీఆర్‌ఎస్‌కు ఉన్న విభేదాల గురించి చెప్పారు. విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని వాటిపై చర్చించి అందరిని కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ బాధ్యత తానే తీసుకుంటానని కూడా చెప్పారు. అన్నట్టుగానే జేఏసీ నేతలతో సమావేశమై పాలమూరు, పరకాల ఉప ఎన్నికల తర్వాత జేఏసీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలపై అంతా కలిసి చర్చించారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ బలంగానే ఉన్నది. అయితే దక్షిణ తెలంగాణలో మాత్రం పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అందుకే దక్షిణ తెలంగాణలో పట్టుసాధించడానికి టీఆర్‌ఎస్  సూర్యాపేటలొ ‘సమరభేరి’ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ  కూడా మద్దతు ప్రకటించింది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఆ సభ దోహదపడింది. అంతా అనుకున్నట్టుగానే లక్షలాది మందితో ఆ సభ విజయవంతం అయ్యింది. అయితే ఆ సభ సక్సెస్ అయినా కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉన్నదని కొంతమంది అభిప్రాయం. నిజమే లక్షలాది మందిలో కేసీఆర్ ప్రసంగం అనుకున్న రీతిలో లేదు. అయితే పార్టీలో మాత్రం జోష్‌ను పెంచగలిగారు. అంతకుముందు టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే  హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిక రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు కొంత కలిసివచ్చే అవకాశమే. అలాగే మరోటీడీపీ నేత సుధీర్‌రెడ్డి కూడా చేరడంతో రంగారెడ్డిలో టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గానే ఉన్నది. అయితే  సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇదే సరిపోదు. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్ నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ నుంచి ఎంతమంది పెద్ద నేతలు వెళ్లిపోయినా ఆ పార్టీకి అంతో ఇంతో ఆదరణ ఇంకా ఉండడానికి కారణం ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉండడమే. అందుకే టీఆర్‌ఎస్ కూడా తన లక్ష్యసాధనలో విజయం సాధించాలంటే క్యాడర్‌ను మెరుగుపరుచుకోవాలి. అప్పుడు కేసీఆర్ అంచనాలు కార్యరూపం దాలుస్తాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రకటించిన పల్లెబాట, నగర బాట కార్యక్రమం ద్వారా ఆ లోటును పూడ్చుకోవాలి.

ఇక మరోసారి సూర్యాపేట సమరభేరి గురించి చర్చిద్దాం. ఈ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టడానికి గల కారణాలు ఏమిటి? ఇంతకు ముందు టీఆర్‌ఎస్‌కు లక్షలాది మందిలో అనేక బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర ఉన్నది. కానీ నల్లగొండ జిల్లాలో సభ సక్సెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. కేసీఆర్ నల్లగొండ జిల్లా నుంచి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ చర్చలు. అదే గనుక నిజమైతే ఇప్పటి వరకు ఆ జిల్లాలో పాతుకుపోయిన తెలంగాణలోని ఒక సామాజిక వర్గానికి కొంత ఇబ్బందే. ఎందుకుంటే గత ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి పోటీచేయడం ద్వారా ఆ ప్రాంతంలో పరిస్థితులు మారాయి. తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఒకే రీతిలో ఉంటుంది. ఇంత కాలం ఉత్తరతెలంగాణకే పరిమితం అన్న సరిహద్దును మూడేళ్ల కిందట కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చెరిపేసింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న మాట వాస్తవమే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ సీమాంధ్ర పార్టీలు గెలవలేదు. అదే పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతం కావాలంటే చాలా శ్రమ పడాలి. అందుకే టీఆర్‌ఎస్ ఒకవైపు ఉద్యమం మరోవైపు ఎన్నికలు లక్ష్యాన్ని ఎంచుకున్నది.

అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్రల కాలం సాగుతున్నది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సీపీ నుంచి షర్మిల తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా పాదయాత్రలు మాత్రం ప్రశాంతంగానే సాగుతున్నాయి. ఇది తెలంగాణవాదులకు మింగుడు పడడం లేదు. ఎందుకంటే తెలంగాణను అడ్డుకున్నవారిలో ఈ రెండు పార్టీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కార్యాచరణ ఎంత ముఖ్యమో, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల రూపంలో కూడా తెలంగాణ ఉద్యమానికి ప్రమాదం పొంచి ఉన్నది. ఎందుకంటే ప్రత్యక్షంగానే చంద్రబాబు రాజీనామాలతో వచ్చిన తెలంగాణను అడ్డుకుంటే, పార్లమెంటులో ప్లకార్డు పట్టి తెలంగాణపై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు జగన్. వీరు ఇప్పుడు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని తెలంగాణ ప్రాంతంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా.. చంద్రన్న, రాజన్న రాజ్యం అని పాటలు పాడుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు ఎంత అన్యాయం చేశాడో తెలిసింది. ఆయన కూతురు ఇప్పుడు రాజన్న రాజ్యం వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇక చంద్రబాబు తన హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది అంటున్నారు. దీనిపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమే అన్నారు కూడా. ఈ రెండు పార్టీలు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే తమ పాదయాత్రలను కొనసాగిస్తున్నాయి. వీరిని అడ్డుకోవాల్సిందేనని తెలంగాణవాదుల అభిప్రాయం. ఈ విషయంలో తెలంగాణవాదుల అంతా కలిసికట్టుగా నినదిస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ వాళ్లు ఎన్ని పాదయాత్రలు చేసినా జనం విశ్వసించరు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తెలంగాణవాదం ఒక్కటే సీమాంధ్ర పార్టీలను మట్టికరిపించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అనేక అంశాలు ముందుకొస్తాయి. అప్పుడు సీమాంధ్ర పార్టీలు 20-40 స్థానాలు దక్కించుకున్నా అది ఉద్యమానికి ఎదురుదెబ్బే. ఆ పార్టీలో ఈ ప్రాంతంలో భూస్థాపితం కావాలంటే అందరి అభిప్రాయం ఒక్కటే కావాలి. తెలంగాణ కోరుకునే పార్టీలన్నీ ఏకతాటిపై రావాలి. అంతేకాదు ఎన్నికలే లక్ష్యంగా ఉద్యమిస్తే లాభం ఉండదు. అధికార పార్టీపై ఒత్తిడి పెంచాలి. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు నడుస్తున్నది సంకీర్ణ ప్రభుత్వాలు. తమ రాజకీయ అవసరాలకు తీర్చుకోవడానికి చిన్నచితకా పార్టీలు కూడా కేంద్రాన్ని బెదిరించే స్థాయికి వచ్చాయి. అందుకే తెలంగాణకోసం ఉద్యమిస్తున్న టీ కాంగ్రెస్ ఎంపీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో ఓటింగ్‌ను తమకు అనుకూలంగా మలుచకోవాలి. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని తేల్చిచెప్పాలి. అంతేకానీ ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే వేరే ఫ్రంట్ పెట్టుకుని పోటీ చేస్తామంటే కుదరదు. డిసెంబర్ ప్రకటన తర్వాత సీమాంధ్రలో పార్టీలకతీతంగా ఏకమై తెలంగాణను అడ్డుకున్న విషయాన్ని మరిచిపోవద్దు. అదే ఐక్యతను ఇప్పటికైనా ప్రదర్శిస్తే నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది.

Labels: , , ,

చిత్తశద్ధిపైనే చింత

దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది.  ఈ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయి. అయితే ఈ సబ్‌ప్లాన్‌కు కొన్ని సవరణలు చేయాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఏబీసీడీ వర్గీకరణ ప్రతిపాదికన ఉప ప్రణాళికలో నిధులు కేటాయించాలని టీడీపీ ప్రవేశపెట్టిన సవరణకు టీఆర్‌ఎస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, ఎంఐఎం, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. టీడీపీ ప్రతిపాదనకు అనుకూలంగా 47, వ్యతిరేకంగా 67 ఓట్లు వచ్చినట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో టీడీపీ సవరణ ప్రతిపాదన వీగిపోయింది. దీంతో సర్కార్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించే విషయంలో రాష్ట్ర సర్కార్ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నించింది తప్ప చిత్తశుద్ధి చూపలేదన్నది ప్రతిపక్షాల వాదన. అందులో కొంత వాస్తవము లేకపోలేదు. ఎందుకంటే ఈ సబ్‌ప్లాన్‌కు రాష్ట్ర సర్కార్ పదేళ్ల కాలపరిమితి విధించింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్లాది రూపాయల నిధులు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల కోసం మళ్లించబడ్డాయి. దీన్ని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నారు. మళ్లించిన నిధులు తిరిగి రికవరీ చేయాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తికి సర్కారు నుంచి సానుకూల స్పందన లేదు. అలాగే ఇప్పటి ఈ సబ్‌ప్లాన్ నిధులు మురిగిపోకుండా ఉండడానికి కూడా ప్రతిపక్షాలు కొన్ని సవరణ చేశాయి. దీనికి కూడా కిరణ్ సర్కార్ అంగీకరించలేదు. దీనిపై ముఖ్యమంత్రి ఓటింగ్‌కు స్పీకర్ అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. కనుక ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు అందరూ సహకరించాలని విన్నవించారు.

రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజాల కోసమే పాకులాడుతాయనడంలో సందేహం లేదు. కానీ ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లును పాస్ చేయించుకోవడంలో కిరణ్ సర్కార్ విజయం సాధించింది. చట్టబద్ధత అయితే కల్పించింది కానీ దీని చిత్తశుద్ధిపైనే చింత ఉన్నది. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలు దళిత, గిరిజనుల అభ్యున్నతి గురించి మాటల్లో వల్లెవేస్తూనే ఉన్నాయి. కానీ నేటికి వారి జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులేవీ లేవు.  వారి బతుకులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇంకా దురదృష్టమేమింటే ఈ సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా వీళ్ల సమస్యలపై పోరాడడం లేదని దళిత, గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికీ దళిత, గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఓట్ల కోసం అక్కడ రెండురోజులు బస చేయడం, కొన్ని హామీలు గుప్పించడం,  ఓట్లు దండుకున్నాక తిరిగి వారివైపు కన్నెత్తి చూడకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళిక చట్టబద్ధత కల్పించినందుకు ఆయా సామాజిక వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నా, దీని ఆచరణపై ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. ఇక అధికార పార్టీ నేతలు ఈ ఉప ప్రణాళిక చట్టబద్ధత ఘనత గురించి ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ ఘనత ఎవరిదైనా ఈ ఉప ప్రణాళిక లక్ష్యం గాడితప్పకుండా పాటుపడితే అదే పదివేలు. అందుకు ప్రతిపక్షాలు కూడా పార్టీలకు అతీతంగా ఈ చట్టం సక్రమంగా అమలయ్యేలా ఒత్తిడి తేవాలి. అప్పుడు ఈ చట్టం లక్ష్యం నెరవేరుతుంది.

Labels: , ,