Saturday 3 August 2013

బహుపరాక్ ప్రజలారా!!

కేసీఆర్ ను తిట్టడానికి పార్టీల్లో, నేతల్లో సమైక్యత వచ్చింది. ఏకాభిప్రాయం వచ్చింది. రెండుకళ్ళ సిద్ధాంతం సబబే అనిపించింది . ఒకరి మనోభావాలు మరొకరు అర్థం చేసుకున్నారు. ఇదంతా దేనికోసం సీమాంధ్ర లో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే!  సీమాంధ్ర ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం కాదు, సమైక్య రాష్ట్రం కోసం అంతకంటే కాదు. తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయాక ఇక ఏమీ చేయలేము అని చెప్పలేక ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే! బహుపరాక్ ప్రజలారా!!

Labels: ,

Thursday 1 August 2013

ఆఖరి అస్త్రాలు



తెలంగాణ అనుకూల ప్రకటన వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్న లగడపాటి ఆ పని చేయలేదు. ఎందుకంటే తెలంగాణ బిల్లును ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు లో ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ................................ నే ఉంటాడు. కాబట్టి లగడపాటి హార్డ్ కోర్ సమైక్యవాది అయిపోయాడు. ఇక ఇప్పుడు కొంత మంది సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు తమ పదవులకు రాజీ'నామాలు' చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ రాజీనామాలతో వస్తే రాష్ట్రపతి పాలనే వస్తుంది తప్పా రాష్ట్ర విభజన పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. ఇదే విషయాన్నీ దిగ్విజయ్, షిండే లు చెప్పారు. నాలుగేళ్ళ కిందట నల్లారి,నారా వారు ఆడిన రాజీ డ్రామా లతో కేంద్రం వెనక్కి తగ్గింది. దాని ఫలితంగా కార్యకర్తలను  కాపాడుకోవడానికి, పార్టీని నిలబెట్టుకోవడానికి వేల కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అందుకే బాబు ఆ తప్పు మళ్ళీ చేయలేదు. కానీ విభజన పాపం బాబు, వైఎస్అర్ సీపీల పై కి నెట్టి లబ్ధి పొందాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రాజీనామా చేసిన వైఎస్అర్ సీపీ ఎమ్మెల్యేల 'రాజీ'నామాలు ఏమయ్యాయో తెలియదు. సీమాంధ్ర నేతల రాజీనామాల వెనుక ఉన్న స్టార్ బాట్స్ మెన్ ఎవరో అందరికి తెలుసు. లగడపాటి చెప్పిన ఆ బాట్స్ మెన్ హస్తినలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఇప్పటి రాజీనామాలు వారి ఆఖరి అస్త్రాలు. ఈ శుష్క యుద్ధం లో వాళ్ళు మీడియా ముందు హీరోలుగా కనబడినా...రాష్ట్ర విభజనపై కేంద్రం మనసు మారదు.

Labels: , , , , ,

Saturday 27 July 2013

కొత్త రాగల కుట్ర

తెలంగాణ ప్రజల ఆకాంక్ష హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ మాత్రమే! ఇప్పుడు మీడియాలో వస్తున్నలీకులు  అంటు మొక్క రాయల తెలంగాణ ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తెలంగాణ ప్రజలే కాదు, రాయలసీమ ప్రజలు కూడా అంగీకరించరు. ఇప్పటివరకు రాష్ట్రంలో సమైక్య, తెలంగాణ వాదనలే ఉన్నాయి. ఆ మధ్య రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఈ రెండు అంశాల పైనే కిరణ్, బొత్స, రాజనర్సింహను రోడ్ మ్యాప్ అడిగారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధుల కంటే ప్రసార మాధ్యమాలే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. బులిటెన్ ఒక వాదాన్ని తెరమీదికి తెస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణకే మొగ్గు చూపిస్తున్నట్లయితే దీన్ని ఇరు ప్రాంతాల ప్రజలు ఒప్పుకోరు కాబట్టి దీని సాకుతో ఇప్పటి వరకు ఆ పార్టీ చెబుతున్న నిర్ణయాన్ని చెప్పకుండా విభజన అంశాన్నికొన్ని రోజులు (కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కొన్ని ఏళ్ళు) కోర్ కమిటీలో చర్చిస్తూ సాగదీస్తుంది.

Labels: , , ,

Saturday 13 July 2013

సమా‘వేషాలు’


దిగ్విజయ్ సింగ్ తెలంగాణపై అన్ని పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామన్నారు. ఇక సంప్రదింపులు ఉండవు అన్నారు. ఇక నిర్ణయమే మిగిలింది అన్నారు. అది తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఆ నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఒక విధానం ఉండాలి. అలాగే తెలంగాణపై ఇప్పటి వరకు ఏ అభిప్రాయం చెప్పని పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని కమిటీలు వేసింది. చర్చలు, సంప్రదింపుల పేరుతో ఏకాభిప్రాయం సాధిస్తామన్నది. తెలంగాణపై దేశవ్యాప్తంగా మెజారిటీ ఎప్పుడో వచ్చింది. కానీ హామీ ఇచ్చిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం దీనిపై ఎలాంటి నిర్దిష్ట అభిప్రాయం లేకపోవడమే ఇప్పటి విషాదం. తెలంగాణ అంశం తేలాలంటే కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వెల్లడించాలి. అది జరగనంత కాలం కమిటీలు, చర్చలు, సంప్రందిపులు, కోర్ కమిటీ సమావేశాలు, సీడబ్లూసీలో చర్చించడాలు, రోడ్ మ్యాప్‌లు మాత్రమే కనిపిస్తాయి. ఆ సమా‘వేషాలు’ సమస్య సాగదీతకే తప్ప, పరిష్కారం కోసం కాదు.

Labels: , , ,

Tuesday 9 July 2013

సత్తిబాబు సమైక్య సన్నాయి



రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకున్నానని చెప్పారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షునిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆయన ఆ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్ సమైక్యాంధ్ర సదస్సుకు హాజరయ్యారు. ఆ సదస్సులో ఊసరవెల్లి ఉండవల్లి తెలంగాణ ఉద్యమనాయకత్వంపై విషం చిమ్ముతుంటే ఆ వేదికను పంచుకొని నేను సమైక్యాంధ్ర గురించి మాట్లాడలేదు అన్నారు. అంతేకాదు ఆ సభలో తెలంగాణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వారందరితో కలిసిపోయారు సత్తిబాబు. ఆయన ఆరోజు ఆ సభలో సమైక్యవాదాన్ని వినిపించకపోయినా ఆయన ఆంతర్యం మాత్రం అదేనని అప్పుడే అర్థమైంది. దీనిపై ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆయనను నిలదీస్తే మీరు సభ పెట్టండి మీ సభకు వస్తాను అని తప్పించుకున్నాడు. అట్లాగే ఆమధ్య రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలోనూ తెలంగాణ అమరులకు నివాళులు అర్పించే సమయంలో బొత్స వ్యవహరించిన తీరు ఆయన తెలంగాణ వ్యతిరేకతను చూపెట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర మొత్తానికి ప్రాతినిధ్యం వహించాలి. కానీ రేపు ఎన్నికల్లో వీరిద్దరు పోటీ చేసేది సీమాంధ్ర ప్రాంతంలో. అంతేకాదు సత్తిబాబు కుటుంబం నుంచి ఎన్నికల్లో నిలబడే వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో సత్తిబాబు సమైక్య సన్నాయి నొక్కుతున్నారు.  ఒకవైపు తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తిస్తున్నామంటూనే వైఎస్‌ఆర్‌సీపీ సీమాంధ్రలో రాజీనామాలకు తెరలేపింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటూనే విభజనకు అంగీకరించమని ‘గంట’లు మోగిస్తారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు చెప్పుకొస్తాడు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లాంటి వాళ్లు కాగితాల మీద ఇచ్చే రోడ్డు మ్యాప్ ఆధారంగా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఊరుకోము అంటాడు. సాక్షాత్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షునికే తెలంగాణ వ్యతిరేకత ఉంటే, ఇక మిగతా నేతలను ఆయన ఎలా కట్టడి చేస్తాడు? మా పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు అనే చంద్రబాబు మాత్రం తెలంగాణ విషయంలో ఆ షరతు వర్తించదు అంటాడు. సీమాంధ్ర బాబు చిత్రాలు ఈ నాలుగేళ్లలో ఈ ప్రాంత ప్రజలు చాలానే చూశారు. అందుకే ఇక తెలంగాణపై ఎన్ని నాటకాలు వేసినా ప్రయోజనం ఉండదు.

Labels: , , , ,

Saturday 6 July 2013

పార్టీల నిర్ణయమే ప్రామాణికం

తెలంగాణపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డెప్యూటీ ముఖ్య మంత్రులను రోడ్‌ మ్యాప్‌లతో రమన్నాడు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌. ఆయన చెప్పిన ప్రకారం కాంగ్రెస్‌ అధిష్టానం ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రెండోది సమైక్యాంధ్రాను కొనసాగిం చడం. ఈ రెండు వాదనల్లో ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని వారి అభిప్రా యాలు ఆ పార్టీ రాష్ట్ర పెద్దలకు చెప్పుకునే అవకాశం కార్య కర్త మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఉన్న ది. వీరందరి అభిప్రాయాలను పరిగణలోకి హస్తినకు వెళ్తారు. అయితే రాష్ట్ర విభజనపై మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ఎన్నోమార్లు వివిధ కమిటీల ముందు, కాంగ్రెస్‌ అధిష్టాన పెద్దల ముందు వినిపించారు. మొన్న దిగ్విజయ్‌ వచ్చినప్పుడు కూడ ఇరుప్రాంతాల నుంచి తమ తమ అభిప్రాయాలతో కూడిన నివేదికలు ఇచ్చారు. అలాగే అందరి అభిప్రాయాలు అధిష్టాన పెద్దలకు విన్నవించి, రాష్ట్ర విభజనపై అన్ని ప్రాంతాల మనోభా వాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందరికి ఆమోదయో గ్యమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్యం తీసుకుంటుందని ఇప్పుడు విభజనపై మడత మాటలు మాట్లాడుతున్న నేతలంతా ఇంతకాలం చెప్పుకొచ్చినవే. ఈ రాష్ట్ర ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుంది. ఎప్పు డు ఎన్నికలు వచ్చినా సమైక్యవాదానికి 270 స్థానాలు ఖాయమన్న లగడపాటి రాజగోపాల్‌ దాన్ని పక్కనపెట్టాడు. తనకున్న సమాచారం మేరకు మూడు నెలల్లో తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం కోరుతారని, అప్పుడు ఆ తీర్మానం వీరిపో యేలా చేయాలన్నారు. ఆ తీర్మానం వీరిపోతుందా లేక పాస్‌ అవుతుందా అనేది ఆంధ్రా ఆక్టోపస్‌కు అర్థం కావడం లేదు. అందుకే అప్పుడు ఆ తీర్మానం వీరిపోవాడానికి నలభైపైచిలుకు ఉన్న సీమాంధ్ర టీడీపీ నేతలు సమైక్యవాదంపై గళం విప్పాలం టున్నాడు. తెలుగుతల్లి ముక్కలు కాకుండా ఉండాలంటే వాళ్లు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుందని తెగ ఆందోళనపడుతున్నాడు. ఇప్పుడు లగడపాటి రాజగోపాల్‌ సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు అధికార ప్రతినిధి అయిపోయాడు. అయా పార్టీల నేతలంతా తెలంగాణను వ్యతిరేకించాలంటున్నాడు. ఇంతకాలం రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితిలో జరగదన్న అగడపాటి ఇప్పుడు మా త్రం ఏం జరుగుతుందో చెప్పలేము అంటున్నాడు. దానిపై ఆయ నకు క్లారిటీ రావాలంటే అసెంబ్లీ తీర్మానం తర్వాత వస్తుందేమో! ఇక్కడే అగడపాటి రాజగోపాల్‌ ఒక విషయాన్ని మరిచిపోతున్నాడు. రాష్ట్ర విభజనపై వ్యక్తిగత అభిప్రా యాలు ఏవైన పార్టీల అభిప్రా యాలే అంతిమం అన్న ప్రాథమిక విషయాన్ని ఆయన మరిచిప తున్నాడు. అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణకు తాము వ్యతిరే కం కాదు అన్న పార్టీల బలబలా లు చూస్తే ఆ బిల్లు సునాయసంగా పాస్‌ అవుతుంది. లేదు ఆ మాట అన్నది తమ రాజకీయ లబ్ధి కోసమే అంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇప్పుడు పక్క పార్టీల విషయాన్ని పక్కనపెడితే మీ ముఖ్య మంత్రి, పీసీసీ, డెప్యూటీ సీఎం రోడ్‌ మ్యాప్‌ల ఆధారంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసెంబ్లీలో అమలు చేయాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపై ఉంటుంది. తమ అభిప్రాయాన్ని తెలియజేసి మిగతా పార్టీల అభిప్రాయాన్ని కోరవలసి ఉంటుంది. అంతేగానీ బడిత ఉన్న వాడిదే బర్రె అన్నట్టు సీమాంధ్ర ప్రాంతంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తామంటే తీర్మానం వీగిపోతుందేమో కానీ రాష్ట్ర విభజన మాత్రం ఆగదు. మెజరిటీ ప్రాంత ప్రతినిధులు తమకున్న బలంతో మైనరిటీ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకుంటామంటే కుదరదు. ఇలాంటి పరిస్థితి ఉంటుం దనే రాజ్యాంగ నిర్మాతలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అందుకే మీ రాష్ట్ర వ్యవహారల పర్యవేక్ష కుడు దిగ్విజయ్‌ సింగ్‌ కూడా అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉండా ల్సిన పనిలేదు అన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే రాజీనామాలు చేస్తాం. అగ్నిగుండం అవుతుంది అనే మాటలతో కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే రాజకీయాలకు కాలం చెల్లింది. తెలంగాణ కోసం ఆ మధ్య కొంతమంది ఎంపీలు పార్టీకి డెడ్‌లైన్లు పెడితే, అధిష్టానానికి డెడ్‌లైన్లు పెట్టే సాహసం ఎవరూ చేయకూడదని ముఖ్యమంత్రి అన్న మాటలు రాజీనామాలు చేస్తాం అంటున్నవారు గుర్తించుకుంటే మంచిది. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కూడా తెలంగా ణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నాయి. కాంగ్రెస్‌ హస్తిన పెద్దలు మొదలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి దాకా కేంద్రం దీనిపై చర్చలు జరుపుతున్నదని త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆ నిర్ణయానికి అనేక గడువులు పెట్టి మాట మార్చారు కూడా. ఇప్పుడు ఆ సమయం కూడా దాటిపోయింది. అందుకే డిగ్గీరాజా ఒక డెడ్‌లైన్లు ఉందవు నిర్ణయమే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఈ మాట నిజమో కాదో అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయుల్లా కలిసుందామని ఆంధ్రప్రదేశ్‌ లోని బుద్ధిజీవులంతా కోరుకుంటున్నారు. అయితే నిర్ణయం రాకము ందే ఒక ప్రాంత ప్రజలు ఆకాంక్షపై ఒక వర్గం మీడియా, కొంత మంది వ్యక్తులు విషం చిమ్మడం సరికాదు. అలాగే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకూ కాంగ్రెస్‌ను నమ్మేస్థితిలో ప్రజలు లేరు. కాంగ్రెస్‌ పార్టీ అన్నమాట ప్రకారం పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు. తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల కల సాకారమవుతుందనుకున్న ప్రతి తరుణంలో ఒక వర్గం మీడియా అడ్డుకోజూడటం ఇక్కడి ప్రజల్లో పెను ప్రభావమే చూపుతుంది. తెలంగాణపై పార్టీల నిర్ణయమే ప్రామాణికం. ఆయా పార్టీలు ఇక్కడ మన గలగాలంటే ఇప్పుడు అవి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Labels: , , , , ,

Monday 1 July 2013

ముందే కూస్తున్న కోయిలలు



ఈ మధ్య ఓ చానల్ తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం అంతర్గం ఏమిటో ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. మినట్ టూ మినట్ అప్‌డేట్ అంటూ రకరకాల కథనాలు ప్రసారం చేసింది. విభజన ఖాయం అని తేల్చేసింది. ఇక నిర్ణయమే మిగిలింది అన్నట్టు సాగింది ఆ చానల్ హడావుడి. దీనిపై చర్చలు కూడా చేసింది. పైకి చూస్తే ఇదంతా ప్రజాహితం కోసం ఆ చానల్ తెగ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అసలు కథ అది కాదు. తెలంగాణపై నిర్ణయం రాకుండా మళ్లీ సీమాంధ్రలో అగ్గిరాజేయడానికి చేసిన ప్రయత్నం అది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై మూడు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని చెప్పుకొచ్చింది. ఒకటి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమని, రాయల తెలంగాణ అని, ప్యాకేజీ అని రకరకాలుగా విశ్లేషణలు మొదలుపెట్టింది. తెలంగాణపై షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్షంలో ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు తెలంగాణకు జై కొట్టాయి. దీంతో ఇంత కాలం ఏకాభిప్రాయం అనే మాట మాట్లాడిన కాంగ్రెస్‌కు అఖిలపక్ష సమావేశం తర్వాత ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఆంధ్రా లాబీయింగ్ ఆజాద్ రూపంలో తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. కాంగ్రెస్ ఊతపదాలు మరిన్ని చర్చలు, విస్తృత సంప్రదింపులు, ఏకాభిప్రాయం వంటివి వచ్చాయి. షిండే పెట్టిన గడువుకు ఆజాద్ తాత్కాలికంగా గండికొట్టాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నెలలు గడిచినా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకుంటే ప్రజలు తిరగబడతారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక  లోక్‌సభ ఎన్నికలు కూడా నవంబర్‌లో జరగవచ్చు అనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న, యూపీఏ 1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో కీలక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని భావిస్తూ ఉండవచ్చు. అందుకే తెలంగాణపై ఇప్పటికే ఎన్నో మాటలు, ఎన్నో గడువులు పెట్టింది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అనేది సత్యం. అందుకే ఇక తెలంగాణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. కేంద్రంలో కదలిక రాగానే ఆంధ్రా చానళ్ల, నేతల్లో ఆందోళన మొదలవుతుంది. హస్తిన పెద్దలు ఏ నిర్ణయం చెప్పకుండానే ఇక్కడ మాత్రం హడావుడి ప్రారంభమవుతుంది. ఇదే ప్రజాహితమని, మెరుగైన సమాజం కోసం ప్రజలను మభ్యపెడుతుంటాయి. నిజానికి రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇరు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. కేంద్రం కూడా ఈ అంశంపై తేల్చాల్సిన సమయమూ ఆసన్నమైంది. అది ఏమిటో ఇంత వరకు అటు కాంగ్రెస్ పెద్దలు కానీ, ఇటు రాష్ట్ర పెద్దలు కానీ పెదవి విప్పడం లేదు. మరికొన్ని కోయిలలు ముందే ఎందుకు కూస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి.

అట్లాగే కావూరి సాంబశివరావు తెలంగాణపై మాటమార్చారని ప్రసారం చేస్తున్నాయి. కావూరి తెలంగాణ అనుకూల వ్యాఖ్యలేమీ చేయలేదు. ఇప్పుడు సమైక్యవాద నినాదం వినిపిస్తున్న నేతల మాటనే ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ హస్తిన పెద్దలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీ పడక తప్పదు అన్నారు. దీన్ని భూతద్దంలో చూపెడుతూ.... కావూరిని తెలంగాణకు అనుకూల వ్యక్తిగా, సమైక్యాంధ్రకు వ్యతిరేకిగా చిత్రిస్తున్నాయి. ఒక వర్గం కొమ్ము కాస్తున్న మీడియా చిత్తశుద్ధి ఉంటే 2009 డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు జైకొట్టి, డిసెంబర్ 10న మాట మార్చిన చంద్రబాబును నిలదీయాల్సి ఉండే. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని చెబుతూనే...  సీమాంధ్ర కాంగ్రెస్ నేత చేస్తున్న వితండవాదాన్ని తప్పుపట్టాల్సి ఉండే. కానీ ఇవేవీ చేయకుండా వాళ్ల కంటే ఒక అడుగు ముందుకేసి ఒక వర్గం మీడియా ప్రజల్లో లేని అపోహలను, విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదు.

Labels: , , , ,

Thursday 27 June 2013

ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే!

ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చంద్రబాబు తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించడానికి, వారిని వారి స్వస్థలాలను పంపించడానికి టీడీపీ అధినేత నాలుగైదు రోజులుగా నానా హడావుడి చేస్తూనే ఉన్నాడు. వరద బాధితులకు సౌకర్యాలు సరిగా లేవని ఏపీ భవన్ ముందు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నా కూడా చేశారు. అట్లాగే వరద బాధితులను రక్షించడంలో భారత సైన్యం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. ఇఎ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచకుపడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ బురద రాజకీయం ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సైన్యాన్ని ప్రశంసిస్తూనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు అంటే ఏమనుకోవాలి? భారత సైన్యం ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తుందో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన  చంద్రబాబుకు తెలియకపోవడం దురదృష్టకరం. మాట్లాడితే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక టీడీపీ అనే చంద్రబాబు వరద బాధితులను ఆదుకునే పేరుతో టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు బాహిబాహీకి దిగి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు. క్రమశిక్షణ గురించి లెక్చర్లు దంచే చంద్రబాబు ఆయన ముందే కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఒకరినొకరు తోసేసుకుంటూ, నోటికొచ్చినట్టు తిట్టుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించాడు. ఇక అధికార పార్టీ నేతల గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే పక్కవాడు లేస్తే గానీ మనకు చలనం రాదు అన్నట్టు ఉంటుంది కాంగ్రెస్ నేతల వైఖరి. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకుంటున్నామని రోజూ మీడియా ముందు ఫోజులు ఇచ్చుకుంటూ, క్రెడిబులిటీ కోసం ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టకునే దాకా వెళ్లారు. బాధితుల గోడు పక్కకు పోయి నిన్న రాష్ట్ర, జాతీయ మీడియాలో వీరి గొడవే ప్రధానాంశం అయింది. సహాయ చర్యలకు వర్షం అడ్డంకిగా మారుతున్నది. సైన్యం బాధితులను రక్షించడానికి ఎంతో శ్రమిస్తున్నది. ఈ సమయంలో నేతలు పరామర్శల పేరుతో ఫైటింగులు చేసుకుంటే రాష్ట్రం పరువు గంగపాలు చేశారు.
ఇదేనా తెలుగు వారి ఆత్మగౌరవం అంటే! కాంగ్రెస్, టిడిపి నేతలను చూసి జనం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది.

Labels: , ,

Thursday 20 June 2013

సమావేశాలతో సమయం వృథా



తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత నెలరోజుల్లో తెలంగాణపై తేలుస్తామన్నారు. ఆ గడువు పోయి చాలా కాలం అయింది. అప్పుడు తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నదని మీడియా కోడై కూసింది. (సారీ... ఒక వర్గం మీడియా సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పురమాయించింది అని చెప్పాలి) ఆ సమయంలో మంత్రి టీజీ వెంకటేశ్ లాంటి వాళ్లు కూడా తెలంగాణ ఇచ్చేటట్టు ఉన్నారని కూడా ప్రకటించారు. దీంతో అధికారపార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అంతా సమైక్యంగా ఆజాద్‌తో కలిసి నెల గడువును తూచ్ అనిపించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. అప్పుడూ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నోరు మెదపలేదు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తెలంగాణపై నాన్చివేత ధోరణిని తప్పుపడుతూ సమరదీక్ష సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తెలంగాణ ఉద్యమ నాయకత్వం విమర్శలు చేసింది. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను అడ్డుకుంటే చచ్చిన పాముల్లా ఉన్న ఈ ప్రాంత నేతలు తెలంగాణ ఉద్యమ పార్టీని,  నాయకత్వాన్ని నల్లారి వారు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వారికి బాసటగా నిలిచి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

మొన్నటికి మొన్న చలో అసెంబ్లీ సందర్భంగా కిరణ్ ప్రభుత్వం తెలంగాణవాదులపై దమనకాండను ప్రయోగించింది. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నేతలు కుయుక్తులు పన్నుతుంటే కుక్కిన పేనులా ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణకు భారీ ప్యాకేజీ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు మళ్లీ సమావేశాలు  మొదలుపెట్టారు. తెలంగాణ తప్పా మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించం అంటున్నారు. సోనియాగాంధీకి లేఖ రాయాలని, నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో భారీ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ కోసం వెయ్యిమందికిపైగా బలిదానాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున్న ఉద్యమం జరుగుతున్నది. వలస ప్రభుత్వ నిర్బంధాలను అధిగమిస్తూ శాంతియుతంగా ప్రజలు స్వరాష్ట్ర ఆకాంక్షను హస్తినకు చాటిచెప్పడానికి ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పలేని వీళ్లు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తేవడానికి త్వరలో హస్తినకు వెళతారట! హైదరాబాద్‌లో కిరణ్ ప్రభుత్వం చలో అసెంబ్లీ సందర్భంగా ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంటే ప్రేకక్ష పాత్ర వహించారు. తెలంగాణ కోసమని సమావేశాలు పెట్టి తెలంగాణను అడ్డుకున్న ఆజాద్‌కు ధన్యవాదాలు తెలిపి, దిగ్విజయ్‌సింగ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసి తాము కూడా రాష్ట్ర సాధన కోసం ఏదో చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు.

ఐదున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ ఒక్క డిసెంబర్ 9న తప్ప మరెప్పుడు గౌరవించలేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు కామెడీ కామెంట్లు చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఎక్కడ తెలంగాణపై సానుకూల ప్రకటన వస్తుందో అని సీమాంధ్ర నేతలు మూకుమ్మడిగా మూడురోజులు హస్తినలోనే మకాం వేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. షిండే పెట్టిన నెల గడువుకు ఆజాద్‌తో కొత్త అర్థాలు చెప్పించారు. ఇలా వచ్చిన తెలంగాణను డిసెంబర్ 9 తర్వాత అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారితోనే వేదికలు పంచుకుంటూ ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన ఈ ప్రాంత నేత నేతలు ఇప్పుడు మీటింగులు పెట్టి సోనియాగాంధీకి విన్నపాల లేఖ రాస్తే ఒరిగేది ఏమిటి? ఈ ప్రాంత విముక్తి కోసం వీరంతా ఒక్కతాటిపై నిలబడి ఉండి ఉంటే కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంపై ఇంత అణచివేతను ప్రయోగించేవాడా? అందుకే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం ఎప్పుడు సమావేశాలు పెట్టినా వాటిని టీ, బిస్కెట్ సమావేశాల లాగానే ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రానికి ప్యాకేజీలు పరిష్కారం కాదని మాటల్లో చెబితే ఢిల్లీ పెద్దలకు చెవికి ఎక్కదు. సమావేశాలతో సమయం వృథా తప్ప ఫలితం ఉండదనే విషయాన్ని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు తెలుసుకుంటే మంచిది.

Labels: , ,

Monday 17 June 2013

ప్యాకేజీలు-లీకేజీలు



‘చలో అసెంబ్లీ’ సందర్భంగా కిరణ్ సర్కార్ శాంతిభవూదతల పరిరక్షణ పేరుతో తనను తానే ధించుకున్నది. చలో అసెంబ్లీని అడ్డుకోవడానికి వేలాదిమంది పోలీసులను మోహరించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఉద్యమకారుల కంటే పోలీసుల అత్యుత్సాహం వల్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఎంత నిర్బంధకాండను అమలుచేసినా తెలంగాణవూపజలు తమ ఆకాంక్షను చాటారు. ప్రభుత్వమే పోలీసు ఫోర్సుతో ‘చలో అసెంబ్లీ’ని సక్సెస్ చేసింది.అయితే ‘చలో అసెంబ్లీ’ పై సీమాంధ్ర మీడియా అర్ధసతాలతో, వక్రీకరణలతో కథనాలను ప్రసారం చేసింది. వీటిలో రాష్ట్రవూపభుత్వం‘అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేసింద’ని, కిరణ్ ను కాంగ్రెస్ పెద్దలు మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు.

అలాగే ప్రతి శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీలో చలో అసెంబ్లీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై సీరియస్‌గా చర్చ జరిగిందని ఇదే మీడియా చెప్పుకొచ్చింది. తెలంగాణపై హస్తిన పెద్దలు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్షం ఏర్పా టు చేయనున్నారని, ఇప్పటికే సిద్ధం చేసిన రెండు ప్రతిపాదనలను తెలంగాణ ప్రజావూపతినిధుల ముందు ఉంచి,వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నదని ఊహా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

అందులో మొదటిది భారీ ప్యాకేజీ అని, రెండవది కర్నూల్, అనంతపురంతో కలిపి రాయల తెలంగాణ ప్రతిపాదనను వారి ముందు ఉంచనున్నట్లు చెబుతున్నది. వారానికి ఒకసారి జరిగే కోర్‌కమిటీలో సహజంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి, ఇతర అంశాల గురించి చర్చ జరగడం సహజమే. ముఖ్యంగా నిన్న జరిగిన సమావేశంలో ప్రధానంగా ఆహారభద్రత బిల్లుపై చర్చ, ఎన్డీఏలో జేడీయూ ముసలం తదితర అంశాల గురించి చర్చ జరిగి ఉంటుంది. యూపీఏ ప్రభుత్వం నుంచి మమతాబెనర్జీ, డీఎంకే లాంటి ప్రధాన భాగస్వామ్య పార్టీలు వైదొలిగిన తర్వాత అరకొర మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది. అలాగే యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తున్నది. బీఎస్పీ, ఎస్పీ లాంటి పార్టీలు బయటి నుంచి ఇస్తున్న మద్దతుతో యూపీఏ ప్రభుత్వం నిలబడింది. ఎస్పీ అధినేత కొంతకాలంగా నవంబర్‌లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రావొచ్చు అనే సంకేతాలు ఇస్తున్నారు. దీనికనుగుణంగా కేంద్రంలో కొత్త సమీకరణలు జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభు త్వం బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. మోడీని బూచిగా చూపించి బయటకు రావాలనుకుంటున్న జేడీయూను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీయేతర ముఖ్యమంవూతులు ‘ఫెడరల్ ఫ్రంట్’ పేరుతో కొత్త ఫ్రంట్‌కు సన్నాహకాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి ఒకరినొకరు సంప్రదించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో యూపీఏ-3ని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్‌ను ప్రధానిగా చేయాలనే సోనియాగాంధీ ఆశయం అంత సులువు కాదనేది రాజకీయ విశ్లేషకుల అభివూపాయం. పైగా యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల ఏర్పాటులో ఆంధ్రవూపదేశ్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడాపరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని ‘సర్వే’, అధ్యయనాలు యూపీఏకు పరాభవం తప్పదని చెబుతున్నాయి. అట్లాగని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఆ సర్వేలు చెప్పడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా మాత్రం కొనసాగుతుందని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పొత్తుల కోసం ఇటు యూపీఏ, అటు ఎన్డీఏ ఆరాటపడుతున్నాయి.

కాంగ్రెసేతర ప్రాంతాల్లో ఆయా పార్టీలతో పొత్తు తప్పని సరి. కానీ ఆంధ్రవూపదేశ్‌లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో రెండుసార్లు నిర్ణయాత్మక పాత్ర పోషించిన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తెలంగాణ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ అంశాన్ని తేల్చకుండా ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణపై 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా ఏ ప్రతిపాదనకు అంగీకరించరు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలకు కూడా తెలుసు. ఇప్పుడు సీమాంధ్ర మీడియా ప్రచారం చేస్తున్న ప్రతిపాదనలు శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు ప్రతిపాదనల్లోని అంశాలే. వీటిలో ఏ ఒక్కదాన్ని ఒక ప్రాంతం వారు ఆమోదిస్తే మరో ప్రాంతం వారు అంగీకరించరు అనే విషయాన్ని ఆ కమిటీనే కుండబద్దలు కొట్టింది. శ్రీకృష్ణ కమిటీ ఎటూ తేల్చలేకపోయిందని, ఆ నివేదిక ముగిసిన అధ్యాయమని కాంగ్రెస్ పెద్దలు పేర్కొన్నారు. అయినా సీమాంధ్ర మీడియా ఎందుకు పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నది.

ఆ మధ్య ఇదే మీడియా గూర్ఖాలాండ్ తరహాలో తెలంగాణకు ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తారని ప్రచారం చేసింది. అయితే ఆ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ కావాలి. అందుకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అంగీకరించదు. ఈ ప్రతిపాదన సాధ్యం కాదు. అలాగే ప్యాకేజీకి కూడా తెలంగాణవాదులు ఒప్పుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో పూటకో మాట మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నది. ఇక మిగిలింది హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేము అని చెప్పి ప్యాకేజీని ముందుకు తెస్తున్నదా? తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయినా ఫరవాలేదు అనుకున్నపుడే ఈ ప్రతిపాదన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ సాహసం చేస్తుందా లేదా అన్నది కాలం తేలుస్తుంది. తెలంగాణపై తేలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక గడువులు పెట్టింది. ఆ తర్వాత మాట మార్చింది. కనుక ఇప్పుడు సీమాంధ్ర మీడియా చెబుతున్న కట్టుకథలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేదు. తరతరాల పోరాటాల, త్యాగాల చరిత్ర పునాది మీద ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మించుకున్న తెలంగాణ సమాజం తెలంగాణ సాధించే దాకా విక్షిశమించదు. తెలంగాణ రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించదు.

-రాజు ఆసరి

Labels: , , , ,

Wednesday 5 June 2013

దేశంలో రెండు దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే. ప్రస్తుత యూపీఏ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ను అందిస్తున్నది ప్రాంతీయ పార్టీలే. అంటే ఒకరకంగా జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. కానీ నాగం జనార్దన్‌రెడ్డికి మాత్రం ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీగా కనిపిస్తున్నది. ఇదే జాతీయ పార్టీ దేశంలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీ బెదిరింపులకు లొంగి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. అంతెందుకు 2004లో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది. ఆ ఎన్నికల్లో టీడీపీని తెలంగాణలో మట్టికరిపించింది ఉప ప్రాంతీయ పార్టీనే. అదే టీడీపీ 2009 ఎన్నికల్లో నాగం చెబుతున్న ఉప ప్రాంతీయ పార్టీతో పొత్తుపెట్టుకున్న విషయం నాగం మరిచిపోయారేమో! తెలంగాణ కోసం ఎవరు ఏ పార్టీలో అయినా పనిచేయవచ్చు. కానీ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదు అనడమే వారి అవగాహన లోపానికి నిదర్శనం.

Labels: , , , ,

తెలంగాణపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని పైకి తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే,  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును పరోక్షంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు.,ఇక 2001లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ నాడు 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గరికి పంపారు. దశాబ్ద కాలంగా తెలంగాణ సమస్య కాంగ్రెస్ కోర్టులో ఉన్నది. ఇప్పుడు తెలంగాణపై భిన్న అభిప్రాయాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే. ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు చెబుతున్నట్టు సంప్రదింపులు, చర్చలు అనేకసార్లు జరిగాయి. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికార పార్టీలోనే ఏకాభిప్రాయాన్ని సాధించలేని వారు తెలంగాణ ఇచ్చే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉన్నదనడం ఇప్పటి విషాదం. షిండే పెట్టిన ‘నెల’ గడువును తప్పుపట్టిన ఆజాద్ ఇప్పుడు మరో గడువు పెట్టినా, షకీల్ అహ్మద్ తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పినా అది వాళ్ల పార్టీ నేతలను కాపాడుకోవడానికే తప్పా ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మాత్రం కాదు. మీడియాలో వస్తున్నట్టు అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టి ఆ ప్రక్రియ ప్రారంభించినప్పుడే దానికి విలువ ఉంటుంది. తెలంగాణఫై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న సాచివేత ధోరణిని నిరసిస్తూ పార్టీని వీడుతున్న నేతలను చూసి హస్తిన పెద్దలే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్ర మీడియా కూడా వలసలను కట్టడి చేసేందుకు పూటకో కథనాన్ని ప్రసారం చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలోపై హస్తినలో ఏదో జరుగుతున్నదనే హడావుడి.

Labels: , , , ,

ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసి దశాబ్ద కాలం పూర్తయింది. అప్పుడు ఓట్లు పడ్డాయి. రెండు రాష్ట్రాలు మాత్రం ఏర్పడలేదు. మూడు కొత్త రాష్టాలు ఏర్పాటు చేసిన ఆ పార్టీకి తెలంగాణ ఇచ్చే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ అంటున్నది. జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని రెండు ప్రాంతాల్లో ఉద్యమాలు చేయవచ్చు. కానీ ఆంధ్రలో అడుగుపెట్టదు. అక్కడి ప్రజాస్వామిక వాదులతో కలిసి ఉద్యమం చేయదు. ఇక్కడ మాత్రం ఉప ప్రాంతీయ పార్టీతో తెలంగాణ సాధ్యం కాదంటున్నది. అధికారంలో ఉన్నప్పుడు హాండ్ ఇచ్చి, ప్రతిపక్షంలో ఉండి హామీలు గుప్పిస్తున్నది. తెలంగాణపై టీఆర్‌ఎస్‌కు ఉన్న కమిట్‌మెంట్ మిగతా ఏ పార్టీలకు ఉండదు. ఎందుకంటే ఆయా పార్టీలన్నీ ఆంధ్రా నాయకత్వంలో నడుస్తున్నవే. అందుకే ఆ పార్టీలకు తెలంగాణ అంశం అంత ప్రాధాన్యమైనది కాదు. ఇదే సీమాంధ్ర మీడియాకు కావలసింది. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొడితే ఆంధ్రా పార్టీలేవీ తెలంగాణ అంశం తెరమరుగవుతుందని వారి భావన. అందుకే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాటిని హైలెట్ చేయడం, అనుకూలంగా మాట్లాడితే హైడ్ చేయడం నాలుగేళ్లుగా చూస్తున్నదే.

Labels: , , , ,

Saturday 16 March 2013

‘చంద్రకిరణాల’ విశ్వాసం



రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ, వామపక్షాలు, లోక్‌సత్తా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి కొనసాగుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమస్య తెలంగాణ. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ. ఇప్పటికిప్పుడు అధికార పార్టీ పడిపోయి, ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలకు లబ్ధి చేకూరుతుందని, అందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మాన సమయంలో తటస్థంగా ఉన్నారు. ఇది బాబు వ్యూహాత్మక వైఖరి అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నట్టు ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాడి అన్నట్టు ఆయన పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాడితే మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక సమయంలో, ఇప్పుడు అసెంబ్లీలో పార్టీ వైఖరి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. ఈ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగితే సాధారణ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నది కదా, అప్పటికి టీడీపీ చారిత్రక తప్పిదాలను జనం మరిచిపోతారు అని చంద్రబాబు ఆలోచన అయి ఉంటుంది. కానీ ఆ ఎన్నికల కంటే ముందు ఇప్పుడు అధికార పార్టీ విప్‌ను ధిక్కరించిన తొమ్మిది మంది, ప్రతిపక్ష పార్టీ విప్‌ను ధిక్కరించిన ఆరుగురిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్వహించాలని చూస్తోంది. దీంతో పదిహేను శాసనసభ స్థానాల, స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల ముందున్నాయి. అలాగే ఈ పదిహేను స్థానాల ఎన్నికలు సీమాంధ్రలోనే జరగుతాయి. గతంలో జగన్ కోసం రాజీనామా చేసిన పదిహేడు స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అధికార పార్టీకి చావుతప్పి కన్నులొట్టబోయినట్టు రెండు స్థానాలను దక్కించుకున్నది. అయితే అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి స్థితి వేరు. ఎందుకంటే విప్ ధిక్కరించిన అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమయినట్టే. వారిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌ను కోరుతామని ప్రకటించాయి.

వారిపై అనర్హత వేటు పడి, ఎన్నికలు ఖాయమైతే ఇవి అధికార, ప్రతిపక్ష పార్టీలకే కాదు వైఎస్‌ఆర్‌సీపీ కూడా కీలకమే. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ పదిహేను స్థానాలను నిలబెట్టుకుంటే సీమాంధ్రలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తన పట్టును నిరూపించుకోవచ్చు. అలాగే అధికార పార్టీని కాపాడుతున్నది ప్రధాన ప్రతిపక్ష పార్టీయే అనేది అవిశ్వాస తీర్మానంతో బయటపడింది. దీనికి టీడీపీ నేతలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సంస్కృతికి తమ పార్టీ దూరం అని, అందుకే అవిశ్వాస తీర్మానం సమయంలో తటస్థంగా ఉన్నామని సమర్థించుకోవచ్చు. కానీ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం అన్నా,  సభలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉండే. కానీ దాన్ని కూడా టీడీపీ ఉపయోగించుకోలేకపోయింది. రాష్ట్రంలో విద్యుత్ సమస్య వల్ల పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు కుంటుపడ్డాయి. దాదాపు తొమ్మిది వేల చిన్నా చితకా కంపెనీలు మూతపడ్డాయి. కిరణ్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభ తలెత్తింది అనేది సుస్పష్టమే. ఎందుకంటే ఏడాది కాలంగా విద్యుత్ సమస్య ఉన్నది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను కిరణ్ సర్కార్ వెతకలేదు. ఈసంక్షోభాన్ని గట్టెక్కించలేదు కానీ సర్‌చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచింది. మరోసారి వడ్డనకు సిద్ధమవుతున్నది. కరెంటు కోతలు విధిస్తూ చార్జీలు పెంచిన ఘనత కిరణ్ సర్కార్‌దే. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కళ్లముందే కనిపిస్తున్నది. ఈ అసమర్థ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్న బాబు అవిశ్వాస తీర్మానం విషయంలో ఎందుకు తటస్థంగా ఉన్నారో వారికే తెలియాలి. పాదయాత్ర సమయంలో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. అవిశ్వాసం వల్ల కొన్ని పార్టీలకు ప్రయోజనం కలుగుతుంది అంటున్న టీడీపీ నేతల వాదన సహేతుకంగా లేదు. ఎందుకంటే టీఆర్‌ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగడుతూనే, ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించింది. జయప్రకాశ్ నారాయణ అన్నట్టు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే తెలంగాణ చరిత్ర ముందు కాంగ్రెస్ దోషిగా మిగులుతుంది. తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పామని టీడీపీ, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అని చంద్రబాబు, కిరణ్‌లు చెబుతున్నారు. ఇది వాదన ఒకే విధంగా ఉన్నది. అయితే ఈ అనిశ్చితి తొలగించాలని అధికార పార్టీకి లేఖ రాసి, అవిశ్వాస తీర్మాన సమయంలో టీఆర్‌ఎస్ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతున్నప్పుడు కనీస స్పందన కూడా లేదు. అంటే తెలంగాణపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని రుజువైంది. అలాగే టీఆర్‌ఎస్ తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ఇవ్వడాన్ని నిరసించిన మంత్రి శైలజనాథ్ వ్యాఖ్యలను తిప్పికొట్టకపోవడం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల చేతగాని తనం. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్న నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒంటికాలిపై లేచినా వీళ్లు మౌనంగా ఉన్నారు. తెలంగాణపై సభలో సీమాంధ్ర మంత్రి మాటలను తిప్పికొట్టలేని వీళ్లు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామంటే విడ్డూరంగా ఉన్నది.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరైనా, తెలంగాణపై చిత్తూరు బాబు వైఖరి ఏమిటో ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు వస్తే ఉద్యమపార్టీకి మేలు జరుగుతుందనే చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం అయ్యాడనడానికి మరో ఉదాహరణ ఆ పార్టీ విప్‌ను ఆరుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించారు. అయితే వీళ్లు డబ్బు సంచులకు అమ్ముడుపోయారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నా, బాబు నాయకత్వంపై వాళ్లకు నమ్మకం లేదని తేలిపోయింది. బాబు ప్రజలకు కాదు, కనీసం ఆ పార్టీ నేతల్లో కూడా విశ్వాసం పెంపొదించలేకపోతున్నారని గడిచిన కొంతకాలంగా ఆ పార్టీ వీడుతున్న నేతలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎంతమంది పార్టీ వీడినా నష్టం లేదంటూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బాబు, దాన్ని నివారించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితి తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎందుకంటే రేపు జనంలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తూనే, దానికి కారణమైన ప్రభుత్వాన్ని కాపాడారు అనే అపప్రద టీడీపీ మూటగట్టుకున్నది. ఇది ఆ పార్టీ ఇప్పుడు చేసిన నష్టం కంటే భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుంది. ఇక అధికార పార్టీ అవిశ్వా తీర్మానంలో సాంకేతికంగా నెగ్గినా, మైనార్టీలో పడ్డట్టే. టీడీపీ దయాదాక్షిణ్యాలపైనే కిరణ్ సర్కార్ మనుగడ ముడిపడి ఉన్నది. బాబు సహకారంతో నెగ్గిన కిరణ్‌బాబు నేను దేనికీ భయపడే వాడిని కాదు అనడం వింతగా ఉన్నది. నారా, నల్లారి వారు కలిసి నడుస్తున్న నడక అధికార పార్టీని ప్రస్తుతానికి గట్టెక్కించినా, అధికార పార్టీ ఐసీయూపై ఉన్నట్టే లెక్క!

Labels: , , , ,

Saturday 2 March 2013

సహకార ఫలితాలు-ప్రమాద సంకేతాలు

పార్టీ రహితంగా జరిగే సహకార ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఒకటి రెండు చోట్ల మినహా అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు ‘చేతి’కి చిక్కాయి. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో జరిగిన  ఉప ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత సహకార ఎన్నికలు కిరణ్ సర్కార్‌కు కొంత ఉపశమనం కలిగించాయి అనుకోవచ్చు. రాష్ట్ర జనాభాలో ఐదు శాతం ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి కాదని ఎవరికి వారు సమర్థించుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ఎన్నికలే. అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా పార్లమెంటు ఎన్నికలైనా పార్టీల బలాబలాలు మాత్రం తెలుస్తాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పుడు జరిగిన సహకార ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు పరీక్షే! సహకార ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు జరిగే అద్భుతాలు ఏవీ లేకున్నా, అధికార పార్టీ రాష్ట్రంలోని ప్రధాన సమస్య అయిన తెలంగాణపై ఇప్పుడే తేల్చకుండా మరికొంత కాలం నాన్చే అవకాశాన్ని మాత్రం కల్పించింది అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతున్నదని అటు ప్రతిపక్షం నుంచి ఇటు స్వపక్షం నుంచి వస్తున్న ఆరోపణలకు సహకార ఫలితాలు కొంత ఊరట కలిగించాయి. అలాగే హస్తినలో కిరణ్ పరపతి కూడా కొంత పెరిగిందని రాజకీయ విశ్లేషకుల వాదన.

ఇక ఈ సహకార ఎన్నికల్లో నిజామాబాద్‌లో డీసీసీబీ అధికార పార్టీ హస్తగతం కాగా, డీసీఎంఎస్ పదవి వైఎస్‌ఆర్‌సీపీ, టీఆర్‌ఎస్‌లు కలిసి చేజిక్కించుకున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఫలితాలు వెల్లడైన రెండు రోజులకే సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో డీసీఎంఎస్ పదవిని టీఆర్‌ఎస్ దక్కించుకున్నది. అలాగే వరంగల్‌లో అధికార పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి సూచించిన వ్యక్తి దొంతి మాధవరెడ్డి కాకుండా జంగా రాఘవరెడ్డి డీసీసీబీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని అంతా అనుకున్నారు. జంగాపై కేసులున్నాయనే పేరుతో దొంతి మాధవరెడ్డి వర్గీయుల ఫిర్యాదుతో కథ అడ్డం తిరిగింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డీసీసీబీ ఎన్నికల చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత అధికారి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించినా నామా, తుమ్ముల వర్గీయుల మధ్య ఆధిపత్య పోరుతో అక్కడ తెలుగు తమ్ముళ్ల అనైక్యత బహిర్గతమైంది. దీంతో అక్కడ డీసీసీబీ అధ్యక్షుని ఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కడపలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య పెద్ద హైడ్రామా నడిచింది. డీసీసీబీ ఎన్నికల సమయంలో వీరశివారెడ్డి వాహనంపై చెప్పులు విసరడంతో అక్కడ ఎన్నిక రసాభాసాగా మారింది. దీంతో అక్కడ అధ్యక్ష ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అధికార పార్టీపై ఆరోపణలు చేశారు. జిల్లాలోని మంత్రులు రామచంద్రయ్య, డీఎల్‌ల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో కడప జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వైరుధ్యాలు వీధికెక్కాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ల ఎన్నికపై రోజుకో మలుపు తిరిగి, చివరికి అధికార పార్టీకి వైఎస్‌ఆర్‌సీపీ డైరెక్టర్లు మద్దతు ఇచ్చినా అక్కడ రెండు పదవులు టీడీపీ వశమయ్యాయి. రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు క్రిష్ణారెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడడం అధికార పార్టీ నేతలకు రుచించడం లేదు. ఎలాగైనా అక్కడ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను లొంగదీసుకుని డీసీసీబీ పీఠం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ కల తీరలేదు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే పార్టీ రహిత ఎన్నికలు కాస్తా .. కొత్త పొత్తులకు దారితీశాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా టీఆర్‌ఎస్+కాంగ్రెస్, కాంగ్రెస్+వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ+ టీఆర్‌ఎస్,  ఒకరికొకరు సహకార ఎన్నికల అధ్యక్ష పీఠాలను దక్కించుకోవడానికి సహకరించుకున్నాయి. సహకార ఎన్నికల్లో పార్టీల్లో పార్టీల జోక్యం ఉండకూడదు అని ఆశించిన వారికి ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా పొత్తులు, డైరెక్టర్లతో రహస్య క్యాంపులు  జరిగాయి.

ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రకటించాయి. కానీ ఈ సహకార ఎన్నికలు అందుకు విరుద్ధంగా జరిగాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శ్వాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ. ఆధిపత్యం కోసం పార్టీలు తమ వైఖరులు ఎలా మార్చుకుంటాయో వివిధ జిల్లాల్లో ఆయా పార్టీలు కలిసి డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులను దక్కించుకోవడం చూస్తే అర్థమవుతుంది. సుప్రీంకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని హైకోర్టు తీర్పుతో ఇంత కాలం వాయిదా పడిన ఎన్నికలు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ అడ్డంకులు అన్ని తొలిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. దీంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలు కాబోతున్నది. ఈ ఎన్నికలపై పార్టీల గుర్తులపై జరుగుతాయా లేదా అనే చర్చలు జరుగుతున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. త్వరలో దీనిపై ఒక స్పష్టత రానున్నది. సహకార ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా  ఇటు టీఆర్‌ఎస్, అటు వైఎస్‌ఆర్‌సీపీలు క్లీన్‌స్వీప్ చేస్తాయి అని విశ్లేషణలు, వాదనలు పటాపంచలయ్యాయి. అధికార పార్టీ ఈ ఎన్నికల్లో తన హవా కొనసాగించడం, తర్వాత స్థానంలో టీడీపీ నిలవడం ఆయా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపాయి. ఈ ఎన్నికలను తమ పార్టీ సీరియస్‌గా తీసుకోలేదని ఆయా పార్టీల నేతలు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోప మాత్రం కలవర పడుతున్నారు. మేల్కోకపోతే మునిగిపోతామనే భయం ఈ రెండు పార్టీల నేతల్లో నెలకొన్నది. సహకార ఎన్నికల ఫలితాలను తెలంగాణ వ్యతిరేకులు తమకు అనుకూలంగా మలుచుకున్నారనేది స్పష్టమే. ఆ ఎన్నికలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యమకారులు వాదించినా, దీనిపై సమీక్షించుకోవాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమైతే పరిస్థితి ఏమిటి అన్న బెంగ ఇటు టీఆర్‌ఎస్‌లోనూ అటు వైఎస్‌ఆర్‌సీపీలోను ఉన్నది. ఎందుకంటే జగన్ జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతారో చెప్పలేని స్థితి. దీంతో ఆ పార్టీ మనుగడపై అనేక సందేహాలు వస్తున్నాయి. కార్యకర్తలో ఉత్సాహం నింపేందుకు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నా.. జగన్‌లేని లోటు ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక టీఆర్‌ఎస్ మొన్న ఉప ఎన్నికల్లో, అలాగే సింగరేణి, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటినా సహకార ఎన్నికల్లో మాత్రం డీలా పడిపోయింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే సహకార ఎన్నికల ఫలితాల్లో నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేదని వాదనలు వినపడుతున్నాయి. ఎంత శాతం మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా లేకపోతే ఏం జరుగుతుందో ఈ ఎన్నికలు రుజువు చేశాయి. వైఎస్‌ఆర్‌సీపీని కూడా ఇదే సమస్య వెంటాడుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద నేతలు బయటికి వచ్చినా ద్వితీయ శ్రేణి నేతలు ఇంకా ఆ పార్టీలను పట్టుకునే ఉన్నారు. అంతేకాదు ఇప్పటికీ కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీల బలం చెక్కుచెదరలేదు అనేది వాస్తవం. అందుకే సమైక్య పార్టీలకు తెలంగాణలోనే చోటులేదని మీడియా ముందు చెప్పడం కాదు, అది వాస్తవం రూపం దాల్చలంటే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి. సహకార ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకోవాలి.

Labels: , , , ,

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెబుతున్నాయి?



తెలంగాణను యాచించి కాదు, శాసించి తెచ్చుకుందాం. వంద అసెంబ్లీ, పదిహేడు పార్లమెంటు స్థానాలు సాధిద్దాం. ఇవి తెలంగాణ రాష్ట్ర సమితి కొంత కాలంగా వినిపిస్తున్న నినాదాలు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న టీఆర్‌ఎస్ ఎన్ని‘కల’ నినాదాలు ఫలిస్తాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెబుతున్న వంద అసెంబ్లీ, పదిహేడు పార్లమెంటు స్థానాలు సాధ్యమేనా? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న సామాన్యుల మదిని తొలుస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే టీఆర్‌ఎస్ నల్గొండ టీచర్స్‌ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురుకావడమే దీనికి కారణం. ఉత్తర తెలంగాణలో జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగినా, దక్షిణ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ  ఓటమితో ఆ పార్టీ చతికిలపడింది. ఇది సగటు తెలంగాణవాదిని ఆందోళనకు గురిచేస్తున్నది.

గతంలో పాలమూరు, పరకాల ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీని కలవరపాటుకు గురిచేశాయి. ఆ ఎన్నికలను గుణపాఠంగా తీసుకుంటే ఇప్పుడు నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ, సహకార ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చి ఉండేవి కాదన్న రాజకీయ విశ్లేషకుల, తెలంగాణ ఉద్యమకారుల వాదన. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో పాతూరి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్‌లు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్నారు. స్వామిగౌడ్‌కు తొలి ప్రాధాన్యంలోనే 4,470 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్‌గా స్వామిగౌడ్ పనిచేయం ఆయనకు కలిసి వచ్చింది. ఇక పీఆర్‌టీయూ అభ్యర్థి మోహన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఐదువేలకు పైగా మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ అభ్యర్థులే పోటీ చేస్తున్నప్పటికీ గెలిచిన అభ్యర్థులు నిజమైన తెలంగాణవాదులకే ప్రజలు పట్టం కట్టారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో టీఆర్‌ఎస్ నుంచి వరదారెడ్డి, పీఆర్‌టీయూ నుంచి పూల రవీందర్, యూటీఎఫ్ నుంచి నారాయణ ఉన్నారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ వరదారెడ్డి, పూల రవీందర్‌ల మధ్యే ఉంటుందని అంతా భావించారు. అయితే ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ మాత్రం చివరి వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. నాలుగో రౌండ్ ఎలిమినేషన్‌లో పూల రవీందర్ 2,57 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పూల రవీందర్ తెలంగాణ ఉపాధ్యాయ ఐకాస ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయులు సంపూర్ణంగా పాల్గొనడంలో రవీందర్ కృషి చేశారని, సమ్మె సమయంలో వరదారెడ్డి సహకరించకపోగా పోలీసులను పెట్టి తన విద్యా సంస్థలను నడిపారని విమర్శలు వచ్చాయి. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడం పొరపాటని తెలంగాణవాదుల ఆరోపణ. ఫలితం అనంతరం  పార్టీలో కొంతమంది ఒత్తిడి వల్లే వరదారెడ్డికి టికెట్ ఇచ్చామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇవి ఉద్యమానికి విఘాతం కలిగిస్తున్నాయి. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి, త్యాగధనులకు పట్టం కట్టిన, కడుతున్న చరిత్ర మన కళ్లముందు కనబడుతున్నది. ఇప్పటికే పాలమూరు ఫలితం, పరకాలలో చావుతప్పి కన్నులొట్టబోయిన ఉదంతాలు ఉన్నాయి. ఆ ఎన్నికల ఫలితాలు  క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ బలహీనతలను తెలియజేశాయి. అయినా పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోలేదనే వాదనలున్నాయి. సూర్యపేటలో పెద్ద బహిరంగ సభ తర్వాత స్తబ్ధుగానే తయారైంది. టీఆర్‌ఎస్ పల్లె బాట కార్యక్రమం కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటికీ ఉద్యమ పార్టీ తన బలాన్ని పెంచుకోలేకపోయింది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉపాధ్యా సంఘాలు విభజనను తెచ్చాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల చెబుతున్నారు. తెలంగాణ కోసం సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, తెలంగాణ మార్చ్ ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. అందుకే సకల జనుల సమ్మె మైలురాయిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సమైక్య సంఘాలకు స్థానం లేదని ఆర్టీసీ, సింగరేణి ఎన్నికల్లో రుజువైంది. అలాగే తెలంగాణలో ఉద్యమ కారులు, ఉద్యమ ద్రోహులు ఎవరో స్పష్టమైంది. ఆ సోయి తెలంగాణ ప్రజలకు వచ్చింది. కానీ పార్టీలకే ఇంకా కనువిప్పు కలగనట్టున్నది. ఏకపక్ష నిర్ణయాలు టీఆర్‌ఎస్ పార్టీకే ఉద్యమానికి ముప్పును తెస్తాయి. ఎందుకంటే ఆంధ్రాలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు బలపరిచిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయినా సీమాంధ్ర మీడియా దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ వరదారెడ్డి ఓటమిని తెలంగాణవాదానికి ముడిపెట్టి చర్చల మీద చర్చలు పెట్టింది. అలాంటి అవకాశం మనం సీమాంధ్ర నేతలకు, మీడియాకు ఎందుకు ఇవ్వాలి అనేది సగటు తెలంగాణవాది ప్రశ్న.

పొరపాటు, గ్రహపాటు, అలవాటు వీటిలో మనం ఇప్పటికే పొరపాట్లు చేశాం. తిరిగి ఆ తప్పులను దిద్దుకోకుంటా మళ్లీ అవే పునరావృతం చేశాం. ఇక ఆ పొరపాట్లే అలవాటుగా మారితే కష్టమే. నిజమే ఆ పార్టీ చెబుతున్నట్టు ఉద్యమం కావాలి, ఓట్లు సీట్లు కావాలి. కానీ అవి ఉద్యమానికి ఊపిరి పోయాలి. లక్ష్య సాధనకు ఉపయోగపడాలి. అంతేకానీ అవరోధం కాకూడదు. ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలి. ఉద్యమ నేతల్లో ఉన్న అభిప్రాయభేదాలను, ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి మన ఐక్యతను దెబ్బతీసేందుకు సీమాంధ్ర శక్తులు కాచుకుని కూర్చున్నాయి. దాన్ని అధిగమించకపోతే మునగడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధమని ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక సంఘాలు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాయి. గతంలో మాదిరిగా సమ్మె సక్సెస్ కావాలంటే అంతా ఒకే గొడుగు కిందికి రావాలి. లేకపోతే ఒకవేళ మళ్లీ సమ్మె అంటే తెలంగాణలోని అన్ని సంఘాలు కలిసిరాకపోవచ్చు. తెలంగాణ కోసం గల్లీకో జేఏసీ ఏర్పడి తమవంతు ప్రయత్నాలు చేస్తున్న సందర్భమిది. ఈ సమయంలో మన అనైక్యత శత్రువుకు ఆయుధం కాకూడదు. తెలంగాణ కోసం ఆర్‌ఎస్‌ఎస్ నుంచి మావోయిస్టుల దాకా ఎవరినైనా కలుపుకుని పోతాం అన్న మాటలను ఆచరణలో చూపాలి. కనుక ఈ మూడేళ్ల ఉద్యమాన్ని మరోసారి సమీక్షించుకోవాలి. ఎక్కడ లోపాలున్నాయో వాటిని గుర్తించాలి. అవి పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తూనే తెలంగాణ ప్రాంతలోని సమస్యలపై పోరాడాలి. ఉద్యమంలోకి అన్ని శక్తులను తీసుకుని రావాలి. మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా అది మొదటికే మోసం తెస్తుంది. బడితె ఉన్నవాడిదే బర్రె అన్నట్టు ఉండవల్లి రాజమండ్రి సభలో చెప్పిండు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారు. అవి అవాస్తవాలు అయినా, ఈ ఎన్నికల ఫలితాలను తెలంగాణ అంశాన్ని తేల్చకుండా కొంతకాలం వాయిదా వేయడానికి తెలంగాణ వ్యతిరేకులకు పనిచేస్తాయి. అంతేకాదు కీలక సమయంలో టీఆర్‌ఎస్ కొంతమంది ఒత్తిడి మేరకు టికెట్లు ఇవ్వకుండా తెలంగాణకోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి ప్రోత్సాహం అందించాలి. అది ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు దోహదపడుతుంది.

Labels: , , , , ,

Sunday 24 February 2013

బాంబు పేలుళ్లు, బాధితులు, బాధ్యతారాహిత్యం



నేషనల్ కౌంటర్ టెర్రరిసమ్ సెంటర్
ఇంకా పురుడు పోసుకోనే లేదు
‘నాట్‌గ్రిడ్’ ఇంకా మాటలే నేర్చుకోలేదు
‘ఆక్టోపస్’ గురక పెట్టి నిద్రపోతున్నది
‘రా’ గాలిలోనే సంచరిస్తున్నది
‘ఐబీ’ పరిస్థితి దానికే తెలియదు
అందుకే స్లీపర్‌సెల్స్
నిద్రపోవడం మానేశారు...
 పేస్ బుక్ లో ఓ మిత్రుడు పోస్ట్ ఇది. దిల్ సుఖ్ నగర్ లో జంట పేలుళ్ళ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతగాని తనాన్ని, సామాన్య జనాల  ఆవేదనను ఆ మిత్రుడు నలుగు ముక్కల్లో చెప్పాడు. నిజమే. ఎందుకంటే  అఫ్జల్ గురు ఉరిశిక్ష  అమలు తరువాత  దేశంలో ఉగ్రవాద దాడులు జరగచ్చు అని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్ర హోం అన్నిరాష్ట్రాలకు ఆ సమాచారాన్ని అందించింది. అయినా  రాష్ట్ర ప్రభుత్వం పేలుళ్ళ తరువాత ఇంటలిజెన్స్ సమాచారంపై ఇచ్చిన సమాధానం సర్కారు అలసత్వాన్ని చూపెట్టింది. చేతులు కాలాక ఆకులు  పట్టుకున్నట్టు.. ప్రభుత్వం హడావుడి చేసింది తప్ప ఈ ఘటనకు బాధ్యులు ఎవరో ఇప్పటికి కనిపెట్టలేక పోయింది. ఉగ్రవాద దాడుల తరువాత సహజంగానే అది మా పనే అని ఏదో ఒక సంస్థ ప్రకటించుకుంటుంది. కానీ అలాంటి ప్రకటన ఏది వెలువడలేదు. ఇండియన్ ముజాయుద్దిన్ ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ముందే హైదరాబాద్ లో పలుచోట్ల రెక్కీ నిర్వహించినట్టు పొలీస్ విచారణలో తేలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను,  లగడపాటి, టీజీ లాంటి వాళ్ళు కప్పిపెట్టి, దాన్ని తెలంగాణ వాదానికి ముడి పెట్టడం సిగ్గుచేటు

తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ముష్కరుల అడ్డగా మారుతుంది అన్న చిన్న నీటి పారుదల శాఖా మంత్రి టీజీ వెంకటేష్ చిన్న మెదడు చితికినట్టు ఉన్నది. సమైక్య రాష్ట్రంలోనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంది తెగ బాధ పడిపోతున్న మంత్రి ఈ ఘటనలకు బాధ్యత ఎవరది? ఉమ్మడి రాష్ట్రంలోనే మక్కా మసీద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇప్పుడు తాజా ఘటనలన్నీ జరిగిన విషయం మరిచి పోయారా? అఫ్జల్ గురు ఉరిశిక్ష తరువాత దాడులు జరగవచ్చు అని కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను తేలికగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నీలాంటి వాళ్ళు  ప్రజల భద్రత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. ఉగ్రవాద సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు అది అంతర్జాతీయ సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఈ రాష్ట్రం కంటే చిన్న దేశాలు కూడా ఉగ్రవాద నిర్మూలన కోసం, ప్రజలకు భద్రత కల్పించడానికి చిత్తశుద్ధి తో పనిచేస్తున్నాయి. అంతే కాదు వాళ్ళ నిఘా వ్యవస్థలను పటిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. కాని ఈ రాష్ట్రంలో మన పోలీసులు నిఘా వ్యవస్థలను ప్రజా ఉద్యమాలను, ఉద్యమకారులను అణచివేయడం పై పెడుతున్నారే కాని ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టలేక పోతున్నారు, సమైక్య రాష్ట్రంలో రాజధాని భాగ్యనగరంలో ప్రజల భద్రత ఎలా ఉన్నదో ఇప్పటకే అనేక సంఘటనలు రుజువు చేశాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చిన్న రాష్ట్రాలతో ముడిపెట్టే నీలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉండడం తెలంగాణ ప్రజలకే కాదు రాయలసీమ ప్రజల దౌర్భాగ్యం. రాగద్వేషాలతో రాజధానిలో అశాంతి పెరగలేదు లగడపాటీ ...  మీ అవకాశవాద  రాజకీయాలతోనే ప్రజలకు ఈ దుస్థితి. చిన్న రాష్ట్రాలతో మత  కలహాలు, అశాంతి నెలకొంటుంది అని శ్రీ కుట్ర కమిటీ నివేదిక సూత్రధారులు ఎవరో ఆ కమిటీ  రహస్య నివేదికతో బయటపడింది. కాలం చెల్లిన కమిటీ నివేదికల గురించి కాదు అబద్ధాల ఆక్టోపస్ కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పు. మీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి బలైన వాళ్ళ కుటుంబాలకు, తీవ్రంగా గాయపడి కాళ్ళు, చేతులు కోల్పోయి  ఆస్పత్రుల్లో అవస్థలు పడుతున్న వాళ్ళను అడుగు నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు కు జవాబు దొరుకుతుంది. ఈ క్లిష్ట సమయంలో అంత  రాజకీయాలు అతీతంగా బాధితుల పక్షాన ఉంటే, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న టీజీ, లగడపాటిల వ్యాఖ్యలు సిగ్గుచేటు.  ఉగ్రవాద  సమస్యకు మూలాలు వెతకకుండా బోడి గుండికి మోకాలుకు ముడిపెట్టినట్టు తెలంగాణ  అంశాన్ని వాడుకుంటున్న మీ మానసిక స్థితి సరిగా లేదు అనడానికి మీ మాటలే ఇందుకు ఉదాహరణ.

Labels: , , ,

Tuesday 5 February 2013

'ప్రాదేశిక మండలి' ప్రచారమే!



తెలంగాణకు బోడోలాండ్ తరహా ప్రాదేశిక మండలి ని ఏర్పాటు చేస్తారనే వార్తలు ఆంగ్ల మీడియాలో కొంత కాలంగా పుంఖానుపుంకాలుగా వస్తున్నాయి. అయితే తెలంగాణకు ప్రాదేశిక మండలి ఏర్పాటు చేయాలనుకుంటే ఆ బిల్లు పాస్ కావడానికి  పార్లమెంటులో 2/3 మెజారిటీ కావాలి.  ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వానికి అంత బలం లేదు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఒప్పుకుంటే తప్ప ఆ బిల్లు ఆచరణలో ఆమోదం పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కావాలనే కొన్ని వర్గాలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే  పార్లమెంటులో సాధారణ మెజారిటీ  సరిపోతుంది. తెలంగాణ సమస్య పరిష్కారానికి సులువైన మార్గాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ సంక్లిష్టమైన ముళ్ళ బటను ఎంచుకుంటుందని అనుకోలేము. తెలంగాణకు ప్రత్యామ్నాయం ప్రత్యేక రాష్ట్రం మినహా .. ప్యాకేజీలు, ప్రాదేశిక మండళ్ళు పరిష్కారం కావు. ఎందుకంటే ఈ ప్రయోగాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం సమయంలోనే ఒప్పందాలతో ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలన్నీ ఉల్లంఘించబడ్డాయి. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రానికి ఈ ప్రాంత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినా తెలంగాణ అభివృద్ధి చెందదు అనేది చరిత్ర రుజువు చేస్తున్నది. కనుక ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నాయం తమకు ఆమోదయోగ్యం కాదని  ఈ ప్రాంత ప్రజానీకం నినదిస్తున్నది. అందుకే ఆంగ్ల పత్రికల్లో వస్తున్న కథనాలు చూసి కలత చెందాల్సిన పని లేదు. ఇంగ్లిష్ మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని ఆంధ్రా మీడియా వాటి సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండానే... తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రాదేశిక మండలి ఏర్పాటుకు తనకు అభ్యంతరం లేదు అని అధిష్ఠాన పెద్దలకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణపై కిరణ్ అభిప్రాయం అదే అయితే దీనికి సంజాయిషీ ఇవ్వాల్సింది ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందని వీళ్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని బీరాలు పలికారు మన నేతలు.
 ఇక సహకారా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను  కాంగ్రెస్ పార్టీ బలుపును చూసి వాపు అనుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీలకు సంబంధంలేని అన్నికల్లో మూడు శాతం  మంది ఓటర్లు ఇచ్చే తీర్పును ఆధారంగా చేసుకుని ఆంధ్రా ఆక్టోపస్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి అని జోస్యం చెబుతున్నాడు. రాజగోపాల్ ఎంత అల్ప సంతోషి అనేదానికి సహకార ఎన్నిక ఫలితాల తరువాత అతని మాటలను బట్టి తెలుస్తున్నది. మొన్న రాష్ట్రంలో జరిగిన ఒక పార్లమెంటు, 1 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అంటే స్వీకరించలేదు. సింగరేణి, ఆర్టీసి, జీహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా స్వీకరిస్తారా అంటే సమాధానం లేదు. కానీ సహకార ఎన్నికలను చూసి సంబరపడిపోతున్నాడు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో కిరణ్ కుమార్‌రెడ్డికి తన పాలనా పనితీరును, బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నదని చెప్పుకోవడానికి,  లగడపాటి రాజగోపాల్  వంటి వాళ్లు మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టి అదే సమైక్యవాదం వాళ్లకు వాళ్లు సంతృప్తి చెందడానికి సహకార ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయి. అందుకే సహకార ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదు. అలాగే తెలంగాణపై ప్రాదేశిక మండలి అనే వార్తలు కూడా ప్రచారానికే తప్ప పరిష్కార మార్గం కాదు.

Labels: , , ,

Thursday 31 January 2013

లేఖల లగడపాటి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు అని నిన్న పీసీ చాకో ప్రకటించారు. దీనిపై చరిత్ర తెలుసుకో అని లగడపాటి రాజగోపాల్ ఒంటికాలిమీద లేచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి చాకో కు లేఖ రాయడం హాస్యాస్పదం. రాజగోపాల్ మీలాగా పార్టీ వేదికల మీద పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ సొంత అభిప్రాయం చెప్పరు. అయినా నిన్ననే ఈ నేల ఎన్నటికి విడిపోదు, ఉండలేని వాళ్ళు దిక్కున్న చోటికి పొండి అహంకారంగా మాట్లాడిన నువ్వు చాకో మాటలకే ఎందుకు ఉలిక్కి పడుతున్నావ్? రాజగోపాల్ రంకెలు వేసినంత మాత్రాన రాష్ట్ర విభజన ఆగదు. కాంగ్రెస్ ఎన్నడు తెలంగాణ ఇస్తామని చెప్పలేదని నీతో మొదలు మీ సీమాంధ్ర నేతలు చెబుతున్న అసత్యాలకు సమాధానం మీ యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి ఎన్సీపీ అధినేత తెలంగాణ పై చేసిన ప్రకటన చదవండి. తెలంగాణ పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రధాని కోరానని మీడియా ముందు వెల్లడించాడు. పార్టీ అభిప్రాయం చెప్పిన చాకో మీద చిందులు వేయడం కాదు రాజగోపాల్ చేతనైతే మీ అధినేత్రి తో చెప్పించండి తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం అని. అంతే గాని తెలంగాణకు సానుకూలంగా స్పందించిన అందరికి లేఖలు రాసుకుంటూ పొతే ..నువ్వు అలిసిపోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోలేవు.

Labels: , ,

Wednesday 30 January 2013

రాజీ'నామాల డ్రామాలు





తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరగాల్సి ఉన్నది దీనికి కాలపరిమితి లేదని ఆజాద్ షిండే ల ప్రకటనల్లో స్పష్టత, సంతృప్తి మొన్న జానారెడ్డికి కనిపించాయి. కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం కాదన్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాటలు మధు యాష్కీకి రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా కనిపించాయి. అఖిలపక్ష సమావేశం తరువాత తెలంగాణపై కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ లోనే యుద్ధం జరుగుతున్నది. సమస్యను పరిష్కరించాల్సిన పార్టీలోనే ఈ అంశంపై సిగపట్లు మొదలయ్యాయి. దీనికి ఆజ్యం పోసింది ఆజాద్. అక్కడ (సీమాంధ్రలో) ఉద్యమం లేదని వయలార్, ఆజాద్ లు సీమాంధ్ర నేతలతో అన్నట్టు ఆ ప్రాంత నేతలే మీడియా ముందు చెప్పారు. అందుకే కేవీపీ ఆ ప్రాంత నేతలను ఒక్క తాటిపైకి తెచ్చి కేంద్రంపై ఒత్తిడి చేసి షిండే పెట్టిన గడువులోగా తెలంగాణ పై నిర్ణయం రాకుండా అడ్డుకున్నారని తెలంగాణ  కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ జనవరి 28న తెలంగాణపై  ఆజాద్ మాటల మంటలు, షిండే మరింత సమయం ప్రకటన ఈ ప్రాంత ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్నకోపం నిరసన రూపంలో సమరదీక్ష సభలో నేతల మాటల్లో వ్యక్తమయ్యింది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై అవలంబిస్తున్న సాచివేతకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ, నెహ్రు కుటుంబాల కు విధేయులు గా ఒక్కటై ఉద్యమ నాయకత్వంపై ఒంటి కాలుమీద లేస్తున్నారు. రాజమండ్రి సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో ఈ ప్రాంత నేతలు భాగస్వాములు అయ్యారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి గాంధీ, నెహ్రు కుటుంబాలపై వచ్చిన విమర్శల సాకు తో ఉద్యమాన్ని, ఉద్యమ నాయకత్వాన్ని నిర్మూలించే కిరణ్ కుట్రలకు ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు బాసటగా నిలుస్తున్నారు. ఇంతకాలం తెలంగాణ కు ఎవరు అడ్డుపడుతున్న వాళ్ళ గురించి ఈ ప్రాంత ప్రజలకు చెప్పి, ఇప్పడు వాళ్ళతోనే చేతులు కలిపి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే టీఅర్ఎస్ విలీన అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ  ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు, టీఅర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే రేపే తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తాము అన్నట్టు మధు యాష్కీ, వీహెచ్ లు బీరాలు పలుకుతున్నారు. ఒక పత్రిక కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ మరింత మసాలా జోడించి ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ ఇస్తే తమ పార్టీని బేషరతుగా విలీనం చేస్తాము అని టీఅర్ఎస్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. కెసిఅర్ తో హస్తినలో కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రతిపాదన చేశారని, అందుకు తము అంగీకరించినట్టు కూడా కరీంనగర్ లో చెప్పారు. అయినా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదికి ఎందుకు తెస్తున్నది? విభజించు పాలించు సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందుకే  తెలంగాణ ఉద్యమం, ఉద్యమ నాయకత్వంపై రాజమండ్రి సభ నుంచి మొదలైన కాంగ్రెస్ మార్కు  విష ప్రచారానికి కొనసాగింపుగానే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ పై  కారణాలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సమరదీక్ష సభను సాకును చూపి ఈ ప్రాంత ఆ పార్టీ నాయకుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేసి, కొంత వరకు సఫలమయ్యింది. అందుకే ఆజాద్ వ్యాఖ్యల ఆగ్రహం కొంత మంది ఎంపీలను రాజీనామాల వైపు నడిపిస్తే, చాకో మాటల సాకు మధు యాష్కీని అధిష్టానం తో 'రాజీ' చేయిస్తున్నది. చూశారా మన ప్రాంత కాంగ్రెస్ నేతల సంతృప్తి నాటకం వాళ్ళ అధిష్టానానికి ఊరట.. మన బిడ్డల ఊపిరి ఆగిపోవడానికి కారణం అవుతున్నాయి. తెలంగాణ  కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు
రాజీనామాలు చేయకపోయినా  పరవాలేదు కానీ మీ 'రాజీ' నామాల డ్రామాలు ఆపితే మంచిది.      

Labels: , , ,

Tuesday 29 January 2013

ఆడలేక మద్దెలు ఓడు



ముఖ్యమంత్రి గారు టి అర్ ఎస్ పార్టీని ఉప ప్రాంతీయ పార్టీ అన్నారు. 2009లో మీకు వచ్చింది పది సీట్లే అని ఎద్దేవా చేశారు. నిజమే. మరి 2004లో మీరు రాష్ట్రంలో ఏ జాతీయ పార్టీతో కలిసి పోటీ  చేశారు? 2009 డిసెంబర్ తరువాత ఈ ప్రాంతంలోజరిగిన ఉప ఎన్నికల్లో  ఈ పార్టీ (అదే జాతీయ పార్టీ) ఎన్ని సీట్లు గెలిచింది? అంతెందుకు జగన్ మీ పార్టీని వీడిన తరువాత మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీ పార్టీ ఏమి చేసిందో గుర్తు లేదా? ఇప్పటికే మీ పార్టీలోని సీమాంధ్ర  ప్రాంతానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. వాటిని ఆమోదిస్తే మీ సామర్థ్యం, మీ మంత్రుల సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది. రెండు దశాబ్దాల కిందటే ఈ దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైంది.నాటినుంచి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో అధికారం చెలాయించే మీకు ప్రాణవాయువు అందిస్తున్నాయి.  నెహ్రు కుటుంబ త్యాగాలను కొనియాడిన మీకు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం వెయ్యి మంది ప్రాణ త్యాగాలు చేశారు. వాటిని గుర్తించడానికి నిరాకరిస్తున్నది మీ జాతీయ పార్టీ. వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రస్టు పట్టించిన చరిత్ర మీ పార్టీకి ఉన్నది. సమస్య పరిష్కారానికి సమయం కోరడం తప్పా? ప్రశ్నిస్తున్నారు. తప్పులేదు కానీ సంప్రదింపుల పేరుతో సాగదీయడమే తప్పు. అధికారం ఉంది కదా అని ప్రజల ప్రజాస్వామిక హక్కులను  కాలరాయడం తప్పు. తమరు ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ  ఉద్యమకారులపై దమనకాండను ప్రయోగించినా, టియర్ గ్యాస్ ప్రయోగించి ప్రాణాలు తీసినా.. ఈ ప్రాంత ప్రజల పక్షాన కాకుండా.. పార్టీ విధేయులు గానే ఉన్నారు మీ (మా) మంత్రులు. తెలంగాణ పై సీమాంధ్ర లోని గల్లీ  నేతల నుంచి ఢిల్లీ లోని మీ పెద్దల వరకు అడ్డదిడ్డంగా మాట్లాడినా అడ్డుకోలేని అసహాయులు ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు.అయినా ఎక్కడా సహనం కోల్పోలేదు ఈ ప్రాంత ప్రజానీకం. కానీ తెలంగాణ ను అడ్డుకోవడానికి మీతో మొదలు, మీ పీసీసీ అధ్యక్షులు, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కరేమిటి అంత ఏకతాటిపైకి వచ్చినా... ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా  ఎన్నడూ మా పక్షాన నిలబడలేదు. దాని ప్రశ్నిస్తున్నది మా ప్రజానీకం. తెలంగాణ  ఇచ్చేది, తెచ్చేది మేమే అన్నా ఈ ప్రాంత ప్రజలు నమ్మలేదు. కానీ ఉండవల్లి లాంటి వాళ్ళు సంఖ్యా బలాన్ని చూపి సవాల్ చేసిన సందర్భంలో అయిన స్పందిస్తారు అనుకున్నాం.  ఆ పని చేయలేదు. ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్న వీళ్ళు ప్రాణం పోయిన పదవీ త్యాగం చేయము అని మొన్న జానారెడ్డి మాటలతో.. నిన్న మీడియా సమావేశంలో, నేడు ముఖ్యమంత్రి మద్దతు తో ఉద్యమ నాయకత్వంపై విమర్శలు చేయించడం తో పూర్తిగా అర్థం అయ్యింది. పాపం ఇది తెలియక మధు యాష్కీ  లాంటి వాళ్ళు ఇంకా వీళ్ళు వాళ్ళతో కలిసి వస్తారని ఆశిస్తున్నారు.
ఇక ఉండవల్లి వైఎస్ చెప్పిన పాట పాటనే ఇప్పుడు పాడుతున్నాడు. తెలంగాణ రావాలనే దేశం మొత్తం ఒప్పుకోవాలట. దేశం మొత్తం అనేదానికి కాంగ్రెస్ పార్టీలో ఏమి పర్యాయ పదం ఉన్నదో తెల్వదు కానీ  ఉండవల్లి దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో ఇప్పటికే ముప్పై పైచిలుకు పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాశాయి. మరో జాతీయ పార్టీ పార్లమెంటులోనే స్పష్టంగా మద్దతు ప్రకటించిది. మీరు మొన్న రాజమండ్రి సభలో పేర్కొన్న విధంగానే 2001 నుంచి ఈ అంశంపై క్లారిటి  లేనిది ఒక్క కాంగ్రెస్ పార్టీకే. నాటి  కేంద్ర హోం మంత్రి  తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను పరిశీలించాలని మీ పార్టీ అధినేత్రి లేఖ రాసి దశాబ్దం దాటినా మీ సంప్రదింపులు, చర్చలు పూర్తీ కాలేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కాలపరిమితి లేదని ఆజాద్ చెప్పే ఉన్నాడు.ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు .. మీ పార్టీలో ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని, రాష్ట్ర విభజనపై  పక్కవాణ్ణి విమర్శిస్తే పరిష్కారం దొరుకుతుందా?

Labels: , ,

Saturday 26 January 2013

బానిస నేతల బాధ్యతారాహిత్యం



సమరదీక్షకు కిరణ్ సర్కార్ అనుమతి ఇవ్వదట. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందట. సమైక్య రాష్ట్రంలో మా బతుకులకు భద్రత లేదు బాబు..మేము విడిపోతాం అంటే లేదు మా కింద బానిసల్లా బతకాలి అంటారు బలుపెక్కిన వేషంతో రాజమండ్రి వేదిక నుంచి. అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా వెళ్లి అక్కడ సమైక్య రాగం వినిపించాను చెప్పాడు గుంటూరు గాదె. హస్తినలో తెలంగాణ పై అధిష్టానం ఏ  నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అని ప్రకటించాడు. తీరా ఆంధ్రలో అడుగుపెట్టగానే అబద్ధాలు మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదు అంటాడు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నా తెలుగు వారంతా కలిసే ఉండాలని ఆంధ్రా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. విజయవాడలో విభిన్న వేషాలు వేస్తూ.. అర్థనగ్న ప్రదర్శనలు ఇస్తూ ఇదే సమైక్యవాదం అంటాడు ఆంధ్రా ఆక్టోపస్. వీళ్ళ నటనను చూస్తూ నవ్వుకుంటుంటే...నన్ను మరిచిపోతారా? అంటూ సత్తిబాబు సమైక్య సుత్తి పట్టుకుని బయలుదేరాడు. రాజమండ్రి సభలో తెలంగాణ పై రంగులు మార్చే ఊసరవెల్లి కంటే మిన్న ఉండవల్లి అబద్ధాలు ఆలకించడానికి అతిథి అయ్యాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మీరు ఆ సభకు వెల్లడమేంటి అంటే నా ప్రజాస్వామ్య హక్కు అంటాడు. మొన్న రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే సత్తిబాబు సంకుచిత బుద్ధి బయటపడ్డది. తెలంగాణ అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అంటే సత్తిబాబు అక్కసు, అలసత్వం, ఆక్రోశం అన్ని కనిపించాయి. అప్పుడే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలకు అర్థం కావాల్సింది సమైక్య సత్తిబాబు సీమాంధ్ర బాబు అని. తెలంగాణ వాదులను తిట్టడమే సమైక్యవాదం అంటూ సభలు పెట్టుకోవడానికి అడ్డురాని శాంతిభద్రతలు...తెలంగాణ సభలకు, నిరసనలకు వర్తిస్తాయి. ఇంత నిస్సిగ్గుగా మూడేళ్ళుగా తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్న వలసపాలకుల విధానాలకు ఈ ప్రాంత బానిస నేతలు వంత పాడడమే ఇప్పటి విషాదం. మన సభలకు, సమావేశాలకు, సమరదీక్షలకు పర్మిషన్ ఇప్పించలేని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్వ రాష్ట్ర సాధన కోసం ఏ  త్యాగానికైనా సిద్ధం అంటారు.  తెలంగాణ ప్రకటనను అడ్డుకోవడాని హస్తినలో ఆంధ్రా లాబీయింగ్ చూపిన ఐక్యత తరువాత.. ఆజాద్ అసంబద్ధ ప్రేలాపనల తరువాత, రాజమండ్రి సభ తరువాత...కూడా  మన (సారి.. సీమాంధ్ర నేతల తాబేదార్లు) ప్రాంత కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలుగదు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ సంఖ్యా బలాన్ని చూసి కాకుండా ...ఈ ప్రాంత నేతల బలహీనతలు చూసి, బలుపెక్కిన ఆంధ్రా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మన నేతలు మేల్కోనంత కాలం మన ఆకాంక్షను అణచివేయడానికి అన్ని శక్తులు కూడగడతాడు. అర్థ సత్యాలు, అబద్ధాలు, అంకెల గారడీ చేస్తూనే ఉంటాడు. అదే అభివృద్ధి అంటాడు. అందుకే  స్వరాష్ట్ర కల సాకారం కావాలంటే... ఆంధ్రా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం ఒక్కటే కాదు.. ఈ ప్రాంత బాధ్యతారాహిత్య నేతలను బజార్లో నిలబెట్టాల్సిన సమయము, సందర్భం ఆసన్నమైంది.


     

Labels: , ,

Friday 25 January 2013

బడిత ఉన్నవాడిదే బర్రె



మాకు (ఆంధ్రా ) సంఖ్యా బలం ఉంది కాబట్టి మేము శాశిస్తాము.... మీరు (తెలంగాణ) మా కింద పడి ఉండాలి అన్నట్టు సాగింది ఉండవల్లి రాజమండ్రి ప్రసంగం. బలవంతునిదే రాజ్యం అన్నటు ఉన్నది మీ వ్యవహారం. అందుకే బ్రిటిష్ పాలనలో మగ్గిన మీరు ఇంకా వాళ్ళ విధానాలనే అవలంబిస్తున్నారు. అందుకే మీ నల్లారి వారు ఉద్యమకారులపై నల్ల చట్టాలు ప్రయోగించాడు. మీ లగడపాటి, టీజీ వెంకటేష్ లు డయ్యర్ ల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని రజాకార్ల తో పోల్చాడు ఉండవెల్లి. మేము ఎంత శాంతికాముకులమో ఈ పండేళ్ళ ఉద్యమం చూసి దేశంలోని ప్రజాస్వామికవాదులు ప్రశంసించారు. నీ లాంటి వాళ్ళ నుంచి కండక్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీప్రాంతంలో మొన్న లక్షిం పేటలో దళితులపై మీ పీసీసీ అధ్యక్షుని సామాజిక వర్గం చేసిన పాశవిక దాడిలో మరణించి గాయపడిన వాళ్ళ గురించి అప్పుడే మరిచిపోయావా? తెలంగాణ కోసం అమరులైన వారి గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న ఉండవల్లి 369 మందిని కాల్చి చంపించింది మీ బ్రమ్హానంద రెడ్డి కాదా? ఉస్మానియా యూనివర్సిటీ ని మూసివేయాలి అన్న లగడపాటి ఎక్కడి వాడు? తెలంగాణ ఉద్యోగాలు దోపిడీకి గురయ్యాయి అని మీ ఎన్టీ అర్ వేసిన కమిషన్ తేల్చింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి 610 జీవోను తెచ్చింది ఆయనే. ఆ జీవో వచ్చి మొన్నటికి 27 ఏళ్ళు పూర్తీ అయినా ఎందుకు అమలు కాలేదు? దీనిపై ఎప్పుడైనా మాట్లాడవా ఊసరవెల్లి. అంతెందుకు రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లోని 234 మండలాలను కరువు ప్రాంత మండలాలుగా ప్రకటించింది. కరువు మండలాల ప్రకటనలోను తెలంగాణపై సీమాంధ్ర సర్కారు వివక్ష చూపింది. తెలంగాణలోని రెండు జిల్లాల్లో పాలమూరులో ఐదు మండలాలు, నల్లగొండలో 11 మండలాలు కలిపి 16 మండలాల్లో మాత్రమే కరువుందని తేల్చింది. 218 మండలాల్లో సీమాంధ్రలో కరువుందని, అందులో ముఖ్యమంత్రి జిల్లా చిత్తూరులో, రెవెన్యూమంత్రి రఘువీరాడ్డి జిల్లా అనంతపురంలో ఎక్కువ కరువుందని సీమాంధ్ర సర్కారు తేల్చింది.ఈ వివక్షపై మాట్లాడలేదు ఆంధ్రా అరుణ్ కుమార్. పెట్టుబడి పెట్టి , పంట చేతికి వచ్చే సమయంలో కరెంటు లేక తెలంగాణ ప్రాంత రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతుంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమరు మాత్రం సర్కార్ తీరును తప్పుపట్టలేదు. కానీ మీ ప్రాంతంలో పంట వేయకుండానే క్రాప్ హాలిడే ప్రకటిస్తే అదేదో జాతీయ విపత్తు అన్నటు తెగ హడావుడి చేసి ఒక కమిటీ వేసి, యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించారు ఇది కాదా వివక్ష? హక్కు లేకున్నా నిబంధనలను కాలరాసి మొన్నటికి మొన్న డెల్టాకు ప్రాంతానికి నీళ్ళు తరలించుకు పోయారు. ఆర్‌డీఎస్ రాజోలిబండ, తూములు కర్నూలు రైతులు బైరెడ్డి నాయకత్వాన షట్టర్లు పగలగొట్టి నీటిని పాలమూరు వైపునకు రాకుండా సుంకేశులకు మళ్ళించుకోలేదా?అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు అభివృద్ధి పై కాకి లెక్కలు చెప్పి అదే అభివృద్ధి అంటే నమ్మేవాళ్ళు ఎవరు? తమకు సంఖ్యా బలం ఉంది కాబట్టి మేము ఏమి చేసిన చెల్లు బాటు అవుతుంది అనే అహంకారం ఉండవల్లి రాజమండ్రిలో ఆవేశంగా ప్రసంగించారు. అసత్యాలతో అభివృద్ధిపై పూటకో మాట మాట్లాడుతున్నది మీరు. మీరు చెబుతున్న అభివృద్ధి సబబే అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలు ఇస్తే తమకు సమ్మతమే అని మీరు ఎందుకు చెబుతున్నారు. అంటే తెలంగాణ ప్రాంతం వెనుకబడింది మీ మాటలే తేటతెల్లం చేస్తున్నాయి. అలాగే 2014 ఎన్నికల వరకే తెలంగాణ వాదం ఉంటుంది అన్న ఉండవల్లి.. మూడేళ్ళ కిందట రాజీనామాల డ్రామాలు ఆడి తెలంగాణ ప్రక్రియను అడ్డుకున్న మీ పెట్టుబడి సమైక్య ఉద్యమం ఏమైందో ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్రమశిక్షణ అనే పదం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ముఖ్యంగా ఆంధ్రా నేతలకు అది వర్తించదు. అందుకే తమ పార్టీలోని ఒక ప్రాంత ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి సభ పెట్టుకుని దానికి జై ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకున్న దుర్బుద్ధి మీది. తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి అని కమ్యూనిస్టుల గురించి గొప్పలు చెప్పిన ఉండవెల్లీ ... మీలాంటి ఊసరవెల్లి ఆంధ్రా పాలకుల ఆధిపత్య అహంకారం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కలిసి ఉండాలి అన్న కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ రాష్ట్ర విభజనపై మార్పు వచ్చింది . అధికారం కోసం టిడిపి, బిజెపి లు రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతున్నాయని చెప్పిన సత్తిబాబూ ..... మూడేళ్ళుగా తెలంగాణపై తమరు ఎన్ని మాటలు మాట్లాడారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు పీసీసీ అధ్యక్షుడిని అని మరిచిపోయి ఒక ప్రాంత ప్రతినిధిగా రాజమండ్రి సభకు హాజరు అయినప్పుడే పక్కోడికి నీతులు చెప్పే అర్హత కోల్పోయావు. వాళ్ళు పిలిచారు వెళ్ళాను మీరు సభ పెట్టి పిలవండి మీ సభకు వస్తాను అంటున్న సత్తి బాబుకు నీతి, నియమాలు లేకపోవచ్చు.. మాకు మాత్రం ఉన్నాయి. రాజమండ్రిలో రాజకీయ ఉసరవెల్లుల ప్రసంగాలు బడిత ఉన్నవాడిదే బర్రె అన్నటు సాగాయి. అది జై ఆంధ్రప్రదేశ్ సభ కాదు.. ఆధిపత్య అహంకారులు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షపై అక్కసు వెళ్ళగక్కిన సభ.

Labels: , , , ,

ఉండవల్లి ఏందీ నీ లొల్లి



అధికార దాహంతోనే చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాడు అంటాడు మంత్రి శైలజానాథ్. మరి వీళ్ళ వాదనే కరెక్ట్ అనుకుంటే తెలంగాణను సీమాంధ్ర లోని 170 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు అని ఊసరవెల్లి ఉండవెల్లి ఎలా చెబుతారు? అంతే కాదు 175 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఉంటే  రాష్ట్ర విభజన తీర్మానం ఎలా సాధ్యం అవుతుంది అన్నారు ఉండవల్లి గారు. నిజమే. మరి 119 మంది తెలంగాణ  ఎమ్మెల్యేలు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో చెబితే బాగుండేది. తెలంగాణ ప్రాంత ప్రతినిధులు లేకుండా అది ఆంధ్రప్రదేశ్ ఎట్లా అవుతుంది? జై ఆంధ్రప్రదేశ్! జై జై ఆంధ్రప్రదేశ్!! అని అంటివి. ఎంతమంది ఉన్నారు మీ స్టేజిమీద తెలంగాణ ప్రాంత నేతలు? మొదట జై ఆంధ్ర ఉద్యమం ఏమైంది అని పత్రికల్లో ప్రచారం చేసి, తరువాత జై ఆంధ్రప్రదేశ్ సభగా దాన్ని మార్చి...ఒక ప్రాంత ప్రజాప్రతినిధులు లేకుండా సభ పెట్టుకొన్న ఉండవెల్లి తెలంగాణ ఉద్యమ నాయకత్వం పై విషం చిమ్మడమే సమైక్యాంధ్ర ఉద్యమం అంటాడు. మనిషి అన్న వాడు మాట మీద నిలబడాలి. అది ఆంధ్రా  నాయకుల అలవాటే లేదు. అందుకే తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఏ  నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్న నేతలు ఒక్కరైనా ఉన్నారా రాజమండ్రి సభా వేదికపై ఉన్నవాళ్ళలో? రాష్ట్ర విభజన అధికారికంగా జరగక ముందే మీకు మీరే విభజన రేఖ గీశారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ అనువాదకుడిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. రాజమండ్రి సభతో ఆయన అబద్ధాల కోరు అని, అహంకారి అని కూడా అర్థమయ్యింది. ఎందుకంటే తెలంగాణ ప్రస్తుతం  కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో లో లేదు అని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామో లేదో వచ్చే  మ్యానిఫెస్టోలో పెడతామని టీజీ వెంకటేష్ అంటాడు. మరి అరుణ్ కుమార్ ఏమో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రసంగాన్ని అనువాదకుడిగా తెలంగాణ మా  మ్యానిఫెస్టోలో ఉందని, ఈ అంశం తమకు అత్యంత ప్రధాన్యమైనదని తెలుగులో తర్జుమా చేసి వినిపించాడు.  ఇప్పుడు చెప్పు ఉండవల్లి మిమ్మల్ని అబద్ధాల కోరు అనకుండా.. ఏమనాలో? అదొక్కటేనా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి? అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని ఎందుకు అడగలేదని సోనియా గాంధీ హిందీ ప్రశ్నకు తెలుగు అనువాదం చేసింది మీరే కదా!అప్పుడు గుర్తుకు రాలేదా  సమైక్యవాదం? ఇంతకాలం అంధకారంలో ఉన్న ఈ అనువాదకుడు ఇప్పుడే మేల్కొని సమైక్య సందేశం ఇవ్వడానికి రాజమండ్రి నుంచి కొత్త సారి.. సారి.. చెత్త రాగాలు మొదలుపెట్టాడు. పోలవరం వాళ్ళ గిరిజనులు నష్టపోతారు. అభివృద్ధి కావాలంటే కష్టాలు తప్పవు అనేది ఉండవల్లి గారి ఉద్భోద. గిరిజనం అంటే పట్టని మీకు సమైక్యత కోరుకునే హక్కు ఉందా?  తెలంగాణపై అరుణ్ కుమార్ అక్కసు... ఆజాద్ అసంబద్ధ వ్యాఖ్యలు అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం తోనే జరుగుతున్నాయి. అందుకే సత్తిబాబు రాష్ట్ర పీసీ సీ అధ్యక్షుడిని అని మరిచిపోయి రాజమండ్రిలో సమైక్య సన్నాయి లు నొక్కాడు. ఉండవెల్లి మంచికో చెడుకో రాజమండ్రి సభ ద్వారా తెలంగాణ  ప్రజలకు ఒక సత్యాన్ని చెప్పాడు. సభ ఆద్యంతం తెలంగాణ ఉద్యమ  నాయకత్వాన్నే టార్గెట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత నేతలు ఎంత బానిసలో కూడా తెలియజేశారు. అందుకే ఉండవల్లి తెలంగాణ  ఉద్యమ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ కాలంగా శాంతియుతంగా  కొనసాగుతున్నది. తమరు ప్రదర్శించిన వీడియో లలో కొత్త విషయాలు  ఏమీ లేకపోయినా దింపుడు కళ్ళెం ఆశ మాత్రం కనిపించింది. ఎన్నిచేసినా సమైక్య ఉద్యమం బలపడం లేదనే ఆవేశం కనపడింది. అందుకే ఉద్యమ నాయకత్వాన్ని విరుచుకుపడితే కొంత గురింపు వస్తుంది అనుకున్నాడు అరుణ్ కుమార్. మద్రాస్ నుంచి ఆంద్ర రాష్ట్రం విడిపోయినప్పుదు తమరు ఎన్ని ఘన కార్యాలు చేసారో చరిత్ర చెబుతున్నది. సామరస్యంగా విడిపోయే రాష్ట్రాన్ని రాజధాని కోసం పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది. అందుకే రాష్ట్ర విభజన జరిగితే విద్వంసం సృష్టిస్తామని ఒకరు, మానవబాంబులం అవుతాం, ,మంత్రిగా ఉంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక ఫోర్స్ ను తాయారు చేస్తానన్న మాటలన్నీ తమ ప్రాంత ప్రతినిధుల నుంచే వచ్చాయి. ఎవరు ఎవర్ని రెచ్చ గొడుతున్నారో అర్థమయ్యిందా అరుణ్ కుమార్!  

Labels: , , , , ,

Thursday 24 January 2013

రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది?



 ప్రభుత్వ విప్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి  మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నిరాజీనామా చేశారు. త్వరలో ఆయన  వైసీపీలో చేరనున్నారు. ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే సజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే ఎం.రాజేశ్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ తరువాత  కిరణ్ సర్కార్ అరకొర మెజారిటీతో కొనసాగుతున్నది. అయితే ఈ ఐదుగురి రాజీనామాలు ఇంత వరకు ఆమోదం పొందలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడుతామని...జగన్ కు అండగా ఉంటామని స్పష్టంగా చెప్పినా వీళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ధైర్యం చేయలేని స్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలే బయట పడ్డారు. కానీ సీమాంధ్రలో చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో  వైసీపీ తరఫున పోటీ చేయడానికి ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. తమ వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారు. దీనికి సమైక్యవాదానికి సంబంధం లేదు.   అందుకే మొన్న రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అని సీమంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షక్షుడు వయలార్ రవితో అన్నప్పుడు ఆ విషయం మాకు తెలుసు అన్నారు. ఎన్నికలు పెడతాం అన్నారు.  అంతేకాదు మీ కుమారులను, బంధువులను  వైసీపీలో పంపారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. పొతే పొండి అన్నటు వార్తలు వచ్చాయి. ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అని ఇంటెలిజెంట్స్ నివేదికలు...అన్నీ అబద్ధాలే! రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్ ఇప్పటికే చాల సార్లు విఫలయత్నం చేశాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ పీ అర్ పీని విలీనం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాత్కాలికంగా కాపాడగలిగింది. ఇక్కడ కిరణ్ సర్కార్ ఘనత గాని.. సమైక్య నేతల సామర్త్యం గాని లేదు. అధికారం కోసం, అవకాశవాద రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిరణ్ వచ్చాక అవి మరింత ఎక్కువయ్యాయి. అందుకే కిరణ్ సర్కార్ పని తీరు బాగా లేదని ప్రతిపక్షాలే కాదు స్వపక్ష నేతలే పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా సీమాంధ్ర లో కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకుడు లేదు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పుడో అర్థమయ్యింది. అందుకే రెండుచోట్ల పార్టీని ఎందుకు దెబ్బ తీసుకోవాలి అనే అభిప్రాయం వాళ్ళలో ఉన్నది. అలాగే అఖిలపక్ష సమావేశంలో వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెడితే తెలంగాణ పై ఒకటి రెండు పార్టీలు మినహా వ్యతిరేకత అంతగా కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు వస్తున్నాయని సీమాంధ్ర నేతలే మీడియా ముందు హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే ఏదో జరిగిపోతుంది అని లేనిపోని అపోహలు వల్లే సృష్టిస్తున్నారు. వీళ్ళ ఒత్తిడి వల్లే ఆజాద్ నెల గడువుపై తన అక్కసును మీడియా ముందు వెళ్ళగక్కాడు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ లోనే కాదు టిడిపి, వైసీపీలోను వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, అవుతున్నా.. అవి తాత్కాలికమే. ఈ అంశంపై పార్టీల అభిప్రాయమే ఫైనల్ అని తెలంగాణ వ్యతిరేకులు తెలుసుకోవాలి.

Labels: , , , , ,

ఆజాద్ వ్యాఖ్యలే అంతిమం కాదు



తెలంగాణపై  తాజాగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆనందాలు (రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత తొలిగిపోవాలని కోరుకునే వారికి ఈ పదం వర్తించదు), ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆజాద్ మాటలతో ఇప్పుడే మన మనసులు గాయపడలేదు. ఇప్పటికి ఎన్నోసార్లు ఆయన తెలంగాణ పై అడ్డదిడ్డమైన కామెంట్లు చేశాడు. ఆజాద్ తెలంగాణ కు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడాడు కూడా. ఎందుకంటే షిండే గడువు గురించి ఈమధ్య కాలంలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయి. అవి చూస్తే ఆజాద్ ఆంతర్యం ఏమిటో? అతను ఎవరి పక్షమో తెలుసుకోవడం కష్టమేమి కాదు. ఆజాద్ ఒక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడే మాటల్లో పొంతన ఉండదు. ప్రజలతో, ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో వాళ్ళ మాటలతో  మైండ్ గేమ్ ఆడడం చూస్తూనే ఉన్నాం. అన్న హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు మొన్నటి అమానత్ అత్యాచార ఉదంతం దాకా ప్రజాగ్రహంపై కాంగ్రెస్ పెద్దల వైఖరి చూస్తే..మనకుండే భావోద్వేగాలు వాళ్ళకు ఉండవు. అంతేకాదు సమస్యల పరిష్కారంపై బాధ్యతగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కనుక ఆజాద్ వ్యాఖ్యలతోనే తెలంగాణ సమస్య సమసిపోదు, సమైక్య రాష్ట్రం  నిలబడదు. తెలంగాణ పై  షిండే విధించిన గడువు అయినా.. దానిపై కేంద్ర ప్రభుత్వం వెలువరించే నిర్ణయం వాయిదా పడినా అన్ని కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే కొనసాగుతాయి. తెలంగాణ ప్రజల తెగువ, సహనం ప్రపంచ ఉద్యమాల్లో ఎక్కడా కనిపించవు. ఎందుకంటేఆధునిక యుగంలో  ఇంత శాంతియుతంగా, ఇంత సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్యమం ఒక్క తెలంగాణ ఉద్యమమే. అందుకే మనం సీమాంధ్ర లోని సామాన్య ప్రజల, ప్రజాస్వామిక వాదుల మన్ననలను పొందగలిగాము. గుప్పెడుమంది పెట్టుబడిదారులు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తాత్కాలికంగా అడ్డుకున్నా..అదే అంతిమ నిర్ణయం కాదు. అంతేకాదు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏమిటి అనేదే! ఆ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించేది అయితే సంబురం లేకపోతే సమరమే అని మనం అనుకుంటున్నదే కదా. కనుక తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి  కాంగ్రెస్ చెబుతున్న కారణాలు ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కాలగర్భంలో కలిపివేస్తాయి.   

Labels: , , , ,

Tuesday 22 January 2013

మీ ఆందోళన మా ఆకాంక్షను తీర్చదు



తెలంగాణపై చంద్రబాబు లేఖ రాశాడనో, టీ కాంగ్రెస్ ఎంపీలు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో ఒత్తిడి వల్లనో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మూడేళ్ల కిందట తెలంగాణ ప్రకటన తర్వాత పార్టీలు తీసుకున్న యూటర్న్‌లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అన్నది మొన్నటి సమావేశంలో తేలింది. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణపై రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కానీ మొన్నటి అఖిలపక్ష సమావేశం గతంలో కంటే భిన్నమైంది. సమైక్యవాదాన్ని బలంగా కాదు కదా నామమాత్రంగానైనా ఏ పార్టీ వినిపించలేదు. (సీపీఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని, ఎంఐఎం మూడు ప్రతిపాదనలు, కాంగ్రెస్ రెండు వాదనలు, టీడీపీ గతంలో ఇచ్చిన లేఖను చూపింది) ఫైనల్‌గా అన్ని పార్టీలు ఈ సమస్యను త్వరగా తేల్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. దానికి అనుగుణంగానే షిండే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక గడువు విధించారు. ఆ సమావేశంలో వ్యక్తుల అభిప్రాయాలు ఏవైనా పార్టీల నిర్దిష్ట అభిప్రాయాన్నే ఆయన పరిగణనలోకి తీసుకుని రికార్డు చేసుకున్నారు. షిండే అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు దిగ్విజయ్‌సింగ్ అయినా వాయలార్ రవి అయినా, ఆజాద్ అయినా అదే చెబుతున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా మొన్న వాయలార్ రవిని, ఆజాద్‌లను కలిసిన సీమాంధ్ర మంత్రులకు చెప్పారు. అయినా ఇంకా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వితండవాదం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్లు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం మినహా చేయగలిగింది ఏమీ ఉండదు. అఖిలపక్ష సమావేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే రెండు వాదనలు వినిపించాయి. గాదె వెంకటరెడ్డి తాను సమైక్యవాదాన్ని వినిపించాను అని ఇది వరకే ప్రకటించారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని షిండేకు చెప్పామని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారు. అయినా ఇప్పుడు సీమాంధ్ర నేతలు హస్తిన పర్యటనలతో ఆ పార్టీ అభిప్రాయంలో మారుతుందేమో కానీ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మాత్రం మారుతుంది అనుకోవడం వారి భ్రమే అవుతుంది. తెలంగాణ అనుకూలంగా తమకు సంకేతాలు అందుతున్నాయి అంటున్న సీమాంధ్ర నేతలు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు అంతా ఈజీగా విశ్వసించలేరు. ఎందుకంటే నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరుతో అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడగలరు. అందుకే ఒకరోజు తెలంగాణపై సానుకూలంగా మరోరోజు వ్యతిరేకంగా వారి వ్యాఖ్యలు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికంతటికి కారణం ఇప్పుడు హస్తినలోహడావుడి చేస్తున్న సీమాంధ్ర నేతలే.  అయితే తెలంగాణ ప్రజలు మాత్రం హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ బిల్లు పార్లమెంటు పెట్టి, ఆ బిల్లు పాస్ అయి అది గెజిట్ రూపంలో బయటికి వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. అంతేగానీ ఇప్పుడు సీమాంధ్ర నేతలు పడుతున్న ఆందోళనలు మీడియాకు వార్తలు అవుతాయి తప్ప, తెలంగాణవాదుల ఆకాంక్షను తీర్చేవి కావు.

Labels: , , , , ,

Monday 21 January 2013

ప్రజలకులేని బాధ ప్రసారమాధ్యమాలకు ఎందుకు?



సీమాంధ్ర  మీడియా ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తలకెత్తుకున్నది. అందుకే మెరుగైన సమాజం కోసం, ప్రతిక్షణం ప్రజాహితం వంటి ట్యాగ్ లైన్లను తగిలించుకున్న చానల్లు రాష్ట్ర విభజన బాధ సీమాంధ్ర ప్రజలది కాదు మాది అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రసారమాధ్యమాలు పారదర్శకంగా ఉండాలనే పద్ధతికి తిలోదకాలు ఇచ్చాయి. తెలంగాణ పేరుతో...తెలంగాణ కోసం అన్నట్టు ప్రసారం చేసే కథనాల్లో తెలంగాణ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తున్నాయి. వాళ్ళు రాష్ట్ర విభజనపై చేసే ఏ  కార్యక్రమాన్ని చూసినా హైదరాబాద్ చుట్టే తిప్పుతాయి. నదీ  జలాల సమస్య తలెత్తుతాయి అంటాయి. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కనిపించని ఏ  సమస్య తెలంగాణ విషయంలో కనిపిస్తాయి. నదీ జలాల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయో అవే రేపు తెలంగాణ  ఆంధ్ర రాష్ట్రాల మధ్య అమలవుతాయి. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అయినా కొంత మంది సీమాంధ్ర నేతలు. కొన్ని మీడియా చానళ్ళు హైదరాబాద్ మీద తమ ఆశను.. తెలంగాణ ఉద్యమంపై తమ అక్కసును వెల్లగక్కుతున్నాయి. తమ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇది మంచి పధ్ధతి కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావలసిన మీడియా ఇలా బాధ్యతా  రాహిత్యంగా వ్యవహరించడం సరికాదు.

 

Labels: , , ,

Sunday 20 January 2013

రాజీనామాలు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేవు


గుర్నాతారెడ్డి రాజీనామా వ్యవహారంపై వైఎస్అర్ సీపీ స్పందించడం లేదు. సమైక్యవాదం కోసమే తాను రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు. రెండు రోజుల్లో స్పీకర్ ను కలిసి రాజీనామాను ఆమోదించు కుంటాను అంటున్నారు. ఇడుపులపాయ ప్లీనరిలోనే తెలంగాణ పై తమ అభిప్రాయం చెప్పామని అన్న తెలంగాణ వైఎస్అర్ సీపీ నేతలు దీనికి  జవాబు చెప్పాలి. మొన్న రాష్ట్రాన్ని విభజిస్తే విధ్వంసం సృష్టిస్తామని అన్న గుర్నాతారెడ్డివ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం వైఎస్అర్ సీపీ నేతలు ఇది కూడా ఆయన వ్యక్తిగతం అంటే కుదరదు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొదలు పెట్టిన సమైక్య డ్రామాలో ఇప్పటికే కొంతమంది టిడిపి నేతలు తమ వంతు పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు గుర్నాతారెడ్డి రాజీనామా డ్రామా అందులో భాగమే. డిసెంబర్ ప్రకటన వచ్చి మూడేళ్ళు దాటినా...తెలంగాణ సమస్య పరిష్కారం కాలేదంటే ఈ మూడు పార్టీలే కారణం. వీళ్ళ ముసుగులు మొన్న అఖిల పక్ష సమావేశానికి ముందు, తరువాత మెళ్ళ మెళ్ళగా  తొలిగిపొతున్నయి. సీమాంధ్ర నాయకత్వాల కింద నడిచే పార్టీల అభిప్రాయాలూ ఎన్నడూ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండవు. అందుకే వాళ్ళ పార్టీల్లోని ఈ ప్రాంత బానిసలను ముందు పెట్టి  వాళ్లు తమ కుట్రలు కొనసాగిస్తారు. అయితే  సీమాంధ్ర రాజీనామాలు చేస్తే వచ్చేది ఎన్నికలే. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేవు.

Labels: , , , ,

Friday 18 January 2013

ఆంధ్రా ఆక్టోపస్ పట్ల అప్రమత్తంగా ఉండాలే



ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది అని అంటున్న ఆంధ్ర ఆక్టోపస్ ఎందుకు ఆందోళన పడుతున్నాడో అర్థం కావడం లేదు. కరీంనగర్ ఉప ఎన్నిక సమయంలో రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు రెఫరెండమే అన్నారు. అప్పుడు అభివృద్ధి మంత్రం జపించిన వైఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన విషయం లగడపాటి మరిచిపోయారా? అంతెందుకు సీమాంధ్ర లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో లగడపాటి, టీజీ వెంకటేష్, ఆనం వివేకానంద తదితరులు జగన్ కు ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని పనిగట్టుకుని ప్రచారం చేశారు. అయిన అక్కడి ప్రజలు వీళ్ళ వాదనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అంతే కాదు లగడపాటి చేసే వాదనలో ఇసుమంత వాస్తవం ఉండదు అనడానికి మరో ఉదాహరణ. ఎస్సార్సీ ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాన్నిమళ్లీ ఎస్సార్సీ ద్వారానే విభజించాలి అంటున్నాడు. మొదటి ఎస్సార్సీ తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రాన్ని)యథాతదంగా ఉంచాలని సిఫారసు చేసింది. దాన్ని పట్టించుకోకుండా ఆంధ్రా లాబీ కి తలొగ్గి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. దీన్ని దాచి పెట్టి ఆంధ్ర ఆక్టోపస్ అవాస్తవాలు చెబుతూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నాడు. అందుకే కొంత మంది సీమాంధ్ర విద్యార్థులు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు కొనసాగిస్తామని.. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఆంధ్ర రాష్ట్రము కోసమే తప్ప ఆంధ్రప్రదేశ్ కోసం కాదనే సత్యాన్ని వాళ్ళకు తెలియకుండా చేశారు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు. విజయవాడలో కూర్చుని విద్వేషాలు రెచ్చగొడుతూ.. తానూ ఆందోళన పడుతూ, ఆంధ్రా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ఆంధ్రా ఆక్టోపస్ పట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపొతే రాజధాని పై నాడు రాజకీయం చేసి పొట్టి శ్రీ రాములు పొట్టన పెట్టుకున్నట్టే మిమ్మల్ని బలి చేస్తారు. తస్మాత్ జాగ్రత్త! రాష్ట్ర విభజన ఎన్నటికి జరగదని వాదిస్తున్న లగడపాటి దానికైనా కట్టుబడి ఉండాలి. లేదా విభజన జరిగితే రాజకీయాల నుంచి వైదొలుగుతాను అన్న మాట మీద అయిన నిలబడాలి. రాష్ట్ర విభజన జరుగుతుందా లేక సమైక్యంగా ఉంటుందా కొన్ని రోజుల్లో తేలుతుంది. అప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ పూటకో మాట మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది.

Labels: , ,

సీమాంధ్ర నేతల కుయుక్తులు అర్థం చేసుకోవాలె



రాష్ట్ర విభజనపై  సీమాంధ్ర నేతల వాదన వింతగా ఉన్నది. ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తరా అని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. దీన్ని సీమాంధ్ర  మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం స్టేట్ విభజన చేయడానికి పూనుకుంటున్నట్టు ప్రచారం మొదలు పెట్టింది. తెలంగాణ సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా టీ అర్ ఎస్ గెలుచుకున్న సీట్లతో ముడిపెట్టినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. ప్రజల ఆకాంక్షను పార్టీలకు వచ్చిన సీట్లతో ముడిపెట్టి.. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి అహంకారంగా అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు వీళ్ళెవరు అడ్డుకోలేదు. అఖిలపక్ష సమావేశంలో పార్టీలలో సీపిఎం, ఎంఐఎం (ఎంఐఎం కూడా మూడు ప్రతిపాదనలు కేంద్ర ముందు ఉంచింది. అందులో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వదలుచుకుంటే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే అని కుండ బద్దలు కొట్టింది) తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ రెండు అభిప్రాయాలు చెప్పినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ తరఫున పాల్గొన్న ప్రతినిధులు స్పష్టం చేశారు. కాని అప్పుడు అలా  మాట్లాడిన గాదె వెంకట రెడ్డి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. సమైక్యవాదాన్ని తాను బలంగా వినిపించాను అని చెప్పిన గాదె ఇప్పుడు మాట మారుస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబుతున్నదని సీమాంధ్ర మంత్రులే మీడియా ముందు వెల్లడించారు. వాళ్ళ వాదనను వినిపించడానికి వెళ్ళిన వీళ్ళను కాంగ్రెస్ పెద్దలు అడిగిన ప్రశ్నలకు మేము సరైన సమాధానం చెప్పలేక పోయామని వీళ్ళే చెప్పారు. అధిష్టాన పెద్దలు అడిగిన ప్రశ్నల్లో ఓట్లు సీట్లు ఒక అంశం మాత్రమే. ఇప్పుడు పార్టీ హైకమాండ్ వైఖరిని తప్పుపడుతున్న నేతలు తమ బంధు గణాన్ని జగన్ పార్టీలోకి పంపి సీమాంధ్ర  ప్రాంతంలో పార్టీని భ్రష్టు పట్టించారని ఆ పార్టీ పెద్దల ప్రధాన ఆరోపణ.  నిజానికి తెలంగాణపై ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్, టిడిపి, వై ఎస్అర్ సీపీ. ఈ పార్టీలే రాష్ట్ర విభజనపై ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సమైక్యవాదానికి 270 స్థానాలు వస్తాయి అని లగడపాటి చేసిన, చేస్తున్న వితండ వాదాన్ని ఎందుకు తప్పు పట్టలేదు. బాబు పాదయాత్ర సమయంలో కరీంనగర్ లో ఆ పార్టీ కార్యకర్త తెలంగాణ పై స్పష్టత ఇవ్వాల్సిందే అని నిలదీస్తే... ఆయన చెప్పిన సమాధానం ఏమిటి? ఇక్కడ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అక్కడ (సీమాంధ్రలో) పార్టీ పోతుంది అన్నప్పుడు మీడియాకు కనిపించలేదు. చంద్రబాబు వైఖరి కరెక్టుగానే కనిపించింది. తెలంగాణ అనగానే సీమాంధ్ర నేతలు, మీడియా అనేక అంశాలను తెర ముందుకు తెస్తాయి. రాయలసీమ, మన్యసీమ, హైదరాబాద్. ఇలా కాలుకు వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలుకు అన్న చందంగా అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే కుట్రలు తెరలేపుతారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్న నేతల్లోనే సఖ్యత లేదన్నది మొన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలోనే స్పష్టమైంది. అంతే కాదు వీళ్ళు ఏమి కోరుకుంటున్నారో క్లారిటీ కూడా లేదు. సమైక్య వాదాన్ని పక్కన పెట్టి హైదరాబాద్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అంటారు. రాష్ట్రాన్ని విభజిస్తే అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని కొందరు వాదిస్తారు. కనుక సీమాంధ్ర ప్రజానీకం ఇప్పటికైనా అర్థం చేసుకోవలసింది మీ ప్రజాప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళ వాదనలు వారి ప్రయోజనాల కోసమే తప్ప..మీకోసం కాదు. హైదరాబాద్ లో ఒక్క సీమాంధ్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో కాలంగా ఉంటున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇక్కడే ఉంటారు. ఎవరికీ అభద్రతా భావం అక్కర లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశంలో పార్టీల అభిప్రాయం మేరకే తీసుకుంటుంది. అంతే గాని సీట్ల కోసమో, సొంత ప్రయోజనాల కోసమో తీసుకుంటుంది అనుకోవడం అపోహ మాత్రమే. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలు రాష్ట్రంలో నెలకొన్నఅస్థిరతను తొలగించాలని కేంద్రాన్ని కోరాయి. సమస్యను పరిష్కరించాలని చెప్పిన వాళ్ళు... నిర్ణయం తీసుకునే సందర్భంలో సమస్యలు సృష్టిస్తున్న సీమాంధ్ర నేతల కుయుక్తులను అర్థం చేసుకోవాలె.  

Labels: , , , ,

Thursday 3 January 2013

ప్యాకేజీ ప్రయోగం ఫలించదు



తెలంగాణపై తేల్చడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నదని, దీనిపై మీడియా లో చర్చల మీద చర్చలు. అయితే ప్రత్యేక రాష్ట్రమా, లేదా ప్యాకేజీనా అనే అంశాలపై మాత్రమే ప్రధానంగా ఈ చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ పై చిదంబరం ప్రకటన తరువాత మూడేళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అఖిలపక్షం తరువాత ముప్పై రోజుల్లో ఈ అంశాన్ని తెలుస్తామన్న షిండే హామీ, అయన ప్రకటన కాంగ్రెస్ వైఖరే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ప్రకటన దీనికి కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే అఖిలపక్ష సమావేశంలో ఒక్క సీపీఎం తప్ప ప్రధాన రాజకీయ పార్టీలేవీ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేదు.అది కూడా తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ రెండు వాదనలు, టిడిపి, వైఎస్అర్ సిపీ అస్పష్ట వైఖరి మినహా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నేరుగా వ్యతిరేకించలేదు. తాజాగా విజయవాడలో పీసీసీ అధ్యక్షులు తలపెట్టిన ప్రాంతీయ సదస్సుకు ఆజాద్ ఆదేశాలు అడ్డుకట్ట వేశాయి. రాష్ట్రం పై కీలక నిర్ణయాలు వెలువడే సందర్భంలో...హస్తిన సంకేతాలను ఎవరికీ వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పందాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత హక్కులు అన్ని ఉల్లంఘనలకు గురయ్యాయి అనేది తెలంగాణవాదుల వాదన. 610 జీవో వచ్చి 27 ఏళ్ళు పూర్తి అయిన ఇప్పటికి అది అమలు కాలేదు. వైఎస్ హయంలోనూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమని ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టడం కోసమే జరిగింది. ఆ ప్రాంతీయ ముఖ్యంగా తెలంగాణకు ఎన్ని  నిధులు కేటాయించారో విదితమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ప్రవేశపెట్టిన ప్యాకేజీ ప్రయోగాలు విఫలమయ్యాయి. ఇప్పుడు మళ్లీ ప్యాకేజీ అంటే తెలంగాణ ప్రజలు అందుకు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అంతేకాదు కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు ప్రకటించిన ప్యాకేజీ, రాజ్యాంగ రక్షణలు తెలంగాణ విషయంలో సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రం ప్రకటించే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంటులో 2/3 మెజార్టీ కావాలి. అంటే దాదాపు 365 సభ్యుల మద్దతు అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి తృణమూల్ వైదొలిగిన తరువత యూపీఏ బొటా బోటీ మెజార్టీ తో కొనసాగుతున్నది. ఎఫ్ డీఐల ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎంత కలవరపాటుకు గురైందో మనకు తెలిసిందే. అయినా కాంగ్రెస్ ప్యాకేజీ ప్రయోగం మరోసారి చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకారం తప్పని సరి. దీనికి బీజీపీ ససేమిరా ఒప్పుకోదు. అదే తెలంగాణ పై పార్లమెంటులో బిల్లు పెడితే సాధారణ మెజారిటీ చాలు. ఇప్పటికే జాతీయస్థాయిలో తెలంగాణకు అనుకూలంగా ముప్పై పైచిలుకు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సులువైన మార్గాన్ని పక్కన పెట్టి సమస్యను సంక్లిష్టం చేస్తుందని భావించలేము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను మరింత కాలం సాగతీయడానికి ఏవైనా కారణాలు చెబితే తప్ప తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టలేని స్థితి. అలాగే తెలంగాణ పై ఇదే చివరి సమావేశమని షిండే ఇప్పటికే స్పష్టం చేశారు. మరో అంశం ఏమంటే గాదె వెంకట రెడ్డి చెప్పినట్టు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదన్నా. అంతిమంగా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పారు. రాజ్య సభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్  చెప్పినట్టు రాష్ట్ర విభజన అంశం అఖిలపక్ష సమావేశం తరువాత రాష్ట్ర పరిధి నుంచి కేంద్రం కోర్టులో చేరింది. కాబట్టి లగడపాటి చెబుతున్న ఏకాభిప్రాయం, కావూరి శాస్త్రీయ విభజన అనేవి కాంగ్రెస్ పార్టీ సమస్యలు. వాటిపై కాంగ్రెస్ పార్టీ తేల్చుకుని తెలంగాణపై తేల్చాల్సిన సమయం, సందర్భం ఆసన్నమైంది.    

Labels: , , , ,