About Me

My photo
Working as Independent journalist. Previous worked in namasthetelangaana daily as sr sub editor/sr staff reporter. Andhrajyothi as sub Editor/staff reporter.

Saturday 16 March 2013

‘చంద్రకిరణాల’ విశ్వాసం



రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ, వామపక్షాలు, లోక్‌సత్తా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి కొనసాగుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమస్య తెలంగాణ. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ. ఇప్పటికిప్పుడు అధికార పార్టీ పడిపోయి, ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలకు లబ్ధి చేకూరుతుందని, అందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మాన సమయంలో తటస్థంగా ఉన్నారు. ఇది బాబు వ్యూహాత్మక వైఖరి అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నట్టు ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాడి అన్నట్టు ఆయన పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాడితే మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక సమయంలో, ఇప్పుడు అసెంబ్లీలో పార్టీ వైఖరి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. ఈ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగితే సాధారణ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నది కదా, అప్పటికి టీడీపీ చారిత్రక తప్పిదాలను జనం మరిచిపోతారు అని చంద్రబాబు ఆలోచన అయి ఉంటుంది. కానీ ఆ ఎన్నికల కంటే ముందు ఇప్పుడు అధికార పార్టీ విప్‌ను ధిక్కరించిన తొమ్మిది మంది, ప్రతిపక్ష పార్టీ విప్‌ను ధిక్కరించిన ఆరుగురిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్వహించాలని చూస్తోంది. దీంతో పదిహేను శాసనసభ స్థానాల, స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల ముందున్నాయి. అలాగే ఈ పదిహేను స్థానాల ఎన్నికలు సీమాంధ్రలోనే జరగుతాయి. గతంలో జగన్ కోసం రాజీనామా చేసిన పదిహేడు స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అధికార పార్టీకి చావుతప్పి కన్నులొట్టబోయినట్టు రెండు స్థానాలను దక్కించుకున్నది. అయితే అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి స్థితి వేరు. ఎందుకంటే విప్ ధిక్కరించిన అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమయినట్టే. వారిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌ను కోరుతామని ప్రకటించాయి.

వారిపై అనర్హత వేటు పడి, ఎన్నికలు ఖాయమైతే ఇవి అధికార, ప్రతిపక్ష పార్టీలకే కాదు వైఎస్‌ఆర్‌సీపీ కూడా కీలకమే. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ పదిహేను స్థానాలను నిలబెట్టుకుంటే సీమాంధ్రలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తన పట్టును నిరూపించుకోవచ్చు. అలాగే అధికార పార్టీని కాపాడుతున్నది ప్రధాన ప్రతిపక్ష పార్టీయే అనేది అవిశ్వాస తీర్మానంతో బయటపడింది. దీనికి టీడీపీ నేతలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సంస్కృతికి తమ పార్టీ దూరం అని, అందుకే అవిశ్వాస తీర్మానం సమయంలో తటస్థంగా ఉన్నామని సమర్థించుకోవచ్చు. కానీ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం అన్నా,  సభలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉండే. కానీ దాన్ని కూడా టీడీపీ ఉపయోగించుకోలేకపోయింది. రాష్ట్రంలో విద్యుత్ సమస్య వల్ల పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు కుంటుపడ్డాయి. దాదాపు తొమ్మిది వేల చిన్నా చితకా కంపెనీలు మూతపడ్డాయి. కిరణ్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభ తలెత్తింది అనేది సుస్పష్టమే. ఎందుకంటే ఏడాది కాలంగా విద్యుత్ సమస్య ఉన్నది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను కిరణ్ సర్కార్ వెతకలేదు. ఈసంక్షోభాన్ని గట్టెక్కించలేదు కానీ సర్‌చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచింది. మరోసారి వడ్డనకు సిద్ధమవుతున్నది. కరెంటు కోతలు విధిస్తూ చార్జీలు పెంచిన ఘనత కిరణ్ సర్కార్‌దే. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కళ్లముందే కనిపిస్తున్నది. ఈ అసమర్థ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్న బాబు అవిశ్వాస తీర్మానం విషయంలో ఎందుకు తటస్థంగా ఉన్నారో వారికే తెలియాలి. పాదయాత్ర సమయంలో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. అవిశ్వాసం వల్ల కొన్ని పార్టీలకు ప్రయోజనం కలుగుతుంది అంటున్న టీడీపీ నేతల వాదన సహేతుకంగా లేదు. ఎందుకంటే టీఆర్‌ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగడుతూనే, ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించింది. జయప్రకాశ్ నారాయణ అన్నట్టు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే తెలంగాణ చరిత్ర ముందు కాంగ్రెస్ దోషిగా మిగులుతుంది. తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పామని టీడీపీ, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అని చంద్రబాబు, కిరణ్‌లు చెబుతున్నారు. ఇది వాదన ఒకే విధంగా ఉన్నది. అయితే ఈ అనిశ్చితి తొలగించాలని అధికార పార్టీకి లేఖ రాసి, అవిశ్వాస తీర్మాన సమయంలో టీఆర్‌ఎస్ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతున్నప్పుడు కనీస స్పందన కూడా లేదు. అంటే తెలంగాణపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని రుజువైంది. అలాగే టీఆర్‌ఎస్ తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ఇవ్వడాన్ని నిరసించిన మంత్రి శైలజనాథ్ వ్యాఖ్యలను తిప్పికొట్టకపోవడం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల చేతగాని తనం. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్న నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒంటికాలిపై లేచినా వీళ్లు మౌనంగా ఉన్నారు. తెలంగాణపై సభలో సీమాంధ్ర మంత్రి మాటలను తిప్పికొట్టలేని వీళ్లు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామంటే విడ్డూరంగా ఉన్నది.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరైనా, తెలంగాణపై చిత్తూరు బాబు వైఖరి ఏమిటో ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు వస్తే ఉద్యమపార్టీకి మేలు జరుగుతుందనే చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం అయ్యాడనడానికి మరో ఉదాహరణ ఆ పార్టీ విప్‌ను ఆరుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించారు. అయితే వీళ్లు డబ్బు సంచులకు అమ్ముడుపోయారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నా, బాబు నాయకత్వంపై వాళ్లకు నమ్మకం లేదని తేలిపోయింది. బాబు ప్రజలకు కాదు, కనీసం ఆ పార్టీ నేతల్లో కూడా విశ్వాసం పెంపొదించలేకపోతున్నారని గడిచిన కొంతకాలంగా ఆ పార్టీ వీడుతున్న నేతలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎంతమంది పార్టీ వీడినా నష్టం లేదంటూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బాబు, దాన్ని నివారించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితి తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎందుకంటే రేపు జనంలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తూనే, దానికి కారణమైన ప్రభుత్వాన్ని కాపాడారు అనే అపప్రద టీడీపీ మూటగట్టుకున్నది. ఇది ఆ పార్టీ ఇప్పుడు చేసిన నష్టం కంటే భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుంది. ఇక అధికార పార్టీ అవిశ్వా తీర్మానంలో సాంకేతికంగా నెగ్గినా, మైనార్టీలో పడ్డట్టే. టీడీపీ దయాదాక్షిణ్యాలపైనే కిరణ్ సర్కార్ మనుగడ ముడిపడి ఉన్నది. బాబు సహకారంతో నెగ్గిన కిరణ్‌బాబు నేను దేనికీ భయపడే వాడిని కాదు అనడం వింతగా ఉన్నది. నారా, నల్లారి వారు కలిసి నడుస్తున్న నడక అధికార పార్టీని ప్రస్తుతానికి గట్టెక్కించినా, అధికార పార్టీ ఐసీయూపై ఉన్నట్టే లెక్క!

Saturday 2 March 2013

సహకార ఫలితాలు-ప్రమాద సంకేతాలు

పార్టీ రహితంగా జరిగే సహకార ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఒకటి రెండు చోట్ల మినహా అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు ‘చేతి’కి చిక్కాయి. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో జరిగిన  ఉప ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత సహకార ఎన్నికలు కిరణ్ సర్కార్‌కు కొంత ఉపశమనం కలిగించాయి అనుకోవచ్చు. రాష్ట్ర జనాభాలో ఐదు శాతం ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి కాదని ఎవరికి వారు సమర్థించుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ఎన్నికలే. అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా పార్లమెంటు ఎన్నికలైనా పార్టీల బలాబలాలు మాత్రం తెలుస్తాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పుడు జరిగిన సహకార ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు పరీక్షే! సహకార ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు జరిగే అద్భుతాలు ఏవీ లేకున్నా, అధికార పార్టీ రాష్ట్రంలోని ప్రధాన సమస్య అయిన తెలంగాణపై ఇప్పుడే తేల్చకుండా మరికొంత కాలం నాన్చే అవకాశాన్ని మాత్రం కల్పించింది అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతున్నదని అటు ప్రతిపక్షం నుంచి ఇటు స్వపక్షం నుంచి వస్తున్న ఆరోపణలకు సహకార ఫలితాలు కొంత ఊరట కలిగించాయి. అలాగే హస్తినలో కిరణ్ పరపతి కూడా కొంత పెరిగిందని రాజకీయ విశ్లేషకుల వాదన.

ఇక ఈ సహకార ఎన్నికల్లో నిజామాబాద్‌లో డీసీసీబీ అధికార పార్టీ హస్తగతం కాగా, డీసీఎంఎస్ పదవి వైఎస్‌ఆర్‌సీపీ, టీఆర్‌ఎస్‌లు కలిసి చేజిక్కించుకున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఫలితాలు వెల్లడైన రెండు రోజులకే సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో డీసీఎంఎస్ పదవిని టీఆర్‌ఎస్ దక్కించుకున్నది. అలాగే వరంగల్‌లో అధికార పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి సూచించిన వ్యక్తి దొంతి మాధవరెడ్డి కాకుండా జంగా రాఘవరెడ్డి డీసీసీబీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని అంతా అనుకున్నారు. జంగాపై కేసులున్నాయనే పేరుతో దొంతి మాధవరెడ్డి వర్గీయుల ఫిర్యాదుతో కథ అడ్డం తిరిగింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డీసీసీబీ ఎన్నికల చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత అధికారి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించినా నామా, తుమ్ముల వర్గీయుల మధ్య ఆధిపత్య పోరుతో అక్కడ తెలుగు తమ్ముళ్ల అనైక్యత బహిర్గతమైంది. దీంతో అక్కడ డీసీసీబీ అధ్యక్షుని ఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కడపలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య పెద్ద హైడ్రామా నడిచింది. డీసీసీబీ ఎన్నికల సమయంలో వీరశివారెడ్డి వాహనంపై చెప్పులు విసరడంతో అక్కడ ఎన్నిక రసాభాసాగా మారింది. దీంతో అక్కడ అధ్యక్ష ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అధికార పార్టీపై ఆరోపణలు చేశారు. జిల్లాలోని మంత్రులు రామచంద్రయ్య, డీఎల్‌ల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో కడప జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వైరుధ్యాలు వీధికెక్కాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ల ఎన్నికపై రోజుకో మలుపు తిరిగి, చివరికి అధికార పార్టీకి వైఎస్‌ఆర్‌సీపీ డైరెక్టర్లు మద్దతు ఇచ్చినా అక్కడ రెండు పదవులు టీడీపీ వశమయ్యాయి. రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు క్రిష్ణారెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడడం అధికార పార్టీ నేతలకు రుచించడం లేదు. ఎలాగైనా అక్కడ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను లొంగదీసుకుని డీసీసీబీ పీఠం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ కల తీరలేదు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే పార్టీ రహిత ఎన్నికలు కాస్తా .. కొత్త పొత్తులకు దారితీశాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా టీఆర్‌ఎస్+కాంగ్రెస్, కాంగ్రెస్+వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ+ టీఆర్‌ఎస్,  ఒకరికొకరు సహకార ఎన్నికల అధ్యక్ష పీఠాలను దక్కించుకోవడానికి సహకరించుకున్నాయి. సహకార ఎన్నికల్లో పార్టీల్లో పార్టీల జోక్యం ఉండకూడదు అని ఆశించిన వారికి ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా పొత్తులు, డైరెక్టర్లతో రహస్య క్యాంపులు  జరిగాయి.

ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రకటించాయి. కానీ ఈ సహకార ఎన్నికలు అందుకు విరుద్ధంగా జరిగాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శ్వాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ. ఆధిపత్యం కోసం పార్టీలు తమ వైఖరులు ఎలా మార్చుకుంటాయో వివిధ జిల్లాల్లో ఆయా పార్టీలు కలిసి డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులను దక్కించుకోవడం చూస్తే అర్థమవుతుంది. సుప్రీంకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని హైకోర్టు తీర్పుతో ఇంత కాలం వాయిదా పడిన ఎన్నికలు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ అడ్డంకులు అన్ని తొలిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. దీంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలు కాబోతున్నది. ఈ ఎన్నికలపై పార్టీల గుర్తులపై జరుగుతాయా లేదా అనే చర్చలు జరుగుతున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. త్వరలో దీనిపై ఒక స్పష్టత రానున్నది. సహకార ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా  ఇటు టీఆర్‌ఎస్, అటు వైఎస్‌ఆర్‌సీపీలు క్లీన్‌స్వీప్ చేస్తాయి అని విశ్లేషణలు, వాదనలు పటాపంచలయ్యాయి. అధికార పార్టీ ఈ ఎన్నికల్లో తన హవా కొనసాగించడం, తర్వాత స్థానంలో టీడీపీ నిలవడం ఆయా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపాయి. ఈ ఎన్నికలను తమ పార్టీ సీరియస్‌గా తీసుకోలేదని ఆయా పార్టీల నేతలు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోప మాత్రం కలవర పడుతున్నారు. మేల్కోకపోతే మునిగిపోతామనే భయం ఈ రెండు పార్టీల నేతల్లో నెలకొన్నది. సహకార ఎన్నికల ఫలితాలను తెలంగాణ వ్యతిరేకులు తమకు అనుకూలంగా మలుచుకున్నారనేది స్పష్టమే. ఆ ఎన్నికలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యమకారులు వాదించినా, దీనిపై సమీక్షించుకోవాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమైతే పరిస్థితి ఏమిటి అన్న బెంగ ఇటు టీఆర్‌ఎస్‌లోనూ అటు వైఎస్‌ఆర్‌సీపీలోను ఉన్నది. ఎందుకంటే జగన్ జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతారో చెప్పలేని స్థితి. దీంతో ఆ పార్టీ మనుగడపై అనేక సందేహాలు వస్తున్నాయి. కార్యకర్తలో ఉత్సాహం నింపేందుకు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నా.. జగన్‌లేని లోటు ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక టీఆర్‌ఎస్ మొన్న ఉప ఎన్నికల్లో, అలాగే సింగరేణి, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటినా సహకార ఎన్నికల్లో మాత్రం డీలా పడిపోయింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే సహకార ఎన్నికల ఫలితాల్లో నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేదని వాదనలు వినపడుతున్నాయి. ఎంత శాతం మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా లేకపోతే ఏం జరుగుతుందో ఈ ఎన్నికలు రుజువు చేశాయి. వైఎస్‌ఆర్‌సీపీని కూడా ఇదే సమస్య వెంటాడుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద నేతలు బయటికి వచ్చినా ద్వితీయ శ్రేణి నేతలు ఇంకా ఆ పార్టీలను పట్టుకునే ఉన్నారు. అంతేకాదు ఇప్పటికీ కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీల బలం చెక్కుచెదరలేదు అనేది వాస్తవం. అందుకే సమైక్య పార్టీలకు తెలంగాణలోనే చోటులేదని మీడియా ముందు చెప్పడం కాదు, అది వాస్తవం రూపం దాల్చలంటే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి. సహకార ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకోవాలి.

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెబుతున్నాయి?



తెలంగాణను యాచించి కాదు, శాసించి తెచ్చుకుందాం. వంద అసెంబ్లీ, పదిహేడు పార్లమెంటు స్థానాలు సాధిద్దాం. ఇవి తెలంగాణ రాష్ట్ర సమితి కొంత కాలంగా వినిపిస్తున్న నినాదాలు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న టీఆర్‌ఎస్ ఎన్ని‘కల’ నినాదాలు ఫలిస్తాయా? ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెబుతున్న వంద అసెంబ్లీ, పదిహేడు పార్లమెంటు స్థానాలు సాధ్యమేనా? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న సామాన్యుల మదిని తొలుస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే టీఆర్‌ఎస్ నల్గొండ టీచర్స్‌ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురుకావడమే దీనికి కారణం. ఉత్తర తెలంగాణలో జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగినా, దక్షిణ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ  ఓటమితో ఆ పార్టీ చతికిలపడింది. ఇది సగటు తెలంగాణవాదిని ఆందోళనకు గురిచేస్తున్నది.

గతంలో పాలమూరు, పరకాల ఫలితాలు టీఆర్‌ఎస్ పార్టీని కలవరపాటుకు గురిచేశాయి. ఆ ఎన్నికలను గుణపాఠంగా తీసుకుంటే ఇప్పుడు నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ, సహకార ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చి ఉండేవి కాదన్న రాజకీయ విశ్లేషకుల, తెలంగాణ ఉద్యమకారుల వాదన. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో పాతూరి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్‌లు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్నారు. స్వామిగౌడ్‌కు తొలి ప్రాధాన్యంలోనే 4,470 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్‌గా స్వామిగౌడ్ పనిచేయం ఆయనకు కలిసి వచ్చింది. ఇక పీఆర్‌టీయూ అభ్యర్థి మోహన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఐదువేలకు పైగా మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ అభ్యర్థులే పోటీ చేస్తున్నప్పటికీ గెలిచిన అభ్యర్థులు నిజమైన తెలంగాణవాదులకే ప్రజలు పట్టం కట్టారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో టీఆర్‌ఎస్ నుంచి వరదారెడ్డి, పీఆర్‌టీయూ నుంచి పూల రవీందర్, యూటీఎఫ్ నుంచి నారాయణ ఉన్నారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ వరదారెడ్డి, పూల రవీందర్‌ల మధ్యే ఉంటుందని అంతా భావించారు. అయితే ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ మాత్రం చివరి వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. నాలుగో రౌండ్ ఎలిమినేషన్‌లో పూల రవీందర్ 2,57 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పూల రవీందర్ తెలంగాణ ఉపాధ్యాయ ఐకాస ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే సకల జనుల సమ్మెలో ఉపాధ్యాయులు సంపూర్ణంగా పాల్గొనడంలో రవీందర్ కృషి చేశారని, సమ్మె సమయంలో వరదారెడ్డి సహకరించకపోగా పోలీసులను పెట్టి తన విద్యా సంస్థలను నడిపారని విమర్శలు వచ్చాయి. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడం పొరపాటని తెలంగాణవాదుల ఆరోపణ. ఫలితం అనంతరం  పార్టీలో కొంతమంది ఒత్తిడి వల్లే వరదారెడ్డికి టికెట్ ఇచ్చామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇవి ఉద్యమానికి విఘాతం కలిగిస్తున్నాయి. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి, త్యాగధనులకు పట్టం కట్టిన, కడుతున్న చరిత్ర మన కళ్లముందు కనబడుతున్నది. ఇప్పటికే పాలమూరు ఫలితం, పరకాలలో చావుతప్పి కన్నులొట్టబోయిన ఉదంతాలు ఉన్నాయి. ఆ ఎన్నికల ఫలితాలు  క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ బలహీనతలను తెలియజేశాయి. అయినా పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోలేదనే వాదనలున్నాయి. సూర్యపేటలో పెద్ద బహిరంగ సభ తర్వాత స్తబ్ధుగానే తయారైంది. టీఆర్‌ఎస్ పల్లె బాట కార్యక్రమం కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దక్షిణ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పటికీ ఉద్యమ పార్టీ తన బలాన్ని పెంచుకోలేకపోయింది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉపాధ్యా సంఘాలు విభజనను తెచ్చాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల చెబుతున్నారు. తెలంగాణ కోసం సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, తెలంగాణ మార్చ్ ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. అందుకే సకల జనుల సమ్మె మైలురాయిగా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సమైక్య సంఘాలకు స్థానం లేదని ఆర్టీసీ, సింగరేణి ఎన్నికల్లో రుజువైంది. అలాగే తెలంగాణలో ఉద్యమ కారులు, ఉద్యమ ద్రోహులు ఎవరో స్పష్టమైంది. ఆ సోయి తెలంగాణ ప్రజలకు వచ్చింది. కానీ పార్టీలకే ఇంకా కనువిప్పు కలగనట్టున్నది. ఏకపక్ష నిర్ణయాలు టీఆర్‌ఎస్ పార్టీకే ఉద్యమానికి ముప్పును తెస్తాయి. ఎందుకంటే ఆంధ్రాలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు బలపరిచిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయినా సీమాంధ్ర మీడియా దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ వరదారెడ్డి ఓటమిని తెలంగాణవాదానికి ముడిపెట్టి చర్చల మీద చర్చలు పెట్టింది. అలాంటి అవకాశం మనం సీమాంధ్ర నేతలకు, మీడియాకు ఎందుకు ఇవ్వాలి అనేది సగటు తెలంగాణవాది ప్రశ్న.

పొరపాటు, గ్రహపాటు, అలవాటు వీటిలో మనం ఇప్పటికే పొరపాట్లు చేశాం. తిరిగి ఆ తప్పులను దిద్దుకోకుంటా మళ్లీ అవే పునరావృతం చేశాం. ఇక ఆ పొరపాట్లే అలవాటుగా మారితే కష్టమే. నిజమే ఆ పార్టీ చెబుతున్నట్టు ఉద్యమం కావాలి, ఓట్లు సీట్లు కావాలి. కానీ అవి ఉద్యమానికి ఊపిరి పోయాలి. లక్ష్య సాధనకు ఉపయోగపడాలి. అంతేకానీ అవరోధం కాకూడదు. ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలి. ఉద్యమ నేతల్లో ఉన్న అభిప్రాయభేదాలను, ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి మన ఐక్యతను దెబ్బతీసేందుకు సీమాంధ్ర శక్తులు కాచుకుని కూర్చున్నాయి. దాన్ని అధిగమించకపోతే మునగడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధమని ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక సంఘాలు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాయి. గతంలో మాదిరిగా సమ్మె సక్సెస్ కావాలంటే అంతా ఒకే గొడుగు కిందికి రావాలి. లేకపోతే ఒకవేళ మళ్లీ సమ్మె అంటే తెలంగాణలోని అన్ని సంఘాలు కలిసిరాకపోవచ్చు. తెలంగాణ కోసం గల్లీకో జేఏసీ ఏర్పడి తమవంతు ప్రయత్నాలు చేస్తున్న సందర్భమిది. ఈ సమయంలో మన అనైక్యత శత్రువుకు ఆయుధం కాకూడదు. తెలంగాణ కోసం ఆర్‌ఎస్‌ఎస్ నుంచి మావోయిస్టుల దాకా ఎవరినైనా కలుపుకుని పోతాం అన్న మాటలను ఆచరణలో చూపాలి. కనుక ఈ మూడేళ్ల ఉద్యమాన్ని మరోసారి సమీక్షించుకోవాలి. ఎక్కడ లోపాలున్నాయో వాటిని గుర్తించాలి. అవి పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తూనే తెలంగాణ ప్రాంతలోని సమస్యలపై పోరాడాలి. ఉద్యమంలోకి అన్ని శక్తులను తీసుకుని రావాలి. మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా అది మొదటికే మోసం తెస్తుంది. బడితె ఉన్నవాడిదే బర్రె అన్నట్టు ఉండవల్లి రాజమండ్రి సభలో చెప్పిండు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారు. అవి అవాస్తవాలు అయినా, ఈ ఎన్నికల ఫలితాలను తెలంగాణ అంశాన్ని తేల్చకుండా కొంతకాలం వాయిదా వేయడానికి తెలంగాణ వ్యతిరేకులకు పనిచేస్తాయి. అంతేకాదు కీలక సమయంలో టీఆర్‌ఎస్ కొంతమంది ఒత్తిడి మేరకు టికెట్లు ఇవ్వకుండా తెలంగాణకోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి ప్రోత్సాహం అందించాలి. అది ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు దోహదపడుతుంది.