Thursday 1 February 2024

'ఇండియా' కూటమికి కలిసివచ్చే పరిణామాలే ఇవి!


'చావనైనా చస్తాను గానీ బీజేపీతో మళ్లీ కలువను' అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ మళ్లీ మాటమార్చారు. ఎన్నడూ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించకున్నా తొమ్మిదోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అవకాశవాద రాజకీయాలే ఆలంభనగా ఆయన సీఎం స్థానాన్ని స్థిరపరుచుకుంటూ వస్తున్నారు. బీహార్‌లో కాంగ్రెస్‌, బీజేపీల ప్రభావం ఉన్నప్పటికీ ఆ పార్టీలు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో ఈ రెండు పార్టీల మద్దతుతోనే నితీశ్‌ మాటిమాటికి కూటములు మార్చినా కుర్చీ మాత్రం వదలడం లేదు. సమతా పార్టీ పెట్టిన రెండేళ్లేకే విధేయతను పక్కనపెట్టి నాటి వాజపేయ్‌ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేని కేంద్ర మంత్రి అయ్యారు. 2003లో జనతాదళ్‌ (యూ) పేరుతో వేరే కుంపటి పెట్టుకున్నారు. 2005, 2010లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోడీ అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ బీజేపీకి బైబై చెప్పేశారు. బీజేపీతో ఉన్నంతకాలంలో, తాను సొంతంగా బలపడాలని భావించినంత కాలం ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలపై దుమ్మెత్తిపోశారు. మోడీ ప్రధాని అయ్యాక ఆయనను ఢీ కొట్టడం తన ఒక్కడి వల్ల కాదని 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహాఘట్‌బంధన్‌ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. నితీశ్‌ కూటములు మార్చిన ప్రతిసారి ఆ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి. ఎప్పుడు దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్నది ఆయన తాను ఆశించినది దక్కనప్పుడో లేదా బీహార్‌లో తన ప్రాభవం తగ్గుతున్నదని అనుకున్నప్పుడో చేస్తుంటారు. అట్లా 2017లోనే మహాఘట్‌బంధన్‌ వదిలిపెట్టి కమలనాథులతో కలిసి మళ్లీ జట్టు కట్టారు. 2020లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2022లోనే కూటమి మార్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా ఆ కూటమిని కటీఫ్‌ చెప్పి కాషాయపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  


బీజేపీ అవకాశవాదం వల్లనే 

ఆర్జేడీ, కాంగ్రెస్‌ల విషయాన్ని పక్కనపెడితే బీజేపీ బీహార్‌లో, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీ యేతర ప్రభుత్వాలు ఏర్పడకూడదు అన్న ఒకే ఒక కారణంతో అక్కడి ప్రాంతీయపార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనికి కారణం బీహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో(40+48+26) ఉన్న 114 లోక్‌సభ స్థానాలే లక్ష్యం. యూపీలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇలాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ముఖ్యమే. అందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాల వల్ల ప్రగతి కుంటుపడుతున్నదని దుమ్మెత్తిపోసి ఫలితాల అనంతరం అవేపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి పరిపాటిగా మారింది. బీజేపీ రాజకీయ అవకాశవాదం బీహార్‌లో నితీశ్‌కుమార్‌కు, మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌పవార్‌లకు, కర్ణాటకలో కుమారస్వామి వంటి వారికి కూటములు మార్చడానికి దోహదం చేస్తున్నది. బీజేపీకి ఈ రాష్ట్రాల్లో బలం లేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినా, ఇలా  కూలిపోయే ప్రభుత్వాలను నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసినా అర్థం అవుతుంది. 


ఈ పరిణామాలు మంచివే

కేంద్రంలో తాను అధికారంలోకి రావడానికి ప్రాంతీయ పార్టీలను ముందుపెట్టి కాంగ్రెస్‌ను ఖతం చేయడం. తీరా అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతీయపార్టీల్లోనే చిచ్చుపెట్టి చీల్చడం మోడీ-షాలు పదేళ్లుగా అనుసరిస్తున్న విధానాలు. అందుకే ఈసారి ఎలాగైనా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి విపక్షపార్టీలు ఐక్యం అయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చ జరుగుతున్నాయి. యూపీలో ఎస్సీ, ఆర్‌ల్‌డీ, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయనున్నాయి. జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్నది. తమిళనాడులో డీఎంకే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌తోనే కలిసి నడుస్తామని ప్రకటించింది. వామపక్షాలు మొదటి నుంచి బీజేపీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. లౌకిక స్ఫూర్తిని  కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్‌తోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే 2029లో తాము బలపడవచ్చు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడవచ్చు అనే మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, నితీశ్‌కుమార్‌ వంటి నేతల ఆలోచనలకు అనుగుణంగానే నితీశ్‌ ఆయారాం-గయారాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఇండియా కూటమిలో నెలకొన్న విభేదాలు ఒకంతుకు మంచివే. ఈ కూటమిలోని పార్టీలో కేంద్ర ప్రభుత్వానికే కాదు ఇంకా ఎవరితో పోరాడాలన్న స్పష్టత వచ్చింది. ప్రస్తుత రాజకీయా పరిణామాలకు అనుగుణంగా ఇండియా కూటమి తగిన ప్రణాళికన రూపొందించుకుని ముందుకు వెళ్లాలని ప్రజాస్వామికవాదులు కోరుకుంటున్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నానికి బీజేపీ ఆడే ఆటలో పావులుగా మారుతున్న అవకాశవాద పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తున్నారు.

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home