Monday 9 February 2015

బహదూర్‌పల్లి బాట

సోషల్ వర్క్ ఫీల్డు వర్క్ లో భాగంగా ఆ మధ్య నగరానికి కూతవేటు దూరంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాం. అక్కడ అనేక విషయాలు గమనించాం. నిజానికి ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. వీటన్నింటిని చూసిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దవచ్చు అనే విశ్వాసం కలిగింది.
---------------------------------

‘తినడానికి చేపను ఇవ్వడం కాదు, ఆ చేపను పట్టే నైపుణ్యాన్ని నేర్పించు’ అనే సూక్తి ఆ పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద కనిపించింది. ఒక ప్రభుత్వ పాఠశాల అనగానే సహజంగానే అక్కడ ఉండే సదుపాయాలు గుర్తుకొస్తాయి. ఇవ్వాల చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవన్నది వాస్తవం. కానీ అంతకంటే ఆందోళనకరమైన అంశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపు చూస్తున్న ఈ కాలంలో ఒక పాఠశాల రేపటి తెలంగాణ ప్రభుత్వ కేజీ టూ పీజీ ఉచిత విద్య కార్యక్రమానికి నమూనా నిలుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో కుద్బుల్లాపూర్ మండలంలోని బహదూర్‌పూర్ మండల ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గత ఏడాది వరకు ఇద్దరు విద్యావాలంటీర్లు, ఒక ప్రధానోపాధ్యాయునితో నడిచిన ఆ పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్లతో సతమతమయ్యేది.కాని నేడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ ఆ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అక్కడ విద్య బోధన జరుగుతున్నది. గత ఏడాది కంటే గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. విలువలతో కూడిన విద్య అందిస్తున్నారు. క్రమశిక్షణ అనేది ప్రాథమిక స్థాయి నుంచి అలవాటు చేస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. అంతేకాదు హానెస్టీ బాక్స్. పాఠశాల పరిసరాల్లో ఏ విద్యార్థికి చెందిన ఏ వస్తువైనా పోతే అది ఎవరికి దొరుకుతుందో వారు నిజాయితీగా హానెస్ట్ బాక్సులో వేయడం. అలా నిజాయితీని ప్రదర్శించిన వారి తెల్లారి ప్రేయర్ సమయంలో ప్రశంసించడం. అంటే ఇదొక రకంగా వారికి నైతిక విద్యను బోధించడం లాంటిదే. సంక్లిష్ట అంశాలను సులభ పద్ధతిలో పిల్లలకు అర్థమయ్యేలా చిత్రాల రూపంలో బోధించడం. ఇందులో పర్యావరణ అంశాలు మొదలు నీతి శతకాలు అన్నీ అందరూ చదువుకునే విధంగా బైట ఒక ప్రదర్శించడం. ఆయా అంశాలు బొమ్మల రూపంలో ఉండడం వల్ల పిల్లలను ఇట్టే ఆకర్షిస్తున్నది. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ఆ ప్రాథమిక పాఠశాలల పిల్లలు ఒక్క చదువులోనే కాదు అన్ని రంగాల్లో తమదైన ప్రతిభను చూపుతున్నారు. ఇందులో విశేషమేమంటే అక్కడ చదువంతా ఒక బట్టి పద్ధతిలో కాకుండా విద్యార్థులకు కిండర్ గార్డెన్ పద్ధతిలో బోధిస్తున్నారు. బడి అంటేనే పారిపోయే పిల్లల్ని పద్ధతిగా తమ పనులను చక్కబెట్టుకునేట్టు తీర్చిదిద్దుతున్నారు. ఇక చదువు అంటే టీచరే బోధించడం కాదు. తాన చెప్పదలచుకున్న విషయాలు బోర్డుపై రాసి పిల్లలను తమ నోట్ పుస్తకాల్లో రాసుకోమని చెప్పడం కాదు. పిల్లల మధ్యనే వారికి అర్థమయ్యేలా బోధించడం. పాఠం చెప్పిన తర్వాత పది మంది పిల్లల చొప్పున ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక సందేహాలను మరొకరు నివృత్తి చేసుకోవడం. ఇక లెక్కలు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా బోధించడం. అలాగే ఎక్కాలను సైతం పాటల రూపంలో బోధించడం వల్ల వారు ఈజీగా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ప్రోత్సాహమందిస్తే వారు తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కల. కొందరు కొన్ని రా మెటీరియల్స్‌ను ఉపయోగించి కొన్ని వస్తులను తయారు చేయడం, అలాగే చిన్నతనం నుంచే క్రీడల పట్ల వారికి ఆసక్తి కలిగించడం ఇవన్నీ విద్యార్థులను పాఠశాలవైపు ఆకర్షించే అంశాలే. ఇంత కంటే మెరుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుండవచ్చు. ఒక నిర్ణీత లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడానికి బహదూర్‌పల్లి పాఠశాలే ఆది కాదు అంతమూ కాదు. ఇది ఒక నమూనా కావాలి.
ఇవ్వాల ఫలాన స్కూలులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది అనేది వాళ్లు చేసుకునే ప్రచారమే కావచ్చు. లేదా ఆయా పాఠశాలల్లో చదవితే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విశ్వాసం కావచ్చు. దీనికి కారణం అవి సంపాదించుకున్న నమ్మకం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కూలిపని చేసుకునే వారు సైతం ఎంత ఖర్చు అయినా సరే ప్రైవేట్ పాఠశాలలోనే చదివించడానికి మొగ్గుచూపుతున్నాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చదివించడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే అక్కన మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, బోధన విషయంలో కావచ్చు వారు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించడానికి కారణమవుతున్నాయి. నిజానికి ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే వారికంటే మెరుగైన అర్హతలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండవచ్చు. కానీ చదువు చెప్పడానికి ఆ అర్హతలే సరిపోవు. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యత వారి తల్లిదండ్రులు వారిపై పెడుతున్నారు. వాళ్లు బాధ్యతను నిర్వర్తించడానికి సంసిద్ధులు కావాలి. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే కాదు, ఉపాధ్యాయుల బాధ్యత అనే విషయాన్ని మరువరాదు. ప్రైవేట్ పాఠశాలలు ఏటా అడ్మిషన్ల సమయంలో వాళ్లకు వచ్చిన ఫలితాలను చూపెట్టి విద్యార్థులను తమ పాఠశాలలకు వచ్చే విధంగా ప్రచారాలు చేస్తున్నప్పుడు ఆ పని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎందుకు చేయకూడదో ఆలోచించాలి. అంతేకాదు ఇవ్వాల బహదూర్‌పల్లి మండల పరిషత్ పాఠశాలో ఆసక్తి కలిగించే అంశం ఏమంటే రోజువారీ విద్యార్థుల హాజరుపట్టిక ఉంటుంది. అందులో ఎంత మంది హాజరయ్యారు ఎంత మంది రాలేదు అన్నది క్లాసుల వారీగా బోర్డుపై రాస్తున్నారు. ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ రోజులు రాని విద్యార్థి ఇంటికి వెళ్లి వారి సమస్యను తెలుసుకుని, ఒకవేళ వాళ్ల ఇంట్లో తల్లిదండ్రులు అంగీకరించుకుంటే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థి పాఠశాలకు రాకపోవడానికి ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. లేదా కుటుంబ సమస్యలు ఏవైనా ఉండవచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనికి వెళ్తే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారిని చూసుకోవడానికి మరొకరి చదువును త్యాగం చేసే పరిస్థితులు ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అందరూ కృషి చేయాలి. ఇక ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు నేర్పించే విషయాలు వారికి జీవితాంతం ఉపయోగపడతాయి. పాఠశాల బోర్డుపై ఏ రోజుకారోజు ముఖ్య వార్తలు రాయడం, జనరల్ నాలెడ్జీకి సంబంధించిన ఒక ప్రశ్న రాయడం, నిన్నటి ప్రశ్నకు జవాబు ఇవ్వడం. ఒక మంచి మాట రాయడం. ఇలా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా ఇతరత్రా విషయాలపై అవగాహన కల్పించడం. ఇవన్నీ ఇప్పుడే కొత్తగా వచ్చినవి కాదు. గత రెండు మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నవే. కానీ రానురాను ఆ పరిస్థితి పోయి ఇరవై నాలుగు గంటలు పుస్తక పురుగులుగా మార్చే సంస్కృతి వచ్చింది. మార్కుల పేరుతో పిల్లలను బైట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా పుస్తకాలకే పరిమితం చేయడం. ఒకరకంగా ఇది పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పైసలు కుమ్మరిస్తే, పిల్లలు ఆ పుస్తకాల బరువును మోడయం లాంటిది. ఈ పరిస్థితి మారాలి. నాణ్యమైన విద్య అంటే పిల్లలను ప్రకృతికి దూరంగా చదివించడం కాదు. పుస్తకాలే ప్రపంచంగా బోధించడం అంతకన్నా కాదు. అందరికి సమాన విద్య అనేది ఆచరణలో సాధ్యం కావాలంటే ఈ మార్కుల కొలమానం నుంచి మనం బైటికి రావాలి.
మార్పును కోరుకుంటే మార్పుకనుగుణంగా మన ప్రణాళికలను రూపొందించుకోవాలి. వాటిని పకడ్బందీగా ఆచరణలో పెట్టాలి. ఇవాల దేశంలోనే కాదు చాలా రాష్ట్రాల్లోముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో మొదలు తెలంగాణ రాష్ట్రంలో సైతం ప్రాథమిక విద్య పటిష్టంగా లేదని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటేనే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది. కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నది. దీనిపై నిందారోపణలకు పరిమితం అవడం కంటే ప్రభుత్వ పాఠశాలల పటిష్టతకు కృషి చేసే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పిల్లల బంగారు భవితకు బహదూర్‌పల్లి ఒక బాట కావాలి.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home