Wednesday 12 September 2012

నిర్ణయం చెప్పకుండా నీతులా?



తెలంగాణపై డిసెంబర్ 23 చిదంబరం మరో ప్రకటన తర్వాత ఈ అంశంపై  కాంగ్రెస్ పార్టీ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. పాత పాటనే కొత్త గొంతుతో వినిపిస్తున్నది. అట్లాగని అది సీక్వెల్ అని కాదు. శృతి, లయ లేని రాగాలు. అందుకే ఆ పలుకులకు మీడియా ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజల్లో వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇప్పుడు సరిగ్గా తెలంగాణపై షిండే చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవలోకే చెందుతాయి. ఎందుకంటే తెలంగాణ అంశంపై తనకు అవగాహన లేదంటూనే ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడారు. మొన్ననే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆయనను కలిసినప్పుడు సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి హామీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లో కన్ఫ్యూజనే తప్ప క్లారిఫికేషన్ కనపడదు. తెలంగాణపై ఏదో ఒకటి మాట్లాడడం తర్వాత దాన్ని మరొకరు సరిదిద్దకోవడం వారికి అలవాటే.

టీజీ వెంకటేశ్, లగడపాటి వంటి వాళ్లమాటలైతే కోటలు దాటుతాయి. షిండే చిన్న రాష్ట్రాల వల్ల ఏర్పడే సమస్యల గురించి ఏకరువు పెట్టగానే.. అవి తమకు అనుకూలంగా మలుచుకొని మీడియా ముందు వాలిపోయారు. షిండే వ్యాఖ్యలతో తెలంగాణ రాదని తేల్చేశారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైఖరి కూడా ఇదేనా అంటే వారి దగ్గర సమాధానం ఉండదు. వారి విశ్లేషణలే వారి అధిష్ఠానం విధాన నిర్ణయమన్నట్టు తెగ వాగేస్తుంటారు. మరి డిసెంబర్ 9 తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ఎట్లా చెప్పారు అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, యూపీఏ ప్రభుత్వం చేసింది అంటారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకుంటే యూపీఏకు నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ ప్రమేయం లేకుండా ప్రకటన ఎలా వస్తుంది అంటే దానికి మరో కొత్త మెలిక పెడతారు. అదేమిటంటే డిసెంబర్ 9 ప్రకటన అసెంబ్లీ తీర్మానం అనే అంశాన్ని తెరమీదికి తెస్తారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే, అది నెగ్గితే దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని అంటారు. మరి ఇప్పటి వరకు అసెంబ్లీలోతీర్మానం ఎందుకు ప్రవేశపెట్టలేదో వారికే తెలియాలి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే సీమాంధ్రలో 175 స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే ఎవరు నెగ్గుతారో చిన్నపిల్లవాడినడిగినా ఇట్టే చెబుతాడు. అయితే పార్టీల పరంగా రాష్ట్ర విభజనపై ఏదో ఒక నిర్ణయానికి వచ్చి, దానికి అందరూ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఎవరు దొంగలో తేలిపోతుంది. దీనికి ఆంధ్రా అక్టోపస్ లగడపాటి విశ్లేషణలు అవసరం లేదు. టీజీ, లగడపాటిలు తెలంగాణకు వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడుతుండగానే పీసీసీ అధ్యక్షుడిని తెలంగాణపై టీడీపీ లేఖ గురించి ప్రస్తావించారు. టీడీపీ లేఖ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది కదా అంటే సత్తిబాబు నిర్ణయం తీసుకునేది మేమే అయితే  లేఖ ఎందుకు అని తిరిగి ప్రశ్నించారు. తెలంగాణ అంటే ఏకాభిప్రాయం అనే కాంగ్రెస్ పెద్దలు దీనిపై ఎన్ని గొంతులు వినిపిస్తున్నారో వారికే తెలియదు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందన్నట్టు నిజాయితీలేని కాంగ్రెస్ నాయకులు నిసిగ్గుగామాట్లాడుతారు. దీనికి మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఒక అందమైన ట్యాగ్ తగిలించుకుంటారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు, అవినీతి ఆరోపణలకు కేంద్రబిందువయ్యింది.

తెలంగాణపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఒకసారి ప్రకటన చేసింది. దీనికి సంబంధించి పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ మాట్లాడింది. తర్వాత రాష్ట్రంలోని పార్టీలు యూ టర్న్ తీసుకున్నాయని మరో ప్రకటన చేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ, ఆజాద్ కమిటీ అంటూ కాలం వెళ్లదీసింది. ఇప్పుడు యూటర్న్ తీసుకున్న పార్టీల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే మిగిలాయి. ఎందుకంటే పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది. టీడీపీ అధినేత తెలంగాణపై తమ పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తూ.. తెలంగాణపై స్పష్టత ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ, కొత్తగా పుట్టిన వైఎస్‌ఆర్‌సీపీల వైఖరే. ఇక ఎంఐఎం అభిప్రాయం గురించి ఇక్కడ చర్చే అవసరం లేదు. ఎందుకంటే సమైక్యవాదమే తమ పార్టీ విధానం అని అసెంబ్లీ వేదికగా ఆపార్టీ శాసనసభపక్ష స్పష్టం చేశారు. అంతేకాదు ఒకవేళ కేంద్ర తెలంగాణ ఇవ్వదలుచుకుంటే హైదరాబాద్‌న్ కేంద్ర పాలిత ప్రాంతమనో, ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకునేది లేదని, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కుండబద్దలు కొట్టింది. అందుకే తెలంగాణ ప్రజలు కూడా కోరుతున్నది తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రమే. ఇక తేల్చుకోవలసింది కాంగ్రెస్ పార్టీనే.
-రాజు

Labels: ,

1 Comments:

At 12 September 2012 at 10:01 , Blogger Unknown said...

gud ..but u need to add some morte negtavie statemnts gave by botsa ns lagdapati ..tg ventakesh ....

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home