Thursday 6 September 2012

హైదరాబాద్ టూ హస్తినా

హైదరాబాద్ టూ హస్తినా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఏదో ఒక నిర్ణయాన్ని వెలువరించనుందనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరికి వారు తమకు అనుకూలంగా ఆపాదించుకుంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ కుంభకోణంతో తడిసిముద్దయ్యాయి. అది మొదట యూపీఏ ప్రభుత్వ మెడకు చుట్టుకున్నా.. రాను రాను అందులో కొంత ఎన్డీఏ ప్రభుత్వానికి అంటించింది. అందుకే సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వంటి కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల చేతులకు అవినీతి మసి అంటుకున్నదని ఆరోపిస్తున్నారు. హస్తినలో బొగ్గు ఉదంతం హాట్‌గా మారగా, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వేడి మళ్లీ రాజుకుంటున్నది. తెలంగాణకు సానుకూలంగా ఉన్న పార్టీలన్నీ ఎవరికి వారు స్వరాష్ట్రం కోసం పోరుబాట పట్టారు. ఇదంతా నాణానికి ఒక పార్శం అయితే తెలంగాణపై టీడీపీ మరోసారి కేంద్రానికి లేఖ రాయనుందనేది మరో పార్శం.

కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోబోతుందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దల నుంచి తనకు సిగ్నల్స్ అందుతున్నాయని టీఆర్‌ఎస్ అధినేత చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తలో రకంగా మాట్లాడినా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు గమనిస్తే  పరోక్షంగా చాలా పార్టీలు ఆయనను సమర్థించినట్టే కనిపిస్తున్నది. ఎందుకంటే ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో చంద్రబాబు  రెండు కండ్ల సిద్ధాంతాన్ని వీడి తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. అయినా బాబు స్పందించలేదు సరికదా తన సిద్ధాంతాన్ని సమర్థించుకున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా బాబు వేసిన రెండుకండ్ల ఎత్తుగడతో రెండు ప్రాంతాల్లో పార్టీ కాపాడుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆయన రెండుచోట్లా రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. రాష్ట్ర విభజనపై ఆయన తటస్తంగా ఉన్నా తెలంగాణపై మాటమార్చినందుకు ఈ ప్రాంతంలో ఆ పార్టీ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే అని తెలంగాణవాదులు ఆరోపిస్తే.. ఆంధ్రలో అయినా ఆయనకు ప్రాధాన్యం పెరగలేదు. అక్కడ జగన్ రూపంలో ఆ పార్టీని మరో సమస్య చుట్టుముట్టింది. ఏ పార్టీకి అయినా ఎత్తుపల్లాలు సహజమే. అయితే తెలంగాణపై డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు టీడీపీ మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. ఈ రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ ఒక్కస్థానం కూడా గెలుచుకోలేదు. తెలంగాణలో అంటే ఉద్యమ ప్రభావంతో ఓడిపోయామని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు ఆ పార్టీ నేతలు. అయితే సీమాంధ్రలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయింది. దీంతో బాబుకు  ఏం చేయాలో పాలుపోలేదు . ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పిన చంద్రబాబుకు వరుస వైఫల్యాల రికార్డును కూడా మూటగట్టుకున్నారు. దీనికంతటికి కారణం కీలక సమస్యలపై సాచివేత కంటే స్పష్టత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు బాబు. అందులో భాగంగానే ఇప్పుడు బీసీలకు వంద టికెట్లు, ఎస్సీ వర్గీకరణకు మద్దతు, తెలంగాణపై మరోసారి కేంద్రానికి లేఖ తదితర అంశాలు తెరమీదికి తెచ్చారు. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసమే బాబు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నారు. అలాగే బాబు తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇస్తేనే సరిపోదు అందుకోసం ఉద్యమించాలని కూడా కిషన్‌రెడ్డి వంటి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు అంటూనే సీపీఐ తెలంగాణ పోరుబాటను, బీజేపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడురోజుల దీక్షను చేపట్టింది. తెలంగాణ కోసం చేస్తున్న ఈ ఇరు పార్టీల  ఉద్యమాలను స్వాగతించాల్సిందే. అయితే ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రాంతంలో చేస్తున్న ఉద్యమాలు ఆంధ్ర ప్రాంతంలో కూడా చేస్తే బాగుండేది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని తప్ప మరే ఇతర ప్రతిపాదనలను అంగీకరించే స్థితిలో లేరు. అట్లాగే తెలంగాణపై నాటకాలు ఆడిన కాంగ్రెస్, టీడీపీలకు తగిన బుద్ధి చెప్పారు. మునుముందు కూడా చెబుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ స్థితిలో చిన్న రాష్ట్రాల వల్ల కలిగే సౌలభ్యం గురించి ఆంధ్ర ప్రాంత ప్రజల్లో కూడా చైతన్యం తెచ్చేలా ఉద్యమించాలి. ఎందుకంటే నాలుగున్న కోట్ల ప్రజల ఆకాంక్షలను నలుగురు పెట్టుబడిదారుల కోసం అణచివేస్తున్నారని ఈ నాయకులే మైకుల ముందు మాట్లాడుతున్నారు. మరి ఆట ఎక్కడ ఆడాలో తెలిసినప్పుడు దాన్ని విస్మరిస్తే ఎలా? ముఖ్యంగా జాతీయ పార్టీలుగా చెప్పునే వాళ్లు దీన్ని ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ అనుకూలంగా ఎన్నో పార్టీలు గొంతు వినిపిస్తున్నా వాటిని ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించకపోవడానికి కారణం కూడా ఇదే. అందుకే సీపీఐ, బీజేపీ లాంటి పార్టీలు టీడీపీ వలె కాకుండా జైఆంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టాలి. ఎందుకంటే తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను 17 శాతం మంది ప్రజలు సమర్థించారు. అట్లాగే 25 శాతం మంది ప్రజలు తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే పెట్టుబడిదారులు చెబుతున్నట్టు మెజారిటీ ప్రజలు సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారు అనేది తప్పదని ఈ సర్దే నిరూపించింది. ఇందులో శాస్త్రీయత  సంగతి పక్కన పెడితే మన రాష్ట్రంలోనే ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అది స్పష్టమైంది. కాబట్టి ఏదైనా అంశంలో వందశాతం ఏకాభిప్రాయం ఎప్పుడూ సాధ్యం కాదు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఆంధ్ర ప్రాంత ప్రజకు అర్థమయ్యే రాష్ట్ర విభజనకు అంగీకరించేలా కృషి చేయాలి. అప్పుడు కేంద్ర రాష్ట్ర విభజనపై ఏదో ఒక  నిర్ణయం తీసుకున్నా ప్రజల్లో ఉండే భావోద్వేగాలను కొంత వరకు నియంత్రించవచ్చు.

రాష్ట్ర విభజనపై తనకు కేంద్ర పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్న కేసీఆర్ కూడా ఢిల్లీ బాట పట్టారు. కేంద్రం రాష్ట్రం ఇస్తే సంతోషమే ఇవ్వకపోతే సమరమే అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అట్లాగే కేసీఆర్ కేంద్రంలోని కీలక నేతల పిలుపు మేరకే ఢిల్లీ వెళ్లారని సమాచారం. అయితే కేసీఆర్  మాత్రం తాను పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చానాన్ని, ఏది ఏమైనా ఈ నేలకరులోగా తెలంగాణ అంశం తేలిపోతుందని కుండ బద్దలు కొట్టారు . అట్లాగే తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలు కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను, కేంద్ర మంత్రి వాయలార్ రవిలను కలిసి విజ్ఞప్తి చేశారు. వాళ్ళను కలిసిన తరువాత తమకు కూడా తెలంగాణ పై స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం. సీమాంధ్ర ఎంపీలు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిని కలిశారు. తెలంగాణ మంత్రులు కూడా త్వరలో  ఢిల్లీ బాట పట్టనున్నారు. ఇప్పటికిప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తెలుస్తుందో లేదు తెలియదు కానీ నేతల హడావుడి చూస్తే హస్తినలో ఏదో జరగబోతున్నదని అర్థమవుతున్నది. అది రాష్ట్ర విభజన పైనా లేక రాష్ట్రంలో అధికారపార్టీ నాయకత్వంలో మార్పా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ఇక మధ్యంతర ఎన్నికలు వస్తే యూపీఏ 15, ఎన్డీఏ 207 లోక్‌సభ స్థానాలు వస్తాయని ఎన్డీటీవీ సర్వే తేల్చింది. ఆ మధ్య అద్వానీ తన బ్లాగ్‌లో రాసుకున్నట్టు వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత యూపీఏ, ఎన్డీఏ యేతర అభ్యర్థే ప్రధాని అవుతారా అనిపిస్తున్నది. ఎందుకంటే దాదాపు 150 లోక్‌సభ స్థానాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సర్వే చెబుతున్న సారాంశం. అందుకే దాదాపుగా రెండు దశాబ్దాలుగా దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం నడుస్తున్నది. అది ఇక ముందు కూడా కొనసాగుతుందని అర్థమవుతున్నది. సార్వత్రిక ఎన్నికలకు కూడా మరో ఏడాదిన్న సమయం మాత్రమే ఉన్నది. అందుకే ఇప్పటి నుంచే జాతీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. దానికంటే ముందు కేంద్ర ప్రభుత్వం నెత్తిన చాలా సమస్యలు చుట్టుకున్నాయి. వీటికి తోడు సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయి. సోనియాగాంధీ ఈసారి ఎట్లాగైనా యువరాజు రాహుల్‌గాంధీకి పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నారు. ఆమె కల నెరవేరాలంటే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలి. అయితే అది అంత సులువు కాదు. దేశంలోని చాలా పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు ఇచ్చి ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏదో ఒక నిర్ణయం తప్పక తీసుకోవాలి. తెలంగాణప డిసెంబర్ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అందుకు సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అప్పుడు ఆ పార్టీకి గతంలో వచ్చినన్ని సీట్లు రాకున్నా ఇరవై పైచిలుకు స్థానాలను మాత్రం ఖాయం చేసుకోవచ్చు. దీంతో నాలుగున్నర కోట్ల ప్రజల ఆరు దశాబ్దాల ఆరాటం ఫలిస్తుంది. సోనియా సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home