Monday 17 September 2012

తీర్మానమే తీర్పు కాదు



తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలన్న టీఆర్‌ఎస్ డిమాండ్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ స్పందన హాస్యాస్పందంగా ఉంది. తీర్మానం పెడితే వీగిపోతుందనడంలోకూడా వింతేమీ లేదు. అయితే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది కిరణ్ వ్యవహారశైలి. ఎందుకంటే తెలంగాణకు అన్ని రాజకీయ అనుకూలమనే అంటున్నాయి (సీపీఎం, ఎంఐఎం తప్ప). మరి అలాంటప్పుడు మాటల్లోనే తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థం చేసుకుంటున్నామని రాజకీయ పార్టీలు ఎంత కాలం మోసం చేస్తాయి?  సీమాంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వారి సంఖ్య 175. తెలంగాణ ప్రాంతం నుంచి 119. కిరణ్‌కుమార్‌రెడ్డి సంఖ్యా బలాన్ని చూసి వీగిపోతుంది అంటున్నారు. వ్యక్తిగతంగా తెలంగాణను ఎంత మంది వ్యతిరేకిస్తారు అనేది అప్రస్తుతం. పార్టీల వైఖరి ఏమిటి అనేది మాత్రం తీర్మానంతో తేలిపోతుంది. ఎందుకంటే పార్టీల పరంగా ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమంది అనుకూలంగా ఓటేస్తారు, ఎంత మంది వ్యతిరేకిస్తారు అనేది ప్రస్తుత చర్చ. అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇంటిదొంగలు ఎవరు అనేది మాత్రమే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమైక్య, విభజన వాదాలు వినిపిస్తునే ఉన్నారు.

అయితే గతంలో తెలంగాణ కోసం 120 మందికి పైచిలుకు ప్రజాప్రతినిధులు ‘రాజీ’నామాలు చేశారు. నిజానికి అందులో అధికార పార్టీకి చెందిన వారు నలభై మంది నిజాయితీగా ఉన్నా ఇవ్వాళ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఆచరణ రూపం దాల్చి ఉండేది. కానీ వారు ఆ సాహసం చేయరనే కాంగ్రెస్ పార్టీ సాచివేత ధోరణిని అవలంబిస్తోంది. టీడీపీ కూడా మొన్నటి బాబు రెండు కండ్ల సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బాబు అన్ని అంశాలపై స్పష్టత అనే పేరుతో మొన్నటిదాకా కొంత హడావుడి కూడా చేశారు. అందులో అన్ని అంశాల్లో పార్టీ పరంగా ఏకాభిప్రాయాన్ని సాధించినా, తెలంగాణ విషయంలో మాత్రం ఆ పార్టీ ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నది. బాబు తెలంగాణపై మరోసారి లేఖ రాస్తామని ప్రకటించారు. అది కూడా మీడియాలో కోడై కూసింది. అందరి అభిప్రాయాలు తీసుకుని సెప్టెంబర్ 15 కల్లా లేఖ రాస్తారని, లేకపోతే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత రాస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే బాబుకు నిజంగా తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నట్లయితే గతంలో అసెంబ్లీలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉండి ఉంటే అధికార పార్టీ అవకాశవాదం బయటపడుతుంది. సీమాంధ్ర టీడీపీ నేతలు బాబును అడిగినట్టు ఇప్పుడు లేఖ ఎవరికి ఇవ్వాలో అనే సందేహాన్ని పక్కనపెట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే ఎవరు ఏమిటో తేటతెల్లమవుతుంది. టీడీపీ తెలంగాణకు కట్టుబడి ఉంటే అసెంబ్లీలో ఈ అంశంపై తీర్మానం వీగిపోయే అవకాశమే ఉండదు. కానీ బాబు ఆ పని చేస్తారని ఎవరూ భావించడం లేదు. ఎందుకంటే ఇంకా ఆయన హస్తిన రాజకీయాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్లు తేల్చరు వీళ్లు దానిపై అడగరు. తెలంగాణ అంశంపై ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం ఏమిటో అందరికి అర్థమైంది. అందుకే తెలంగాణ అంశం వీరికి ఎన్నికల మేనిఫెస్టోల్లోనే కనబడుతుంది.

ఇక కిరణ్‌కుమార్ అన్నట్టు తెలంగాణపై తీర్మానం వీగిపోతే జరిగే నష్టం ఏమిటి? ఇప్పటి వరకు అసెంబ్లీలో చాలా అంశాలపై తీర్మానాలు పాస్ అయ్యాయి. మరి ఆ సమస్యలు పరిష్కారమయ్యాయా? లేదు. తీర్మానం ద్వారా ఆయా అంశాలపై పార్టీల అభిప్రామం మాత్రం వెల్లడైంది. తెలంగాణవాదులు కూడా కోరుతున్నది అదే.  ఈ అంశంపై రెండువాదనలు కాకుండా ఒకే మాట మీద నిలబడే పార్టీలు ఎన్ని? ఎంత మంది ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి. ఒకవేళ తీర్మానం పాస్ అయినా వీగిపోయినా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నది విదితమే. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వం విదర్భ కోసం ఎన్నడో తీర్మానం చేసింది. అయినా దానిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొన్నటిమొన్న యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి సర్కార్ తీర్మానం చేసింది. దానిపై ఏమీ తేల్చలేదు. మరి తీర్మానమే తీర్పు అన్నట్టు కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా భావిస్తున్నారు? గతంలో ఆయన స్పీకర్‌గా పనిచేసినప్పుడు తెలంగాణకోసం పార్టీలకు అతీతంగా రాజీనామా చేస్తే కేవలం టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ్యులవే ఆమోదించి కొంతకాలం అసెంబ్లీలో తెలం‘గానం’ వినపడకుండా తన వంతు కృషి చేసిన విషయాన్ని ఎవరూ మరిచిపోరు. అట్లాగే ఏకాభిప్రాయం అనే మాట కాంగ్రెస్ పార్టీలో వినిపించే కామన్ మాటే. అది ఆ పార్టీ కాలయాపన కోసం మాత్రమే వాడుకుంటుంది. ఇంకా మంచి ఉదాహరణ ఏమంటే వైఎస్‌ఆర్ అకాల మరణం తర్వాత ఆయన తనయుడు జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపారు. అయినా అనుభవం పేరుతో ఢిల్లీపెద్దలు రోశయ్యను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టారు. సీల్డు కవర్‌లో ముఖ్యమంత్రులను నిర్ణయించే కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం అంటే హస్తినలో కానీ అసెంబ్లీలో కాదనే విషయం ముఖ్యమంత్రి గుర్తిస్తే మంచిది. తెలంగాణపై డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం మేరకే వచ్చింది. దీన్ని చాలా సందర్భాల్లో చిదంబరం చెప్పారు కూడా. కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాలతో ఆ ప్రకటన వెనక్కిపోయింది. డిసెంబర్ 9 ప్రకటనకే కట్టుబడి ఉండాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లుగా వాళ్లు దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్నారు. తమ న్యాయమైన హక్కు కోసం వందలాది మంది యువతీయువకులు బలిదానాలకు పాల్పడ్డారు. అయినా సీమాంధ్ర సర్కార్‌కు కనిపించవు. ఆధిపత్యం పేరుతో ప్రజల ఆకాంక్షలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నది. అది ఎంతో కాలం కొనసాగదు. అందుకే తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే అందరి బాగోతాలు బయటపడతాయి.
-రాజు

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home