Saturday 16 June 2012

వాదనలు - వాస్తవాలు

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అలసత్వాన్ని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఫల్యాన్ని స్పష్టంగా చూపెట్టాయి. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో దాదాపు నలభై అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రధాన ప్రతిపక్ష ఈ ఎన్నికల్లో ఏ ఒక్క సీటు కూడా గెలిచుకోలేదు. టిడిపి మొన్ననే ముప్ఫై ఏళ్ల సంబురాలను చేసుకున్నది. బహుశా ఇన్నేళ్ళలో ఆ పార్టీ ఇన్ని  సంక్షోభాలను ఎదురుకోవడం మొదటిసారి. అందుకే ఈ ఉప ఎన్నికల్లో పది చోట్ల రెండో స్థానంలో నిలిస్తే, ఐదు చోట్ల డిపాజిట్లను కోల్పోయింది. దీనికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలే కారణం. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిందే కానీ, యిప్పుడు జగన్ పై వస్తున్న అవినీతి ఆరోపణలకు మూలాలు కాంగ్రెస్ లోనే ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు చెప్పడంలో విఫలం అయ్యింది. రాష్టంలో ప్రధాన సమస్య అయిన తెలంగాణపై రెండుకండ్ల సిద్ధాంతం వల్ల ఈ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. పోనీ దీని వల్ల సీమాంధ్రలో అయిన తన పట్టును నిలుపుకున్నదా అంటే అదీ లేదు. రెంటికి చెడ్డ రేవడిలా తయారయింది ఆ పార్టీ పరిస్థితి. సహజంగానే ఏదైనా రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మొదటి రెండు సంవత్సరాలు అధికార పార్టీకే లాభిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే దాని వల్ల ప్రధాన ప్రతిపక్షం లబ్ధి పొందుతుంది. కానీ టిడిపి ప్రభుత్వ వ్యతిరేకతను ఏ మాత్రం ఉపయోగించుకోలేక పోయింది.ఉప ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు గణనీయంగా పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంలో టిడిపి పూర్తిగా విఫలం అయ్యింది.  దాని ఫలితమే ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలుచుకోక పోవడానికి కారణం. తెలంగాణ ప్రాంతంలో అయితే ఆ పార్టీకి స్పష్టత లేదు కాబట్టి ప్రజలు ఆదరించడం లేదు అనేది వాస్తవం. కానీ సీమాంధ్ర లో కూడా అదే పరిస్థితి ఎదురవుతున్నదంటే ఆ పార్టీ నాయకత్వం పై తెలుగు తమ్ముళ్ళు ఆలోచించుకోవాలి. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నట్టు  తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు చేత తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇప్పిస్తే వారికి మనుగడ ఉంటుంది. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల సమయం బాబు చెప్పే మాటలను ఆచరణలో చూపితే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే అవకాశం ఉన్నది. ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి తెలంగాణ పై స్పష్టమైన వైఖరి చెబితే అప్పుడు ఆ బంతి కాంగ్రెస్ కోర్టులో పడుతుంది. తెలంగాణపై ఆ నాలుగు పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని పాత పాట పాడే చిదంబరం అండ్ కో కొత్త రాగాన్ని ఆలపించాల్సి ఉంటుంది. అంటే వారు చెప్పే ఆ నాలుగు పార్టీల్లో ఎంఐఎం పార్లమెంటులోనే ఆ పార్టీ వైఖరి స్పష్టం చేసింది. ఇక పరకాలలో నైతిక విజయం మాదే అని బీరాలు పలుకుతున్న వైఎస్ఆర్ సిపి ద్వంద్వ విధానం కూడా బయట పడుతుంది. ఎందుకంటే బాబు చెప్పే రెండుకండ్ల సిద్ధాంతానికి జగన్ పార్టీ చెప్పే ఇచ్చే, తెచ్చే శక్తి తమకు లేవని వితండ వాదానికి పెద్దగా తేడా ఏమిలేదు. అప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అనే వారి ముసుగు కూడా తొలిగిపోతుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కిరణ్ అండ్ కో ఓట్ల కోసం సీమాంధ్రలో జగన్ తో పాటు కేసీఆర్ పై విమర్శలు చేశారు. వీరు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విభజించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేశారు. అయిన వాటిని ఆ ప్రాంత ప్రజలు పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఎందుకంటే ఇరు ప్రాంతాల ప్రజలు మానసికంగా ఎప్పుడో విడిపోయి ఉన్నారు. ఇక మిగిలింది భౌగోళిక విభజన మాత్రమే. ఇక పరకాల ఫలితంపై ఎవరికి తోచిన వాదనలు వారు చేస్తున్నారు. స్వల్ప మెజారిటీ తో టిఆర్ఎస్ విజయం సాధించడం పట్ల తెలంగాణ వాదం బలంగా ఉన్నదా, ఉంటే అంత తక్కువ మెజారిటీ ఎలా వచ్చింది అని వాదిస్తున్నారు. వీరే ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో రౌండ్ రౌండ్ కు పరకాలలో మారుతున్న సీన్ కు అనుగుణంగా వారి స్వరాన్ని కూడా మార్చారు. సురేఖ గెలిస్తే  ఆ ప్రభావం కేవలం పరకాలకే పరిమితం కాదు అది మొత్తం తెలంగాణ ప్రాంతం పై పాడుతున్నారు. కేసీఆర్ తో విభేదించే వారంతా జగన్ వెంట వెళతారు అన్ని చెప్పుకొచ్చారు. యిప్పుడు మాట మారుస్తున్నారు. ఇదంతా కావాలనే ఒక వర్గం మీడియా ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది, చేస్తున్నది. జగన్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు తెలంగాణ ప్రజలు ఎంత వరకు విశ్వసించారో తెలియదు కానీ..ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించేలా పరకాల ప్రజలు తీర్పు చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఒక విషయంపై ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం కాదు, అలాగే ఒక పార్టీ వైపే వంద శాతం ప్రజలు నిలబడిన దాఖలాలు లేవు.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home