Saturday 1 September 2012

కేంద్రం నెత్తిన ‘బొగ్గు’ కుంపటి


కొంత కాలంగా బొగ్గు కుంభకోణం పార్లమెంటును కుదిపేస్తున్నది. వేలం లేకుండా జరిపిన 57 బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వల్ల ఖజానాకు 1.6 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ‘కాగ్’ నివేదిక సమర్పించింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య పార్లమెంటు వేదికగా తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. 2005-09 మధ్య బొగ్గు గనుల కేటాయింపులన్నింటికి ప్రధానే బాధ్యుడు కాబట్టి ఆయన రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై మౌనమే తన సమాధానం అన్నట్టు వ్యవహరించిన ప్రధాని ఎట్టకేలకు ‘కాగ్’ నివేదికపై కవితాత్మక సందేశాన్ని వినిపించారు. ‘హజారో జవాబోం సే అచ్చీ హై మేరీ ఖామోషీ, న జానే కిత్నే సవాలోం కీ ఆబ్రూ రఖే’ (నా మౌనమే వెయ్యి సమాధానాల కన్నా మిన్న. ఎన్నెన్నె ప్రశ్నలకు బదులివ్వకుండా కాపాడుతుందో అది’! అన్నది ఆయన ఉర్దూ కవిత అర్థం) అంటూ ఇంత కాలం తాను వహించిన మౌనాన్ని కవితాత్మకంగా సమర్థించుకున్నారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 2జీ, కామన్‌వెల్త్, ఆదర్శ్ కుంభకోణం వంటివి వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులతో సహా జైళ్లలో మగ్గుతున్నారు. ఈ కుంభకోణలకు సంబంధించి ప్రతిపక్షాలు ప్రధానిని పరోక్షంగా విమర్శించాయి. ప్రధాని ధృతరాష్ట్రుని వలె కళ్లకు గంతలు కట్టుకుని ఉండడం వల్లే ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనం లూటీ అయిందనే ప్రతిపక్షాల ఆరోపణలు. అయితే ఇప్పుడు బొగ్గు గనుల కేటాయింపుల్లో ప్రతిపక్షాలు ప్రధానినే టార్గెట్ చేశాయి. ఆయన హయాంలోనే ఈ అవినీతి జరిగిందంటున్నాయి. దీనిపై కేంద్రమంత్రి సమాధానమిస్తూ ప్రధాని గురించి అందరికీ తెలుసునని, ఇంకా ఎవరైనా తప్పుచేస్తారేమో కానీ మన్మోహన్ మంచోడని ఎన్నడూ తప్పుచేయడన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి కాబట్టి గనుల వేలం నిర్వహించలేకపోయామన్నారు.
కాగ్ నివేదిక లోని వాస్తవాలు ఎలా ఉన్నా... ప్రధాని మొదటి నుంచి కార్పొరేట్ సామ్యానికి జీ హుజూర్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్‌ఇండియా, సింగరేణి వంటి సంస్థలకు బొగ్గు తవ్వే సామర్థ్యమున్నా వాటికి కేటాయించలేదు. ప్రైవేట్ సంస్థలకు వీటిని అప్పగించడం వల్ల 194 బొగ్గు క్షేత్రాలు 2002- 2009 వరకు క్యాప్టీవ్ మైన్స్ కింద కేటాయింపులు జరిగాయి. ఈ బ్లాకులలో 24 బ్లాకులు మాత్రమే బొగ్గును వెలికితీశాయి. ఇందులో కొన్ని నిర్ణీత సమయంలో బొగ్గు తవ్వలేదన్న కారణంగా రద్దయ్యాయి. కేటాయింపులు పొందిన కంపెనీలు నిర్దేశిత ఉత్పత్తి ప్రారంభించడానికి ప్రయత్నించడం లేదని, వాటిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించందని ప్రధాని వెల్లడించారు. అక్రమంగా అనుమతులు పొందిన వారిపై చర్యలుంటాయన్నారు. వీటిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున అక్రమాలు జరిగి ఉంటే అవి వెలుగులోకి వస్తాయన్నారు.
అయితే బొగ్గు గనుల కేటాయింపు ఉమ్మడి నిర్ణయమేనని ప్రధాని దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కాగ్ నివేదికను తప్పుల తడకగా అభివర్ణించారు. ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చాంటూ కాగ్ చూపిన గణాంకాలను సందేహాస్పదమైనవిగా ప్రధాని చెప్పారు. వేలం లేకుండా 1993 నుంచి ఆయా ప్రభుత్వాలు బొగ్గు క్షేత్రాలను కేటాయిస్తున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. అంతేకాకుండా బొగ్గు క్షేత్రాలు అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, రాజస్థాన్‌ల్లో అప్పట్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని, యా రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ద్వారా కేటాయింపులను వ్యతిరేకించాయని ప్రధాని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. చట్టబద్ధంగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు అనుగుణంగానే వ్యవహరంచామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇదంతా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్న కనిపిస్తున్నది. తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం ఎవరూ చేయకుండా.. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకుంటూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు.
ఇదిలాఉంటే మరో 60 సంవత్సరాలలో సింగరేణి బొగ్గు కనుమరుగవుతుందని కేంద్ర బొగ్గుశా మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మంత్రి చెప్పిన ప్రకారం చూస్తే సింగరేణి ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం కొనసాగుతుందని అనుకోవచ్చు. వాస్తవానికి సింగరేణి ప్రాంతంలో ఇంకా 150 సంవత్సరాల పాటు తవ్వగలిగే బొగ్గు నిక్షేపాలున్నాయి. అయితే సింగరేణి యాజమాన్యం ఏ యేటికి ఆ యేడు ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకుంటూ పోతున్నది. ముఖ్యంగా 12 పంచవర్ష ప్రణాళిక కాలం ఈ ప్రాంతంలో తొమ్మిది ఓపెన్‌కాస్టులకు అనుమతి లభించింది. ఈ ఓపెన్‌కాస్టులు ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తే దాదాపు 90 గ్రామాలు విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిరాశ్రయులను చేసే ఓపెన్‌కాస్టులను వ్యతిరేకించాలి. అండర్‌గ్రౌండ్ పద్ధతిన బొగ్గు తవ్వకాలు చేపట్టాలి. కమీషన్ల కక్కుర్తి కోసం బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన కోలిండియా, సింగరేణిలకు అప్పజెప్పాలి. అప్పుడు ఈ అవకతవకలను కొంత మేరకు అరికట్టవచ్చు. పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవచ్చు. బొగ్గు ఉత్పత్తి అనేది సమాజ ఉన్నతికి ఉపయోగపడాలి కానీ ప్రజల ఉనికిని ప్రశ్నార్థకం చేసేదిగా ఉండకూడదన్న విషయాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తించాలె.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home