ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఆడియో వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయి ఉందని, ఇది నిజమో కాదో సుబ్బారెడ్డి తన కుటుంబసభ్యుల మీద ప్రమాణం చేసి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సుబ్బారెడ్డి చేతికి ఆ ఆడియో ఎలా వచ్చిందో విచారణకు పిలిచి ప్రశ్నించాలని, ట్యాపింగ్లో నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"కేసీఆర్, జగన్ల నీచ రాజకీయాలు"
"కేసీఆర్, జగన్ ఆనాడు నీచ రాజకీయాలు చేశారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారు. నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని నాపై నిఘా పెట్టారు. నేను ఎవరిని కలుస్తున్నానో గ్రహించి నాకు మద్దతు ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపేశారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేసి జరిపిన కుట్రనే" అని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
సుబ్బారెడ్డి చేతిలో తన ఆడియో
"సుబ్బారెడ్డి చేతిలో నా ఆడియో ఉంది. స్వయంగా నేనే విన్నా. ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో జగన్ అబద్ధాలు చెప్పించారు" అని షర్మిల వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయం వెలుగులోకి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు.
జగన్ తీరుపై విమర్శలు
జగన్ తీరును "అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది" అంటూ షర్మిల విమర్శించారు. "ఇంత చేసిన జగన్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు అంటే ఎలా? దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకుంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారణ జరపాలి" అని ఆమె డిమాండ్ చేశారు.

No comments:
Post a Comment