Showing posts with label #AssemblyElections2026#CountingDay2026 #West Bengal #TMCvsBJP. Show all posts
Showing posts with label #AssemblyElections2026#CountingDay2026 #West Bengal #TMCvsBJP. Show all posts

Sunday, 3 May 2026

బెంగాల్ పీఠం ఎవరిదో చెప్పే ఆ 37 స్థానాలు


  • 1977 నుండి మారని సెంటిమెంట్
  • నేటి ఫలితాల్లో ఇవే కీలకం!

మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అధికారాన్ని చేపట్టాలంటే ఏ పార్టీకైనా కనీసం 148 సీట్లు అవసరం. మే 4న వెలువడనున్న ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి గెలవాలని చూస్తుండగా, బీజేపీ తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో, దశాబ్దాలుగా రాష్ట్ర ఫలితాలను కచ్చితంగా అంచనా వేస్తున్న 37 నియోజకవర్గాలపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని మొత్తం స్థానాల్లో కేవలం 13 శాతమే ఉన్న ఈ గెలుపును సూచించే సీట్లు, బెంగాల్ అంతటా విస్తరించి ఉండటమే కాకుండా జనరల్, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను కూడా కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కోల్‌కతా, దక్షిణ బెంగాల్‌లోని భవానీపూర్, డైమండ్ హార్బర్, ఉదయ్ నారాయణపూర్ వంటి ప్రాంతాలు గెలుపు ట్రెండ్‌ను నిర్ణయించడంలో కీలకంగా మారాయి.



ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ఈ విషయంలో ఎంతో ప్రత్యేకం. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి కచ్చితమైన ఫలితాలను ఇచ్చే స్థానం ఒకటి మాత్రమే ఉండగా, బిహార్ , మహారాష్ట్రలలో అసలు ఒక్కటి కూడా లేదు. కానీ బెంగాల్‌లో మాత్రం ఏకంగా 37 స్థానాలు ఉండటం గమనార్హం. గత 50 ఏళ్లుగా బెంగాల్ రాజకీయాలు కేవలం రెండు ప్రధాన పక్షాల (ముందుగా 34 ఏళ్ల వామపక్ష పాలన, ఆపై తృణమూల్) చుట్టూ తిరగడం వల్ల, రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీకి గాలి వీస్తే ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా అదే పార్టీకి పట్టం కట్టడం అలవాటుగా మారింది. ఈ స్థిరమైన ఓటింగ్ సరళి కారణంగానే, ఈ 37 సీట్ల ఫలితాలను బట్టి బెంగాల్‌లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ముందే ఊహించడం సాధ్యమవుతోంది. నేడు ఉదయం ఈ స్థానాల ట్రెండ్స్ వెలువడగానే బెంగాల్ ఓటరు నాడి ఎటువైపు ఉందో స్పష్టమవనుంది.

బెంగాల్ పీఠం ఎవరిది?


  •  ఓటర్ల తొలగింపు, సంక్షేమ పథకాలు 
  •  'చేపల' చుట్టూ తిరిగిన రాజకీయాలు!

ఈసారి బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఊహించడం విశ్లేషకులకు కూడా కష్టతరంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 91 లక్షల మంది (సుమారు 11.8 శాతం) ఓటర్ల పేర్లను తొలగించడం. ఇది తృణమూల్ కాంగ్రెస్ గత గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉండటంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగుతోంది. ఈ పరిణామాన్ని మమతా బెనర్జీ తన ప్రచారానికి ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. గతంలో ఆమె ఇచ్చిన "మార్పు కావాలి - పగ వద్దు" (Badla Noy Badal Chai) అనే నినాదాన్ని, ఇప్పుడు "మార్పు వద్దు - పగ కావాలి" (Badal noy Badla chai) అని మార్చి, ఓటర్ల తొలగింపునకు ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 92 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.



తృణమూల్ కాంగ్రెస్ తన విజయానికి 'శ్రీ' పథకాలపై (కన్యాశ్రీ, రూపశ్రీ, లక్ష్మీర్ భండార్ వంటివి) గట్టి నమ్మకం పెట్టుకుంది. ముఖ్యంగా 'లక్ష్మీర్ భండార్' ద్వారా మహిళలకు అందుతున్న ఆర్థికసాయం ఆ పార్టీకి మహిళా ఓటర్లలో పట్టును పెంచింది. అయితే, 15 ఏళ్ల నిరంతర పాలన తర్వాత అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం , 'కట్-మనీ' సంస్కృతి వంటి అంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం , పారిశ్రామికీకరణలో వైఫల్యం వంటి అంశాలను బీజేపీ తన ప్రచారంలో ప్రధానంగా వాడుకున్నది.


మరోవైపు, బీజేపీ తన ప్రచారంలో బంగ్లాదేశ్ నుండి వలసలు, జాతీయ భద్రత , మహిళా భద్రత (ముఖ్యంగా సందేశ్‌ఖాలీ, ఆర్‌జీ కర్ ఘటనలు) వంటి అంశాలను లేవనెత్తింది. అయితే, బెంగాల్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న 'చేపల' అంశం ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు తిననివ్వరంటూ తృణమూల్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నాయకులు తీవ్రంగా శ్రమించారు. బెంగాలీ సంస్కృతికి తాము వ్యతిరేకం కాదని, కేవలం అవినీతికి వ్యతిరేకమని చెబుతూ బీజేపీ ఈసారి స్థానిక నాయకత్వంతో ముందుకు వెళ్లింది. మే 4న వెలువడనున్న ఫలితాలు బెంగాల్ భవిష్యత్తును,దేశ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించనున్నాయి.

Featured post

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ ట్రోల్స్‌కు ఆస్కార్ విజేత అదిరిపోయే కౌంటర్!

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్‌.. రెహమాన్‌కు మద్దతుగా నిలుస్తున్న అభిమానులు! ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన తాజా పీరియడ్ లవ్ స్ట...