- హార్ముజ్ జలసంధిని దాటిన ఎల్పీజీ ట్యాంకర్
- వంటగ్యాస్ కష్టాలకు ఊరట
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారతదేశ ఇంధన అవసరాలను తీర్చే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం అమల్లో ఉన్నప్పటికీ, సుమారు 46,313 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్తో (LPG) వస్తున్న 'సర్వశక్తి' అనే ట్యాంకర్ శనివారం వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ భారీ నౌకలో 18 మంది భారతీయులతో సహా మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. ఏప్రిల్ 13న అమెరికా ఈ మార్గంలో దిగ్బంధనాన్ని కఠినతరం చేసిన తర్వాత, హార్ముజ్ జలసంధిని దాటి బయటకు వచ్చిన మొట్టమొదటి భారతీయ అనుబంధ ట్యాంకర్గా ఇది రికార్డు సృష్టించింది.
దేశంలో వంటగ్యాస్ కొరత తీవ్రమై, ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ నౌక రాక ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో భారత్లో ఎల్పీజీ వినియోగం గణనీయంగా తగ్గడమే కాకుండా, వినియోగదారులు ఆందోళనతో ముందస్తు కొనుగోళ్లకు (Panic Buying) మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో 'సర్వశక్తి' మే 13వ తేదీన విశాఖపట్నం రేవుకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగానే ఈ నౌకకు సురక్షిత మార్గం లభించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం స్వదేశీ ఉత్పత్తిని 60 శాతం మేర పెంచి రోజుకు 54,000 టన్నులకు చేర్చినప్పటికీ, రోజువారీ డిమాండ్ 70,000 నుండి 80,000 టన్నుల వరకు ఉంది. ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం అమెరికా, అర్జెంటీనా , నార్వే వంటి ఇతర దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తోంది. 'సర్వశక్తి' ట్యాంకర్ సురక్షితంగా బయటపడటం అనేది దేశ ఇంధన భద్రతకు తాత్కాలిక ఊరటనివ్వడమే కాకుండా, యుద్ధం కొనసాగుతున్నా రవాణా సాధ్యమేనన్న ఆశలను చిగురింపజేస్తోంది.