Sunday, 7 June 2026

బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’..


  • ‘పెద్ది’ ప్రభంజనం ముంగిట తేలిపోయిన డేవిడ్ ధావన్ చిత్రం
  • రెండు రోజుల్లో రూ. 23 కోట్లు మాత్రమే వసూలు

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోతోంది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు అతి సాధారణ వసూళ్లతో సరిపెట్టుకోగా, రెండో రోజైన శనివారం నాడు కూడా అదే మందకొడి ధోరణిని కొనసాగించింది. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ 'శాక్‌నిల్క్' నివేదికల ప్రకారం, ఈ సినిమా శనివారం భారతదేశంలో కేవలం రూ. 7.25 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. దీంతో రెండు రోజుల్లో దేశీయంగా ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 4.75 కోట్లుగా, గ్రాస్ వసూళ్లు రూ. 17.70 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ నుండి వచ్చిన రూ. 3 కోట్లను కలుపుకుంటే, రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు కేవలం రూ. 23.20 కోట్లు మాత్రమే.



దేశవ్యాప్తంగా దాదాపు 8,813 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి శనివారం కేవలం 21.38 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ మాత్రమే లభించడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఆశ్చర్యకరంగా ఉత్తరాది మార్కెట్ల కంటే దక్షిణాదిలోనే ఈ సినిమాకు కొంత మెరుగైన ఆదరణ కనిపించింది. చెన్నైలో 49 షోలలో అత్యధికంగా 47 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, హైదరాబాద్‌లో 192 షోలలో 31.8 శాతం, బెంగళూరులో 219 షోలలో 29 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముంబైలో 548 షోలకు గానూ 24 శాతం ఆక్యుపెన్సీ రాగా, దిల్లీ పరిసర ప్రాంతాలలో (NCR) ఏకంగా 980 షోలు ఉన్నప్పటికీ కేవలం 16.3 శాతం మంది మాత్రమే థియేటర్లకు వచ్చారు. వరుణ్ ధావన్ గత చిత్రం ‘బోర్డర్ 2’ మొదటి రోజే రూ. 30 కోట్లు, రెండో రోజు రూ. 36.50 కోట్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. దానితో పోలిస్తే ఈ సినిమా వసూళ్లు చాలా వెనుకబడి ఉన్నాయి.


ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెమ్మదించడానికి ప్రధాన కారణం.. అదే సమయంలో థియేటర్లలోకి వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీయేనని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు యాక్షన్ డ్రామా అయిన ‘పెద్ది’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్లకు పైగా వసూళ్లతో థియేటర్లను శాసిస్తుండటంతో, వరుణ్ ధావన్ సినిమాకు గట్టి పోటీ ఎదురైంది. రమేష్ తౌరానీ నిర్మాణంలో, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్‌తో పాటు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్, చంకీ పాండే, మనీష్ పాల్ కీలకపాత్రలు పోషించగా.. జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా, కృతి సనన్ , వరుణ్ సూద్ ప్రత్యేక పాత్రలలో మెరిశారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్‌లో పస లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

No comments:

Post a Comment

Featured post

బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’..

‘పెద్ది’ ప్రభంజనం ముంగిట తేలిపోయిన డేవిడ్ ధావన్ చిత్రం రెండు రోజుల్లో రూ. 23 కోట్లు మాత్రమే వసూలు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, ప్రముఖ ద...