- శాఖల మధ్య గోడలను బద్దలు కొట్టండి..
- ఐఏఎస్ అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
- కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పు రావాలని స్పష్టీకరణ
- భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా సరికొత్త పాలనా వ్యూహాలపై దేశ అత్యున్నత కార్యదర్శులతో పీఎం సుదీర్ఘ సమీక్ష
ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మక పథకాలు, విధానాల ప్రయోజనాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల జీవితాల్లో స్పష్టమైన, ప్రత్యక్ష మార్పును (Tangible impact) తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రధానినరేంద్ర మోడీ దేశ అత్యున్నత పరిపాలనా యంత్రాంగానికి పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన సివిల్ సర్వెంట్లు, ఐఏఎస్ కార్యదర్శులతో (Secretaries) నిర్వహించిన ఉన్నతస్థాయి కీలక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పాలనలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ పరిధి దాటి ఆలోచించకుండా విడివిడిగా పనిచేసే సంస్కృతికి పూర్తిగా స్వస్తి పలకాలని, అప్పుడే సమర్థవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, విభాగాల మధ్య ఉన్న అదృశ్య గోడలను బద్దలు కొట్టినప్పుడే దేశాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన నొక్కిచెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో దేశ సమగ్ర వృద్ధి, సుపరిపాలన , భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాత్మక మార్పులపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, అవి నిర్దేశిత లబ్ధిదారులకు వంద శాతం చేరుతున్నాయా లేదా అనే అంశంపైనే అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రధాని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటూ పరిపాలనలో పారదర్శకతను పెంచాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో బ్యూరోక్రసీ (అధికార యంత్రాంగం) పాత్ర అత్యంత కీలకమైనదని, అధికారులు మరింత చొరవతో, సమష్టి బాధ్యతతో పనిచేసి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పీఎం మోదీ ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.
No comments:
Post a Comment