- కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య కోసం కుటుంబ ఆర్థిక సహాయం తీసుకున్నారన్న ఆరోపణలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తన చదువులకు కుటుంబంపై ఆధారపడలేదని స్పష్టం చేశారు. బోస్టన్ యూనివర్సిటీ నుంచి లభించిన స్కాలర్షిప్తో పాటు విద్యా రుణం తీసుకుని చదువును పూర్తి చేశానని, ప్రస్తుతం ఆ రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నానని వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీప్కే, తన విద్యకు సంబంధించిన ఖర్చులపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ, "నాకు యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చింది. అదనంగా విద్యా రుణం తీసుకున్నాను. ప్రస్తుతం దాన్ని తిరిగి చెల్లిస్తున్నాను" అని చెప్పారు. ఇటీవల సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ, దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని పలు సంస్థలను కోరిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీజేపీ నిధులపై వస్తున్న ప్రశ్నలకూ దీప్కే సమాధానమిచ్చారు. భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాల కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, అందిన ప్రతి రూపాయి లెక్కను పూర్తిగా పారదర్శకంగా వెల్లడిస్తామని తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీక్కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమ సమయంలో ప్రజలే ఆహారం, తాగునీరు అందించి తమకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు.
మరోవైపు పార్టీ ప్రతినిధి వైష్ణవి గౌర్, ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విద్యా ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తే వారు, ఇతర నిధుల దుర్వినియోగంపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన నిరసనల అనంతరం తమ పార్టీపై బాధ్యత మరింత పెరిగిందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రజా సమస్యలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలోనే సీజేపీ బృందాన్ని విస్తరిస్తామని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. దేశంలో విద్య సామాన్య ప్రజలకు అందనంత ఖరీదుగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్య, ఉపాధి అంశాలపై రానున్న రోజుల్లో మరింత విస్తృత ఉద్యమాలు చేపడతామని వెల్లడించారు.