- 55 రోజుల్లో 10,006 ఉపాధ్యాయుల నియామకం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు, విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన సమగ్ర వివరాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు కలిపి మొత్తం 28,163 సంస్థలు ఉన్నాయని తెలిపారు. వీటిలో 28,77,177 మంది విద్యార్థులు, 1,57,408 మంది సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు 24,966 ఉండగా.. వాటిలో 19,79,614 మంది విద్యార్థులు, 1,20,455 మంది ఉపాధ్యాయులు ఉన్నారని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు 444 ఉండగా.. 1,95,000 మంది విద్యార్థులు, 6,359 మంది బోధనా సిబ్బంది ఉన్నారు.
రాష్ట్రంలో 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 39,323 మంది విద్యార్థులు, 1,321 మంది లెక్చరర్లు/సిబ్బంది ఉన్నారని చెప్పారు. అలాగే 152 డిగ్రీ కళాశాలల్లో 1,76,601 మంది విద్యార్థులు, 4,166 మంది బోధనా సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. 1,234 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4,67,988 మంది విద్యార్థులు, 23,390 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు.
ఆర్టీఈ నిబంధనల కంటే మెరుగైన నిష్పత్తి
విద్యా హక్కు చట్టం (RTE) నిబంధనల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని తెలిపారు. నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్థాయిలో ఉపాధ్యాయులను నియమించిందన్నారు.
55 రోజుల్లోనే 10,006 టీచర్ల నియామకం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై దృష్టి పెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. నోటిఫికేషన్ నుంచి నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు 55 రోజుల్లో 11,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి.. 10,006 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు చెప్పారు. ఎల్బీ స్టేడియంలో వారందరినీ ఒకచోటకు చేర్చి స్వయంగా నియామక పత్రాలు అందజేశామని సీఎం వివరించారు.
No comments:
Post a Comment