- ఉద్యోగ సంఘాల హెచ్చరిక
హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించి, పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలు, పదోన్నతులు, హెల్త్ కార్డులు, ఓపీఎస్ సహా పలు సమస్యలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ లేకుండా మూడేళ్లు గడిచిపోయినా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. మే 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలపై సానుకూలంగా స్పందించినప్పటికీ, ఆ సమావేశానికి నాలుగు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి ఉద్యోగులకు పదోన్నతులు కూడా కల్పించడం లేదని, హెల్త్ కార్డులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓపీఎస్ తీసుకొస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని గిరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆరు డీఏలు బకాయిలుగా ఉన్నాయని, ప్రతినెలా జీతం చెల్లించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మిగిలిన హామీలను కూడా అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
సచివాలయ ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడితో పనిచేస్తున్నారని, కనీస వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, నేటి ఆందోళన కేవలం ప్రారంభం మాత్రమేనని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని, గత ముఖ్యమంత్రులు ఎవరూ ఉద్యోగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసమే ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయని తెలిపారు. తమ డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కాదని స్పష్టం చేశారు.
టీజీఎస్ఏ జనరల్ సెక్రెటరీ ప్రేమ్ దేవేందర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వాన్ని భయపెడుతున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. హామీలు నెరవేర్చకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. డీఏల బకాయిల విషయంలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని విమర్శించారు.
ఉద్యోగులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ప్రేమ్ దేవేందర్ అన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి వ్యవహార శైలి సరిగా లేదని, పదోన్నతుల విషయంలోనూ మొండి వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ప్రమోషన్లు రాకుండా ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇళ్ల కేటాయింపు కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని పెండింగ్లో ఉన్న హామీలను అమలు చేయాలని సంఘాల నేతలు కోరారు.
No comments:
Post a Comment