బీజింగ్, ఆగస్టు 27: టిబెట్లో హిమనదం కూలిపోవడంతో సంభవించిన కొండచరియల విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ముగ్గురు మృతి చెందగా.. 558 మంది గల్లంతైనట్లు చైనా వెల్లడించింది.
చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకారం.. హిమనదం కూలిపోవడంతో భారీగా మట్టి, రాళ్లు కొట్టుకొచ్చి ఈ విపత్తు సంభవించింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులు ఉన్నట్లు ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. ఇద్దరు గ్రామస్థులను సురక్షితంగా రక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు.. నేపాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను బుధవారం ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో కనీసం 162 మంది మృతి చెందినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. మరో 403 మంది గల్లంతయ్యారు. వీరిలో 341 మంది విదేశీయులు ఉన్నారు.
గల్లంతైన విదేశీయుల్లో 133 మంది భారతీయులేనని నేపాల్ టూరిజం బోర్డు ప్రతినిధి సునీల్ శర్మ వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా దేశాలకు చెందిన పౌరులు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు.
వరదల బీభత్సానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమై ఉండటం, భవనాలు బురదలో కూరుకుపోవడం, వాహనాలు వరద నీటిలో మునిగిపోవడం కనిపించింది.