Tuesday, 18 August 2026

కాంగ్రెస్ పార్టీ మావోయిస్టు సిద్ధాంతాల్లోకి జారిపోతోంది


  • ముస్లిం లీగ్‌ తర్వాత ఇప్పుడు అదే దిశలో అడుగులు’: కిరణ్‌ రిజిజు



న్యూఢిల్లీ: ‘దిమాగీ నక్సల్స్‌’ అంశంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీ తన స్వరూపాన్ని మార్చుకుని మావోయిస్టు, నక్సలైట్‌ భావజాల సంస్థగా మారుతోందని ఆయన ఆరోపించారు. సోనియా గాంధీ నేతృత్వంలోని నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌లో గతంలో ఇలాంటి భావజాలం కలిగిన వ్యక్తుల ప్రభావం ఉండేదని, ఇప్పుడు మొత్తం కాంగ్రెస్‌ పార్టీనే మావోయిస్టు పార్టీగా మారుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఇప్పటికే ముస్లిం లీగ్‌ తరహాలో మారిందని ఆరోపించిన రిజిజు.. ఇప్పుడు మావోయిస్టు పార్టీగా మారే దిశగా పయనిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న అంశం, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గతంలో చెప్పిన విషయాన్నే ప్రతిధ్వనిస్తోందని ఆయన పేర్కొన్నారు. మావోయిజం, నక్సలిజం దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా ఉన్నాయని, వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు.


ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న నక్సలైట్లను చాలా వరకు అంతమొందించగలిగామని రిజిజు తెలిపారు. అయితే, నక్సలిజానికి సంబంధించిన భావజాలం పట్టణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోందని, దానిపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను ‘దిమాగీ నక్సల్స్‌’ గురించి మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీ ఆ వ్యాఖ్యలు తమ గురించేనని భావించిందని రిజిజు అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని వాదించే వారు, ఆర్టికల్‌ 370కి మద్దతు ఇచ్చేవారు, ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేయాలని కోరుకునేవారిని తాను ‘దిమాగీ నక్సల్స్‌’గా పేర్కొంటున్నానని స్పష్టం చేశారు.


నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబాల పట్ల కూడా ఇలాంటి వ్యక్తులకు సానుభూతి లేదని రిజిజు ఆరోపించారు. సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ వంటి బలగాలకు చెందిన సిబ్బంది నక్సలైట్‌ దాడుల్లో మరణించినప్పుడు, మావోయిస్టులు, ‘ఇంటెలెక్చువల్‌ నక్సల్స్‌’ సంబరాలు చేసుకుంటారని ఆయన విమర్శించారు. “నేను ‘దిమాగీ నక్సల్స్‌’ అని చెప్పేది ఇలాంటి వారినే. మరి కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇదే భావజాలాన్ని సమర్థిస్తుందా?” అని రిజిజు ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Featured post

హర్మూజ్‌.. అమెరికాలో కొత్త ప్రదేశం

  మ్యాప్‌ ఫొటోతో ట్రంప్‌ సంచలన పోస్ట్‌ హర్మూజ్‌ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశ...