కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తన పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్రెడ్డిపై 15 మంది దుండగులు అక్రమంగా ప్రాంగణంలోకి ప్రవేశించి మూకుమ్మడిగా దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. ఈ ఘటన అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఈ దాడి కాంగ్రెస్ గూండాల పనేనా? లేక పోలీసులను సాధారణ దుస్తుల్లో పంపించి కుట్రపూరితంగా ఈ దాడి చేయించారా? అని ప్రశ్నించారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ముసుగులు ధరించిన దుండగుల దాడిలో గాయపడిన మహేశ్, మహేందర్రెడ్డికి వెంటనే భద్రత కల్పించాలని, వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్యం అందించాలని కేటీఆర్ కోరారు. పోలీస్ స్టేషన్ లోపల, వెలుపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల నుంచి లభించే మొత్తం ఫుటేజీని తక్షణమే భద్రపరచాలని సూచించారు. ఈ చట్టవిరుద్ధ చర్యలో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ గూండాను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండబోదని హెచ్చరించారు.