- వ్యూహాత్మక భాగస్వామ్యంపై మరింత ముందడుగు
- రక్షణ, వాణిజ్యం నుంచి ఏఐ, అంతరిక్షం వరకు విస్తరిస్తున్న సహకారం
- అక్టోబర్లో జామ్ సాహెబ్ మెమోరియల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్
వార్సా: భారత్-పోలాండ్ దౌత్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తెలిపారు. పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రడోస్లా సికోర్స్కీతో ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చల అనంతరం వార్సాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఇరు దేశాల సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా ఎదిగిన తర్వాత సహకారం మరింత బలోపేతమైందన్నారు.
రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన సందర్భంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఇరువురు మంత్రులు సమీక్షించినట్లు జైశంకర్ వెల్లడించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. మైనింగ్, ఇంధనం వంటి సంప్రదాయ రంగాలతో పాటు అంతరిక్షం, డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణల రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
- పలు కీలక ఒప్పందాలపై కసరత్తు
సైబర్ భద్రత, అంతరిక్షం, క్లీన్ కోల్, రహస్య సమాచార మార్పిడి, కీలక ఖనిజాలు తదితర రంగాల్లో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు పనిచేస్తున్నాయని జైశంకర్ తెలిపారు. త్వరలో డిఫెన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం కానుందని వెల్లడించారు. ఈ చర్యలు భారత్-పోలాండ్ సంబంధాలకు మరింత లోతు, బలాన్ని చేకూరుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
- అక్టోబర్లో యువత మార్పిడి కార్యక్రమం
ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ‘జామ్ సాహెబ్ మెమోరియల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ రెండో విడత అక్టోబర్లో నిర్వహించనున్నట్లు జైశంకర్ ప్రకటించారు. పోలాండ్లో నవానగర్ జామ్ సాహెబ్ దిగ్విజయ్సింహ్జీని ‘దోబ్రీ మహారాజా’గా గౌరవంగా గుర్తుచేసుకుంటారని తెలిపారు. పోలిష్ విశ్వవిద్యాలయాల్లో ఇండాలజీ, సంస్కృత అధ్యయన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, దీనిని భారత్ అభినందిస్తోందన్నారు.
No comments:
Post a Comment