Showing posts with label #RajyaSabha #VandeMataram #NationalHonourBill #NationalSong #JanaGanaMana #NityanandRai #Parliament #India #NationalHonour #BJP. Show all posts
Showing posts with label #RajyaSabha #VandeMataram #NationalHonourBill #NationalSong #JanaGanaMana #NityanandRai #Parliament #India #NationalHonour #BJP. Show all posts

Wednesday, 29 July 2026

'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన చట్టబద్ధ రక్షణ

 

  • రాజ్యసభలో జాతీయ గౌరవ పరిరక్షణ సవరణ బిల్లు ఆమోదం

'వందే మాతరం'కు జాతీయ గీతం 'జనగణమన'తో సమాన చట్టబద్ధ రక్షణ కల్పించే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు–2026ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. 1971లో అమల్లోకి వచ్చిన జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు చేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, ఉద్దేశపూర్వకంగా 'వందే మాతరం'ను అవమానించడం, ఆలపించకుండా అడ్డుకోవడం లేదా దాని గానం జరుగుతున్న సమయంలో అంతరాయం కలిగించడం జాతీయ గీతాన్ని అవమానించినట్లుగానే నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, ఇది కేవలం చట్టసవరణ మాత్రమే కాదని, భారత జాతీయ చైతన్యం, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర్య సమర ఆదర్శాల పట్ల దేశం కలిగి ఉన్న సామూహిక నిబద్ధతకు ప్రతీక అని అన్నారు. 1971లో తీసుకొచ్చిన చట్టం ద్వారా జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం 'జనగణమన'కు గౌరవాన్ని పరిరక్షించే నిబంధనలు తీసుకొచ్చామని, ఇప్పుడు అదే రక్షణను 'వందే మాతరం'కూ కల్పిస్తున్నామని తెలిపారు. ఇకపై 'వందే మాతరం'ను ఉద్దేశపూర్వకంగా అవమానించినా, అడ్డుకున్నా ప్రస్తుతం జాతీయ గీతానికి ఉన్న చట్టాల ప్రకారమే శిక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా 'వందే మాతరం' చరిత్రను కూడా మంత్రి ప్రస్తావించారు. 1875లో బంకిమ్ చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని గుర్తుచేశారు. 1935లో జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 'వందే మాతరం'ను కేవలం రెండు చరణాలకు మాత్రమే పరిమితం చేశారని ఆరోపించారు. అయితే 1928లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ గీతానికి సంపూర్ణమైన, గౌరవప్రదమైన సంగీత రూపాన్ని సిద్ధం చేయాలని తిమిర్ బరన్ బెనర్జీని కోరారని చెప్పారు. అలాగే 1947 ఆగస్టు 15 ఉదయం స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆకాశవాణి ద్వారా పూర్తి 'వందే మాతరం'ను పాడాలని సర్దార్ వల్లభభాయ్ పటేల్, పండిట్ ఓంకార్‌నాథ్ ఠాకూర్‌ను కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

1950 జనవరి 24న రాజ్యాంగ సభలో తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటనను కూడా నిత్యానంద్ రాయ్ ప్రస్తావించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన 'వందే మాతరం'కు 'జనగణమన'తో సమాన గౌరవం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారని పేర్కొన్నారు. 'వందే మాతరం'ను వ్యతిరేకించడం దేశ గౌరవాన్ని దెబ్బతీసే ప్రసన్నీకరణ రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

చర్చను ప్రారంభించిన బీజేపీ ఎంపీ డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 123 సంవత్సరాలుగా 'వందే మాతరం'ను అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ గీతం స్ఫూర్తితోనే అనేక మంది విప్లవకారులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. 1923లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు 'వందే మాతరం'ను అవమానించారని ఆరోపించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గొల్ల బాబూరావు ఈ బిల్లును స్వాగతిస్తూ, జాతీయ గీతాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందన్నారు. 'వందే మాతరం' కేవలం ఒక పాట మాత్రమే కాదని, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రాణత్యాగాలకు స్ఫూర్తినిచ్చిన జాతీయ చైతన్య గీతమని పేర్కొన్నారు. ఈ గీతం స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిందని చెబుతూ బిల్లును తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేడీకి చెందిన సులతా దేవో, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఏఐఏడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం. తంబిదురై తదితరులు కూడా చర్చలో పాల్గొన్నారు.

బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టగా, సభ్యులు పలు అత్యవసర ప్రజా సమస్యలను ప్రస్తావించారు. అనంతరం సభను గురువారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.



Featured post

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం

హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం  నంది, గాయత్రి పంప్ హౌస్‌లలో మోటార్లు షురూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా...