- 'రాయన్' కంటే మంచి సినిమాలు వచ్చాయి
- జాతీయ అవార్డు వివాదంపై ధనుష్ స్పందన
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన అనంతరం తనకు వచ్చిన విమర్శలపై హీరో ధనుష్ తొలిసారిగా స్పందించాడు. 'కెప్టెన్ మిల్లర్' చిత్రానికి స్పెషల్ మెన్షన్ ఫర్ యాక్టింగ్ అవార్డు అందుకున్న ధనుష్, తన దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 'మేయ్యళగన్', 'మహారాజా' వంటి చిత్రాలే ఈ గౌరవానికి ఎక్కువ అర్హత కలిగినవని పలువురు అభిప్రాయపడడంతో వివాదం చెలరేగింది.తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ధనుష్, ఆ ఏడాది 'రాయన్' కంటే మెరుగైన తమిళ సినిమాలు విడుదలయ్యాయనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని తెలిపాడు. అయితే అందుకే తన విజయాన్ని లేదా ఆ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని తక్కువ చేసి చూడొద్దని అభిమానులను కోరాడు.
"'రాయన్'కు జాతీయ అవార్డు వచ్చింది. ఆ ఏడాది దానికంటే మంచి సినిమాలు కచ్చితంగా వచ్చాయి. ఆ చిత్రాల అభిమానులు తమ ప్రేమను వ్యక్తం చేశారు. వారి భావాలను నేను పూర్తిగా గౌరవిస్తున్నాను" అని ధనుష్ చెప్పాడు. అయితే ఏ సినిమా పేరును మాత్రం ఆయన ప్రస్తావించలేదు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, జాతీయ అవార్డు వస్తుందని ఎంతో ఆశించినప్పటికీ దక్కని ఎన్నో సినిమాలు ఉన్నాయని ధనుష్ వెల్లడించాడు. 'అదు ఒరు కానా కాలం' విడుదలైనప్పుడు తనకు కచ్చితంగా అవార్డు వస్తుందని అందరూ చెప్పారని, తాను కూడా చిన్న వయసులో ఎంతో ఆశపడ్డానని, కానీ అది జరగలేదని తెలిపాడు. అలాగే 'పుదుపెట్టై' చిత్రాన్ని కూడా ప్రస్తావించాడు.
అంతేకాదు, '3', 'మయక్కం ఎన్నా', 'వడ చెన్నై', 'కర్ణన్', 'మరియన్', 'రాంఝణా' వంటి తన ప్రశంసలు అందుకున్న చిత్రాలను గుర్తుచేసుకుంటూ, "ఈ సినిమాలకు కూడా జాతీయ అవార్డు వస్తుందని మీరు అందరూ చెప్పారు. కానీ రాలేదు" అని పేర్కొన్నాడు.
తాజా జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ, "కొన్ని విషయాలు ఎంత ప్రయత్నించినా మన చేతుల్లో ఉండవు. సమయం వచ్చినప్పుడు అవే మనకు దక్కుతాయి. నాకు కూడా అలాగే ఈ అవకాశం వచ్చింది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే, దాని కోసం నేను పడిన కష్టం మాత్రం నిజాయితీతో కూడినది. ఓ తమిళుడిగా నేను మరో రెండు జాతీయ అవార్డులు అందుకున్నాను. దాన్ని తక్కువ చేసి చూడకుండా సంబరంగా జరుపుకోండి" అని అభిమానులను కోరాడు.
ఈ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ చెప్పిన మాటలను కూడా ధనుష్ ఉదహరించాడు. "మీరు ఓడిపోయానని అంగీకరించే వరకు మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు" అనే అజిత్ వ్యాఖ్యను గుర్తు చేస్తూ అభిమానులు ఎప్పుడూ సానుకూలంగా ఉండాలని సూచించాడు. చివర్లో తనదైన శైలిలో, "నువ్వు బ్యాడ్ అయితే... నేను నీ డాడ్" అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో కార్తీ, అరవింద్ స్వామి నటించిన 'మేయ్యళగన్', అలాగే విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'మహారాజా' చిత్రాలే ఉత్తమ తమిళ చిత్ర అవార్డుకు ఎక్కువ అర్హత కలిగినవని అనేక మంది అభిప్రాయపడ్డారు. వాణిజ్యపరంగా విజయం సాధించినప్పటికీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే పొందిన 'రాయన్'కు అవార్డు రావడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది.
No comments:
Post a Comment