- దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనన్న ఆరెస్సెస్
- హోసబలే ప్రకటనను ఉదహరించిన మోహన్ భాగవత్
నాగ్పూర్: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందిన విరాళాల నిధులలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమాలపై (Embezzlement) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తీవ్రంగా స్పందించింది. నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ వివాదంపై స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో సంఘ్ అధికారిక వైఖరిని ఇప్పటికే ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారని, తాము అదే విధానానికి కట్టుబడి ఉన్నామని విలేకరులకు తెలిపారు. అంతకుముందు దత్తాత్రేయ హోసబలే విడుదల చేసిన వివరణాత్మక ప్రకటనలో.. కోట్ల మంది రామభక్తుల త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగా నిర్మితమైన రామాలయ హుండీ కానుకల చోరీ ఉదంతం దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం , భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోందని, ఈ విరాళాల దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వారికి చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడటం అత్యవసరమని డిమాండ్ చేశారు.
ఈ దురదృష్టకర సంఘటనను ఒక అసాధారణ విషయంగా పరిగణించి, ఆలయ ఆర్థిక నిర్వహణ , పరిపాలనా వ్యవస్థలలో ఉన్న లోపాలన్నింటినీ తక్షణమే సరిదిద్దాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను ఆరెస్సెస్ కోరింది. భక్తుల నమ్మకాన్ని, పారదర్శకతను కాపాడటానికి ట్రస్ట్ తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తమకు ఉందని పేర్కొంది. అలాగే, ఈ క్లిష్ట సమయంలో హిందూ సమాజం అంతా సంయమనం, ఓపిక పాటించాలని, ఈ దురదృష్టకర ఘటనను అడ్డుపెట్టుకుని హిందూ ధర్మానికి , సమాజానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది.
No comments:
Post a Comment