స్కూల్ డేస్, కాలేజీ డేస్ లో చదువుకున్న రోజులు వేరు. వృత్తి విద్యా కోర్సుల చదువులు వేరు. ఎందుకంటే శిక్షణ కాలం పూర్తయ్యే లోపు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తే జాబ్ కొట్టుకుంటే జీవితంలో సెట్ అవ్వొచ్చనే ఆలోచనే ఎక్కువమందిలో ఉంటుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇప్పటికీ టీచర్ జాబ్ అంటే క్రేజ్. 2004 లో బహుశా మా బ్యాచ్తోనే మొదలు అనుకుంటా. ప్రభుత్వం బీఎడ్ నుంచి లాంగ్వేజేఎస్ లను వేరు చేసి ఎల్పీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ చదివే సమయంలోనే అప్పటికే మద్యమ పూర్తి చేసిన నేను మా బంధువు పద్మ సూచన మేరకు ఎల్పీ సెట్ రాసిన. అప్పుడు ఆమె ఎంట్రెన్స్ టెస్ట్ లో క్వాలీఫై అయితేనే ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. సరే చూద్దామని రాసిన. మంచి ర్యాంకే వచ్చింది. మా ఏరియాలో అప్పటికే బీఎడ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నవాళ్లు, సీటు కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నవాళ్లు ఉన్నారు. వాళ్లెవరికీ బీఎడ్ లో మంచి ర్యాంకు రాలేదు. సీటు వచ్చే అవకాశాలు కనిపించలేదు. కానీ నాకు వచ్చిన ర్యాంక్ తో నాకు ఏకంగా నౌకరే వచ్చినట్టు ప్రచారం జరిగింది. నా వరకు మాత్రం ఇంటర్ , డిగ్రీలో లెక్కనే ఉంటుంది అనుకున్నాను. హిందీ పరిజ్ఞానం అంతంత మాత్రమే. గోదావరిఖని నుంచి పెద్దపల్లి రోజూ అప్ అండ్ డౌన్. శ్రీవాణి హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీ. గోదావరిఖని నుంచి నేను, నవీన్ , రజిత. మొదటి నాలుగైదు రోజులు పెద్దగా పలకరింపులు లేవు. ఆ కాలేజీలో క్లర్క్ సునీల్ మా అన్న క్లాస్మేట్. ఆయన తప్పా నాకు ఎవరూ తెలియదు. ట్రైనింగ్ అంటే ఆడుతూ పాడుతూ అయిపోతుంది అనుకున్నాను. కానీ చంద్రమణి సార్ చూసిన తర్వాత నాకే చాలామందికి శిక్షణ కాదు పెద్ద శిక్ష అనిపించింది. చదువుడు కంటే రాయడమే ఎక్కువ. సక్కగా డిగ్రీ పూర్తి చేసుకుని ఏ ఎంబీఏ పూర్తి చేసి మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసుకుంటే సరిపోయేది అప్పుడప్పుడు అనిపించేది.

కానీ కొంత కాలం గడిచిన తర్వాత చాలామంది కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ శ్రావణ్ బాగా దోస్త్ అయ్యాడు. మా బ్యాక్ బెంచ్లో హమీద్ పాషా, భిక్షపతి, బలరాం, విజయానంద్, విజయ్, ఆనంద్, నరేశ్...మాదంతా వేరే లోకం. క్లాస్ లు మాతో పాటు అప్పటికే టీచర్ ఉద్యోగం పొందిన (అన్ట్రైన్డ్ టీచర్లు ఉండేవారు). ఉన్నవాళ్లలో ఎక్కువమంది వరంగల్ నుంచి వచ్చేవారు. మధ్యాహ్నం ట్రైన్కు వాళ్లంతా వెళ్లిపోతే క్లాస్ సగం కంటే ఎక్కువ ఖాళీ అయ్యేది. నవీన్, రత్నం, సతీశ్, అశోక్, భిక్షపతి, శ్రీనివాస్, రమేశ్, పొట్టి రాజు అంతా ట్రైన్లో వచ్చేవారు. కానీ వారిలో నవీన్, భిక్షపతి మాతో కనెక్ట్ అయ్యారు. నిజానికి కోర్సు పూర్తయ్యేవరకు నవీన్ పెద్దగా ఎక్కడా బైటపడేవాడు కాదు. వాడి ఆలోచనలన్నీ నా లెక్కనే టీచర్ ఉద్యోగం కంటే వేరే వృత్తి మాత్రమే మనకు సెట్ అవుతుంది అన్నట్టు ఉండేది వాడి వైఖరి. ఇట్లా కొన్నిరోజులు గడవగానే... అసలు కథ మొదలైంది. నెల రోజులు టీచింగ్ ప్రాక్టిస్ వేర్వేరు స్కూళ్లలో వేశారు. రోజూ కలిసి ఉండే బ్యాచ్ లను విడదీసి 7-8 మంది చొప్పున వేర్వేరు చోట్ల స్కూళ్లకు పంపించారు.
మేము వెళ్లిన పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చారిత్రక నేపథ్యం ఉన్నది. మాజీ ప్రధాని పీవీ మొదలు ప్రముఖ రాజకీయ నాయకులకు ఆ స్కూల్ వేదిక. అక్కడ శ్రీనివాస్ సార్ మాకు ఇన్ ఛార్జి. అప్పటికే వేరే కాలేజీ నుంచి వచ్చిన తెలుగు పండిట్ వాళ్లు ఉన్నారు. మేము కలిపితే దాదాపు 15 మంది దాకా ఉంటాం. మా టీచింగ్ ప్రాక్టీస్ బ్యాచ్లో నవీన్, శ్రీనివాస్, రత్నం, నాతో పాటు సంగీతా భాయ్, అస్రా భానూ, రంజిత ఉన్నారు. మేము హిందీ, వాళ్లు తెలుగు మాత్రమే చెప్పాలి. దానికి రోజూ లెస్సన్ ప్లాన్ రాయాలి. దానికి అనుగుణంగా చదువు చెప్పాలి. నిజానికి అట్లా చదువు చెప్తే ఎవడికీ పాఠం అర్థం కాదు. కానీ అదో నిబంధన మాత్రమే. అయితే మాలో మిగితా వారి సంగతి నాకు పెద్దగా తెలియదు. కానీ నవీన్ అప్పటికే మాథ్స్ టీచర్. నాకు కొంత ఇంగ్లీష్ మీద అవగాహన ఉన్నది. దీంతో మా పిల్లలకు గ్రామర్ చెప్పాలని అడిగితే నేను టీచింగ్ ప్రాక్టీస్ పీరియడ్ అంతా నాకు తెలినంత వరకు చెప్పిన. నా పని ఏదో నేను చూసుకునే వాడిని. మిగతా వారి గురించి పెద్దగా ఆలోచించకపోయేవాడిని. ఎందుకంటే వాళ్లంతా పెద్దవాళ్లు. అందుకే మనకు ఎందుకులే అనుకునేవాడిని. కానీ ఆ నెలరోజుల్లో అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం.
మళ్లీ యథావిధిగా కాలేజీ వచ్చాక వేర్వేరు చోట్ల టీచింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ల అనుభవాలు చెప్తే వాళ్లందరితో పోలిస్తే మేము చేసిన చోట చాలా ప్రజాస్వామిక వాతావరణం ఉన్నది అనిపించింది. చూస్తుండగానే ఫైనల్ పరీక్షలు వచ్చాయి. పరీక్షలు పూర్తి చేస్తే ట్రైనింగ్ పూర్తవుతుంది. అయితే అప్పటివరకు చాలా స్ట్రిక్ట్ గా ఉన్న చంద్రమణి సార్ మొదటిసారి ఒకరికొకరు సాయం చేసుకోవాలని సూచించారు. ఏమి రాసినా మీకు ఇచ్చిన పేపర్లు నింపాలన్నారు. నిజానికి అతడి వల్లనే మంచి హిందీ వచ్చింది. పరీక్షలు అయిపోయాయి. చివరిరోజు అందరం కాలేజీ వచ్చాక ఫేర్వెల్ అన్ట్రైన్డ్ వాళ్లు ఫెయిల్ అవుతాము కావొచ్చు అని ఒకరిద్దు ఏడ్చారు. దీంతో కాలేజీ కరస్పాండెంట్ సత్యనారాయణ కోపంతో ఏదో అన్నట్టు గుర్తు. దీంతో చివరి రోజు పెద్దగా హడావుడి లేకుండానే ముగిసింది. అప్పటికి మొబైల్ లు పెద్దగా లేవు. చాలామంది ఏవో తీసుకొచ్చి అందులో అందరి హాబీస్, వేరే వేరే అంశాలపై ఉన్న ప్రశ్నల బుక్ నింపమని ఇచ్చారు. ఏదో రాసినం. అక్కడితో అయిపోయింది.
మళ్లీ పెద్దగా ఎవరిని కలువ లేదు. డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో ఉమ్మడి కరీంనగర్ లో పరీక్ష రాయడానికి వచ్చిన చాలామంది సెంటర్లలో బస్ స్టేషన్లో కలిశారు. ఆ టైంలోనే అనుకుంటా సతీశ్, స్వర్ణ, రజిత ఇంకా ఇద్దరు ముగ్గురికి జాబ్ వచ్చింది. మా బ్యాక్ బెంచ్ దోస్తులు ఫోన్ ద్వారా మళ్లీ కనెక్ట్ అయ్యారు. అప్పుడుప్పుడు కలిసేవాళ్లం. సోషల్ మీడియా వల్ల ముఖ్యంగా ఫేస్ బుక్ వల్ల ఇంకా కొంతమంది టచ్ లోకి వచ్చారు. ఓ వాట్సప్ గ్రూప్ కూడా పెట్టాం. అప్పుడప్పుడు అందులో మాట్లాడుకుంటాం. స్కూల్, కాలేజీ దోస్లులు వేరు. కానీ ట్రైనింగ్ సమయంలో పరిచయం అయిన వారు చాలాకాలం పాటు ట్రావెల్ కావడం చాలా అరుదు. కానీ దాదాపు 15మంది వరకు ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం. కుదిరినప్పుడు కలుస్తుంటాం. అప్పటి ఫన్నీ విషయాలు గుర్తుతెచ్చుకుని నవ్వుకుంటాం. మనమంతా మళ్లీ ఒకసారి కలువాలి. రీ యూనియన్ కోసం ప్లాన్ చేయమని అంటుంటారు. ఇప్పుడంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాలం కదా. కానీ ఈ బిజీ ప్రపంచంలో ఒకరోజు టైం ఇవ్వడం అంత ఈజీ కాదు. పైగా దాదాపు రెండు దశాబ్దాలు అయిపోయాయి. కానీ కలిసే అవకాశం వస్తే చాలామంది రావొచ్చు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ అందరిలో చాలా మార్పులు వచ్చాయి. మనుషులను కాదు పేర్లు చెబితే చాలు అన్నట్టు ఉంటుంది ఎక్కుమంది పరిస్థితి. చూద్దాం. ఈ ప్రోగ్రామ్ కార్యరూపం దాల్చాలంటే ముందుగా పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి? అందరిని ఎవరు సమన్వయం చేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలువాలన్నది సమాధానం లేదని ప్రశ్నలు. కానీ రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆనాటి జ్ఞాపకాల దొంతరలు కళ్లముందు కదలాడుతుంటాయి.