కీవ్పై రష్యా ‘హైపర్సోనిక్ ఒరెష్నిక్’ మిస్సైల్స్ తో దాడి
ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఆదివారం నాడు భయానకమైన ఘట్టం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై ఇటీవల జరిగిన దాడులకు ప్రతీకారంగా.. రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన 'ఒరెష్నిక్' (Oreshnik) హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ భారీ వైమానిక దాడిలో రష్యా ఏకంగా 600 పైగా డ్రోన్లు, 90 కి పైగా క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించింది. శబ్దాల కంటే పది రెట్లు వేగంతో ప్రయాణించే ఈ హైపర్సోనిక్ క్షిపణుల దాడి కారణంగా కీవ్ నగరంలోని నివాస సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భీకర దాడుల్లో కనీసం ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దాడిని ధృవీకరిస్తూ.. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ యుద్ధంలో రష్యా ఈ అధునాతన 'ఒరెష్నిక్' క్షిపణిని వాడటం ఇది మూడోసారి అని, కీవ్ రీజియన్లోని 'బిలా త్సెర్క్వా' నగరంపై ఇది నేరుగా దాడి చేసిందని తెలిపారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ దాడులను సమర్థించుకుంటూ.. ఉక్రెయిన్ మిలిటరీ కమాండ్ కేంద్రాలు, ఎయిర్ బేస్లు , సైనిక పారిశ్రామిక సంస్థలను లక్ష్యంగా చేసుకునే ఈ ప్రయోగాలు చేశామని ప్రకటించింది. కాగా, రష్యా ప్రయోగించిన వందలాది క్షిపణులు, డ్రోన్లలో మెజారిటీ శత్రువులను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ, అత్యంత వేగవంతమైన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను ఆపడంలో ఉక్రెయిన్ రక్షణ వలయం విఫలమైంది. అమెరికా సరఫరా చేసిన పేట్రియాట్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొరత కారణంగానే ఈ నష్టం వాటిల్లిందని, రాబోయే రోజుల్లో రష్యా దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment