Friday, 15 May 2026

నీట్ పేపర్ లీకేజీ గుట్టురట్టు


  • కెమిస్ట్రీ లెక్చరరే ఈ మహా కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారి
  • దేశవ్యాప్తంగా ఏడుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)  కీలకమైన పురోగతిని సాధించింది. ఈ భారీ విద్యా కుంభకోణం వెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించిన ప్రధాన సూత్రధారిని సీబీఐ అధికారులు విజయవంతంగా గుర్తించి, శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని పి.వి. కులకర్ణిగా గుర్తించారు. ఇతడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరఫున నీట్ పరీక్షల నిర్వహణ ప్రక్రియతో అనుసంధానమై ఉన్న ఒక కెమిస్ట్రీ లెక్చరర్ కావడం గమనార్హం. ఎన్‌టీఏ ప్రతినిధిగా పరీక్షల ప్రక్రియలో భాగస్వామి కావడంతో, ఇతడికి నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రాలను చూసే అవకాశం లభించిందని, ఆ అధికారంతోనే ఇతడు ఈ లీకేజీకి పాల్పడ్డాడని సీబీఐ వివరాలను వెల్లడించింది.



సీబీఐ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూలతహా లాతూర్ ప్రాంతానికి చెందిన కులకర్ణి, ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో మనీషా వాఘ్మారే అనే మరో నిందితురాలితో కలిసి పుణెలోని తన నివాసంలో కొందరు ఎంపిక చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ తరగతులను నిర్వహించాడు. ఈ కేసులో సహ నిందితురాలైన వాఘ్మారేను సీబీఐ మే 14నే అరెస్ట్ చేసింది. ఈ రహస్య కోచింగ్ క్లాసుల సమయంలో కులకర్ణి విద్యార్థులకు నీట్ పరీక్షలోని ప్రశ్నలను, వాటి ఆప్షన్లను, సరైన సమాధానాలను నోటితో చెప్పి నోట్‌బుక్స్‌లో రాయించాడు. మే 3న జరిగిన అసలు నీట్ పరీక్షలోని కెమిస్ట్రీ పేపర్‌తో విద్యార్థుల నోట్‌బుక్స్‌లో చేతిరాతతో ఉన్న ప్రశ్నలు వంద శాతం  సరిపోలాయని సీబీఐ స్పష్టం చేసింది. పుణెలో కులకర్ణిని సుదీర్ఘంగా విచారించిన అనంతరం అధికారులు అతడిని కటకటాల్లోకి నెట్టారు.


ఈ కేసు దర్యాప్తులో భాగంగా గత 24 గంటల్లో సీబీఐ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై ప్రస్తుతం ఫోరెన్సిక్ , టెక్నికల్ విశ్లేషణ జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా మే 12న సీబీఐ ఈ కేసును నమోదు చేసింది. కేసు నమోదైన వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.


ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహిల్యానగర్ (అహ్మద్ నగర్) ప్రాంతాల నుంచి మొత్తం ఏడుగురు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిలో ఐదుగురు నిందితులను ఇప్పటికే కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. గురువారం పట్టుబడిన మిగిలిన ఇద్దరు నిందితులను ఢిల్లీకి తరలించేందుకు గాను ట్రాన్సిట్ రిమాండ్ కోసం పుణె కోర్టులో ప్రవేశపెడుతున్నారు. లీకైన కెమిస్ట్రీ పేపర్ మూలాల ను కనిపెట్టడంతో పాటు, విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఈ రహస్య కోచింగ్ క్యాంపులకు తరలించిన దళారులను  కూడా గుర్తించామని, ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని సీబీఐ వర్గాలు వెల్లడించారు.

No comments:

Post a Comment

Featured post

హర్మూజ్ జలసంధిలో దాడిని తట్టుకుని.. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు సురక్షితంగా చేరిన చమురు ట్యాంకర్

భువనేశ్వర్/పారాదీప్:  పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హర్మూజ్ జలసంధిలో అపరిచిత శక్తుల నుంచి తుపాకీ కాల్పుల (Gunfire) దాడిన...