- వైట్హౌస్ వద్ద కలకలం
- చెక్పోస్ట్ సమీపంలో ముష్కరుడి కాల్పులు
- ఆగంతకుడిని మట్టుబెట్టిన సీక్రెట్ సర్వీస్ బలగాలు
- భద్రతా సిబ్బందికి ట్రంప్ కృతజ్ఞతలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్హౌస్ భద్రతా వలయాన్ని ఛేదించేందుకు ఒక దుండగుడు చేసిన ప్రయత్నం కలకలం రేపింది. వైట్హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న ఒక సెక్యూరిటీ చెక్పోస్ట్ వద్దకు శనివారం రాత్రి ఒక సంచితో వచ్చిన 21 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా రివాల్వర్ తీసి అక్కడి అధికారులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అత్యంత వేగంగా స్పందించి ఎదురుకాల్పులు జరపడంతో సదరు సాయుధ దుండగుడు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కాల్పుల సమయంలో అక్కడ ఉన్న ఒక సాధారణ పౌరుడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్ లోపలే ఇరాన్ శాంతి ఒప్పంద చర్చల్లో మునిగి ఉన్నారు. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వైట్హౌస్ వర్గాలు నిర్ధారించాయి.
ఈ ఘాతుకంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతా ద్వారా స్పందిస్తూ, తక్షణమే రంగంలోకి దిగి ముప్పును అడ్డుకున్న సీక్రెట్ సర్వీస్ బృందాలకు , లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మరణించిన నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని, వైట్హౌస్ భవనంపై అతను ఒక రకమైన పిచ్చితో ఉన్నాడని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో జరిగిన వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కాల్పుల ఘటనను కూడా ఆయన గుర్తు చేస్తూ, భవిష్యత్తులో అధ్యక్షుల రక్షణ కోసం వాషింగ్టన్ డీసీలో అత్యంత పటిష్టమైన సురక్షిత కేంద్రాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దేశ జాతీయ భద్రత దీనిని డిమాండ్ చేస్తోందని పునరుద్ఘాటించారు. దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణ ప్రకారం, సదరు నిందితుడు గతంలోనూ వైట్హౌస్లోకి చొరబడేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయ్యాడని, మానసిక సమస్యలతో చికిత్స పొందాడని భద్రతా అధికారులు వెల్లడించారు.
No comments:
Post a Comment