Saturday, 30 May 2026

ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు

 ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు
రాజస్థాన్ రాష్ట్రాన్ని భీకర ఇసుక తుపాను  వణికించింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులకు దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో పగటిపూటే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఈ ఊహించని ప్రకృతి పరిణామంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్‌, బికనీర్‌, సీకర్‌ తదితర ప్రాంతాలపై ఈ ఇసుక తుపాను తీవ్ర ప్రభావం చూపింది. నిమిషాల వ్యవధిలోనే వందల అడుగుల ఎత్తున ఇసుక గోడల తరహాలో మేఘాలు దూసుకురావడంతో దారిపొడవునా ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తమ వాహనాల లైట్లు వేసుకుని రోడ్లపైనే నిలిపివేయాల్సి వచ్చింది. ఇసుక తుపాను సృష్టించిన ఈ బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి.

వెనువెంటనే భారీ వర్షం
ఇసుక గాలులు వీచిన కాసేపటికే వాతావరణం పూర్తిగా చల్లబడి ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంతకుముందు శుక్రవారం కూడా రాజధాని జైపుర్‌ సహా పలు ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణం కనిపించింది. రాష్ట్రంలోని ధోల్‌పుర్‌ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఇసుక తుపాను తెచ్చిన ముప్పుతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

మరో ఐదు రోజులు అలర్ట్
రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని జైపుర్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జైపుర్‌, అజ్‌మేర్‌, బికనీర్‌, కోటా, జోధ్‌ఫుర్‌, ఉదయ్‌పుర్‌ డివిజన్లలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.


No comments:

Post a Comment

Featured post

ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు

  ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు రాజస్థాన్ రాష్ట్రాన్ని భీకర ఇసుక తుపాను  వణికించింది. శనివారం మధ్...