- సీవీ షణ్ముగం సహా తిరుగుబాటు నేతలపై ఎడప్పాడి పళనిస్వామి వేటు
- విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడమే కారణం
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి తన పార్టీలోని తిరుగుబాటు నేతలపై ఉక్కుపాదం మోపారు. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసిన పార్టీ సీనియర్ నాయకులు సి.వి. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి సహా పలువురు ఎమ్మెల్యేలను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విప్ ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన 26 మంది నేతలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ మొదటి బలపరీక్షలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు చీలిపోవడం పార్టీలో ఉన్న తీవ్ర విభేదాలను బహిర్గతం చేసింది.
పళనిస్వామి తీసుకున్న ఈ కఠిన చర్యను సీవీ షణ్ముగం తీవ్రంగా ఖండించారు. పార్టీ నియమావళి ప్రకారం ఈ తొలగింపు చెల్లదని, కనీసం వివరణ కోరకుండానే పదవుల నుంచి తొలగించడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా తాము ప్రజాభిప్రాయాన్ని గౌరవించామని షణ్ముగం వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో తిరుగుబాటు చేసిన 12 మంది ఎమ్మెల్యేల స్థానంలో పళనిస్వామి కొత్త జిల్లా కార్యదర్శులను నియమిస్తూ పార్టీని తన పట్టులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు శశికళ కూడా స్పందిస్తూ.. డీఎంకే వంటి శక్తులకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో తమిళ రాజకీయాల్లో ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
No comments:
Post a Comment