- ఆదా చేసిన సమయంలో 40 శాతం మళ్లీ సరిదిద్దడానికే సరి
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై షాకింగ్ నివేదిక
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల పని వేగం పెరుగుతుందని, సమయం ఆదా అవుతుందని భావిస్తున్న ఉద్యోగులకు, సంస్థలకు ఒక తాజా నివేదిక కళ్లు తెరిపించే వాస్తవాలను వెల్లడించింది. ఏఐ ద్వారా ఆదా అవుతున్న పని సమయంలో దాదాపు 40 శాతం మళ్లీ అదే పనిని సరిదిద్దడానికి వెచ్చించాల్సి వస్తున్నదని ఒక పరిశోధనా నివేదిక స్పష్టం చేసింది. ఏఐ అందించే సమాచారంలో కచ్చితత్వం లేకపోవడం, తప్పులు దొర్లడం లేదా హ్యూమన్ టచ్ లోపించడం వల్ల ఉద్యోగులు ఆ పనిని మళ్లీ మొదటి నుంచి తనిఖీ చేసి సవరించాల్సి వస్తున్నదని ఈ నివేదిక పేర్కొంది. ఫలితంగా ఏఐ వల్ల లభిస్తున్న 'సమయ పొదుపు' ప్రయోజనం గణనీయంగా తగ్గిపోతున్నది.
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అది ఇచ్చే ఔట్పుట్ను నిశితంగా పరిశీలించకపోతే ఉత్పాదకత దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్ రైటింగ్, కోడింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాలలో ఏఐ సృష్టించిన ఫలితాలను సరిచేయడానికి ఉద్యోగులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పని నాణ్యత విషయంలోనూ అదనపు ఒత్తిడిని పెంచుతున్నది. ఏఐని ఒక సాధనంగా మాత్రమే చూడాలని, అది ఇచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా మానవ మేధస్సుతో సరిచూసుకోవడం అత్యంత అవసరమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తున్నది. సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇవ్వకపోతే, ఈ రీ-వర్క్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment