- తిరుప్పూర్ ఈవెంట్లో కలకలం
- ఘటన తర్వాత ఆయన తొలి స్పందన ఇదే!
ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుకు తిరుప్పూర్లో చేదు అనుభవం ఎదురైంది. గత బుధవారం (జనవరి 21) జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వెలుపల జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చినప్పుడు, ఒక మహిళ ఆయనపైకి చెప్పు విసిరింది. 'కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి' ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన వైరముత్తుకు అధికారులు, న్యాయవాదులు స్వాగతం పలుకుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ చెప్పు ఆయనకు తగలకుండా పక్కనే ఉన్న గుంపులో పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఆ మహిళను 45 ఏళ్ల జయగా గుర్తించారు. ఆమె కొంతకాలంగా తన వ్యక్తిగత సమస్యలపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతోందని, ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని అధికారులు వెల్లడించారు. గతంలో కూడా ఆమె కలెక్టరేట్, కోర్టు ప్రాంగణాల్లో ఇలాంటి ఆందోళనలకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. తన ఫిర్యాదులపై అధికారులు స్పందించడం లేదనే కోపంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వైరముత్తు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే, ఆయన తనపై జరిగిన చెప్పు దాడి గురించి ఎక్కడా ప్రస్తావించకుండా, తిరుప్పూర్లో తాను పాల్గొన్న మరో కార్యక్రమం గురించి రాసుకొచ్చారు. "తిరుప్పూర్లో జరిగిన 'వళ్లువర్ బోధనలు - వైరముత్తు ప్రసంగం' కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వారి కరతాళ ధ్వనుల మధ్య నేను నన్ను నేను మర్చిపోయాను" అంటూ తన పర్యటనలోని సానుకూల అంశాలను పంచుకున్నారు. వైరముత్తుపై గతంలో సింగర్ చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఈ చెప్పు దాడి ఘటన కోలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది.
No comments:
Post a Comment