- ముస్లింల నమాజ్కు కూడా అనుమతి
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్శాలా-కమల్ మౌలా మసీదు సముదాయంలో రేపు (శుక్రవారం) వసంత పంచమి వేడుకలు జరుపుకోవడానికి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వసంత పంచమి, శుక్రవారం ఒకేరోజు రావడంతో రెండువర్గాల అభ్యర్థనలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం, హిందూ భక్తులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అక్కడ పూజలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో ముస్లిం సోదరులు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చింది. నమాజ్ కోసం వచ్చే వారి జాబితాను ముందుగానే జిల్లా యంత్రాంగానికి అందజేయాలని కోర్టు ఆదేశించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. ఇరువర్గాలు పరస్పర గౌరవంతో వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. వివాదాస్పద ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. పురావస్తు శాఖ (ASI) రక్షణలో ఉన్న ఈ 11వ శతాబ్దపు కట్టడాన్ని హిందువులు వాగ్దేవి (సరస్వతీ దేవి) ఆలయంగా భావిస్తుండగా, ముస్లింలు దీనిని కమల్ మౌలా మసీదుగా పిలుస్తారు. 2003లో ఏఎస్ఐ కుదిర్చిన ఒప్పందం ప్రకారం ఇక్కడ ప్రతి మంగళవారం హిందువులు పూజలు, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ నిర్వహిస్తున్నారు. ఈసారి వసంత పంచమి రోజునే శుక్రవారం రావడంతో తలెత్తిన ఉత్కంఠకు సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో తెరపడింది.
No comments:
Post a Comment