- ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
- కొత్త అధ్యక్షుడికి అగ్రనేత సాటిలేని గౌరవం
- కమలదళంలో జోష్!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మంగళవారం ఢిల్లీలో నబిన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోడీ ఆయనకు అభినందనలు తెలుపుతూ వినమ్రంగా స్పందించారు. ఇకపై నితిన్ నబిన్ గారే మా అందరికీ బాస్ అని, తాను మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేసే ఒక సాధారణ కార్యకర్తనే అని మోడీ వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణ, వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అట్టడుగుస్థాయి నుంచి వచ్చిన నాయకులకు బీజేపీలో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం 45 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి సారథ్యం వహించే అవకాశం దక్కించుకున్న నితిన్ నబిన్ను మోడీ మనస్ఫూర్తిగా అభినందించారు. నబిన్ సంస్థాగత నైపుణ్యం, పాలనా అనుభవం పార్టీకి గొప్ప ఆస్తి అని, ఆయన నేతృత్వంలో బీజేపీ మరింత శక్తివంతంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా, బిహార్ మంత్రిగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో నబిన్ తనదైన ముద్ర వేశారని మోడీ కొనియాడారు. ప్రధాని వంటి అగ్రనేత తనను 'బాస్' అని సంబోధించడంతో నితిన్ నబిన్ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మార్గదర్శకత్వంలో కార్యకర్తగా పార్టీ సేవలో తరిస్తానని ఆయన వినమ్రంగా చెప్పారు. నితిన్ నబిన్ రాకతో బీజేపీలో నవశకం ప్రారంభమైందని, యువ నాయకత్వం దిశా నిర్దేశంలో పార్టీ రాబోయే ఎన్నికల్లో ఘనవిజయాలు సాధిస్తుందని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
No comments:
Post a Comment