Friday, 16 January 2026

నీలి విప్లవానికి ఇజ్రాయెల్ ఊతం

India, Israel Sign Joint Declaration to Boost Cooperation in Fisheries and Aquaculture
మత్స్య సాగులో సరికొత్త సాంకేతిక విప్లవం
భారత్‌తో చరిత్రాత్మక ఒప్పందం!

న్యూఢిల్లీ/టెల్ అవీవ్: మత్స్య, ఆక్వాకల్చర్ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్ - ఇజ్రాయెల్ దేశాలు ఒక కీలకమైన ఉమ్మడి మంత్రిత్వశాఖ ప్రకటనపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్‌లోని ఐలాట్ (Eilat) నగరంలో జరిగిన ‘రెండవ గ్లోబల్ సమ్మిట్ ఆన్ బ్లూ ఫుడ్ సెక్యూరిటీ: సీ ద ఫ్యూచర్ 2026’ వేదికగా ఈ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి ఈ సదస్సులో పాల్గొన్నారు. మత్స్య సంపద ద్వారా ఆహార భద్రతను నిర్ధారించడంతో పాటు, రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం.

'బ్లూ ఎకానమీ'ని అభివృద్ధి చేయడంలో భాగంగా

ఈ ఒప్పందంలో భాగంగా, ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక 'వాటర్ సేవింగ్' సాంకేతికతను భారతీయ మత్స్య సాగులో ప్రవేశపెట్టనున్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించే అధునాతన ఆక్వాకల్చర్ పద్ధతులు, జన్యుపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, సముద్రపు పాచి (Seaweed) సాగు వంటి 'మారికల్చర్' రంగాల్లో ఉమ్మడి పరిశోధనలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా 'బ్లూ ఎకానమీ'ని అభివృద్ధి చేయడంలో భాగంగా, మత్స్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లకు రెండు దేశాలు పూర్తి మద్దతు, సహకారాన్ని అందించనున్నాయి. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే, బాధ్యతాయుతమైన వేట పద్ధతులను అవలంబించేలా శిక్షణ,  సామర్థ్య పెంపుదలపై ఈ ఒప్పందం ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

సముద్ర ఆహార ఉత్పత్తుల రంగంలో విప్లవాత్మక మార్పులు

మూడురోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సు నిన్నటితో ముగిసింది. ఇజ్రాయెల్  సాంకేతిక నైపుణ్యం, భారత్  అపారమైన జలవనరులు కలిసి పనిచేయడం వల్ల భవిష్యత్తులో సముద్ర ఆహార ఉత్పత్తుల రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే వ్యవసాయ రంగంలో 43 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్'లను విజయవంతంగా నడుపుతున్న ఇరు దేశాలు, ఇప్పుడు మత్స్య రంగంలోనూ అదే తరహా అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...