Thursday, 15 January 2026

ప్రభుత్వ తీరుపై ఉద్ధవ్ ఠాక్రే నిప్పులు


  • ఓటర్ల జాబితాలో పేర్ల గైర్హాజరీపై 'సిగ్గులేని ప్రభుత్వం' అంటూ ఆగ్రహం
  • ఎన్నికల ప్రక్రియపై సంచలన ఆరోపణలు

ముంబై: బృహన్ ముంబై  మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓటర్ల జాబితాలో భారీగా పేర్లు గైర్హాజరు కావడం, పాత ఈవీఎం యంత్రాల వినియోగం, చెరిగిపోయే సిరా వాడుతున్నారనే వార్తలపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పాలకులను "సిగ్గులేని ప్రభుత్వం" అని అభివర్ణించిన ఆయన, తమకు అనుకూలంగా ఫలితాలను మార్చుకోవడానికే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితా నుంచి వేలాదిమంది పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన ఆరోపించారు.

Uploading: 1461335 of 1461335 bytes uploaded.


ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపించిందని దుయ్యబట్టిన ఉద్ధవ్, అందుకే కేంద్ర ప్రభుత్వం 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' తీసుకురావాలని పట్టుబడుతున్నదని విమర్శించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేసి అధికారంలోకి రావచ్చనేది వారి కుట్ర అని ఆయన విశ్లేషించారు. ముంబై లాంటి నగరంలోనే ఓటర్ల పేర్లు మాయమవ్వడం చూస్తుంటే, ఎన్నికల కమిషన్ పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ పాలక పక్షానికి తొత్తులుగా మారాయని, ఈ అక్రమాలపై ప్రజలు తమ ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ముంబై అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...