- బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
జనరేషన్ జెడ్పై తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యోగా గురువు బాబా రామ్దేవ్ చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. తన యవ్వనం, వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా రామ్దేవ్కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన యువత నిరసనలపై కంగనా గతంలో చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. కొందరు యువ నిరసనకారులను ఆమె ‘జనరేషన్ గట్టర్’గా అభివర్ణించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, జంతర్ మంతర్లో జరిగిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న యువత మొత్తాన్ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని కంగనా వివరణ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, మహిళలను మాత్రమే ఉద్దేశించి మాట్లాడానని స్పష్టం చేశారు. యువతలో కొందరు మాదకద్రవ్యాలు, బెట్టింగ్, జూదం, డార్క్ వెబ్ వంటి వ్యసనాలకు గురవుతున్న అంశాన్ని ప్రస్తావించానని కంగనా తెలిపారు. ఒక నిర్దిష్ట వర్గం యువత గురించి మాట్లాడటం అంటే మొత్తం యువతను కించపరిచినట్లు కాదని ఆమె అన్నారు.
ఈ వివాదంపై స్పందించిన బాబా రామ్దేవ్.. కంగనా గత జీవితం, ఆమె యవ్వనం ఎలా ఉండేదో ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్తా కథనాన్ని కంగనా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘‘బాబాజీ.. నా యవ్వనం, బెడ్రూమ్ గురించి కలలు కనొద్దు. వదంతులు, గాసిప్ల ఆధారంగానే ఎవరైనా ఊహాగానాలు చేయగలరు’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. తప్పుడు లేదా మోసపూరితమైన ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి తనకు ఎప్పుడూ మందలింపు రాలేదని పేర్కొన్నారు. ‘‘కాబట్టి నాకు వ్యక్తిత్వ పాఠాలు చెప్పొద్దు. నా క్యారెక్టర్ మీకంటే చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడ ఎలాంటి మోసం బయటపడలేదు’’ అంటూ రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో జనరేషన్ జెడ్పై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది.
No comments:
Post a Comment