- షరతులతో క్షమాభిక్షకు ఎర్డోగాన్ ఆమోదం
కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)తో తుర్కియే ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన శాంతి ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. వేలాది మంది కుర్దిష్ మిలిటెంట్లకు కొన్ని షరతులకు లోబడి క్షమాభిక్ష కల్పించే చట్టంపై తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సంతకం చేశారు. ఈ చట్టాన్ని అధికారిక గెజిట్లోనూ ప్రచురించారు. అయితే, పీకేకేకు చెందిన మిలిటెంట్లు పూర్తిగా నిరాయుధులయ్యారని తుర్కియే భద్రతా మండలి ధ్రువీకరించిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తుర్కియేలో కుర్దులు తమ హక్కుల కోసం దశాబ్దాలుగా సాయుధ పోరాటం కొనసాగిస్తున్నారు. పీకేకేను అణచివేసేందుకు తుర్కియే ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా చర్యలు చేపట్టింది. అయితే ఇటీవల ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియలో భాగంగా తుర్కియే పార్లమెంట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని పీకేకే సభ్యుల శిక్షలను నిలిపివేయడం, ప్రస్తుతం కొనసాగుతున్న కేసుల విచారణలను ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు వాయిదా వేయడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. ఈ కాలంలో వారు మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడకపోతే కేసులను పూర్తిగా ఎత్తివేసే అవకాశం కూడా కల్పించారు. దీంతో తుర్కియే-కుర్దుల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణకు ముగింపు పలికే దిశగా ఈ నిర్ణయం కీలక పరిణామంగా భావిస్తున్నారు.
No comments:
Post a Comment