- బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ముమ్మరం..
- హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాల ధ్వంసం సెక్షన్ల కింద కేసు నమోదు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ (Disha Salian) అనుమానాస్పద మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య ఠాక్రే, నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి , రియా చక్రవర్తిల పేర్లను చేర్చినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. హత్య, సామూహిక అత్యాచారం, ఆధారాలను ధ్వంసం చేయడం వంటి తీవ్రమైన బిఎన్ఎస్/ఐపిసి సెక్షన్ల కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. బాంబే హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన రెండు వారాల వ్యవధిలోనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఎఫ్ఐఆర్లోని సంచలన అంశాలు
ఈ ఘటన జరిగిన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే కేసును బయటకు రాకుండా చేసేందుకు ,ఆధారాలను కప్పిపుచ్చేందుకు తన అధికార పదవిని ఉపయోగించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఆనాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే కొందరు పోలీసులు, ప్రభుత్వ అధికారులు కేసు పత్రాలు, శవపరీక్ష నివేదికలు, ఇతర ప్రభుత్వ రికార్డులను ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కుట్రలో భాగస్వాములైన అధికారులందరూ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కేసులోని పూర్తి రికార్డులను తమకు వెంటనే అప్పగించాలని మహారాష్ట్ర పోలీసులకు సీబీఐ లేఖ రాసింది.
కేసు నేపథ్యం
దిశా శాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని ఒక బహుళ అంతస్తుల భవనం నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పట్లో ముంబై పోలీసులు దీనిని ఆత్మహత్యగా తేల్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే (జూన్ 14న) నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఫ్లాట్లో శవమై కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇటీవల దిశ తండ్రి సతీశ్ శాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించి, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, డినో మోరియా, సూరజ్ పంచోలిల ప్రమేయంపై ఆరోపణలు చేశారు. ప్రముఖుల ప్రభావం వల్లే స్థానిక పోలీసులు కేసును పక్కదారి పట్టించారని వాదించడంతో, న్యాయస్థానం నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.