Monday, 14 September 2026

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశ్.. గవర్నర్‌ దంపతుల తొలిపూజ




హైదరాబాద్ (ఖైరతాబాద్): వినాయక చవితి పండగను పురస్కరించుకుని హైదరాబాద్ ఖైరతాబాద్‌లో 69 అడుగుల భారీ ఎత్తులో రూపుదిద్దుకున్న ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ దర్శనమిస్తున్నాడు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు స్వామివారికి తొలి పూజ నిర్వహించారు.


మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికి మండపం వద్దకు తోడ్కొని వెళ్లారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు.



ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. స్వరాజ్య ఉద్యమ కాలంలో మహారాష్ట్రలో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలకు, ఖైరతాబాద్ గణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించిందన్నారు. గత 72 ఏళ్లుగా ఇక్కడ ఏటా భిన్న రూపాల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.



పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి భారీ కండువా, యజ్ఞోపవీతం సమర్పించారు. బడా గణేశుడిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

No comments:

Post a Comment

Featured post

పీఆర్వో, పీఏపై 15 మంది దుండగుల దాడి

కేటీఆర్‌ సంచలన ఆరోపణలు హైదరాబాద్‌: తన పీఆర్వో మహేశ్‌, పీఏ మహేందర్‌రెడ్డిపై 15 మంది దుండగులు అక్రమంగా ప్రాంగణంలోకి ప్రవేశించి మూకుమ్మడిగా దాడ...