- భారత ఆహార వైవిధ్యాన్ని ప్రదర్శించాలంటే మాంసాహారం, సముద్ర ఆహారాన్నీ వడ్డించాలి
- శాకాహారం మాత్రమే పెట్టడం ఉద్దేశపూర్వకమే: కాంగ్రెస్ ఎంపీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14:
బ్రిక్స్ సదస్సులో విదేశీ నేతలకు ఏర్పాటు చేసిన శాకాహార విందుపై కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ఆతిథ్య సంప్రదాయాలను గౌరవిస్తూనే దేశంలోని పూర్తి సాంస్కృతిక, ఆహార వైవిధ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు.
భారత్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మాంసాహారం తీసుకుంటారని, అలాంటప్పుడు భారతీయ వంటకాల వైవిధ్యాన్ని చూపించేందుకు మాంసం, సముద్ర ఆహారాన్ని కూడా మెనూలో చేర్చాల్సిందని కార్తి చిదంబరం అన్నారు. శాకాహారం కోరుకునేవారికి ఆ ఎంపికను అందిస్తూనే ఇతర ఆహార సంప్రదాయాలకూ ప్రాతినిధ్యం కల్పించాల్సిందని పేర్కొన్నారు.
‘‘భారత్ను ప్రదర్శించేటప్పుడు ఒకే రకమైన సాంస్కృతిక విధానాన్ని మాత్రమే చూపించాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని ప్రాంతాల ఆహార సంస్కృతులనూ ప్రతిబింబించాలి’’ అని ఆయన అన్నారు.
బీజేపీపై కూడా కార్తి చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ అగ్రవర్ణ, హిందూ, శాకాహార, ఉత్తర భారత రాజకీయ పార్టీ. ఆ పార్టీ రాజకీయ విశ్వాసాల ప్రభావంతోనే దేశాన్ని ఒక నిర్దిష్ట సాంస్కృతిక రూపంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది’’ అని ఆరోపించారు.
బ్రిక్స్ సదస్సు గాలా విందులో పూర్తిగా శాకాహార మెనూను ఏర్పాటు చేయడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రపంచ నేతలకు పరిచయం చేయాలంటే మాంసాహార, సముద్ర ఆహార సంప్రదాయాలకూ చోటు కల్పించాల్సిందని స్పష్టం చేశారు.