హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) మంగళవారం వెల్లడించింది.రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ జులై 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్ఏఆర్ పీపీఎల్ మెన్ కానిస్టేబుల్ 24, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ 1,380, ఫైర్ ఫైటర్ 751, జైలు వార్డర్ 208 పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ సెప్టెంబర్ 9గా నిర్ణయించారు. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని గడువును మరో వారం పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 2,88,530 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్లినట్లు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది. అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా 95 శాతానికి పైగా పూర్తయినట్లు వెల్లడించింది.చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బోర్డు హెచ్చరించింది. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.