- ఏబీవీపీ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేత అతుల్ లిమయే పిలుపు
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సంయుక్త ప్రధాన కార్యదర్శి అతుల్ లిమయే పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీ వేదికగా జరిగిన సీజేపీ నిరసనలను (CJP Movement) ఒక ముఖ్యమైన కేస్ స్టడీగా తీసుకొని, సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సమాజంలో జరిగే ఏ ఉద్యమాన్నైనా కేవలం ఒక సాధారణ సంఘటనగా చూసి వదిలేయకుండా, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, వ్యూహాలను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆన్లైన్ డిజిటల్ వేదికగా మొదలైన సీజేపీ (CJP) అతి తక్కువ వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విస్తరించి, అన్ని వర్గాల ప్రజల మద్దతును కూడగట్టడంపై అతుల్ లిమయే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రధానంగా యువత నాయకత్వంలో ప్రారంభమైనప్పటికీ.. రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు, కార్మికులు, పర్యావరణవేత్తలు మరియు వివిధ రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఏ అంశాలు కీలక పాత్ర పోషించాయనే దానిపై విశ్లేషణ జరగాలని అభిప్రాయపడ్డారు. ఇంతటి వైవిధ్యమైన సమాజ భాగస్వాములను, విభిన్న సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చిన శక్తులు ఏవనేది శోధించాలని, ఒక సామాజిక ఉద్యమం ఇంత వేగంగా రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందడానికి గల మూల కారణాలను విద్యార్థులు శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.