విశాఖపట్నం: భారత నౌకాదళానికి చెందిన తూర్పు ఫ్లీట్ (Eastern Fleet) కు చెందిన అత్యాధునిక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి, కవరత్తి, శక్తి నిన్న సింగపూర్లోని ప్రతిష్టాత్మక చాంగి నావల్ బేస్కు (Changi Naval Base) చేరుకున్నాయి. ఈ నౌకాదళ పర్యటన భారత్-సింగపూర్ దేశాల మధ్య ఉన్న బలమైన, సుదీర్ఘమైన రక్షణ , వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆగ్నేయాసియా (South East Asia) ప్రాంతంలో భారత నౌకాదళం క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న కార్యాచరణ మోహరింపులో భాగంగానే ఈ పర్యటన సాగుతోందని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల నౌకాదళ సిబ్బంది పరస్పర వృత్తిపరమైన అనుభవాలను పంచుకోవడంతో పాటు సముద్ర భద్రతపై ఉమ్మడి వ్యాయామాల్లో పాల్గొననున్నారు.