Monday 29 April 2024

ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా వెనుక!

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు.లోక్‌సభ ఎన్నికలలో AAPతో పొత్తు పెట్టుకోవడం తన రాజీనామాకు ఒక కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్టు పేర్కొన్నారు.


అరవిందర్ సింగ్ లవ్లీ కన్హయ్య కుమార్ పై విమర్శలు చేశారు. దీంతో ఆయన రాజీనామా వెనక బీజేపీ ఉన్నదనే వాదనలు ఉన్నాయి.


ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య  కన్నయ్య కుమార్ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై పోటీకి దిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఢిల్లీ లోని 7 లోక్ సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన కమల నాథులకు కాంగ్రెస్+ఆప్ అలయెన్స్ సవాల్ విసురుతున్నదని సమాచారం. అందుకే ఇండియా కూటమిలో సంక్షోభం సృష్టించే ఎత్తుగడలో భాగమే తాజా రాజకీయ పరిణామాలు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Labels: , ,

ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

కొవిడ్ కష్టకాలంలో ప్రధాని మోడీ దేశంలో టీకాల తయారీకి అనుమతించి, అందరికీ అందించడంతోనే నేడు భారతీయులంతా బతికున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. కనుక ఆయనను మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు. దీనిపై  విమర్శలు వస్తున్నాయి.


ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అధికారంలో ప్రభుత్వం తన బాధ్యత ను నిర్వర్తించిన దానికి ఇప్పుడు ఓట్లు అడగటం బీజేపీ కే చెల్లింది. లాక్ డౌన్ సమయం లో ఉపాధి పోయి సొంత ఊళ్లకు రవాణా సౌకర్యం లేక వేల కిలోమీటర్లు కాలి బాటన నడిచి మధ్య లోనే కొంత మంది ప్రాణాలు విడిచిన ఉదంతాలు ఉన్నాయి. 

కొవిడ్ సమయం లో చాలా దేశాలు ప్రజల ప్రాణాలను కాపాడటానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. ఎందుకంటే మానవ వనరుల తోనే ఏ దేశం అయినా పురోగమిస్తుంది ఆ దేశాలు విశ్వసించాయి. కానీ ఇక్కడ మాత్రం బీజేపీ ప్రతీ అంశాన్ని ఓటు బ్యాంకుతో ముడిపెట్టడం సరైంది కాదు. పదేళ్ల తమ పాలన లో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగవచ్చు. కానీ ప్రజల విశ్వాసాలను కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కు వాడుకోవాలని చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఫలితాలే చూడాల్సి ఉంటుంది. 

Labels: , ,

కాంగ్రెస్‌లోకి గుత్తా కుమారుడు


ఊహించినట్టుగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 


కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే నేతలు పార్టీ వీడుతున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు  ముందు కేసీఆర్ ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నేతలు పార్టీ వీడటానికి ఇదే కారణం అన్నారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్లనే తన కొడుకు అమిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నాడని తెలిపారు. అప్పుడే తండ్రి కొడుకులు ఇద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన తనయుడు పార్టీ మారడంతో అదే నిజమైంది.

Labels: , , ,

కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చిన ఇండోర్‌ అభ్యర్థి

 కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్నారు. మొన్న సూరత్‌ ఏకగ్రీవ ఎన్నిక ఉదంతాన్ని మరిచిపోకముందే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో హస్తంపార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. 


ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశలో భాగంగా మే13న పోలింగ్‌ జరగనున్నది. నామినేషన్ల  విత్‌ డ్రాకు నేడే (ఏప్రిల్ 29) చివరి రోజు. ఈ క్రమంలోనే సోమవారం పొద్దున అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆ వెంటనే బీజేపీలో చేరారు.   ఆ సమయంలో ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్‌ మెండోలా ఉండటం గమనార్హం. 


అక్షయ్‌ బీజేపీలో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ ధృవీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్‌ చేసి పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌ నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లల్వానీ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది పోటీ చేస్తున్నారు. 


ఎన్నికల వేళ బీజేపీ చేస్తున్న రాజకీయాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో తేల్చుకోలేక ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం ద్వారా అంతటా బీజేపీ హవా ఉన్నదనే ప్రచారం కల్పించడానికే ఇలాంటివి చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Labels: , ,

Friday 19 April 2024

మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావ్‌ : రేవంత్‌రెడ్డి


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది టచ్‌లో ఉన్నారన్న మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ..  'మా ఎమ్మల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. కారు పాడైపోయింది. ఇక షెడ్డు నుంచి బైటికి రాదని ఎద్దేవా చేశారు.' తమ హయాంలో పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టామని. కానీ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఈ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా.. బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు.

Labels: , , ,

సార్వత్రిక సమరంలో తొలి విడుత పోలింగ్‌ ప్రారంభం


సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు నేడు ఒకేసారి పోలింగ్‌ జరుగుతున్నది. దీనితోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 50  , సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్నది. 60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీకి చెందిన 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో జరిగే పోలింగ్‌లో ఇదే పెద్దది. అలాగే కేంద్రంలో బీజేపీ రెండుసార్ల సంపూర్ణ మెజారిటీ సాధించడంలో కీలక రాష్ట్రాలైన యూపీలో 8, రాజస్థాన్‌లో 12 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలోని ముస్లిం, దళిత, ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడుత పోలింగ్‌ జరుగుతున్నది. యూపీలో ఇవాళ జరుగుతున్న 8 స్థానాల్లో 2019లో బీజేపీ 3 స్థానాలు గెలుచుకోగా, బీఎస్పీ 3, ఎస్పీ రెండు చోట్ల గెలుపొందాయి. బీజేపీకి సంప్రదాయంగా మొదటి నుంచి మద్దతుగా ఉన్న రాజ్‌పూత్‌లు ఈసారి ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఫలితాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి నెలకొన్నది. అలాగే రాజస్థాన్‌లోని 12 చోట్ల ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నది. 

Labels: , , , , , , , ,

Thursday 18 April 2024

కాంగ్రెస్‌ పార్టీలోకి మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే



కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌  వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా ఆ జాబితాలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన త్వరలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్టు తెలిపారు. నేడో, రేపు ఆయన తన అనుచరులతో కలిసి కారు దిగి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. 

చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాతే ఆయన బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్లలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ పై పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాల్లో వికారాబాద్‌, తాండూరు, పరిగి మినహా మిగిలిన మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేర్‌లింగంపల్లి, చెవెళ్ల ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌కు చెందిన వారే. ఇప్పుడు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే పార్టీ వీడనుండటంతో ఇంకా ఎంతమంది ఈ జాబితాలో ఉండనున్నారన్న చర్చ జరుగుతున్నది. ప్రకాశ్‌గౌడ్‌ కొన్నిరోజుల కిందటే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జరిగింది. కానీ అభివృద్ధి పనుల విషయంలోనే సీఎంను కలిసినట్టు ఆయన వివరణ ఇచ్చారు. కానీ నాటి ప్రచారమే నేడు నిజమైంది.

Labels: , , , ,