- బిహార్ గవర్నర్ జనరల్ సయ్యద్ హస్నైన్, విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటాలతో కూడిన హైప్రొఫైల్ టీమ్..
- ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియాన్ ఆహ్వానించినా వెళ్లని మోడీ,
- జూలై 4 నుంచి ఆరు రోజుల పాటు సాగనున్న ఇరాన్ సుప్రీం లీడర్ తుది యాత్ర!
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల లో పాల్గొనేందుకు భారతదేశం తరఫున ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇరాన్ కు వెళ్లనుంది. ఈ అధికారిక బృందంలో బిహార్ గవర్నర్ జనరల్ సయ్యద్ హస్నైన్ , కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటాలు భాగస్వాములుగా ఉంటారని ఉన్నతస్థాయి దౌత్యవర్గాలు వెల్లడించాయి. ఈ నెల ప్రారంభంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పేజెష్కియాన్ స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఈ ప్రభుత్వ అధికారిక అంత్యక్రియలకు , ఖనన సంస్కారాలకు హాజరుకావలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ.. ప్రస్తుత అంతర్జాతీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లే అవకాశం లేదని, ఆయనకు బదులుగానే ఈ ప్రతినిధి బృందం ఢిల్లీ నుండి ఇరాన్ బయలుదేరనుందని స్పష్టమైంది. ఇరాన్ దేశాన్ని అత్యంత సుదీర్ఘ కాలం పాటు నడిపించిన అగ్రనేత, ప్రముఖ షియా మతగురువు అలీ ఖమేనీ.. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన మొదటి రోజైన గడిచిన ఫిబ్రవరి 28 న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడులలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టారు.
ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల వేడుకలు జూలై 4 వ తేదీ నుంచి ప్రారంభమై, జూలై 9 న ఆయన ఖననంతో ముగుస్తాయి. ఈ ఆరు రోజుల సుదీర్ఘ కార్యక్రమంలో భాగంగా జూలై 7 న ఇరాన్ లోని అత్యంత పవిత్ర నగరమైన ‘కోమ్’ (Qom) లో ప్రత్యేక మతపరమైన ఆచారాలు, ప్రార్థనలు జరగనున్నాయి. జూలై 4 నుంచి ప్రారంభమయ్యే ఈ అంత్యక్రియల యాత్రలో పాల్గొనేందుకు ఇరాన్ నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చే అవకాశం ఉందని అక్కడి యంత్రాంగం అంచనా వేస్తోంది. దీనితో ఈ అంత్యక్రియల ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా అత్యంత నిశితంగా గమనించబడుతున్న ఒక ప్రధాన గ్లోబల్ ఈవెంట్ గా మారింది. అమెరికా , ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం (Interim peace deal) నేపథ్యంలో ఈ అంత్యక్రియల కార్యక్రమాలు జరగడం విశేషం. ఈ తాత్కాలిక ఒప్పందం ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పరిష్కరించడానికి ఒక సరికొత్త శాంతి ప్రక్రియకు దారితీసింది.
భారతదేశం, ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా అత్యంత బలమైన, చరిత్రాత్మక మైత్రి కొనసాగుతోంది. పశ్చిమాసియాలో రేగిన భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ,యుద్ధ వాతావరణం నడుమ కూడా ఢిల్లీ.. టెహ్రాన్ తో ఉన్న తన వ్యూహాత్మక సంబంధాలను ఎక్కడా దెబ్బతినకుండా విజయవంతంగా కాపాడుకుంటూ వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నిరంతరం ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రత్యేకంగా భారతదేశంలో పర్యటించగా.. కేవలం కొన్ని వారాల కిందటే ఇరాన్ కు చెందిన మరికొంతమంది దౌత్య ప్రతినిధులు ఢిల్లీని సందర్శించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రతినిధి బృందం వెళ్తుండటం ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య బంధానికి మరింత అద్దం పడుతోంది.
