Thursday, 26 February 2026

లైక్స్, వ్యూస్ అన్నీ మోసం.. ఏవైనా కొనొచ్చు!


  • పాటల సక్సెస్‌పై శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు 
  • అసలైన విజయం అంటే ఇదే!

న్యూఢిల్లీ: నేటి డిజిటల్ యుగంలో ఒక పాట విజయవంతమైందా లేదా అన్నది సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, వ్యూస్ , ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సంఖ్యను బట్టి కొలుస్తున్నారు. అయితే, ఈ ధోరణిపై ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కనిపించే లైక్స్ , వ్యూస్ అన్నీ వాస్తవాలు కావని, నేడు మార్కెట్‌లో ఏవైనా కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఒక పాట  అసలైన విజయం డిజిటల్ అంకెల్లో ఉండదని, అది ప్రత్యక్షంగా ప్రేక్షకుల గుండెల్లో ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.



లైవ్ కాన్సర్టే అసలైన కొలమానం

ఏఎన్‌ఐ (ANI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయా మాట్లాడుతూ.. ఒక పాట ఎంత పెద్ద హిట్టో తెలుసుకోవాలంటే దానిని లైవ్ కాన్సర్ట్‌లో పాడాలని చెప్పారు. "నేను ఒక పాటను స్టేజ్ మీద పాడుతున్నప్పుడు.. అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ నాతో కలిసి గొంతు కలిపితేనే అది నిజమైన సక్సెస్. నేను ఆ పాటను తొలిసారి పాడుతున్నప్పటికీ, రెండోసారి పాడేసరికి జనం దానిని గుర్తుపెట్టుకుని 'ఆ పాట మళ్ళీ పాడండి' అని అడిగితేనే ఆ కళాకారుడికి దక్కే అతిపెద్ద విజయం" అని ఆమె వివరించారు. ఈ అనుభవం ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇవ్వలేదని ఆమె స్పష్టంగా చెప్పారు.


సోషల్ మీడియా ప్రభావం

అయినప్పటికీ, సంగీత ప్రపంచంలో సోషల్ మీడియా ప్రభావాన్ని ఆమె తక్కువ చేయలేదు. 2013లో విడుదలైన 'బేషరమ్' సినిమాలోని 'దిల్ కా జో హాల్ హై' లేదా 'సూపర్ 30'లోని 'జుగ్రాఫియా' వంటి పాటలు విడుదలైన చాలా ఏళ్ల తర్వాత సోషల్ మీడియా వల్ల మళ్ళీ ట్రెండింగ్‌లోకి రావడాన్ని ఆమె ఉదాహరణగా చూపారు. సోషల్ మీడియా వల్ల సంగీతం మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మారిందని, ఇప్పుడు ఏదైనా పాటను ప్రజలకు రుద్దడం ఎవరివల్లా కాదని, శ్రోతలే ఏది బాగుందో నిర్ణయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రేయా 'ది అన్‌స్టాపబుల్ టూర్' (#TheUnstoppableTour) పేరుతో ప్రపంచవ్యాప్త సంగీత కచేరీలకు సిద్ధమవుతున్నారు, ఇందులో తన కెరీర్ ప్రయాణాన్ని సరికొత్తగా అభిమానులకు వినిపించబోతున్నారు.

ఎప్ స్టీన్‌ ఫైల్స్ వివాదం: పాలకులకు నైతిక జవాబుదారీతనం లేదా?

 

  • కేంద్రంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం
  • కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్!

వాయనాడ్: అమెరికాలో సంచలనం సృష్టించిన 'ఎప్ స్టీన్‌ ఫైల్స్' వ్యవహారం ఇప్పుడు భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ ఫైల్స్‌లో పేరున్న ప్రభుత్వ పెద్దలు నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. గురువారం వాయనాడ్‌లో పర్యటించిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైల్స్‌లో పేర్లు వచ్చిన వారు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, కానీ భారతదేశంలో మాత్రం పాలకులకు ప్రజల పట్ల కనీస నైతిక జవాబుదారీతనం  లేదని విమర్శించారు. ఒక పక్క కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేరు ఈ జాబితాలో ఉండటంపై కాంగ్రెస్ ఆయన రాజీనామాకు పట్టుబడుతుండగా, ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



ఒక వ్యక్తికి సంబంధించిన అక్రమ కార్యకలాపాలు తెలిసి ఉండి కూడా, వారితో నిరంతరం ఈమెయిల్స్ ద్వారా సంభాషణలు జరపడం, సమావేశం కావడం వంటివి తీవ్రమైన అంశాలని ప్రియాంక పేర్కొన్నారు. "మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు, మీ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. విదేశాల్లో ఇలాంటి కేసుల్లో మంత్రులు మాత్రమే కాదు, ఏకంగా రాజకుటుంబీకులు కూడా విచారణను ఎదుర్కొన్నారు, రాజీనామాలు చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఒక నేరగాడితో సంబంధాలు ఉన్నా కూడా ఎటువంటి చలనం లేకపోవడం దురదృష్టకరం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పేరు ఉండటమే కాకుండా, సదరు వ్యక్తి ప్రవర్తనపై అవగాహన ఉండి కూడా సంబంధాలు కొనసాగించడం నైతికంగా తప్పని  చెప్పారు.

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు


దేశంలో సరికొత్త 'గ్రేడ్-బేస్డ్' డ్రైవింగ్ లైసెన్స్ విధానం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వాహనదారుల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసం 'గ్రేడ్-బేస్డ్' (పాయింట్ల ఆధారిత) డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన 'రోడ్డు భద్రత జాతీయ సదస్సు'లో ఆయన మాట్లాడుతూ, నిబంధనలు అతిక్రమించిన ప్రతిసారీ లైసెన్స్ నుంచి పాయింట్లు కోత పడతాయని, అన్ని పాయింట్లు కోల్పోయిన పక్షంలో ఆ వ్యక్తి లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కొత్త విధానాన్ని అతి త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.



దేశంలో  ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతి వేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ , మద్యం సేవించి వాహనం నడపడం వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారిలో 72 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులే ఉండటం దేశానికి తీరని లోటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల 54 వేల మంది, సీట్ బెల్టులు పెట్టుకోకపోవడం వల్ల 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గణాంకాలను వివరించారు. ప్రభుత్వం జరిమానాలను పెంచినప్పటికీ, ప్రజల్లో చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, అందుకే ఈ కఠినమైన పాయింట్ల విధానాన్ని తీసుకువస్తున్నామని వివరించారు.


అదేవిధంగా, రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పీఎం రాహత్'  పథకం గురించి మంత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏ రకమైన రహదారిపైనైనా ప్రమాదానికి గురైన బాధితులకు, ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే రూ. 1.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి ఏడు రోజుల పాటు ఈ నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుందని, కాబట్టి చట్టపరమైన ఇబ్బందులు లేదా చికిత్స ఖర్చుల గురించి భయపడకుండా బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించినప్పుడే మరణాల సంఖ్యను తగ్గించగలమని ఆయన స్పష్టంగా చెప్పారు.

Wednesday, 25 February 2026

భారత ప్రధానికి ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవం


  • మోడీకి 'స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్' ప్రదానం
  • ఈ పురస్కారం అందుకున్న తొలి ప్రపంచ నేత

జెరూసలేం: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంటు 'క్నెసెట్'ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ఆ దేశ పార్లమెంటు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన 'స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్' తో మోడీని గౌరవించారు. క్నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా ఈ పతకాన్ని ప్రధానికి స్వయంగా ప్రదానం చేశారు. విశేషమేమిటంటే, ఈ గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి విదేశీ నేతగా ప్రధాని మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చూపిన అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.




ప్రధాని మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే పార్లమెంటు సభ్యులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో (Standing Ovation) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన స్నేహబంధం గురించి, ముఖ్యంగా యూదు సమాజం భారతదేశంలో ఎంతో గౌరవంగా, వివక్ష లేకుండా వేల ఏళ్లుగా నివసిస్తున్న తీరును మోడీ తన ప్రసంగంలో గుర్తుచేశారు. ఈ ప్రసంగం ముగిసిన తర్వాత ఎంపీలు మోడీతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడటం విశేషం. ఇజ్రాయెల్ స్పీకర్ అమీర్ ఓహానా మాట్లాడుతూ.. మోడీ కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచ వేదికపై ఒక గొప్ప నాయకుడని, ఆయన విధానాలు ఇజ్రాయెల్‌తో ధైర్యవంతమైన, స్థిరమైన స్నేహానికి నిదర్శనమని కొనియాడారు.


ఈ గౌరవంతో పాటు, మోడీ ఒక అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నారు. ఇజ్రాయెల్ , పాలస్తీనా (2018లో 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా') రెండు దేశాల నుంచి కూడా అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న అతికొద్దిమంది ప్రపంచ నాయకులలో ఒకరిగా ఆయన నిలిచారు. ఇది భారతదేశం అనుసరిస్తున్న సమతుల్య విదేశీ విధానానికి దక్కిన విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ పర్యటనతో అటు రక్షణ రంగంలోనూ, ఇటు దౌత్య రంగంలోనూ ఇరు దేశాల బంధం "ఇనుప కోట" (Iron Alliance) లా బలోపేతమైందని నిపుణులు పేర్కొంటున్నారు.

చిన్న పిల్లలకు న్యాయవ్యవస్థపై విషం నూరిపోస్తారా?

  • ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు సుమోటో కేసు
  • సీజేఐ తీవ్ర ఆగ్రహం!

న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే అంశాన్ని చేర్చడంపై భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు, దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్ బ్యాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరుపుతూ.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సాగుతున్న ఇటువంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది. ఎనిమిదో తరగతి చదివే పసిపిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధించడం వెనుక ఒక లోతైన కుట్ర దాగి ఉన్నట్లు కనిపిస్తున్నదని సీజేఐ అనుమానం వ్యక్తం చేశారు.



సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువస్తూ.. దేశ భవిష్యత్తు అయిన చిన్నారులకు న్యాయవ్యవస్థ పట్ల తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా పాఠాలు ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. "ఈ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు అధిపతిగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను, ఇప్పటికే ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశాను. న్యాయవ్యవస్థను కించపరచడానికి ఈ భూమిపై ఎవరినీ అనుమతించను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గంభీరంగా హెచ్చరించారు. ఈ పాఠ్యాంశం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు సైతం తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు.


పాఠ్యపుస్తకంలోని సదరు అధ్యాయంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరిస్తూ.. కేసుల జాప్యం, న్యాయమూర్తుల కొరతతో పాటు 'అవినీతి'ని కూడా ఒక ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బ్యాగ్చీ స్పందిస్తూ.. ఈ తరహా పాఠ్యాంశాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేవలం న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పాఠాలు చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశాలను త్వరలోనే బయటపెడతామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో ఎన్‌సీఈఆర్‌టీ నుంచి వివరణ కోరనున్నట్లు సమాచారం.

మీ బాధను మేము అర్థం చేసుకోగలం.. భారత్ మీ వెంటే


  • ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని మోడీ భావోద్వేగ ప్రసంగం!

జెరూసలేం: ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ పార్లమెంటు 'క్నెసెట్'ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉగ్రవాద బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అక్టోబర్ 7న హమాస్ జరిపిన అనాగరిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ, ఛిన్నాభిన్నమైన ప్రతి కుటుంబానికి 140 కోట్ల మంది భారతీయుల తరపున ఆయన సంతాపం తెలిపారు. "మేము మీ బాధను అనుభవిస్తున్నాం, మీ దుఃఖంలో పాలుపంచుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ భారత్ దృఢ నిశ్చయంతో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుంది" అని మోడీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగానికి అక్కడి ఎంపీల నుంచి హర్షధ్వానాలు మిన్నంటాయి.



తన ప్రసంగంలో ప్రధాని మోడీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. "ఇజ్రాయెల్‌ను భారతదేశం అధికారికంగా గుర్తించిన రోజే (సెప్టెంబర్ 17, 1950) నేను కూడా జన్మించాను" అని ఆయన పేర్కొనడం సభికులను ఆకట్టుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని, అది నాగరిక సమాజానికే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన 26/11 దాడులను ప్రస్తావిస్తూ, భారతదేశం కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద కోరల్లో చిక్కుకుని ఎంతో బాధను అనుభవించిందని గుర్తుచేశారు. అందుకే ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇజ్రాయెల్‌తో భారత్ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని పునరుద్ఘాటించారు.


కేవలం సంతాపానికే పరిమితం కాకుండా, ప్రాంతీయ శాంతి కోసం భారత్ కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని, చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోడీకి, ఇజ్రాయెల్ ప్రభుత్వం తన అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 'స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్'ను అందించి గౌరవించింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Monday, 23 February 2026

ఉదయ్ భాను చిబ్‌కు 4 రోజుల కస్టడీ

 

  • కేంద్రంపై ఖర్గే, రాహుల్ ఘాటు విమర్శలు
  • యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్టుతో ఢిల్లీలో పొలిటికల్ హీట్



న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సమ్మిట్ వేదికగా సాగిన నిరసనలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. భారతీయ యువ కాంగ్రెస్ (IYC) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు ఆయనకు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఏఐ సదస్సు వద్ద ఉద్రిక్తతలకు కారణమయ్యారనే ఆరోపణలతో అరెస్టయిన ఉదయ్ భానును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నిరసన వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి, ఇతర నిందితులను గుర్తించడానికి ఆయనను విచారించాల్సి ఉందని పోలీసులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఉదయ్ భాను చిబ్‌కు 4 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.


  • కేసు నేపథ్యం

భారత్ మండపంలో అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ జరుగుతున్న తరుణంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు,  భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలను నిరసిస్తూ కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి  ఆందోళన చేపట్టారు. "ప్రధాని రాజీ పడ్డారు" (PM is compromised) అనే నినాదాలతో కూడిన టీ-షర్టులను ప్రదర్శిస్తూ సదస్సు వేదిక వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఉదయ్ భానుపై కేసు నమోదైంది.



  • బబ్బర్ షేర్ కామ్రేడ్స్.. భయపడకండి: రాహుల్ గాంధీ భరోసా

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. తన కార్యకర్తలను "బబ్బర్ షేర్" (సింహాల్లాంటి వారు) గా అభివర్ణించిన రాహుల్.. ప్రభుత్వం భయపడి నిజాన్ని అణచివేయాలని చూస్తున్నదని విమర్శించారు. నిరసన తెలపడం మన వారసత్వమని, రైతులు, పరిశ్రమల నష్టాల గురించి ప్రశ్నించడం నేరం కాదని, అది దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు.





  • కాంగ్రెస్ పిరికి పార్టీ కాదు: మల్లికార్జున ఖర్గే హెచ్చరిక

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అరెస్టును నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఇలాంటి అరెస్టులకు పాల్పడుతున్నదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడదని, ప్రజల పక్షాన తమ పోరాటం మరింత ఉధృతం అవుతుందని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Featured post

లైక్స్, వ్యూస్ అన్నీ మోసం.. ఏవైనా కొనొచ్చు!

పాటల సక్సెస్‌పై శ్రేయా ఘోషల్ సంచలన వ్యాఖ్యలు  అసలైన విజయం అంటే ఇదే! న్యూఢిల్లీ: నేటి డిజిటల్ యుగంలో ఒక పాట విజయవంతమైందా లేదా అన్నది సోషల్ మీ...