- ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లిన ప్రధాని మోడీ!
తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలను సందర్శించి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభ ముగిసిన అనంతరం, ప్రధాని నేరుగా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ప్రధానికి చంద్రబాబు కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనపై స్పందించిన చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోడీ తమ నివాసానికి రావడం తమ కుటుంబానికి దక్కిన గౌరవమని, ఆయన చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతుందని 'ఎక్స్' వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ప్రధాని మోడీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పవన్ కుటుంబ సభ్యుల సాదర స్వాగతం మధ్య ప్రధాని అక్కడ సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి స్వయంగా ఇంటికి వచ్చిన ప్రధానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, కూటమి ఐక్యతపై ఈ భేటీలు సానుకూల సంకేతాలను ఇచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని పర్యటనతో అటు అమరావతి, ఇటు హైదరాబాద్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.








