Tuesday, 3 March 2026

గల్ఫ్ సంక్షోభంలో చిక్కుకున్న వారికి విమానయాన ఊరట


బుధవారం 58 ప్రత్యేక సర్వీసులు

ప్రయాణికుల కోసం కేంద్రం భారీ ఏర్పాట్లు!

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులను స్వదేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బుధవారం (మార్చి 4) ఒక్కరోజే భారతీయ విమానయాన సంస్థలు గల్ఫ్ ప్రాంతానికి 58 విమానాలను నడపనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఇందులో ఇండిగో సంస్థ 30 విమానాలను, ఎయిర్ ఇండియా ,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 23 విమానాలను నడపనున్నాయి. యుద్ధ ప్రాంతాల మీదుగా గగనతలం మూసివేయడంతో, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ విమానాలు ప్రయాణించనున్నాయి. కేవలం భారతీయ సంస్థలే కాకుండా ఎమిరేట్స్, ఇతిహాద్ వంటి విదేశీ విమానయాన సంస్థలు కూడా గత 24 గంటల్లో గల్ఫ్ నుంచి  9 సర్వీసులను నడిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


యుద్ధం కారణంగా ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు భారతీయ సంస్థలకు చెందిన 1,221 విమానాలు, విదేశీ సంస్థలకు చెందిన 388 విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితుల్లో విమాన టికెట్ల ధరలు అదుపు తప్పకుండా మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులపై అదనపు భారం పడకుండా చూడాలని విమానయాన సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రయాణికులకు రీఫండ్‌లు, రీషెడ్యూలింగ్ , ఇతర సహాయక చర్యల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు, గల్ఫ్‌లోని ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ దేశాలకు సాధారణ విమాన సర్వీసుల నిలిపివేతను మార్చి 4 అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకుంటూ భారతీయులందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

రాజ్యసభ ద్వారా పార్లమెంటులోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు


  • బిహార్ నుంచి నితిన్ నవీన్ పోటీ
  • సామాజిక సమీకరణాలతో కమలనాథుల వ్యూహం

పట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. బిహార్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో నితిన్ నవీన్ పేరు ప్రధానంగా నిలిచింది. ప్రస్తుతం బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనతో పాటు, మాజీ ఎమ్మెల్యే శివేష్ కుమార్‌ను రెండో అభ్యర్థిగా పార్టీ బరిలోకి దింపింది. గత జనవరిలో జేపీ నడ్డా స్థానంలో అనూహ్యంగా పార్టీ పగ్గాలు చేపట్టిన 45 ఏళ్ల నితిన్ నవీన్ ఎంపిక, బీజేపీలో 'మూడవ తరం నాయకత్వానికి' సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పర్ కాస్ట్ (కాయస్థ) సామాజిక వర్గానికి చెందిన నవీన్‌ను ఎంపిక చేయడం ద్వారా తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, దళిత సామాజికవర్గానికి చెందిన శివేష్ కుమార్‌కు అవకాశం ఇచ్చి సామాజిక సమతుల్యతను పాటించాలని బీజేపీ వ్యూహం రచించింది.



మరోవైపు, బిహార్‌లోని ఎన్డీయే మిత్రపక్షాల మధ్య రాజ్యసభ సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చింది. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ఎన్డీయే అభ్యర్థిగా మార్చి 5న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో కుష్వాహా తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారానికి తెరపడింది. బిహార్‌లో ఖాళీ అవుతున్న ఐదు రాజ్యసభ స్థానాలకు గానూ, అసెంబ్లీలో ఉన్న మెజారిటీ ప్రకారం బీజేపీ రెండు స్థానాలను సులభంగా గెలుచుకోనుంది. మిగిలిన రెండు స్థానాల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ తన అభ్యర్థులను నిలపనుంది. కేంద్ర మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ పేరు దాదాపు ఖరారు కాగా, రెండో స్థానం కోసం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ఈసారి అవకాశం దక్కకపోవచ్చని సమాచారం.


బిహార్ ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ (RJD) కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి దింపుతామని ప్రకటించి ఎన్డీయే ఏకగ్రీవ ఆశలకు గండి కొట్టింది. ఐదు స్థానాల్లో ఒక స్థానాన్ని దక్కించుకోవాలని ఆర్జేడీ భావిస్తోంది. దీనికోసం అసెంబ్లీలోని ఏఐఎంఐఎం (AIMIM) మరియు బీఎస్పీ (BSP) ఎమ్మెల్యేల మద్దతుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. కాగా, గతంలో టికెట్ నిరాకరణతో తిరుగుబాటు చేసిన భోజ్‌పురి నటుడు పవన్ సింగ్‌కు ఈసారి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, చివరకు పార్టీ అధిష్టానం నితిన్ నవీన్ , శివేష్ కుమార్‌ల వైపే మొగ్గు చూపింది. మార్చి 16న జరగనున్న ఈ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మార్చి 5తో ముగియనుంది.

ట్రాఫిక్ కెమెరాల నిఘా.. మోసాద్ మాయాజాలం

 ట్రాఫిక్ కెమెరాల నిఘా.. మోసాద్ మాయాజాలం

 ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతానికి అమెరికా, ఇజ్రాయెల్ పక్కా స్కెచ్!

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చేందుకు అమెరికా ,ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు ఏళ్ల తరబడి అత్యంత రహస్యంగా, సాంకేతికంగా శ్రమించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టెహ్రాన్‌లోని పాశ్చర్ స్ట్రీట్ సమీపంలోని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ హ్యాక్ చేయడం ఈ ఆపరేషన్‌లో కీలక మలుపుగా మారింది. ఖమేనీ నివసించే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోని ఒక కెమెరా ద్వారా ఇజ్రాయెల్ నిఘావర్గాలు అక్కడి పౌర కార్యకలాపాలను నిశితంగా గమనించాయి. కాంప్లెక్స్ అల్గారిథమ్స్ సహాయంతో ఖమేనీ రక్షణ సిబ్బంది , అడ్రస్‌లు, వారి డ్యూటీ సమయాలు, వారు ప్రయాణించే మార్గాలను విశ్లేషించి ‘ప్యాటర్న్ ఆఫ్ లైఫ్’ పేరుతో ఒక సమగ్ర నివేదికను రూపొందించుకున్నాయి. తద్వారా శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయంలో ఎప్పుడు ఉంటారు, ఎవరిని కలుస్తారు అనే విషయాన్ని ఇజ్రాయెల్ , సీఐఏ (CIA) కచ్చితంగా అంచనా వేయగలిగాయి.



ఈ ఆపరేషన్ కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, మోసాద్ క్షేత్రస్థాయిలో నియమించుకున్న మానవ వనరుల (Human Assets) ప్రతిభ కూడా. ఫోన్ సిగ్నల్స్ అందకుండా పాశ్చర్ స్ట్రీట్ సమీపంలోని మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ యూనిట్ 8200 నిలిపివేయడంతో, దాడి సమయంలో ఖమేనీ రక్షణ బృందానికి ఎటువంటి హెచ్చరికలు అందలేదు. మరోవైపు, అమెరికా వద్ద ఉన్న ఒక రహస్య మానవ మూలం (Human Source) ద్వారా ఖమేనీ ఆ సమయంలో అక్కడే ఉన్నారని బలమైన సమాచారం అందింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 200 యుద్ధ విమానాలు 500 లక్ష్యాలపై విరుచుకుపడి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. ఇరాన్ నాయకులు అల్పాహారం తీసుకుంటున్న సమయంలోనే ఈ మెరుపు దాడి జరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు.



హిజ్బుల్లా నేత నస్రల్లా లాగా ఖమేనీ ఎప్పుడూ బంకర్లలో దాక్కోలేదు, బహిరంగంగానే తిరిగేవారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయనను పట్టుకోవడం కష్టమని భావించి, అగ్రనాయకత్వమంతా ఒకే చోట ఉన్న సమయంలోనే ఈ భారీ దాడిని ముగించారు. ఇజ్రాయెల్ పైలట్లు ‘స్పారో’ (Sparrow) అనే అధునాతన క్షిపణులను వాడి 1,000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించారు. ఈ దెబ్బతో ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన నాయకుడిని కోల్పోవడమే కాకుండా, తన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోలేక దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.



Monday, 2 March 2026

హర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్

  •  ప్రపంచానికి చమురు సెగ
  • ‘నౌకలు వస్తే నిప్పు పెడతాం’ అంటూ భీకర హెచ్చరిక

టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాల ఇంధన భద్రతను ప్రమాదంలోకి నెట్టింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో రగిలిపోతున్న ఇరాన్, కీలకమైన హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా మూసివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. నిబంధనలు అతిక్రమించి ఏ నౌక అయినా ఈ మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వాటిని తగులబెడతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.



ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన హర్ముజ్ జలసంధిని ప్రపంచ దేశాల ఇంధన జీవనాడిగా పరిగణిస్తారు. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ మార్గం గుండానే భారత్, చైనా, జపాన్ , దక్షిణ కొరియా వంటి దేశాలకు అత్యధికంగా చమురు, సహజ వాయువు (LNG) సరఫరా అవుతుంది. తాజా హెచ్చరికలతో ఇప్పటికే 150కి పైగా ఆయిల్ ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. రవాణా నిలిచిపోవడంతో ఇన్సూరెన్స్ , షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గజగజలాడిస్తోంది. ఇరాన్ తీసుకోబోయే తదుపరి చర్యలపై అగ్రరాజ్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

యుద్ధం నీడలో బిడ్డలు


  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
  • ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ఎప్పుడు? 
  • ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్ వరకు గుండెకోత!

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం వేలాది భారతీయ కుటుంబాల్లో తీరని ఆందోళన నింపుతోంది. ముఖ్యంగా ఇరాన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న తమ పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఢిల్లీకి చెందిన కున్వర్ షకీల్ తన కుమార్తె గురించి చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో చదువుతున్న తన కుమార్తె కాలేజీ సమీపంలోనే సోమవారం ఉదయం బాంబు పేలుడు సంభవించిందని, గడిచిన రెండు రోజులుగా దాడుల తీవ్రత పెరిగిందని ఆయన వాపోయారు. మంగళవారం ఆమె ఇండియాకు రావాల్సి ఉండగా, విమానాల రద్దుతో అక్కడే చిక్కుకుపోయిందని, పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ కలవాలంటే కనీసం 40 సార్లు ప్రయత్నించాల్సి వస్తోందని, ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోవడంతో సమాచారం అందక తల్లడిల్లుతున్నామని ఇతర తల్లిదండ్రులు వెల్లడించారు.



ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అక్కడి విద్యార్థులు పరిమితమైన ఆహార నిల్వలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హాస్టళ్లలో ఉన్న ఆహారం ఎంతకాలం వస్తుందో తెలియదని, నిరంతర బాంబు దాడులతో విద్యార్థులు నిరంతరం ఏడుస్తూ ప్రాణభయంతో ఉన్నారని మాలవీయ నగర్‌కు చెందిన జుబియా ఖాన్ తెలిపారు. గతంలో 'ఆపరేషన్ సింధు' ద్వారా భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినట్లే, ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం తమ పిల్లలను కాపాడుతుందని తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (AIMA) ప్రతినిధి మోమిన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం, భారత రాయబార కార్యాలయం విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులను టెహ్రాన్ నుండి ఖోమ్ (Qom) నగరానికి తరలిస్తున్నారని, కేవలం 5 కేజీల బ్యాగుతో సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.


ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన 'ఎపిక్ ఫ్యూరీ', 'లయన్స్ రోర్' ఆపరేషన్లతో ఇరాన్ అతలాకుతలమవుతోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ 'ట్రూత్‌ఫుల్ ప్రామిస్ 4' పేరుతో జరుపుతున్న క్షిపణి దాడులు గల్ఫ్ దేశాలను వణికిస్తున్నాయి. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక ప్రకారం ఇప్పటికే ఇరాన్‌లో 550 మందికి పైగా మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ వైపు కూడా ప్రాణనష్టం సంభవించింది. ఈ భీకర పోరులో చిక్కుకున్న తమ పిల్లలను త్వరగా రక్షించాలని బాధిత కుటుంబాలు ప్రధాని మోడీని , విదేశాంగ శాఖను వేడుకుంటున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా మౌనం వెనుక మర్మమేంటి?


  • డ్రాగన్ దేశం ఆచితూచి అడుగులేయడానికి గల అసలు కారణాలను విశ్లేషించిన నిపుణులు!

బీజింగ్: పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అట్టుడుకుతున్న వేళ, ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తున్న చైనా మౌనం వహించడం వెనుక బలమైన వ్యూహాలు దాగి ఉన్నాయని రక్షణ , దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 80 శాతానికి పైగా చైనానే కొనుగోలు చేస్తున్నది. అయినప్పటికీ, ఈ యుద్ధంలో ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వకుండా కేవలం 'కాల్పుల విరమణ' కావాలని పిలుపునివ్వడం వెనుక చైనా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా 'హోర్ముజ్ జలసంధి' ద్వారా చైనాకు అందే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే, ఆ దేశ పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. చైనా తన మొత్తం చమురు దిగుమతుల్లో 44 శాతం ఈ ప్రాంతం నుంచే పొందుతున్నది.



ఇరాన్ కేవలం ఒక చమురు దేశం మాత్రమే కాకుండా, చైనా ప్రతిష్టాత్మక 'బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' (బీఆర్‌ఐ)లో కీలక భాగస్వామి. అయితే, ఇరాన్ తనకంటే శక్తివంతమైన కూటమితో తలపడటం ద్వారా చైనా నిర్మించిన భౌగోళిక రాజకీయ నిర్మాణాన్ని ప్రమాదంలో పడేసిందని 'అవెల్లాన్ ఇంటెలిజెన్స్' సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్‌కు చైనా మద్దతు ఎంత అవసరమో, చైనాకు ఇరాన్ చమురు అంతే కీలకం. కానీ ఈ యుద్ధం వల్ల చమురు ధరలు బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరితే చైనా ఆర్థిక వృద్ధి లక్ష్యాలు దెబ్బతింటాయి. అందుకే చైనా బయటకు శాంతి మంత్రం జపిస్తూనే, తెరవెనుక ఇరాన్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నది. ఒకవేళ యుద్ధం వల్ల ఇరాన్ బలహీనపడితే, ఆ దేశం భవిష్యత్తులో పెట్టుబడులు , దౌత్య రక్షణ కోసం చైనాపై మరింతగా ఆధారపడే అవకాశం ఉందని, దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని బీజింగ్ భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఖమేనీ మృతిపై భారత్ మౌనం వెనుక వ్యూహమేంటి?


  • అగ్రనేత హత్యను ఖండించకపోవడానికి గల కారణాలను విశ్లేషించిన నిపుణులు!

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించినప్పటికీ, భారతదేశం ఆ మరణాన్ని అధికారికంగా ఖండించకపోవడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా మిత్రదేశాల అధినేతలు మరణించినప్పుడు సంతాపం తెలిపే భారత్, ఈ విషయంలో కేవలం 'తీవ్ర ఆందోళన' వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీని వెనుక భారత్  దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు, గత చేదు అనుభవాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ తన పశ్చిమాసియా రాజకీయాల్లో భారత్  అంతర్గత వ్యవహారాలైన కాశ్మీర్ అంశంపై గతంలో చేసిన విమర్శలు, భారత్ తన నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవడానికి ఒక కారణమని సమాచారం.



మరోవైపు, అమెరికా , ఇజ్రాయెల్‌లతో భారత్ కలిగి ఉన్న బలమైన రక్షణ , వ్యూహాత్మక సంబంధాలు కూడా ఈ మౌనానికి ప్రధాన కారణం. ఇరాన్ అగ్రనేతను 'ఉగ్రవాదానికి మద్దతుదారుడు'గా పశ్చిమ దేశాలు పరిగణిస్తున్న తరుణంలో, ఆయన్ను సమర్థించడం వల్ల అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భారత్ భావిస్తున్నది. అయితే, ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవులో భారత్ చేసిన భారీ పెట్టుబడులు ,అక్కడ నివసిస్తున్న లక్షలాదిమంది భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతినకుండా భారత్ మధ్యేమార్గం అనుసరిస్తున్నది. అందుకే 'సంయమనం పాటించాలని' ,'సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని' సాధారణ ప్రకటనకే భారత్ పరిమితమైంది.

Featured post

గల్ఫ్ సంక్షోభంలో చిక్కుకున్న వారికి విమానయాన ఊరట

బుధవారం 58 ప్రత్యేక సర్వీసులు ప్రయాణికుల కోసం కేంద్రం భారీ ఏర్పాట్లు! న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్...