Thursday, 2 April 2026

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అపురూప దృశ్యం

 


  • ఆంజనేయుడిని స్పృశించిన సూర్య కిరణాలు
  • అయోధ్య బాలరాముడి 'సూర్య తిలకం' తరహాలోనే దైవానుభూతి
  • ఇది నా పూర్వజన్మ సుకృతమన్న మెగాస్టార్


హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, పద్మవిభూషణ్ చిరంజీవి హనుమాన్ జయంతి సందర్భంగా తన భక్తిని చాటుకుంటూ ఒక విశేషమైన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆంజనేయస్వామికి పరమ భక్తుడైన చిరంజీవి, తన ఇంటి పూజా మందిరంలో స్వామివారి విగ్రహాన్ని సూర్య కిరణాలు నేరుగా స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని చూపిస్తూ మురిసిపోయారు. ఏటా డిసెంబర్, జనవరి , ఫిబ్రవరి నెలల్లో సూర్య కిరణాలు సప్త వర్ణాలుగా మారి తన ఇలవేల్పు హనుమంతుడిని తాకడం వర్ణించలేని అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ అపురూప దృశ్యాన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే హనుమంతుడిని అర్చిస్తున్నట్లుగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.




https://youtube.com/shorts/wEwRCWLjXKs?feature=share

 

ఇటీవల అయోధ్య రామమందిరంలో బాలరాముడి నుదిటిపై సూర్య కిరణాలు 'సూర్య తిలకం'లా మెరిసిన ఘట్టాన్ని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కోణార్క్ సూర్య దేవాలయం, అరసవల్లి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని సూర్య కిరణాలు తాకే అద్భుత విశేషాలు అందరికీ తెలిసినవేనని, అలాంటి దైవానుభూతి తన ఇంట్లోనూ కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చిరంజీవి ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఈ అద్భుత దృశ్యం తన మనసుకు ఎంతో ప్రశాంతతను, తృప్తిని ఇచ్చిందని తెలుపుతూ, అభిమానులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ మెగా అభిమానులను అలరిస్తోంది.

భారత క్రికెట్ 'జయహో'..ఆ చరిత్రాత్మక ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు



  • ధోని సిక్సర్, గంభీర్ పోరాటం, సచిన్ కన్నీళ్లు 
  • కోట్లాది మంది భారతీయుల కల సాకారమైన రోజు


ముంబై: భారత క్రీడా ప్రపంచంలో ఏప్రిల్ 2వ తేదీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సరిగ్గా 15 ఏళ్ల కిందట (2011 ఏప్రిల్ 2న) ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా టీమ్ ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి విశ్వవిజేతగా నిలిచింది. కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో గెలిచిన 28 ఏళ్ల తర్వాత, 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ మళ్లీ ఆ ఘనతను సాధించింది. ఫైనల్‌లో శ్రీలంక విసిరిన లక్ష్యాన్ని ఛేదిస్తూ ధోని కొట్టిన ఆ ఆఖరి సిక్సర్ నేటికీ ప్రతి క్రికెట్ అభిమాని మదిలో సజీవంగానే ఉంది. ఆసియా ఖండానికి చెందిన రెండు జట్లు ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడటం కూడా అదే మొదటిసారి కావడం విశేషం.



  • ధోని మాస్టర్ క్లాస్ - గంభీర్ వీరోచిత పోరాటం

ఫైనల్ మ్యాచ్‌లో లంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెహ్వాగ్, సచిన్ త్వరగానే అవుట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ (97) అత్యంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. అనూహ్యంగా ఫామ్ లో ఉన్న యువరాజ్ కంటే ముందే బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ ధోని (91 నాటౌట్), గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 15 వికెట్లు తీసి, 300 పైగా పరుగులు చేసిన యువరాజ్ సింగ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు. ధోని తన వ్యూహాలతో యువరాజ్ లోని బౌలింగ్ ప్రతిభను పూర్తిస్థాయిలో వాడుకోవడం ఈ టోర్నీలో హైలైట్‌గా నిలిచింది.


  • సచిన్ కోసం.. మాస్టర్ కల కోసం

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆరు ప్రపంచకప్‌లు ఆడినా, కప్పును ముద్దాడాలనే ఆయన కల ఈ మ్యాచ్‌తోనే నెరవేరింది. విజయం అనంతరం ఆటగాళ్లంతా సచిన్‌ను భుజాలపై ఎక్కించుకుని స్టేడియం మొత్తం తిరుగుతూ గౌరవవందనం చేయడం చూసి అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. "మేము సచిన్ పాజీ కోసమే ఈ కప్పు గెలిచాం" అని యువరాజ్ సింగ్ పేర్కొన్న మాటలు ఆ లెజెండ్ పట్ల జట్టుకున్న గౌరవానికి నిదర్శనం. అప్పటి యువ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా సచిన్‌ను భుజాలపై మోస్తూ, "సచిన్ ఇన్నేళ్లు దేశాన్ని మోశారు, ఇప్పుడు మేము ఆయన్ని మోస్తున్నాం" అని చెప్పిన మాటలు చిరస్మరణీయం.



  • వివాదాలు - క్లీన్ చిట్

భారత్ విజయం సాధించిన తర్వాత శ్రీలంకకు చెందిన కొందరు నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినప్పటికీ, ఐసీసీ (ICC) , శ్రీలంక పోలీసులు జరిపిన దర్యాప్తులో అవేవీ నిరూపితం కాలేదు. భారత జట్టు పూర్తి ఆధిపత్యంతోనే గెలిచిందని, ఎటువంటి అవకతవకలు జరగలేదని దర్యాప్తు సంస్థలు తేల్చిచెప్పాయి. 15 ఏళ్లు గడిచినా ఆ రోజు రాత్రి జరిగిన సంబరాలు, ఆ విజయ గర్వం ప్రతి భారతీయుడి గుండెల్లో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

బెంగాల్ సర్కారుపై సుప్రీంకోర్టు 'సింహ గర్జన'


  • జ్యుడిషియల్ అధికారుల నిర్బంధంపై సీజేఐ తీవ్ర ఆగ్రహం! 
  • చీఫ్ జస్టిస్ ఫోన్ చేసినా స్పందించరా? 
  • విచారణకు సీబీఐ లేదా ఎన్‌ఐఏను రంగంలోకి దించాలని ఎన్నికల సంఘానికి ఆదేశం!



న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా సమగ్ర సర్వే (SIR) విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను ఆందోళనకారులు గంటల తరబడి నిర్బంధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు గురువారం  కఠినంగా స్పందించింది. న్యాయ వ్యవస్థ నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా కుట్రతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. స్వయంగా కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ రంగంలోకి దిగి రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీలకు ఫోన్ చేసినా, అర్థరాత్రి వరకు అధికారులకు రక్షణ కల్పించకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

  • అసలేం జరిగింది?

మాల్దా జిల్లాలో బుధవారం ఓటర్ల జాబితా సర్వే నిర్వహిస్తున్న సమయంలో, పేర్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకారులు ఏడుగురు అధికారులను (వీరిలో ముగ్గురు మహిళలు) సాయంత్రం 4 గంటలకే ఒక గదిలో నిర్బంధించారు. సమాచారం అందినప్పటికీ జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించలేదు. రాత్రి 11 గంటల వరకు ఎటువంటి సాయం అందకపోవడంతో పరిస్థితి విషమించింది. చివరకు అర్థరాత్రి ఒంటి గంట తర్వాత భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేసి అధికారులను రక్షించాల్సి వచ్చింది. ఈ జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడుతూ, రాష్ట్ర అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు అధికారాన్ని సవాల్ చేశారని వ్యాఖ్యానించింది.


  • సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ ఘటనపై సుప్రీంకోర్టు కేవలం మౌఖిక హెచ్చరికలతో సరిపెట్టకుండా కఠిన ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌లో ప్రతి ఒక్కరూ రాజకీయ భాషే మాట్లాడుతున్నారని, అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తమకు తెలుసని సీజేఐ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కోర్టు ఈ  నిర్ణయాలు తీసుకుంది

  • కేంద్ర బలగాల మోహరింపు: జ్యుడిషియల్ అధికారులకు భద్రత కల్పించేందుకు , సర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు తక్షణమే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని ఎన్నికల సంఘాన్ని (EC) ఆదేశించింది.
  • కేంద్ర దర్యాప్తు: ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను తేల్చేందుకు సీబీఐ (CBI) లేదా ఎన్‌ఐఏ (NIA) చేత విచారణ జరిపించే దిశగా చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించింది.
  • షోకాజ్ నోటీసులు: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు రాష్ట్ర ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కారణ కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, న్యాయాధికారుల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో, పరిపాలనా వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Monday, 30 March 2026

హేట్ స్పీచ్ బిల్లు ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్


  • అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
  • ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎల్పీ నేత ధ్వజం
  • బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్


హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'హేట్ స్పీచ్ బిల్లు'పై భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉందని, ప్రజాస్వామ్య గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన చట్టాన్ని తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతల పేరుతో తీసుకువస్తున్న ఈ బిల్లు పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనలా కనిపిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీసే సామాన్యులపై కక్ష సాధించేందుకే ఈ నిబంధనలను రూపొందించారని ఆయన విమర్శించారు.



ఈ బిల్లులోని అస్పష్టమైన అంశాల వల్ల సామాన్యులకు సంకెళ్లు పడతాయని, అధికారులకు మాత్రం ఇది రక్షణ కవచంలా మారుతుందని మహేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన నిజాం నవాబు లేదా ఇందిరా గాంధీ వంటి వ్యక్తుల గురించి మాట్లాడినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేలా నిబంధనలు ఉండటం దారుణమన్నారు. ఆధారాలు లేకున్నా, నేరం నిరూపణ కాకముందే జైలుకు పంపే అధికారం పోలీసులకు కల్పించడం పౌర స్వేచ్ఛకు విఘాతమని ధ్వజమెత్తారు. ముఖ్యంగా బిల్లులోని 'సెక్షన్ 4' అనేది ప్రజాస్వామ్యానికి ఒక డెత్ వారెంట్ లాంటిదని ఆయన అభివర్ణించారు.


రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం ఇలాంటి నల్ల చట్టాలను తీసుకురావద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంతటి కీలకమైన బిల్లును ఆమోదించే ముందు హౌస్ కమిటీ వేయాలని, క్షుణ్ణంగా చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపి, దానిపై సమగ్రమైన రివ్యూ నిర్వహించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు. ఈ బిల్లును తమ పార్టీ తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

కేరళలో ఎవరి మధ్య పొత్తు ఉందో అందరికీ తెలుసు


  • మోడీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ధ్వజం
  • పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్.
  • గ్యాస్ ధరల పెరుగుదలపై ఆందోళన


కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. కేరళలో ఎల్‌డీఎఫ్ , యూడీఎఫ్ కూటముల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న ప్రధాని ఆరోపణలను తిప్పికొడుతూ, అసలు పొత్తు ఎవరి మధ్య ఉందో కేరళ ప్రజలందరికీ బాగా తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం మారదని, ప్రజలు సత్యాన్ని గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కేంద్ర సంస్థలు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



రాజకీయ విమర్శలతో పాటు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భారత్‌పై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. యుద్ధం వంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయడం తమ ఉద్దేశ్యం కాదని, అయితే దీనివల్ల తలెత్తుతున్న సవాళ్లకు పరిష్కారాలను వెతకడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు.



పశ్చిమాసియా సంక్షోభం విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ముందస్తు ప్రణాళికలు ,సన్నద్ధతను పార్లమెంట్ వేదికగా దేశానికి వెల్లడించాలని ప్రియాంక కోరారు. ఇంధనం , గ్యాస్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పారదర్శకత ఉండాలని, అప్పుడే అందరం కలిసి భవిష్యత్తు వ్యూహాలపై పని చేయగలమని ఆమె చెప్పారు. ప్రధాని మోడీ కేవలం పరిస్థితిని వివరించడం కాకుండా, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరపడం ద్వారా ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు.

పినరయి విజయన్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలోనే


  • కేరళలో  కార్పొరేట్ సంస్థగా మారిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం
  •  రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!


కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పతనంతిట్టలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తన సిద్ధాంతాలను పక్కనబెట్టి ‘కార్పొరేట్ నిధులతో నడిచే ప్రభుత్వం’గా మారిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నియంత్రిస్తున్నారని, విజయన్ అవినీతికి సంబంధించిన ఫైళ్లు మోడీ వద్ద ఉండటమే ఇందుకు కారణమని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెడుతుంటే, కేరళ ముఖ్యమంత్రిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఈ రహస్య ఒప్పందానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.



ఎన్నికల బరిలో ఎల్డీఎఫ్ , బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, యూడీఎఫ్ (UDF) కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఈ ‘అపవిత్ర కలయిక’ ఏర్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. శబరిమల ఆలయ బంగారం దొంగతనం వంటి కీలక అంశాలను నిన్న కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ ప్రస్తావించకపోవడం వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను విస్మరించి కేవలం కార్పొరేట్శక్తులకే కొమ్ముకాస్తోందని, కాంగ్రెస్ మాత్రమే బీజేపీని , వారి రహస్య మిత్రులను ఢీకొట్టగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , వృద్ధులకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం వంటి పథకాలను అమలుచేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

Sunday, 29 March 2026

వ్యాధి చికిత్స నుంచి నివారణ దిశగా భారత్ అడుగులు

 

  •  జీవనశైలి జబ్బులపై యుద్ధానికి కేంద్రం ‘యోగాస్త్రం’
  • మధుమేహం, రక్తపోటు నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు
  • చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కొత్త యోగా ప్రోటోకాల్స్


దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అసంక్రమిత వ్యాధుల (NCDs) భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చికిత్స కంటే నివారణే మిన్న అనే నినాదంతో, వివిధ అనారోగ్య సమస్యలు , నిర్దిష్ట వయస్సు గల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన "యోగా ప్రోటోకాల్‌"ను కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఈ నెలలో జరిగిన యోగా మహోత్సవ్ 2026లో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ శాస్త్రీయ నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో దాదాపు మూడింట రెండు వంతులు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, మానసిక రుగ్మతల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో, ఈ యోగా ప్రోటోకాల్ ఒక కీలకమైన ముందడుగుగా నిలవనుంది.



ఈ నూతన విధానం ప్రకారం, ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాల పాటు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం , విశ్రాంతి పద్ధతులను కలిపి ఒక క్రమపద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా, శాస్త్రీయ ఆధారాలతో కూడిన క్లినికల్ మాడ్యూల్ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా వివరించారు. ఉదాహరణకు, మధుమేహం ఉన్నవారికి మెటబాలిక్ బ్యాలెన్స్ మెరుగుపరిచేలా, రక్తపోటు ఉన్నవారికి నరాల వ్యవస్థను శాంతపరిచేలా,  ఆస్తమా రోగులకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేలా ఈ ప్రోటోకాల్స్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. చిన్నపిల్లల కోసం సరదాగా ఉండే యోగా పద్ధతులు, కౌమార దశలో ఉన్నవారికి మానసిక ప్రశాంతతనిచ్చే వ్యాయామాలు, గర్భిణీ స్త్రీలు , వృద్ధుల కోసం ప్రత్యేక కదలికలతో కూడిన గైడ్‌లైన్స్‌ను ఇందులో చేర్చారు.




యోగా అనేది కేవలం భారతదేశ సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదని, ఆధునిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఉద్ఘాటించారు. ఈ విధానం ద్వారా ప్రతి పౌరుడు తమ ఆరోగ్యంపై తామే నియంత్రణ సాధించవచ్చని, తద్వారా దీర్ఘకాలంలో దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కనీస ఖర్చుతో పాఠశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో ఈ ప్రోటోకాల్స్‌ను అమలు చేయవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, యోగాను ఒక కాలానుగుణ అభ్యాసం నుండి నిత్యకృత్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను ఒక సంపూర్ణ ఆరోగ్య పరిష్కారంగా ప్రచారం చేయడంలో భారత్ తన అగ్రగామి పాత్రను మరోసారి చాటుకుంది.





Featured post

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అపురూప దృశ్యం

  ఆంజనేయుడిని స్పృశించిన సూర్య కిరణాలు అయోధ్య బాలరాముడి 'సూర్య తిలకం' తరహాలోనే దైవానుభూతి ఇది నా పూర్వజన్మ సుకృతమన్న మెగాస్టార్ హైదర...