Sunday, 10 May 2026

హైదరాబాద్‌లో స్నేహపూర్వక భేటీ


  • ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లిన ప్రధాని మోడీ!








తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలను సందర్శించి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభ ముగిసిన అనంతరం, ప్రధాని నేరుగా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ప్రధానికి చంద్రబాబు కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనపై స్పందించిన చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోడీ తమ నివాసానికి రావడం తమ కుటుంబానికి దక్కిన గౌరవమని, ఆయన చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతుందని 'ఎక్స్' వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


అనంతరం ప్రధాని మోడీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పవన్ కుటుంబ సభ్యుల సాదర స్వాగతం మధ్య ప్రధాని అక్కడ సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి స్వయంగా ఇంటికి వచ్చిన ప్రధానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, కూటమి ఐక్యతపై ఈ భేటీలు సానుకూల సంకేతాలను ఇచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని పర్యటనతో అటు అమరావతి, ఇటు హైదరాబాద్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

తెలంగాణలో మొదలైన మార్పు గాలి


  • రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
  • హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీ ధీమా!



తెలంగాణ గడ్డపై భారతీయ జనతా పార్టీ తన రాజకీయ పట్టును పెంచుకునే దిశగా మరో భారీ ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ అభివృద్ధి నమూనా వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని, ఇక్కడ కనిపిస్తున్న అపారమైన జనవాహినిని చూస్తుంటే రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అభివర్ణించారు. అస్సాం, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కుటుంబ పాలనను తిరస్కరించి ప్రజలు ఏ విధంగా బీజేపీకి పట్టం కట్టారో, అదే చరిత్ర తెలంగాణలోనూ పునరావృతం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు అవినీతి, వారసత్వ రాజకీయాలు , నియంతృత్వ ధోరణులతో దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.


తెలంగాణ భవిష్యత్తును మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న ప్రధాని, ఈ పర్యటనలో రాష్ట్రానికి సుమారు రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి ఫలాలను అందించారు. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం , వరంగల్‌లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, పత్తి రైతులకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో విసిగిపోయిన ప్రజలు, పారదర్శకమైన , సుపరిపాలన అందించే బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయాలే కాకుండా దేశ ఆర్థిక స్వావలంబన గురించి కూడా మాట్లాడిన మోడీ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.


దేశాన్ని 2047 నాటికి 'వికసిత భారత్'గా మార్చే లక్ష్యంలో భాగంగా.. ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, కార్‌పూలింగ్ , ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని ప్రధాని కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ , అనవసరపు ఖర్చులను తగ్గించుకుని, స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని (ఓకల్ ఫర్ లోకల్) ఆయన విజ్ఞప్తి చేశారు. సేంద్రీయ వ్యవసాయం , స్వయం సమృద్ధి ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ సభలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని, తెలంగాణలో బీజేపీ విజయానికి కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అస్సాం ముఖ్యమంత్రిగా మళ్లీ హిమంత బిశ్వ శర్మ



  • వరుసగా రెండోసారి పగ్గాలు .. మే 12న ప్రమాణ స్వీకారం!


అస్సాం రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రిగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గౌహతిలోని లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన హిమంత, తన కూటమికి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. రాజ్యాంగంలోని 164వ అధికరణం ప్రకారం గవర్నర్ ఈ నియామకాన్ని ఖరారు చేస్తూ, మే 12వ తేదీ ఉదయం 11:40 గంటలకు ఖానాపారాలోని వెటర్నరీ కాలేజ్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అస్సాం చరిత్రలో కాంగ్రెస్ నేత కాని ఒక నాయకుడు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 126 స్థానాలకు గానూ బీజేపీ ఒంటరిగానే 82 సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) తలో 10 సీట్లు సాధించాయి. ఫలితంగా 102 సీట్ల భారీ మెజారిటీతో కూటమి పట్టు సాధించింది. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి విధానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో అస్సాం గత ఐదేళ్లలో కేంద్ర పథకాలను అద్భుతంగా అమలు చేసిందని, రాబోయే ఐదేళ్లలో కూడా జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


హిమంత బిశ్వ శర్మ తన ఎన్నిక అనంతరం మాట్లాడుతూ, ప్రధాని మోడీ అస్సాం అభివృద్ధిపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధే ఈ విజయానికి కీలకమని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. మే 12న జరగబోయే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 2016లో శర్బానంద సోనోవాల్‌తో ప్రారంభమైన బీజేపీ పాలన, 2021లో హిమంతకు బదిలీ అయి, ఇప్పుడు మళ్ళీ ఆయన నాయకత్వంలోనే మూడో ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

నిజం చెప్పినందుకే వేటు


  • సస్పెండైన నేత రిజు దత్తా సంచలన వ్యాఖ్యలు



పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే నెపంతో ఆరేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా ఆదివారం తన సొంత పార్టీపై నిప్పులు చెరిగారు. బెంగాల్‌ పౌరులకు టీఎంసీ పాలనలో కనీస పనులు జరగాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పార్టీలో అవినీతి వ్యవస్థీకృతమైందని ఆయన ఆరోపించారు. ఇంటి నిర్మాణ ప్లాన్ల ఆమోదం నుంచి మరుగుదొడ్ల ఏర్పాటు వరకు ప్రతిదానికీ టీఎంసీ నేతలకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేదని, చివరకు ఉద్యోగాల నియామకాల్లో జరిగిన భారీ కుంభకోణం పార్టీ కొంపముంచిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ విజయం తర్వాత బెంగాల్ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని, ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో పార్టీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు.


తాను గత 13 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, వారసత్వ రాజకీయాల వల్ల కాకుండా సొంత శ్రమతోనే ఈ స్థాయికి ఎదిగానని రిజు దత్తా పేర్కొన్నారు. పార్టీ వేదికలపై తాను ఎప్పుడూ నిజాయితీగా సమస్యలను లేవనెత్తినా నాయకత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు నిజం మాట్లాడినందుకే తనపై వేటు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సంజాయిషీని కూడా చదవకుండానే సస్పెన్షన్ నోటీసును ముందుగానే టైప్ చేసి సిద్ధంగా ఉంచారని పార్టీ క్రమశిక్షణా కమిటీపై విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో, గతంలో రాజకీయ ప్రచారాల్లో భాగంగా బీజేపీ నేతలపై తాను చేసిన వ్యక్తిగత విమర్శలకు ఆయన క్షమాపణలు కోరారు. తన కుటుంబానికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చిన బీజేపీ కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


మరోవైపు, ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ వ్యూహాలను, నాయకత్వ తీరును బహిరంగంగా విమర్శించినందుకు రిజు దత్తాతో పాటు కోహినూర్ మజుందార్, కార్తీక్ ఘోష్‌లను కూడా టీఎంసీ సస్పెండ్ చేసింది. డెరెక్ ఓబ్రెయిన్ నేతృత్వంలోని కమిటీ మరో ఇద్దరు నేతలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచినప్పుడు లేని విమర్శలు, ఓడిపోయిన తర్వాతే ఎందుకు వస్తున్నాయని టీఎంసీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రిజు దత్తా చేసిన ఆరోపణలపై సరైన సమయంలో స్పందిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి, బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్న తరుణంలో, కీలక నేతల తిరుగుబాటు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.

యుద్ధం విసిరిన సవాలును ఎదుర్కొందాం



విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేద్దాం

హైదరాబాద్ వేదికగా భారతీయులకు ప్రధాని మోడీ పిలుపు


పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి భారతీయులందరూ నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, యుద్ధం వల్ల ముడిచమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, దేశ ప్రజలపై ఆ భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.  సప్లై చైన్‌ లో అంతరాయాల వల్ల ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడు ఒక 'సంకల్పం' తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్‌ను పొదుపుగా వాడటం ఇప్పుడు దేశహితం దృష్ట్యా అత్యంత ఆవశ్యకమని ప్రధాని గట్టిగా చెప్పారు.


ముడిచమురు దిగుమతుల కోసం దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ కరెన్సీని ఆదా చేసేందుకు ప్రజలు తమ వంతుగా కొన్ని చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించారు. వీలైనంత వరకు మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని, కార్లను వాడేవారు 'కార్‌పూలింగ్' పద్ధతిని అనుసరించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవారు వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని, కరోనా సమయంలో మనం అలవాటు చేసుకున్న 'వర్క్ ఫ్రమ్ హోమ్', ఆన్‌లైన్ సమావేశాలను మళ్ళీ ప్రోత్సహించడం వల్ల ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే విదేశీ పర్యటనలు, వివాహాల కోసం విదేశాలకు వెళ్లే సంస్కృతిని తగ్గించుకుని, స్వదేశీ పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.


తెలంగాణ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో నియంతృత్వ ధోరణులను ఓడించి బీజేపీకి అక్కడి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారో, అదే ఉత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోందని మోడీ అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, గతంలో బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే అందులో ఒకరిని తెలంగాణ ఇచ్చిందని గుర్తుచేశారు. దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే లక్ష్యంలో తెలంగాణ కూడా భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని, కేంద్రం ఎల్లప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Saturday, 9 May 2026

తెలంగాణ, కర్ణాటకల్లో ప్రధాని మోడీ పర్యటన


  •  రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
  •  హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేడు (ఆదివారం) తెలుగు రాష్ట్రం తెలంగాణతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వేదికగా సుమారు రూ. 9,400 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరులోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ రహదారులు, రైల్వేలు, టెక్స్‌టైల్స్, ఇంధన, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరీ ముఖ్యంగా 1,500 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన 'సింధు క్యాన్సర్ ఆసుపత్రి'ని ప్రధాని ప్రారంభించనుండటం ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.



తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ పునాది వేయనున్నారు. సుమారు రూ. 3,175 కోట్లతో గుడెబెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి-167 విస్తరణ పనులు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ. 2,350 కోట్లతో నిర్మించనున్న భారీ పారిశ్రామిక వాడ ఇందులో ప్రధానమైనవి. అలాగే వరంగల్‌లో దేశంలోనే తొలి పూర్తిస్థాయి 'పీఎం మిత్ర' మెగా టెక్స్‌టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు. రైల్వే రంగానికి సంబంధించి కాజీపేట-విజయవాడ సెక్షన్లలో మల్టీ ట్రాకింగ్ పనులు, మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ టెర్మినల్ ప్రాజెక్టులను ప్రధాని ప్రజలకు అంకితం చేయనున్నారు. పర్యటన ముగింపులో సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ రాజకీయ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ ప్రజల మొదటి ప్రాధాన్యం ఇప్పుడు బీజేపీయేనని ఆయన తన సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేశారు.

ఒకే కుటుంబం.. మూడు వేర్వేరు పార్టీలు


  • 'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్ ఫ్యామిలీ సృష్టించిన అరుదైన రాజకీయ రికార్డు!


భారత రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీల్లో ఉండటం కొత్తేమీ కాదు. జాతీయస్థాయిలో గాంధీ కుటుంబం నుండి, హర్యానాలోని చౌతాలాలు, తెలంగాణలోని కేసీఆర్ కుటుంబం వరకు ఇలాంటి చీలికలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే, తాజాగా ముగిసిన తమిళనాడు , పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 'లాటరీ కింగ్'గా పేరొందిన శాంటియాగో మార్టిన్ కుటుంబం ఒక అరుదైన చరిత్రను లిఖించింది. ఒకే కుటుంబానికి చెందిన భార్య, కుమారుడు , అల్లుడు మూడు వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసి విజయం సాధించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుండి ఏఐఏడీఎంకే (AIADMK) అభ్యర్థిగా పోటీ చేసిన లీనా రోజ్ మార్టిన్ విజయం సాధించగా, ఆమె అల్లుడు ఆధవ్ అర్జున 'దళపతి' విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తరపున విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఒకే అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం విశేషం. ఇక శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పుదుచ్చేరిలో సొంతంగా 'లక్ష్య జననాయక కచ్చి' అనే పార్టీని స్థాపించి, కామరాజర్ నగర్ నుండి గెలుపొందారు. ఆయన అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిలో భాగంగా ఉన్నారు. తమిళ రాజకీయాల్లో కరుణానిధి కుటుంబం వంటి బలమైన రాజకీయ శక్తులన్నీ ఒకే గొడుగు కింద (డీఎంకే) ఉన్న తరుణంలో, మార్టిన్ కుటుంబం ఇలా విభిన్న పార్టీల ద్వారా అధికారాన్ని దక్కించుకోవడం ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది.

Featured post

హైదరాబాద్‌లో స్నేహపూర్వక భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లిన ప్రధాని మోడీ! తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్...