Friday, 15 May 2026

డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చల్లో మగవారే మహారాజులు

 

  • అమెరికా-చైనా సదస్సు ఫోటోలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన
  • 'మెరిటోక్రసీకి చరమగీతం' అంటూ గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు


బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలు సరికొత్త అంతర్జాతీయ వివాదానికి దారితీశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు అగ్రదేశాల మధ్య జరిగిన హై-స్టేక్స్ సమావేశంలో ఇరు దేశాల తరఫున ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేకపోవడం అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ సదస్సుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో, దౌత్య రంగంలో అత్యున్నతస్థాయిల్లో లింగ సమానత్వం , ప్రాతినిధ్యంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ, విమర్శలు మొదలయ్యాయి. కేవలం పురుషులు మాత్రమే నిండివున్న ఆ చర్చల గది ఫోటోలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.



ఈ వ్యవహారంపై హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ ఫోటోలను చూస్తుంటే "మెరిటోక్రసీకి చరమగీతం పాడినట్లు (ప్రతిభకు విలువ లేనట్లు) ఒక పెయింటింగ్‌లా కనిపిస్తోందని" ఆమె అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల ప్రతినిధులు సమావేశమైతే చర్చల టేబుల్ వద్ద ఒక్క మహిళ కూడా లేకపోవడం ఘోరమన్నారు. అనంతరం ఆమె 'ది గార్డియన్' పత్రికతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు ఉన్నప్పటికీ, ఈ రెండు దేశాలు కేవలం ఒకే జెండర్ (పురుషుల) తో కూడిన బృందాలను ఎలా సిద్ధం చేశాయో అర్థం కావడం లేదని, ఇది అత్యంత విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. మీ ప్రతిభ కంటే మీకున్న నెట్‌వర్క్ మాత్రమే మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందనే పాత రోజుల్లోకి మనం మళ్లీ వెళ్తున్నామా అనే అనుమానం ఈ పరిణామం కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ విషయంపై స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫెమినిస్ట్ అండ్ జెండర్ స్టడీస్ అసోసియేట్ డైరెక్టర్ హలీమా కాజెమ్ కూడా గళమెత్తారు. ప్రపంచం ప్రగతి వైపు కాకుండా "వెనక్కి నడుస్తోందని" ఆమె విమర్శించారు. గతంలో ఒబామా హయాంలో జరిగిన అమెరికా-చైనా సదస్సులను ప్రస్తుత సదస్సుతో పోల్చుతూ.. నాటి చర్చల్లో హిల్లరీ క్లింటన్, సుసాన్ రైస్, లియు యాన్ డాంగ్ వంటి శక్తివంతమైన మహిళా నేతలు కీలకపాత్ర పోషించారని ఆమె గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని శాసించే ఏ ఒక్క సూపర్ పవర్ కూడా గ్లోబల్ పాలిటిక్స్ చర్చించే గదిలో మహిళలకు స్థానం ఉండాలని భావించడం లేదని ఆరోపించారు. ఈ వైఫల్యం కేవలం అమెరికాది మాత్రమే కాదని, అంతర్జాతీయ ఆర్డర్‌ను నిర్దేశించే విషయంలో మహిళల గొంతుకకు విలువ లేదనే సంకేతాన్ని ఇరుదేశాలు ఇచ్చాయని ఆమె విశ్లేషించారు. కేవలం పురుషులతోనే ఈ సదస్సును నిర్వహించడం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక రకమైన 'సైనిక , పురుషాధిక్య' గ్లోబల్ అథారిటీని ప్రదర్శించడానికి ప్రయత్నించారని ఆమె మండిపడ్డారు.


బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో జరిగిన అధికారిక ద్వైపాక్షిక చర్చల టేబుల్ వద్ద మహిళలకు చోటు దక్కనప్పటికీ.. ట్రంప్ వెంట చైనా పర్యటనకు వచ్చిన వారిలో కొందరు ప్రముఖ మహిళలు ఉన్నారు. వారిలో ట్రంప్ కోడలు లారా ట్రంప్, సిటీగ్రూప్ సీఈఓ జేన్ ఫ్రేజర్ మరియు మెటా ప్రెసిడెంట్ దినా పవెల్ మెక్‌కార్మిక్ వంటి వారు ఉన్నారు. అయినప్పటికీ, ప్రపంచ భవిష్యత్తును మార్చే ప్రధాన దౌత్య చర్చల నుండి మహిళలను పూర్తిగా దూరం పెట్టడం పట్ల అంతర్జాతీయంగా మహిళా సంఘాలు , మేధావుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రులు

 

  • అగ్రనేతల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది? కొందరికి సీఎం పీఠాలు
  • కేంద్ర పదవులు.. మరికొందరికి రాజకీయ అజ్ఞాతవాసం!


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రులు ,అగ్రనేతల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు (Mixed Bag) కనిపిస్తున్నాయి. అశోక్ చవాన్ వంటి సీనియర్ నేత ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన తరుణంలో, సిద్ధాంతాలను పక్కనబెట్టి 'కమలం' గూటికి చేరిన నాయకులందరికీ రాజకీయంగా సమానమైన ప్రయోజనాలు దక్కలేదని విశ్లేషణలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రుల సుదీర్ఘ జాబితాలో అమరీందర్ సింగ్, దిగంబర్ కామత్, ఎస్.ఎం. కృష్ణ, విజయ్ బహుగుణ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్.డి. తివారీ, జగదాంబికా పాల్, , పెమా ఖండూ వంటి హేమాహేమీలు ఉన్నారు. అయితే, ఈ వలసల వల్ల అటు సదరు నాయకులకు, ఇటు బీజేపీకి ఎలాంటి లాభనష్టాలు చేకూరాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.



ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం పెమా ఖండూ రూటే వేరు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భారీగా చీల్చి రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీని సాధించి పెట్టడమే కాకుండా, అప్పటి నుండి ఇప్పటివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవంతంగా కొనసాగుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్.డి. తివారీ తన రాజకీయ జీవితం చివరి దశలో కేవలం తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరారు, ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన కన్నుమూశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ కూడా వయోభారం, స్థానిక రాజకీయ సమీకరణాల వల్ల బీజేపీలో చేరినప్పటికీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ వీడి వచ్చిన పలువురు మాజీ ముఖ్యమంత్రులపై అప్పట్లో ఉన్న అవినీతి, ఈడీ కేసులు కూడా వారు బీజేపీలో చేరిన తర్వాత పూర్తిగా నిష్క్రియం అయిపోవడం గమనార్హం. ఏదేమైనప్పటికీ, ఈ స్థాయి నేతల చేరికలు దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక పొలిటికల్ మైలేజ్ లేదా 'బజ్' క్రియేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.


పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ప్రస్తుతం బీజేపీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేసే బీజేపీలో ఉంటూనే.. ఆయన తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ మాత్రం లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు, ఆయన కుమారుడు ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పదవి అనుభవిస్తున్నారు. ఈ మాజీ సీఎంల కథ ఇలా ఉంటే, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మారిన హిమంత బిశ్వ శర్మ (అసోం), బీరెన్ సింగ్ (మణిపూర్), మాణిక్ సాహా (త్రిపుర)ల కథలు పూర్తిగా భిన్నమైనవి , అత్యంత విజయవంతమైనవి. అసోంలో తరుణ్ గొగోయ్ సీఎంగా ఉన్నప్పుడు హిమంతకు సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం మాట తప్పడంతో, ఆయన బీజేపీలో చేరి 2021 ఎన్నికల తర్వాత అసోం ముఖ్యమంత్రి అయ్యారు. బీరెన్ సింగ్ కూడా కాంగ్రెస్ నుండి వచ్చి 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మణిపూర్‌లో గత ఏడాది కాలంగా తీవ్ర హింసాకాండ సాగుతున్నా, ఆయనను పదవి నుండి దించాలని డిమాండ్లు వస్తున్నా అధిష్ఠానం ఆయనను సీఎం పీఠంపైనే కొనసాగిస్తోంది. త్రిపురలో సీపీఎం సుదీర్ఘ పాలన వల్ల మాణిక్ సాహాకు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎలాంటి అవకాశం రాలేదు, కానీ ఆయన బీజేపీలోకి మారిన తర్వాత 2023లో విప్లవ్ కుమార్ దేవ్ స్థానంలో త్రిపుర ముఖ్యమంత్రిగా అదృష్టాన్ని వరించారు.


మాజీ ముఖ్యమంత్రులే కాకుండా, రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తులుగా ఉన్న యువ కేంద్ర మాజీ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, ఆర్.పి.ఎన్. సింగ్‌లు కూడా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరారు. వీరిలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన సింధియాకు కేంద్రంలో పౌర విమానయాన, ఉక్కు శాఖల మంత్రి పదవి లభించడమే కాకుండా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతుదారులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇప్పించుకోగలిగారు. జితిన్ ప్రసాద యూపీలోని యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా, ఆర్.పి.ఎన్. సింగ్‌కు ఇటీవల ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సీటు లభించింది. మొత్తం వలస నేతల జాబితాలో హిమంత బిశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియాలు మాత్రమే బీజేపీలో చేరి అత్యధిక రాజకీయ లబ్ధిని, అధికార ప్రాధాన్యాన్ని పొందారని చెప్పవచ్చు. హిమంత బిశ్వ శర్మ అయితే ఏకంగా ఈశాన్య రాష్ట్రాలకే కాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ మేనేజర్‌గా ఎదిగారు. వీరే కాకుండా, శివసేన నుంచి వచ్చిన మాజీ సీఎం నారాయణ్ రాణే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉండగా, జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ తిరిగి సొంతగూడు బీజేపీలోకి వచ్చి ప్రస్తుతం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా వ్యవహరిస్తున్నారు.

కరోనా మహమ్మారి అసలు సిసలు మారణహోమం


  • 2020-2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్లకు పైగా 'అదనపు మరణాలు'
  • డబ్ల్యూహెచ్ వో నివేదికలో షాకింగ్ నిజాలు!


ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అసలైన మారణహోమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యంత దిగ్భ్రాంతికరమైన నివేదికను విడుదల చేసింది. కేవలం అధికారికంగా నమోదైన కరోనా మరణాలే కాకుండా, ఈ మహమ్మారి వల్ల పరోక్షంగా సంభవించిన నష్టాన్ని లెక్కిస్తూ డబ్ల్యూహెచ్ వో కీలక అంచనాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 2020 జనవరి నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 22.1 మిలియన్ల (2.21 కోట్లు) 'అదనపు మరణాలు' (Excess Deaths) సంభవించాయని ఈ నివేదిక అంచనా వేసింది. అధికారిక గణాంకాల కంటే ఈ వైరస్ సృష్టించిన మానవ నష్టం ఎంతటి తీవ్రమైనదో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


అసలు 'అదనపు మరణాలు' అంటే ఏమిటి?

వైద్య నిపుణుల ప్రకారం.. ఒక సాధారణ కాలంలో సాధారణ పరిస్థితుల నడుమ దేశంలో ఎంతమంది చనిపోతారో, దానికి మించి విపత్కర పరిస్థితుల్లో నమోదైన అదనపు మరణాల సంఖ్యనే 'ఎక్సెస్ డెత్స్' అంటారు. ప్రముఖ వైద్య జర్నల్ 'బీఎమ్‌జే' (BMJ) పరిశోధన ప్రకారం ఇందులో పలు అంశాలు ఉంటాయి. కరోనా ఇన్ఫెక్షన్ వల్ల నేరుగా చనిపోయిన వారు, కోవిడ్ ఉధృతి వల్ల ఆసుపత్రులు నిండిపోయి వైద్యం అందక చనిపోయిన వారు, లాక్‌డౌన్ , ఇతర కారణాల వల్ల క్యాన్సర్ లేదా గుండె జబ్బుల వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సకాలంలో చికిత్స లేదా నిర్ధారణ పరీక్షలు అందక మరణించిన వారంతా ఈ జాబితా కిందకే వస్తారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక సంక్షోభం  అసలైన తీవ్రతను అంచనా వేయడానికి ఈ 'అదనపు మరణాల' డేటానే అత్యంత ప్రామాణికమైనదిగా నిపుణులు భావిస్తారు.



గ్లోబల్ హెల్త్ డేటా సేకరణలో ఘోర వైఫల్యాలు

ఈ నివేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణాల నమోదు వ్యవస్థల్లో ఉన్న పటిష్టత లోపాలు కూడా బట్టబయలయ్యాయి. ప్రపంచంలోని కేవలం మూడో వంతు (1/3) దేశాలు మాత్రమే డబ్ల్యూహెచ్ వో ప్రమాణాల ప్రకారం నాణ్యమైన మరణాల నివేదికలను సమర్పిస్తున్నాయి. దాదాపు సగం దేశాల్లో అసలు నమ్మదగిన మరణాల నమోదు వ్యవస్థలే లేవు లేదా అత్యంత నాసిరకం డేటా అందుబాటులో ఉంది. 2025 చివరి నాటికి కూడా కేవలం 18 శాతం దేశాలు మాత్రమే ఏడాది లోపు మరణాల డేటాను డబ్ల్యూహెచ్ వోకు సమర్పించాయి. అలాగే ప్రపంచంలోని మూడో వంతు దేశాలు అసలు మరణానికి గల కచ్చితమైన కారణాన్ని ఎప్పుడూ నివేదించలేదు. ఉదాహరణకు 2023లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన 6.1 కోట్ల మరణాలలో కేవలం మూడో వంతు వాటికి మాత్రమే మరణానికి గల కారణం నమోదైంది. కేవలం ఐదో వంతు మరణాలకు మాత్రమే అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ICD) కోడ్ ఆధారాలు ఉన్నాయి.


కరోనా మరణాలుగా ఎందుకు నమోదు కాలేదు?

మహమ్మారి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా మరణాలు అధికారికంగా కోవిడ్ మరణాలుగా రికార్డు కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కరోనా ప్రారంభ దశల్లో టెస్టింగ్ కిట్ల కొరత ఉండటం, ఆసుపత్రులకు రాకుండా ఇళ్లలోనే చాలామంది ప్రాణాలు కోల్పోవడం, గ్రామీణ ప్రాంతాల్లో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం ,దేశాల మధ్య నివేదికల ప్రమాణాలలో తేడాలు ఉండటం దీనికి కారణం. అలాగే కోవిడ్ రోగుల రద్దీ వల్ల కిడ్నీ, బీపీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రెగ్యులర్ చెకప్‌లు , అత్యవసర వైద్య సేవలు నిలిచిపోవడంతో వేలాదిమంది పరోక్షంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్, చిన్నపిల్లల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లు, గుండె జబ్బుల చికిత్సలు , మానసిక ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల వల్ల వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల ప్రజలు అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారు.


ఈ డేటా ఎందుకు ముఖ్యం?

ప్రస్తుతానికి కరోనా అత్యవసర తీవ్రత తగ్గినప్పటికీ, వైరస్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలోనే ఉంది. భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను ఎదుర్కోవడానికి, ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి , వ్యాధుల నిఘా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి ఈ అదనపు మరణాల గణాంకాలు ప్రభుత్వాలకు, పరిశోధకులకు దిక్సూచిలా ఉపయోగపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హై-రిస్క్ గ్రూపులలో ఉన్నవారు ఇప్పటికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్లు వేసుకోవాలని, శ్వాసకోశ పరిశుభ్రత పాటించాలని, కొత్త వేరియంట్లపై నిరంతరం నిఘా ఉంచాలని డబ్ల్యూహెచ్ వో హెచ్చరిస్తోంది.

బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడిందా?


  •  ఆ ద్వీపం కింద దాగివున్న వింత రాతి నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
  • శతాబ్దాల నాటి భూగర్భ రహస్యం బట్టబయలు



అట్లాంటిక్ మహాసముద్రంలో దశాబ్దాలుగా భూగర్భ శాస్త్రవేత్తలను వేధిస్తోన్న అతిపెద్ద పజిల్స్‌లో ఒకదానికి ఎట్టకేలకు అమెరికా శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. బెర్ముడా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు పేలడం ఆగిపోయి దాదాపు 3 కోట్ల సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సముద్ర గర్భం కంటే సుమారు 1,600 అడుగుల ఎత్తులో (పైకి ఉబ్బినట్లు) ఎలా స్థిరంగా నిలిచి ఉందనేది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు. అయితే, కార్నెగీ సైన్స్‌కు చెందిన సీస్మోలజిస్ట్ విలియం ఫ్రేజర్ , యేల్ యూనివర్సిటీకి చెందిన జెఫ్రీ పార్క్ నేతృత్వంలోని పరిశోధక బృందం, ఆ ద్వీపానికి అత్యంత లోతులో దాగివున్న ఒక వింతైన భూగర్భ రాతి నిర్మాణమే ఇందుకు కారణమని సరికొత్త పరిశోధన ద్వారా వెల్లడించింది. భూమిపై మరెక్కడా లేని విధంగా అత్యంత అరుదైన రీతిలో ఈ నిర్మాణం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.


సాధారణంగా హవాయి వంటి అగ్నిపర్వత ద్వీపాలు భూమి లోపలి పొరల (మ్యాంటిల్) నుంచి పైకి తన్నుకొచ్చే వేడి బండరాళ్ల ప్రవాహం (మ్యాంటిల్ ప్లూమ్) వల్ల ఏర్పడతాయి. ఈ వేడి పదార్థం పైకి నెట్టడం వల్ల సముద్ర గర్భం పైకి ఉబ్బుతుంది. కాలక్రమేణా టెక్టోనిక్ ప్లేట్లు కదలడం, అగ్నిపర్వతాల తీవ్రత తగ్గడంతో ఆ ఉబ్బిన భాగాలు మళ్లీ సముద్రగర్భంలోకి కుంగిపోతాయి. కానీ, బెర్ముడా విషయంలో అలా జరగలేదు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఫ్రేజర్, పార్క్‌లు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పెద్ద భూకంపాల తాలూకు భూకంప తరంగాలను (సీస్మిక్ వేవ్స్) ఉపయోగించుకున్నారు. ఈ తరంగాలు భూమి లోపల ప్రయాణించేటప్పుడు అక్కడ ఉండే రాళ్ల సాంద్రతను బట్టి వాటి వేగం మారుతుంది. బెర్ముడాలోని సీస్మిక్ స్టేషన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా, ద్వీపానికి 20 మైళ్ల లోతు వరకు ఉన్న భూగర్భ పొరల చిత్రాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు.


ఈ పరిశోధనలో సైంటిస్టులకు ఊహించని నిజం ఒకటి వెలుగుచూసింది. సముద్రపు పైపొర (క్రస్ట్) కింద దాదాపు 12 మైళ్లకు పైగా మందం కలిగిన ఒక భారీ రాతి పొర ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ రాయి చుట్టుపక్కల ఉండే మ్యాంటిల్ పొర కంటే చాలా తక్కువ సాంద్రత కలిగి ఉండటంతో పాటు విపరీతమైన ప్లవన శక్తి ని కలిగి ఉంది. అంటే, కింద నుంచి ఏదో వేడి ద్రవం బేర్ముడాను పైకి నెట్టడం లేదు, దానికి బదులుగా ఈ తేలికపాటి రాతి పొర ఒక 'లైఫ్ జాకెట్' లేదా 'పడవ' (రాఫ్ట్) లాగా పనిచేస్తూ బేర్ముడా ద్వీపాన్ని, ఆ సముద్ర గర్భాన్ని కిందికి కుంగిపోకుండా పైనే తేలేలా ఉంచుతోందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోట్ల సంవత్సరాల కిందట బెర్ముడాలో అగ్నిపర్వతాలు యాక్టివ్‌గా ఉన్నప్పుడు, కార్బన్ ఎక్కువగా ఉన్న ద్రవరూప శిలలు భూమి పైపొరల్లోకి చొచ్చుకువచ్చి అక్కడే చల్లబడి గడ్డకట్టడం వల్ల ఈ 'అండర్‌ప్లేటింగ్' అనే రాతి పొర ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పదార్థం వందల కోట్ల సంవత్సరాల కిందట, భూమిపై 'పాంజియా' అనే ఒకే ఒక్క మహాఖండం ఉన్న కాలంలో భూమి లోతుల్లో రూపాంతరం చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


ఈ పరిశోధన ప్రాధాన్యాన్ని వివరిస్తూ విలియం ఫ్రేజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెర్ముడాలోని భౌగోళిక లక్షణాలు భూగర్భ శాస్త్రంలోని సాంప్రదాయ 'మ్యాంటిల్ ప్లూమ్' సిద్ధాంతానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, ఇంత దట్టమైన అండర్‌ప్లేటింగ్ రాతి పొరను తాము మరెక్కడా చూడలేదని ఆయన చెప్పారు. భూమి లోపలి పొరల్లో శాస్త్రవేత్తలకు ఇంకా అర్థంకాని ఎన్నో సరికొత్త ప్రక్రియలు జరుగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ద్వీపాల కింద కూడా ఇలాంటి నిర్మాణాలు ఏవైనా ఉన్నాయా, లేక బెర్ముడా ప్రపంచంలోనే ఏకైక వింతైన ద్వీపమా అనే కోణంలో తాము మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 


నోట్‌: ఈ సంచలన పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ 'జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్' లో ప్రచురితమయ్యాయి.

ప్రత్యామ్నాయ కూటమి - ప్రాంతీయపార్టీల కర్తవ్యం

 


టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు


  • అత్యంత వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన వీరులు వీరే
  • అగ్రస్థానంలో నిలిచిన 'యూనివర్స్ బాస్'!



ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే పొట్టి ఫార్మాట్ (T20 Cricket) లో పరుగులు సాధించడం అంటే మామూలు విషయం కాదు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుండే బౌండరీల వర్షం కురిపించాల్సిన ఈ ఫార్మాట్‌లో, స్థిరత్వంతో పాటు సుదీర్ఘ కాలం రాణించడం కొద్దిమంది బ్యాటర్లకు మాత్రమే సాధ్యమైంది. లీగ్ క్రికెట్, అంతర్జాతీయ మ్యాచ్‌లతో కలుపుకుని టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న టాప్ బ్యాటర్ల జాబితాను ఏఎన్ఐ (ANI) ప్రత్యేకంగా ప్రచురించింది. ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు, 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.



టీ20ల్లో పరుగుల వరద పారించిన క్రిస్ గేల్ కేవలం 423 ఇన్నింగ్స్‌ల్లోనే 14,000 పరుగుల మార్కును దాటి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని తర్వాత స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచాడు. బాబర్ అత్యంత అద్భుతమైన ఫామ్‌తో కేవలం 430 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించి గేల్ రికార్డుకు అత్యంత సమీపంలో నిలిచాడు. ఇక ఈ అరుదైన జాబితాలో మూడో స్థానాన్ని వెస్టిండీస్‌కే చెందిన మరో పవర్‌ఫుల్ హిట్టర్ నికోలస్ పూరన్ కైవసం చేసుకున్నాడు. పూరన్ ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ కేవలం 445 ఇన్నింగ్స్‌ల్లోనే 14 వేల పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు.



ఈ ముగ్గురి తర్వాత స్థానాల్లో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ 475 ఇన్నింగ్స్‌లతో, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 482 ఇన్నింగ్స్‌లతో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేటి బ్యాటర్లు ఉన్నప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో ఈ ఐదుగురు మాత్రమే అత్యంత వేగంగా బౌండరీలు, సిక్సర్ల మోతతో 14,000 పరుగుల మైలురాయిని చేరి తమ పవరేంటో నిరూపించుకున్నారు. ఈ రికార్డులు ప్రస్తుత ఆధునిక క్రికెట్‌లో ఇరవై ఓవర్ల ఆటపై ఈ బ్యాటర్ల లయ, పట్టుదల , ఆధిపత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.









భోజ్‌శాల వివాదంలో తదుపరి అడుగు ఏంటి?


  • హిందూ పక్షం తరఫు న్యాయవాది ప్రత్యేక ఇంటర్వ్యూ
  • సర్వే నివేదిక ఆధారంగా కోర్టులో తేలనున్న అసలు నిజాలు!


మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చరిత్రాత్మక భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు (Bhojshala) వివాదంలో కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై హిందూ పక్షం తరఫు సీనియర్ న్యాయవాది ఎన్డీటీవీ (NDTV)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వివరాలను వెల్లడించారు. ఈ శతాబ్దాల నాటి వివాదాస్పద కట్టడం , అసలు స్వరూపాన్ని, చరిత్రాత్మక నేపథ్యాన్ని వెలికితీసేందుకు పురావస్తు శాఖ (ASI) జరిపిన శాస్త్రీయ సర్వే ప్రక్రియ ముగిసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వివాదంలో హిందూ పక్షం తదుపరి చట్టపరమైన వ్యూహం ఏంటనే దానిపై ఆయన పూర్తి స్పష్టత ఇచ్చారు.



భోజ్‌శాల ప్రాంగణంలో లభించిన ఆధారాలు, శాసనాలు, విగ్రహాల అవశేషాలు అది ఒకప్పుడు సరస్వతీ దేవి ఆలయమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని హిందూ పక్షం లాయర్ ధీమా వ్యక్తం చేశారు. ఏఎస్ఐ సమర్పించబోయే సమగ్ర సర్వే నివేదిక ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు కానుందని, ఆ నివేదిక ఆధారంగానే తాము కోర్టులో బలమైన వాదనలు వినిపించబోతున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం భోజ్‌శాల ప్రాంగణంపై హిందువులకు పూర్తి హక్కులు కల్పించడమే తమ తదుపరి లక్ష్యమన్నారు. చట్టపరమైన నిబంధనలకు లోబడి, కోర్టు పరిధిలోనే తాము ఈ పోరాటాన్ని ముగింపు దశకు తీసుకెళ్తామని, త్వరలోనే న్యాయస్థానం నుండి ఒక చారిత్రాత్మక తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు న్యాయవాది పేర్కొన్నారు.

Featured post

డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చల్లో మగవారే మహారాజులు

  అమెరికా-చైనా సదస్సు ఫోటోలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన 'మెరిటోక్రసీకి చరమగీతం' అంటూ గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు బీజింగ...