- ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
అసోం: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ పార్టీ ఎప్పటి నుంచో పాకిస్తాన్తో సంబంధాలు నెరుపుతూ, దేశ భద్రతను పణంగా పెడుతోందని ఆరోపించారు. అస్సాంలో నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ, ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి వల్ల దేశం ఇప్పటికే పలుమార్లు భారీ మూల్యం చెల్లించుకుందని ప్రధాని గుర్తుచేశారు. " ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ కాంగ్రెస్ పాక్ పాటే పాడింది. ఈ బంధం ఈనాటిది కాదు.. ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇలాంటి వైఖరి జాతీయ భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తోంది." మోడీ మండిపడ్డారు.
- అసోం ఎన్నికల్లో పాక్ జోక్యం: సీఎం హిమంత బిశ్వశర్మ
ప్రధాని వ్యాఖ్యలకు మద్దతుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మరికొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, గౌరవ్ గొగోయ్లు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లలోని సమాచారం పాక్ సోషల్ మీడియా నుంచి సేకరించినట్లు తాము గుర్తించామని పేర్కొన్నారు. అసోం ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాకిస్తాన్ ఛానళ్లు ఏకంగా 11 టాక్ షోలను నిర్వహించాయని సీఎం తెలిపారు. ప్రతి షో ముగింపులోనూ కాంగ్రెస్ పార్టీ గెలవాలని పాక్ మీడియా ఆకాంక్షించడమే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
- కోర్టుకెక్కిన సీఎం భార్య.. తప్పుడు ఆరోపణలపై కేసు
అసోం సీఎం భార్య రిణికి భూయాన్ శర్మపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఇప్పుడు న్యాయస్థానానికి చేరాయి. ఆమెకు మూడు దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, ఆస్తులను అఫిడవిట్లో దాచారని కాంగ్రెస్ ఆరోపించగా, ఆమె ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కేసు దాఖలు చేశారు. దుబాయ్ పాస్పోర్టుగా ప్రచారంలో ఉన్నది ఫేక్ అని దుబాయ్ అధికారిక వెబ్సైట్ వెల్లడించినట్లు సీఎం తెలిపారు. మిగతా దేశాల నివేదికలు కూడా మరో రెండు రోజుల్లో వస్తాయని, ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కాంగ్రెస్ నేతలు శిక్ష అనుభవించక తప్పదని హిమంత హెచ్చరించారు.