Monday, 18 May 2026

నాటి ఎండాకాలం సెలవుల జ్ఞాపకాలు




ఎనభై, తొంభై దశకం పిల్లలకు మొబైల్‌, టీవీ లాంటివి విలాస వస్తువులే. ప్రపంచీకరణ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రపంచమే ఇప్పుడు కుగ్రామంగా మారిపోయింది. మొబైల్‌, టీవీలు ఇప్పటి జనరేషన్‌ ను మాత్రమే కాదు పెద్దవాళ్లను కట్టిపడేస్తున్నాయి. మార్పు మంచిదే. కానీ బైటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి వీటితోనే కాలక్షేపం చేస్తూ బందీగా మిగిలిపోతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆదిత్యా 369 సినిమాలో టైం మిషన్‌ లెక్క నాకు ఎండకాలం సెలవుల్లో ఏం చేసేవాడినో గిర్రున గుర్తుకు వచ్చింది. అవ్వ పొద్దున్నే డ్యూటీకి వెళ్లేది. ఆదివారం తనకు కూడా సెలవు కావడంతో పొద్దుగాలనే పని అంతా చేసుకుని గేటు మూసివేసేది. పొద్దుగాల లేస్తే మొదలు ఆడటానికి  పోతే సాయంత్రం వరకు పత్తా లేకుండా అటే. ఇప్పుడంటే ఫొన్‌ కొట్టి ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తున్నావు అని ఇరిటేట్‌ చేసే పరిస్థితులు అప్పుడు లేవు. అందుకేనేమో మా వారంలో ఒక్కరోజైనా పిల్లలతో ఉండాలని గేటు బందు వెట్టేది. మా అన్న, తమ్ముడితో ఆమెకు ఇబ్బంది లేదు. వాళ్లు పెద్దగా బైటకి పోయేవాళ్లు కాదు. వాళ్లను ఆటల కోసం ఎవరూ పిలిచేవారు కాదు. కానీ నా కోసం బ్యాచ్‌ దిగేది. ఒక్క మ్యాచ్‌ ఆడి వస్తం అవ్వా పంపించు అని అడిగేవారు. ఆమె మొదట ససేమిరా అన్నా చివరికి సరే అనేది. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో మ్యాచ్‌ కోసం పోతే కార్క్‌ బాల్‌తో మ్యాచ్‌లు ఆడేవాళ్లం. దెబ్బలు తాకినా పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు. పోరగాండ్ల కదా అలిసిపోవుడు లాంటివి ఉండేవి కాదు. దూప అయితే మంచినీళ్లు తాగి మళ్లీ ఫీల్డ్‌ లోకి వచ్చేవాళ్లం. మా టీంలో పల్లె మధు గాడు బీభత్సమైన బ్యాట్స్‌మెన్‌. వాడు ఔట్‌ అయితే స్కోర్‌ బోర్డు నత్తనడకన సాగేది. అట్లా ఒక్క మ్యాచ్‌ అని పోతే నాలుగైదు మ్యాచ్‌ లు ఆడేవాళ్లం. 



క్రికెట్‌ సంగతి అట్లా ఉంటే... ఇంటికాడ ఉంటే కూడా టైం పాస్‌ అయ్యేది. పోలు వీరమల్లు మామ రేడియోలో మధ్యాహ్నం వచ్చే శ్రోతలు కోరిన పాటలు పెట్టేవాడు. బహుశా అది అరగంట ఉండేది అనుకుంటా. మంచి మంచి పాటలు వచ్చేవి. ఆయన ఒక్కసారి ట్యూన్‌ చేసి రేడియో అక్కడ పెడితే ఎవరినీ టచ్‌ చేయనిచ్చే వాడు కాదు. ఆయనకు పాటలు, పాత సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది. టీవీలో సినిమా వస్తే ఫైటింగ్‌ సమయంలో ఆయన ఎమోషన్‌ అయ్యేవాడు. సినిమాలో కనిపించే సీన్ల కంటే మామ హావభావాలే మాకు నవ్వు తెప్పించేది. ఇక ఆదివారం క్యారం బోర్డు ఆడటానికే అన్నట్టు మా ఇంటి ముందు ఉన్న వేప చెట్టు వేదిక అయ్యేది. స్టూలు మీద బోర్డు పెట్టి రాజయ్య తాత, నేను, ఆ టైంకు ఎవరు వస్తే వాళ్లు మ్యాచ్‌ లు ఆడేవాళ్లం. ప్రతి గేమ్‌ సీరియస్‌ గా సాగేది. ఒక్కసారి స్ట్రైకర్‌ వస్తే నాలుగైదు పడేసే వాడు తాత. మా కాంబో బాగా ఉండేది. తాతా మనం గెలువాలె అని ప్రోత్సహించేవాడు. మధ్యాహ్నం ఆయనకు డ్యూటీ ఉంటే లేదా నైట్‌ షిప్ట్‌ అయితే తప్ప పొద్దంతా ఆడేవాళ్లం. ఇవి కాకుండా గోలీలు బాగా ఆడేవాళ్లం. తీసుకొచ్చిన గోలీలన్నీ దాచిపెడితే మా అవ్వ ఇంటి ముందు ఉన్న బాయిలో పోసేది. ఇవి ఉంటే వీడు ఇంట్ల ఉండటం లేదని. పారేసినప్పుడు కొంచెం బాధ అనిపించేది. కానీ మళ్లీ ఆడటం, మళ్లీ జమ చేయడం నిత్యకృత్యంగా మారేది. ఆ బాయి నాలుగిండ్లకు ఆధారం. అందుకే ఎండకాలం పూటికి తీయించేవాళ్లు. అప్పుడు అందులో పడిన బోల్లతో పాటు గోలీలు ఎక్కువగా ఉండేవి. లచ్చక్క కొడుకు ఆడుతున్నాడని నువ్వు పారేసిన గోలీలు చూడు ఎన్ని ఉన్నాయో అని వీరమల్లు మామ సెటైర్లు వేసేవాడు. 



ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాయంత్రం భగత్‌సింగ్‌ స్కూల్‌లో షటిల్‌ ఆడేవాళ్లం. పాటలు పాడేవాళ్లం. మా శంకర్‌ సార్‌ , రాజనర్సు పాటలు పాడుతుంటే రాజేష్‌ సార్‌ పాటకు తగ్గట్టు కంజర కొట్టేవాడు. బండి శ్రీను, చిలుకు మల్లేశ్‌, ఎనగంటి సమ్మయ్య, పిడుగు కృష్ణ లాంటివాళ్లు స్కూల్ లో ఉన్న బార్‌ వద్ద ఎక్సర్‌సైజ్‌ చేసేవాళ్లు. పాటలు పాడటం నేర్పించిన గురువు శంకర్‌ సారే. ఆయన శిష్యరికంలో  చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చిన్నప్పటి నుంచే అలవాటైంది. రాయలసీమ కరువు మీద మల్లిక్‌ రాసిన 'రాయలేలిన నాటి రతనాల సీమ' పాట ట్యూన్‌ నే బహుశా ఆయనే రాశాడు అనుకుంటా. మహారాష్ట్రలో వచ్చిన భూకంపంపై  'ఆదమరిచి జనులు నిదురించు వేళలో' పాటకు ట్యూన్‌ కట్టాడు. అదే పాట నేను మండలస్థాయి పాటల పోటీల్లో (వాణివిద్యవిహార్‌ వాళ్లు నిర్వహించారు) పాల్గొన్నాను. మా స్కూల్‌ నుంచి సీనియర్లకు అవకాశం వచ్చింది. కానీ నేను స్వతంత్రంగా అందులో పాల్గొన్నాను. పొద్దున వెళ్తే సాయంత్రం వరకు నా పేరు పిలిచారు. బామ్మర్ది పోలు సంపత్‌ గాడు నాతోనే ఉన్నాడు. నేను పాడి స్టేజి కిందికి రాగానే అందరూ చుట్టుముట్టారు. బాగా పాడావు అని ప్రశంసించారు. కానీ నాకే మండలస్థాయి ఫస్ట్‌ ప్రైజ్‌ వస్తుందని తెలియదు. ఒకరోజు పొద్దున్నేనిర్వాహకులు మా స్కూల్‌కు ఫోన్‌ చేసి మా ప్రిన్సిపల్‌ శేషవేణికి చెప్పారు. ఆమె పిలిచి చెప్పి శభాష్‌ అంటే కొంచెం సిగ్గుపడ్డాను. స్టేజ్‌ మీద అందరి ముందు ఆ షీల్డ్‌ అందుకోవడం ఇప్పటికీ గొప్ప అనుభూతి. 



ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే.. ఎండకాలం సెలవుల్లో ఆటలు, పాటలు 80,,90 దశకం పిల్లల అనుభవంలో ఉంటుంది. నా లాగే చాలామందికి ఇలాంటి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అప్పుడు ఇప్పటిలెక్క మొబైల్‌, టీవీల లొల్లి లేదు. ఉన్నకాడనే ఇండోర్‌ గేమ్స్‌, బైటికి పోతే క్రికెట్‌ ఇలా అనేకం ఆడేవాళ్లం. ప్రపంచీకరణ తర్వాత విలాసవస్తువులన్నీ నిత్యావసర వస్తువులు అయిపోయాయి. అభివృద్ధితో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పొల్యూషన్‌ పెరిగిపోయింది. గ్లోబల్‌వార్మింగ్ పెరిగిపోయి మే నెలలో భానుడి భగభగల వార్తలు నిత్యకృత్యం అయ్యాయి. మొన్న మా ఇంటర్‌ క్లాస్‌ మేట్‌ స్వామిగాడు గోదావరిఖనిలో కొన్నిరోజుల తర్వాత ఉండలేమురా అన్నాడు. అంతలా అక్కడ పర్యావరణ విధ్వంసం జరిగిందని వాపోయాడు. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట మేము చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ ఆటలు లేవు. నాటి సంబురం లేదు. ఇప్పుడు సెలవులు అంటే సమ్మర్‌ క్లాస్‌ లు, హోం వర్క్‌ లు, లేదా మొబైల్‌, టీవీల ముందు గంటల తరబడి అతుక్కుపోవడాలు. ప్రారంభంలో చెప్పినట్టు మార్పు మంచిదే.. కానీ మనుగడే ప్రశ్నార్థకం అవడం ఆధునిక అభవృద్ధి అందించిన విషాదం కదా!

ముంచుకొస్తున్న సంక్షోభం - ఆలస్యమైన స్పందన: పొదుపు మంత్రాలు ఎవరి కోసం?




పశ్చిమాసియా లో యుద్ధం ప్రారంభమై రెండున్నర నెలలు (73 రోజులు) గడిచిన తర్వాత.. ఎట్టకేలకు భారత ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురుకాబోతున్న సవాళ్లను గుర్తించి మే 12న మేల్కొంది. పరిస్థితి తమ అదుపులోనే ఉందంటూ ఇన్నాళ్లూ కాలయాపన చేసిన పాలకులు, ఇప్పుడు ముంచుకొస్తున్న ముప్పును తట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా ఏడు రకాల పొదుపు చర్యలను ప్రకటించారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనడానికి, రోజుకో కొత్త నిబంధన తీసుకురావడం, చివరకు ఎన్నికలు ముగియగానే ఇంధన (పెట్రోలియం) ధరలను భారీగా పెంచడమే నిదర్శనం.


ప్రభుత్వం ప్రకటించిన ఈ ఏడు చర్యల ముఖ్య ఉద్దేశం.. దేశంలో పొదుపును పెంచడం, దిగుమతులను తగ్గించుకోవడం . విదేశీ ప్రయాణాలు, విదేశాలలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడం, విపరీతంగా బంగారం కొనడం వంటి వాటిని ప్రజలు పూర్తిగా మానుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రైవేట్ వాహనాలకు బదులు ఆర్టీసీ బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాను వాడాలని, వారంలో కొన్ని రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాలని సూచిస్తోంది. భారతీయ వస్తువులనే కొనాలనే నినాదం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే పాలకుల వ్యూహం. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారం నుండి దేశీయ విదేశీ మారక నిల్వలు ఏకంగా 30 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీనివల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ₹91 నుండి ₹96 కు (5% పైగా) పతనమైంది. ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలను మరింత పెంచుతోంది.


అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) సముద్ర మార్గం మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు పెద్ద బ్రేక్ పడింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలు ఏళ్ల తరబడి సాగినట్లే.. ఇరాన్ కూడా అంత తేలికగా లొంగిపోయే దేశం కాదని, ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగుతుందని ముందే ఊహించాల్సింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భారీగా బాంబుల వర్షం కురిపించినప్పటికీ, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ అమెరికా హెచ్చరికలకు లొంగకుండా నిలబడింది.


ఇంధన సమీకరణాలు - భారత భద్రతకు ముప్పు

ప్రపంచ ఇంధన అవసరాలలో 80% వాటా శిలాజ ఇంధనాలదే (చమురు, బొగ్గు, గ్యాస్). ఇందులో చమురు వాటా 30% కాగా, వినియోగంలో దీని వాటా 40% వరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 102 మిలియన్ బారెళ్ల చమురు వినియోగం జరుగుతుంటే.. అందులో 20% కేవలం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండానే రవాణా అవుతుంది. అంటే ఈ మార్గం మూతపడటంతో ప్రపంచ ఇంధన సరఫరాలో 6% ఒక్కసారిగా నిలిచిపోయింది.


భారతదేశం తన ముడి చమురు (Crude Oil) అవసరాలలో దాదాపు 90% దిగుమతుల పైనే ఆధారపడుతోంది. యుద్ధానికి ముందు, మన మొత్తం చమురు దిగుమతుల్లో 53% పశ్చిమ ఆసియా (గల్ఫ్) దేశాల నుండే వచ్చేది. అలాగే 50% ఎల్‌ఎన్‌జీ (LNG), 60% ఎల్‌పీజీ (LPG) దిగుమతి చేసుకుంటుండగా.. అందులో మెజారిటీ వాటా గల్ఫ్ దేశాలదే. ఈ లెక్కన సముద్ర మార్గం మూతపడటం వల్ల భారత్‌కు రావాల్సిన 47% ముడి చమురు, 30% ఎల్‌ఎన్‌జీ, 54% ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కొరతను స్వల్పకాలంలో ఇతర మార్గాల ద్వారా భర్తీ చేయడం అసాధ్యం.


వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2026లో చమురు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 10% తగ్గాయి. మార్చితో పోలిస్తే కొంత ఎక్కువే ఉన్నప్పటికీ, యుద్ధానికి ముందున్న స్థాయితో పోలిస్తే అది కేవలం 59% మాత్రమే. విచిత్రం ఏమిటంటే.. దేశంలో ముడి చమురు దిగుమతులు తగ్గినప్పటికీ, ప్రైవేట్ రిఫైనరీలు తయారు చేసిన పెట్రోలియం ఉత్పత్తుల 'ఎగుమతులు' మాత్రం ఏప్రిల్‌లో 35% పెరిగాయి. అంటే దేశీయ వినియోగానికి వాడాల్సిన చమురు నిల్వలు భారీగా కరిగిపోయాయి. ఎన్నికల ప్రచారం జరుగుతున్నంత కాలం ఓట్ల కోసం ధరలు పెంచకుండా పాత వినియోగాన్ని అలాగే సాగనిచ్చారు. ఫలితంగా దేశ ఇంధన భద్రత (Energy Security) ప్రమాదంలో పడింది. అందుకే ఇప్పుడు ఎన్నికలు ముగియగానే పాలకులు భయాందోళన బటన్ నొక్కుతున్నారు.


ప్రభుత్వ అంచనాల ప్రకారం పైప్‌లైన్లలో 60 రోజులకు సరిపడా స్టాక్ ఉన్నప్పటికీ, రిఫైనరీల వద్ద కేవలం ఒక వారం స్టాక్ మాత్రమే ఉంటుంది. దీనికి అదనంగా ప్రభుత్వం వద్ద 9 రోజులకు సరిపడే వ్యూహాత్మక నిల్వలు (Strategic Reserves) ఉన్నాయి. ఒకవేళ ముడి చమురు ఇన్-ఫ్లో రోజువారీ అవసరాల కంటే 33% తగ్గితే, మన వద్ద ఉన్న స్టాక్ కేవలం 48 రోజుల్లోనే పూర్తిగా అయిపోతుంది. ఆ తర్వాత దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల తయారీని 33% తగ్గించాల్సి వస్తుంది. ఇది దేశ పారిశ్రామిక రంగానికి, రవాణాకు కోలుకోలేని దెబ్బ.


మరో దారుణం ఏమిటంటే.. భారత ప్రైవేట్ రిఫైనరీలు (రిలయన్స్, నయారా వంటివి) దేశంలో చమురు కొరత ఉన్నప్పటికీ తమ స్వలాభం కోసం విదేశాలకు ఎగుమతులు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం 'ఫోర్స్ మెజ్యూర్' (Force Majeure) చట్టాన్ని ఉపయోగించి ఈ ఎగుమతులను దేశ ప్రయోజనాల కోసం నిలిపివేసి ఉండవచ్చు. కానీ కార్పొరేట్ లాభాల కోసం 75 రోజులు గడుస్తున్నా ఎగుమతులను ఆపలేదు. ఫలితంగా దేశం ఇప్పుడు తీవ్రమైన ఇంధన కొరత దశలోకి ప్రవేశిస్తోంది. మార్చి మొదటి వారంలోనే కఠిన నిర్ణయాలు తీసుకుని, ఎగుమతులు నిలిపివేసి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు.


స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సంక్షోభం - విదేశీ మారక ద్రవ్యం

ఇరాన్ దేశానికి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దొరికిన ఒక 'ట్రంప్ కార్డ్'. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, అమెరికా నుండి భవిష్యత్తు దాడులపై స్పష్టమైన హామీ లభించే వరకు ఆ మార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ భీష్మించుకుంది. గతంలో చర్చలు జరుగుతున్నప్పుడే తమపై రెండుసార్లు బాంబుల వర్షం కురిపించిన అమెరికాను ఇరాన్ నమ్మడం లేదు. అందువల్ల ఈ సముద్ర మార్గం ఇంకెంత కాలం మూసి ఉంటుందో ఎవరికీ తెలియదు.


ప్రపంచంలోని అనేక దేశాలు మార్చి మొదటి వారంలోనే రేషనింగ్, ధరల పెంపు, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి చర్యలు చేపట్టాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్ కూడా అప్పుడే అప్రమత్తం కావాల్సింది. కానీ, తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వం పార్లమెంట్‌లో అసత్యాలు చెప్పింది.


మరోవైపు విదేశీ మారక నిల్వలు వేగంగా పడిపోవడానికి ఎఫ్‌డీఐ (FDI), ఎఫ్‌ఐఐ (FII) నిధులు దేశం దాటిపోవడమే కారణం. రూపాయి విలువ పతనం అవుతుండటంతో ఎగుమతిదారులు తమ సొమ్మును దేశంలోకి తీసుకురావడానికి ఆలస్యం చేస్తున్నారు. ఈ తరుణంలో విదేశాలకు నిధులు పంపే 'లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్' (LRS) ను ప్రభుత్వం ఎందుకు నిలిపివేయలేదు? ఈ పథకం కింద భారతీయులు ఏడాదికి $250,000 వరకు విదేశాలకు పంపుకోవచ్చు. దీని ద్వారా గతేడాది ఏకంగా 25 బిలియన్ డాలర్లు దేశం దాటిపోయాయి. విదేశీ ప్రయాణాలు మానుకోండి అని సామాన్యుడికి అప్పీల్ చేయడం కంటే, ఈ ఎల్‌ఆర్ఎస్ (LRS) ను నిలిపివేసి ఉంటే దేశానికి 15 బిలియన్ డాలర్ల విదేశీ మారకం మిగిలేది. కానీ ఈ పథకాన్ని వాడేది దేశంలోని అత్యంత సంపన్న వర్గాలు కావడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది.


ఇక బంగారం దిగుమతుల విషయానికి వస్తే.. గతేడాది భారత్ ₹72 బిలియన్ డాలర్ల విలువైన 720 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. దేశంలోని 90% సామాన్య ప్రజలకు బంగారం కొనేంత పొదుపు లేదు. కేవలం టాప్ 3% ఉన్న ధనవంతులే తమ నల్లధనాన్ని దాచుకోవడానికి, రూపాయి పతనం నుండి రక్షణ పొందడానికి బంగారం బిస్కెట్లు, బార్లను కొంటున్నారు. గ్లోబల్ అన్సర్టైనిటీ ఉన్నంత కాలం వారు కొంటూనే ఉంటారు.


వివిధ వర్గాలపై ప్రభావం - పాలకుల విశ్వసనీయత

ఈ సంక్షోభం వల్ల దేశంలోని పేదలు, మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే నలిగిపోతున్నారు. వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్ అవ్వడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. ప్రభుత్వ అధికారిక ద్రవ్యోల్బణ డేటా 3.5% అని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేదవాడికి నిత్యావసరాల ధరలు 30 నుండి 40 శాతం పెరిగాయి. నిరుద్యోగం, ఆదాయాల క్షీణత, ఇంధన ధరల పెంపుతో అసంఘటిత రంగం కుప్పకూలిపోతోంది. ఆర్థిక వ్యవస్థ 'స్టాగ్‌ఫ్లేషన్' (Stagflation) దాటి ఆర్థిక మాంద్యం (Recession) లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది.


ఇలాంటి స్థితిలో అనవసర ఉత్పత్తుల తయారీని తగ్గించి, నిత్యావసరాల ఉత్పత్తిని పెంచాలి. సమాజం కోసం త్యాగాలు చేయాలని పిలుపునిచ్చే పాలకులకు మొదట 'విశ్వసనీయత' (Credibility) ఉండాలి. కానీ ప్రస్తుత పాలకులపై ప్రజల్లో ఆ నమ్మకం లేదు. నిన్నటివరకు ఎన్నికల కోసం వందల కార్ల కాన్వాయ్‌లతో, భారీ ర్యాలీలతో హంగామా చేసిన పాలకులు.. ఇప్పుడు హఠాత్తుగా పొదుపు మంత్రాలు జపిస్తుంటే జనం ఎలా నమ్ముతారు? ప్రధాని ఇప్పుడు కేవలం రెండు కార్ల కాన్వాయ్ వాడుతున్నట్లు చూపిస్తున్నారు. ఒకవేళ రెండు కార్లతోనే భద్రత కల్పించడం సాధ్యమైతే, ఇన్నాళ్లూ వందల కార్లతో ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేశారు? లేదు ఇది కేవలం టీవీ కెమెరాల కోసమే అయితే, ప్రధాని భద్రతను పణంగా పెడుతున్నట్లా? దీనికి సమాధానం లేదు.


దేశంలో విదేశీ ప్రయాణాలు, లగ్జరీ ఖర్చులు, బంగారం కొనుగోళ్లకు ప్రధాన ఇంధనం 'నల్లధనం' (Black Economy). దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని పారిశ్రామికవేత్తలు అంతర్గతంగా వాపోతున్నారు. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలపై అవినీతి ఆరోపణలు చేసే అధికార పార్టీ.. సదరు నేతలు తమ పార్టీలో చేరగానే క్లీన్ చిట్ ఇస్తోంది. వారు రాత్రికి రాత్రే నీతిమంతులుగా ఎలా మారారు? రాజకీయ నాయకులే అవినీతి సొమ్ము సంపాదిస్తున్నప్పుడు, తాము ఎందుకు త్యాగాలు చేయాలని కార్పొరేట్లు, ధనవంతులు భావిస్తున్నారు.


గతంలో కోవిడ్ పాండమిక్ సమయంలో కూడా 'అంతా కంట్రోల్‌లో ఉంది' అని చెప్పి, మహాకుంభమేళాకు అనుమతి ఇచ్చి డెల్టా వేవ్‌లో లక్షలాది మంది మరణానికి కారణమయ్యారు. వ్యాక్సిన్ల ఆర్డర్లను సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సీరమ్ ఇన్స్టిట్యూట్ కోట్లాది డోసులను విదేశాలకు ఎగుమతి చేయాల్సి వచ్చింది. చివరకు డెల్టా వేవ్ ముంచెత్తిన తర్వాతే వ్యాక్సినేషన్ వేగం పెంచారు. ప్రస్తుత ఇంధన సంక్షోభంలోనూ ప్రభుత్వం అదే తరహా బ్లండర్ చేస్తోంది.


ప్రభుత్వాలు కేవలం ఎన్నికల నుండి ఎన్నికలకు ఆలోచించడం మానేయాలి. కార్పొరేట్ వర్గాల ఫైవ్ స్టార్ సంస్కృతికి, ప్రభుత్వాల అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. నిజంగా దేశాన్ని కాపాడాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే.. తక్షణమే ప్రైవేట్ రిఫైనరీల చమురు ఎగుమతులను, సంపన్నుల ఎల్‌ఆర్ఎస్ (LRS) నిధులను నిలిపివేయాలి. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలి. అంబానీ అమెరికాలో పెట్టబోయే $300 బిలియన్లు, అదానీ ప్రకటించిన $10 బిలియన్ల పెట్టుబడులను భారతదేశంలోనే పెట్టేలా వారిని ఒప్పించాలి. సామాన్యుడిని పొదుపు చేయమనడం కాదు.. ముందుగా పాలకులు తమ విలాసాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలవాలి. అప్పుడే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని దేశం తట్టుకోగలదు.

- ప్రొఫెసర్ అరుణ్ కుమార్ (రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, జేఎన్‌యూ)


(thewire సౌజన్యంతో)


పాలకులకు పండగ.. ప్రజలకు దండగా?


  • ఆంక్షలు, పొదుపు మంత్రాలు  సామాన్యులకేనా?


"పొదుపు పాటించండి.. ఖర్చులు తగ్గించుకోండి.. బంగారం కొనకండి.." అంటూ దేశ ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన తాజా పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, ఆందోళనకు దారితీసింది. సామాజిక మాధ్యమాలలో సామాన్యులు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగానే ప్రమాదంలో ఉన్నదా? పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ మండిపోనున్నాయా? మరో ఆర్థిక కుదిపు ముంచుకొస్తోన్నదా? అనే ప్రశ్నలు ప్రజలలో ఈ అయోమయం నెలకొనడం సహజమే. ఎందుకంటే, కేవలం కొన్ని వారాల  కిందట ముగిసిన ఎన్నికల ప్రచారంలో మన రాజకీయ నాయకులు చెప్పిన మాటలు వేరు. "అంతా బాగుంది.. దేశం దూసుకుపోతోంది.. వికసిత భారత్ మార్గంలో పయనిస్తున్నాం" అంటూ అజేయమైన ఆర్థికశక్తిగా దేశాన్ని ప్రొజెక్ట్ చేశారు. మరి ఎన్నికలు ముగియగానే రాత్రికి రాత్రే ఈ పొదుపు మంత్రాలు, హెచ్చరికలు ఎందుకు మొదలయ్యాయి? పెట్రోల్‌, డీజీల్‌, సీఎన్‌జీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?



పశ్చిమాసియా సంక్షోభం గరిష్ట స్థాయికి చేరి, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ.. గత నెల ఎన్నికల ప్రచారంలో ఏ ఒక్క నాయకుడూ పొదుపు గురించి మాట్లాడలేదు. హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టడం, భారీ రోడ్‌షోలతో నగరాలను స్తంభింపజేయడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితాల వర్షం కురిపించడంలో అన్నిపార్టీలూ పోటీ పడ్డాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా సామాన్యుడిని మాత్రం 'బంగారం కొనకండి' అని శాసిస్తున్నారు. సరే, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి బంగారం దిగుమతులు తగ్గించడం మంచిదే కావచ్చు. కానీ, ప్రతి కొన్ని నెలలకూ దేశంలోని రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇళ్లలో వందల కోట్ల ఖర్చుతో, వజ్రాలు, బంగారు ఆభరణాల తళతళల మధ్య జరిగే విలాసవంతమైన వివాహ వేడుకల సంగతేంటి? స్టాక్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల కొందరు సీనియర్ రాజకీయ నాయకులే భారీగా బంగారు ఆస్తులలో పెట్టుబడులు పెట్టారు. అంటే, సామాన్యుడికి గోల్డ్ కంట్రోల్.. ఉన్నత వర్గాలకు మాత్రం అపరిమిత వైభోగమా? ఈ ద్వంద్వ నీతిని చూసే ప్రజలు అడుగుతున్నారు—"పొదుపు మంత్రం కేవలం సామాన్యులకేనా?"


ప్రధాని మోడీ  పొదుపు గురించి మాట్లాడిన రోజే జామ్‌నగర్, వడోదరలలో భారీ రోడ్‌షోలు నిర్వహించారు. అక్కడ ఇంధన పొదుపు అనే మాటే రాలేదు. అంటే, రాజకీయం ఎప్పటిలాగే విలాసవంతమైన ప్రదర్శనలతో సాగిపోవచ్చు.. కానీ త్యాగాలు మాత్రం పౌరుడే చేయాలా? ప్రధాని తన కాన్వాయ్ సైజును తగ్గించారని, కొందరు మంత్రులు దాన్ని అనుసరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వీఐపీ సంస్కృతిని తగ్గించే ఏ ప్రయత్నమైనా అభినందనీయమే. కానీ, ఇది నిజమైన సంస్కరణా లేక కేవలం టీవీ కెమెరాల కోసం,  ప్రజల దృష్టి కోసం చేస్తున్న తాత్కాలిక ప్రదర్శనలా? ఎందుకంటే పాత అలవాట్లు అంత త్వరగా పోవు. ఇదే వారంలో బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఏకంగా 22 కార్ల కాన్వాయ్‌తో ప్రయాణించడం కనిపించింది. మధ్యప్రదేశ్‌లో ఒక బీజేపీ నాయకుడు తనకు టెక్స్ట్‌బుక్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పదవి వస్తే.. ప్రజా సేవకుడిగా భావించాల్సింది పోయి, ఏదో రాజుగారి పట్టాభిషేకం తరహాలో భోపాల్ నుండి ఇండోర్ వరకు భారీ వాహన శ్రేణితో హల్చల్ చేశారు.


మరోవైపు, దేశ అగ్రశ్రేణి అథ్లెట్ల క్రీడా సౌకర్యాల కోసం కేటాయించిన నిధులను, ఉన్నతాధికారులు తమ విలాసవంతమైన నివాస కాలనీల కోసం మళ్లించారనే పచ్చి నిజం రీసెంట్‌గా వెలుగులోకి వచ్చింది. క్రీడాకారులకు వనరులు లేవంటారు, ప్రజలను త్యాగాలు చేయమంటారు.. కానీ వ్యవస్థ లోపల ఉన్న అధికార వర్గాల విలాసాలకు మాత్రం ఎలాంటి కొరతా ఉండదు. పార్లమెంట్‌లో ఉంచిన గణాంకాల ప్రకారం.. 2015 నుండి 2025 మధ్య ప్రధాని విదేశీ పర్యటనలకే ప్రభుత్వ ఖజానా నుండి రూ. 760 కోట్లు ఖర్చయ్యాయి. దౌత్యం కోసం ప్రధాని ప్రయాణించాల్సిందే, అందులో తప్పులేదు. కానీ సమస్య ఒక్క ప్రధానితోనే ముగిసిపోదు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, సీనియర్ బ్యూరోక్రాట్లు నిరంతరం బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, లగ్జరీ హోటళ్లు, అధికారిక పర్యటనల పేరిట విహారయాత్రలు చేస్తూ సామాన్యుడు కలగనలేని జీవితాన్ని ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు.


దశాబ్ద కాలంగా సామాన్యుడు ఒక విధేయ సమాజంలా ప్రభుత్వం చెప్పిన ప్రతిదానికీ త్యాగం చేస్తూనే ఉన్నాడు. నోట్ల రద్దు  సమయంలో నల్లధనం అంతమైపోతుందని గంటల తరబడి ఏటీఎంల క్యూలలో నిలబడ్డాడు. కానీ పదేళ్ల తర్వాత చూస్తే, మార్కెట్లో మునుపటికంటే ఎక్కువ నగదు చలామణిలో ఉంది. నష్టపోయింది మాత్రం చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు. ఆ తర్వాత 2020లో కొన్ని గంటల ముందస్తు నోటీసుతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. లక్షలాది మంది చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి, వలస కూలీల జీవితాలు రోడ్డున పడ్డాయి. కానీ మహమ్మారి తర్వాత కార్పొరేట్ దిగ్గజాల లాభాలు, బిలియనీర్ల సంపద మాత్రం రాకెట్ వేగంతో పెరిగాయి. ఈ పరిణామాలన్నీ చూశాక సామాన్యుడికి ఒకటే అనిపిస్తోంది—వ్యవస్థ కేవలం ఒకే ఒక సూత్రంపై నడుస్తోంది: "లాభాలను ప్రైవేటీకరించు.. నష్టాలను సామాజికీకరించు" .


ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చాలీ ధరలు పెరుగుతున్నాయని మళ్లీ మనల్ని బెల్టులు బిగించుకోమంటున్నారు. మరి గతంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమైనప్పుడు ఆ లాభాన్ని భారతీయ వినియోగదారుడికి ఎందుకు బదిలీ చేయలేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీలు, పన్నులు పెంచి లక్షల కోట్లు వసూలు చేశాయి తప్ప రిటైల్ ధరలు తగ్గించలేదు. అంటే, అంతర్జాతీయంగా ధరలు తగ్గితే లాభం ప్రభుత్వాలది.. ధరలు పెరిగితే భారం సామాన్యుడిది! ఇక్కడే ప్రభుత్వాలు ప్రజలకు నీతులు చెప్పే నైతిక హక్కును కోల్పోతున్నాయి. ఎన్నికల కోసం ప్రభుత్వ ఖజానాను ఉచితాలు, రుణమాఫీలు, సబ్సిడీల రూపంలో ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తూ, ఓట్ల కోసం బిడ్డింగ్ వార్ నడుపుతారు. ప్రచారం ముగియగానే పాలకులకు పొదుపు మంత్రం గుర్తొస్తుంది. దీనినే హిందీలో ఒక సామెతగా చెప్తారు: "నేతా మస్త్.. జనతా త్రస్త్" (పాలకులు ఉల్లాసంగా.. ప్రజలు విచారంగా!).


ప్రజా జీవితంలో ప్రతీకలు ముఖ్యం. ప్రధాని గనుక వీఐపీ సంస్కృతిని తగ్గించి నిజాయితీగా పొదుపును పాటించాలనుకుంటే అది మంచి సంకేతమే. కానీ నిజమైన పరీక్ష ఎక్కడంటే.. ఇది కేవలం వార్తల్లో హెడ్‌లైన్స్ కోసం చేసే ప్రదర్శనగా మిగిలిపోతుందా లేక ప్రభుత్వాల సంస్థాగత ప్రవర్తనగా మారుతుందా? మంత్రులు తమ ప్రత్యేక అధికారాలను వదులుకుంటారా? బ్యూరోక్రాట్లు లగ్జరీ ప్రయాణాలు తగ్గిస్తారా? ప్రభుత్వాల పబ్లిసిటీ ఖర్చులు తగ్గుతాయా?


భారతదేశ ప్రజలు దేశం కోసం త్యాగాలు చేయడానికి ఎన్నడూ వెనకాడలేదు. 1960ల నాటి ఆహార సంక్షోభంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలను వారానికి ఒక పూట ఉపవాసం ఉండమని కోరినప్పుడు దేశమంతా ఆయన మాట విన్నది. ఎందుకంటే, శాస్త్రి గారి వ్యక్తిగత జీవితం అంత నిరాడంబరంగా ఉండేది. ఆయనకు ఆ 'విశ్వసనీయత' (Credibility) ఉంది. ఆ నమ్మకం కేవలం స్లోగన్ల ద్వారా రాదు, మీ వ్యక్తిగత ప్రవర్తన ద్వారా వస్తుంది. "మినిమం గవర్నమెంట్.. మాగ్జిమం గవర్నెన్స్" వంటి ఆకర్షణీయమైన వన్‌లైనర్లు టీవీ స్క్రీన్లకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రభుత్వాలు పొదుపును బోధిస్తే, ముందుగా దాన్ని తాము ఆచరించి చూపాలి. ప్రజాస్వామ్యంలో శక్తిమంతులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, సామాన్యులను మాత్రం పొదుపుగా బతకమనడం సమంజసం కాదు. పొదుపు అనేది కేవలం పాలించబడే వారి కోసమే కాదు.. మనల్ని పాలించే వారి నుండి అది మొదలుకావాలి.


ప్రాంతీయ విజయాలు సరే.. ఢిల్లీ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకోగలదా?


  • రాష్ట్రాల్లో పుంజుకుంటున్నా దేశవ్యాప్తంగా మోదీ సర్కార్‌ను ఢీకొట్టే సత్తా హస్తం పార్టీకి ఉందా?


భారతదేశ రాజకీయ క్షేత్రంలో దేశంలోనే అత్యంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు , దాని జాతీయ పునరుజ్జీవనంపై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్న విజయాలు ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రాంతీయంగా బలాన్ని పుంజుకుంటూ, బలమైన స్థానిక వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో హస్తం పార్టీ మళ్లీ తన పాత వైభవాన్ని చాటుకుంటోంది. అయితే, ఈ ప్రాంతీయ విజయాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బలమైన బీజేపీ (NDA) కూటమిని గద్దె దించడానికి ఏ మేరకు సరిపోతాయనే అంశంపై 'టైమ్స్ ఆఫ్ ఇండియా'  ఒక లోతైన,సమగ్రమైన విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది.



రాష్ట్రాల ఎన్నికలకు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మధ్య ఓటర్ల ఆలోచనా విధానంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంటోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. స్థానిక సమస్యలు, ప్రాంతీయ నాయకత్వం, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాల స్థాయిలో కలిసివస్తున్నప్పటికీ, జాతీయ స్థాయికి వచ్చేసరికి ఓటరు ప్రత్యామ్నాయ ప్రధాని అభ్యర్థి ఎవరనే కోణంలో ఆలోచిస్తున్నాడు. బీజేపీకి ఉన్న పటిష్టమైన యంత్రాంగం, సామాజిక సమీకరణాలు, జాతీయవాదం , ప్రధాని మోదీ ప్రజాకర్షణను జాతీయ స్థాయిలో ఢీకొట్టడంలో కాంగ్రెస్ ఇంకా కొన్ని వ్యూహాత్మక లోపాలను ఎదుర్కొంటోంది. కేవలం రాష్ట్రాలలో గెలవడం మాత్రమే కాకుండా, హిందీ హృదయభూమి (నార్త్ ఇండియా) లోని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సీట్లను భారీగా తగ్గించగలిగితేనే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరోవైపు, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ 'ఇండియా' (INDIA) కూటమిని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. సీట్ల సర్దుబాటు, అంతర్గత విభేదాలు , నాయకత్వ సవాళ్లు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మిగిలిపోకుండా, దేశవ్యాప్త ప్రత్యామ్నాయ శక్తంగా మారాలంటే తన అంతర్గత సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ , పట్టణ ఓటర్లను ఆకట్టుకునేలా స్పష్టమైన జాతీయ రోడ్‌మ్యాప్‌ను, ఆర్థిక విధానాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రాలలో గెలిచే సత్తా ఉందని నిరూపించుకున్న కాంగ్రెస్.. రాబోయే రోజుల్లో దేశాన్ని గెలవాలనే తన అంతిమ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుందనేదే ఇప్పుడు భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా నిలిచింది.

మోదీ ప్రభుత్వం చుట్టూ ముదురుతున్న సంక్షోభం


  • ఎన్నికల ఎదురుదెబ్బలు, దౌత్య వైఫల్యాలు, ఆర్థిక కష్టాలపై సంజయ్ కె. ఝా  విశ్లేషణ
  • ఇదే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రధాని ఉంటే బీజేపీ ఊరుకునేదా?


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, దౌత్య పరిస్థితులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సంజయ్ కె. ఝా అత్యంత ఘాటైన విమర్శలు గుప్పించారు. ఒకవేళ ఇదే స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి ఉండి.. ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాల కంటే కిందకు పడిపోయి, అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటూ, అంతర్జాతీయ విదేశాంగ విధానాన్ని దెబ్బతీసి, ఓట్ల దొంగతనం (ఓట్-చోరి) ఆరోపణల్లో చిక్కుకుని ఉంటే.. అలాగే దేశంలోని మెజారిటీ ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అల్లాడుతుంటే.. బీజేపీ సృష్టించే హంగామా , వారి దూకుడు ఏ స్థాయిలో ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాలని ఆయన ప్రశ్నించారు.



ఇన్నాళ్లూ ప్రధాని మోదీ సృష్టించిన మాటల గారడీ, ప్రసంగాల హోరు దేశ ప్రజలను ఒక్కసారిగా భ్రమల లోకం నుండి తీవ్ర నిరాశ నిస్పృహల గురంలోకి నెట్టేసిందని సంజయ్ కె. ఝా విమర్శించారు. 'విశ్వగురు' ఫాంటసీలు, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనే గొప్పలు, అంతర్జాతీయంగా 'భారతదేశ డంకా మోగుతోంది' (డంకా-బజ్-రహా-హై) అంటూ కల్పించిన భ్రమల సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. నిన్నటివరకు ధగధగలాడే దుస్తుల్లో కనిపించిన ఒక అందమైన కల.. ఇప్పుడు ఒక్కసారిగా చిరిగిపోయిన అతుకుల ముక్కల భయంకర కలగా మారిపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో చమురు నిల్వలను ఆదా చేసేందుకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని, బంగారం కొనడం ఆపేయాలని స్వయంగా ప్రధానమంత్రే పౌరులను కోరడం దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని, ఆర్థిక నిపుణులు సైతం దేశం దీర్ఘకాలిక సంక్షోభం, ద్రవ్యోల్బణం (Stagflation) వైపు వెళ్తోందని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఫిబ్రవరి 28 నుండే ప్రారంభమైనప్పటికీ.. రాత్రికి రాత్రే దేశంలో ఈ పరిస్థితులు ఎలా మారాయని ఆయన ప్రశ్నించారు.


ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఎప్పుడూ ఇలాంటి ముంచుకొస్తున్న సంక్షోభం గురించి కనీస సంకేతాలు కూడా ఇవ్వలేదని, దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్తూ భారీ ఎత్తున నిధులు గుమ్మరిస్తూ రోడ్‌షోలు, గ్రాండ్ ర్యాలీలు నిర్వహించారని సంజయ్ కె. ఝా ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) ను రహస్యంగా ముందుకు నెట్టేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను పిలిచారని, జాతిని ఉద్దేశించి ప్రసంగించే అత్యున్నత వేదికను సైతం తన రాజకీయ ప్రత్యర్థులను "మహిళా వ్యతిరేకులు" అని నిందించడానికే వాడుకున్నారని మండిపడ్డారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం అల్లాడుతున్న చేదు నిజాన్ని కూడా కేవలం భయాందోళనలు సృష్టించే ప్రయత్నంగానే కొట్టిపారేశారని విమర్శించారు. తన పార్టీకి ఎన్నికలలో నష్టం జరగకుండా చూసుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ బహుముఖ సంక్షోభాలను దేశం దాచిపెట్టారా అని ప్రశ్నించిన ఆయన.. దేశాన్ని ముంచెత్తుతున్న సవాళ్లపై జాతీయ స్పందనను ఆలస్యం చేయడం అసలైన 'దేశద్రోహ చర్య' (Anti-national act) కిందకు రాదా అంటూ నిలదీశారు.

నీట్ పేపర్ లీక్ వివాదంపై విశాల్ దద్లానీ తీవ్ర ఆగ్రహం


  •  'చదువు రాని వాళ్లకు అధికారం ఇవ్వకండి' అంటూ సంచలన వ్యాఖ్యలు
  • పాక్ జర్నలిస్ట్‌తో భేటీపై ట్రోలింగ్.. ఇండియన్ ఐడల్ నుండి తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్!



దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న నీట్ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ విశాల్ దద్లానీ అత్యంత ఘాటుగా స్పందించారు. నష్టపోయిన విద్యార్థులకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆయన.. దేశంలో పదే పదే జరుగుతున్న పరీక్షల అక్రమాలపై విద్యా వ్యవస్థను తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో విశాల్ దద్లానీ మాట్లాడుతూ.. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా అధికారులలో జవాబుదారీతనం లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ దేశంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యం ఎంతలా దిగజారిపోతుందో అనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రతి సంవత్సరం ఇలాంటి పరీక్షల అక్రమాలు జరుగుతున్నా ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదని మండిపడిన విశాల్.. భవిష్యత్తులో ఓటు వేసేటప్పుడు "చదువుకున్న, మెరుగైన నాయకులను" ఎన్నుకోవాలని దేశ పౌరులను కోరారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడిన "చదువు రాని అనాగరికులను (జాహిల్ గవారో కో) అధికారంలో కూర్చోబెట్టకండి" అనే వివాదాస్పద వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో పెను తుఫాను సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల పక్షాన నిలిచినందుకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఆయన విద్యా సమస్యను రాజకీయీకరణ చేస్తున్నారని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.


ఈ నీట్ వివాదం ఇలా నడుస్తుండగానే.. లండన్‌ లో పాకిస్థానీ జర్నలిస్ట్ సఫీనా ఖాన్‌ తో విశాల్ దద్లానీ ముచ్చటించిన మరో పాత వీడియో క్లిప్ హఠాత్తుగా తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్-పాక్ మధ్య ఉన్న సున్నితమైన సంబంధాల నేపథ్యంలో ఈ భేటీని తప్పుపడుతున్న కొందరు నెటిజన్లు.. ప్రముఖ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' న్యాయనిర్ణేత (జడ్జ్) స్థానం నుంచి విశాల్ దద్లానీని తక్షణమే తొలగించాలంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై షో నిర్వాహకులు గానీ, సోనీ టీవీ యాజమాన్యం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అటు తనపై వస్తున్న విమర్శలపై విశాల్ దద్లానీ కూడా ఇంకా బహిరంగంగా స్పందించలేదు. ఒకవైపు నీట్ లీక్ సంక్షోభం, మరోవైపు పాక్ జర్నలిస్ట్‌ తో భేటీ.. ఈ రెండు వివాదాలు ఒకేసారి చుట్టుముట్టడంతో విశాల్ దద్లానీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛాయుత మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసిన మోదీ


  • నార్వే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండానే నడుచుకుంటూ వెళ్లిన ప్రధాని
  • అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వైనం!


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  దేశీయ, అంతర్జాతీయ మీడియాకు మధ్య ఉన్న సంబంధాలు, ప్రెస్ పట్ల ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మరోసారి అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. ఐరోపా పర్యటనలో భాగంగా సోమవారం నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించిన ప్రధాని మోదీ.. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ఒక నార్వేజియన్ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించిన కొద్దిసేపటికే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.



ఓస్లోలో ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ కలిసి తమ ఉమ్మడి పత్రికా ప్రకటనలను ముగించిన వెంటనే.. అక్కడే ఉన్న 'దగ్సావిసెన్' (Dagsavisen) పత్రికకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత హెల్లే లింగ్ స్వెండ్సెన్ గట్టిగా ఒక ప్రశ్నను లేవనెత్తారు. "ప్రధానమంత్రి మోదీ గారూ.. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన ప్రెస్ (మీడియా) అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానాలు ఇవ్వడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు. అయితే, ప్రధాని మోదీ ఆ ప్రశ్నకు స్పందించకుండా నార్వే ప్రధాని స్టోర్‌తో కలిసి ముందుకు నడిచి వెళ్లిపోయారు. అనంతరం నార్వే ప్రధాని స్టోర్ మాత్రం తిరిగి వెనక్కి వచ్చి జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ప్రముఖ భారతీయ పత్రిక ప్రతినిధి సుహాసిని హైదర్‌ వెల్లడించారు.


ఈ పరిణామంపై స్పందించిన నార్వే జర్నలిస్ట్ స్వెండ్సెన్.. తన ప్రశ్నకు మోదీ సమాధానం ఇస్తారని తాను ముందే ఆశించలేదని సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (X) లో రాసుకొచ్చారు. "మనం ఏ దేశ అధికార శక్తులతోనైతే ద్వైపాక్షిక సహకారం అందిస్తున్నామో, వారిని ప్రశ్నించడం ఒక జర్నలిస్టుగా మా ప్రాథమిక బాధ్యత" అని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయంగా 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' విడుదల చేసిన గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ (పత్రికా స్వేచ్ఛా సూచీ) లో నార్వే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవగా.. మొత్తం 180 దేశాల జాబితాలో భారతదేశం 157వ స్థానంలో ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. దశాబ్ద కాల ప్రధాని పదవిలో మోదీ కేవలం రెండు సార్లు మాత్రమే (అది కూడా విదేశీ పర్యటనల్లో) ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో జర్నలిస్టుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిచ్చారని, ఈ నేపథ్యంలో తాజా పరిణామం అంతర్జాతీయ మీడియా స్వేచ్ఛా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Featured post

నాటి ఎండాకాలం సెలవుల జ్ఞాపకాలు

ఎనభై, తొంభై దశకం పిల్లలకు మొబైల్‌, టీవీ లాంటివి విలాస వస్తువులే. ప్రపంచీకరణ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రపంచమే ఇప్పుడు కుగ్రామంగా మా...