Saturday, 21 February 2026

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

  • ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే

డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని చక్కదిద్దడం ఇప్పుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి పెను సవాల్‌గా మారింది. కొంతకాలంగా పార్టీలోని కీలక నేతలు బీజేపీ వైపు మళ్లుతుండటం, అంతర్గత విభేదాలు పొడసూపడం కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసింది. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వలసలను అరికట్టడంతో పాటు, బలమైన కూటమిని ఏర్పాటు చేయడం ప్రియాంక గాంధీ ముందున్న తక్షణ కర్తవ్యం. అస్సాం ఎన్నికల వ్యూహకర్తగా ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఉత్తేజితం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.



మరోవైపు, అధికార బీజేపీ తన పట్టును మరింత బిగించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. స్థానిక పార్టీలతో పొత్తులను ఖరారు చేసుకోవడంతో పాటు, కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను తనవైపు తిప్పుకోవడంలో కమలం పార్టీ విజయం సాధిస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్న తరహా ప్రాంతీయ పార్టీలతో సమన్వయం కుదుర్చుకోవడం, సీట్ల పంపిణీలో ఎటువంటి అసమ్మతి తలెత్తకుండా చూడటం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా 'సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్' (CAA) వంటి సున్నితమైన అంశాలను ఎన్నికల ప్రచారంలో ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. అస్సాం ప్రజల అస్తిత్వాన్ని కాపాడటం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ఆమె యోచిస్తున్నారు. ఈ ఎన్నికలు అటు బీజేపీకి ప్రతిష్టాత్మకం కాగా, ఇటు కాంగ్రెస్ ఉనికికి , ప్రియాంక గాంధీ నాయకత్వ సామర్థ్యానికి పరీక్షగా నిలవనున్నాయి.


భారత్-బ్రెజిల్ సరికొత్త శకం


  • ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం.. 
  • 10 కీలక ఒప్పందాలతో బలపడిన ద్వైపాక్షిక బంధం

న్యూఢిల్లీ: దక్షిణ అమెరికా ఖండంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన బ్రెజిల్‌తో సంబంధాలను మరో ఉన్నతస్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా మధ్య చర్చలు విజయవంతమయ్యాయి. శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు పది కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.66 లక్షల కోట్లు) పైగా పెంచాలని ఇరువురు నేతలు సంకల్పించారు. ఈ వాణిజ్య వృద్ధి కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని, రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర నమ్మకానికి ఇది ప్రతిబింబమని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



ఈ భేటీలో ప్రధానంగా రక్షణ, ఇంధనం, వ్యవసాయం, సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, కృత్రిమ మేధస్సు (AI) వంటి రంగాల్లో సహకారంపై లోతైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా బ్రెజిల్‌లో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' ఏర్పాటుకు భారత్ సహకరిస్తుండటం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం రెండు దేశాలకే కాకుండా మొత్తం 'గ్లోబల్ సౌత్' దేశాలకు సాంకేతిక ప్రయోజనాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో కుదిరిన ఒప్పందం వల్ల సరఫరా గొలుసు వ్యవస్థ మరింత పటిష్టం కానుందని, రక్షణ రంగంలో పెరుగుతున్న సహకారం ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సమన్వయానికి నిదర్శనమని మోడీ వివరించారు.


అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్, బ్రెజిల్ దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని, ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థలను పునర్వ్యవస్థీకరించడం అనివార్యమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, దానికి మద్దతు ఇచ్చే శక్తులు మానవాళికి శత్రువులని, వీటిని ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. భారత్, బ్రెజిల్ కలిసి పనిచేసినప్పుడు గ్లోబల్ సౌత్ దేశాల గొంతుక ప్రపంచవ్యాప్తంగా మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో వినిపిస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో బ్రెజిల్ అధ్యక్షుడికి ఘనస్వాగతం లభించింది. ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. 2006 నుంచి కొనసాగుతున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు, బలమైన ప్రజా సంబంధాలతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంది.. వేధింపులు లేవు

  •  అనంతగిరి శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

వికారాబాద్ (అనంతగిరి): కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యానికి మారుపేరని, ఇక్కడ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీ (DCC) అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పవచ్చని, అలా చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి కాంగ్రెస్‌లో లేదని స్పష్టం చేశారు. అయితే, నాయకులు తమలో తాము కొట్లాడుకుంటే పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే లక్షలాదిమంది కార్యకర్తలకు అన్యాయం చేసినట్లవుతుందని ఆయన హెచ్చరించారు.



నెహ్రూ-గాంధీ కుటుంబాల త్యాగాలను స్మరించుకుంటూ, మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు దేశం కోసం చేసిన పోరాటాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారని, అదే స్ఫూర్తితో తాము కూడా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కొంతమంది నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ అందరినీ కలుపుకునిపోయి మెరుగైన ఫలితాలు సాధించామని గుర్తుచేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని, ఎమ్మెల్యే టికెట్లు రాని వారికి ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ ఛైర్మన్లుగా అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.


నాయకుల ఎంపికలో ఎటువంటి 'సిఫార్సుల జాబితాలకు' చోటులేదని, కేవలం 'మెరిట్' ఆధారంగానే పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవి అనేది ఎంతో బాధ్యతాయుతమైనదని, దీనిని సమర్థవంతంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో పీసీసీ అధ్యక్షులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చివరకు ముఖ్యమంత్రులుగా కూడా ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన ఉద్బోధించారు. ఎన్నికలకు సమగ్రంగా సన్నద్ధమవ్వడమే కాకుండా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారితో నిరంతరం అనుసంధానమై ఉండాలని డీసీసీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

అమెరికా కోర్టు షాక్.. భారత్ ఒప్పందాన్ని ఆపాల్సిందే

  •  కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన జైరాం రమేష్ 

న్యూఢిల్లీ: అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాన్ని కొట్టివేసిన నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని (Interim Trade Deal) తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఈ తరుణంలో పాత నిబంధనలతో ముందుకెళ్లడం దేశ ప్రయోజనాలకు, ముఖ్యంగా భారతీయ రైతులకు గొడ్డలిపెట్టు అని విమర్శించారు. ఫిబ్రవరి 2న హడావిడిగా ఈ ఒప్పందాన్ని ప్రకటించడంలో ప్రధాని మోడీ ప్రదర్శించిన తొందరపాటు వెనుక అసలు రహస్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.



  • ఈ వివాదంలోని ప్రధానాంశాలు


ఒప్పందంపై పునరాలోచన: అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వల్ల గతంలో ఉన్న 50 శాతం సుంకాలు చెల్లవని తేలిపోయింది. అయినప్పటికీ, భారత్ తన వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడానికి అంగీకరించడం దేశ సార్వభౌమత్వానికి నష్టమని జైరాం రమేష్ ఆరోపించారు. ఒప్పందంలోని క్లాజులను ఉపయోగించి తక్షణమే పునః చర్చలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.


డైవర్షన్ పాలిటిక్స్?: ఫిబ్రవరి 2 మధ్యాహ్నం లోక్‌సభలో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే, అదే రోజు రాత్రి ప్రధాని మోడీ అత్యవసరంగా ట్రంప్‌తో ఈ ఒప్పందాన్ని ప్రకటించారని జైరాం రమేష్ ధ్వజమెత్తారు. మరో 18 రోజులు వేచి ఉంటే కోర్టు తీర్పు వచ్చేదని, అప్పుడు భారత్ మరింత బలమైన స్థితిలో చర్చలు జరిపే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.


రైతుల ప్రయోజనాలు: ఈ ఒప్పందం వల్ల అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తుతాయని, ఇది మన రైతుల వెన్ను విరిచే చర్య అని ఆయన మండిపడ్డారు. "ప్రధాని మోడీ కేవలం తన ఇమేజ్ కోసం దేశ ప్రయోజనాలను సరెండర్ చేశారు" అని ఆయన ఘాటుగా విమర్శించారు.


ఈ పరిణామంపై కేంద్ర వాణిజ్య శాఖ స్పందిస్తూ.. అమెరికా కోర్టు తీర్పును, దానివల్ల కలిగే పర్యవసానాలను తాము నిశితంగా అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది. విపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో ఈ వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పుపై భారత్ నిశిత పరిశీలన

 


  • ట్రంప్ టారిఫ్‌ల రద్దుతో భారత ఎగుమతులకు సరికొత్త ఆశలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలను (Global Tariffs) యూఎస్ సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును భారతదేశం సానుకూల దృక్పథంతో నిశితంగా గమనిస్తున్నది. ఈ చట్టపరమైన పరిణామాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఎగుమతుల రంగంపై పడే ప్రభావాలను ప్రభుత్వం లోతుగా విశ్లేషిస్తున్నది. ట్రంప్ ప్రభుత్వం విదేశీ వస్తువులపై భారీగా పన్నులు విధించడం వల్ల భారతీయ ఐటీ సేవలు, ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్ ఎగుమతులపై తీవ్ర భారం పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ సుంకాలను చెల్లవని తీర్పు ఇవ్వడంతో, భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి.



ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. అమెరికాలో చోటుచేసుకుంటున్న చట్టపరమైన, విధానపరమైన మార్పులను తాము నిరంతరం గమనిస్తున్నామని, భారత్-అమెరికా మధ్య ఉన్న వాణిజ్య బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్యానికి మార్గం సుగమం అవుతుందని, ఇది భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు గొప్ప ఊరట అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు వైట్ హౌస్ ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నప్పటికీ, న్యాయస్థానం నిర్ణయం వల్ల భారతీయ కంపెనీల మార్జిన్లు పెరిగే అవకాశం ఉండటంతో స్టాక్ మార్కెట్‌లో ఐటీ, మెటల్ కంపెనీల షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఈ తీర్పు అనంతరం అమెరికాతో కుదరబోయే కొత్త వాణిజ్య ఒప్పందాల్లో భారత్ తన ప్రయోజనాలను మరింత సమర్థవంతంగా కాపాడుకునే అవకాశం లభించిందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


భారత్-బ్రెజిల్ బంధం గ్లోబల్ సౌత్ గొంతుక


  • బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ
  • ప్రపంచ సవాళ్లపై ఉమ్మడి పోరు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాన్న చాటిచెప్పడంలో భారత్, బ్రెజిల్ దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, బ్రెజిల్ దేశాలు కలిసి పనిచేసినప్పుడు 'గ్లోబల్ సౌత్' (అభివృద్ధి చెందుతున్న దేశాల) స్వరం ప్రపంచవ్యాప్తంగా మరింత బలంగా వినిపిస్తుందని, ఇది అంతర్జాతీయ నిర్ణయాధికారంలో సమతుల్యతను తీసుకువస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఇంధనం, రక్షణ రంగం, వ్యవసాయం, వాతావరణ మార్పుల వంటి ప్రధానాంశాలపై లోతుగా చర్చించారు.



ఈ సమావేశం ప్రధానంగా జి20 (G20), బ్రిక్స్ (BRICS) కూటముల్లో ఇరుదేశాల మధ్య ఉన్న సహకారాన్ని మరింత పటిష్టం చేసే దిశగా సాగింది. ముఖ్యంగా బ్రెజిల్ అధ్యక్షతన జరగనున్న జి20 సదస్సులో భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంపై ఇరువురు నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పుల కోసం ఇరు దేశాలు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఈ భేటీ అనంతరం ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. బ్రెజిల్ అధ్యక్షుడితో జరిగిన చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయని, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Thursday, 19 February 2026

మా బిడ్డ ప్రధాని అవుతుంది


  • ప్రియాంకా గాంధీకి అఘోరీ బాబా  దీవెన

గౌహతి: అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రాకు  ఆసక్తికర అనుభవం ఎదురైంది. గురువారం ఉదయం గౌహతి చేరుకున్న ఆమె, నేరుగా ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక అఘోరీ బాబా (నాగ సాధువు) ఆమెను ఆశీర్వదిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



ఆలయ దర్శనం అనంతరం ప్రియాంక బయటకు వస్తుండగా, అక్కడ ఉన్న ఒక సాధువు ఆమె తలపై చేయి ఉంచి దీవిస్తూ.. "హమారా బేటీ ప్రధాన్ మంత్రి బనేగా" (మా బిడ్డ దేశ ప్రధానమంత్రి అవుతుంది) అని గట్టిగా అరిచారు. ఈ అనూహ్య దీవెన విన్న ప్రియాంక ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, చిరునవ్వు చిందిస్తూ అక్కడి నుంచి ముందుకు సాగారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు ఈ దృశ్యాన్ని చూసి కేరింతలు కొట్టారు.


  • ఎన్నికల వ్యూహరచనలో బిజీ

ఈ ఆధ్యాత్మిక పర్యటన ముగిసిన వెంటనే ప్రియాంక గౌహతిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 'రాజీవ్ భవన్'కు చేరుకున్నారు. అసోం స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలు, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ  ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రియాంక పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది.

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...