Saturday, 23 May 2026

ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు కుట్ర

 

  •  నిఘా వర్గాల చేతికి ఫ్లోరిడా నివాస నమూనా
  • అమెరికాలో ఐఆర్‌జీసీ ఉగ్రవాది అరెస్ట్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తో సంబంధాలున్న ఒక ఉగ్రవాది పన్నిన భయంకరమైన హత్య కుట్రను అమెరికా నిఘా వర్గాలు భగ్గుం చేశాయి. గత 2020లో డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమాని మరణించిన సంగతి తెలిసిందే. ఆ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు ఈ కుట్ర పన్నినట్లు అమెరికన్ దర్యాప్తు సంస్థల నివేదికలు వెల్లడించాయి. దీనికి ఒడిగట్టిన మొహమ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్-సాది అనే 32 ఏళ్ల ఇరాకీ జాతీయుడిని మే 15న టర్కీలో అరెస్ట్ చేసి, అమెరికాకు అప్పగించారు.



అల్-సాది కేవలం ప్రతీకార నినాదాలకే పరిమితం కాకుండా, అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఫ్లోరిడాలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్‌లకు ఉన్న 24 మిలియన్ డాలర్ల విలాసవంతమైన నివాసానికి సంబంధించిన బ్లూప్రింట్ (భవన నమూనా మ్యాప్) నిందితుడి వద్ద లభ్యమవడం అమెరికా భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాకుండా, సామాజిక మాధ్యమాల్లో సదరు నివాస ప్రాంతం మ్యాప్‌ను పోస్ట్ చేస్తూ.. అమెరికన్ల ప్యాలెస్‌లు గానీ, అక్కడి సీక్రెట్ సర్వీస్ భద్రత గానీ వారిని రక్షించలేవని, ప్రతీకారం తీర్చుకోవడం కేవలం కాలానికి సంబంధించిన విషయమేనంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాడు.  అమెరికా రక్షణ శాఖ నివేదికల ప్రకారం.. ఈ అల్-సాది కేవలం ఇవాంకా హత్యకే పరిమితం కాలేదు. ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ 'హెజ్‌బొల్లా'లో కీలక సభ్యుడైన ఇతడు..  కొన్నినెలలుగా యూరప్ , నార్త్ అమెరికా అంతటా అమెరికన్, యూదు లక్ష్యాలపై జరిగిన దాదాపు 18 ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు, కాల్పుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. నకిలీ సర్వీస్ పాస్‌పోర్టులు, ట్రావెల్ ఏజెన్సీల ముసుగులో తిరుగుతూ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడిపిన ఇతడిని ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఒంటరి జైలు గదిలో ఉంచి విచారిస్తున్నారు. 

పది రోజుల్లోనే మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


సీఎన్‌జీ ధర కూడా రూపాయి పెంపు

ఇంధన ధరల పెరుగుదలపై మండిపడుతున్న ప్రజలు


అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర అస్థిరతల ప్రభావం దేశీయంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌ పై 87 పైసలు, డిజిల్‌పై 91 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత పది రోజుల్లోనే ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం.



తాజాగా పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రకారం ఢిల్లీలో 99.51 (+0.87), కోల్‌కతాలో 110.64 (+0.94), ముంబైలో రూ. 108.49 (+0.90), చెన్నైలో రూ. 105.31 (+0.82)గా ఉండనున్నాయి.  అలాగే డీజిల్‌ ధరలు ఢిల్లీలో రూ. 92.49 (+0.91), కోల్‌కతాలో రూ.97.02 (+0.95), ముంబయిలో రూ.95.02 (+0.94), చెన్నైలో రూ.96.98 (+0.87)గా ఉండనున్నాయి. ఇక, తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.84కు చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.94కి పెరిగాయి. మరోవైపు సీఎన్‌జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది . కిలో సీఎన్‌జీపై రూ.1 పెంచుతున్నట్లు శనివారం ప్రకటన జారీ చేసింది. 10 రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలను పెంచడం ఇది మూడోసారి. 


ధరలను నియంత్రించాలని ప్రజల డిమాండ్‌

ప్రముఖ నగరాలన్నింటిలోనూ ఈ ధరల పెరుగుదల అమలులోకి రావడంతో, నిత్యావసరాల ఖర్చులు ఎక్కడ పెరిగిపోతాయోనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మారుతున్న ఈ ధరల వల్ల రోజువారీ ప్రయాణికులు, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తలకిందులవుతోందని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఇంధన ధరలను నియంత్రించాలని ప్రజల నుంచి గట్టి డిమాండ్ వినిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని నివాసితులు ఈ తాజా ధరల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆదాయాలు పెరగనప్పటికీ, నిరంతరం పెరుగుతున్న ఇంధన ఖర్చులు తమ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయని వారు వాపోతున్నారు. సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకుండా ధరలను పెంచుకుంటూ పోవడంపై కొందరు పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనం వాడటం అనేది విలాసం కాదని, రోజువారీ పనుల కోసం తప్పనిసరి అని, ప్రత్యామ్నాయంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్లు కూడా సాధారణ ప్రజలు కొనే స్థాయిలో అందుబాటులో లేవని స్థానికులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఈ ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం శాశ్వత నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

లద్దాఖ్‌ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌


  • వైరల్‌అయిన  శిథిలాల వద్ద ఆర్మీ అధికారుల వైరల్ సెల్ఫీ 



లేహ్:  ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని  'విక్టరీ' మార్క్ చూపించిన భారత ఆర్మీ అధికారుల సెల్ఫీ ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తూర్పు లడఖ్‌లోని లేహ్ సమీపంలో మే 20న భారత సైన్యానికి చెందిన ఒక 'చేతక్' హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. చైనా సరిహద్దులోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ)కు అత్యంత సమీపంలో ఉన్న టాంగ్‌స్టే అనే పర్వత ప్రాంతంలో ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో అందులో భారత ఆర్మీ 3 ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ సచిన్ మెహతాతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ (పైలట్లు) ప్రయాణిస్తున్నారు. నిగూఢమైన పర్వత ప్రాంతం, సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే పలచని గాలి కారణంగా హెలికాప్టర్ అదుపుతప్పి పర్వత శ్రేణులపై కూలిపోయింది. అయితే, ఈ భీకర ప్రమాదం నుంచి ముగ్గురు అధికారులు కేవలం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతమని రక్షణ శాఖ అధికారులు అభివర్ణించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, పర్వతాలపై పడి ఉన్న హెలికాప్టర్ శిథిలాల పక్కనే గాయాలతో ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా ,పైలట్లు ఒక సెల్ఫీ దిగారు. అందులో ఒక పైలట్ 'విక్టరీ'సంకేతాన్ని చూపించడం విశేషం. 

రాజ్యసభ సీటు అమ్ముకున్న ఆప్‌


  • ఆమ్ ఆద్మీ పార్టీపై హర్భజన్ సంచలన ఆరోపణలు
  • పంజాబ్ రాజకీయాల్లో రేగిన తీవ్ర దుమారం


భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ రాజకీయంగా చేసిన ఆరోపణలు పంజాబ్, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) తన రాజ్యసభ సీటును భారీ మొత్తానికి అమ్ముకుందని భజ్జీ బహిరంగంగా ఆరోపించడమే కాకుండా, ఇందుకోసం ఎవరెవరు లంచాలు తీసుకున్నారో త్వరలోనే వారి పేర్లను సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. ఇటీవల ఆప్ వీడి బీజేపీలో చేరిన హర్భజన్ సింగ్.. సామాజిక మాధ్యమం 'ఎక్స్'  వేదికగా ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆప్ మద్దతుతో గెలిచిన రాజ్యసభ సీటుకు ఎందుకు రాజీనామా చేయలేదని, పంజాబ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ నుంచి రూ. 25 కోట్లు తీసుకుని ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారా అంటూ నెటిజన్‌ భజ్జీని విమర్శించారు. దీనికి హర్భజన్ సింగ్ అంతే తీవ్రంగా సమాధానమిస్తూ.. పంజాబ్ రాజ్యసభ సీటును ఆప్ ఎంతకు అమ్ముకుందో ముందు మీ నాయకులనే అడగాలని, వారు చెప్పకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత  తీసుకున్నారో తానే స్వయంగా ఆధారాలతో సహా లాలా (అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి) ముఠా గుట్టు రట్టు చేస్తానని సవాల్ విసిరారు. కేవలం పంజాబ్‌ను లూటీ చేయడానికి, ఇక్కడి అక్రమ సంపాదనను ఢిల్లీ పెద్దలకు చేరవేయడానికే కొందరిని మంత్రులుగా, ఉన్నతాధికారులుగా నియమించారని ఆయన మండిపడ్డారు. మీరు పంజాబ్‌ను పూర్తిగా దోచుకుని తిన్నారంటూ ఆప్ అగ్రనాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఈ పరిణామంపై పంజాబ్‌లోని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ ,బీజేపీలు  స్పందించాయి. ఆప్ స్వచ్ఛమైన రాజకీయాల ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందని,  సొంత పార్టీ ఎంపీయే ఇలాంటి ఆరోపణలు చేయడం వారి నైజాన్ని నిరూపిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. అయితే, హర్భజన్ సింగ్ చేసిన ఈ ఆరోపణలను ఆప్‌ గా ఖండించింది. సీటు దక్కలేదనే తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, పార్టీ ఎల్లప్పుడూ పారదర్శకతకే ప్రాధాన్యం ఇస్తుందని ఆప్ నేతలు సమర్థించుకున్నారు.



గ్రీన్ కార్డ్ నిబంధనల్లో కొత్త నిబంధనలు


  • ఇకపై స్వదేశానికి వెళ్లి అప్లై చేసుకోవడం తప్పనిసరి
  • ఆందోళనలో లక్షలాదిమంది భారతీయ టెక్కీలు, విద్యార్థులు


వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) సాధించాలనే కలలతో అక్కడ నివసిస్తున్న లక్షలాదిమంది వలసదారులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ పొందేందుకు ఇన్నాళ్లూ ఉన్న 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' విధానానికి స్వస్తి పలుకుతూ.. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) శుక్రవారం అత్యంత కఠినమైన నూతన వలస విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అత్యధిక శాతం మంది వలసదారులు మొదట అమెరికాను విడిచిపెట్టి, తమ స్వదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారా మాత్రమే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అత్యంత అసాధారణమైన మినహాయింపు పరిస్థితుల్లో తప్ప, మిగిలిన అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది.



ఇప్పటివరకు అమెరికాలో స్టూడెంట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు లేదా తాత్కాలిక వర్క్ వీసాలపై (హెచ్-1బీ వంటివి) నివసిస్తున్న విదేశీయులు దేశం విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే, కొత్త విధానంలో 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్'ను ఒక అత్యంత అరుదైన మినహాయింపుగా మార్చేశారు. చట్టం అసలు ఉద్దేశాన్ని పునరుద్ధరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, తాత్కాలికంగా అమెరికాకు వచ్చేవారు తమ గడువు ముగిశాక స్వదేశానికి తిరిగి వెళ్లాలనేదే నిబంధన అని, వారి పర్యటన గ్రీన్ కార్డ్ పొందేందుకు మొదటి అడుగు కాకూడదని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత అమెరికాలోనే అక్రమంగా ఉండిపోయే ధోరణిని అడ్డుకునేందుకే ఈ కఠిన చర్యలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకుని పీరియడ్‌లో ఉన్న సుమారు 10 లక్షల మంది వలసదారులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే, అమెరికా ఆర్థిక రంగానికి లేదా జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక రంగాల అభ్యర్థులకు పాత పద్ధతిలోనే అనుమతించే అవకాశం ఉందని సమాచారం.


ఈ చట్ట సవరణల వల్ల అమెరికాలో రెండో అతిపెద్ద వలస సమాజంగా ఉన్న భారతీయులపై తీవ్రమైన ప్రభావం పడనుంది. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో సుమారు 32 లక్షల మంది భారతీయ వలసదారులు నివసిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఐటీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్-1బీ వీసాలలో 71 శాతానికి పైగా భారతీయులే పొందుతున్నారు. అంతేకాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో కూడా భారతీయులదే సింహభాగం. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 40 దేశాల పౌరులపై రకరకాల ఆంక్షలు విధించగా, ఈ కొత్త నిబంధన వల్ల గ్రీన్ కార్డ్ ప్రక్రియ కోసం భారతీయులు స్వదేశానికి రావలసి వస్తే, తిరిగి వారు అమెరికా వెళ్లడంపై దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాన్సులర్ ప్రాసెస్ కోసం స్వదేశానికి వెళ్లడం అంటే, పరోక్షంగా గ్రీన్ కార్డ్ మార్గాన్ని మూసివేయడమేనని మాజీ వలస నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా 2025 తర్వాత వలసదారుల సంఖ్య భారీగా తగ్గడం ప్రారంభమైన తరుణంలో, ఈ తాజా నిర్ణయం భారతీయ ఐటీ రంగానికి మరియు విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారనుంది.

Friday, 22 May 2026

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంపై ఇరాన్‌కు ఈయూ గట్టి షాక్


  • అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు
  • కొత్త ఆంక్షలకు యూరోపియన్ యూనియన్ ఆమోదం!


ప్రపంచవ్యాప్త ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని ఇరాన్ నిర్బంధించడాన్ని తీవ్రంగా పరిగణించిన యూరోపియన్ యూనియన్ (EU) ఆ దేశంపై మరోసారి ఆంక్షల పంజా విసిరింది. ఈ జలసంధి దిగ్బంధనానికి బాధ్యులైన ఇరాన్ ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త దౌత్య, ఆర్థిక ఆంక్షలను విధించడానికి ఈయూ సభ్య దేశాలు శుక్రవారం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. గత ఫిబ్రవరి నెలలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడులకు ప్రతీకారంగా, ప్రపంచవ్యాప్త గ్యాస్ , చమురు సరఫరాకు గుండెకాయ లాంటి ఈ సముద్ర రవాణా మార్గాన్ని టెహ్రాన్ (ఇరాన్ ప్రభుత్వం) పూర్తిగా మూసివేసింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు ముమ్మాటికీ విరుద్ధమని స్పష్టం చేసిన ఈయూ కూటమి, తమ పాత ఆంక్షల పరిధిని మరింత విస్తృతం చేస్తూ ఒక సాంకేతిక ముందడుగు వేసింది. దీనివల్ల నౌకాయాన స్వేచ్ఛను హరించేలా వ్యవహరించిన మరికొంత మంది ఇరాన్ ప్రముఖులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐరోపా సమాఖ్యకు పూర్తి అధికారాలు లభిస్తాయని యూరోపియన్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది.



గతంలో బ్రస్సెల్స్ (ఈయూ ప్రధాన కార్యాలయం) విధించిన ఆంక్షలు కేవలం ఉక్రెయిన్ పైన రష్యా జరుపుతున్న యుద్ధానికి ఇరాన్ అందిస్తున్న సైనిక సహకారం మరియు మధ్యప్రాచ్యంలోని వివిధ సాయుధ శక్తులకు చేస్తున్న సహాయాన్ని అడ్డుకోవడానికే పరిమితమయ్యాయి. వీటితో పాటు ఇరాన్ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా ఈయూ గతంలో ఆంక్షలు విధించింది. అయితే, తాజాగా అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఏయే వ్యక్తులు లేదా సంస్థలను లక్ష్యంగా చేసుకోబోతున్నారనే వివరాలను ఈయూ ఇంకా బహిరంగంగా వెల్లడించలేదు. ఈ సరికొత్త ఆంక్షల ప్రకారం సదరు నిందితులపై ప్రయాణ నిషేధాలు విధించడంతో పాటు, ఐరోపాలో ఉన్న వారి ఆస్తులను పూర్తిగా స్తంభింపజేయనున్నారు. అంతేకాకుండా, ఈయూ పౌరులు గానీ, అక్కడి కంపెనీలు గానీ ఆంక్షల జాబితాలో ఉన్న ఇరాన్ అధికారులకు ఎలాంటి నిధులు, ఆర్థిక వనరులు లేదా ఇతర ఆర్థిక సాయం అందించకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయనున్నారు.


ప్రపంచవ్యాప్త చమురు ఉత్పత్తిలో ఐదో వంతు వాటా కేవలం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుండటంతో, ఇరాన్ యుద్ధ వాతావరణం , ఈ మార్గం మూసివేత అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో అన్ని దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపై భారం పడింది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలిగిస్తున్న ఇరాన్ మొండివైఖరికి అడ్డుకట్ట వేసేందుకే యూరోపియన్ యూనియన్ ఈ కఠినమైన ఆర్థిక ఆంక్షల వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది.

తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే వారి పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు?


  • సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 
  • ఒకసారి ఆర్థిక, సామాజిక వృద్ధి సాధించాక కూడా ప్రయోజనాలు కోరడంపై ధర్మాసనం ప్రశ్నల వర్షం!


రిజర్వేషన్ల ఫలాలను అందుకొని విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాల పిల్లలకు.. ఇంకా ఓబీసీ (OBC) రిజర్వేషన్ ప్రయోజనాలను వర్తింపజేయడం ఎంతవరకు సమంజసమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం గట్టిగా ప్రశ్నించింది. విద్యా ఉపాధి అవకాశాల ద్వారా ఒకసారి సమాజంలో ఉన్నత హోదా (సోషల్ మొబిలిటీ) లభించిన తర్వాత కూడా, వారి తదుపరి తరాలు రిజర్వేషన్ల కోసం పట్టుబడితే ఈ వ్యవస్థ నుండి దేశం ఎప్పటికీ బయటపడలేదని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఒక సివిల్ వివాదంలో విచారణ జరుపుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదువుకొని, మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ, భారీగా జీతాలు పొందుతున్నప్పుడు.. వారి పిల్లలు కూడా రిజర్వేషన్లు ఆశించడంపై న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక స్థాయికి చేరుకున్న వారు రిజర్వేషన్ల పరిధి నుంచి స్వచ్ఛందంగానైనా బయటకు రావాల్సిన అవసరం ఉందని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు.



కర్ణాటకలో వెనుకబడిన తరగతుల కేటగిరీ 2(ఎ) కిందికి వచ్చే 'కురుబ' సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థి.. కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగానికి రిజర్వేషన్ కోటాలో ఎంపికయ్యారు. అయితే, ఆ అభ్యర్థి తల్లిదండ్రులు ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడం, వారి సంయుక్త వార్షిక ఆదాయం సుమారు 19.48 లక్షల రూపాయలుగా ఉండటంతో.. వారు 'క్రీమీ లేయర్' (సంపన్న శ్రేణి) పరిధిలోకి వస్తారంటూ జిల్లా కుల , ఆదాయ ధృవీకరణ కమిటీ అతడికి కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరించింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం అభ్యర్థికి అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఆ తీర్పును తిరగరాసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రీమీ లేయర్ గుర్తింపులో జీతాన్ని మినహాయించినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర పరిధిలోని రిజర్వేషన్లకు ఆ మినహాయింపు వర్తించదని, కుటుంబ ఆదాయం నిర్ణీత పరిమితిని దాటినందున సదరు అభ్యర్థి క్రీమీ లేయర్ కిందికే వస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


సుప్రీంకోర్టులో అభ్యర్థి తరఫున న్యాయవాది శశాంక్ రత్నూ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులలో క్రీమీ లేయర్‌ను నిర్ణయించడానికి కేవలం జీతం ప్రాతిపదిక కాదని, తల్లిదండ్రులు గ్రూప్-ఎ లేదా గ్రూప్-బి హోదాల్లో ఉన్నారా లేదా అనే అంశమే ముఖ్యమని పేర్కొన్నారు. కేవలం జీతాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే డ్రైవర్లు, క్లర్కులు, ప్యూన్ల పిల్లలు కూడా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పిటిషనర్ తండ్రి ప్రాథమిక వేతనం నెలకు 53,900 రూపాయలు, తల్లి వేతనం 52,650 రూపాయలు అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ స్పష్టీకరణ ప్రకారం ఈ అలవెన్సులను ఆదాయంలో భాగంగా పరిగణించకూడదని ఆయన వాదించారు. అన్నిరకాల ఆదాయాలను లెక్కిస్తే ఓబీసీ రిజర్వేషన్లకు, ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లకు మధ్య తేడా లేకుండాపోతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అవసరమే అయినప్పటికీ.. ఒకసారి రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా లేదా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడినప్పుడు, సమాజంలో వారి హోదా మారినందున ఆ మినహాయింపుల నిరాకరణను ప్రశ్నించడం సరికాదని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ఈ అంశంలో వివిధ న్యాయపరమైన విభిన్న కోణాలు ఉన్నందున దీనిపై లోతైన పరిశీలన అవసరమని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

Featured post

ఇవాంకా ట్రంప్‌ను హతమార్చేందుకు కుట్ర

   నిఘా వర్గాల చేతికి ఫ్లోరిడా నివాస నమూనా అమెరికాలో ఐఆర్‌జీసీ ఉగ్రవాది అరెస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను...