Sunday, 21 June 2026

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

 

  • పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్
  • మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్
  • దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత మొదటి సంతానానికి సిద్ధమైనట్లు జాతీయ మీడియా వెల్లడి
  •  చైతన్యతో విడిపోయిన తర్వాత 2025 డిసెంబర్‌ లో రాజ్‌ ను పెళ్లాడిన సామ్!



స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొన్ని రోజులుగా తన తాజా చిత్రం "మా ఇంటి బంగారం" సాధించిన ఘనవిజయంతో పాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి జరుపుకున్న ఒక వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత గర్భవతి  అయ్యిందనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే సమంత దంపతులు తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్నారని, ఆమె గర్భం దాల్చిన విషయం నిజమేనని జాతీయ వార్తా సంస్థ ‘ఎన్‌డీటీవీ’ కి విశ్వసనీయయ సమాచారం అందింది. ఈ తాజా వార్తలపై అటు సమంత కానీ, ఇటు రాజ్ నిడిమోరు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ.. ఈ పరిణామం సమంత గతంలో మాతృత్వం గురించి మాట్లాడిన ఒక పాత ఇంటర్వ్యూను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఒకప్పుడు తాను మొదటి బిడ్డను ప్రపంచంలోకి ఆహ్వానించడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని లేదా గడువును  కూడా ముందుగానే ఫిక్స్ చేసుకున్నట్లు సామ్ వెల్లడించడం విశేషం.



తిరిగి 2018 సంవత్సరంలో, నటుడు నాగచైతన్యతో వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత ‘ఫిల్మ్ కంపానియన్’ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతకు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె తనదైన శైలిలో నవ్వుతూ స్పందిస్తూ.. తాను, చైతన్య కలిసి ఒక బిడ్డను ఎప్పుడు కనాలనుకుంటున్నామనే విషయంపై అప్పట్లోనే చర్చించుకున్నట్లు వెల్లడించింది. "మేము బిడ్డ కోసం ఒక డేట్ (తేదీ) కూడా ఫిక్స్ చేసుకున్నాం! అయితే మేము అనుకున్న తేదీ ప్రకారమే అంతా జరుగుతుందని నేను అనుకోను కానీ.. చైతన్య మాత్రం మేము నిర్ణయించిన సమయానికే అది జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాడు. ఏదేమైనా మేము ఎప్పుడు బిడ్డను కనాలనే ఒక టైమ్‌లైన్‌ను మాత్రం కచ్చితంగా నిర్ణయించుకున్నాం" అని సామ్ నాడు పేర్కొంది. అదే సమయంలో తల్లి కావడం వల్ల తన ప్రాధాన్యాలు ఎలా మారబోతున్నాయో కూడా సమంత వివరించింది. తనకు బిడ్డ పుట్టిన తర్వాత సినిమా పని కంటే కుటుంబానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసింది.


తనకు సంతానం కలిగితే ఆ బిడ్డ మాత్రమే తన ప్రపంచంగా మారుతుందని, ఉద్యోగం చేసే తల్లులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని సమంత నాటి ఇంటర్వ్యూలో చెప్పింది. తన బాల్యం అంతగా బాగుండలేదని, చిన్నతనంలో కష్టాలు పడిన ఏ వ్యక్తి అయినా తమ పిల్లలకు తాము కోల్పోయిన ప్రతిదానిని అందించాలని కోరుకుంటారని, ఆ భావన తన మనస్సులో బలంగా నాటుకుపోయిందని తెలిపింది. అందుకే బిడ్డ పుట్టిన మొదటి కొన్ని సంవత్సరాల పాటు తాను సినిమాలకు పూర్తి దూరంగా ఉండి, ఆ బిడ్డ కోసమే తన సమయాన్ని కేటాయిస్తానని నాడు వెల్లడించింది. అయితే, కాలక్రమేణా సమంత జీవితం మరో మలుపు తిరిగింది. నాగచైతన్యతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత.. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం డిసెంబర్ 2025లో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. మరోవైపు నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత తల్లి కాబోతోందనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఫిఫా వరల్డ్ కప్ 2026 లో సరికొత్త చరిత్ర


  • 68 ఏళ్ల తర్వాత కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయి దాటిన మెగా టోర్నీ
  • స్వీడన్‌ పై నెదర్లాండ్స్ సునామీ విజయంలో నమోదైన టోర్నమెంట్ 100వ గోల్
  • ప్రపంచకప్ చరిత్రలో వందో గోల్ మార్కును అందుకున్న ఎనిమిదో దేశంగా డచ్ జట్టు
  • జపాన్-ట్యునీషియా పోరుతో 1000వ మ్యాచ్ మైలురాయిని తాకిన ఫిఫా


ఉత్తర అమెరికా వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) అప్పుడే రికార్డుల వేటను ప్రారంభించి ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ మెగా టోర్నమెంట్ కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని అత్యంత వేగంగా అధిగమించి, గత 68 ఏళ్లలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. జూన్ 12న జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై మెక్సికో ఆటగాడు జూలియన్ క్విన్యోన్స్ ఈ టోర్నీలోనే మొదటి గోల్ సాధించగా.. ఆదివారం (భారత కాలమానం ప్రకారం) స్వీడన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 5-1 తేడాతో ఘనవిజయం సాధించిన తరుణంలో ప్రస్తుత టోర్నమెంట్‌లో వందో గోల్ నమోదైంది. నెదర్లాండ్స్ ఆటగాడు కోడి గ్యాక్‌పో కొట్టిన డచ్ జట్టు మూడో గోల్.. ఈ మెగా టోర్నీకి 100వ గోల్‌గా నిలిచింది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే వంద గోల్స్ నమోదు కావడం అనేది 1982, 2014 టోర్నీల (36 మ్యాచ్‌లు) రికార్డుతో పాటు 1978, 1994 ప్రపంచకప్‌ల (38 మ్యాచ్‌లు) రికార్డులను బద్దలు కొట్టింది. అయితే, ఆల్‌టైమ్ రికార్డు మాత్రం స్విట్జర్లాండ్‌లో జరిగిన 1954 ప్రపంచకప్ పేరిట ఉంది. పశ్చిమ జర్మనీ విజేతగా నిలిచిన ఆ టోర్నీలో కేవలం 20 మ్యాచ్‌ల్లోనే వంద గోల్స్ మార్కు దాటడం విశేషం.



ఈ రికార్డుతో పాటు నెదర్లాండ్స్ (డచ్) జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే మొత్తంగా 100 గోల్స్ సాధించిన కేవలం ఎనిమిదో దేశంగా నిలిచి ఎలైట్ క్లబ్‌లో చేరింది. స్వీడన్‌తో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే గ్యాక్‌పో ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను బ్రాబీ గోల్‌గా మలిచి జట్టుకు డ్రీమ్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత 17వ నిమిషంలో బ్రాబీ తన వ్యక్తిగత రెండో గోల్‌ను సాధించగా.. అది ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ దేశానికి లభించిన వందో గోల్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.


మరోవైపు, మాంటెర్రే స్టేడియంలో జపాన్, ట్యునీషియా దేశాల మధ్య జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్.. ఫిఫా ప్రపంచకప్ సుదీర్ఘ చరిత్రలోనే మైలురాయి లాంటి 1000వ మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఈ చరిత్రాత్మక సందర్భంపై ఫిఫా (FIFA) స్పందిస్తూ.. "1000వ మ్యాచ్ అనేది ఫుట్‌బాల్ క్రీడ పట్ల, ప్రపంచకప్ పట్ల మానవాళికి ఉన్న అంతులేని ప్రేమకు , ఈ క్రీడ , సుదీర్ఘ ప్రయాణానికి ప్రతీక. అన్ని అడ్డంకులను బద్దలు కొట్టి, భిన్న సంస్కృతులను, దేశాలను ఏకతాటిపైకి తీసుకురాగల ఫుట్‌బాల్ ,ప్రత్యేక శక్తికి ఇది నిదర్శనం" అని కొనియాడింది. ఈసారి ఉత్తర అమెరికాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 48 దేశాలు పాల్గొంటుండగా, వాటిని 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది మూడో స్థానాల జట్లు తదుపరి నాకౌట్ (రౌండ్ ఆఫ్ 32) దశకు అర్హత సాధించనున్నాయి.

ముడిచమురు కొనుగోళ్లను ముమ్మరం చేసిన భారత్


  • జూన్ నెలలో సరికొత్త రికార్డు దిశగా రష్యా చమురు దిగుమతులు
  • గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన భద్రత కోసం భారత్ వ్యూహాత్మక అడుగులు
  • వెనెజువెలా నుంచి భారీగా నౌకలు, అమెరికా దిగుమతులు డౌన్


న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్‌ జలసంధి గుండా చమురు రవాణా మార్గాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న తరుణంలో.. భారతదేశం తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి  వ్యూహాత్మక అడుగులు వేసింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు నోచుకోవడానికి ముందే, భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ల నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారీగా పెంచినట్లు అంతర్జాతీయ నౌకాయాన విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’  వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 1 నుంచి జూన్ 19 వరకు గల కాలంలోనే భారత్ రష్యా నుంచి రోజుకు సగటున 26.6 లక్షల బారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలలో నమోదైన 19.1 లక్షల బారెళ్లతో పోలిస్తే చాలా ఎక్కువ. తద్వారా భారతదేశానికి అత్యంత పెద్ద చమురు సరఫరాదారుగా రష్యా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. చౌక ధరలు, ఆకర్షణీయమైన డిస్కౌంట్ల వల్లే రష్యా చమురు భారత్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అటు యూఏఈ నుంచి దిగుమతులు కూడా రికార్డుస్థాయికి చేరువగా రోజుకు 6,36,000 బారెల్స్‌గా నమోదయ్యాయి.



అమెరికా, ఇస్లామిక్ దేశాల దాడుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో గత కొన్ని నెలలుగా గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, ఎల్‌ఎన్‌జీ (LNG), ఎల్‌పీజీ (LPG) సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రపంచవ్యాప్త చమురు వినియోగంలో 20 శాతం వాటా ఈ జలసంధి గుండానే సాగుతుంది కాబట్టి సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలపై భారత్ ఆధారపడటం తగ్గించాల్సి వచ్చింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్ తన కొనుగోలు వనరులను వైవిధ్యభరితంగామార్చుకుంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా (రోజుకు 3,84,000 బారెళ్లు) తర్వాతి స్థానంలో వెనెజువెలా దేశం రోజుకు 2,09,000 బారెళ్ల సరఫరాతో భారత్‌కు నాల్గవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. అయితే, ఇదే సమయంలో అమెరికా నుంచి దిగుమతులు మే నెలలో ఉన్న 2,52,000 బారెళ్ల నుంచి జూన్ నాటికి ఏకంగా 91,000 బారెళ్లకు దారుణంగా పడిపోవడం గమనార్హం.


కెప్లర్ సీనియర్ మేనేజర్ సుమిత్ రిటోలియా విశ్లేషణ ప్రకారం.. హార్ముజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోవడం వల్ల భారతదేశానికి ఎదురవుతున్న లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కొరతకు అత్యంత వేగంగా ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ సంక్షోభం వల్ల భారత్‌లో ఎల్‌పీజీ సరఫరానే అత్యంత దారుణంగా దెబ్బతింది. ముడిచమురు , ఎల్‌ఎన్‌జీ దిగుమతులు ఇతర దేశాల (రష్యా, బ్రెజిల్, ఒమన్, నైజీరియా) ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొంతవరకు నిలకడగానే సాగాయి. హార్ముజ్‌ జలసంధి తెరిచిన ప్రారంభ దశలో నౌకాశ్రయాలలో చిక్కుకుపోయిన సరుకును క్లియర్ చేయడంపైనే గల్ఫ్ దేశాలు దృష్టి పెడతాయని, కాబట్టి సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం ఇరు దేశాల ఒప్పందం ప్రకారం మూడు భారతీయ చమురు నౌకలు, ఒక ఎల్‌ఎన్‌జీ నౌక ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించడం సానుకూల పరిణామమే అయినప్పటికీ.. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఇరాన్ చేస్తున్న ఆరోపణల వల్ల ఈ తాత్కాలిక శాంతి ఎంతవరకు నిలుస్తుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు


  • కేవలం 11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ
  • 21 ఏళ్ల లంక రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా వండర్ కిడ్
  • 29 బంతుల్లో 94 పరుగులతో దంబుల్లాలో సునామీ ఇన్నింగ్స్
  • సచిన్  36 ఏళ్ల ఆల్‌ టైమ్ రికార్డును బద్దలు కొడుతూ భారత జట్టుకు ఎంపిక!



ట్రై-నేషన్ సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో చోటుచేసుకున్న చేదు అనుభవాలకు, మైదానంలో జరిగిన గొడవకు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తోనే అత్యంత భీకరమైన సమాధానం ఇచ్చాడు. నాడు సూపర్ ఓవర్ ఉత్కంఠలో భారత్ ఓడిపోయిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లతో జరిగిన ఘర్షణ క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. సూర్యవంశీ ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సరైన సమయం కోసం వేచి చూసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, లంకతో ఫైనల్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "100" అని రాసి సవాల్ విసిరాడు. మైదానంలోకి దిగిన తర్వాత పూర్తి ప్రతికారేచ్ఛతో ఊగిపోతూ కేవలం 29 బంతుల్లోనే 8 సిక్సర్లు, 10 ఫోర్ల సహాయంతో 94 పరుగులు చేసి శ్రీలంక ‘ఎ’ బౌలింగ్ విభాగాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా లిస్ట్-ఎ (List A) క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. తద్వారా శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే పేరిట 21 ఏళ్లుగా ఉన్న 12 బంతుల రికార్డును సూర్యవంశీ తిరగరాశాడు.



భారత ‘ఎ’ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ టీనేజ్ సంచలనానికి ఇది తొలి అర్ధశతకం కావడం విశేషం. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఫిఫ్టీ మార్కును దాటిన సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. అయితే, ఇన్నింగ్స్ 9వ ఓవర్లో శ్రీలంక ‘ఎ’ కెప్టెన్ సహన్ అరాచిగే బౌలింగ్‌లో అవుట్ కావడంతో కేవలం 6 పరుగుల దూరంలో ప్రపంచ రికార్డు సెంచరీని , తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకున్న 100 పరుగుల లక్ష్యాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. అయినప్పటికీ, అతని ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టించింది.


ఈ అద్భుత ప్రదర్శనకు ముందే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు 2026 కోసం ప్రకటించిన భారత పురుషుల టీ20 (T20I) జట్టులో ఈ యువ ఆటగాడికి తొలిసారిగా స్థానం దక్కింది. కేవలం 15 సంవత్సరాల 71 రోజుల వయసులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట 36 ఏళ్లుగా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 1989లో పాకిస్తాన్‌పై తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. రాబోయే పర్యటనలో సూర్యవంశీ కనుక తుది జట్టులో ఆడితే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రికార్డును తన సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం భారత టీ20 క్రికెట్‌లో వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు), వన్డేల్లో సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 238 రోజులు) పేరిట ఉన్న అత్యంత యువ ఆటగాళ్ల రికార్డులను సూర్యవంశీ తిరగరాయడానికి సిద్ధమయ్యాడు.

ట్రంప్ పోరాటానికి సిద్ధమని సంకేతాలు ఇస్తున్న మెలోని


  • మిగతా దేశాధినేతలు మౌనంగా ఉన్నా అగ్రరాజ్యంపై ఒంటరి పోరుకు మొగ్గు
  • ‘ట్రంప్ చేతిలో లీడర్’ అనే ముద్ర పడకుండా ఉండేందుకే వ్యూహాత్మక తిరుగుబాటు
  • అమెరికాతో వ్యాపార సదస్సును రద్దు చేసుకుని ఇటలీ సార్వభౌమత్వాన్ని చాటిన వైనం


న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పెట్టుకుంటే రాజకీయంగా భారీ నష్టం జరుగుతుందని చాలామంది ప్రపంచ దేశాధినేతలు భావిస్తున్న తరుణంలో.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాత్రం దానికి భిన్నంగా దౌత్య పోరాటానికి సిద్ధమన్న సంకేతాలను ఇస్తున్నారు. గతంలో ఐరోపాను ‘తుఫానులా చుట్టేసింది’ అంటూ ట్రంప్ చేత ప్రశంసలు అందుకున్న మెలోని.. ఇప్పుడు అమెరికాకు చెందిన ఇతర మిత్రదేశాలు మనస్సులో అనుకున్నా బయటకు చెప్పలేని మూడు సాహసోపేతమైన వ్యాఖ్యలను బహిరంగంగానే చేశారు. ట్రంప్ అబద్ధాలు చెప్తారని, మిత్రులను వదిలేసి శత్రువులను ప్రసన్నం చేసుకుంటారని ఆరోపించారు. అంతేకాకుండా, రాబోయే నవంబర్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పాతాళస్థాయికి పడిపోయిన ట్రంప్ సొంత ప్రజాదరణ రేటింగులను చూసుకోవాలంటూ ఆయనకు గట్టిగా చురకలు అంటించారు. జీ7 సదస్సు ముగిసిన వెంటనే అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని చాలా దేశాలు అంగీకరించినప్పటికీ, మెలోని మాత్రం ట్రంప్ అహంకారపూరిత వైఖరిపై దూకుడు పెంచడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.



నిజానికి జార్జియా మెలోని ఒకప్పుడు ట్రంప్ సిద్ధాంతాలను (MAGA) ఇష్టపడే సాంప్రదాయవాదిగా గుర్తింపు పొందారు. గతంలో ట్రంప్ ఆమె అందాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలను కూడా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఒక పాపులిస్ట్ నాయకురాలి నుండి ఇప్పుడు ఒక ఆచరణాత్మక  పాలకురాలిగా మారిన మెలోని.. తన దేశంలో పొలిటికల్ బ్రాండ్‌ను కాపాడుకోవడానికి ట్రంప్‌పై ఎదురుదాడిని ఎంచుకున్నారు. ఐరోపాలో కేవలం ‘ట్రంప్ చేతిలో ఒక కీలుబొమ్మ’ అనే ముద్ర పడితే వచ్చే ఏడాది ఇటలీలో జరగబోయే ఎన్నికల్లో తనకు భారీ నష్టం జరుగుతుందని రోమ్‌లోని లూయిస్ యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఐరోపా ఓటర్లలో ట్రంప్‌ పట్ల ఉన్న వ్యతిరేకతను గమనించిన మెలోని.. అతని దాడులకు లొంగిపోవడం కంటే తిరగబడటమే రాజకీయంగా తనకు లాభిస్తుందని భావిస్తున్నారు. అందుకే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్ లేదా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వంటి నేతలు ట్రంప్‌తో ఘర్షణ పడకుండా సర్దుకుపోయే ధోరణిని అవలంబిస్తుంటే.. మెలోని మాత్రం ఇటలీ గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


ట్రంప్ తీరుకు నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అగ్రరాజ్యానికి ఒక బలమైన షాక్ ఇచ్చింది. అమెరికాలోని మయామిలో జరగాల్సిన అత్యంత కీలకమైన ‘యూఎస్-ఇటలీ బిజినెస్ ఫోరమ్’ ను ఇటలీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా హాజరుకావాల్సిన ఈ సదస్సులోనే.. అమెరికా ప్రతిపాదించిన వ్యూహాత్మక ఖనిజాల ఒప్పందం ‘పాక్స్ సిలికా’ (Pax Silica) పై ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. ఈ వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనా పర్వాలేదు కానీ ట్రంప్ అహంకారానికి తలొగ్గేది లేదని మెలోని తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య పూర్తి చీలికను సూచిస్తోందని ట్రంప్ అంతర్జాతీయ భాగస్వామ్యాల రాయబారి పాలో జాంపోలి కూడా అంగీకరించడం గమనార్హం.

ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోనూ భారత్ రికార్డు ఎగుమతులు


  • ఏప్రిల్ నుంచి  జూన్ 14 వరకు 15 శాతం వృద్ధి సాధించినట్లు మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి 
  • అమెరికా విధించిన 50 శాతం భారీ టారిఫ్‌లను తట్టుకుని దేశీయ వాణిజ్యం సరికొత్త జోరు
  • మే నెలలో 6 నెలల గరిష్టానికి చేరిన ఎగుమతులు
  • ఉత్తర ముంబై నుంచి ‘వికసిత్ భారత్’ లక్ష్యం ప్రారంభం కావాలని చార్టర్డ్ అకౌంటెంట్లకు పిలుపు


ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారతదేశ విదేశీ వాణిజ్యం సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు గల కాలంలో దేశీయ వస్తు ఎగుమతులు  దాదాపు 15 శాతం మేర భారీ వృద్ధిని నమోదు చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రకటించారు. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్లతో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన ఆయన.. తన వద్ద జూన్ 14 వరకు ఉన్న తాజా గణాంకాల ప్రకారం ఎగుమతుల వృద్ధి రేటు ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా ప్రభుత్వం భారతీయ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించినప్పటికీ, గత 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా.. ప్రస్తుత త్రైమాసికంలోనూ భారత్ స్థిరమైన వృద్ధిని కనబరచడం విశేషమని ఆయన స్పష్టం చేశారు. కాగా, జూన్ నెల పూర్తిస్థాయి అధికారిక ఎగుమతి, దిగుమతి వివరాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ రాబోయే జూలై 15న అధికారికంగా విడుదల చేయనుంది.



ఇటీవల వెలువడిన గణంకాల ప్రకారం.. మే నెలలో దేశ ఎగుమతులు ఆరు నెలల గరిష్ట స్థాయికి (18 శాతం వృద్ధి) చేరుకుని ఏకంగా 45.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు కూడా పెరగడంతో దేశ వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు విస్తరించింది. సమగ్రంగా పరిశీలిస్తే.. ప్రస్తుత ఏప్రిల్-మే రెండు నెలల కాలంలో మొత్తం ఎగుమతులు 16.09 శాతం వృద్ధితో 88.91 బిలియన్ డాలర్లుగా నిలవగా, దిగుమతులు 15.14 శాతం పెరిగి 145.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనివల్ల ఈ రెండు నెలల కాలానికి గాను మొత్తం వాణిజ్య లోటు 56.44 బిలియన్ డాలర్లుగా స్థిరపడింది.


ఈ వేదికపై మంత్రి పీయూష్ గోయల్ దేశాన్ని ‘వికసిత్ భారత్’ గా మార్చే మహా యజ్ఞంలో చార్టర్డ్ అకౌంటెంట్లు తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని ప్రస్తావిస్తూ.. "అసలు వికసిత్ భారత్ లక్ష్యం ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది? అది మన ఉత్తర ముంబై నుంచే మొదలుకావాలి, ముందుగా మన సొంత ప్రాంత అభివృద్ధిని మనం బాధ్యతగా తీసుకోవాలి" అని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి (సోమవారం) తన నియోజకవర్గ పరిధిలో మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు ,ఉన్నతాధికారుల సమన్వయంతో ఒక భారీ స్వచ్ఛతా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మన ఇళ్లను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో.. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాన్ని, సమాజాన్ని, మన వ్యాపార లావాదేవీలను కూడా అంతే పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా కృషి చేయాలని మంత్రి పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు.

డిసెంబర్‌ కల్లా భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారు


  • వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నుండి అమలు
  • 93 శాతం భారతీయ ఎగుమతులకు సుంకాల నుంచి మినహాయింపు
  • కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వెల్లడి.. 
  • ఢిల్లీకి రానున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్
  • ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని వ్యాఖ్య


ముంబై:భారతదేశం, 27 దేశాల యూరోపియన్ యూనియన్ (EU) కూటమి మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఈ ఏడాది డిసెంబర్ నాటికి అధికారికంగా సంతకం కాబోతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రకటించారు. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్లతో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 27న రెండు పక్షాలు ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల ముగింపును అధికారికంగా ప్రకటించాయని, వాణిజ్య రంగంలో దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అభివర్ణించారని గుర్తుచేశారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే దాదాపు సున్నా శాతానికి చేరువగా సుంకాలు తగ్గిపోతాయని, తద్వారా సమగ్ర యూరోపియన్ మార్కెట్ అంతా భారతీయ వ్యాపారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



 భారత్-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పందం ప్రకారం.. భారతదేశం నుంచి యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యే దాదాపు 93 శాతం సరుకులకు పూర్తి సుంకం లేని  ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల దేశీయ టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్ , కెమికల్స్ వంటి రంగాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ఊపు రానుంది. అదే సమయంలో ఐరోపా దేశాల నుంచి భారతదేశానికి దిగుమతయ్యే లగ్జరీ కార్లు, వైన్లు , స్పిరిట్స్ వంటి వస్తువుల ధరలు ఇక్కడ గణనీయంగా తగ్గనున్నాయి. ప్రపంచవ్యాప్త స్థూల జాతీయోత్పత్తిలో (గ్లోబల్ GDP) భారత్, ఈయూల వాటా కలిపి ఏకంగా 25 శాతంగా ఉండగా.. అంతర్జాతీయ వాణిజ్యంలో మూడో వంతు (సుమారు 11 ట్రిలియన్ డాలర్లు) వాటాను ఈ రెండు శక్తులే కలిగి ఉండటం ఈ ఒప్పందం  ప్రాధాన్యాన్ని చాటిచెబుతున్నది.


ఇదే వేదికపై అంతర్జాతీయ వాణిజ్య పరంగా భారత్‌కు ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ.. "ప్రస్తుతం ప్రపంచమంతా భారతదేశం వైపే ఎంతో ఆశగా చూస్తోంది" అని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జేమీసన్ గ్రీర్ ద్విపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై తుది చర్చలు జరపడానికి ఈ వారంలోనే నేరుగా భారతదేశానికి రాబోతున్నారని వెల్లడించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి.. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 (G7) సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని కూడా భారతదేశంతో ప్రతిపాదిత ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని (CEPA) ఈ ఏడాది లోపే ముగించాలని తీవ్ర ఆకాంక్ష వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్, కెనడాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించి మే నెలలో రెండో రౌండ్ చర్చలు విజయవంతంగా ముగిశాయని మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...