Wednesday, 13 May 2026

ఏఐఏడీఎంకేలో ముదిరిన అంతర్గత పోరు


  • సీవీ షణ్ముగం సహా తిరుగుబాటు నేతలపై ఎడప్పాడి పళనిస్వామి వేటు
  • విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడమే కారణం



తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐఏడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి తన పార్టీలోని తిరుగుబాటు నేతలపై ఉక్కుపాదం మోపారు. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేసిన పార్టీ సీనియర్ నాయకులు సి.వి. షణ్ముగం, ఎస్.పి. వేలుమణి సహా పలువురు ఎమ్మెల్యేలను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విప్ ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన 26 మంది నేతలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఈ మొదటి బలపరీక్షలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు చీలిపోవడం పార్టీలో ఉన్న తీవ్ర విభేదాలను బహిర్గతం చేసింది.


పళనిస్వామి తీసుకున్న ఈ కఠిన చర్యను సీవీ షణ్ముగం తీవ్రంగా ఖండించారు. పార్టీ నియమావళి ప్రకారం ఈ తొలగింపు చెల్లదని, కనీసం వివరణ కోరకుండానే పదవుల నుంచి తొలగించడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా తాము ప్రజాభిప్రాయాన్ని గౌరవించామని షణ్ముగం వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో తిరుగుబాటు చేసిన 12 మంది ఎమ్మెల్యేల స్థానంలో పళనిస్వామి కొత్త జిల్లా కార్యదర్శులను నియమిస్తూ పార్టీని తన పట్టులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు శశికళ కూడా స్పందిస్తూ.. డీఎంకే వంటి శక్తులకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో తమిళ రాజకీయాల్లో ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే


  • ముఖ్యమంత్రి విజయ్  డిమాండ్
  • 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి



దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్ష నిర్వహణపై వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, వైద్య విద్య ప్రవేశాలను కేవలం 12వ తరగతి మార్కుల ఆధారంగానే నిర్వహించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని, కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు ఖర్చు చేయలేని విద్యార్థుల వైద్య విద్య కల కలగానే మిగిలిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడం సరైన పద్ధతి కాదని, రాష్ట్ర బోర్డుల సిలబస్‌ను అనుసరించే విద్యార్థులకు ఇది అన్యాయం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో జరుగుతున్న వరుస అవకతవకలు, పేపర్ లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని ముఖ్యమంత్రి విజయ్ మండిపడ్డారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో (Concurrent List) ఉన్న అంశమని, దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలని ఆయన గట్టిగా చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో నీట్ వ్యతిరేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల కోసం ఈ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒకప్పుడు తమిళనాడులో 12వ తరగతి మార్కులతోనే మెడికల్ సీట్లు భర్తీ చేసేవారని, ఆ విధానం మళ్లీ అమల్లోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని విజయ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన తన ప్రకటనలో కోరారు.

కర్ణాటకలో హిజాబ్ నిషేధం ఎత్తివేత


  • పాఠశాలల్లో మతపరమైన చిహ్నాలకు సిద్ధరామయ్య సర్కార్ అనుమతి
  • 2022 నాటి వివాదాస్పద ఉత్తర్వులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం



కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం  సంచలన నిర్ణయం తీసుకుంది. 2022లో అప్పటి బీజేపీ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, విద్యార్థులు తమ యూనిఫాంతో పాటు హిజాబ్, తలపాగా (టర్బన్), జనివారం (యజ్ఞోపవీతం), రుద్రాక్ష మాలలు వంటి సంప్రదాయ , మతపరమైన చిహ్నాలను ధరించడానికి అనుమతినిచ్చింది. విద్యాసంస్థల్లో క్రమశిక్షణను కాపాడుతూనే, రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు , వ్యక్తిగత విశ్వాసాలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో జనివారం , హిజాబ్ అంశాలపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు , ఎయిడెడ్ విద్యాసంస్థల్లో యూనిఫాం నిబంధన యథాతథంగా కొనసాగుతుంది. అయితే, యూనిఫాంలోని ప్రాథమిక రూపానికి భంగం కలగకుండా అదనంగా ఈ మతపరమైన చిహ్నాలను ధరించవచ్చు. విద్యార్థుల గుర్తింపునకు లేదా భద్రతకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ సంప్రదాయాలను పాటించవచ్చని విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప వెల్లడించారు. ఈ చిహ్నాలను ధరించిన కారణంతో ఏ విద్యార్థిని తరగతి గదిలోకి లేదా పరీక్షా హాల్లోకి రాకుండా అడ్డుకోకూడదని అధికారులను ఆదేశించారు. సెక్యులరిజం అంటే వ్యక్తిగత నమ్మకాలకు వ్యతిరేకం కాదని, అందరినీ సమానంగా గౌరవించడమేనని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టులో భిన్నమైన తీర్పులు వచ్చిన నేపథ్యంలో, తాజా నిర్ణయం రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది.

Tuesday, 12 May 2026

విద్యుత్ పొదుపుపై ప్రధాని పిలుపు అత్యవసరం


  • శక్తి వినియోగంపై ప్రపంచవ్యాప్త ఆంక్షల బాటలోనే భారత్
  • ఇంధన సంక్షోభ నివారణకు పొదుపే ఏకైక మార్గమని నిపుణుల విశ్లేషణ!



దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ , ఇంధన వనరుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విద్యుత్ పొదుపు విజ్ఞప్తి ఎంతమాత్రం అతిశయోక్తి కాదని, అది ప్రస్తుత కాలీన అవసరమని పర్యావరణ , ఇంధన రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రస్తుతం ఇంధన నియంత్రణ చర్యలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐరోపా దేశాల నుంచి ఆసియా వరకు ఉన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అన్నీ తమ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి పౌరులను బాధ్యతాయుతంగా విద్యుత్ వాడాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని పిలుపును కేవలం ఒక అభ్యర్థనగా కాకుండా, భవిష్యత్తు ఇంధన సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించే ఒక ముందుజాగ్రత్త చర్యగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పబ్లిక్ లైటింగ్ సమయాన్ని తగ్గించడం, వాణిజ్య సముదాయాలలో ఏసీ ఉష్ణోగ్రతలపై ఆంక్షలు విధించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రజలను మళ్లించడం వంటి చర్యలను వేగవంతం చేశాయి. భారత్ కూడా అదే బాటలో నడుస్తూ, సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు వ్యక్తిగత స్థాయిలో విద్యుత్ వృథాను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో గ్రిడ్‌లపై ఒత్తిడి తగ్గించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇంధన పొదుపు అనేది కేవలం ఆర్థిక పరమైన అంశం మాత్రమే కాదని, అది పర్యావరణ పరిరక్షణలో , దేశ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థల గణాంకాలు కూడా ధృవీకరిస్తున్నాయి.

హార్ముజ్ జలసంధి పరిధిని పెంచిన ఇరాన్


  • 500 కిలోమీటర్ల మేర 'ఆపరేషనల్ జోన్'గా ప్రకటన
  • అంతర్జాతీయ నౌకాయానానికి ఐఆర్జీసీ కొత్త సవాల్



టెహ్రాన్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. ఈ జలసంధి భౌగోళిక పరిమితులను తాము పునర్నిర్వచించామని, ఇకపై దీనిని 500 కిలోమీటర్ల మేర 'క్రియాశీల కార్యకలాపాల జోన్'  గా పరిగణిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సంచలన ప్రకటన చేసింది. గతంతో పోలిస్తే ఈ జలసంధి పరిధి ఇప్పుడు మరింత విస్తరించిందని, ఈ ప్రాంతంలో జరిగే ప్రతి కదలికను తాము పర్యవేక్షిస్తామని ఐఆర్జీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పర్షియన్ గల్ఫ్ , ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న వ్యూహాత్మక మార్గంపై ఇరాన్ తన పట్టును మరింత బిగించినట్లయింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం , భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్త ముడిచమురులో మూడింట ఒక వంతు ఈ మార్గం గుండానే రవాణా అవుతుండటంతో, ఇరాన్ ప్రకటించిన ఈ 500 కిలోమీటర్ల జోన్ పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ ప్రాంతంలో సంచరించే విదేశీ యుద్ధ నౌకలు , వాణిజ్య నౌకలు తమ అనుమతి లేదా నిబంధనలకు లోబడి ఉండాలని ఇరాన్ పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, హార్ముజ్ జలసంధిని ఒక ఆపరేషనల్ జోన్‌గా మార్చడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రహస్య దాడులు


  • పశ్చిమాసియా యుద్ధంలో యూఏఈ అనూహ్య అడుగుపై వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడి!



దుబాయ్‌:పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం మధ్య ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.  కొన్ని నెలలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల తరుణంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ అత్యంత రహస్యంగా ఇరాన్ భూభాగంపై సైనిక దాడులు నిర్వహించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్  తన కథనంలో వెల్లడించింది. సాధారణంగా ఇటువంటి ప్రాంతీయ సంక్షోభాల్లో తటస్థంగా ఉండేందుకు లేదా దౌత్యపరమైన పరిష్కారాలకే మొగ్గుచూపే యూఏఈ, ఈసారి నేరుగా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల నుంచి తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే, ఎమిరేట్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రహస్య దాడులు ప్రధానంగా ఇరాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలు , సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు బహిరంగంగా ఇరాన్‌ను నేరుగా ఢీకొనడానికి వెనుకడుగు వేసిన అరబ్ దేశాలు, ఇప్పుడు తమ రక్షణ వ్యూహాలను మార్చుకున్నట్లు ఈ పరిణామం సూచిస్తోంది. అయితే ఈ దాడులపై యూఏఈ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న అగ్రరాజ్యాల మద్దతు కూడా ఈ చర్యల వెనుక ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో అటు గల్ఫ్ దేశాలకు, ఇటు ఇరాన్‌కు మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని, ఇది మొత్తం పశ్చిమ ఆసియాలో పెను రాజకీయ మార్పులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు


  • పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • సమగ్ర విచారణ జరిపే బాధ్యత సీబీఐకి అప్పగింత
  • తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న ఎన్‌టీఏ
  •  మళ్లీ పరీక్ష రానున్న సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు
  • పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
  • దేశానికి విష కాలంగా మోడీ అమృత కాలమని మండిపాటు
  • దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌యూఐ భారీ నిరసనలు
  • విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్


మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా రద్దు చేసింది. రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పేపర్ లీక్ అయినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణలు, ప్రాథమిక విచారణలో వెల్లడైన ఆధారాల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకతను కాపాడేందుకు, లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ చర్య తప్పలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సీబీఐకి  అప్పగించింది.



పరీక్ష రద్దు కావడంతో దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రద్దు చేసిన పరీక్షకు బదులుగా దేశవ్యాప్తంగా తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎటువంటి అదనపు రుసుము చెల్లించనక్కర్లేదని అధికారులు వివరించారు. పేపర్ లీక్ ఆరోపణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు రాజస్థాన్ ఎస్ వో జీ  తో పాటు ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో విద్యార్థులు మ,తల్లిదండ్రుల్లో కొంత ఊరట లభిస్తోంది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది.



యువత భవిష్యత్తుతో ఆడుకోవడం నేరమని రాహుల్‌ ధ్వజం


నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకునే 'అమృత కాలం' దేశ యువతకు శాపంగా మారిందని, అది ఇప్పుడు 'విష కాలం'గా రూపాంతరం చెందిందని ఆయన విమర్శించారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, నీట్ పరీక్ష రద్దు కావడం కేవలం వైఫల్యం మాత్రమే కాదని, ఇది దేశ భవిష్యత్తు అయిన యువతపై జరిగిన నేరమని అభివర్ణించారు. ఈ అవినీతి బీజేపీ పాలనలో సుమారు 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగాలు , కలలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



నిజాయితీగా చదివే విద్యార్థులకు  శిక్ష 

లక్షలాది మంది విద్యార్థులు రాత్రనక పగలనక కష్టపడి చదివారని, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆభరణాలు అమ్ముకుని మరీ కోచింగ్ ఇప్పించారని రాహుల్ గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వారికి ప్రతిఫలంగా పేపర్ లీకులు, నిర్లక్ష్యం , వ్యవస్థీకృత అవినీతిని బహుమతిగా ఇచ్చిందని మండిపడ్డారు. దేశంలో 'పేపర్ మాఫియా' యథేచ్ఛగా తిరుగుతోందని, ప్రతిసారీ తప్పు చేసిన వారు తప్పించుకుంటుంటే, నిజాయితీగా చదివే విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడే తత్వానికి కాకుండా డబ్బుకు, పరపతికే విలువ ఉండేలా విద్యారంగాన్ని మార్చేశారని, దీనివల్ల విద్యా వ్యవస్థకే అర్థం లేకుండా పోతోందని విమర్శించారు.


ఈ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్

నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు మరోసారి తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆర్థిక భారాన్ని లోనవుతారని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న ఈ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  విద్యార్థుల పక్షాన తాము నిలబడతామని, ఈ అన్యాయంపై పోరాటం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.





 భగ్గుమన్న విద్యార్థి లోకం


నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ మంగళవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఢిల్లీలోని శాస్త్రి భవన్ ఎదుట పెద్ద సంఖ్యలో విద్యార్థులు, కార్యకర్తలు తరలివచ్చి విద్యాశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీక్ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు గళమెత్తారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా జైపూర్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో విద్యార్థులు రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన తమకు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం తీరని మానసిక వేదన కలిగిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ టీఏ పనితీరుపై నమ్మకం పోయిందని, ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎన్‌ఎస్‌యూఐ స్పష్టం చేసింది.

Featured post

ఏఐఏడీఎంకేలో ముదిరిన అంతర్గత పోరు

సీవీ షణ్ముగం సహా తిరుగుబాటు నేతలపై ఎడప్పాడి పళనిస్వామి వేటు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడమే కారణం తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం ...