Thursday, 3 September 2026

ఇస్రోకు మరో అద్భుత విజయం.. గర్వకారణమైన క్షణం: ప్రధాని మోదీ




న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4: జియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే భారత్‌ తొలి ఇమేజింగ్‌ ఉపగ్రహం EOS-05ను విజయవంతంగా ప్రయోగించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా 2,300 కిలోలకుపైగా బరువున్న EOS-05ను నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత కచ్చితత్వంతో ఇస్రో ప్రవేశపెట్టింది. దీంతో భారత అంతరిక్ష రంగం మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది.


‘‘ఇస్రోకు మరో అద్భుత విజయం.. మన దేశానికి గర్వకారణమైన క్షణం. EOS-05ను మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 విజయవంతంగా ప్రయోగించడమంటే.. జియోసింక్రనస్‌ కక్ష్య నుంచి పనిచేసే భారత్‌ తొలి ఇమేజింగ్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడమే. భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని మోదీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఇస్రోతో భారత పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని ప్రధాని తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన మొత్తం వ్యవస్థలో భారత్‌ సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతోందని చెప్పారు.


2026లో ఇస్రోకు తొలి విజయం


2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది తొలి విజయవంతమైన మిషన్‌గా నిలిచింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లిన సుమారు 18 నిమిషాల తర్వాత EOS-05ను నిర్దేశిత సబ్‌-జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టారు.

చిన్నారెడ్డిపై వేటు.. తదుపరి పయనమెటు?

 



  • నాలుగు దశాబ్దాల కాంగ్రెస్‌ ప్రస్థానంలో చేదు అనుభవం

మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం.. పార్టీ బలోపేతానికి నిరంతర కృషి.. రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు.. అధిష్ఠానం ఆదేశాలను పాటించిన సీనియర్‌ నేత.. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి అనూహ్య పరిణామం ఎదురైంది. పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అధిష్ఠానం నిర్ణయంతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

  • ఎమ్మెల్యేపై వ్యాఖ్యలతో వివాదం

గోపాల్‌పేట మండలంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఎమ్మెల్యే బి.ఫారాలను పార్టీ, నాయకులు డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి.. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

ఈ వ్యవహారంపై టీపీసీసీతో పాటు దిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ అంశంపై విచారణ జరిపి నివేదికను అధిష్ఠానానికి సమర్పించింది. ముఖ్యమంత్రి సైతం ఏఐసీసీ నేతలతో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. చివరకు చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.

  • షోకాజ్‌ నోటీసుకు లేఖతో వివరణ

తన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో చిన్నారెడ్డి లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అందులో పేర్కొన్నారు.

గోపాల్‌పేటలో కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వారి మనోభావాలు, ఆవేదనను మాత్రమే తాను ఆ రోజు వ్యక్తం చేశానని వివరించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే అధిష్ఠానం మాత్రం ఆయన వివరణతో సంతృప్తి చెందకపోవడంతో చర్యలకు సిద్ధమైంది.

  • సొంతూరులోనే మౌనం

వనపర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం దాదాపు 15 రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం అధిష్ఠానం తన నిర్ణయాన్ని ప్రకటించడంతో చిన్నారెడ్డితో పాటు ఆయన అనుచరుల్లోనూ నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది.అధిష్ఠానం నిర్ణయం వెలువడిన అనంతరం చిన్నారెడ్డి తన సొంతూరు గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపూర్‌కు వెళ్లారు. అక్కడ పొలం గట్ల మధ్య కొంతసేపు గడుపుతూ కనిపించారు. పార్టీ నిర్ణయంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

  • తదుపరి అడుగు ఏమిటి?

దాదాపు 48 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ నేతపై అధిష్ఠానం ఇంతటి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు చిన్నారెడ్డి తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది. తన క్యాడర్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పదవులపై తనకు ఎలాంటి వ్యామోహం లేదని కూడా స్పష్టం చేశారు.అయితే తన సీనియారిటీకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివరణ ఇచ్చినప్పటికీ పదవి నుంచి తొలగించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన అనంతరం చిన్నారెడ్డి తన తదుపరి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంత సుదీర్ఘ కాంగ్రెస్‌ ప్రస్థానం సాగించిన చిన్నారెడ్డి.. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఆకాశంలో నిఘా నేత్రం



  • భారత్‌ తొలి జియో-ఆర్బిట్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం


శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలిసారిగా జియో-ఆర్బిట్‌లో పనిచేసే అధునాతన ఇమేజింగ్‌ ఉపగ్రహం EOS-05ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా కీలక రంగాల్లో రియల్‌టైమ్‌ భూ చిత్రాలను అందించడంలో ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.


  • 27 గంటల కౌంట్‌డౌన్‌.. తెల్లవారుజామున ప్రయోగం


బుధవారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్‌ సజావుగా పూర్తయింది. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లింది. 2,367 కిలోల బరువున్న EOS-05 ఉపగ్రహాన్ని రాకెట్‌ మోసుకెళ్లింది. వర్షం పడుతున్నప్పటికీ.. తెల్లవారుజామున కావడంతో సమయం అసాధారణంగా ఉన్నప్పటికీ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఉత్సాహంతో శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల అనంతరం EOS-05ను నిర్దేశిత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (సబ్‌-GTO)లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.


  • ‘ఆకాశంలో నిఘా నేత్రం’గా EOS-05


ఈ ఉపగ్రహాన్ని మిషన్‌లో పాల్గొన్న ఓ సీనియర్‌ శాస్త్రవేత్త ‘ఆకాశంలో నిఘా నేత్రం’గా అభివర్ణించారు. భూమిపై జరుగుతున్న పరిణామాలను దాదాపు రియల్‌టైమ్‌లో పరిశీలించేందుకు ఇది ఉపయోగపడనుంది. ముఖ్యంగా వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వంటి రంగాలకు అవసరమైన కీలక సమాచారాన్ని అందించనుంది.ప్రస్తుతం అనేక ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాలు లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO)లో పనిచేస్తున్నాయి. అయితే EOS-05 భూమికి సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్‌ ఆర్బిట్‌లో పనిచేయనుంది. ఈ కక్ష్యలో ఉపగ్రహం భ్రమణ వేగం భూమి భ్రమణ వేగంతో సరిపోలేలా ఉంటుంది.జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17.. భారత జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (GSLV) సిరీస్‌లో 19వ ప్రయోగం. మూడు దశల ఈ రాకెట్‌ 51.7 మీటర్ల పొడవు, 420.5 టన్నుల లిఫ్ట్‌ఆఫ్‌ బరువుతో ఉంది. మూడో దశలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఉపయోగించారు.


  • 2021 విఫల ప్రయోగానికి కొనసాగింపుగా..


జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17/EOS-05 మిషన్‌ను 2021లో విఫలమైన GSLV-F10/EOS-03 మిషన్‌కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో 307 సెకన్లకే ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌ మిషన్‌ను నిలిపివేసింది. అనంతరం నిర్వహించిన విశ్లేషణలో క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌లో తలెత్తిన లోపమే మిషన్‌ వైఫల్యానికి కారణమని ఇస్రో వెల్లడించింది.


  • ఎనిమిది నెలల తర్వాత ఇస్రోకు మరో ప్రయోగం


దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఇస్రోకు చెందిన PSLV-C62 రాకెట్‌ కీలకమైన మూడో దశలో ‘అసాధారణత’ తలెత్తడంతో నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన ఏకైక ప్రయోగం అదే కాగా.. అది విఫలమైంది. అంతకుముందు 2025 మేలో చేపట్టిన PSLV-C61/EOS-09 ప్రయోగం కూడా విజయవంతం కాలేదు. మోటార్‌ ప్రెజర్‌ సమస్య కారణంగా చాంబర్‌ ప్రెజర్‌లో తగ్గుదల ఏర్పడటంతో ఆ మిషన్‌ విఫలమైంది.



  • భారత్‌కు కీలక వ్యూహాత్మక సమాచారం


EOS-05 విజయవంతంగా కక్ష్యలోకి చేరిన అనంతరం ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 వాహక నౌక EOS-05ను అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు.ఉపగ్రహం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత.. జియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే భారత్‌ తొలి ప్రత్యేక ఇమేజింగ్‌ ఉపగ్రహంగా EOS-05 నిలుస్తుందని నారాయణన్‌ చెప్పారు. దేశానికి అవసరమైన కీలక వ్యూహాత్మక సమాచారాన్ని అందించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ మిషన్‌ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినట్లు సమాచారం.

ఓల్డ్ సిటీకి మెట్రో తెస్తాం.. అదే మెట్రోలో వచ్చి ఓట్లు అడుగుతాం: సీఎం రేవంత్ రెడ్డి

 



హైదరాబాద్: ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొస్తామని, వచ్చే ఎన్నికల్లో అదే మెట్రోలో ప్రయాణించి వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తాను గతంలో ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీకి మెట్రో అవసరంపై అసదుద్దీన్ ఒవైసీ గతంలో లేవనెత్తిన ప్రశ్న నూటికి నూరు శాతం సరైనదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘మెట్రో రైలు మొత్తం న్యూ సిటీలో నిర్మించారు. మరి ఓల్డ్ సిటీలో రోజూ పనులకు వెళ్లే మన ముస్లిం సోదరులకు మెట్రో అవసరం లేదా? మేము మెట్రో ఎక్కకూడదా?’’ అని అసద్ సాబ్ అడిగారని గుర్తుచేశారు.ఆ ప్రశ్న తనను ఆలోచింపజేసిందని, అందుకే అప్పుడే తాను స్పందించానని సీఎం తెలిపారు. ‘‘సాబ్.. డబ్బులు నేను ఇస్తాను. రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాలను ఇప్పించే బాధ్యత మీది’’ అని తాను చెప్పినట్లు వెల్లడించారు.

మెట్రో పనులకు అవసరమైన 900 ఆస్తుల్లో ఇప్పటికే 850 ఆస్తులను ఇప్పించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా 50 ఆస్తులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ మంత్రికి సూచించినట్లు వెల్లడించారు.‘‘వెళ్లి అసద్ సాబ్‌తో మాట్లాడి ఆ 50 ఆస్తులను కూడా క్లియర్ చేయించండి. ఎంత డబ్బులు అడిగినా ఇచ్చేయండి’’ అని తాను చెప్పినట్లు సీఎం వివరించారు.

డిసెంబర్‌లో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పనులు సజావుగా సాగి, ప్రజల సహకారం లభిస్తే రెండున్నరేళ్లలో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో అదే మెట్రో రైలులో ప్రయాణించి వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఓట్లు అడుగుతాం. ఆ మాటకు నేను ఈ రోజుకీ కట్టుబడి ఉన్నాను. అందుకే పట్టుబట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

హల్ద్వానీ ఘటన అంటరానితనానికి ప్రత్యక్ష నిదర్శనం



  • కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే


న్యూఢిల్లీ: హల్ద్వానీలో జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటన నేరుగా అంటరానితనానికి సంబంధించినదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దళితులకు తాము ఉన్నతులమని, వారు తక్కువ కులానికి చెందినవారనే భావనను తెలియజేసే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. కుల వివక్ష కారణంగా దళితులకు నీరు తాగే హక్కు, నీటిని వినియోగించే అవకాశం కూడా లేకపోయిన సమయంలో బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మహాడ్‌ ఉద్యమాన్ని చేపట్టారని ఖర్గే గుర్తుచేశారు. అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతోనే డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 17ను పొందుపరిచారని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం కళ్ల ముందే హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ ఘటన జరిగినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖర్గే విమర్శించారు. ‘‘ప్రభుత్వం కళ్ల ముందే ఇలాంటి ఘటన జరిగి, అందులో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి’’ అని ఖర్గే అన్నారు.

Wednesday, 2 September 2026

పవన్‌ అంటే గాలి కాదు.. తుపాను!

 



  • పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర విశేషాలు

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం మొదలవుతుంది. తెరపై పవర్‌స్టార్‌ కనిపిస్తే చాలు.. థియేటర్లు కేరింతలు, నినాదాలతో దద్దరిల్లిపోతాయి. ‘యే పవన్‌ నహీ.. ఆంధీ హై’ (పవన్‌ అంటే గాలి కాదు.. తుపాను) అంటూ అభిమానులు చేసే సందడి ఆయనకున్న క్రేజ్‌కు అద్దం పడుతుంది. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 30కి మించి సినిమాలు చేయకపోయినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమాన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పవన్‌ కల్యాణ్‌. నేడు (సెప్టెంబర్‌ 2) పవర్‌స్టార్‌ 55వ పుట్టినరోజు. ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇవి..

‘చిరంజీవి తమ్ముడినని చెప్పుకునేవాణ్ని కాదు’

చదువుకునే రోజుల్లో తాను చిరంజీవి తమ్ముడిననే విషయం ఇతరులకు తెలియకూడదని అనుకునేవాడినని పవన్‌ కల్యాణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. ‘‘చిరంజీవిని ఇష్టపడనివారితో గొడవ పడటం నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఏదైనా తప్పు చేస్తే.. ‘ఏరా.. సినిమా వేషాలు వేస్తున్నావా?’ అని అనేవారు. ఆ మాట నాకు చాలా చిరాకు తెప్పించేది. మా అన్నయ్య మాత్రం ‘నువ్వు మరీ సెన్సిటివ్‌గా ఉంటున్నావు. ఇలాగైతే జీవితంలో ఇబ్బందులు పడతావు’ అని చెప్పేవారు’’ అని గుర్తుచేసుకున్నారు.

సమోసా కొనుక్కునేందుకు కూడా డబ్బులుండేవి కావు!

ఏడో తరగతి వరకు తనకు తల్లి పాకెట్‌ మనీ ఇచ్చేవారు కాదని పవన్‌ చెప్పారు. సినిమా చూడటానికి వెళ్తానంటే టికెట్‌కు సరిపడా డబ్బులు మాత్రమే ఇచ్చేవారట. అయితే ఇంటర్వెల్‌లో సమోసా తినాలనే కోరిక ఉన్నా.. దాన్ని కొనుక్కునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడేవాడినని తెలిపారు. ‘‘ఇప్పుడు ఎన్ని రకాల సమోసాలు తిన్నా.. చిన్నప్పుడు కొనుక్కోలేకపోయిన ఆ సమోసానే ఎంతో రుచిగా అనిపిస్తుంది’’ అని నవ్వుతూ చెప్పారు.




పంతానికి పోయి.. బైక్‌ సైలెన్సర్‌ పట్టుకుని!

చిన్నతనంలో తన మొండితనం కారణంగా ఓసారి చేయి కాల్చుకున్నానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. బైక్‌ సైలెన్సర్‌ వేడిగా ఉంటుందని తెలిసినా.. అది చల్లగా ఉంటుందని స్నేహితులతో వాదించారట. ‘‘అయితే పట్టుకుని చూపించు’’ అంటూ స్నేహితులు సవాల్‌ చేయడంతో నిజంగానే సైలెన్సర్‌ పట్టుకున్నారట. దీంతో అరచేయి మొత్తం కాలిపోయిందని తెలిపారు. ఆ ఘటనను జీవితంలో ఓ గుణపాఠంగా తీసుకున్నానని చెప్పారు.

మార్షల్‌ ఆర్ట్స్‌ ఎందుకు నేర్చుకున్నారంటే..

చిన్నతనంలో తాను శారీరకంగా బలంగా ఉండేవాడిని కాదని పవన్‌ చెప్పారు. ఎవరిపైనైనా కోపం వచ్చినప్పుడు ఎదురుదాడి చేయాలనిపించేదని.. అదే సమయంలో ఇతరులు తనపై దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకోవాలంటే కొన్ని విద్యలు తెలిసి ఉండాలని భావించానని తెలిపారు. అలా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్టానని చెప్పారు. ‘‘మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం వల్ల నాకు సహనం కూడా పెరిగింది’’ అని పేర్కొన్నారు.

భయం, సిగ్గు ఎక్కువే!

తనకు అందరి ముందు నటించడం, డ్యాన్స్‌ చేయడం అంటే ఇప్పటికీ కొంత సిగ్గేనని పవన్‌ చెప్పిన సందర్భాలున్నాయి. అందుకే షూటింగ్‌లో సాధ్యమైనంత వరకు ఎవరూ లేని చోట చిత్రీకరణ చేయాలని కోరుతుంటానని తెలిపారు. యాక్షన్‌ సన్నివేశాల్లో వైర్లు కట్టి దూకించేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతుంటానని చెప్పారు.

‘‘హీరోలకు ఉండే అన్ని క్వాలిటీస్‌ నాకు లేవు. నాకు ఏం వచ్చో అది చేస్తుంటాను. నా బలాలు, బలహీనతలు ఏంటో నాకు బాగా తెలుసు’’ అని పవన్‌ తన గురించి సూటిగా చెప్పుకున్నారు.

‘జానీ’ నేర్పిన జీవిత పాఠం

పవన్‌ కల్యాణ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జానీ’ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా తర్వాత ఎదురైన అనుభవం తన ఆలోచనా విధానాన్నే మార్చిందని పవన్‌ చెప్పారు.

‘‘జానీ’ ఫ్లాప్‌ అయిన తర్వాత చాలామంది నన్ను ఓ క్రిమినల్‌ను చూసినట్లుగా చూశారు. ఒక్క సినిమా ఫ్లాప్‌ కావడంతో మనుషుల ప్రవర్తన ఇంతలా మారిపోతుందా అనిపించింది. ఆ రోజు నుంచి హిట్‌, ఫ్లాప్‌లను ఒకేలా తీసుకోవడం నేర్చుకున్నాను’’ అని తెలిపారు.

‘గోపాల గోపాల’లో ఆహారం.. ఆవుపాలు, అరటిపండ్లే!

‘గోపాల గోపాల’ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్న సమయంలో తన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానని పవన్‌ చెప్పారు. ఆ సమయంలో ఆవుపాలు, అరటిపండ్లు మాత్రమే ప్రధానంగా తీసుకునేవారట. ఆలోచనలను అదుపులో ఉంచుకోవడానికి భక్తి గీతాలు ఎక్కువగా వినేవాడినని తెలిపారు. పురాణాలను వినడం ద్వారా దేవుడి గురించి తెలుసుకున్నానని.. తన దృష్టిలో దేవుడంటే మంచి విషయాలను చెప్పే వ్యక్తి అని వివరించారు.

పుస్తకాలు చెప్పిన బాటలో..

తాను చదివిన పుస్తకాల ప్రభావం తన జీవితంపై ఎంతో ఉందని పవన్‌ చెబుతుంటారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో కాపీ కొట్టాలని ప్రయత్నించిన సమయంలో మహాత్మా గాంధీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయని ఓ సందర్భంలో తెలిపారు.

‘‘ఒకసారి పరీక్షలో కాపీ చేస్తూ దొరికిపోయానని, అలా చేయడం తప్పని గాంధీజీ చెప్పారు. ఆయన గురించి చదివి ఏం నేర్చుకున్నాను అని ఆలోచించాను. వెంటనే ఆ పరీక్షను రాయకుండా బయటకు వచ్చేశాను’’ అని పవన్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు.

పరశురాముడంటే ఎందుకంత ఇష్టం?

ఇతిహాసాల్లో తనకు పరశురాముడి పాత్ర అంటే ఎంతో ఇష్టమని పవన్‌ చెప్పారు. ‘నేను’ అనే అహంకారాన్ని జయించిన వ్యక్తిగా పరశురాముడిని చూస్తానని తెలిపారు.

రామాయణం, మహాభారతాలను కేవలం కథలుగా చూడనని.. వాటిలోని అంశాలను తన జీవితానికి అన్వయించుకుంటానని చెప్పారు. ‘‘ఒక ఘట్టంలో పైకి కనిపించే కథ ఒకటైతే.. దాని వెనుక దాగున్న భావం మరోలా ఉంటుంది. ఆ అంతరార్థాన్ని అన్వేషిస్తూ చదవడం నాకు ఇష్టం’’ అని వివరించారు.

జానపద గీతాలంటే ప్రత్యేక అభిమానం

చిన్నతనంలో తన తండ్రి ఇంట్లో జానపద గీతాలు వినేవారని.. అలా తనకూ వాటిపై ఆసక్తి ఏర్పడిందని పవన్‌ చెప్పారు. నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరితో పరిచయం ఏర్పడిందని, వారి పాటల బాణీలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు.

అందుకే అవకాశం దొరికినప్పుడల్లా తన సినిమాల్లో జానపద గీతాలకు చోటు కల్పిస్తుంటానని చెప్పారు. ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘జానీ’ తదితర చిత్రాల్లోని జానపద గీతాలు కూడా ఆ ఆసక్తితోనే సినిమాలో భాగమయ్యాయని పవన్‌ వెల్లడించారు.

సినిమాల్లో నటుడిగా.. వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో.. రాజకీయాల్లోనూ తనదైన ముద్రతో.. పవన్‌ కల్యాణ్‌ ప్రయాణం ప్రత్యేకమైనదే. అందుకే ఆయన అభిమానులకు పవన్‌ ఓ పేరు మాత్రమే కాదు.. ఓ భావోద్వేగం.

Tuesday, 1 September 2026

డేటా సెంటర్ల హబ్‌గా భారత్



  • 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధ్యం – పీయూష్ గోయల్
  •  7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని మోడీ నాయకత్వానికి, ప్రజలకు అభినందనలు


న్యూఢిల్లీ: డేటా సెంటర్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం , సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సాధించడంపై ఈ రంగానికి చెందిన భాగస్వాములందరితో ఎంతో ఆసక్తికరమైన రౌండ్ టేబుల్ చర్చలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా భారత్ నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు.


రెండు చోట్ల యుద్ధాలు జరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, హెచ్చుతగ్గులు నెలకొన్నటువంటి అత్యంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా తొలి త్రైమాసికంలో భారత్‌కు 7.8 శాతం జీడీపీ వృద్ధిని అందించిన దేశ ప్రజలను చూసి గర్విస్తున్నానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన, 'వికసిత్ భారత్ 2047' దిశగా సాగుతున్న అమృత్ కాలంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ నమ్మకాన్ని నింపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నిశ్చయాత్మక నాయకత్వాన్ని కొనియాడారు.


డేటా సెంటర్, సెమికండక్టర్ పరిశ్రమలు, భారత్ చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రయాణం, నాణ్యమైన ఉత్పత్తుల కోసం భారత్ తయారీ కేంద్రంగా మారడం వంటి అంశాలన్నీ రాబోయే రోజుల్లో దేశ ప్రగతిని మరిన్ని ఎత్తులకు తీసుకెళ్తాయని గోయల్ స్పష్టం చేశారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవే ఇంధనంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.


ఈ సమావేశం ఎంతో సానుకూల ధోరణిలో, అత్యంత సమర్థవంతంగా జరిగిందని ఆయన చెప్పారు. అంతకుముందు జరిగిన చర్చల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. పరిశ్రమ వర్గాల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయని, డేటా సెంటర్ల రంగంలోకి ఏకంగా 200 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. భారత్‌ను ప్రపంచానికే 'డేటా సెంటర్'గా ఎలా మార్చవచ్చనే దానిపై ఎన్నో సరికొత్త ఆలోచనలు, అవగాహనతో ఈ సమావేశం ముగిసిందని పీయూష్ గోయల్ వివరించారు.

Featured post

ఇస్రోకు మరో అద్భుత విజయం.. గర్వకారణమైన క్షణం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4: జియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే భారత్‌ తొలి ఇమేజింగ్‌ ఉపగ్రహం EOS-05ను విజయవంతంగా ప్రయోగించడంపై ప్రధానమంత్రి నరేంద్ర ...