Sunday, 26 July 2026

కొత్త కామన్వెల్త్ రికార్డుతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల ఫైనల్లో భాగంగా స్నాచ్ విభాగంలో 85 కేజీల బరువును ఎత్తి కొత్త కామన్వెల్త్ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. పోటీల ప్రారంభంలో 82 కేజీల బరువును ఎత్తే మొదటి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, రెండో ప్రయత్నంలో దాన్ని విజయవంతంగా ఎత్తారు. ఆ తర్వాత తన చివరి ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి సరికొత్త గేమ్‌ల , కామన్వెల్త్ రికార్డులను నెలకొల్పారు. గతంలో 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ మీరాబాయి చాను స్వర్ణ పతకాలను సాధించడం గమనార్హం.



మరోవైపు, పురుషుల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చానంబం రిషికాంత సింగ్ మొత్తం 264 కేజీల (121 కేజీల స్నాచ్ + 143 కేజీల క్లీన్ అండ్ జెర్క్) బరువును ఎత్తారు. మలేషియాకు చెందిన మహమ్మద్ అనిక్ కాస్దాన్ మొత్తం 273 కేజీల (121 కేజీల స్నాచ్ + 152 కేజీల క్లీన్ అండ్ జెర్క్) కొత్త గేమ్‌ల రికార్డుతో స్వర్ణ పతకం సాధించగా, కెన్యాకు చెందిన జాషువా ఎంబోయా 260 కేజీలతో (115 కేజీలు + 145 కేజీలు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. భారత లిఫ్టర్ రిషికాంత సింగ్ స్నాచ్ విభాగంలో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదట 116 కేజీలు, ఆ తర్వాత 119 కేజీలను విజయవంతంగా ఎత్తి, తన చివరి ప్రయత్నంలో 121 కేజీలు ఎత్తడం ద్వారా కామన్వెల్త్ గేమ్‌ల స్నాచ్ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. అయితే, మలేషియాకు చెందిన కాస్దాన్ కూడా త్వరలోనే 121 కేజీల మార్కును అందుకోవడంతో మొదటి విభాగం ముగిసేసరికి ఇద్దరూ సమవుజ్జీలుగా నిలిచారు.


ఆ తర్వాత జరిగిన క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో రిషికాంత మొదట 143 కేజీలు ఎత్తి మొత్తం 264 కేజీలతో తాత్కాలికంగా అగ్రస్థానంలో నిలిచారు. కానీ కాస్దాన్ వెంటనే 145 కేజీలు, ఆ తర్వాత 149 కేజీలను ఎత్తి మొత్తం 270 కేజీలతో భారతీయుడిపై ఒత్తిడి పెంచారు. తిరిగి ఆధిక్యంలోకి రావడానికి రిషికాంత తన చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తాల్సి రాగా, ఆయన క్లీన్ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ జెర్క్‌ను ముగించలేకపోవడంతో స్వర్ణ పతక పోరాటం ముగిసింది. ఆ తర్వాత కాస్దాన్ తన చివరి ప్రయత్నంలో 152 కేజీలు ఎత్తి మొత్తం 273 కేజీల రికార్డుతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

'ఇండియన్ ఐడల్ 16' విజేత జ్యోతిర్మయి నాయక్


  • సంగీత ప్రయాణంలో మరో మైలురాయి

సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రముఖ సంగీత రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ సీజన్ 16' గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిసింది. దేశవ్యాప్తంగా సంగీతాభిమానులను అలరించిన ఈ షోలో ఒడిశాకు చెందిన ప్రతిభావంతమైన గాయని జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచి 'ఇండియన్ ఐడల్ 16' ట్రోఫీని కైవసం చేసుకుంది. తుది పోరులో గట్టి పోటీనిచ్చిన అన్షికా చోంకర్, మనరాజ్ వీర్ సింగ్, మిస్మీ బోసు, సుహైల్ సూఫీ , తనిష్క్ శుక్లా వంటి ప్రతిభావంతులైన ఫైనలిస్టులను వెనక్కి నెట్టి జ్యోతిర్మయి ఈ ఘనత సాధించింది. ఫినాలేలో ఆమె ఆలపించిన "సైయా ఓ సైయా" పాట విరివిగా ఆకట్టుకుని విజయంలో కీలక పాత్ర పోషించింది.



ఇండియన్ ఐడల్ వేదికపైకి రాకముందే ఒడిశా సంగీత పరిశ్రమలో గుర్తింపు పొందిన జ్యోతిర్మయి, మ్యూజిక్ థెరపీ ద్వారా క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించే గొప్ప సామాజిక సేవలో కూడా పాలుపంచుకుంది. తన గెలుపుపై స్పందిస్తూ.. ఆడిషన్స్ నుంచి విజేతగా నిలిచే వరకు సాగిన ఈ ప్రయాణం ఒక కలలా ఉందని, ఇది తన జీవితాన్నే మార్చేసిందని భావోద్వేగానికి గురైంది. ప్రతి ప్రదర్శన తనను మరింత మెరుగైన గాయనిగా, వ్యక్తిగా తీర్చిదిద్దిందని తెలుపుతూ.. తన విజయం వెనుక ఉన్న కుటుంబ సభ్యులకు, జడ్జీలకు, ఓటు వేసి గెలిపించిన అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.



షో అంతటా జ్యోతిర్మయి అందించిన అద్భుతమైన ప్రదర్శనలు న్యాయనిర్ణేతలను, ప్రముఖులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "ఓ జబ్ తక్ హై జాన్" పాటకు సదాబహార్ నటి హేమా మాలిని నుంచి స్టాండింగ్ ఓవేషన్ లభించగా, "జానే క్యూ లోగ్ మొహబ్బత్ కియా కర్తే హై" పాటతో నటి లీనా చందావర్కర్‌ను మెప్పించింది. ఇక మెగా ఫినాలే వేదిక ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషాల్, బాద్‌షా, ఉషా ఉతుప్, ఉదిత్ నారాయణ్, పాపోన్, కుమార్ సానులతో పాటు సినీ తారలు షెహనాజ్ గిల్, ఊర్మిళా మాతోండ్కర్‌ల సమక్షంలో మరింత కోలాహలంగా మారింది. ఇండియన్ ఐడల్ 16 టైటిల్ గెలుచుకున్న జ్యోతిర్మయికి సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థుల నిరసనలను ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదు


  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్


న్యూఢిల్లీ: పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలను ప్రభుత్వం ఏనాడూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 'బిజినెస్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2026' కార్యక్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ, ఈ నిరసనలు ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచాయా అనే ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. యువత ఉత్సాహాన్ని తానేమీ తక్కువ చేసి చూడటం లేదని, ప్రతి తరంలోనూ యువత నిరసనల్లో పాల్గొనడం సహజమేనని సీతారామన్ అన్నారు. కొన్ని రాలుగా జరిగిన పరిణామాలను తక్కువగా అంచనా వేయడం లేదని చెప్పారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పూర్వ విద్యార్థిని అయిన ఆమె, తన కాలంలోనూ అలాగే జరిగిందని, భావి తరాలు కూడా ఇలాగే వ్యవహరిస్తాయని వ్యాఖ్యానించారు. సమాజంలో లేదా వ్యవస్థలో సరైన పరిస్థితులు లేనప్పుడు యువత త్వరగా స్పందిస్తుందని తెలిపారు.



పరీక్షల పేపర్ లీకేజీలపై పోరాటం చేసిన వ్యంగ్య రాజకీయ భాగస్వామ్య సమూహం 'కాకరోచ్ జనతా పార్టీ' (సీజేపీ) డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ ఆందోళనలు ముగిశాయి. దీనిని ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత సరైన, సమయానుకూల నిర్ణయాలను, పారదర్శకమైన చర్యలను కోరుకుంటుందని, అది ఎంతైనా సమంజసమని అభిప్రాయపడ్డారు. మార్పు తీసుకురాగలమనే నమ్మకంతోనే వారు నిరసనలు తెలుపుతారని, యువతలో ఉన్న ఆ పోరాట పటిమను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. యువత ఆలోచనలను అర్థం చేసుకుని, దానికి తగినట్లుగా స్పందించడంలోనే నిజమైన మార్పు ఉంటుందని సీతారామన్ వివరించారు. ప్రతి దేశంలోనూ, ప్రతి తరంలోనూ యువత ఇలా స్పందించడం ఒక సహజమైన సాంప్రదాయమని చెప్పారు. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, ప్రజల మాటలను ఆలకించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.

అఖిలేశ్‌ కు అసదుద్దీన్ పొత్తు ఆఫర్


  • 'ఫ్రెండ్ రిక్వెస్ట్' అంటూ బీజేపీ సెటైర్లు


ఉత్తరప్రదేశ్ రాబోయే 2027 శాసనసభ ఎన్నికల నేపథ్యంతో ఆ రాష్ట్ర రాజకీయం అప్పుడే వేడెక్కింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో పొత్తుకు సిద్ధంగా ఉన్నానని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. సమయం మించిపోకముందే చర్చలు ప్రారంభించాలని ఆయన అఖిలేశ్‌కు స్పష్టమైన సందేశాన్ని పంపారు.



మొరాదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదని, అందుకోసం చెయ్యి కలపడానికి, పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏడవటం కంటే, ఇప్పుడే కూర్చొని చర్చలు జరపడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తాము పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి నష్టం జరుగుతోందని భావిస్తే, కలిసి పోరాడేందుకు తాము సుముఖంగా ఉన్నామన్నారు. తమ పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఆత్మగౌరవం, న్యాయం , సమానత్వం కోసమేనని ఉద్ఘాటించారు. అధికారంలో సమాన హోదా, హక్కుల గురించి మాట్లాడేందుకే తాము ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ ఎంపీ స్పష్టం చేశారు.


ఒవైసీ ఆఫర్‌పై బీజేపీ స్పందిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా దీనిపై స్పందిస్తూ, ఇది కేవలం 'ఓటు బ్యాంక్ రాజకీయం' కోసం జరుగుతున్న సహకారమని మండిపడ్డారు. అఖిలేశ్‌ యాదవ్, ఒవైసీలు ఇద్దరూ సంతుష్టీకరణ రాజకీయాల్లో పోటీ పడుతున్నారని, ఎవరు 'పెద్ద భాయ్‌జాన్' అవుతారనే పోటీని పక్కన పెట్టి ఇప్పుడు 'భాయ్‌జాన్ కొలాబరేషన్' చేయడానికి సిద్ధపడ్డారని ఎద్దేవా చేశారు. అందుకే ఒవైసీ, అఖిలేశ్‌కు ఒక 'ఫ్రెండ్ రిక్వెస్ట్' పంపారని, వీరిద్దరూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని పూనావాలా అభివర్ణించారు. యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీఏపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్న వేళ, ఒవైసీ ఇచ్చిన ఈ పొత్తు ఆఫర్ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

Saturday, 25 July 2026

ఇది కేవలం ప్రారంభం మాత్రమే, సాగాల్సిన బాట చాలా ఉంది

  • అభిజీత్ దీప్కే వీడియో సందేశం

కాకరోచ్ జనతా పార్టీ (సీజేపీ) జరిపిన భారీ నిరసన ఘనవిజయంతో ముగియడంతో, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కేకు ఇది ఒక కొత్త ఉదయం. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, అలాగే విద్యార్థుల ఇతర డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో నిరసనలకు ముగింపు లభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ఈ విశ్రాంతి సమయాన్ని దేశవ్యాప్త ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచిన దీప్కే పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.



ఈ ఉదయం తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్న వీడియో సందేశంలో దీప్కే చాలా ప్రశాంతంగా కనిపించారు. ఇకపై సాయంత్రం వరకు ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయి తన ఇంట్లో కన్నుతెరిచానని ఆయన తెలిపారు. గడిచిన 37 రోజుల నిరసన కాలం నిజంగా చాలా కష్టతరమైనదని, అయితే ఇప్పుడు ఎలాంటి భయాందోళనలు లేవని పేర్కొన్నారు. అదే సమయంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, కాకరోచ్ జనతా పార్టీ ఇంకా ప్రయాణించాల్సిన బాట చాలా ఉందంటూ తన సోషల్ మీడియా అభిమానులకు గుర్తుచేశారు.


భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్యకు వ్యంగ్యాత్మక సమాధానంగా మే నెలలో దీప్కే ఈ 'సీజేపీ'ని స్థాపించారు. కానీ కొద్ది రోజుల్లోనే ఇది దేశంలోని జెన్ జీ (యువత) శక్తిని ఏకం చేసిన ఒక పెద్ద ఉద్యమంగా మారింది. జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది మద్దతుదారులు చేరి విప్లవాత్మక నినాదాలతో హోరెత్తించారు. నీట్ పేపర్ లీకేజీకి, అభ్యర్థుల ఆత్మహత్యలకు ప్రధాన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు నిన్న ప్రధాన్ రాజీనామా చేయడం, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోమని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సిజెపి తమ ఆందోళనను విరమించింది.


ఈ ప్రయాణం ఎంతమాత్రం సులభం కాదని దిప్కే గుర్తుచేసుకున్నారు. ఎన్నో అనుమానాలు వ్యక్తమైనప్పటికీ సీజేపీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న కారణంగా నిన్న జంతర్ మంతర్ వద్ద ఉన్న అందరికీ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. ఈ దేశం కోసం పోరాడిన ప్రతి ఒక్కరి కృషిని తాను ఎంతగానో గౌరవిస్తున్నానని చెప్పారు. అలాగే తమను విమర్శించిన వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ విమర్శలు, ప్రశ్నలే తమ లోపాలను సరిదిద్దుకుని మెరుగైన ఫలితాలను సాధించడంలో సహాయపడ్డాయని ఆయన పేర్కొన్నారు.

రెండు రోజులు, ఇద్దరు మంత్రులు, రెండు దేశాల్లో రాజీనామాలు!

ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు, అవకతవకలు జరిగినప్పుడు దాని నైతిక బాధ్యత ఎవరిది? కారణాలు వేరైనా, వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు విద్యాశాఖ మంత్రులు తమ శాఖల్లో జరిగిన లోపాలకు పూర్తి బాధ్యత వహిస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలో రాజీనామా చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.



భారత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ వివాదం కారణంగా రాజీనామా చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందే, ఆస్ట్రేలియాకు చెందిన ఆయన సహచర మంత్రి కూడా తన పదవికి స్వస్తి పలికారు. ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ACT) విద్యాశాఖ మంత్రి వైవెట్ బెర్రీ తన క్యాబినెట్ పదవి నుండి తప్పుకున్నారు. క్యాంప్‌బెల్ ప్రైమరీ స్కూల్ పునరుద్ధరణకు సంబంధించిన 1.88 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల కాంట్రాక్టు కేటాయింపులో ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు తీవ్ర అవినీతికి పాల్పడినట్లు ఏసీటీ ఇన్వెస్టిగేషన్ కమిషన్ తేల్చడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఈ విచారణలో బెర్రీ స్వయంగా ఎలాంటి తప్పు చేసినట్లు ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ, ఏసీటీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ మాజీ అధిపతి కేటీ హేర్, బెర్రీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జోషువా సెరామిడాస్‌లు టెండర్ ప్రక్రియలో ఒక యూనియన్‌కు అనుకూలంగా అక్రమ మార్గాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కమిషన్ నిర్ధారించింది. ఈ నివేదిక ఆధారంగా రాజీనామా ప్రకటించిన బెర్రీ, ఈ అంశం పార్లమెంటరీ వివాదంగా మారకూడదనే ఉద్దేశంతోనే పూర్తి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నట్లు తెలిపారు. తన నైతికత, ప్రామాణికత చెక్కుచెదరలేదని, శాసనసభ సభ్యురాలిగా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు.


మరోవైపు భారతదేశంలో, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఇతర పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విద్యార్థి సంఘాలు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్, విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. విద్యా వ్యవస్థకు అధిపతిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈ వైఫల్యాలకు బాధ్యత వహించి వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశాయి. తీవ్ర ఒత్తిడి నడుమ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కారణాలు, పరిస్థితులు వేరైనా... ఇద్దరు మంత్రులూ తమ శాఖల్లో జరిగిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవుల నుంచి తప్పుకోవడం ఇక్కడ విశేషం.

రీజినల్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

  • వచ్చే వారం అమెరికాలో నెతన్యాహు పర్యటన, ధృవీకరించిన ట్రంప్





వాషింగ్టన్, జూలై 25 (తెలుగుప్రభ): పశ్చిమాసియాలో రీజినల్ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన దౌత్యపరమైన చర్చలు, అవగాహనా ఒప్పందం విఫలమైన అనంతరం అమెరికా బలగాలు ఇరాన్ వ్యాప్తంగా లక్ష్యాలపై దాడులను కొనసాగిస్తున్న తరుణంలో ట్రంప్ వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్‌లో ఈ పర్యటనను ధృవీకరించారు. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దెబ్బతిన్న తర్వాత పరిస్థితి మరింత క్షీణించగా, ఇజ్రాయెల్ మొదటి నుంచీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. మరొకవైపు దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ , హెజ్‌బొల్లా రహిత చర్చల పురోగతి నిలిచిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఖాళీ చేయించే ఆదేశాలు నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో, నెతన్యాహు , ట్రంప్‌ల మధ్య జరగనున్న ఈ సమావేశం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Featured post

కొత్త కామన్వెల్త్ రికార్డుతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల ఫైన...