Monday, 30 March 2026

హేట్ స్పీచ్ బిల్లు ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్


  • అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
  • ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎల్పీ నేత ధ్వజం
  • బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్


హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'హేట్ స్పీచ్ బిల్లు'పై భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉందని, ప్రజాస్వామ్య గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన చట్టాన్ని తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతల పేరుతో తీసుకువస్తున్న ఈ బిల్లు పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనలా కనిపిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీసే సామాన్యులపై కక్ష సాధించేందుకే ఈ నిబంధనలను రూపొందించారని ఆయన విమర్శించారు.



ఈ బిల్లులోని అస్పష్టమైన అంశాల వల్ల సామాన్యులకు సంకెళ్లు పడతాయని, అధికారులకు మాత్రం ఇది రక్షణ కవచంలా మారుతుందని మహేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన నిజాం నవాబు లేదా ఇందిరా గాంధీ వంటి వ్యక్తుల గురించి మాట్లాడినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేలా నిబంధనలు ఉండటం దారుణమన్నారు. ఆధారాలు లేకున్నా, నేరం నిరూపణ కాకముందే జైలుకు పంపే అధికారం పోలీసులకు కల్పించడం పౌర స్వేచ్ఛకు విఘాతమని ధ్వజమెత్తారు. ముఖ్యంగా బిల్లులోని 'సెక్షన్ 4' అనేది ప్రజాస్వామ్యానికి ఒక డెత్ వారెంట్ లాంటిదని ఆయన అభివర్ణించారు.


రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం ఇలాంటి నల్ల చట్టాలను తీసుకురావద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంతటి కీలకమైన బిల్లును ఆమోదించే ముందు హౌస్ కమిటీ వేయాలని, క్షుణ్ణంగా చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపి, దానిపై సమగ్రమైన రివ్యూ నిర్వహించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు. ఈ బిల్లును తమ పార్టీ తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

కేరళలో ఎవరి మధ్య పొత్తు ఉందో అందరికీ తెలుసు


  • మోడీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ధ్వజం
  • పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్.
  • గ్యాస్ ధరల పెరుగుదలపై ఆందోళన


కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. కేరళలో ఎల్‌డీఎఫ్ , యూడీఎఫ్ కూటముల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న ప్రధాని ఆరోపణలను తిప్పికొడుతూ, అసలు పొత్తు ఎవరి మధ్య ఉందో కేరళ ప్రజలందరికీ బాగా తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం మారదని, ప్రజలు సత్యాన్ని గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కేంద్ర సంస్థలు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



రాజకీయ విమర్శలతో పాటు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భారత్‌పై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. యుద్ధం వంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయడం తమ ఉద్దేశ్యం కాదని, అయితే దీనివల్ల తలెత్తుతున్న సవాళ్లకు పరిష్కారాలను వెతకడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు.



పశ్చిమాసియా సంక్షోభం విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ముందస్తు ప్రణాళికలు ,సన్నద్ధతను పార్లమెంట్ వేదికగా దేశానికి వెల్లడించాలని ప్రియాంక కోరారు. ఇంధనం , గ్యాస్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పారదర్శకత ఉండాలని, అప్పుడే అందరం కలిసి భవిష్యత్తు వ్యూహాలపై పని చేయగలమని ఆమె చెప్పారు. ప్రధాని మోడీ కేవలం పరిస్థితిని వివరించడం కాకుండా, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరపడం ద్వారా ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు.

పినరయి విజయన్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలోనే


  • కేరళలో  కార్పొరేట్ సంస్థగా మారిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం
  •  రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!


కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పతనంతిట్టలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తన సిద్ధాంతాలను పక్కనబెట్టి ‘కార్పొరేట్ నిధులతో నడిచే ప్రభుత్వం’గా మారిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నియంత్రిస్తున్నారని, విజయన్ అవినీతికి సంబంధించిన ఫైళ్లు మోడీ వద్ద ఉండటమే ఇందుకు కారణమని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెడుతుంటే, కేరళ ముఖ్యమంత్రిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఈ రహస్య ఒప్పందానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.



ఎన్నికల బరిలో ఎల్డీఎఫ్ , బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, యూడీఎఫ్ (UDF) కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఈ ‘అపవిత్ర కలయిక’ ఏర్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. శబరిమల ఆలయ బంగారం దొంగతనం వంటి కీలక అంశాలను నిన్న కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ ప్రస్తావించకపోవడం వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను విస్మరించి కేవలం కార్పొరేట్శక్తులకే కొమ్ముకాస్తోందని, కాంగ్రెస్ మాత్రమే బీజేపీని , వారి రహస్య మిత్రులను ఢీకొట్టగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , వృద్ధులకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం వంటి పథకాలను అమలుచేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

Sunday, 29 March 2026

వ్యాధి చికిత్స నుంచి నివారణ దిశగా భారత్ అడుగులు

 

  •  జీవనశైలి జబ్బులపై యుద్ధానికి కేంద్రం ‘యోగాస్త్రం’
  • మధుమేహం, రక్తపోటు నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు
  • చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కొత్త యోగా ప్రోటోకాల్స్


దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అసంక్రమిత వ్యాధుల (NCDs) భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చికిత్స కంటే నివారణే మిన్న అనే నినాదంతో, వివిధ అనారోగ్య సమస్యలు , నిర్దిష్ట వయస్సు గల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన "యోగా ప్రోటోకాల్‌"ను కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఈ నెలలో జరిగిన యోగా మహోత్సవ్ 2026లో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ శాస్త్రీయ నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో దాదాపు మూడింట రెండు వంతులు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, మానసిక రుగ్మతల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో, ఈ యోగా ప్రోటోకాల్ ఒక కీలకమైన ముందడుగుగా నిలవనుంది.



ఈ నూతన విధానం ప్రకారం, ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాల పాటు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం , విశ్రాంతి పద్ధతులను కలిపి ఒక క్రమపద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా, శాస్త్రీయ ఆధారాలతో కూడిన క్లినికల్ మాడ్యూల్ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా వివరించారు. ఉదాహరణకు, మధుమేహం ఉన్నవారికి మెటబాలిక్ బ్యాలెన్స్ మెరుగుపరిచేలా, రక్తపోటు ఉన్నవారికి నరాల వ్యవస్థను శాంతపరిచేలా,  ఆస్తమా రోగులకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేలా ఈ ప్రోటోకాల్స్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. చిన్నపిల్లల కోసం సరదాగా ఉండే యోగా పద్ధతులు, కౌమార దశలో ఉన్నవారికి మానసిక ప్రశాంతతనిచ్చే వ్యాయామాలు, గర్భిణీ స్త్రీలు , వృద్ధుల కోసం ప్రత్యేక కదలికలతో కూడిన గైడ్‌లైన్స్‌ను ఇందులో చేర్చారు.




యోగా అనేది కేవలం భారతదేశ సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదని, ఆధునిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఉద్ఘాటించారు. ఈ విధానం ద్వారా ప్రతి పౌరుడు తమ ఆరోగ్యంపై తామే నియంత్రణ సాధించవచ్చని, తద్వారా దీర్ఘకాలంలో దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కనీస ఖర్చుతో పాఠశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో ఈ ప్రోటోకాల్స్‌ను అమలు చేయవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, యోగాను ఒక కాలానుగుణ అభ్యాసం నుండి నిత్యకృత్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను ఒక సంపూర్ణ ఆరోగ్య పరిష్కారంగా ప్రచారం చేయడంలో భారత్ తన అగ్రగామి పాత్రను మరోసారి చాటుకుంది.





వాంఖడేలో ‘హిట్‌మ్యాన్’ సునామీ.


  • 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం!
  •  రోహిత్, రికిల్టన్ మెరుపు హాఫ్ సెంచరీలతో భారీ లక్ష్యం ఛేదన!


ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ఉన్న ఒక వింతైన రికార్డుకు ఎట్టకేలకు తెరపడింది. గత 13 సీజన్లుగా తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోతున్న ముంబై జట్టు, ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే (19.1 ఓవర్లలో) 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన వింటేజ్ ఆటతీరుతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించారు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసిన రోహిత్, తన ట్రేడ్ మార్క్ ‘కవర్ డ్రైవ్స్’, ‘పుల్ షాట్స్’తో ప్రేక్షకులకు కనువిందు చేశారు.



మరోవైపు ఓపెనర్ రయన్ రికిల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్న ఆయన, 43 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో 81 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్-రికిల్టన్ జోడీ మొదటి వికెట్‌కు కేవలం 72 బంతుల్లోనే 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబైని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టారు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 నాటౌట్), నమన్ ధీర్ (5 నాటౌట్) సంయమనంతో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే 40 బంతుల్లో 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అంగ్‌క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 51 పరుగులతో మెరిశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి కోల్‌కతా జోరుకు అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా 250 పరుగుల మైలురాయిని అందుకోలేకపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తమ వేటను విజయంతో మొదలుపెట్టింది.

రష్యా చమురు ఆదాయానికి భారీ గండి


  • ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో కీలక పోర్టు ధ్వంసం!

లెనిన్‌గ్రాడ్/కీవ్: రష్యా ఆర్థిక మూలాలపై ఉక్రెయిన్ మరోసారి విరుచుకుపడింది. రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలకమైన ఉస్త్-లుగా (Ust-Luga) నౌకాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు విధ్వంసం సృష్టించాయి. వారం వ్యవధిలోనే రెండోసారి జరిగిన ఈ దాడితో రష్యా ఇంధన ఎగుమతులకు భారీ ఆటంకం ఏర్పడింది.గత వారం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంత మేర దెబ్బతినడంతో ఇప్పటికే ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా ఆదివారం మరోసారి ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. లెనిన్‌గ్రాడ్ ప్రాంత గవర్నర్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. తాము సుమారు 31 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించారు.



  • ఉస్త్-లుగా పోర్టు ప్రాధాన్యం

బాల్టిక్ సముద్ర ప్రాంతంలో రష్యాకు ఇది అత్యంత వ్యూహాత్మకమైన కేంద్రం. సముద్ర మార్గంలో రష్యా చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో 45% వరకు ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. ఇక్కడి నుండి రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది.రష్యా నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా చేసే కీలక పోర్టుల్లో ఇది కూడా ఒకటి.


  • రష్యా ఆర్థిక వ్యవస్థపై గురి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో, రష్యా తన లోటు బడ్జెట్‌ను పూరించుకోవాలని భావించింది. అయితే ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా ఇంధన పరిశ్రమనే లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం ఈ నెలలోనే ఇంధన సంస్థలపై 10 భారీ దాడులు జరిగాయి. గత వారం సర్టోవ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారంపై కూడా దాడులు జరిగాయి.తమ సుదీర్ఘ శ్రేణి డ్రోన్లు రష్యా అంతర్భాగంలోకి వెళ్లి తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా యుద్ధం కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు


  • పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. తన 132వ ‘మన్‌ కీ బాత్‌’ (Mann Ki Baat) కార్యక్రమంలో భాగంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సాగిస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.



  • ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు

గత నెల రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని ప్రధాని పేర్కొన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, ఈ యుద్ధాలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఇంధన సరఫరా కేంద్రాల్లో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తిందని గుర్తుచేశారు.


  • ప్రవాస భారతీయుల భద్రత

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అండగా నిలుస్తున్న ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు.


  • రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారం

ఈ సంక్షోభాన్ని కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మోదీ హెచ్చరించారు. "ఇది 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారు పద్ధతి మార్చుకోవాలని, ప్రజలు కేవలం ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Featured post

హేట్ స్పీచ్ బిల్లు ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్

అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎల్పీ నేత ధ్వజం బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ హైదరాబాద్‌: తెలంగాణ...