Sunday, 29 March 2026

వ్యాధి చికిత్స నుంచి నివారణ దిశగా భారత్ అడుగులు

 

  •  జీవనశైలి జబ్బులపై యుద్ధానికి కేంద్రం ‘యోగాస్త్రం’
  • మధుమేహం, రక్తపోటు నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు
  • చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కొత్త యోగా ప్రోటోకాల్స్


దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అసంక్రమిత వ్యాధుల (NCDs) భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చికిత్స కంటే నివారణే మిన్న అనే నినాదంతో, వివిధ అనారోగ్య సమస్యలు , నిర్దిష్ట వయస్సు గల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన "యోగా ప్రోటోకాల్‌"ను కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఈ నెలలో జరిగిన యోగా మహోత్సవ్ 2026లో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ శాస్త్రీయ నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో దాదాపు మూడింట రెండు వంతులు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, మానసిక రుగ్మతల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో, ఈ యోగా ప్రోటోకాల్ ఒక కీలకమైన ముందడుగుగా నిలవనుంది.



ఈ నూతన విధానం ప్రకారం, ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాల పాటు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం , విశ్రాంతి పద్ధతులను కలిపి ఒక క్రమపద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా, శాస్త్రీయ ఆధారాలతో కూడిన క్లినికల్ మాడ్యూల్ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా వివరించారు. ఉదాహరణకు, మధుమేహం ఉన్నవారికి మెటబాలిక్ బ్యాలెన్స్ మెరుగుపరిచేలా, రక్తపోటు ఉన్నవారికి నరాల వ్యవస్థను శాంతపరిచేలా,  ఆస్తమా రోగులకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేలా ఈ ప్రోటోకాల్స్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. చిన్నపిల్లల కోసం సరదాగా ఉండే యోగా పద్ధతులు, కౌమార దశలో ఉన్నవారికి మానసిక ప్రశాంతతనిచ్చే వ్యాయామాలు, గర్భిణీ స్త్రీలు , వృద్ధుల కోసం ప్రత్యేక కదలికలతో కూడిన గైడ్‌లైన్స్‌ను ఇందులో చేర్చారు.




యోగా అనేది కేవలం భారతదేశ సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదని, ఆధునిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఉద్ఘాటించారు. ఈ విధానం ద్వారా ప్రతి పౌరుడు తమ ఆరోగ్యంపై తామే నియంత్రణ సాధించవచ్చని, తద్వారా దీర్ఘకాలంలో దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కనీస ఖర్చుతో పాఠశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో ఈ ప్రోటోకాల్స్‌ను అమలు చేయవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, యోగాను ఒక కాలానుగుణ అభ్యాసం నుండి నిత్యకృత్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను ఒక సంపూర్ణ ఆరోగ్య పరిష్కారంగా ప్రచారం చేయడంలో భారత్ తన అగ్రగామి పాత్రను మరోసారి చాటుకుంది.





వాంఖడేలో ‘హిట్‌మ్యాన్’ సునామీ.


  • 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం!
  •  రోహిత్, రికిల్టన్ మెరుపు హాఫ్ సెంచరీలతో భారీ లక్ష్యం ఛేదన!


ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ఉన్న ఒక వింతైన రికార్డుకు ఎట్టకేలకు తెరపడింది. గత 13 సీజన్లుగా తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోతున్న ముంబై జట్టు, ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే (19.1 ఓవర్లలో) 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన వింటేజ్ ఆటతీరుతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించారు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసిన రోహిత్, తన ట్రేడ్ మార్క్ ‘కవర్ డ్రైవ్స్’, ‘పుల్ షాట్స్’తో ప్రేక్షకులకు కనువిందు చేశారు.



మరోవైపు ఓపెనర్ రయన్ రికిల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్న ఆయన, 43 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో 81 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్-రికిల్టన్ జోడీ మొదటి వికెట్‌కు కేవలం 72 బంతుల్లోనే 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబైని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టారు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 నాటౌట్), నమన్ ధీర్ (5 నాటౌట్) సంయమనంతో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే 40 బంతుల్లో 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అంగ్‌క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 51 పరుగులతో మెరిశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి కోల్‌కతా జోరుకు అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా 250 పరుగుల మైలురాయిని అందుకోలేకపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తమ వేటను విజయంతో మొదలుపెట్టింది.

రష్యా చమురు ఆదాయానికి భారీ గండి


  • ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో కీలక పోర్టు ధ్వంసం!

లెనిన్‌గ్రాడ్/కీవ్: రష్యా ఆర్థిక మూలాలపై ఉక్రెయిన్ మరోసారి విరుచుకుపడింది. రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలకమైన ఉస్త్-లుగా (Ust-Luga) నౌకాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు విధ్వంసం సృష్టించాయి. వారం వ్యవధిలోనే రెండోసారి జరిగిన ఈ దాడితో రష్యా ఇంధన ఎగుమతులకు భారీ ఆటంకం ఏర్పడింది.గత వారం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంత మేర దెబ్బతినడంతో ఇప్పటికే ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా ఆదివారం మరోసారి ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. లెనిన్‌గ్రాడ్ ప్రాంత గవర్నర్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. తాము సుమారు 31 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించారు.



  • ఉస్త్-లుగా పోర్టు ప్రాధాన్యం

బాల్టిక్ సముద్ర ప్రాంతంలో రష్యాకు ఇది అత్యంత వ్యూహాత్మకమైన కేంద్రం. సముద్ర మార్గంలో రష్యా చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో 45% వరకు ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. ఇక్కడి నుండి రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది.రష్యా నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా చేసే కీలక పోర్టుల్లో ఇది కూడా ఒకటి.


  • రష్యా ఆర్థిక వ్యవస్థపై గురి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో, రష్యా తన లోటు బడ్జెట్‌ను పూరించుకోవాలని భావించింది. అయితే ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా ఇంధన పరిశ్రమనే లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం ఈ నెలలోనే ఇంధన సంస్థలపై 10 భారీ దాడులు జరిగాయి. గత వారం సర్టోవ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారంపై కూడా దాడులు జరిగాయి.తమ సుదీర్ఘ శ్రేణి డ్రోన్లు రష్యా అంతర్భాగంలోకి వెళ్లి తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా యుద్ధం కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు


  • పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. తన 132వ ‘మన్‌ కీ బాత్‌’ (Mann Ki Baat) కార్యక్రమంలో భాగంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సాగిస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.



  • ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు

గత నెల రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని ప్రధాని పేర్కొన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, ఈ యుద్ధాలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఇంధన సరఫరా కేంద్రాల్లో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తిందని గుర్తుచేశారు.


  • ప్రవాస భారతీయుల భద్రత

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అండగా నిలుస్తున్న ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు.


  • రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారం

ఈ సంక్షోభాన్ని కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మోదీ హెచ్చరించారు. "ఇది 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారు పద్ధతి మార్చుకోవాలని, ప్రజలు కేవలం ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

అమెరికాకు కోలుకోలేని దెబ్బ : ఇరాన్ దాడిలో 'అవాక్స్' నిఘా విమానం ధ్వంసం!

 


అమెరికాకు కోలుకోలేని దెబ్బ

ఇరాన్ దాడిలో 'అవాక్స్' నిఘా విమానం ధ్వంసం!

రియాద్/వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి షాక్ తగిలింది. యుద్ధ రంగంలో అమెరికా దళాలకు 'కళ్లు, చెవుల' వంటి కీలకమైన ఈ3-సెంట్రీ (E-3 Sentry AWACS) నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు ధ్వంసం చేశాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జరిగిన దాడిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రముఖ పత్రిక 'వాల్‌స్ట్రీట్ జర్నల్' వెల్లడించింది.


ఏమిటీ ఈ3-సెంట్రీ? ఎందుకంత కీలకం?

ఈ విమానం సాధారణ యుద్ధ విమానం కాదు. బోయింగ్-707 మోడల్‌ను అధునాతనంగా మార్చి, ఆకాశంలోనే ఒక కమాండ్ సెంటర్ లాగా దీనిని రూపొందించారు. దీని ప్రత్యేకతలు ఏమిటంటే.. 250 మైళ్ల పరిధిలో శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాల కదలికలను ఇట్టే పసిగడుతుంది. గగనతల దాడులను పర్యవేక్షించడంలోనూ, అమెరికా యుద్ధ విమానాలకు దిశానిర్దేశం చేయడంలోనూ ఇది అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఈ విమానం కోల్పోవడం వల్ల గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నిఘా సామర్థ్యం దెబ్బతింటుందని ఎయిర్ ఫోర్స్ కర్నల్ జాన్ వెనబల్ ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్: అమెరికాకు గుండెకాయ

సౌదీలోని ఈ ఎయిర్ బేస్ నుంచే ఇరాన్ వైపు వెళ్లే విమానాలకు ఇంధనం నింపడం, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడం వంటి కీలక ఆపరేషన్లు జరుగుతాయి. ఈ కేంద్రంపైనే ఇరాన్ దాడి చేయడంతో అమెరికా రక్షణ వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి.


యుద్ధ క్షేత్రంలో తాజా పరిస్థితి

ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 303 మంది అమెరికా సైనికులు గాయపడగా, వారిలో 273 మంది కోలుకుని తిరిగి విధుల్లో చేరారు.

పరిస్థితి విషమిస్తుండటంతో అమెరికా 3,500 మంది మెరైన్లను పశ్చిమాసియాకు తరలించింది.యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ (USS Tripoli) నేడు సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరుకుంది. దీంతో అమెరికా ఇక నేరుగా భూతల దాడులకు (Ground Operations) దిగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

యుద్ధం వద్దంటూ.. అమెరికా వ్యాప్తంగా 'ట్రంప్' వ్యతిరేక సెగలు



వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై అగ్రరాజ్యంతో పాటు ఐరోపా దేశాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. "యుద్ధం వద్దు.. శాంతి ముద్దు" అనే నినాదంతో లక్షలాదిమంది రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

  • 50 రాష్ట్రాలు.. 3,200 కార్యక్రమాలు

ట్రంప్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో సుమారు 3,200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలు నిరసనకారులతో కిక్కిరిసిపోయాయి. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అతిపెద్ద ఆందోళనలుగా వీటిని అమెరికా మీడియా అభివర్ణిస్తోంది.

  • ప్రధాన డిమాండ్లు ఇవే

నిరసనకారులు ప్రధానంగా మూడు అంశాలపై గళమెత్తారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రను తీవ్రంగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛకు విఘాతం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వలస విధానాలపై ట్రంప్ కఠిన వైఖరిని ఎండగట్టారు.

  • ఉద్రిక్త పరిస్థితులు.. టియర్ గ్యాస్ ప్రయోగం

ఈ ఆందోళనలకు మిన్నెసోటా కేంద్ర బిందువుగా మారింది. సెయింట్ పాల్‌లో జరిగిన భారీ ర్యాలీపై స్పందించిన గవర్నర్ టిమ్ వాల్జ్, ఇవి ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పాయి. లాస్‌ ఏంజెలెస్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు వస్తువులను విసిరివేయడంతో భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. డల్లాస్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

  • ఖండ ఖండాలూ దాటిన నిరసన

ఈ వ్యతిరేకత కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ఐరోపాలోని ప్రముఖ నగరాలైన లండన్, ప్యారిస్, రోమ్ లలో కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు, ఈ ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని రిపబ్లికన్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

Saturday, 28 March 2026

ఐపీఎల్ లో 'కింగ్' కోహ్లీ విశ్వరూపం


  • విరాట్ కెరీర్‌లో టాప్-5 చిరస్మరణీయ సీజన్లు ఇవే
  • 2016 పరుగుల సునామీ నుంచి నేటి వరకు అప్రతిహత ప్రస్థానం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు వినబడగానే పరుగుల వరద గుర్తొస్తుంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఆడుతూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ కెరీర్‌లో ఐదు సీజన్లు అత్యంత కీలకంగా నిలిచాయి. వీటిలో 2016 సీజన్ క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరువలేనిది. ఆ ఏడాది కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 973 పరుగులు సాధించి ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్లపై ఆయన బాదిన శతకాలు ఇప్పటికీ అభిమానుల కళ్లముందే కదలాడుతుంటాయి. ముఖ్యంగా వేళ్లకు గాయమైనా పట్టువదలకుండా పంజాబ్‌పై చేసిన సెంచరీ ఆయన అంకితభావానికి నిదర్శనం.



కోహ్లీ ప్రస్థానంలో 2024 సీజన్ మరో మైలురాయిగా నిలిచింది. ఆ సీజన్‌లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్న విరాట్, తనలోని మునుపటి దూకుడును మళ్లీ ప్రపంచానికి చాటిచెప్పాడు. స్ట్రైక్ రేట్ విషయంలో వస్తున్న విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానమిస్తూ ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే 2013 సీజన్ కూడా కోహ్లీ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. ఆ ఏడాది మొదటిసారిగా ఒకే సీజన్‌లో 600 పరుగుల మార్కును దాటి (634 పరుగులు) లీగ్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా తన ముద్ర వేశాడు. ఆ సీజన్‌లోనే ఆయన నాయకత్వ పటిమ కూడా వెలుగులోకి వచ్చింది.



2018 - 2023 సీజన్లు కూడా కోహ్లీ పరుగుల వేటలో అగ్రస్థానంలో ఉన్నాయి. 2018లో జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ ఒంటిచేత్తో పోరాడి 530 పరుగులు సాధించగా, 2023లో వరుసగా రెండు సెంచరీలు బాది 639 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఈ ఐదు సీజన్ల గణాంకాలను పరిశీలిస్తే కోహ్లీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా ఎదిగాడో అర్థమవుతుంది. ప్రతి సీజన్‌లోనూ తన ఆటను మెరుగుపరుచుకుంటూ, ఫిట్‌నెస్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న కోహ్లీ, 2026 సీజన్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ ఉన్నంత కాలం కోహ్లీ సృష్టించిన ఈ పరుగుల రికార్డులు అజేయంగా నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Featured post

వ్యాధి చికిత్స నుంచి నివారణ దిశగా భారత్ అడుగులు

   జీవనశైలి జబ్బులపై యుద్ధానికి కేంద్రం ‘యోగాస్త్రం’ మధుమేహం, రక్తపోటు నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కొత...