Monday, 13 April 2026

మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు

  • మా పోర్టులకు ముప్పు వాటిల్లితే
  • మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు
  • ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా ఐఆర్‌జీసీ హెచ్చరిక
  • మళ్ళీ నిలిచిపోయిన నౌకల రాకపోకలు 
  • సోమవారం నుంచే దిగ్భంధం అమల్లోకి వచ్చిందన్న అమెరికా
  • హార్ముజ్‌ సెగతో వణుకుతున్న ప్రపంచ దేశాలు


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్‌ జలసంధిపై దిగ్బంధం విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ అత్యంత శక్తివంతమైన హెచ్చరికను జారీ చేసింది. పశ్చిమాసియాలోని నౌకాశ్రయాల భద్రత అనేది "అందరికీ ఉండాలి లేదా ఎవరికీ ఉండకూడదు" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే, పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ పోర్ట్ కూడా సురక్షితంగా ఉండబోదని ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా హెచ్చరించింది. తమ ప్రాంతీయ జలాల్లో సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించడం ఇరాన్ జాతీయ హక్కు అని, శత్రు దేశాలకు చెందిన ఏ నౌకనూ ఈ మార్గం గుండా వెళ్లనివ్వబోమని టెహ్రాన్ తేల్చి చెప్పింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇది ఒక రకమైన సముద్రపు దొంగతనమని ఇరాన్ మండిపడింది.



ఇరాన్‌ ఆదాయాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ట్రంప్‌ వ్యూహం

మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దిగ్బంధం సోమవారం సాయంత్రం నుంచే అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఇరాన్ ఓడరేవులకు వచ్చే , అక్కడి నుంచి వెళ్లే అన్ని దేశాల నౌకలను అడ్డుకుంటామని అమెరికా సైన్యం వెల్లడించింది. అయితే, ఇరాన్ యేతర పోర్టుల మధ్య ప్రయాణించే నౌకలకు జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొనడం ద్వారా తన పాత నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి  'డార్క్' ట్రాన్సిట్‌ల ద్వారా ఇరాన్ మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోందని, ఆ ఆదాయాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ట్రంప్ ఈ దిగ్బంధం వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.


చమురు ధరలను మరింత పెరిగే అవకాశం

పాకిస్తాన్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా మారింది. అణు కార్యక్రమాన్ని వదులుకోవాలన్న అమెరికా నిబంధనలను ఇరాన్ తిరస్కరించగా, తమపై జరిగిన దాడులకు నష్టపరిహారం చెల్లించాలని, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పట్టుబట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో, తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో పునరుద్ధరించబడిన పరిమిత నౌకల రాకపోకలు మళ్ళీ నిలిచిపోయాయి. యుద్ధానికి ముందు రోజుకు 135 వరకు ఉండే నౌకల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. ఈ తాజా ప్రతిష్టంభన ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను మరింత పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sunday, 12 April 2026

అమెరికా గొంతెమ్మ కోర్కెల వల్లే చర్చలు విఫలం


  • ఇరాన్ ఘాటు విమర్శలు

ఇరాన్ , అమెరికా మధ్య పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో పాకిస్తాన్‌లో జరిగిన చరిత్రాత్మక చర్చలు ఎటువంటి ముగింపు లేకుండానే ముగిశాయి. 21 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ చర్చల ప్రతిష్ఠంభనకు అమెరికా చేస్తున్న "అహేతుకమైన డిమాండ్లే" కారణమని ఇరాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇరాన్ ప్రజల జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రతినిధి బృందం అనేక చొరవలు చూపినప్పటికీ, అమెరికా పక్షం అంగీకరించలేని షరతులు విధించడంతో చర్చల్లో పురోగతి లేకుండాపోయిందని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా స్పష్టం చేసింది. అయితే, మొదటి సమావేశంలోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదురుతుందని ఎవరూ ఆశించలేదని, ప్రాంతీయ మిత్రదేశాల సహకారంతో సంప్రదింపులు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.



మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఈ చర్చల వైఫల్యం ఇరాన్‌కే పెద్ద నష్టమని హెచ్చరించారు. అణు ఆయుధాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ నుంచి కచ్చితమైన హామీని తాము ఆశించామని, కానీ వారు అందుకు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సాధించలేని రాయితీలను, ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై నియంత్రణను, అణు సామగ్రి తొలగింపును చర్చల ద్వారా సాధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఆరోపించింది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో జరిగిన ఈ ప్రత్యక్ష చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగియడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.


గత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడి చేయడంతో మొదలైన ఈ యుద్ధం, వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరగగా, ఈ మంగళవారం డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ విరామ సమయంలో శాంతిని నెలకొల్పేందుకు జె.డి. వాన్స్, జారెడ్ కుష్నర్ వంటి హేమాహేమీలతో కూడిన అమెరికా బృందం, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ గాలీబాఫ్‌తో నేరుగా చర్చలు జరిపినప్పటికీ, అమెరికా విధించిన "రెడ్ లైన్స్" , ఇరాన్ పట్టుదల కారణంగా చర్చలు అసంపూర్తిగా మిగిలాయి. అమెరికా తమ చివరి ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచి వెనుదిరగడంతో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

మేం ఇచ్చింది చివరి, అత్యుత్తమ ప్రతిపాదన

 




  • ఇరాన్‌తో చర్చల విఫలంపై జె.డి. వాన్స్ కుండబద్దలు

పాకిస్తాన్ వేదికగా ఇరాన్‌తో జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఆదివారం ప్రకటించారు. తాము అత్యంత పారదర్శకంగా తమ పరిమితులను (రెడ్ లైన్స్), అలాగే ఏయే విషయాల్లో వెనక్కి తగ్గుతామో స్పష్టంగా వివరించినప్పటికీ, ఇరాన్ తమ షరతులను ఆమోదించలేదని ఆయన వెల్లడించారు. ఈ చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. చర్చల వివరాలను బహిర్గతం చేయడానికి నిరాకరించిన వాన్స్, ప్రధానంగా ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయబోమని దీర్ఘకాలికంగా రాతపూర్వక హామీ ఇవ్వకపోవడమే ఈ ప్రతిష్ఠంభనకు కారణమని స్పష్టం చేశారు.


ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు తాము ఎంతో సద్భావనతో, సరళమైన వైఖరితో చర్చలకు వచ్చామని వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని ఇప్పటికే దెబ్బతీశామని, అయితే వారు భవిష్యత్తులో అణు బాంబు తయారీకి ప్రయత్నించబోమని కచ్చితమైన నిబద్ధతను చాటుకోలేదని విమర్శించారు. స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అనేక అంశాలు చర్చకు వచ్చినప్పటికీ, అమెరికా విధించిన నిబంధనలకు ఇరాన్ లొంగలేదన్నారు. చర్చల సమయంలో తాము నిరంతరం అధ్యక్షుడు ట్రంప్, జాతీయ భద్రతా బృందంతో సంప్రదింపులు జరిపామని, ఇప్పుడు తమ బృందం అమెరికాకు తిరిగి వెళ్తోందని చెప్పారు. తాము ఇరాన్ ముందు ఉంచింది "చివరి, అత్యుత్తమ ప్రతిపాదన" అని, దానిని ఆమోదించాలా లేదా అనేది ఇప్పుడు ఇరాన్ ఇష్టమని ఆయన తేల్చి చెప్పారు.

ఇస్లామాబాద్ చర్చలు విఫలం


  • అమెరికా షరతులకు ఇరాన్ నో
  • సందిగ్ధంలో పశ్చిమాసియా శాంతి

పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించే లక్ష్యంతో పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. శనివారం దాదాపు 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ప్రకటించారు. తాము అత్యుత్తమమైన , చివరి ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచామని, కానీ వారు దానికి అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. చర్చలు విఫలం కావడం ఇరాన్‌కు "చెడ్డ వార్త" అని వ్యాఖ్యానించిన వాన్స్, తమ బృందం ఇస్లామాబాద్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా అణు ఆయుధాల తయారీ అంశంపైనే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది.



ఈ చర్చల వైఫల్యానికి ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమమేనని అమెరికా ఆరోపిస్తోంది. భవిష్యత్తులో ఎప్పుడూ అణు ఆయుధాలను తయారు చేయబోమని, అందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయబోమని ఇరాన్ నుంచి స్పష్టమైన హామీని తాము కోరామని వాన్స్ తెలిపారు. అయితే దీర్ఘకాలికంగా అణు ఆయుధాలను వదులుకోవాలనే సంకల్పం ఇరాన్ ప్రతినిధుల్లో కనిపించలేదని ఆయన విమర్శించారు. ఇరాన్‌కు చెందిన అనేక అణు కేంద్రాన్ని ఇప్పటికే ధ్వంసం చేశామని, అయినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ వైఫల్యానికి అమెరికానే కారణమని ఆరోపించింది. అమెరికా ప్రతినిధులు గొంతెమ్మ కోర్కెలు, అహేతుకమైన డిమాండ్లు చేయడం వల్లే చర్చల్లో పురోగతి లేకుండా పోయిందని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.


ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చర్చలు విఫలమైతే మీ దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బి) ఏమిటన్న ప్రశ్నకు, తమకు ఎటువంటి బ్యాకప్ ప్లాన్ అవసరం లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ సైన్యం ఇప్పటికే ఓడిపోయిందని, వారి వద్ద క్షిపణులు, తయారీ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమ సైన్యం ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని, కాబట్టి చర్చలు కాకపోతే యుద్ధ క్షేత్రంలో తామే పైచేయి సాధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధి మూసివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలపై చర్చలు జరిగినప్పటికీ, అమెరికా విధించిన కఠిన షరతులకు ఇరాన్ లొంగకపోవడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి.

లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత

 



  • సంగీత ప్రపంచంలో తీరని లోటు

భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. తన విలక్షణమైన గొంతుతో ఎనిమిది దశాబ్దాల పాటు కోట్లాది మందిని అలరించిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో కన్నుమూశారు. శనివారం శ్వాసకోశ ఇన్ఫెక్షన్,  తీవ్ర నీరసంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ధృవీకరించారు. ఆమె పార్థివ దేహానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన ఆమె 93వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం సంగీత లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.



కేవలం పదేళ్ల ప్రాయంలోనే 'చలా చలా నవ్ బాలా' అనే మరాఠీ పాటతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆశా భోంస్లే, సుమారు 12 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆరంభంలో కేవలం వెస్ట్రన్, క్యాబరే పాటలకే ఆమె పరిమితమని భావించినా.. 'దిల్ చీజ్ క్యా హై' వంటి గజల్స్, 'తోరా మన్ దర్పణ్' వంటి శాస్త్రీయ గీతాలతో తనలోని అసమాన ప్రతిభను నిరూపించుకున్నారు. తన సోదరి, స్వరకోకిల లతా మంగేష్కర్‌తో పోటీ ఉందనే వార్తలు వచ్చినా, తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమని ఆమె తరచూ చెప్పేవారు. సంగీతాన్నే తన శ్వాసగా భావించే ఆశా, 90 ఏళ్ల వయసులోనూ దుబాయ్‌లో లైవ్ కన్సర్ట్ ఇచ్చి తనలోని ఎనర్జీ తగ్గలేదని చాటారు. ఇటీవలి 'తౌబా తౌబా' వంటి వైరల్ సాంగ్స్ వరకు మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకున్న అరుదైన కళాకారిణి ఆమె.



ఆశా భోంస్లే సినీ ప్రయాణం విజయవంతంగా సాగినా, వ్యక్తిగత జీవితంలో ఆమె అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 16 ఏళ్లకే గణపత్ రావు భోంస్లేతో వివాహం, ఆ తర్వాత విభేదాల వల్ల విడిపోవడం, ఆపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్‌తో వివాహం వంటి పరిణామాలు ఆమె జీవితంలో చోటుచేసుకున్నాయి. తన ముగ్గురు పిల్లలలో ఇద్దరిని (వర్ష, హేమంత్) కోల్పోయిన బాధను కూడా ఆమె అనుభవించారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. రెండు జాతీయ అవార్డులను అందుకున్న ఆమె, చివరిగా 2022లో 'లైఫ్స్ గుడ్' సినిమా కోసం పాట పాడారు. ఒక అద్భుతమైన స్వర ప్రస్థానం ముగిసినా, ఆమె పాడిన వేలాది పాటలు సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Friday, 10 April 2026

ఈ పోరాటం ఢిల్లీ వర్సెస్ తమిళనాడు


  • మాకు వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు చేతులు కలిపినా గెలవలేవన్న సీఎం స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన ప్రసంగాల్లో కేంద్రంపై దాడిని ఉధృతం చేశారు. ఈ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోరాటం కాదని, ఇది 'ఢిల్లీ వర్సెస్ తమిళనాడు' మధ్య జరుగుతున్న యుద్ధమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర హక్కుల కోసం, ద్రవిడ ఆత్మగౌరవం కోసం తాము చేస్తున్న ఈ పోరాటంలో ప్రజల మద్దతు తమకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని కుట్రలు పన్నినా తమిళనాడు ప్రజల మనసు గెలుచుకోవడం సాధ్యం కాదని, డీఎంకే నేతృత్వంలోని కూటమి చారిత్రక విజయం సాధించబోతోందని ఆయన స్పష్టం చేశారు.



తంజావూరులో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన స్టాలిన్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మెట్రో రైలు ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పథకాలను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం వడ్ల కొనుగోలు ధరను క్వింటాల్‌కు 3,500 రూపాయలకు పెంచుతామన్న తమ హామీని అడ్డుకోవాలని కేంద్రం చూస్తోందని, కానీ ఏ శక్తీ తమను ఆపలేదని ఆయన ధ్వజమెత్తారు. "స్టాలిన్ బతికున్నా లేకపోయినా, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాత్రం ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతాయి" అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు.


బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి తమిళనాడుపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని, అందుకు ఏఐఏడీఎంకే వంటి పార్టీలు వంతపాడుతున్నాయని స్టాలిన్ విమర్శించారు. ద్రవిడ సిద్ధాంతాలను తుడిచిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తమిళనాడు అంగీకరించబోదని ఆయన చెప్పారు. ఏప్రిల్ 23న జరగబోయే పోలింగ్‌లో ఓటర్లు  బీజేపీ దాని మిత్రపక్షాలకు తగిన బుద్ధి చెబుతారని, తమ 'ద్రవిడ మోడల్' పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మే 4న వెలువడే ఫలితాలు తమిళనాడు ఆత్మగౌరవాన్ని మరోసారి చాటిచెబుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సముద్ర గర్భం నుంచి క్షేమంగా ఒడ్డుకు

 

  • ఆర్టెమిస్-2 వ్యోమగాములకు వైద్య పరీక్షలు ప్రారంభం

చారిత్రక చంద్రయానాన్ని ముగించుకుని పసిఫిక్ మహాసముద్రంలో దిగిన ఆర్టెమిస్-2 వ్యోమగాములను నాసా, అమెరికా నౌకాదళ బృందాలు విజయవంతంగా ఓరియన్ క్యాప్సూల్ నుంచి బయటకు తీశాయి. శాన్ డియాగో తీరానికి సమీపంలో సముద్ర అలలపై తేలుతున్న నౌక నుంచి కమాండర్ రీడ్ వైజ్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్‌లను హెలికాప్టర్ల సహాయంతో సురక్షితంగా యుద్ధనౌక యూఎస్ఎస్ జాన్ పి. ముర్తా మీదికి చేరవేశారు. పది రోజుల పాటు గురుత్వాకర్షణ శక్తికి దూరంగా, లోతైన అంతరిక్షంలో గడిపి వచ్చిన ఈ నలుగురు వీరులకు నౌకపై ఉన్న వైద్య బృందం ఘనస్వాగతం పలికింది.



ప్రస్తుతం ఈ నలుగురు వ్యోమగాములకు యుద్ధనౌకలోనే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ కాలం అంతరిక్ష ప్రయాణం చేయడం వల్ల వారి శరీరాల్లో కలిగే మార్పులను, ముఖ్యంగా ఎముకల సాంద్రత, రక్త ప్రసరణలో వ్యత్యాసాలను నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పది రోజుల ప్రయాణంలో సుమారు ఏడు లక్షల మైళ్లు ప్రయాణించిన ఈ బృందం, భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నట్లు నాసా ప్రతినిధులు వెల్లడించారు.


వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం, వ్యోమగాములను విమానం ద్వారా హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించనున్నారు. అక్కడ వారు తమ కుటుంబసభ్యులను కలుసుకుంటారు. మరోవైపు, సముద్రంలో ఉన్న ఓరియన్ క్యాప్సూల్‌ను కూడా సురక్షితంగా రక్షక నౌకలోకి చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నౌకలోని సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారం భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపే 'ఆర్టెమిస్-3' మిషన్‌కు దిక్సూచిగా మారనుంది. పది రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తమ వీరులు క్షేమంగా తిరిగి రావడంతో నాసా నియంత్రణ కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి.

Featured post

మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు

మా పోర్టులకు ముప్పు వాటిల్లితే మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా ఐఆర్‌జీసీ హెచ్చరిక మళ్ళీ నిలి...