కాల్పుల విరమణ పొడిగింపు ప్రకటన వెలువడిన గంటల్లోనే లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
టెల్ అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దక్షిణ లెబనాన్పై విరుచుకుపడ్డాయి. శుక్రవారం ఉదయం దక్షిణ లెబనాన్లోని ఖిర్బెత్ సలామ్, తూలిన్ ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. తమ దళాలపై దాడులు చేసేందుకు హెజ్బొల్లాఈ భవనాలను వాడుకుంటోందని, అందుకే వీటిని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం స్పష్టం చేసింది.
అంతకుముందు గురువారం రాత్రి హెజ్బొల్లా జరిపిన రాకెట్ దాడులకు ప్రతిచర్యగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, వైట్ హౌస్లో ఇజ్రాయెల్ , లెబనాన్ ఉన్నతాధికారులతో చర్చల అనంతరం కాల్పుల విరమణ పొడిగింపుపై ట్రంప్ , వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. లెబనాన్ తనను తాను కాపాడుకోవడంలో అమెరికా తోడ్పడుతుందని, త్వరలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్లు అమెరికాలో పర్యటిస్తారని ట్రంప్ ప్రకటించారు. ఈ చారిత్రక ఒప్పందం కుదిరిన వెంటనే మళ్ళీ దాడులు జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం దక్షిణ లెబనాన్లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కాల్పులు ఆగడం లేదు. ఇజ్రాయెల్ తన సరిహద్దు భద్రత విషయంలో రాజీపడబోమని చెబుతుండగా, హెజ్బొల్లా తన ప్రతిఘటనను కొనసాగిస్తోంది. ఈ ఘర్షణల వల్ల ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అగ్రరాజ్యం చొరవతో కుదిరిన ఈ మూడు వారాల తాత్కాలిక విరామం ఎంతవరకు నిలుస్తుందోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. యుద్ధం మరింత ముదిరితే అది ఇంధన సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.