Friday, 1 May 2026

తగ్గనున్న వర్షపాతం

 

  • ముంచుకొస్తున్న నీటి గండం
  • భారతదేశానికి మరో హెచ్చరిక

జలమే జీవం.. నాగరికతలు వర్ధిల్లాలన్నా, అంతరించాలన్నా నీరే ప్రధాన కారణం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తొలి అంచనాలు దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 'ఎల్ నినో' (El Niño) ప్రభావం వల్ల ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ మాసంలో ప్రారంభం కానున్న ఈ ప్రభావం, జూలై నుంచి రుతుపవనాల రెండో అర్ధభాగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఐరోపా, ఆసియా ఖండాల్లో మంచు కవచం తక్కువగా ఉండటం, హిందూ మహాసముద్ర ద్విధ్రువం (IOD) వంటి అంశాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, మొత్తం మీద దేశవ్యాప్తంగా వర్షాలు ఆశించినస్థాయిలో ఉండకపోవచ్చని అంచనా.



ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సంరక్షణను ఒక విలాసంగా కాకుండా, మనుగడకు అత్యవసరమైన అవసరంగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో రెండు నుంచి ఏడేళ్లకు ఒకసారి సంభవించే 'ఎల్ నినో', ఇప్పుడు తక్కువ కాలవ్యవధిలోనే తరచుగా వస్తూ మరింత తీవ్రమవుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు కురిసినా అవి తక్కువ సమయంలో, ఒకేచోట భారీగా కురుస్తున్నాయి. దీనివల్ల నేల నీటిని పీల్చుకునే అవకాశం లేకపోగా, విలువైన పైపొర మట్టి కొట్టుకుపోతోంది. అందుకే పాతకాలపు పద్ధతులైన చెరువులు, కుంటల పునరుద్ధరణతో పాటు ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో కీలకం.


సింగపూర్ వంటి నగరాలు తమ నీటి అవసరాల్లో 40 శాతం వినియోగించిన నీటిని శుద్ధి చేసి తీర్చుకుంటుంటే, భారత్ కేవలం 3 శాతమే పునర్వినియోగం చేస్తోంది. 'వాటర్, నేచర్ అండ్ ప్రోగ్రెస్' వంటి పుస్తకాల్లో నిపుణులు సూచించినట్లుగా, 2035 నాటికి 100 శాతం మురుగునీటి శుద్ధి, 50 శాతం పునర్వినియోగం అనే లక్ష్యాలను మనం చేరుకోవాలి. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే నీటి వనరుల సంరక్షణ అనే పునాది బలంగా ఉండాలి. ప్రభుత్వాలు నాణ్యమైన నీటి సరఫరాపై ప్రజలతో బహిరంగంగా చర్చించి, సరైన ధరను నిర్ణయించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం సూచన మనకు మరో మేల్కొలుపు హెచ్చరిక అని, దీనిని మనం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీచర్‌ ట్రైనింగ్‌.. కొంతమంది దోస్తులు





స్కూల్‌ డేస్‌, కాలేజీ డేస్‌ లో చదువుకున్న రోజులు వేరు. వృత్తి విద్యా కోర్సుల చదువులు వేరు. ఎందుకంటే శిక్షణ కాలం పూర్తయ్యే లోపు డీఎస్సీ నోటిఫికేషన్‌ వస్తే జాబ్‌ కొట్టుకుంటే జీవితంలో సెట్‌ అవ్వొచ్చనే ఆలోచనే ఎక్కువమందిలో ఉంటుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇప్పటికీ టీచర్‌ జాబ్‌ అంటే క్రేజ్‌. 2004 లో బహుశా మా బ్యాచ్‌తోనే మొదలు అనుకుంటా. ప్రభుత్వం బీఎడ్‌ నుంచి లాంగ్వేజేఎస్‌ లను వేరు చేసి ఎల్పీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  డిగ్రీ చదివే సమయంలోనే అప్పటికే మద్యమ పూర్తి చేసిన నేను మా బంధువు పద్మ సూచన మేరకు ఎల్పీ సెట్‌ రాసిన. అప్పుడు ఆమె  ఎంట్రెన్స్‌ టెస్ట్‌ లో క్వాలీఫై అయితేనే ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. సరే చూద్దామని రాసిన. మంచి ర్యాంకే వచ్చింది. మా ఏరియాలో అప్పటికే బీఎడ్‌ కోసం ప్రిపరేషన్‌ చేస్తున్నవాళ్లు, సీటు కోసం సీరియస్‌ గా ప్రయత్నాలు చేస్తున్నవాళ్లు ఉన్నారు. వాళ్లెవరికీ బీఎడ్‌ లో మంచి ర్యాంకు రాలేదు. సీటు వచ్చే అవకాశాలు కనిపించలేదు. కానీ నాకు వచ్చిన ర్యాంక్‌ తో నాకు ఏకంగా నౌకరే వచ్చినట్టు ప్రచారం జరిగింది. నా వరకు మాత్రం ఇంటర్‌ , డిగ్రీలో లెక్కనే ఉంటుంది అనుకున్నాను. హిందీ పరిజ్ఞానం అంతంత మాత్రమే.  గోదావరిఖని నుంచి పెద్దపల్లి రోజూ అప్‌ అండ్‌ డౌన్‌. శ్రీవాణి హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కాలేజీ. గోదావరిఖని నుంచి నేను, నవీన్‌ , రజిత.  మొదటి నాలుగైదు రోజులు పెద్దగా పలకరింపులు లేవు. ఆ కాలేజీలో క్లర్క్‌ సునీల్‌ మా అన్న క్లాస్‌మేట్‌. ఆయన తప్పా నాకు ఎవరూ తెలియదు. ట్రైనింగ్‌ అంటే ఆడుతూ పాడుతూ అయిపోతుంది అనుకున్నాను. కానీ చంద్రమణి సార్‌ చూసిన తర్వాత నాకే చాలామందికి శిక్షణ కాదు పెద్ద శిక్ష అనిపించింది.  చదువుడు కంటే రాయడమే ఎక్కువ. సక్కగా డిగ్రీ పూర్తి చేసుకుని ఏ ఎంబీఏ పూర్తి చేసి మంచి ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్‌ చేసుకుంటే సరిపోయేది అప్పుడప్పుడు అనిపించేది.




కానీ కొంత కాలం గడిచిన తర్వాత చాలామంది కనెక్ట్‌ అయ్యారు. ఫస్ట్‌ శ్రావణ్‌ బాగా దోస్త్‌ అయ్యాడు. మా బ్యాక్‌ బెంచ్‌లో హమీద్‌ పాషా, భిక్షపతి, బలరాం, విజయానంద్‌, విజయ్‌, ఆనంద్‌, నరేశ్‌...మాదంతా వేరే లోకం. క్లాస్‌ లు మాతో పాటు అప్పటికే టీచర్‌ ఉద్యోగం పొందిన (అన్‌ట్రైన్‌డ్‌ టీచర్లు ఉండేవారు). ఉన్నవాళ్లలో ఎక్కువమంది వరంగల్‌ నుంచి వచ్చేవారు. మధ్యాహ్నం ట్రైన్‌కు వాళ్లంతా వెళ్లిపోతే క్లాస్‌ సగం కంటే ఎక్కువ ఖాళీ అయ్యేది. నవీన్‌, రత్నం, సతీశ్‌, అశోక్‌, భిక్షపతి, శ్రీనివాస్‌, రమేశ్‌, పొట్టి రాజు అంతా ట్రైన్‌లో వచ్చేవారు. కానీ వారిలో నవీన్‌, భిక్షపతి మాతో  కనెక్ట్‌ అయ్యారు. నిజానికి కోర్సు పూర్తయ్యేవరకు నవీన్‌ పెద్దగా ఎక్కడా బైటపడేవాడు కాదు. వాడి ఆలోచనలన్నీ నా లెక్కనే టీచర్‌ ఉద్యోగం కంటే వేరే వృత్తి మాత్రమే మనకు సెట్‌ అవుతుంది అన్నట్టు ఉండేది వాడి వైఖరి. ఇట్లా కొన్నిరోజులు గడవగానే... అసలు కథ మొదలైంది. నెల రోజులు టీచింగ్‌ ప్రాక్టిస్‌ వేర్వేరు స్కూళ్లలో వేశారు. రోజూ కలిసి ఉండే బ్యాచ్‌ లను విడదీసి 7-8 మంది చొప్పున వేర్వేరు చోట్ల స్కూళ్లకు పంపించారు.


మేము వెళ్లిన పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చారిత్రక నేపథ్యం ఉన్నది. మాజీ ప్రధాని పీవీ మొదలు ప్రముఖ రాజకీయ నాయకులకు ఆ స్కూల్‌ వేదిక. అక్కడ శ్రీనివాస్‌ సార్‌ మాకు ఇన్‌ ఛార్జి. అప్పటికే వేరే కాలేజీ నుంచి వచ్చిన తెలుగు పండిట్‌ వాళ్లు ఉన్నారు. మేము కలిపితే దాదాపు 15 మంది దాకా ఉంటాం. మా టీచింగ్‌ ప్రాక్టీస్‌ బ్యాచ్లో  నవీన్‌, శ్రీనివాస్‌, రత్నం, నాతో పాటు సంగీతా భాయ్‌, అస్రా భానూ, రంజిత ఉన్నారు.  మేము హిందీ, వాళ్లు తెలుగు మాత్రమే చెప్పాలి. దానికి రోజూ లెస్సన్‌ ప్లాన్‌ రాయాలి. దానికి అనుగుణంగా చదువు చెప్పాలి. నిజానికి అట్లా చదువు చెప్తే ఎవడికీ పాఠం అర్థం కాదు. కానీ అదో నిబంధన మాత్రమే. అయితే మాలో మిగితా వారి సంగతి నాకు పెద్దగా తెలియదు. కానీ నవీన్‌ అప్పటికే మాథ్స్‌ టీచర్‌. నాకు కొంత ఇంగ్లీష్‌ మీద అవగాహన ఉన్నది. దీంతో మా పిల్లలకు గ్రామర్‌ చెప్పాలని అడిగితే నేను టీచింగ్‌ ప్రాక్టీస్‌ పీరియడ్‌ అంతా నాకు తెలినంత వరకు చెప్పిన. నా పని ఏదో నేను చూసుకునే వాడిని. మిగతా వారి గురించి పెద్దగా ఆలోచించకపోయేవాడిని. ఎందుకంటే వాళ్లంతా పెద్దవాళ్లు. అందుకే మనకు ఎందుకులే అనుకునేవాడిని.  కానీ ఆ నెలరోజుల్లో అందరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. అభిప్రాయాలు షేర్‌ చేసుకున్నాం. 


మళ్లీ యథావిధిగా కాలేజీ వచ్చాక వేర్వేరు చోట్ల టీచింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన వాళ్ల అనుభవాలు చెప్తే వాళ్లందరితో పోలిస్తే మేము చేసిన చోట చాలా ప్రజాస్వామిక వాతావరణం ఉన్నది అనిపించింది. చూస్తుండగానే ఫైనల్‌ పరీక్షలు వచ్చాయి. పరీక్షలు పూర్తి చేస్తే ట్రైనింగ్‌ పూర్తవుతుంది. అయితే అప్పటివరకు చాలా స్ట్రిక్ట్‌ గా ఉన్న చంద్రమణి సార్‌ మొదటిసారి ఒకరికొకరు సాయం చేసుకోవాలని సూచించారు. ఏమి రాసినా మీకు ఇచ్చిన పేపర్లు నింపాలన్నారు. నిజానికి అతడి వల్లనే మంచి హిందీ వచ్చింది. పరీక్షలు అయిపోయాయి. చివరిరోజు అందరం కాలేజీ వచ్చాక ఫేర్‌వెల్‌ అన్‌ట్రైన్‌డ్ వాళ్లు ఫెయిల్‌ అవుతాము కావొచ్చు అని ఒకరిద్దు ఏడ్చారు. దీంతో కాలేజీ కరస్పాండెంట్‌ సత్యనారాయణ కోపంతో ఏదో అన్నట్టు గుర్తు. దీంతో చివరి రోజు  పెద్దగా హడావుడి లేకుండానే ముగిసింది. అప్పటికి మొబైల్‌ లు పెద్దగా లేవు. చాలామంది ఏవో తీసుకొచ్చి అందులో అందరి హాబీస్‌, వేరే వేరే అంశాలపై ఉన్న ప్రశ్నల బుక్ నింపమని ఇచ్చారు. ఏదో రాసినం. అక్కడితో అయిపోయింది. 


మళ్లీ పెద్దగా ఎవరిని కలువ లేదు. డీఎస్సీ నోటిఫికేషన్‌ రావడంతో ఉమ్మడి కరీంనగర్‌ లో పరీక్ష రాయడానికి వచ్చిన చాలామంది సెంటర్లలో బస్‌ స్టేషన్‌లో కలిశారు. ఆ టైంలోనే అనుకుంటా సతీశ్‌, స్వర్ణ, రజిత ఇంకా ఇద్దరు ముగ్గురికి జాబ్‌ వచ్చింది. మా బ్యాక్‌ బెంచ్‌ దోస్తులు ఫోన్‌ ద్వారా మళ్లీ కనెక్ట్‌ అయ్యారు. అప్పుడుప్పుడు కలిసేవాళ్లం. సోషల్‌ మీడియా వల్ల ముఖ్యంగా ఫేస్‌ బుక్‌ వల్ల ఇంకా కొంతమంది టచ్‌ లోకి వచ్చారు. ఓ వాట్సప్‌ గ్రూప్‌ కూడా పెట్టాం. అప్పుడప్పుడు అందులో మాట్లాడుకుంటాం. స్కూల్‌, కాలేజీ దోస్లులు వేరు. కానీ ట్రైనింగ్‌ సమయంలో పరిచయం అయిన వారు చాలాకాలం పాటు ట్రావెల్‌ కావడం చాలా అరుదు. కానీ దాదాపు 15మంది వరకు ఇప్పటికీ టచ్‌ లోనే ఉన్నాం. కుదిరినప్పుడు కలుస్తుంటాం. అప్పటి ఫన్నీ విషయాలు గుర్తుతెచ్చుకుని నవ్వుకుంటాం. మనమంతా మళ్లీ ఒకసారి కలువాలి. రీ యూనియన్‌ కోసం ప్లాన్‌ చేయమని అంటుంటారు. ఇప్పుడంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాలం కదా.  కానీ ఈ బిజీ ప్రపంచంలో ఒకరోజు టైం ఇవ్వడం అంత ఈజీ కాదు. పైగా దాదాపు రెండు దశాబ్దాలు అయిపోయాయి. కానీ కలిసే అవకాశం వస్తే చాలామంది రావొచ్చు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ అందరిలో చాలా మార్పులు వచ్చాయి. మనుషులను కాదు పేర్లు చెబితే చాలు అన్నట్టు ఉంటుంది ఎక్కుమంది పరిస్థితి. చూద్దాం. ఈ ప్రోగ్రామ్‌ కార్యరూపం దాల్చాలంటే ముందుగా పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి? అందరిని ఎవరు సమన్వయం చేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలువాలన్నది సమాధానం లేదని ప్రశ్నలు. కానీ రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆనాటి జ్ఞాపకాల దొంతరలు కళ్లముందు కదలాడుతుంటాయి. 

Thursday, 30 April 2026

శత్రువులకు గుండెపోటు ఖాయం

 

  • ట్రంప్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన వేళ.. ఇరాన్ 'రహస్య ఆయుధ' హెచ్చరిక

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో ఇరాన్ తన స్వరాన్ని మరింత పెంచింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ, అణు కార్యక్రమంపై స్పష్టత వచ్చే వరకు నౌకా దళ దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ నౌకాదళ కమాండర్ తీవ్రస్థాయిలో స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భయపడేలా అతి త్వరలోనే ఒక సరికొత్త ఆయుధాన్ని యుద్ధ క్షేత్రంలోకి ప్రవేశపెట్టబోతున్నామని, అది చూసి శత్రువులకు 'గుండెపోటు' రావడం ఖాయమని ఇరాన్ నేవీ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ హెచ్చరించారు. ఆ ఆయుధం ఇప్పటికే శత్రు దళాలకు అత్యంత సమీపంలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తిస్తోంది.



ఆర్థిక ఒత్తిడి ద్వారా తమను చర్చల కు తీసుకురావచ్చని ట్రంప్ భావించడం హాస్యాస్పదమని, మిలిటరీ అకాడమీల్లో ఇదొక జోక్‌గా మారిందని ఇరానీ ఎద్దేవా చేశారు. అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌక 'అబ్రహం లింకన్' పై ఇరాన్ దళాలు ఇప్పటికే కనీసం ఏడుసార్లు క్షిపణి దాడులు నిర్వహించాయని, దీనివల్ల కొంతకాలం పాటు ఆ నౌక నుండి విమానాలను నడపడం అమెరికాకు సాధ్యం కాలేదని ఆయన వెల్లడించారు. అమెరికా తమ నౌకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడాన్ని 'సొమాలియా సముద్ర దొంగల' చర్యల కంటే ఘోరమైనదిగా ఆయన అభివర్ణించారు. సొమాలియా దొంగలు పేదరికం వల్ల అలా చేస్తే, అమెరికన్లు మాత్రం సిబ్బందిని, వారి కుటుంబాలను బందీలుగా పట్టుకుని అంతకంటే నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.


మరోవైపు, ఇరాన్ తన అణ్వాయుధ తయారీ దిశగా సాగిస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. బాంబు దాడుల కంటే ఈ ఆర్థిక దిగ్బంధమే ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని, వారు అణ్వాయుధాలను కలిగి ఉండటానికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. అణు చర్చలను వాయిదా వేస్తూ, కేవలం దిగ్బంధాన్ని ఎత్తివేయాలని ఇరాన్ చేసిన ప్రతిపాదనలో అర్థం లేదని వాషింగ్టన్ అభిప్రాయపడుతోంది. ఇరాన్ మాత్రం యుద్ధంలో చనిపోయిన తమ పౌరుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని, శత్రువులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా బలమైన దెబ్బ కొడతామని ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మీ చట్టాలను మార్చండి


  • గర్భం దాల్చిన మైనర్ బాధితురాలి విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక

న్యూఢిల్లీ: లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలిక విషయంలో సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో తామిచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం క్యురేటివ్ పిటిషన్ వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. మహిళలు తమ శరీరంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని, వారి వ్యక్తిగత నిర్ణయాలను ప్రభుత్వం గౌరవించాలని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.  



ముఖ్యంగా, అత్యాచారం వంటి కేసుల్లో గర్భ విచ్ఛిన్నానికి కాలపరిమితి ఉండకూడదని, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు రావాలని కోర్టు సూచించింది. "అత్యాచారం వల్ల కలిగే వేదనను ఏదీ భర్తీ చేయలేదు. పౌరుల నిర్ణయాలను గౌరవించడం నేర్చుకోండి" అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ఐశ్వర్య భాటిని మందలించారు. కోర్టు ఉత్తర్వులను సవాలు చేసే హక్కు బాధితురాలికి లేదా ఆమె కుటుంబానికి మాత్రమే ఉంటుందని, ప్రభుత్వానికి కాదని ఆయన తేల్చి చెప్పారు.  


జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ స్పందిస్తూ, "మేము వ్యక్తిగత ఎంపికలను గౌరవిస్తాము, మీరు కూడా అలాగే చేయాలి" అని పేర్కొన్నారు. ఒకవేళ బాధితురాలి మానసిక ఆరోగ్యం ప్రమాదంలో ఉంటే, ఆ నిర్ణయం ఆమె కుటుంబానికే వదిలేయాలని, దీనిని ప్రభుత్వం , పౌరుల మధ్య పోరాటంగా మార్చవద్దని హితవు పలికారు. అంతకుముందు ప్రభుత్వం తరపున వాదిస్తూ ఐశ్వర్య భాటి, 31 వారాల దశలో గర్భ విచ్ఛిన్నం సాధ్యం కాదని, అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి , మైనర్ తల్లికి ప్రాణాపాయమని వాదించారు. బిడ్డను ప్రసవించి దత్తతకు ఇవ్వడమే సరైన మార్గమని ఆమె పేర్కొన్నారు.  అయితే, 15 ఏళ్ల బాలిక ప్రతి నిమిషం అనుభవిస్తున్న నరకాన్ని ఊహించాలని, ఆ గర్భం ఆమెకు ఇష్టం లేనిదని కోర్టు గుర్తుచేసింది. ఒక చిన్నారి , పిండం మధ్య పోరాటం వస్తే, ఆ చిన్నారి గౌరవంగా జీవించే హక్కుకే ప్రాధాన్యం ఇవ్వాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం అవసరమైనప్పుడు కఠినంగా ఉండాలని, బాధితురాలి ఆశయాలను, కలలను చిదిమేసి ఆమెను బలవంతంగా తల్లిని చేయలేమని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన ఆ బాలికను బలవంతం చేయడం ఆమె జీవించే హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. 

Wednesday, 29 April 2026

ఒపెక్ నుంచి యూఏఈ ఔట్‌


  • చమురు మార్కెట్‌పై దీని ప్రభావం తక్షణమే ఉంటుందా? 
  • విశ్లేషకులు ఏమంటున్నారు!

అబుదాబీ: ప్రపంచ చమురు మార్కెట్‌లో 'ఒపెక్' (OPEC) కూటమి గుత్తాధిపత్యానికి గండి కొడుతూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ నిష్క్రమణ వల్ల చమురు సరఫరా ,ధరలపై తక్షణ ప్రభావం కంటే దీర్ఘకాలిక ప్రభావమే ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి దిగ్బంధానికి గురవ్వడం వల్ల చమురు రవాణా ఇప్పటికే స్తంభించిపోయింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడి, ధరలు ఇప్పటికే బ్యారెల్‌కు 110-120 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇటువంటి సమయంలో యూఏఈ కూటమి నుంచి బయటకు వచ్చినప్పటికీ, రవాణా మార్గాలు మూసుకుపోయి ఉండటంతో ఆ దేశం తన పెంచిన ఉత్పత్తిని మార్కెట్లోకి వెంటనే పంపలేదు. అందువల్ల, స్వల్పకాలంలో ధరలు తగ్గడం కంటే మార్కెట్‌లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  



దీర్ఘకాలికంగా చూస్తే, యూఏఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్ స్వరూపాన్ని మార్చేయవచ్చు.  

సరఫరా పెరుగుదల: ఒపెక్ కోటాల నుంచి విముక్తి లభించడంతో, యూఏఈ తన ఉత్పత్తిని 2027 నాటికి రోజుకు 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మార్కెట్లోకి అదనపు చమురును చేర్చి, ధరలు క్రమంగా 5 నుంచి 10 డాలర్ల వరకు తగ్గడానికి దోహదపడవచ్చు. 

 ఒపెక్ పట్టు సడలింపు: ఉత్పత్తి , ధరలను నియంత్రించే ఒపెక్ శక్తి ఈ నిష్క్రమణతో గణనీయంగా తగ్గుతుంది. ఇది ఉత్పత్తి దేశాల మధ్య పోటీని పెంచి, ధరలు మరింత సరళతరం కావడానికి దారితీస్తుంది. 


భారత్‌కు మేలు: చమురును అధికంగా దిగుమతి చేసుకునే భారత్ వంటి దేశాలకు ఇది శుభవార్త. పెరిగిన సరఫరా వల్ల భవిష్యత్తులో దిగుమతి బిల్లులు తగ్గి, దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.  


మొత్తానికి, యూఏఈ నిర్ణయం చమురు మార్కెట్‌లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. తక్షణమే చమురు ధరలు పతనం కాకపోయినా, యుద్ధ మేఘాలు తొలగి రవాణా పునరుద్ధరించబడిన తర్వాత యూఏఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ఎగ్జిట్ పోల్స్ 2026: బెంగాల్‌లో నువ్వా-నేనా

  • కేరళలో కాంగ్రెస్ వైపు మొగ్గు
  • తమిళనాట విజయ్ సంచలనం




న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.దీంతో వెలువడిన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తికరమైన ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం.. రెండు పార్టీలు దాదాపు 145 స్థానాల వద్ద సమంగా నిలిచే అవకాశం ఉందని అంచనా. పీ-మార్క్ వంటి సంస్థలు బీజేపీకి 150-175 స్థానాలతో మెజారిటీని ఇస్తుండగా, పీపుల్స్ పల్స్ మాత్రం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకే 177-187 స్థానాలతో అధికారాన్ని కట్టబెట్టింది. దీంతో బెంగాల్ పీఠం ఎవరిదనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  

అటు కేరళలో పదేళ్ల ఎల్డీఎఫ్ (LDF) పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) తిరిగి పుంజుకోనుందని దాదాపు అన్ని సర్వేలు ఏకగ్రీవంగా పేర్కొన్నాయి. యాక్సిస్ మై ఇండియా యూడీఎఫ్‌కు 78-90 స్థానాలను అంచనా వేసింది. ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. అయితే, రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన నటుడు విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో భారీ ప్రభావాన్ని చూపుతారని, కొన్ని సర్వేల ప్రకారం ఆయన పార్టీ ఏకంగా 98-120 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని అంచనా వేయడం విశేషం.  


ఈశాన్య రాష్ట్రం అసోంలో మాత్రం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యతతో మూడోసారి అధికారాన్ని దక్కించుకోబోతోందని సర్వేలు వెల్లడించాయి. ఎన్డీయే కూటమికి 88-100 స్థానాలు రావచ్చని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్డీయే కూటమికే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. మే 4వ తేదీన వెలువడే అధికారిక ఫలితాలతో ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తేలనున్నది.  

హార్ముజ్ దిగ్బంధంపై వెనక్కి తగ్గేది లేదు


  • ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్
  • ‘అణు విముక్త ఒప్పందం’ జరిగే వరకు ఆంక్షలు తప్పవని హెచ్చరిక

వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ పట్ల అమెరికా తన కఠిన వైఖరిని మరింత పెంచింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, చర్చలకు సిద్ధమని ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇరాన్ తన అణ్వాయుధ ఆకాంక్షలను పూర్తిగా విడనాడి, అమెరికా ఆందోళనలను పరిష్కరించే వరకు నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దిగ్బంధాన్ని ‘జీనియస్’ , ‘వంద శాతం ఫూల్‌ప్రూఫ్’ వ్యూహంగా అభివర్ణించిన ట్రంప్, ఇది ఇరాన్ పైన అత్యుత్తమ ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. 



ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం మరింత ముదిరింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్లు దాటి రికార్డుస్థాయికి చేరుకుంది. ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ మునుపెన్నడూ లేని విధంగా కనిష్టస్థాయికి పడిపోయింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఈ దిగ్బంధాన్ని తమ దేశాన్ని లోపలి నుంచి బలహీనపరిచే ‘కొత్త కుట్ర’గా అభివర్ణించారు. ఇరాన్ తనను తాను ‘కుప్పకూలే స్థితి’లో ఉందని అంగీకరించిందని ట్రంప్ పేర్కొనగా, ఇరాన్ ఆ వ్యాఖ్యలను ‘ప్రచార ఆర్భాటం’గా కొట్టిపారేసింది.  


మరోవైపు, ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రాణనష్టం సంభవిస్తోంది. రష్యా మధ్యవర్తిత్వం వహించేందుకు మొగ్గు చూపుతుండగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాస్కోలో పర్యటించి మద్దతు కోరుతున్నారు. కాగా, యూఏఈ ‘ఒపెక్’ నుంచి వైదొలగడం ప్రపంచ చమురు మార్కెట్‌లో పెను మార్పులకు సంకేతంగా మారింది. అటు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ సైతం ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనే అమెరికా వైఖరితో ఏకీభవించినట్లు ట్రంప్ వెల్లడించారు. 

Featured post

తగ్గనున్న వర్షపాతం

  ముంచుకొస్తున్న నీటి గండం భారతదేశానికి మరో హెచ్చరిక జలమే జీవం.. నాగరికతలు వర్ధిల్లాలన్నా, అంతరించాలన్నా నీరే ప్రధాన కారణం. ఈ ఏడాది నైరుతి ర...