Sunday, 5 July 2026

తెలంగాణలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం



హైదరాబాద్:రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనించాలని అధికారులు సూచించారు.




దక్షిణ భారత కానోయీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు ఘనత



  •  ఓవరాల్ ఛాంపియన్లుగా సబ్ జూనియర్ బాలికలు


విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగిన అస్మిత సౌత్ జోన్ కానోయీ స్ప్రింట్ ఛాంపియన్‌షిప్‌ (Canoeing Sprint Championship) లో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. సబ్ జూనియర్ బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయిలు సంచలన ప్రదర్శనతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో తెలంగాణ జట్టు మొత్తం 3 బంగారు, 3 వెండి, 7 కాంస్య పతకాలతో కలిపి 13 పతకాలు సాధించింది. అద్భుత విజయం సాధించిన క్రీడాకారిణులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి ప్రత్యేకంగా అభినందించారు.



ప్రపంచ జూనోసెస్ దినోత్సవం



  • జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహనకు పిలుపు


న్యూఢిల్లీ / హైదరాబాద్: జంతువులు, పక్షుల నుండి మనుషులకు సంక్రమించే జూనోటిక్ (Zoonotic) వ్యాధుల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సోమవారం ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఫ్రెంచ్ ప్రసిద్ధ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 జూలై 6న మానవునికి మొట్టమొదటి సారిగా రేబీస్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా అందించిన చరిత్రాత్మక సంఘటనకు గుర్తుగా ఏటా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అంటువ్యాధులలో సుమారు 60 శాతం, కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధులలో 75 శాతం జంతువుల ద్వారానే మనుషులకు వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తున్న తరుణంలో ఈ రోజు ప్రాధాన్యం సంతరించుకుంది.



తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి అడుగు



  • ఓయూ విద్యార్థి జేఏసీతో కేశవరావు భేటీ


హైదరాబాద్:తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలోని కమిటీ.. ఉస్మానియా యూనివర్సిటీ (OU) విద్యార్థి జేఏసి నాయకులతో తొలి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమం కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై ఓయూ జేఏసీ నేతల నుండి కమిటీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను సేకరించింది.



కాళేశ్వరం పేరుతో ప్రజాధనం వృథా



  • బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు


హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారీ ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎలాంటి నైతిక హక్కు లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టు వైఫల్యాలపై వాస్తవాలు ప్రజలందరికీ తెలుసని, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే విపక్షాలు బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.



ఓటరు జాబితా సవరణపై భట్టి దిశానిర్దేశం



  • ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి


హైదరాబాద్: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కాం

గ్రెస్ శ్రేణులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా క్షేత్రస్థాయిలో చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజాభవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అదే సమయంలో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ అగ్రనేతల ప్రతిజ్ఞ


  • శత్రువుల మెడలు వంచుతామంటూ ఆర్మీ చీఫ్ హెచ్చరిక
  • లీడర్ మరణానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ లను వదిలిపెట్టేది లేదని ప్రకటన
  •  టెహ్రాన్ వీధుల్లో ఉప్పెనలా ముంచెత్తిన లక్షలాది మంది ప్రజలు
  • భద్రతా కారణాలతో తండ్రి అంత్యక్రియలకు దూరంగా ఉన్న నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ!


ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ రాజకీయ, సైనిక అగ్రనాయకత్వం భావోద్వేగానికి లోనవడంతో పాటు శత్రుదేశాలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. ఖమేనీ చూపిన విప్లవాత్మక మార్గంలోనే తాము పయనిస్తామని శపథం చేసిన నేతలు.. ఆయన మరణానికి కారణమైన శక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వీడ్కోలు వేడుకల రెండవ రోజైన ఆదివారంనాడు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ఐఆర్ఐబీ (IRIB) తో మాట్లాడిన ఇరాన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ అమీర్ హతామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సుప్రీం లీడర్ మరణానికి కారణమైన వారి మెడలు వంచుతామని, వారిని కచ్చితంగా జవాబుదారీ చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ దళాలను పరోక్షంగా హెచ్చరించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కుద్స్ ఫోర్స్ డిప్యూటీ కోఆర్డినేటర్ బ్రిగేడియర్ జనరల్ ఇరాజ్ మస్జెడి మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు ఇస్లామిక్ వ్యవస్థ కోసం పోరాడిన అమరవీరుడైన తమ నాయకుడికి ఈ వీరమరణం కంటే దక్కాల్సిన పెద్ద బహుమతి మరొకటి లేదన్నారు.


ఇదే వేదికపై నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. అమర ఇమామ్ ఆశయాలను, ఆయన వారసత్వాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. కుద్స్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రెజా ఆరిఫ్ కూడా ఖమేనీ సేవలను కొనియాడారు. విప్లవ నేత ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు తమపై మరింత పెరిగిందని వారు పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 28 న జరిగిన అమెరికా-ఇశ్రాయేల్ దాడుల్లో అలీ ఖమేనీ , ఆయన కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. దీనివల్ల పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలం భీకర పోరు సాగింది. అయితే గత నెలలోనే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు హార్ముజ్ జలసంధి, అణు కార్యక్రమాలపై 60 రోజుల సాంకేతిక చర్చల కోసం ఒక అవగాహన ఒప్పందంకుదిరింది.



ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ లోని ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లా వద్ద శనివారం నుండి ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా, ఆదివారం నాటి బహిరంగ అంత్యక్రియల ప్రార్థనల కోసం టెహ్రాన్ వీధుల్లోకి లక్షలాది మంది ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారు. ఖమేనీ మరణానంతరం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌ గా నియమితులయ్యారు. అయితే, ఆయనను కూడా హతమారుస్తామంటూ ఇజ్రాయెల్ నుంచి వస్తున్న వరుస బెదిరింపులు, కఠినమైన భద్రతా కారణాల దృష్ట్యా.. టెహ్రాన్‌ లో ఆరు రోజుల పాటు జరిగే తన తండ్రి అంత్యక్రియల వేడుకలకు మొజ్తబా ఖమేనీ దూరంగా ఉంటున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా వెల్లడించింది.

Featured post

తెలంగాణలోని పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్:రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడ...