Tuesday, 12 May 2026

హార్ముజ్ జలసంధి పరిధిని పెంచిన ఇరాన్


  • 500 కిలోమీటర్ల మేర 'ఆపరేషనల్ జోన్'గా ప్రకటన
  • అంతర్జాతీయ నౌకాయానానికి ఐఆర్జీసీ కొత్త సవాల్



టెహ్రాన్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. ఈ జలసంధి భౌగోళిక పరిమితులను తాము పునర్నిర్వచించామని, ఇకపై దీనిని 500 కిలోమీటర్ల మేర 'క్రియాశీల కార్యకలాపాల జోన్'  గా పరిగణిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సంచలన ప్రకటన చేసింది. గతంతో పోలిస్తే ఈ జలసంధి పరిధి ఇప్పుడు మరింత విస్తరించిందని, ఈ ప్రాంతంలో జరిగే ప్రతి కదలికను తాము పర్యవేక్షిస్తామని ఐఆర్జీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో పర్షియన్ గల్ఫ్ , ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న వ్యూహాత్మక మార్గంపై ఇరాన్ తన పట్టును మరింత బిగించినట్లయింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యం , భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్త ముడిచమురులో మూడింట ఒక వంతు ఈ మార్గం గుండానే రవాణా అవుతుండటంతో, ఇరాన్ ప్రకటించిన ఈ 500 కిలోమీటర్ల జోన్ పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ ప్రాంతంలో సంచరించే విదేశీ యుద్ధ నౌకలు , వాణిజ్య నౌకలు తమ అనుమతి లేదా నిబంధనలకు లోబడి ఉండాలని ఇరాన్ పరోక్షంగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, హార్ముజ్ జలసంధిని ఒక ఆపరేషనల్ జోన్‌గా మార్చడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రహస్య దాడులు


  • పశ్చిమాసియా యుద్ధంలో యూఏఈ అనూహ్య అడుగుపై వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడి!



దుబాయ్‌:పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర యుద్ధం మధ్య ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.  కొన్ని నెలలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల తరుణంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ అత్యంత రహస్యంగా ఇరాన్ భూభాగంపై సైనిక దాడులు నిర్వహించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్  తన కథనంలో వెల్లడించింది. సాధారణంగా ఇటువంటి ప్రాంతీయ సంక్షోభాల్లో తటస్థంగా ఉండేందుకు లేదా దౌత్యపరమైన పరిష్కారాలకే మొగ్గుచూపే యూఏఈ, ఈసారి నేరుగా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల నుంచి తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే, ఎమిరేట్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రహస్య దాడులు ప్రధానంగా ఇరాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలు , సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు బహిరంగంగా ఇరాన్‌ను నేరుగా ఢీకొనడానికి వెనుకడుగు వేసిన అరబ్ దేశాలు, ఇప్పుడు తమ రక్షణ వ్యూహాలను మార్చుకున్నట్లు ఈ పరిణామం సూచిస్తోంది. అయితే ఈ దాడులపై యూఏఈ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న అగ్రరాజ్యాల మద్దతు కూడా ఈ చర్యల వెనుక ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో అటు గల్ఫ్ దేశాలకు, ఇటు ఇరాన్‌కు మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని, ఇది మొత్తం పశ్చిమ ఆసియాలో పెను రాజకీయ మార్పులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు


  • పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • సమగ్ర విచారణ జరిపే బాధ్యత సీబీఐకి అప్పగింత
  • తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న ఎన్‌టీఏ
  •  మళ్లీ పరీక్ష రానున్న సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు
  • పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
  • దేశానికి విష కాలంగా మోడీ అమృత కాలమని మండిపాటు
  • దేశవ్యాప్తంగా ఎన్‌ఎస్‌యూఐ భారీ నిరసనలు
  • విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్


మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా రద్దు చేసింది. రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పేపర్ లీక్ అయినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణలు, ప్రాథమిక విచారణలో వెల్లడైన ఆధారాల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకతను కాపాడేందుకు, లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ చర్య తప్పలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సీబీఐకి  అప్పగించింది.



పరీక్ష రద్దు కావడంతో దాదాపు 22.79 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. రద్దు చేసిన పరీక్షకు బదులుగా దేశవ్యాప్తంగా తిరిగి నిర్వహించే పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎటువంటి అదనపు రుసుము చెల్లించనక్కర్లేదని అధికారులు వివరించారు. పేపర్ లీక్ ఆరోపణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు రాజస్థాన్ ఎస్ వో జీ  తో పాటు ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో విద్యార్థులు మ,తల్లిదండ్రుల్లో కొంత ఊరట లభిస్తోంది. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది.



యువత భవిష్యత్తుతో ఆడుకోవడం నేరమని రాహుల్‌ ధ్వజం


నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకునే 'అమృత కాలం' దేశ యువతకు శాపంగా మారిందని, అది ఇప్పుడు 'విష కాలం'గా రూపాంతరం చెందిందని ఆయన విమర్శించారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, నీట్ పరీక్ష రద్దు కావడం కేవలం వైఫల్యం మాత్రమే కాదని, ఇది దేశ భవిష్యత్తు అయిన యువతపై జరిగిన నేరమని అభివర్ణించారు. ఈ అవినీతి బీజేపీ పాలనలో సుమారు 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, వారి తల్లిదండ్రుల త్యాగాలు , కలలు ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



నిజాయితీగా చదివే విద్యార్థులకు  శిక్ష 

లక్షలాది మంది విద్యార్థులు రాత్రనక పగలనక కష్టపడి చదివారని, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆభరణాలు అమ్ముకుని మరీ కోచింగ్ ఇప్పించారని రాహుల్ గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వారికి ప్రతిఫలంగా పేపర్ లీకులు, నిర్లక్ష్యం , వ్యవస్థీకృత అవినీతిని బహుమతిగా ఇచ్చిందని మండిపడ్డారు. దేశంలో 'పేపర్ మాఫియా' యథేచ్ఛగా తిరుగుతోందని, ప్రతిసారీ తప్పు చేసిన వారు తప్పించుకుంటుంటే, నిజాయితీగా చదివే విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడే తత్వానికి కాకుండా డబ్బుకు, పరపతికే విలువ ఉండేలా విద్యారంగాన్ని మార్చేశారని, దీనివల్ల విద్యా వ్యవస్థకే అర్థం లేకుండా పోతోందని విమర్శించారు.


ఈ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్

నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు మరోసారి తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆర్థిక భారాన్ని లోనవుతారని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న ఈ దారుణాలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  విద్యార్థుల పక్షాన తాము నిలబడతామని, ఈ అన్యాయంపై పోరాటం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.





 భగ్గుమన్న విద్యార్థి లోకం


నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ మంగళవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఢిల్లీలోని శాస్త్రి భవన్ ఎదుట పెద్ద సంఖ్యలో విద్యార్థులు, కార్యకర్తలు తరలివచ్చి విద్యాశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీక్ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు గళమెత్తారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా జైపూర్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో విద్యార్థులు రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన తమకు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం తీరని మానసిక వేదన కలిగిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ టీఏ పనితీరుపై నమ్మకం పోయిందని, ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎన్‌ఎస్‌యూఐ స్పష్టం చేసింది.

Monday, 11 May 2026

ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి ట్రంప్ సై


  • శాంతి చర్చలు విఫలం.. 'సీజ్‌ఫైర్'కు చావు తప్పదు
  • అగ్రరాజ్యం దూకుడుతో మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉత్కంఠ



మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు జరుగుతున్న శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పంపిన తాజా శాంతి ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, ఆ దేశంపై తిరిగి సైనిక చర్యలు చేపట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను "ఒక పనికిరాని కాగితం" (Piece of garbage) అని అభివర్ణించిన ట్రంప్, ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ (Ceasefire) 'లైఫ్ సపోర్ట్' మీద ఉందని, దానికి బతికే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మొండి వైఖరి వల్ల దౌత్యపరమైన చర్చలు స్తంభించిపోవడంతో, వైట్ హౌస్ మరియు పెంటగాన్ వర్గాలు ఇప్పుడు సైనిక దాడుల వైపు మొగ్గు చూపుతున్నాయి.


ముఖ్యంగా ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమంపై వెనక్కి తగ్గకపోవడం, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ప్రయత్నించడం ట్రంప్ యంత్రాంగాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇరాన్‌ను దౌత్యపరంగా దారికి తెచ్చేందుకు ఇచ్చిన సమయం ముగిసిందని భావిస్తున్న ట్రంప్, ఆ దేశ బలహీనతలను లక్ష్యంగా చేసుకుని లక్షిత దాడులు (Targeted Strikes) చేయాలని యోచిస్తున్నారు. అగ్రరాజ్యం తన యుద్ధ నౌకలను మళ్లీ హార్ముజ్ జలసంధిలోకి పంపి, ఇరాన్ విధించిన దిగ్బంధనాన్ని విచ్ఛిన్నం చేసే 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను పునఃప్రారంభించే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లకు పైగా పెరగడం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఆందోళన కలిగిస్తోంది.


మరోవైపు, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని , తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తేనే శాంతి సాధ్యమని పట్టుబడుతోంది. అయితే, ఇరాన్ ప్రతిపాదనలు ఏకపక్షంగా ఉన్నాయని అమెరికా తోసిపుచ్చింది. ఈ వారం చైనా పర్యటనకు వెళ్లనున్న ట్రంప్, ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేలా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపనున్నారు. ఒకవేళ దౌత్య మార్గాలు పూర్తిగా విఫలమైతే, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు దిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదా అన్న భయం ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

మధ్యప్రాచ్య శాంతి చర్చల్లో పాక్ 'ద్వంద్వ నీతి'


  • అమెరికా అనుమానం.. మధ్యవర్తిత్వంపై ట్రంప్ సర్కార్‌లో పెరుగుతున్న అసహనం!



మధ్యప్రాచ్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అమెరికా ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరుపుతున్నట్లు నటిస్తూనే, మరోవైపు ఇరాన్‌కు సహకరిస్తూ పాక్ 'ద్వంద్వ క్రీడ' ఆడుతోందని వాషింగ్టన్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను పాక్ అధికారులు అమెరికాకు చేరవేసినప్పటికీ, ఆ ప్రతిపాదనల తీరుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ ఇచ్చిన సమాధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అది కేవలం ఒక "చెత్త కాగితం" వంటిదని ట్రంప్ కొట్టిపారేయడం గమనార్హం.మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ సైనిక విమానాలకు పాకిస్థాన్ తన వైమానిక స్థావరాల్లో ఆశ్రయం కల్పించిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ యుద్ధ విమానాలను రక్షించేందుకు పాక్ ఈ రహస్య ఒప్పందానికి పాల్పడిందని తెలుస్తోంది. మధ్యవర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పాకిస్థాన్, ఇరాన్ వాదనలను అమెరికాకు అనుకూలంగా మార్చి చెబుతోందని, అసలు వాస్తవాలను దాచిపెడుతోందని సీఎన్ఎన్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌పై నమ్మకం కోల్పోతున్న ట్రంప్ యంత్రాంగం, శాంతి ప్రక్రియలో చైనా వంటి ఇతర దేశాల ప్రమేయంపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

తమిళనాట వైన్ షాపులపై సీఎం విజయ్ ఉక్కుపాదం


  • గుళ్లు, పాఠశాలలకు సమీపంలోని 717 టాస్మాక్ దుకాణాల మూసివేతకు  ఆదేశం



తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఒక భారీ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా మందిరాలతో పాటు విద్యా సంస్థలు , బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను (TASMAC) తక్షణమే మూసివేయాలని మంగళవారం అధికారులను ఆదేశించారు. రాబోయే రెండు వారాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన డెడ్ లైన్ విధించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు, మద్యం మహమ్మారి నుంచి సామాన్య ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను రక్షించడమే లక్ష్యంగా ఈ కీలక అడుగు వేశారు.విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత ప్రభుత్వాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయానికే ప్రాధాన్యం ఇచ్చాయని, కానీ తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం , సామాజిక భద్రతకే మొదటి స్థానం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,765 టాస్మాక్ దుకాణాల్లో ఈ 717 దుకాణాలను తొలగించడం ద్వారా తొలి దశలోనే భారీ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయం పట్ల మహిళా సంఘాలు , విద్యార్థి లోకం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కేవలం మద్యం నియంత్రణే కాకుండా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ , డ్రగ్స్ వ్యతిరేక విభాగాల ఏర్పాటు వంటి కీలక హామీల అమలుపై కూడా సీఎం విజయ్ వేగంగా దృష్టి సారిస్తున్నారు.

Sunday, 10 May 2026

హైదరాబాద్‌లో స్నేహపూర్వక భేటీ


  • ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లిన ప్రధాని మోడీ!








తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలను సందర్శించి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభ ముగిసిన అనంతరం, ప్రధాని నేరుగా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ప్రధానికి చంద్రబాబు కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనపై స్పందించిన చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోడీ తమ నివాసానికి రావడం తమ కుటుంబానికి దక్కిన గౌరవమని, ఆయన చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుండిపోతుందని 'ఎక్స్' వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


అనంతరం ప్రధాని మోడీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పవన్ కుటుంబ సభ్యుల సాదర స్వాగతం మధ్య ప్రధాని అక్కడ సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి స్వయంగా ఇంటికి వచ్చిన ప్రధానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, కూటమి ఐక్యతపై ఈ భేటీలు సానుకూల సంకేతాలను ఇచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని పర్యటనతో అటు అమరావతి, ఇటు హైదరాబాద్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Featured post

హార్ముజ్ జలసంధి పరిధిని పెంచిన ఇరాన్

500 కిలోమీటర్ల మేర 'ఆపరేషనల్ జోన్'గా ప్రకటన అంతర్జాతీయ నౌకాయానానికి ఐఆర్జీసీ కొత్త సవాల్ టెహ్రాన్‌: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక...