- అమెరికా-చైనా సదస్సు ఫోటోలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన
- 'మెరిటోక్రసీకి చరమగీతం' అంటూ గీతా గోపీనాథ్ సంచలన వ్యాఖ్యలు
బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలు సరికొత్త అంతర్జాతీయ వివాదానికి దారితీశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు అగ్రదేశాల మధ్య జరిగిన హై-స్టేక్స్ సమావేశంలో ఇరు దేశాల తరఫున ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేకపోవడం అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ సదస్సుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో, దౌత్య రంగంలో అత్యున్నతస్థాయిల్లో లింగ సమానత్వం , ప్రాతినిధ్యంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ, విమర్శలు మొదలయ్యాయి. కేవలం పురుషులు మాత్రమే నిండివున్న ఆ చర్చల గది ఫోటోలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ వ్యవహారంపై హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ ఫోటోలను చూస్తుంటే "మెరిటోక్రసీకి చరమగీతం పాడినట్లు (ప్రతిభకు విలువ లేనట్లు) ఒక పెయింటింగ్లా కనిపిస్తోందని" ఆమె అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల ప్రతినిధులు సమావేశమైతే చర్చల టేబుల్ వద్ద ఒక్క మహిళ కూడా లేకపోవడం ఘోరమన్నారు. అనంతరం ఆమె 'ది గార్డియన్' పత్రికతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు ఉన్నప్పటికీ, ఈ రెండు దేశాలు కేవలం ఒకే జెండర్ (పురుషుల) తో కూడిన బృందాలను ఎలా సిద్ధం చేశాయో అర్థం కావడం లేదని, ఇది అత్యంత విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. మీ ప్రతిభ కంటే మీకున్న నెట్వర్క్ మాత్రమే మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందనే పాత రోజుల్లోకి మనం మళ్లీ వెళ్తున్నామా అనే అనుమానం ఈ పరిణామం కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఫెమినిస్ట్ అండ్ జెండర్ స్టడీస్ అసోసియేట్ డైరెక్టర్ హలీమా కాజెమ్ కూడా గళమెత్తారు. ప్రపంచం ప్రగతి వైపు కాకుండా "వెనక్కి నడుస్తోందని" ఆమె విమర్శించారు. గతంలో ఒబామా హయాంలో జరిగిన అమెరికా-చైనా సదస్సులను ప్రస్తుత సదస్సుతో పోల్చుతూ.. నాటి చర్చల్లో హిల్లరీ క్లింటన్, సుసాన్ రైస్, లియు యాన్ డాంగ్ వంటి శక్తివంతమైన మహిళా నేతలు కీలకపాత్ర పోషించారని ఆమె గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని శాసించే ఏ ఒక్క సూపర్ పవర్ కూడా గ్లోబల్ పాలిటిక్స్ చర్చించే గదిలో మహిళలకు స్థానం ఉండాలని భావించడం లేదని ఆరోపించారు. ఈ వైఫల్యం కేవలం అమెరికాది మాత్రమే కాదని, అంతర్జాతీయ ఆర్డర్ను నిర్దేశించే విషయంలో మహిళల గొంతుకకు విలువ లేదనే సంకేతాన్ని ఇరుదేశాలు ఇచ్చాయని ఆమె విశ్లేషించారు. కేవలం పురుషులతోనే ఈ సదస్సును నిర్వహించడం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక రకమైన 'సైనిక , పురుషాధిక్య' గ్లోబల్ అథారిటీని ప్రదర్శించడానికి ప్రయత్నించారని ఆమె మండిపడ్డారు.
బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో జరిగిన అధికారిక ద్వైపాక్షిక చర్చల టేబుల్ వద్ద మహిళలకు చోటు దక్కనప్పటికీ.. ట్రంప్ వెంట చైనా పర్యటనకు వచ్చిన వారిలో కొందరు ప్రముఖ మహిళలు ఉన్నారు. వారిలో ట్రంప్ కోడలు లారా ట్రంప్, సిటీగ్రూప్ సీఈఓ జేన్ ఫ్రేజర్ మరియు మెటా ప్రెసిడెంట్ దినా పవెల్ మెక్కార్మిక్ వంటి వారు ఉన్నారు. అయినప్పటికీ, ప్రపంచ భవిష్యత్తును మార్చే ప్రధాన దౌత్య చర్చల నుండి మహిళలను పూర్తిగా దూరం పెట్టడం పట్ల అంతర్జాతీయంగా మహిళా సంఘాలు , మేధావుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
