- మంటల్లో విల్లాలు, నలుగురికి గాయాలు
- అప్రమత్తమైన యూఏఈ రక్షణ దళాలు
దుబాయ్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు పర్యాటక స్వర్గధామం దుబాయ్ను కూడా తాకాయి. శనివారం రాత్రి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు , డ్రోన్లను యూఏఈ రక్షణవ్యవస్థలు గగనతలంలోనే అడ్డుకున్నాయి. అయితే, ఈ క్రమంలో కూలిపోయిన క్షిపణి శకలాలు దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన 'పామ్ జుమేరా' ద్వీపంలోని నివాస ప్రాంతాలపై పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు నాలుగు విల్లాలు పాక్షికంగా దెబ్బతినగా, నలుగురు వ్యక్తులు గాయపడినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు.
ప్రమాదం జరిగిన వెంటనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. క్షిపణి శకలాలు పడటంతో ఒక విల్లా పూర్తిగా మంటల్లో చిక్కుకుంది, దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా పామ్ జుమేరా వైపు వెళ్లే రహదారులను తాత్కాలికంగా మూసివేసి, ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా - ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ క్షిపణి దాడులకు దిగిందని తెలుస్తోంది. యూఏఈ గగనతలంపైకి వచ్చిన ముప్పును తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విజయవంతంగా అడ్డుకున్నాయని, పౌరుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించింది. ఈ ఘటనతో దుబాయ్ , అబుదాబి అంతటా హై అలర్ట్ ప్రకటించారు. యుద్ధ ప్రభావం పౌర నివాస ప్రాంతాలపై పడటం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.