Sunday, 5 April 2026

అమెరికా 'రెస్క్యూ' డ్రామాపై ఇరాన్ ఫైర్

 




  • ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ అబద్ధాలాడుతున్నారని విమర్శ


అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమాన సిబ్బందిని ఇరాన్ భూభాగం నుంచి సురక్షితంగా రక్షించామన్న వాదనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న డ్రామా అని, యుద్ధంలో ఎదురైన పరాజయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ఎద్దేవా చేశారు. ఇరాన్ గడ్డపై ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరగలేదని, అమెరికా చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో అమెరికా బలగాలు ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.


మరోవైపు, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సైనిక, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయన్న వార్తలను కూడా బఘై ఖండించారు. ఇజ్రాయెల్ , అమెరికా ఉమ్మడిగా సాగిస్తున్న దుష్ప్రచారంలో ఇదొక భాగమని ఆయన విమర్శించారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని, శత్రువుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యం తమకుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా పదేపదే చేస్తున్న ఇటువంటి ప్రకటనలు కేవలం మానసిక యుద్ధంలో భాగమేనని, వాస్తవానికి ఇరాన్ రక్షణ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు.





Saturday, 4 April 2026

అమెరికా పైలట్ దొరికాడు

  •  ఇరాన్ గడ్డపై ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్


పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కూల్చివేసిన అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానంలో గల్లంతైన సిబ్బందిలో ఒకరు ప్రాణాలతో లభించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా అమెరికా జెట్ కూలిపోయిన తర్వాత, అందులోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ (WSO) సురక్షితంగా రక్షించబడినట్లు మాజీ అమెరికా ప్రత్యేక దళాల అధికారి, జర్నలిస్ట్ జాక్ మర్ఫీ వెల్లడించారు. శత్రువుల కళ్లుగప్పి అడవుల్లో తప్పించుకుంటూ తిరుగుతున్న సదరు అధికారిని, భారీ కాల్పుల మధ్య అమెరికా బలగాలు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి. ఇరాన్ దళాలు , స్థానిక గిరిజన తెగలు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్న తరుణంలో, అమెరికా నిర్వహించిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. అల్ జజీరా కథనం ప్రకారం, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో జరిగిన భీకర పోరాటం తర్వాతే ఆయన్ని రక్షించడం సాధ్యమైంది.



అయితే, ఈ రెస్క్యూ ఆపరేషన్ అంత సులభంగా ఏమీ సాగలేదు. గల్లంతైన అధికారిని పట్టుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించడంతో, స్థానిక బక్తియారీ తెగకు చెందిన సాయుధ గిరిజనులు పర్వత ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు జరుపుతున్న అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై వారు కాల్పులు జరిపినట్లు సమాచారం. గాలింపు చర్యల నేపథ్యంలో ఇరాన్, అమెరికా బలగాల మధ్య తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ ఇప్పటికే కూలిపోయిన విమాన శకలాలకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. ప్రస్తుతం రక్షించబడిన అధికారి సురక్షితంగా ఉన్నప్పటికీ, దీనిపై అమెరికా ప్రభుత్వం గానీ, పెంటగాన్ గానీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై స్పందిస్తూ, ప్రస్తుతానికి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు.


ఇరాన్, హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు


  •  కుప్పకూలిన సైనిక మౌలిక సదుపాయాలు


పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇరాన్ ,లెబనాన్ లక్ష్యంగా భారీ వైమానిక దాడులను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్‌లోని 200కు పైగా వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను, లెబనాన్‌లోని 140కి పైగా హెజ్‌బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)  దీర్ఘశ్రేణి ప్రహార సామర్థ్యాలను, రక్షణవ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ముఖ్యంగా ఇరాన్‌లోని ఆయుధ నిల్వ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ , అభివృద్ధి కేంద్రాలు, అలాగే వైమానిక రక్షణ వ్యవస్థలపై ఐడీఎఫ్ విరుచుకుపడింది.



మరోవైపు లెబనాన్‌లో హెజ్‌బొల్లాకు చెందిన శిక్షణ కేంద్రాలు, ఆయుధ గిడ్డంగులు, రాడ్వాన్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసి ఆ సంస్థ కమాండ్ స్ట్రక్చర్‌ను దెబ్బతీసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఈ దాడులపై స్పందిస్తూ.. ఇరాన్ పారిశ్రామికరంగానికి ఇది కోలుకోలేని దెబ్బ అని అభివర్ణించారు. ముఖ్యంగా ఇరాన్ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంలో 70 శాతం నాశనమైందని, దీనివల్ల ఐఆర్జీసీకి ఆయుధ తయారీకి అవసరమైన నిధులు, వనరులు అందకుండా పోతాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా సహకారంతో సాగుతున్న ఈ పోరాటంలో ఇరాన్ ఉగ్రవాద పాలనను అణచివేస్తామని, ఇజ్రాయెల్ మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని నెతన్యాహు తెలిపారు. ఉత్తర ప్రాంత పౌరుల రక్షణ కోసం హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.




ఇరాన్ సైనిక నాయకత్వం ఖతం


  • టెహ్రాన్‌పై అమెరికా ‘మెరుపు’ దాడి
  • వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డ ఆగ్రరాజ్య సేనలు
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటన

వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా దళాలు జరిపిన అత్యంత శక్తివంతమైన దాడిలో ఆ దేశ అగ్రశ్రేణి సైనిక నాయకత్వం అంతమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని కీలక సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని వందలాది క్షిపణులు, డ్రోన్లతో అమెరికా మెరుపు దాడులు నిర్వహించింది. ఈ భారీ ఆపరేషన్‌లో ఇరాన్ సైనిక యంత్రాంగాన్ని నడిపించే ప్రధాన కమాండర్లు హతమయ్యారని, దీంతో ఆ దేశ యుద్ధ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వైట్ హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా పౌరులు, ప్రయోజనాలపై ఇరాన్ చేస్తున్న దాడులకు ఇది తగిన సమాధానమని ఆయన స్పష్టం చేశారు.



ఈ దాడి ఎంత తీవ్రంగా జరిగిందంటే, టెహ్రాన్ నగరం అంతటా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, అనేక సైనిక భవనాలు నేలమట్టమయ్యాయని స్థానిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అమెరికా తన అత్యాధునిక స్టెల్త్ బాంబర్లు , సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ప్రయోగించడంతో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ సైన్యానికి వెన్నెముకగా ఉన్న సీనియర్ జనరల్స్ ఈ దాడుల సమయంలో ఒక రహస్య సమావేశంలో ఉన్నట్లు సమాచారం, సరిగ్గా అదే సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ క్షిపణి దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇరాన్ అంతర్గత భద్రతను , పశ్చిమాసియాలోని భౌగోళిక రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసింది.


అమెరికా చేసిన ఈ ప్రకటనపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించలేదు, కానీ టెహ్రాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి సరిహద్దులను మూసివేసింది. ఈ దాడితో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇప్పటికే రగులుతున్న యుద్ధ జ్వాలలకు ఈ ఘటన ఆజ్యం పోసినట్లయింది. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీయడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని చూస్తుండగా, ఇది మరింత పెద్ద ఎత్తున ప్రతికార దాడులకు దారితీయవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

క్షీణించినా తగ్గని పట్టు

 అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాలను ఇరాన్ ఎలా కూల్చివేసింది? 

రాడార్లను కాదని ఇన్ఫ్రారెడ్ సెన్సార్లతో వేటాడిన వైనం.. 

టెహ్రాన్ గగనతలంలో పతాక స్థాయికి చేరిన పోరు!

న్యూఢిల్లీ: గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికా గగనతల శక్తికి ఇరాన్ సవాలు విసిరింది. ఇరాన్ క్షిపణి , డ్రోన్ సామర్థ్యం పూర్తిగా నశించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే, అమెరికాకు చెందిన 'ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్' మరియు 'ఏ-10 వార్‌హాగ్' విమానాలు కూలిపోవడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణంగా అమెరికా , ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌కు చెందిన రాడార్ ఆధారిత రక్షణ వ్యవస్థలు ఇప్పటికే ధ్వంసమయ్యాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇరాన్ తన పాత పద్ధతులను వదిలి 'పాసివ్ సెన్సార్ల' (Electro-Optical/Infrared - EO/IR) పై ఆధారపడటం ఈ విజయానికి ప్రధాన కారణమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.




సాధారణంగా యుద్ధ విమానాలను గుర్తించడానికి రాడార్లు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి, కానీ వీటిని అమెరికన్ విమానాలు సులభంగా గుర్తించి తప్పించుకోగలవు. దీనికి భిన్నంగా ఇరాన్ ఉపయోగించిన ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలు ఎటువంటి తరంగాలను విడుదల చేయకుండా, కేవలం విమానం ఇంజిన్ నుండి వెలువడే వేడిని (Heat Signature) గుర్తిస్తాయి. ఈ పద్ధతిలో శత్రు విమానానికి తాము ట్రాక్ అవుతున్నామనే విషయం ముందే తెలియదు. ఇరాన్ వాడుతున్న 'ఏడి-08' (AD-08) వంటి క్షిపణులు 15 కిలోమీటర్ల దూరంలోని వేడిని పసిగట్టి, ధ్వని కంటే రెండు రెట్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగలవు. ఎఫ్-15 , ఏ-10 వంటి వేగవంతమైన విమానాలను కూల్చడం అత్యంత కష్టమైన పనైనప్పటికీ, పైలట్లు ఏమరపాటుగా ఉన్నప్పుడు లేదా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఇన్ఫ్రారెడ్ క్షిపణులు అత్యంత ప్రమాదకరంగా మారుతాయి.

ఏప్రిల్ 3న జరిగిన ఈ దాడులు అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి గట్టి హెచ్చరికగా నిలిచాయి. మార్చి నెలలో ఇప్పటికే అనేక ఇజ్రాయెల్ , అమెరికన్ డ్రోన్లను కూల్చివేసిన ఇరాన్, ఇప్పుడు ఏకంగా పైలట్లు ఉన్న యుద్ధ విమానాలను లక్ష్యం చేసుకోవడం గమనార్హం. అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కల ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు 13,000 మిషన్లను నిర్వహించి 12,300 లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేసినప్పటికీ, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎఫ్-15 కూలిపోవడం, గగనతలంపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందన్న వాదనలను సవాలు చేస్తోంది.


ఇరాన్ వేటాడిన విమానాలు/డ్రోన్ల జాబితా (2026 మార్చి - ఏప్రిల్)

తేదీవిమానం / డ్రోన్ రకంప్రాంతం
మార్చి మొదట్లోఇజ్రాయెల్ హెర్మెస్ 900 & ఐఏఐ ఈటన్ డ్రోన్లుఇస్ఫహాన్
మార్చి 13అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్బందర్ అబ్బాస్
మార్చి 28అమెరికా ఎంక్యూ-9 రీపర్ & ఇజ్రాయెల్ ఐఏఐ హెరాన్షిరాజ్ / హార్ముజ్
ఏప్రిల్ 2అమెరికా ఎంక్యూ-9 రీపర్ & ఇజ్రాయెల్ హెర్మెస్ 900షిరాజ్
ఏప్రిల్ 3యుఎస్ఏఎఫ్ ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ (కూల్చివేత)సెంట్రల్ ఇరాన్
ఏప్రిల్ 3యుఎస్ఏఎఫ్ ఏ-10 వార్‌హాగ్ (ప్రమాదం/కూల్చివేత)పర్షియన్ గల్ఫ్

ఇన్ఫ్రారెడ్ ట్రాకింగ్ ఎందుకు ప్రమాదకరం? రాడార్ వ్యవస్థలు టార్చ్‌లైట్ లాంటివి (అవి వెలుగుని ప్రసరిస్తాయి కాబట్టి సులభంగా కనిపిస్తాయి), కానీ ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలు చీకట్లో నక్కి చూసే కళ్ల వంటివి. అవి ఏ సంకేతాలను విడుదల చేయవు కాబట్టి, క్షిపణి అతి సమీపానికి వచ్చే వరకు పైలట్‌కు ముప్పు పొంచి ఉందనే విషయం తెలియదు.

Friday, 3 April 2026

శశి థరూర్ కాన్వాయ్‌పై దాడి


  • ఎంపీ భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఆందోళనకారులు
  • మలప్పురంలో ఎన్నికల ప్రచారం వేళ ఉద్రిక్తత.. ముగ్గురు నిందితుల అరెస్ట్!



మలప్పురం: కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కొందరు దుండగులు, ఆయన భద్రతా సిబ్బందిపై దాడికి దిగడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి మలప్పురం జిల్లా వండూర్ పరిధిలోని తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శశి థరూర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా, నిందితులు ఆయన వాహనాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ భద్రతా అధికారిపై భౌతిక దాడి జరగగా, కారు ముందు సీట్లో కూర్చున్న థరూర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై శనివారం ఉదయం శశి థరూర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తన భద్రతా సిబ్బంది క్షేమంగా ఉన్నారని, తనపై ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఆందోళనకర పరిస్థితులు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మిగిలిన రెండు కార్యక్రమాలను పూర్తి చేశామని, భవిష్యత్ ప్రచార కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. తన క్షేమం కోసం ఆరా తీసిన శ్రేయోభిలాషులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు వండూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారు వినియోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కలికావు ప్రాంతానికి చెందిన ఉమ్మరా అనే వ్యక్తిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 

అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా


  • పాకిస్తాన్ రాయబార ప్రయత్నాలు విఫలం
  • హార్ముజ్ జలసంధిపై పట్టుబట్టడమే చర్చల విచ్ఛిన్నానికి కారణమా?


ఇస్లామాబాద్/వాషింగ్టన్: అమెరికా , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్ నేతృత్వంలో జరిగిన దౌత్య ప్రయత్నాలు భారీ ఎదురుదెబ్బతిన్నాయి. ఇస్లామాబాద్‌లో అమెరికా అధికారులతో ముఖాముఖి చర్చలు జరపడానికి తమ ప్రతినిధులను పంపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తులకు అధికారికంగా సమాచారం అందించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వాషింగ్టన్ విధిస్తున్న కఠిన నిబంధనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని, ప్రస్తుతం ఉన్న చర్చల పంథాలో తాము ముందుకు వెళ్లలేమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో శాంతి ప్రయత్నాలు ఒక్కసారిగా ప్రతిష్టంభనలోకి వెళ్లాయి.



ప్రస్తుతం పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, టర్కీ , ఈజిప్ట్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇస్లామాబాద్‌కు బదులుగా చర్చలకు వేదికగా ఖతార్ లేదా ఇస్తాంబుల్ నగరాలను ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవాలని, దానికి ప్రతిగా కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా ప్రతిపాదిస్తోంది. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో చర్చించారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛాయుతంగా తెరిచే వరకు ఇరాన్‌పై దాడులు ఆపేది లేదని, అవసరమైతే ఆ దేశాన్ని రాతియుగం నాటి స్థితికి తీసుకెళ్తామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' లో హెచ్చరించారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణను కోరుకుంటున్నారన్న ట్రంప్ వాదనలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది.

Featured post

అమెరికా 'రెస్క్యూ' డ్రామాపై ఇరాన్ ఫైర్

  ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ అబద్ధాలాడుతున్నారని విమర్శ అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమాన సిబ్బందిని ఇరాన్ భూభాగం నుంచి సురక్షితంగ...