Tuesday, 28 July 2026

విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే లక్ష్యం


  • పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుపై లోక్‌సభ జితేంద్ర సింగ్


ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026 విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ బిల్లును ఆయన మంగళవారం లోక్‌సభలో చర్చ కోసం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన దీనిని భారత పార్లమెంట్ చరిత్రలో ఒక "మైలురాయి చట్టం"గా అభివర్ణించారు.నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2024లో తీసుకొచ్చిన ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) చట్టానికి ఇది సవరణ అని జితేంద్ర సింగ్ తెలిపారు. స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేశారు.



గత చట్టంతో పాటు ప్రస్తుత సవరణలు కూడా దేశంలోని విద్యార్థులు, యువత భవిష్యత్తును రక్షించేందుకు ప్రభుత్వం చూపుతున్న గట్టి నిబద్ధతకు నిదర్శనమని జితేంద్ర సింగ్ అన్నారు. భారత యువత భవిష్యత్తుతో ఎవరూ చెలగాటం ఆడకుండా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి ఈ బిల్లు ప్రతిరూపమని పేర్కొన్నారు. అందువల్ల ఈ చట్టాన్ని భారత పార్లమెంట్ చరిత్రలో కీలకమైన మైలురాయి చట్టంగా పరిగణించవచ్చని చెప్పారు.ఈ సవరణల ప్రధాన ఉద్దేశం చట్టాన్ని మరింత కఠినతరం చేయడం, వేగవంతమైన న్యాయం అందించడం ద్వారా పోటీ పరీక్షలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం అని మంత్రి వివరించారు.


కొత్త ప్రతిపాదనల ప్రకారం పరీక్షల్లో అక్రమ మార్గాలకు పాల్పడే వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న కనీస మూడేళ్ల జైలు శిక్షను ఐదేళ్లకు పెంచనున్నారు. గరిష్ఠ శిక్షను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచే ప్రతిపాదన ఉంది. అలాగే గరిష్ఠ జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచనున్నారు.పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సేవా సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వాటిపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాంటి సంస్థలకు గరిష్ఠ జరిమానాను రూ.5 కోట్లకు పెంచడంతో పాటు, ప్రజా పరీక్షలు నిర్వహించకుండా నిషేధించే కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పెంచాలని ప్రతిపాదించారు.వ్యవస్థీకృత పరీక్షల నేరాలకు సంబంధించి మరింత కఠిన నిబంధనలు తీసుకురానున్నారు. ప్రస్తుతం కనీసం ఐదేళ్లుగా ఉన్న జైలు శిక్షను ఏడేళ్లకు పెంచనున్నారు. గరిష్ఠ శిక్ష పదేళ్లుగానే కొనసాగుతుంది. జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచే ప్రతిపాదన ఉంది.


పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా ఈ బిల్లు కల్పిస్తుంది. కొత్తగా ప్రతిపాదించిన సెక్షన్ 12ఏ ప్రకారం దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, ఛార్జిషీట్ దాఖలైన మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించారు. ప్రతి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.


పరీక్షల అక్రమాల కేసుల్లో త్వరితగతిన న్యాయం అందించడం ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావించిన అంశమని జితేంద్ర సింగ్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అయినా దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల హయాంలో జరిగిన పేపర్ లీక్ ఘటనలను కూడా జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఒకే జాతీయ పరీక్షా సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే వచ్చిందని గుర్తుచేశారు.2009లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షలు, 2011లో ఆల్ ఇండియా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, 2012లో ఏఐఐఎంఎస్ న్యూఢిల్లీ ప్రవేశ పరీక్ష, 2013లో మహారాష్ట్ర సెకండరీ సర్టిఫికెట్ పరీక్ష వంటి పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ బీఈడీ ప్రవేశ పరీక్ష, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షల్లోనూ అక్రమాలు వెలుగుచూశాయని వివరించారు.


దేశంలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ వంటి ప్రధాన నియామక సంస్థలు ఉన్నాయని, ఉన్నత విద్య ప్రవేశాల కోసం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను 2017లో తమ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని తెలిపారు.1992లో తొలిసారిగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒకే జాతీయ పరీక్షా సంస్థ ఏర్పాటు చేయాలనే సిఫార్సు వచ్చిందని, 2010లో యూపీఏ హయాంలో కూడా ఒక కమిటీ ఇదే సూచన చేసిందని చెప్పారు. కానీ ఆ సమయంలో ఈ ప్రతిపాదనను ఎందుకు అమలు చేయలేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాము గతంలో పూర్తి చేయాల్సిన అసంపూర్తి పనిని ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తి చేసిందని జితేంద్ర సింగ్ అన్నారు.


ప్రధానిని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు

 

పేపర్ లీక్‌లపై కేంద్రానికి అఖిలేశ్ ఘాటు విమర్శలు

ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలను ప్రస్తావిస్తూ, "ప్రధానిని కాపాడేందుకే ప్రధాన్‌ను తొలగించారు" అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యార్థుల ఆందోళనల ఒత్తిడికే ప్రభుత్వం తలవంచి వారి డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చిందని అన్నారు.

లోక్‌సభలో మాట్లాడుతూ విద్యార్థుల ఉద్యమాన్ని అఖిలేశ్ యాదవ్ అభినందించారు. మొదట సరదాగా ప్రారంభమైన ఉద్యమం దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారి, చివరకు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం గతంలో ప్రజలకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదని, కానీ విద్యార్థుల ఉద్యమం కారణంగా వారి నిరసనలను అనుమతించాల్సి వచ్చిందని అన్నారు.



"సర్కార్ భీ ఝుక్తీ హై, ఝుకానే వాలా చాహియే" (ప్రభుత్వం కూడా తలవంచుతుంది... కానీ దాన్ని తలవంచించే శక్తి ఉండాలి) అంటూ విద్యార్థుల పోరాటాన్ని ప్రశంసించారు. ప్రభుత్వాన్ని ప్రజల మాట వినేలా చేయడంలో విద్యార్థులే కీలక పాత్ర పోషించారని అన్నారు.

ఆందోళనకారులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కేంద్రం తప్పకుండా అమలు చేస్తుందని ఆశిస్తున్నానని అఖిలేశ్ అన్నారు. అయితే ఈ ప్రభుత్వం హామీల కంటే "జుమ్లాలు" (ఖాళీ మాటలు) చెప్పడంలోనే ముందుంటుందని విమర్శించారు.

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తాను అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలాన్ని ప్రత్యక్షంగా చూడలేదని, కానీ గత వారం ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, ఇనుప రాడ్లు, విద్యుత్ బాటన్లతో దాడులు, పెల్లెట్ గన్స్ వినియోగం చూస్తే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చాయని వ్యాఖ్యానించారు.

2024లోనే పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ అక్రమాలు ఆగలేదని, ఇప్పుడు అదే చట్టానికి మళ్లీ సవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఫలితాలను ఇవ్వలేకపోయిందని విమర్శించారు.

ఈ సందర్భంగా అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దొంగతనం ఆరోపణలను కూడా అఖిలేశ్ యాదవ్ ప్రస్తావించారు. రామమందిర విరాళాల దొంగతనాన్ని అడ్డుకోలేని ప్రభుత్వం, ప్రశ్నపత్రాల లీక్‌లను కూడా అరికట్టలేకపోయిందని ఆరోపించారు. రామమందిర విరాళాల దుర్వినియోగానికి బాధ్యులైనవారే పేపర్ లీక్‌లను కూడా నిరోధించడంలో విఫలమయ్యారని అన్నారు.

రాంపూర్‌లోని జౌహర్ విశ్వవిద్యాలయానికి కూల్చివేత నోటీసులు జారీ చేసిన అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. కొత్త విశ్వవిద్యాలయాలు నిర్మించలేని ప్రభుత్వం, ఇప్పుడు ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని బుల్డోజర్లు, సుత్తులతో కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఏటా ఒక కొత్త పేపర్ లీక్ కుంభకోణం వస్తోంది


  • కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు!


ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నప్పటికీ, పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్మరించలేమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్‌సభలో విమర్శించారు. పరిపాలన అనేది ప్రచార శీర్షికలతో కాకుండా ఫలితాలతో కొలవబడుతుందని పేర్కొంటూ, ప్రభుత్వం ప్రతి ఏడాది కొత్త వ్యవస్థ తీసుకొస్తామని హామీ ఇస్తున్నా, విద్యార్థులకు మాత్రం ప్రతి ఏడాది అదే పాత పేపర్ లీక్ కుంభకోణాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు.



లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ, పరీక్షల పేర్లు మారుతున్నాయని, బాధితుల పేర్లు మారుతున్నాయని, నిందితుల పేర్లు కూడా మారుతున్నాయని, కానీ నేరాలు మాత్రం మారడం లేదని, అలాగే ప్రభుత్వం కూడా మారడం లేదని విమర్శించారు. దేశంలో ఉపగ్రహాలను పర్యవేక్షించగలమని, క్షిపణులను గుర్తించగలమని, సైబర్ భద్రతను కాపాడగలమని ప్రభుత్వం చెబుతోందని, అయితే గోప్యమైన ప్రశ్నపత్రాలు మాత్రం ప్రభుత్వానికి తెలియకముందే బయటకు వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు.


నీట్ (Re-NEET) పరీక్ష కోసం ప్రశ్నపత్రాలను భారత వైమానిక దళానికి చెందిన విమానాల్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేసిన అభిషేక్ బెనర్జీ, యువతకు ఇలాంటి ప్రదర్శనలు అవసరం లేదని, వారికి కావాల్సింది కేవలం పారదర్శకత, న్యాయమైన పరీక్షల వ్యవస్థ మాత్రమేనని అన్నారు.


పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థుల మాట వినాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారికి బదులుగా బ్యారికేడ్లు, లాఠీలు, పెల్లెట్ గన్స్‌తో సమాధానం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. విద్యార్థులు పోటీని చూసి భయపడరని, అవినీతినే భయపడతారని అన్నారు. ప్రతిభను చూసి కాదు, వ్యవస్థలో జరిగే అక్రమాలను చూసే భయపడుతున్నారని పేర్కొన్నారు. పరీక్షలను కాదు, పరీక్షల నిర్వహణ వ్యవస్థనే యువత అనుమానిస్తోందని చెప్పారు. యువతకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తే, ప్రజాస్వామ్యమే బలహీనపడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు ప్రభుత్వ సానుభూతిని కోరుకోవడం లేదని, న్యాయం జరిగే వ్యవస్థపై భరోసా కోరుతున్నారని స్పష్టం చేశారు.

పరీక్షల సంస్కరణల్లో ప్రధాని సక్సెస్


  • మోదీ సరిగ్గా గుర్తించి చట్టంతో పరిష్కారం చూపారు
  •  జెన్-జెడ్ పదంతో కొత్త పరీక్షల చట్టాన్ని ప్రశంసించిన బన్సూరి స్వరాజ్



ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ జెన్-జెడ్ తరంలో ప్రాచుర్యం పొందిన "క్లాక్డ్ ఇట్" (Clocked It) అనే పదాన్ని ఉపయోగించారు. పరీక్షల వ్యవస్థలోని సమస్యలను ప్రధాని మోదీ సరిగ్గా గుర్తించి, వాటికి చట్టపరమైన పరిష్కారాన్ని అందించారని ఆమె వ్యాఖ్యానించారు. జెన్-జెడ్ భాషలో "క్లాక్డ్ ఇట్" అంటే ఒక అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సరైన పరిష్కారం చూపడం లేదా "కరెక్ట్‌గా గుర్తించారు", "అచ్చం సరైన నిర్ణయం తీసుకున్నారు" అనే అర్థంలో ఉపయోగిస్తారు.


ఈ బిల్లును "పరివర్తనాత్మక సవరణ"గా అభివర్ణించిన బన్సూరి స్వరాజ్, ఇది కేవలం అవసరమైన చట్టం మాత్రమే కాదని, ప్రస్తుత కాలం కోరుతున్న అత్యవసర సంస్కరణ అని పేర్కొన్నారు. ఈ బిల్లు మోదీ ప్రభుత్వ సున్నితత్వానికి, బాధ్యతాయుతమైన పాలనకు నిదర్శనమని అన్నారు.


పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయితే కేవలం విద్యార్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆమె చెప్పారు. పేపర్ లీక్‌ను ప్రధాని నరేంద్ర మోదీ "పెద్ద నేరం"గా అభివర్ణించారని గుర్తుచేస్తూ, అది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదని, దాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పమే ఈ సవరణ బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకు వచ్చిందని వివరించారు.


ఈ బిల్లు విద్యార్థులకు న్యాయం జరిగేలా హామీ ఇస్తోందని బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధన ఇందులో ఉందని చెప్పారు. దర్యాప్తు సంస్థలు రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మూడు నెలల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని బిల్లు నిర్దేశిస్తోందన్నారు. ఈ కేసులను మాత్రమే వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పేపర్ లీక్ కేసుల్లో అవసరం లేని వాయిదాలు ఇవ్వకుండా ప్రత్యేక కోర్టులు విచారణ జరపాలని బిల్లులో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు.


వేగవంతమైన విచారణతో పాటు పేపర్ లీక్ నిందితులపై శిక్షలను కూడా మరింత కఠినతరం చేసినట్లు ఆమె వివరించారు. సాధారణ నిందితులకు ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల గరిష్ఠ జరిమానాను రూ.50 లక్షలకు పెంచడంతో పాటు, జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఐదేళ్ల కనీస శిక్షగా, గరిష్ఠంగా పదేళ్ల వరకు పెంచారని చెప్పారు. పరీక్షల నిర్వహణలో భాగమైన సేవా సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఎనిమిదేళ్లపాటు పరీక్షల నిర్వహణ నుంచి అనర్హత విధించే నిబంధనను కూడా చేర్చినట్లు తెలిపారు.


పేపర్ లీక్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాల ప్రమేయం ఉంటే కనీస జరిమానాను రూ.10 కోట్లుగా నిర్ణయించారని, ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఈ సవరణలు ప్రతిభను కాపాడటంతో పాటు, పరీక్షల పారదర్శకతను నిలబెట్టి, భారత యువత కలలను రక్షిస్తాయని బన్సూరి స్వరాజ్ అన్నారు. ఇది బాధ్యతాయుతమైన మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సమర్థవంతమైన సంస్కరణ అని ఆమె పేర్కొన్నారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ సమస్య 2014 తర్వాతే ప్రారంభమైనట్లు ప్రతిపక్షాలు తప్పుడు కథనాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. మీడియా కథనాల ప్రకారం యూపీఏ ప్రభుత్వ హయాంలో, అలాగే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో సుమారు 22 పేపర్ లీక్ ఘటనలు నమోదయ్యాయని చెప్పారు. పంజాబ్‌లో ఫార్మాస్యూటికల్ పరీక్షలో హైటెక్ పద్ధతిలో పేపర్ లీక్ జరిగిన విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.


ప్రతిపక్షాల ఆగ్రహం ఎంపిక చేసిన అంశాలకే పరిమితమైందని విమర్శించిన బన్సూరి స్వరాజ్, పంజాబ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరారా అని ప్రశ్నించారు. అలాగే 2014కు ముందు దేశంలో జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించే ప్రత్యేక సంస్థే లేదని, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) 2017లోనే ఏర్పాటు చేయబడిందని ఆమె గుర్తుచేశారు.

"విద్యార్థులు ఉగ్రవాదులా?"

 

నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంక గాంధీ

ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఢిల్లీలో పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్, లాఠీచార్జ్, వాటర్ కెనన్లు ఉపయోగించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. దేశ యువతపై ఇలాంటి బలప్రయోగం ఎందుకు చేశారని, విద్యార్థులు ఉగ్రవాదులా అని ఆమె నిలదీశారు.



లోక్‌సభలో మాట్లాడుతూ, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీలతో దాడి చేయడం, వాటర్ కెనన్లను ప్రయోగించడం ఎందుకు అవసరమైందని ప్రశ్నించారు. యువతులను అవమానించడం, వారి దుస్తులు చించివేయడం, దారుణంగా కొట్టడం ఎందుకు జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ యువతపై పెల్లెట్ గన్స్, ఏకే-47 తుపాకులు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, "వాళ్లు ఉగ్రవాదులా?" అని వ్యాఖ్యానించారు.

ఈ చర్యలకు ఆదేశాలు ఎవరు ఇచ్చారని కేంద్ర హోంమంత్రిని సమాధానం చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, పెల్లెట్ గన్స్ ప్రయోగించమని ప్రధానమంత్రి ఆదేశించారా? లేక హోంమంత్రి ఆదేశించారా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ప్రశ్న కేవలం కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదని, దేశ ప్రజలందరూ సమాధానం కోరుతున్నారని పేర్కొన్నారు.

జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అల్లర్ల నియంత్రణ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పోలీసులు దాడి చేయడంతో నిరసనకారులు అక్కడి నుంచి పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నిరసనలు ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాలకు విస్తరించాయి. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆందోళనలను విరమించారు.

దేశంలోని తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మొత్తం దేశమే ఈ ఘటనపై సమాధానం కోరుతోందని ప్రియాంక గాంధీ అన్నారు. దేశ యువతను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. యువత గళాన్ని అణిచివేసే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని నిలదీశారు.

ఇటీవలి రోజుల్లో వేలాది మంది విద్యార్థులు మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, శాంతియుతంగా పాటలు పాడుతూ, చిరునవ్వుతో తమ నిరసనను వ్యక్తం చేశారని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ గళాన్ని వినిపించే హక్కును వారు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రెండు రోజులకే ఆయన పార్లమెంట్‌కు వచ్చినప్పుడు అధికార పార్టీ ఎంపీలు "జిందాబాద్" నినాదాలతో స్వాగతం పలకడాన్ని కూడా ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అవమానకర పరిస్థితుల్లో రాజీనామా చేసిన మాజీ విద్యాశాఖ మంత్రిని సూపర్ స్టార్‌లా స్వాగతించడం ఎంత విరుద్ధమైన పరిస్థితో చూడాలని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, జూలై 20న జరిగిన నిరసనల్లో భద్రతా సిబ్బంది ప్రయోగించిన పెల్లెట్ గన్ వల్ల గాయపడినట్లు ఆరోపిస్తున్న విద్యార్థి సహిల్ లోచబ్‌ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గత శుక్రవారం మీడియా ముందుకు తీసుకొచ్చారు. శాంతియుతంగా చేతిలో జాతీయ పతాకంతో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తన సోదరుడికి పెల్లెట్ గన్ తాకిందని సహిల్ సోదరి చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అనంతరం సహిల్ గాయాలను మీడియాకు చూపిస్తూ, నిరసనకారులపై బలప్రయోగం జరిగిందని ఆరోపించారు.

'అత్యాచార నిందితుల సమర్థకుడికి విద్యాశాఖా?'


  •  ప్రహ్లాద్ జోషి నియామకంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు


దేశ విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని అదనపు బాధ్యతలతో నియమించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ యువత, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సమయంలో అత్యాచార నిందితులను సమర్థించిన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా ఎంపిక చేయడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో మరెందరో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ప్రహ్లాద్ జోషినే ఎంపిక చేయడం విచిత్రమైన నిర్ణయమని అన్నారు.



ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రివర్గంలో అత్యంత అనుభవజ్ఞులైన నేతల్లో ఒకరు. 2018లో ఆయన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో, 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని ముందస్తుగా విడుదల చేసే నిర్ణయానికి ఆయన మద్దతు తెలిపారు. ఆ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, నిందితులు చాలా కాలం జైలులో ఉన్నారని, చట్ట ప్రకారం విడుదలకు అవకాశం ఉందని జోషి సమర్థించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు చట్ట ప్రక్రియ ప్రకారమే నిర్ణయం తీసుకున్నారని, అందులో తప్పేమీ కనిపించడం లేదని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. అలాగే నిందితులు జైలులో ఉన్న సమయంలో మంచి ప్రవర్తన కనబరిచారనే కారణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే, 2024లో సుప్రీంకోర్టు ఆ ముందస్తు విడుదలను రద్దు చేస్తూ, ఆ క్షమాభిక్ష ఉత్తర్వులు చట్టబద్ధమైన అధికార పరిధిలో జారీ కాలేదని స్పష్టం చేసింది.


లోక్‌సభలో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు సంబంధించిన కొత్త బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యా వ్యవస్థపై దేశవ్యాప్తంగా యువత నిరసనలు వ్యక్తం చేస్తుంటే, అలాంటి సమయంలో అత్యాచార నిందితులను సమర్థించిన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం బీజేపీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేయగా, రాహుల్ గాంధీ స్పందిస్తూ విద్యార్థులు, యువత, మహిళలు పోలీసుల చేతుల్లో దాడులకు గురయ్యారని ఆరోపించారు.


అత్యాచార నిందితులను రక్షించాల్సిన అవసరం ఉందని భావించే వ్యక్తికంటే హీనమైన వ్యక్తి మరొకరు ఉండరని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తే ఇప్పుడు దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని విమర్శించారు. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఎన్నో మంది ఉన్నప్పటికీ వారిలో ఎవరినైనా ఎంపిక చేసే అవకాశం ఉండగా, అత్యాచార నిందితులను సమర్థించిన వ్యక్తినే ఎంచుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని అన్నారు. అంతకుముందు లోక్‌సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పటికీ, ఆమె చేసిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించారు.


ఇదిలా ఉండగా, 2021 నుంచి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయాలన్నది ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ పంపిన కొద్ది గంటలకే నిరసనకారులు తమ ఆందోళనను విరమించారు. అదే రోజు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.

'యువత ప్రతిపక్షంతో ఉందనుకోవడం పెద్ద డెలులు'

  •  పేపర్ లీక్ బిల్లుపై కాంగ్రెస్‌కు తేజస్వి సూర్య కౌంటర్


ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ యువతకు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఏమి జరిగిందన్నది ముఖ్యం కాదని, భవిష్యత్తులో పరీక్షల వ్యవస్థను ఎవరు సరిచేస్తారన్నదే ప్రధాన అంశమని ఆయన అన్నారు. ప్రశ్నపత్రాల లీక్‌లు పూర్తిగా ఆగిపోయేలా వ్యవస్థను బలోపేతం చేయాలని యువత ఆశిస్తున్నారని, ఆ సామర్థ్యం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఆయన పేర్కొన్నారు.



తదుపరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి గత చరిత్ర గురించి ఆలోచించడంలేదని, ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి జరిగిందన్నదానిపై అతనికి ఆసక్తి లేదని తేజస్వి సూర్య అన్నారు. తన భవిష్యత్తును రక్షించేలా పరీక్షల వ్యవస్థను ఎవరు సరిదిద్దుతారన్నదే విద్యార్థికి ముఖ్యమని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పరీక్షల వ్యవస్థను శాశ్వతంగా మెరుగుపరిచే దిశగా పనిచేస్తోందనే నమ్మకం యువతలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.


పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ అంశంపై ప్రతిపక్షాలను విమర్శిస్తూ తేజస్వి సూర్య 'జెన్-జెడ్' తరానికి చెందిన "భ్రమలో బతకడం" (డెలులు) అనే పదాన్ని ఉపయోగించారు. యువత తమతో ఉందని ప్రతిపక్ష పార్టీలు భావించడం కంటే పెద్ద "భ్రమలో బతకడం" మరొకటి ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 'డెలులు' అనేది వాస్తవాలకు దూరంగా భ్రమల్లో జీవించడం లేదా అవాస్తవ నమ్మకాల్లో ఉండడాన్ని సూచించే యువతలో ప్రాచుర్యం పొందిన పదం.


కాంగ్రెస్‌పై మరింత ఘాటుగా స్పందించిన తేజస్వి సూర్య, 2010లో యూపీఏ ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకురాకపోవడం వల్ల ఇప్పటివరకు పేపర్ లీక్ కేసుల్లో సమర్థవంతమైన శిక్షలు అమలు కాలేదని ఆరోపించారు. విద్యార్థులకు నినాదాలు అవసరం లేదని, పరిష్కారం కావాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ బిల్లు అదే పరిష్కారాన్ని అందిస్తోందని, ముప్పై ఏళ్ల క్రితమే ఇలాంటి చట్టం రావాల్సి ఉన్నప్పటికీ దేశ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు.


లోక్‌సభలో జెన్-జెడ్ పదజాలం వినిపించడం ఇదే తొలిసారి కాదని, మరో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చట్టపరమైన పరిష్కారాన్ని అందించడం ద్వారా పరిస్థితిని సరిగా అర్థం చేసుకున్నారని ('క్లాక్డ్ ఇట్') వ్యాఖ్యానించారు.


ఇటీవల నీట్ (NEET) వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఘటనల నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత సవరణల ప్రకారం పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా, నిందితుల ఆస్తుల స్వాధీనం, అలాగే కేసులను మూడు నెలల్లో పరిష్కరించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


దేశంలో విద్యా, పరీక్షల వ్యవస్థ మాత్రమే అభ్యర్థి ఇంటిపేరు, కుటుంబ ఆదాయం, కులం లేదా ఆర్థిక నేపథ్యం గురించి అడగకుండా ప్రతిభకు అవకాశం కల్పిస్తుందని తేజస్వి సూర్య అన్నారు. కష్టపడి చదివిన వారికి సమాన అవకాశాలు లభిస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉందని, అలాంటి వ్యవస్థలో ప్రశ్నపత్రాల లీక్‌లు చోటుచేసుకుంటే అది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాకుండా విద్యార్థుల నమ్మకానికి జరిగిన ద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు.

Featured post

విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే లక్ష్యం

పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుపై లోక్‌సభ జితేంద్ర సింగ్ ప్రశ్నపత్రాల లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన...