Tuesday, 11 August 2026

పార్లమెంట్‌లో నిరసనల హోరు



  • గందరగోళం మధ్య ‘కేరళం’ బిల్లుకు ఆమోదం


న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మంగళవారం కూడా తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. విద్యార్థులపై పోలీసుల చర్య, అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై ప్రతిపక్షాలు నిరసనలు, నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఈ గందరగోళం మధ్యే లోక్‌సభలో కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే బిల్లును చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ‘కేరళ (పేరు మార్పు) బిల్లు-2026’ను సభలో ప్రవేశపెట్టారు. అయితే జూలై 20న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నీట్‌ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి హోంమంత్రి అమిత్‌ షా సభలో సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. సభను సజావుగా నడవనివ్వాలని చైర్‌లో ఉన్న కృష్ణ ప్రసాద్‌ తెనేటి విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.

కేరళ అసెంబ్లీ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని తీర్మానం చేయడంతో కేంద్రం ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్‌లో మార్పు చేసి అధికారిక పేరును ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చడం బిల్లు ఉద్దేశం.


చర్చకు ప్రతిపక్షం అడ్డుపడిందన్న రిజిజు


పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనలపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అమిత్‌ షా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షమే చర్చను అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు సభ నుంచి బయటకు వెళ్లి నినాదాలు చేస్తున్నారని విమర్శించారు.అయితే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఆరోపణలను ఖండించారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి, కాల్పులకు ఆదేశాలిచ్చింది ఎవరో హోంమంత్రి స్పష్టంగా చెప్పాలని ప్రతిపక్షం కోరుతోందన్నారు. పోలీసుల చర్యలో పలువురు విద్యార్థులు గాయపడ్డారని, ఈ అంశంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం, ప్రభుత్వ క్షమాపణ డిమాండ్‌ కూడా తమ ప్రధాన అంశాల్లో ఉన్నాయని ఖర్గే తెలిపారు.


‘రాహుల్‌ గాంధీ పారిపోవద్దు’ అంటూ ఎన్డీయే నిరసన


మరోవైపు విద్యార్థుల ఆందోళనపై చర్చకు ప్రతిపక్షం వెనుకడుగు వేస్తోందంటూ ఎన్డీయే ఎంపీలు పార్లమెంట్‌ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ‘‘రాహుల్‌ గాంధీ పారిపోవద్దు.. హోంమంత్రి సమాధానాన్ని ఎదుర్కోవాలి’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అమిత్‌ షా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీ ఇప్పటికే జార్ఖండ్‌ ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిశారని తెలిపారు. కాబట్టి ఆయన విద్యార్థుల సమస్యల నుంచి పారిపోతున్నారన్న ఆరోపణలు అర్థరహితమని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.


రామమందిర విరాళాలపై చర్చకు కే.సీ. వేణుగోపాల్‌ నోటీసు


అయోధ్య రామమందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాల్లో భారీ ఆర్థిక అవకతవకలు, చోరీ, దుర్వినియోగం జరిగాయంటూ కాంగ్రెస్‌ ఎంపీ కే.సీ. వేణుగోపాల్‌ లోక్‌సభలో వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులోనే ఒక వ్యవస్థీకృత అక్రమ వ్యవహారం నడుస్తోందని ఆయన ఆరోపించారు. కోట్లాదిమంది భక్తులు సమర్పించిన నగదు, విలువైన ఆభరణాల విషయంలో వచ్చిన ఆరోపణలపై అత్యవసర చర్చ జరపాలని కోరారు.


మరో మూడు కీలక బిల్లులు


కేరళం పేరుమార్పు బిల్లుతో పాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) సవరణ బిల్లు-2026ను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సహకార సంస్థలకు నిధుల అందజేతను మరింత వేగవంతంగా, సులభంగా మార్చడం, NCDC పరిధిని విస్తరించడం ఈ బిల్లు లక్ష్యంగా ఉంది. ట్రిబ్యునల్స్‌ సంస్కరణల బిల్లు-2026లో భాగంగా దేశంలోని 16 ప్రధాన ట్రిబ్యునళ్ల నియామకాలు, పనితీరును పర్యవేక్షించేందుకు ‘నేషనల్‌ ట్రిబ్యునల్స్‌ కమిషన్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పరిపాలన, ఆదాయపు పన్ను, వినియోగదారుల వ్యవహారాలు, పర్యావరణం, కంపెనీ చట్టం, సాయుధ దళాలు, టెలికమ్యూనికేషన్స్‌ వంటి రంగాలకు సంబంధించిన వివాదాలను ఈ ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి. ఇక గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్ట సవరణ బిల్లు ద్వారా మైనింగ్‌ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, కీలక ఖనిజాల అన్వేషణకు ఊతమివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.


బడ్జెట్‌లో 99.78 శాతం ఖర్చు


కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్‌ కేటాయింపుల్లో 99.78 శాతం వినియోగించినట్లు పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. రూ.57,203.78 కోట్ల సవరించిన అంచనాకు గాను రూ.57,075.19 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అయితే పారిశ్రామిక గృహ నిర్మాణం, నేషనల్‌ అర్బన్‌ డిజిటల్‌ మిషన్‌, అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌కు కేటాయింపులు ఉన్నప్పటికీ ఆ పథకాల కింద ఎలాంటి ఖర్చు జరగలేదని కమిటీ గుర్తించింది.


నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు



  • ఆయన నక్కలా ఉండటం కంటే కుక్కగా ఉండటమే మేలు


న్యూఢిల్లీ: జార్ఖండ్ పేపర్ లీక్ ఆందోళనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు నసీరుద్దీన్ షాపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నసీరుద్దీన్ షా మౌనాన్ని ప్రశ్నిస్తూ ప్రముఖ నటుడు పియూష్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను మద్దతుగా ప్రస్తావిస్తూ, కంగన ఆయనను "నక్క" అని సంబోధించారు. తాను ఉంటున్న దేశానికి నమ్మకంగా ఉండే కుక్కలా మారడానికైనా సిద్ధమే గానీ, నసీరుద్దీన్ షాలాంటి నక్కలా మాత్రం ఉండలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ దేశంలో తింటూ పక్క దేశం కోసం పోరాడే స్వభావం ఆయనదని తీవ్రంగా విమర్శించారు.


గతంలో నసీరుద్దీన్ షా సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేస్తూ, అధికారంలో ఉన్నవారి ఇచ్చే అవకాశాలు లేదా ప్రయోజనాల కోసం టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు నోట్లో ఎముక కరుచుకున్న కుక్కల్లా మౌనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇస్తూ పియూష్ మిశ్రా రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసి, ప్రస్తుతం జార్ఖండ్ ఘటనపై మాట్లాడని నసీరుద్దీన్ షాను "ఇప్పుడు ఎవరి నోట్లో ఎముకలు ఉన్నాయి?" అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విద్యార్థులు వాడుతున్న భాషను కంగనా మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నారు.


మరోవైపు, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) పరీక్షలలో జరిగిన అక్రమాలపై విద్యార్థుల నిరసనలు మూడో వారానికి చేరుకున్నాయి. 14వ JPSC పరీక్షను రద్దు చేసి, సీబీఐ (CBI) లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల కమిటీతో స్వతంత్ర విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జెఎల్కెఎమ్ (JLKM) నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం చర్చల ద్వారా పారదర్శకత పాటిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, విద్యార్థులు తమ డిమాండ్ల నెరవేర్పు కోసం ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు.

ఒకే వేదికపై అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ



  • సుప్రియా సూలే కుమార్తె వివాహ విందులో అరుదైన దృశ్యం


న్యూఢిల్లీ: సాధారణంగా పార్లమెంట్‌లో పరస్పరం విమర్శలు చేసుకునే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ విందుకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.



ఢిల్లీలోని 6, జన్‌పథ్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ విందులో ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సారంగ్‌ లఖానీతో రేవతి సూలే వివాహం జూన్‌లో ముంబైలో జరగగా.. ఢిల్లీలోని ఈ కార్యక్రమం ఘనమైన విందుగా నిర్వహించారు.



ముందుగా అమిత్‌ షా వేదికపైకి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం సుప్రియా సూలే.. రాహుల్‌ గాంధీతో పాటు సోనియా, ప్రియాంక గాంధీలను వేదికపైకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నూతన దంపతుల మధ్య సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక గాంధీలు నిలిచిన దృశ్యాలను ఫొటోగ్రాఫర్లు విస్తృతంగా చిత్రీకరించారు.



ఇటీవల విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యకు సంబంధించి పార్లమెంట్‌లో అమిత్‌ షా సమాధానం చెప్పాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో.. ఇద్దరు నేతలు ఒకే కార్యక్రమంలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వివాహ విందులో మాత్రం నేతలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి పరస్పరం పలకరించుకున్నారు.



ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ వేడుకకు హాజరై శరద్‌ పవార్‌, ఆయన భార్యతో భేటీ అయ్యారు. అనంతరం నూతన దంపతులను ఆశీర్వదించారు. కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ హుడా, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పరస్పరం కరచాలనం చేసుకుంటూ కనిపించారు. కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌ పూరి, చిరాగ్‌ పాస్వాన్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి, ఢిల్లీ మంత్రి ప్రవేశ్‌ వర్మ తదితరులు కూడా విందుకు హాజరయ్యారు.



కాంగ్రెస్‌ ఎంపీ అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలే, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తదితర ప్రముఖులు కూడా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పార్టీల నేతలు ఒకే టేబుళ్ల వద్ద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. సోనియా గాంధీ.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూర్చున్న టేబుల్‌ వద్దకు వెళ్లి పలకరించడం కూడా ప్రత్యేకంగా నిలిచింది.



రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్న సమయంలోనూ ఒకే వివాహ వేదికపై అగ్రనేతలు కలుసుకోవడం.. భారత రాజకీయాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.

ఎర్ర సముద్రంలో కార్గో నౌకపై హూతీ దాడి

  • ముగ్గురు సిబ్బంది మృతి

సనా/దుబాయ్‌: ఎర్ర సముద్రంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యెమెన్‌కు చెందిన ఇరాన్‌ అనుకూల హూతీ తిరుగుబాటుదారులు బాబ్‌ ఎల్‌-మందెబ్‌ జలసంధిలో ఓ చిన్న కార్గో నౌకపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది మృతి చెందినట్లు యెమెన్‌ కోస్ట్‌గార్డ్‌ వర్గాలు, ప్రభుత్వ సైనిక అధికారులు వెల్లడించారు.




టాంజానియా జెండాతో ప్రయాణిస్తున్న తిహామా అనే నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఒమన్‌లోని సలాలా నుంచి జిబౌటీ వైపు వెళ్తున్న ఈ నౌకలో ఇద్దరు పాకిస్థానీయులు, ఒక ఇండోనేషియా పౌరుడు ఉన్నారని యెమెన్‌ వర్గాలు తెలిపాయి. అయితే దాడిపై హూతీలు ఇప్పటివరకు అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు. నౌకపై దాడి జరిగినట్లు ధ్రువీకరణ కోసం సముద్ర భద్రతా సంస్థలు వివరాలను పరిశీలిస్తున్నాయి.

ఈ దాడి నిజమైతే.. ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులతో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు మొదలైన తర్వాత హూతీల దాడిలో నౌక సిబ్బంది మరణించడం ఇదే తొలిసారి కానుంది.

ఇప్పటికే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలపై హూతీల దాడుల ముప్పు కొనసాగుతోంది. మరోవైపు హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ షిప్పింగ్‌ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బాబ్‌ ఎల్‌-మందెబ్‌ జలసంధిలో తాజా దాడి సముద్ర రవాణాపై మరింత అనిశ్చితిని పెంచింది.

హూతీలు గత నెలలో ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాపై నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించారు. సౌదీ తమపై దిగ్బంధనం విధించిందని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగారు. అయితే యెమెన్‌పై తాము ఎలాంటి దిగ్బంధనం విధించలేదని సౌదీ అరేబియా ఖండించింది.

బాబ్‌ ఎల్‌-మందెబ్‌ జలసంధి అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి కీలక మార్గంగా ఉంది. క్ప్లర్‌ డేటా ప్రకారం గత వారం రోజుకు సగటున 32 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించాయి. దిగ్బంధనానికి ముందు రోజుకు సగటున 50 నౌకలు ఈ జలసంధిని దాటేవి. తాజా దాడితో ఈ కీలక సముద్ర మార్గంలో నౌకల రాకపోకలపై ఆందోళనలు మరింత పెరిగాయి.

ఇప్పుడు పారిపోవద్దు

 


  •  అమిత్‌ షాను ఎదుర్కొని ప్రశ్నలు అడగండి
  •  రాహుల్‌గాంధీకి కిరణ్‌ రిజిజు సవాల్‌

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసుల చర్యల అంశంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున రాహుల్‌గాంధీ ఇప్పుడు పార్లమెంట్‌ నుంచి ‘‘పారిపోవద్దు’’ అంటూ సవాల్‌ విసిరారు.

విద్యార్థుల నిరసనలు, ఢిల్లీలో వారిపై పోలీసులు తీసుకున్న చర్యలపై రాహుల్‌గాంధీ, ఇతర విపక్ష నేతలు కొంతకాలంగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ అంశంపై అమిత్‌ షా పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఈ అంశం కారణంగా వర్షాకాల సమావేశాల్లో పలుమార్లు సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై చర్చకు సిద్ధమైంది. చర్చ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. దీంతో రాహుల్‌గాంధీ పార్లమెంట్‌కు హాజరై చర్చలో పాల్గొనాలని రిజిజు కోరారు.

సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులో రిజిజు మాట్లాడుతూ.. అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని రాహుల్‌గాంధీ కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు హోంమంత్రి స్వయంగా సమగ్రంగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున రాహుల్‌గాంధీ సభలో ఉండి తన ప్రశ్నలను అడగాలని అన్నారు. పార్లమెంట్‌లో చర్చను ఎదుర్కోవాలని, ఇప్పుడు వెనక్కి తగ్గకూడదని రిజిజు వ్యాఖ్యానించారు.

విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై అధికార, విపక్షాల మధ్య నెలకొన్న వివాదం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కీలక రాజకీయ అంశంగా మారింది. ప్రభుత్వం చర్చకు ముందుకు రావడంతో ఈ అంశంపై అమిత్‌ షా ఇచ్చే సమాధానంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఓటరు జాబితా నుంచి నా పేరు తొలగించారు

  •  ‘జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఫైర్‌

బెంగళూరు: కర్ణాటకలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్‌రాజ్‌ తీవ్రంగా స్పందించారు. బెంగళూరు నియోజకవర్గానికి చెందిన 65 లక్షల మంది ఓటర్లలో తన పేరు కూడా తొలగించారని ఆయన ఆరోపించారు. ‘‘జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’’ అంటూ ప్రభుత్వ, ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేశారు.



ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది ఈ నియోజకవర్గంలోనే. ఇక్కడే చదువుకున్నాను. కాలేజీ, థియేటర్‌ జీవితమంతా ఇక్కడే కొనసాగింది. అంతేకాదు, ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగానూ పోటీ చేశాను. అలాంటి నా ఓటు హక్కును SIR తర్వాత తొలగించారంటున్నారు. జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’’ అని వ్యాఖ్యానించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటరు జాబితా సవరణ సమయంలో తన ఓటు హక్కు తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరిగి ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు ఎలాంటి ప్రక్రియను పూర్తి చేయాలి, ఎలాంటి పత్రాలు సమర్పించాలంటూ ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, ప్రకాశ్‌రాజ్‌పై గతంలో పలు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసులో బెంగళూరు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయగా, గత నెలలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో నాలుగు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. అయితే ప్రస్తుత SIR ప్రక్రియలో తన పేరు తొలగించడంపై ప్రకాశ్‌రాజ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించే హక్కు ప్రజలకు ఉంది. మీకు ఓటు వేయని కొందరి ఓటు హక్కును అధికారాన్ని ఉపయోగించి నిరాకరించవచ్చు. కానీ మా గొంతును ఆపలేరు. మా శక్తితో మిమ్మల్ని రాజకీయంగా కిందికి దించుతాం’’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో జరుగుతున్న SIR ప్రక్రియలో బెంగళూరు వ్యవహారం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి ఓటరు వివరాల పరిశీలనలో గైర్హాజరు, వేరే ప్రాంతాలకు తరలిపోయిన, డూప్లికేట్‌, మరణించిన తదితర కారణాలతో ASDDO కేటగిరీలో భారీ సంఖ్యలో ఓటర్లను గుర్తించారు. కర్ణాటకలో మొత్తం 5.54 కోట్ల మంది ఓటర్లలో 1,09,83,901 మంది అంటే 19.81 శాతం మంది ASDDO కేటగిరీలో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.

బెంగళూరు అర్బన్‌లోనే అత్యధికంగా 17,74,626 ASDDO కేసులు నమోదయ్యాయి. అక్కడ SIRకు ముందు ఉన్న 40,21,039 మంది ఓటర్లలో ఇది 44.13 శాతంగా ఉంది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (BBMP) సౌత్‌ పరిధిలో పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. అక్కడ 21,44,784 మంది ఓటర్లలో 10,87,829 మందిని ASDDO కేటగిరీలో గుర్తించారు. ఇది మొత్తం ఓటర్లలో 50.72 శాతానికి సమానం.

కర్ణాటకలో SIR గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఇంటింటి గణన ప్రక్రియ ఆగస్టు 17తో ముగియనుంది. ఆగస్టు 24న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు సెప్టెంబర్‌ 23 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్‌ 22 వరకు వాటిని పరిష్కరించనున్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్‌ 27న ప్రకటించనున్నారు.

Friday, 7 August 2026

అరిజిత్ సింగ్ ఒక ఫకీరు లాంటివాడు

  •  బాలీవుడ్‌కు దూరంగా సొంత ఊళ్లో ప్రశాంత జీవనం
  • ఆ నిర్ణయంపై నీలేష్ మిస్రా కీలక వ్యాఖ్యలు


ప్రముఖ గాయకుడు అరిజిత్‌ సింగ్‌ సినిమాల కోసం ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు గుడ్‌బై చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ముంబై నగర జీవితంలోని హడావుడికి దూరంగా పశ్చిమ బెంగాల్‌లోని తన స్వస్థలం జియాగంజ్‌, ముర్షిదాబాద్‌లో ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకోవడం కూడా అరిజిత్‌ గురించి పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆయన ఎక్కువగా తన స్వస్థలం నుంచే పని చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌, అంతర్జాతీయ గాయకుడు ఎడ్‌ షీరన్‌ వంటి ప్రముఖులు సైతం ఆయనను స్వగ్రామంలోని ఇంటికి వెళ్లి కలిశారు.

గ్రామీణ జీవన విధానాన్ని ప్రోత్సహించే రేడియో కథకుడు, స్క్రిప్ట్‌రైటర్‌, గేయరచయిత నీलेశ్‌ మిశ్రా.. అరిజిత్‌ ఎంపికను తన అనుభవాలతో పోల్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ సమీపంలోని కునౌరా గ్రామంలో నిర్వహించిన తన పాడ్‌కాస్ట్‌లో ఆయన ‘స్లో లివింగ్‌’ గురించి మాట్లాడారు. అదే గ్రామం నుంచి ‘ది స్లో ఇంటర్వ్యూ విత్‌ నీलेశ్‌ మిశ్రా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పాటు, ఆయన గ్రామీణ వార్తా సంస్థ ‘గావ్‌ కనెక్షన్‌’కు కూడా అక్కడే పునాదులు పడ్డాయి.

ముంబై జీవితంలోని వేగం, ఒత్తిడిని వదిలి అరిజిత్‌ సింగ్‌ సొంతూరిలో ప్రశాంత జీవనాన్ని ఎంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ నీलेశ్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అరిజిత్‌ సింగ్‌ ఒక ఫకీర్‌ లాంటి మనిషి. ఆయన నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆత్మగౌరవంతో వచ్చిన నిర్ణయంగా చెప్పొచ్చు. ఇందులో గర్వం లేదు, ఇతరులను తీర్పు చెప్పడం లేదు’’ అని అన్నారు. తాను కూడా ముంబై నుంచి తన గ్రామంతో అనుబంధాన్ని కొనసాగించడం కష్టమైందని, అందుకే జీవితాన్ని నిజమైన రూపంలో ఆస్వాదించేందుకు గ్రామానికి తిరిగి వచ్చానని తెలిపారు. లక్షలాది మంది కూడా నగరాల హడావుడికి దూరంగా సొంత మూలాలకు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారని చెప్పారు.

ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు అరిజిత్‌ గుడ్‌బై

కొత్త ఏడాది సందర్భంగా అభిమానులను ఉద్దేశించి అరిజిత్‌ సింగ్‌ చేసిన ప్రకటన సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇన్నేళ్లుగా తన పాటలను ఆదరించిన శ్రోతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇకపై కొత్త ప్లేబ్యాక్‌ సింగింగ్‌ ప్రాజెక్టులను స్వీకరించబోనని ప్రకటించారు. అద్భుతమైన ప్రయాణంగా తన సంగీత జీవితాన్ని అభివర్ణిస్తూ, సినిమాల కోసం పాటలు పాడటానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు.

అరిజిత్‌ నిర్ణయంపై సంగీత పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భావోద్వేగంగా స్పందించారు. ప్రముఖ గాయకుడు కుమార్‌ సాను ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించే ధైర్యం అరిజిత్‌కు ఉందని కొనియాడారు. శ్రేయా ఘోషల్‌ మాత్రం ఇది అరిజిత్‌ కెరీర్‌కు ముగింపు కాదని, కొత్త దశకు ఆరంభమని పేర్కొన్నారు. ఆయనలాంటి ప్రతిభావంతుడైన కళాకారుడిని సంప్రదాయ సంగీత పరిధుల్లో బంధించలేమని అన్నారు.

రాపర్‌ బాద్‌షా ‘‘శతాబ్దానికి ఒకరు’’ అంటూ అరిజిత్‌ను ప్రశంసించగా, బి. ప్రాక్‌ ‘‘జీవితాంతం అభిమానినే’’ అంటూ తన స్పందనను తెలిపారు. బిగ్‌బాస్‌-19లో ఇటీవల కనిపించిన అమాల్‌ మాలిక్‌ అరిజిత్‌ నిర్ణయం విని తాను అయోమయానికి గురయ్యానని, అయితే ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. అర్మాన్‌ మాలిక్‌ కూడా అరిజిత్‌పై తనకు ఎప్పటికీ ప్రేమ, గౌరవం ఉంటాయని పేర్కొన్నారు.

దశాబ్దానికి పైగా తిరుగులేని మెలోడీ కింగ్‌

దశాబ్దానికి పైగా అరిజిత్‌ సింగ్‌ కొత్త తరం సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రేమ, విరహ గీతాలకు ఆయన గాత్రం ప్రత్యేక గుర్తింపుగా మారింది. షారుఖ్‌ ఖాన్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌ వరకు, రణ్‌బీర్‌ కపూర్‌ నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ వరకు పలువురు అగ్ర హీరోల సినిమాలకు అరిజిత్‌ గాత్రం సంగీత దర్శకుల తొలి ఎంపికగా నిలిచింది.

‘తుమ్‌ హీ హో’, ‘లాల్‌ ఇష్క్‌’, ‘రాబ్తా’, ‘కభీ జో బాదల్‌ బర్సే’, ‘ఆజ్‌ ఫిర్‌’ వంటి అనేక హిట్‌ పాటలతో అరిజిత్‌ సింగ్‌ తనదైన ముద్ర వేశారు. సినిమాల పాటలకు దూరమైనా, సంగీతంపై ఆయన ప్రయాణం కొత్త రూపంలో కొనసాగుతుందనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Featured post

పార్లమెంట్‌లో నిరసనల హోరు

గందరగోళం మధ్య ‘కేరళం’ బిల్లుకు ఆమోదం న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మంగళవారం కూడా తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. విద్యార్థులపై ప...