Friday, 14 August 2026

పాలపుంత వెలుపల నక్షత్రాల ప్రవాహం



డార్క్ మ్యాటర్‌ నిగూఢాలను విప్పే దిశగా హబుల్ టెలిస్కోప్ అరుదైన ఆవిష్కరణ


అంతరిక్ష రహస్యాలను ఛేదించే క్రమంలో నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ మరో కీలక ఆవిష్కరణకు వేదికైంది. మిల్కీవే గెలాక్సీకి వెలుపల తొలిసారిగా ఓ గ్లోబ్యులర్ క్లస్టర్‌కు చెందిన నక్షత్ర ప్రవాహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమికి సుమారు 11.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న యూజీసీ 9050-డీడబ్ల్యూ1 అనే గెలాక్సీలో ఈ అత్యంత మందమైన నక్షత్రాల జాడను హబుల్ టెలిస్కోప్‌కు సంబంధించిన పాత డేటాలో గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఒక దట్టమైన నక్షత్ర సమూహంలోని నక్షత్రాలు క్రమంగా విడిపోయినప్పుడు.. మిగిలిన నక్షత్రాలు పొడవైన, సన్నని ప్రవాహంలా ఏర్పడతాయి. వీటినే ‘స్టెల్లార్ స్ట్రీమ్స్‌’గా పిలుస్తారు. మిల్కీవేలో ఇలాంటి అనేక నక్షత్ర ప్రవాహాలను ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అయితే ఇవి అత్యంత మసకగా ఉండటంతో చాలా ప్రవాహాలను గుర్తించడం కష్టమవుతోంది.


తాజాగా గుర్తించిన నక్షత్ర ప్రవాహాన్ని నమూనాగా రూపొందించడం ద్వారా శాస్త్రవేత్తలు యూజీసీ 9050-డీడబ్ల్యూ1 గెలాక్సీ నిర్మాణాన్ని, దాని గురుత్వాకర్షణ క్షేత్రాన్ని అధ్యయనం చేశారు. గెలాక్సీ గురుత్వాకర్షణ ప్రభావమే నక్షత్ర ప్రవాహం ఆకారం, కదలికలను ప్రభావితం చేస్తుంది. ఈ ఆధారంగా గెలాక్సీలోని మొత్తం ద్రవ్యరాశిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇందులో నక్షత్రాల వంటి కనిపించే పదార్థంతో పాటు డార్క్ మ్యాటర్‌ కూడా ఉంటుంది. మిల్కీవే వెలుపల నక్షత్ర ప్రవాహాన్ని గుర్తించిన విషయం ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని పరిశోధన సహ-ప్రధాన రచయిత జూలీ కీల్ హోల్మ్ తెలిపారు. ఈ ఆవిష్కరణతో ఇతర గెలాక్సీల్లోని డార్క్ మ్యాటర్ స్వభావం, పరిమాణం, పంపిణీపై మరింత లోతైన అధ్యయనాలకు అవకాశం ఏర్పడిందని పరిశోధకులు భావిస్తున్నారు.


డార్క్ మ్యాటర్‌ ((అదృశ్య పదార్థం) ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యంగానే ఉంది. దాన్ని నేరుగా చూడటం సాధ్యం కాకపోయినా.. నక్షత్రాలు, గెలాక్సీలపై దాని గురుత్వాకర్షణ ప్రభావాలను గుర్తించవచ్చు. విశ్వంలోని మొత్తం పదార్థంలో సుమారు 80 నుంచి 85 శాతం వరకు డార్క్ మ్యాటర్‌ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందువల్ల దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం విశ్వ పరిణామాన్ని తెలుసుకోవడంలో కీలకమని పరిశోధకులు చెబుతున్నారు.ఇప్పటివరకు మిల్కీవేలోని డార్క్ మ్యాటర్‌ను అధ్యయనం చేసేందుకు నక్షత్ర ప్రవాహాలను ఉపయోగించారు. ఇప్పుడు మిల్కీవే వెలుపల గుర్తించిన ఈ ప్రవాహం ద్వారా ఇతర గెలాక్సీల్లో డార్క్ మ్యాటర్ ఎంత ఉంది, ఎలా విస్తరించి ఉంది అనే అంశాలను అధ్యయనం చేసే కొత్త మార్గం తెరుచుకుంది.


ఈ నక్షత్ర ప్రవాహం ‘అల్ట్రా-డిఫ్యూస్ గెలాక్సీ’గా పిలిచే ఒక ప్రత్యేకమైన గెలాక్సీలో కనిపించింది. ఇలాంటి గెలాక్సీలు చాలా తక్కువ ప్రకాశంతో, విస్తృతంగా వ్యాపించిన నిర్మాణంతో ఉంటాయి. ఈ లక్షణాల కారణంగానే నక్షత్ర ప్రవాహాన్ని గుర్తించడం కొంత సులభమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అల్ట్రా-డిఫ్యూస్ గెలాక్సీలు పరిమాణపరంగా భారీగా ఉండొచ్చని పరిశోధన సహ-ప్రధాన రచయిత సారా పియర్సన్ తెలిపారు. ఒక నక్షత్ర సమూహం నుంచి నక్షత్రాలను విడదీసి ప్రవాహంగా మార్చాలంటే సంబంధిత గెలాక్సీకి తగినంత గురుత్వాకర్షణ శక్తి, ద్రవ్యరాశి ఉండాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఈ ఆవిష్కరణ డార్క్ మ్యాటర్‌తో పాటు గెలాక్సీల పుట్టుక, పరిణామంపై శాస్త్రవేత్తల అవగాహనను మరింత విస్తరించే అవకాశం ఉంది.

స్వాతంత్య వేడుకలకు ఖర్గే, రాహుల్ గైర్హాజరు


  • వరుసగా రెండో ఏడాది మోదీ కార్యక్రమానికి దూరం



ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలోని ఎర్రకోటపై నిర్వహించిన 80వ స్వాతంత్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో ఏడాది గైర్హాజరయ్యారు. అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఈ గైర్హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది.


2024లో స్వాతంత్య వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీకి సీటు కేటాయింపుపై వివాదం చెలరేగింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా కలిగిన ఆయనకు సంప్రదాయం, ప్రొటోకాల్‌కు భిన్నంగా రెండో చివరి వరుసలో సీటు కేటాయించారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్‌ ఎంపీకి అలా సీటు కేటాయించడం ప్రజలను అవమానించడమేనని విమర్శించింది. అయితే కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖ.. ప్రాంగణంలో ఒలింపియన్లకు సీట్లు కల్పించేందుకు ఏర్పాట్లలో మార్పులు చేసినట్లు వివరణ ఇచ్చింది.ప్రొటోకాల్‌ ప్రకారం అధికారిక వేడుకల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు సాధారణంగా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో 2024లో చోటుచేసుకున్న పరిణామాలు అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.


ఇదిలా ఉండగా, గురువారం ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. సమావేశాల ఉత్పాదకత తక్కువగా ఉండటానికి పరస్పరం ఒకరినొకరు అధికార, ప్రతిపక్షాలు నిందించుకున్నాయి. జూలై 20న సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులు పార్లమెంట్‌ వైపు మార్చ్‌ నిర్వహించడం కూడా రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందగా, వాటిలో ఒక్క బిల్లుపైనే విస్తృత చర్చ జరిగింది. పరీక్షల్లో పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టంపై మాత్రమే సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేసిన సంప్రదాయ టీ పార్టీని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు బహిష్కరించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది స్వాతంత్య దినోత్సవ వేడుకలకు ఖర్గే, రాహుల్‌ గాంధీ దూరంగా ఉండటం అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చింది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా మార్మోగిన 'వందేమాతరం'

 

  • ఎర్రకోటపై చరిత్రాత్మక ఘట్టం



భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ‘వందే మాతరం’ తొలిసారిగా సంపూర్ణంగా ఆలపించబడింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలోని ఎర్రకోటపై నిర్వహించిన అధికారిక వేడుకల్లో జాతీయ గీతం ‘జన గణ మన’కు ముందు జాతీయ గీతిక ‘వందే మాతరం’ను పూర్తిగా ఆలపించారు. అనంతరం సంప్రదాయంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’కు 150 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఘట్టానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఎర్రకోట బురుజులపై ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సమయంలో 1721 ఫీల్డ్ బ్యాటరీకి చెందిన దేశీయంగా తయారైన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 తుపాకుల వందనం సమర్పించారు. అనంతరం ఆర్మీ బ్యాండ్ ‘వందే మాతరం’ను ఆలపించింది. భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు వేడుకల ప్రాంగణంపై పూలవర్షం కురిపించాయి. వాటిలో ఒక హెలికాప్టర్‌ జాతీయ పతాకాన్ని, మరోటి ‘వందే మాతరం’ అని రాసిన పతాకాన్ని మోసుకెళ్లింది.


జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఎర్రకోటపై ‘వందే మాతరం’ను తొలిసారిగా ఆలపించడం ఇదేనని పేర్కొన్నారు. అనంతరం జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలాపనతో వేడుకల్లో ఈ చారిత్రక ఘట్టం పూర్తయింది. ఇటీవల ‘వందే మాతరం’ సంపూర్ణ రూపానికి జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ కల్పించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం పూర్వసంధ్యన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ముందు, అనంతరం కూడా సంపూర్ణ ‘వందే మాతరం’ను ఆలపించారు.


జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం సవరణ బిల్లు-2026కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ‘వందే మాతరం’కు జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. సవరించిన చట్టం ప్రకారం జాతీయ గీతిక ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా భంగం కలిగించడం నేరంగా పరిగణించబడుతుంది. దీనికి జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో ‘వందే మాతరం’ పోషించిన కీలక పాత్రను రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో గుర్తుచేశారు. స్వదేశీ ఉద్యమం సమయంలో ఈ గీతం ప్రజల గీతంగా మారిందని ఆమె పేర్కొన్నారు. బంకిమ్‌చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ‘ఆనందమఠం’ నవలలో తరువాత ‘వందే మాతరం’ భాగమైంది. 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా దీనిని ఆలపించారు. 1905 ఆగస్టు 7న ‘వందే మాతరం’ తొలిసారిగా రాజకీయ నినాదంగా వినిపించినట్లు ప్రభుత్వ వివరాలు పేర్కొంటున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన ఈ గీతం.. 150 ఏళ్ల తర్వాత కూడా భారత జాతీయ భావనలో ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ పిలుపు



80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా 13వసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ను నిర్మించేందుకు దేశ ప్రజలు పెద్ద కలలు కనాలని, వాటిని సంకల్పం, సామర్థ్యంతో సాకారం చేసేందుకు సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్థిక స్వావలంబన, దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, అణుశక్తి వంటి వ్యూహాత్మక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

మహిళలకు పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని మోదీ కోరారు. మహిళా శక్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెబుతూ, రాజకీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని జాతీయ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక సాధికారతలో భాగంగా 6 కోట్ల ‘లఖ్‌పతి దీదీ’లను సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.



జనగణనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కూడా ప్రధాని కోరారు. కుటుంబ వివరాలు డిజిటల్‌గా సరిగ్గా నమోదయ్యేలా యువత చొరవ చూపాలని సూచించారు. 2027 జనగణన దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్‌ జనగణనగా జరగనుండగా, జనాభా లెక్కల దశలో కుల వివరాలను కూడా సేకరించనున్నారు.

జాతీయ భద్రతపై మాట్లాడుతూ యుద్ధ స్వరూపం మారుతోందని, సరిహద్దుల్లో జరిగే సంప్రదాయ పోరాటాలకే పరిమితం కాకుండా బ్యాంకింగ్‌, మౌలిక సదుపాయాలు, రిఫైనరీలు వంటి కీలక రంగాలపై కూడా ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ పేర్కొన్నారు. దేశంలో పౌర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.



నక్సలిజంపై మాట్లాడుతూ సాయుధ నక్సలిజం గణనీయంగా బలహీనపడిందని, మావోయిజం అంతిమ దశకు చేరుకుందని మోదీ అన్నారు. అయితే సాయుధ హింస తగ్గినప్పటికీ భావజాల రూపంలో కొనసాగుతున్న ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలని, తాను ‘మేధో నక్సల్స్‌’గా పేర్కొన్న వారిని కూడా ఒంటరిగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత్‌ ఆర్థిక వ్యవస్థ గత దశాబ్దంలో వేగంగా ఎదిగిందని, 2014లో ‘ఫ్రాజైల్‌ ఫైవ్‌’లో ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని పేర్కొన్నారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’కు ప్రజలు మద్దతు ఇవ్వాలని, దేశ ఆర్థిక భద్రత కోసం స్వావలంబన అత్యవసరమని చెప్పారు. అణుశక్తి సామర్థ్యాన్ని 200 గిగావాట్లకు పెంచే లక్ష్యంతో ఐదు కొత్త అణు రియాక్టర్ల దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని తెలిపారు.



ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఎర్రకోట వేదికగా ‘వందే మాతరం’ ఆలాపన జరగడాన్ని మోదీ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.




Thursday, 13 August 2026

పార్లమెంట్‌కు వచ్చి ‘వార్తల సాగు’ చేశారు

  • మోదీకి జైరాం రమేశ్‌ సూటి ప్రశ్న

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో చర్చలకు సిద్ధంగా ఉన్నారని పదేపదే చెబుతున్నారని, కానీ వాస్తవానికి ఆయన పార్లమెంట్‌కు వచ్చి తన గదిలో కూర్చొని ‘వార్తల సాగు’ చేసేవారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌ విమర్శించారు.




అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ట్రస్టుపై ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, పార్లమెంట్‌లో దీనిపై చర్చ ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోందని ఆయన అన్నారు. అయితే 2020 ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా లోక్‌సభలో అయోధ్యలో ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ నిర్ణయానికి ఘనంగా క్రెడిట్‌ తీసుకున్నారని జైరాం రమేశ్‌ గుర్తుచేశారు.

‘‘ఇప్పుడు అదే ట్రస్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశమని అంటున్నారు. అలాంటప్పుడు 2020 ఫిబ్రవరి 5న లోక్‌సభలో నరేంద్ర మోదీ స్వయంగా ఆ ట్రస్టు ఏర్పాటును ఎందుకు ప్రకటించారు? దాని క్రెడిట్‌ను ఎందుకు తీసుకున్నారు?’’ అని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. 

2047 నాటికి గౌరవనీయ దేశంగా భారత్‌


  • శాంతియుత విప్లవానికి సోనం వాంగ్‌చుక్‌ పిలుపు



స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ దేశ రాజకీయ నాయకత్వాన్ని ఎన్నుకునే విధానంలో ‘‘శాంతియుత విప్లవం’’ రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ గౌరవనీయమైన దేశంగా కొనసాగాలంటే రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పు అవసరమని ఆయన అన్నారు.స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్‌చుక్‌ ‘‘భారత్‌ రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు స్వార్థరహితంగా, నిర్భయంగా పనిచేసే, నైతిక విలువలు, సామర్థ్యం కలిగిన నాయకులను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. దేశానికి అవసరమైన మార్పు శాంతియుత మార్గంలోనే సాధించాలని పిలుపునిచ్చారు.

మోడీ, అమిత్ షా రాజీనామా చేసేవరకు నిద్రపోనివ్వం


  • బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు



ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు రాజీనామా చేసేవరకు వారిని నిద్రపోనివ్వమని, దేశ ప్రజల ఆకాంక్షలు , గొంతుక ఇప్పుడు ఆపలేనిశక్తిగా మారాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యూఢిల్లీలో జరిగిన 'రచనాత్మక్ కాంగ్రెస్ జాతీయ సదస్సు'లో గురువారం ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని, మోడీ -షాలు తమ వల్ల కాదని ఒప్పుకుని దిగిపోయే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటం హింస లేదా ద్వేషంతో కూడుకున్నది కాదని, దేశ సంస్కృతి, ప్రేమ , సోదరభావాన్ని కాపాడటానికేనని వ్యాఖ్యానించారు. మోడీ ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) తీవ్రమైన అంతర్గత తిరుగుబాటు జరుగుతోందని, ఆ సమాచారం నేరుగా తనకు అందుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.


భారత విదేశాంగ విధానాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పశ్చిమాసియా , ఇరాన్ సంక్షోభంలో భారత్, అమెరికా, రష్యాలతో ఉన్న మంచి సంబంధాలను ఉపయోగించి మధ్యవర్తిత్వం వహించే గొప్ప అవకాశాన్ని వదులుకుందని, దానివల్ల భారత్ స్థానంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా మారిందని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మన పెట్రోలింగ్ ప్రాంతాలను చైనా ఆక్రమించి అడ్డుకుంటున్నప్పటికీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర మోడీలు మీడియాపై ఒత్తిడి తెచ్చి ఆ వార్తలను నొక్కేస్తున్నారని ఆరోపించారు. గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని చేసిన ప్రకటనలు చైనాతో చర్చలలో భారత సైన్యం బలాన్ని తగ్గించాయని మండిపడ్డారు. కేవలం అదానీ వంటి కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాలు, రాజకీయ నిధుల కోసమే దేశ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు.


నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థుల గొంతు నొక్కడానికి ప్రభుత్వం యత్నించిందని, తమకు అనుకూలమైన ఆంక్షల వ్యవస్థను ప్రజలపై రుద్దడమే బీజేపీ రాజకీయ తత్వమని రాహుల్ ఆరోపించారు. దేశ ప్రజల స్వేచ్ఛా భావవ్యక్తీకరణను కాపాడటమే కాంగ్రెస్ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ సంస్థకు నేటి ఆధునిక భారతదేశపు సంస్కృతి, చరిత్రపై కనీస అవగాహన లేదని, 3,000 ఏళ్ల నాటి పాత విషయాలను మాట్లాడేవారు వర్తమాన భారతాన్ని అర్థం చేసుకోలేరని ఎద్దేవా చేశారు.

Featured post

పాలపుంత వెలుపల నక్షత్రాల ప్రవాహం

డార్క్ మ్యాటర్‌ నిగూఢాలను విప్పే దిశగా హబుల్ టెలిస్కోప్ అరుదైన ఆవిష్కరణ అంతరిక్ష రహస్యాలను ఛేదించే క్రమంలో నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్...