- మణిపూర్ సంగీతకారుడి హత్యపై రాహుల్ గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: మణిపూర్కు చెందిన ప్రముఖ సంగీతకారుడు చోంగ్తమ్ విక్రమ్ సింగ్ హత్యపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి బయట శబ్దం తగ్గించమని చెప్పేందుకు వెళ్లిన విక్రమ్ సింగ్ను కొందరు వ్యక్తులు కొట్టి చంపారని ఆయన పేర్కొన్నారు.‘‘తన ఇంటి బయట పెద్దగా శబ్దం చేస్తున్న కొందరిని తగ్గించమని చెప్పేందుకు విక్రమ్ సింగ్ కిందికి వెళ్లారు. అక్కడే ఆయనపై దాడి చేసి హత్య చేశారు. తన సొంత ఇంటి బయట, తన సొంత దేశ రాజధానిలో ఓ తండ్రి హత్యకు గురయ్యారు’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలపై వరుసగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావించిన ఆయన.. దేశ రాజధానిలో తాము సురక్షితంగా ఉన్నామా? అనే ప్రశ్న ప్రతి ఈశాన్య రాష్ట్ర కుటుంబాన్ని వెంటాడుతోందని అన్నారు.‘‘ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగిన తర్వాత ఢిల్లీలోని ప్రతి ఈశాన్య కుటుంబం ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతోంది.. ఇక్కడ మేం సురక్షితమేనా? పెరుగుతున్న ఈ అరాచకాన్ని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. విక్రమ్ సింగ్ హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రాహుల్ గాంధీ తన సానుభూతిని తెలిపారు.



