Thursday, 30 July 2026

పార్లమెంట్‌లో హైడ్రామా..

 

  • రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు
  • లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లు
  • రాహుల్-బీజేపీ మధ్య మాటల యుద్ధంతో వేడెక్కిన వర్షాకాల సమావేశాలు 



పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించిన సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) సవరణ బిల్లు–2026 చర్చకు రాగా, మరోవైపు రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026తో పాటు ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టారు. అయితే బిల్లుల కంటే ఎక్కువగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలతో సభా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.


లోక్‌సభ ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. అనంతరం గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖల మంత్రులు పత్రాలు సభ ముందుంచారు. భారతదేశం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పోషిస్తున్న పాత్ర, భారత్-బంగ్లాదేశ్ భవిష్యత్ సంబంధాలపై విదేశాంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలను కూడా సభలో ప్రవేశపెట్టారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం సంబంధిత బిల్లును పరిశీలించారు.


రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్న ప్రభుత్వ అత్యున్నత నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి నిబంధనలతో పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని వివరించారు.


బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. "పేపర్ దొంగలు స్వేచ్ఛగా తిరుగుతుంటే, కష్టపడి చదివిన విద్యార్థులే శిక్ష అనుభవిస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం?" అని ప్రశ్నించారు. అసలు దోషులు నవ్వుకుంటూ తిరుగుతుంటే అమాయక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత గంభీరంగా తీసుకుని సమగ్ర సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చ ప్రతిధ్వని గురువారం కూడా కొనసాగింది. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థితో జరిగిన సంభాషణను వివరిస్తూ రాహుల్ ఉపయోగించిన ఒక పదాన్ని స్పీకర్ ఓం బిర్లా సభా రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీ ప్రాథమిక పార్లమెంటరీ నియమాలపై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తూ, దేశ భవిష్యత్తైన యువతను అవమానించేలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని విమర్శించారు.


జూలై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా కాల్పులు జరిగాయని, అందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర స్పష్టంగా స్పందిస్తూ విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని, కాల్పులకు సంబంధించిన ఆదేశాలు మంత్రులు కాదు, మేజిస్ట్రేట్ మాత్రమే జారీ చేస్తారని తెలిపారు. అమిత్ షా కాల్పులకు ఆదేశించారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.


మరోవైపు కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టారు. జూలై 20న విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసు చర్యపై హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై కూడా కేంద్రాన్ని నిలదీశారు. ప్రతీకాత్మకంగా విరాళాల పెట్టెను ఉంచి నిరసన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా అమిత్ షా సభకు వచ్చి ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా, విద్యార్థులపై పెలెట్ గన్స్ వినియోగానికి బాధ్యులైన వారు క్షమాపణ చెప్పాలని, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కపిల్ సిబల్ కూడా ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి మౌనం ఎందుకని ప్రశ్నించారు.


అయితే బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. జేపీ నడ్డా రాజ్యసభలో మాట్లాడుతూ, ప్రతిపక్షం మొదటి రోజు నుంచే సభా కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం నిరంతరం కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తోందని విమర్శించారు. బీజేపీ ఎంపీలు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, గజేంద్ర సింగ్ షెఖావత్ తదితరులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనని కంగనా రనౌత్ వ్యాఖ్యానించగా, గజేంద్ర సింగ్ షెఖావత్ ఎన్నికల పరాజయాల వల్లే కాంగ్రెస్ నిరాశతో ఆధారంలేని ఆరోపణలు చేస్తోందని అన్నారు.


ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ రాజకీయ ఫిరాయింపులను అరికట్టేందుకు కొత్త యాంటీ డిఫెక్షన్ చట్టంపై చర్చ జరపాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభలో రణదీప్ సింగ్ సూర్జేవాలా అయోధ్య శ్రీరామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై అత్యవసర చర్చ కోరారు.


అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఆ రాష్ట్రాల ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివరించగా, బాధిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు వర్గాలు తెలిపాయి.


సభలో పదేపదే నినాదాలు, నిరసనల కారణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై విస్తృత చర్చ ప్రారంభమైంది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ బిల్లుతో ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం పేర్కొనగా, కేవలం చట్టాలు తీసుకురావడం కాకుండా విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని ప్రతిపక్షం అభిప్రాయపడింది.

Wednesday, 29 July 2026

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం



  • హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం
  •  నంది, గాయత్రి పంప్ హౌస్‌లలో మోటార్లు షురూ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ , కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌లోని బాహుబలి మోటార్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఆన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం చేసిన నిరంతర పోరాటానికి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టుదలకు లభించిన విజయంగా ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల మోటార్లను స్టార్ట్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. రైతుల పంట పొలాలకు, తాగునీటి అవసరాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరంతర పోరాటం సాగించారు. ప్రతిపక్షాల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు , రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి మోటార్లను ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసింది.  ప్రస్తుతం అధికారులు పంప్ హౌస్‌లలోని రెండు బాహుబలి మోటార్లను అందుబాటులోకి తెచ్చి, దాని ద్వారా 6,300 క్యూసెక్కుల గోదావరి నీటిని దిగువనున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్) వైపు ఎత్తిపోస్తున్నారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పంప్ హౌస్‌లను ఐడిల్‌గా ఉంచడంపై బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించి, నీటి విడుదల ప్రారంభం కావడంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం పరిధిలోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజాక్షేత్రంలో రైతుల తరఫున నిలబడి పోరాడితే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరి వీడైనా దిగిరాక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించిందని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. 

సీఎం సన్నిహితుడి వేధింపుల వల్లే పెద్ది కి ఈ పరిస్థితి

  •  తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, కాంగ్రెస్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో నిరూపించేందుకు ఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనమని బీఆర్ఎస్ నేత, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి ఈ రకమైన తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫహీం ఖురేషీనే ప్రధాన కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారం వెనుక ఉన్న వివరాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాకు వివరిస్తూ.. నర్సంపేటకు చెందిన కొందరు స్థానిక వ్యాపారవేత్తలు వాసవి బిల్డర్స్‌కు తమ భూమిని విక్రయించారని, అయితే ఆ భూమిపై ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన ఫహీం ఖురేషీ కన్నుపడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాసవి బిల్డర్స్‌కు చెందిన విజయ్ కుమార్ మరియు ఫహీం ఖురేషీ ఇద్దరూ కలిసి సైబరాబాద్‌లోని 'ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్' (EOW) లో ఒక కేసు నమోదు చేయించారని తెలిపారు. అనంతరం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులతో తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యాపారులను వేధిస్తూ.. ప్రతీ విషయంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఏ విధంగానైనా ఆయనను ఈ కేసులో నిందితుడిగా (అక్యూజ్డ్) చేర్చాలనే కుట్రపూరిత ప్లాన్ నడుస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ అక్రమ వేధింపులపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ.. "నా చేతిలో ఏమీ లేదు, ఈ వ్యవహారమంతా ఫహీం ఖురేషీ , ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పర్యవేక్షణలోనే జరుగుతోంది" అని ఆయన చేతులు దులుపుకున్నారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన గురుకులాల్లో బెంకర్ బెడ్ల కుంభకోణంపై సుదర్శన్ రెడ్డి గళమెత్తి వాస్తవాలను బయటపెట్టినందుకే, కక్షపూరితంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ స్థాయి వేధింపులకు పాల్పడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు.

రాహుల్ గాంధీ తనే ఉచ్చులో చిక్కుకున్నారు

 అమిత్ షాపై ఆరోపణలపై కిరణ్ రిజిజు ఘాటు విమర్శలు

న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రెండు కారణాల వల్ల తీవ్ర నిరాశ కలిగించారని ఆయన అన్నారు. పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేతగా ఒక్క నిర్మాణాత్మక అంశాన్ని కూడా ప్రస్తావించలేకపోయారని, బిల్లుపై మాట్లాడాల్సిన సమయంలో అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ సభను తప్పుదారి పట్టించారని విమర్శించారు.



అంతేకాకుండా పార్లమెంటుకు తగని పదజాలాన్ని ఉపయోగించడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నిరాధార ఆరోపణలు చేశారని రిజిజు మండిపడ్డారు. కాల్పులు జరపాలని ఆదేశించే అధికారం హోంమంత్రికీ, మరే ఇతర మంత్రికీ ఉండదని స్పష్టం చేశారు. అలాంటి ఆదేశాలు ఇవ్వడం మంత్రుల పరిధిలో ఉండదని, సంఘటన స్థలంలో ఉన్న మేజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటారని చెప్పారు.

ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి ఇంత ప్రాథమిక విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని రిజిజు వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ తనే తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారని, "తానే తనను ఉచ్చులోకి నెట్టుకున్నారు" అని అన్నారు. ఆయన పరిస్థితి పట్ల తనకు బాధగా ఉందని కూడా పేర్కొన్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రతిపక్ష నేత సభలో నిర్మాణాత్మక చర్చకు తోడ్పడతారని తాను ఎప్పుడూ ఆశిస్తానని, అయితే ఈసారి రాహుల్ గాంధీ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని కిరణ్ రిజిజు విమర్శించారు.

జెన్-జెడ్‌తో భారత రాజకీయ పార్టీల ‘సిట్యుయేషన్‌షిప్’

ఒకప్పుడు రాజకీయపార్టీలు యువతను ఆకర్షించాలంటే ఎన్నికల హామీలు, ఉద్యోగాల ప్రకటనలు, సంక్షేమ పథకాలు సరిపోతాయని భావించేవి. కానీ నేటి జెన్-జెడ్ (1997-2012 మధ్య జన్మించిన తరం) పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ముందుకు వస్తోంది. వీరిని కేవలం హామీలతో గానీ, సోషల్ మీడియా ప్రచారంతో గానీ ప్రభావితం చేయడం అంత సులభం కాదు. వీరి ఆలోచనా విధానం, భాష, ఆశయాలు, నిరసన తెలిపే శైలి, రాజకీయాలపై దృష్టి అన్నీ గత తరాల కంటే విభిన్నంగా ఉండటంతో భారత రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక విచిత్రమైన "సిట్యుయేషన్‌షిప్"లో చిక్కుకున్నాయి. జంతర్ మంతర్‌లో కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఉద్యమం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష సంబంధం లేకుండా, సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని, మీమ్స్‌, వీడియోలు, సృజనాత్మక ప్రచారం, చర్చలు, వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా ఈ తరం తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించగలదని నిరూపించింది.



జెన్-జెడ్‌ను చాలామంది అహంకారంతో కూడిన తరం, సౌకర్యాలు మాత్రమే కోరుకునే యువతగా చిత్రీకరిస్తుంటారు. ఉద్యోగంలో మైక్రో మేనేజ్‌మెంట్ వద్దు, ఇంటి నుంచే పని చేసే అవకాశం ఉండాలి, జాయినింగ్ బోనస్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వంటి డిమాండ్లు వారి స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావిస్తారు. అయితే అదే సమయంలో నిరుద్యోగం, తీవ్రమైన పోటీ, కెరీర్‌పై అనిశ్చితి, పరీక్షలలో అవకతవకలు వంటి అంశాలు వారిలో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహాన్ని కూడా రేకెత్తిస్తున్నాయి. బయటకు ఆత్మవిశ్వాసంగా కనిపించే ఈ తరం లోపల తీవ్రమైన భవిష్యత్ ఆందోళనతో జీవిస్తోంది. అయితే జెన్-జెడ్‌ను ఒకే కోణంలో చూడడం పొరపాటే. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్ కావాలని కలలు కనే యువత ఉన్నారు. మరోవైపు మెట్రో నగరాల్లో ఆధునిక జీవనశైలిని అనుసరించే యువత కూడా ఉన్నారు. కులం, భాష, ఆర్థిక స్థితి, ప్రాంతం వంటి అనేక అంశాల్లో వీరిలో వైవిధ్యం ఉన్నప్పటికీ, ఒక విషయంలో మాత్రం అందరూ ఒకేలా ఉంటారు. తమను ఎవరూ తక్కువ అంచనా వేయడం వీరికి ఇష్టం ఉండదు. తాము సరైందని నమ్మితే ఎంతటి అధికారాన్నైనా ప్రశ్నించడానికి వెనుకాడరు.


సీజేపీ ఉద్యమం మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అధికారికంగా అనుబంధం లేకపోయినా, అవసరమైతే అత్యంత క్రమశిక్షణతో ఉద్యమాన్ని నడిపించగల సామర్థ్యం ఈ తరానికి ఉందని చూపించింది. సోషల్ మీడియా, మీమ్స్‌, స్టాండ్-అప్ కామెడీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, వైరల్ వీడియోలు వీరి రాజకీయ చైతన్యానికి కొత్త వేదికలుగా మారాయి. గతంలో పత్రికల సంపాదకీయాలు, టీవీ చర్చలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని సోషల్ మీడియా కంటెంట్ ఆక్రమిస్తోంది. ఈ మార్పును రాజకీయ పార్టీలు ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా యువతతో అనుసంధానం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సీజేపీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువతకు చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ జెన్-జెడ్‌కు కేవలం ప్రచారం కాదు, తమ మాట వినే నాయకత్వం కావాలి. వారికి ఉపన్యాసాల కంటే సంభాషణ ముఖ్యం. ప్రచారం కంటే పారదర్శకత అవసరం.


జెన్-జెడ్ భాష కూడా రాజకీయ నాయకులకు కొత్త సవాలుగా మారింది. "గ్యాస్‌లైటింగ్", "రెడ్ ఫ్లాగ్", "నో క్యాప్", "బెట్" వంటి పదాలు వీరి రోజువారీ సంభాషణలో భాగమయ్యాయి. అదే సమయంలో భగత్‌సింగ్‌, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి చారిత్రక నాయకుల చిత్రాలను ప్రదర్శిస్తూ, మరోవైపు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో కూడిన వ్యక్తీకరణలను కూడా వినియోగిస్తున్నారు. సంప్రదాయం, ఆధునికత రెండింటినీ కలిపి ముందుకు సాగే ఈ తరం రాజకీయ విశ్లేషకులకు కూడా కొత్త పాఠాలు నేర్పుతోంది. ఈ తరం స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో త్యాగాలకు సిద్ధపడే ఆదర్శవాదులు కాకపోవచ్చు. కానీ తమ హక్కులు, అవకాశాలు, భవిష్యత్తు విషయంలో మాత్రం రాజీ పడే స్వభావం వీరిది కాదు. అందుకే వీరి నిరసనలు భావోద్వేగాల కంటే ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి. పరీక్షల్లో పారదర్శకత, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, మెరుగైన పాలన వంటి అంశాలపై స్పష్టమైన డిమాండ్లతో ముందుకు వస్తున్నారు.


ఇటీవలి తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆర్థికాభివృద్ధి, సంక్షేమ పథకాల పరంగా మంచి పనితీరు కనబరిచినప్పటికీ డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. సోషల్ మీడియాలో చురుకుగా ప్రచారం నిర్వహించిన టీవీకే యువతను ప్రభావితం చేయడంలో విజయవంతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. యువత తమ కుటుంబ సభ్యుల ఓటింగ్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగల స్థాయికి చేరుకుందని ఈ ఎన్నికలు సూచించాయి. భారత రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. జెన్-జెడ్‌ను కేవలం ఓటు బ్యాంకుగా చూడడం, ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకోవడం, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం ద్వారా వారి మద్దతు పొందడం ఇక సాధ్యం కాదు. ఈ తరం ఆలోచనా విధానాన్ని, ఆశయాలను, ఆందోళనలను, కమ్యూనికేషన్ శైలిని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఏర్పడింది.


క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్ నుంచి టీ20 ఫార్మాట్‌కు మారినంత పెద్ద మార్పు ఇప్పుడు భారత రాజకీయాల్లో చోటుచేసుకుంటోంది. పాత రాజకీయ వ్యూహాలు కొత్త తరంపై పనిచేయడం లేదు. జెన్-జెడ్ విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే రాజకీయ పార్టీలు ముందు వారిని అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ "పాలిటికల్ సిట్యుయేషన్‌షిప్" ఎప్పటికీ నిజమైన రాజకీయ సంబంధంగా మారకపోవచ్చు.

కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మరింత దుమారం

 


విద్యార్థులపై తీవ్ర విమర్శలు, మీడియా-సీజేపీతో మాటల యుద్ధం

న్యూఢిల్లీ, జూలై 29: ఇటీవలి విద్యార్థుల ఆందోళనలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సమర్థించుకుంటూ కొత్త వీడియో విడుదల చేయడంతో వివాదం మరింత ముదిరింది. విద్యార్థి నిరసనల్లో పాల్గొన్న జెన్-జెడ్ యువతను ఉద్దేశించి ఆమె "ఫెమీ-నాజీలు", "గట్టర్ ఛాప్" వంటి పదాలను ఉపయోగించగా, కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలతో కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు.

గత కొన్ని రోజులుగా పరీక్షలలో అవకతవకలకు వ్యతిరేకంగా సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని లక్ష్యంగా చేసుకుని కంగనా వరుస పోస్టులు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే జెన్-జెడ్‌ను "గట్టర్ జనరేషన్"గా, వారి సోషల్ మీడియా రీల్స్‌ను "వాంతులు తెప్పించేలా ఉంటాయి" అంటూ విమర్శించిన ఆమె వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి.

బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో మీడియాపైనే కంగనా తీవ్ర విమర్శలు చేశారు. కొందరు నిరసనకారులు పిల్లలు, మహిళలు, పెద్దల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించారని, అలాంటి "గట్టర్ ఛాప్" ప్రవర్తనను సమాజం ఎప్పటికీ అంగీకరించదని చెప్పారు. పిల్లలు లైంగిక సంకోచానికి గురయ్యేలా చేసే ప్రవర్తనను సమర్థించలేమని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కొందరు నిరసనకారులు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపించిన కంగనా, కొందరు ఆయనను నాయకుడిగా, మరికొందరు కుటుంబ సభ్యుడిగా, ఇంకొందరు దేవుడిగా భావిస్తారని అన్నారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం ఆధునికత కాదని, ఇది ప్రాథమిక సామాజిక మర్యాద అని పేర్కొంటూ, "ఫెమీ-నాజీల ప్రభావానికి లోనై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు" అని యువతకు సూచించారు.

తన వ్యాఖ్యలను విమర్శించిన ఓ మహిళా యాంకర్‌ను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో మరో ఘాటు పోస్టు చేసిన కంగనా, ఆమె వీధుల్లోకి వెళ్లి దుస్తులు విప్పి తిట్లు తిట్టే స్వేచ్ఛను ప్రదర్శించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో వివాదం మరింత ముదిరింది.

మరోవైపు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. యువతపై ఇలాంటి భాష ఉపయోగించడం మానసిక స్థిరత్వం ఉన్న వ్యక్తి లక్షణం కాదని, తన పార్టీ సభ్యులే ఆమెను సీరియస్‌గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం ద్వారా ప్రచారం పొందాలని కంగనా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనికి కంగనా కూడా ఘాటుగానే స్పందించారు. సౌరవ్ దాస్ పూర్తిగా పనిలేని వ్యక్తి అని, 28 ఏళ్ల వయస్సులో కూడా తాను విద్యార్థినేనని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తన వయస్సులో తాను ఇప్పటికే రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని, తాను కొత్త ఎంపీ అయినప్పటికీ సినీ దర్శకురాలు, నటి, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పారు. తనలాంటి బిజీ జీవితాన్ని సౌరవ్ దాస్ వంటి నిరుద్యోగి ఎప్పటికీ అర్థం చేసుకోలేడని విమర్శించారు.

కంగనా వ్యాఖ్యలను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఏఐఎంఐఎం నేతలు తీవ్రంగా ఖండించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు అయిన జెన్-జెడ్ యువతను అవమానించడం ఒక ప్రజాప్రతినిధికి తగదని అన్నారు. యువత తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారికి సంభాషణ ద్వారా సమాధానం చెప్పాలే తప్ప అవమానించడం సరికాదని పేర్కొన్నారు.

నటుడు సోనూ సూద్ కూడా కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు. "జెన్-జెడ్‌ను గట్టర్ జనరేషన్ అని పిలిచి ఉంటే అది చాలా సిగ్గుచేటు. మాట్లాడే ముందు ఆలోచించాలి. ప్రజలు దేవుడి మరో రూపం" అని వ్యాఖ్యానించారు.

జూన్ 20న జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన సీజేపీ నేతృత్వంలోని విద్యార్థి ఉద్యమం జూలై 25న ముగిసింది. ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా కీలక అంశాలపై ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిరసనలను విరమించారు.

ఇజ్రాయెల్–ఇరాన్ రహస్య చమురు పైప్‌లైన్‌పై మళ్లీ చర్చ

 


హౌతీల దాడులతో సౌదీకి అదే ప్రత్యామ్నాయ మార్గమా?

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా చమురు మౌలిక సదుపాయాలు, ఎర్ర సముద్రంలోని చమురు రవాణా మార్గాలపై వరుస దాడులు కొనసాగిస్తుండటంతో రియాద్‌కు ఐరోపాకు ముడి చమురు ఎగుమతి చేయడం మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్, అప్పటి షా పాలనలో ఉన్న ఇరాన్ కలిసి అత్యంత రహస్యంగా నిర్మించిన ఒక చమురు పైప్‌లైన్ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఐరోపాకు చమురు సరఫరా చేయడానికి ఈ పైప్‌లైన్ కీలక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవలి రోజుల్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ అరామ్‌కోకు చెందిన జజాన్, యాన్‌బు చమురు కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించగా, సౌదీ ప్రభుత్వం పలువురు డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది. రాయిటర్స్ కథనం ప్రకారం జూలై 27న జరిగిన దాడి తర్వాత రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న జజాన్ రిఫైనరీ కార్యకలాపాలను సౌదీ అరామ్‌కో తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ దాడిలో రిఫైనరీకి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్యాసిఫికేషన్ కాంప్లెక్స్, నిల్వ ట్యాంకులు దెబ్బతిన్నాయని, మరమ్మతులు ఆగస్టు మధ్య వరకు కొనసాగే అవకాశముందని పేర్కొంది.

సౌదీ అరేబియా ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని తప్పించేందుకు తూర్పు ప్రాంతాల నుంచి యాన్‌బు వరకు చమురును తరలించే ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌ను వినియోగిస్తోంది. అయితే అక్కడి నుంచి ఐరోపాకు వెళ్లాలంటే బాబ్ అల్-మందెబ్ జలసంధి మీదుగానే చమురు ట్యాంకర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుతం హౌతీల దాడుల కారణంగా ఈ మార్గం కూడా ప్రమాదకరంగా మారడంతో సౌదీ కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని ఎర్ర సముద్ర తీర నగరం ఎయిలాత్‌ను మధ్యధరా సముద్రంలోని అష్కెలాన్‌తో అనుసంధానించే 254 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌పై దృష్టి పడింది. 1960ల చివర్లో అప్పటి ఇరాన్ షా మొహమ్మద్ రెజా పహ్లవీ పాలనలో ఇరాన్ పెట్టుబడులతో, ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో ఈ పైప్‌లైన్‌ను అత్యంత రహస్యంగా నిర్మించారు. అప్పట్లో ఇరాన్ నుంచి ఎయిలాత్‌కు చేరిన ముడి చమురును ఈ పైప్‌లైన్ ద్వారా అష్కెలాన్‌కు తరలించి అక్కడి నుంచి ఐరోపాకు పంపేవారు. ఈ మార్గం ద్వారా సూయజ్ కాలువను పూర్తిగా తప్పించవచ్చనే వ్యూహాత్మక ప్రయోజనం ఉండేది.

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) డీక్లాసిఫై చేసిన పత్రాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు అప్పట్లో అమెరికా కూడా అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం ఇచ్చింది. భారీ సూపర్ ట్యాంకర్లు ఎయిలాత్‌లో చమురును దించి, అక్కడి నుంచి 42 అంగుళాల పైప్‌లైన్ ద్వారా అష్కెలాన్‌కు తరలించి, అక్కడి నుంచి చిన్న నౌకల్లో ఐరోపాకు పంపే విధంగా దీన్ని రూపొందించారు. మొదట ఏడాదికి రెండు కోట్ల టన్నుల చమురును తరలించే సామర్థ్యంతో నిర్మించగా, తర్వాత దానిని ఐదు నుంచి ఆరు కోట్ల టన్నులకు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గం సూయజ్ కాలువ లేదా ఆఫ్రికా దక్షిణ తీరంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా CIA అంచనా వేసింది.

ఈ మౌలిక సదుపాయాలను నిర్వహించే సంస్థ ప్రస్తుతం **యూరప్–ఏషియా పైప్‌లైన్ కంపెనీ (EAPC)**గా కొనసాగుతోంది. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోవడంతో ఈ సంస్థపై ఇజ్రాయెల్ పూర్తిగా నియంత్రణ సాధించింది. అనంతరం స్విట్జర్లాండ్‌లోని మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఇరాన్‌కు 1.1 బిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చినా, శత్రుదేశాల చట్టాల కారణంగా ఆ మొత్తాన్ని చెల్లించలేమని ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలపై 1968లో అమల్లోకి వచ్చిన ప్రత్యేక గోప్యతా నిబంధనలు కొనసాగుతున్నాయి.

ఇజ్రాయెల్ ఇంధన మంత్రి ఎలి కోహెన్ ఇప్పటికే సౌదీ నుంచి ఎయిలాత్ వరకు సుమారు 700 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ నిర్మాణ ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు జే లెట్నీ వెల్లడించారు. 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో విఫలమైన ఒప్పందం తర్వాత ఇలాంటి ప్రతిపాదనను అధికారికంగా ముందుకు తీసుకురావడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రణాళిక పూర్తిగా సౌదీ రాజకీయ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.

ఈ ప్రణాళిక అమలైతే సౌదీ చమురు ముందుగా ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్ ద్వారా యాన్‌బుకు చేరి, అక్కడి నుంచి ట్యాంకర్లు ఎర్ర సముద్రం మీదుగా గల్ఫ్ ఆఫ్ అకాబాలోని ఎయిలాత్‌కు వస్తాయి. అక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా అష్కెలాన్‌కు చేరిన చమురును మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపాకు తరలిస్తారు. ప్రస్తుతం ఈ పైప్‌లైన్ రోజుకు గరిష్ఠంగా 12 లక్షల బ్యారెళ్ల చమురును తరలించే సామర్థ్యం కలిగి ఉంది. అయితే సౌదీ రోజువారీ మొత్తం ఎగుమతులు 60 లక్షల నుంచి 75 లక్షల బ్యారెళ్ల వరకు ఉంటాయి. అందువల్ల ఇది మొత్తం ఎగుమతులకు ప్రత్యామ్నాయం కాకపోయినా, అత్యవసర పరిస్థితుల్లో 5 నుంచి 15 శాతం వరకు చమురును తరలించే సహాయక మార్గంగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే ఈ ప్రణాళిక అమలుకు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎయిలాత్ పోర్టు సామర్థ్యం సౌదీ స్థాయి చమురు ఎగుమతులను నిర్వహించేందుకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. హౌతీల దాడుల కారణంగా ఎయిలాత్ పోర్టు కార్యకలాపాలు ఇప్పటికే 90 శాతానికి పైగా తగ్గిపోయాయని, పెద్ద చమురు ట్యాంకర్లు నిలిపేందుకు లోతు పెంపు, భారీ నిల్వ ట్యాంకులు, అత్యాధునిక భద్రతా వ్యవస్థల కోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.

పైప్‌లైన్ భద్రత కూడా మరో ప్రధాన సవాలుగా మారనుంది. గత ఐదేళ్లలో కనీసం 11 సాంకేతిక లోపాలు, తొమ్మిది విధ్వంసక చర్యలు లేదా మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. 2021లో రాకెట్ దాడి కూడా జరిగింది. 2025లో ఇరాన్ దాడుల వల్ల ఇజ్రాయెల్‌లోని బజాన్ చమురు కేంద్రాలు దెబ్బతినగా, కరిష్, లెవియథాన్ గ్యాస్ క్షేత్రాల కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయినప్పటికీ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఒకటి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే సాంకేతిక సమస్యల కంటే రాజకీయ అడ్డంకులే పెద్దవిగా కనిపిస్తున్నాయి. పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటుకు స్పష్టమైన మార్గం కనిపించకపోతే ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ జరగదని సౌదీ అరేబియా పలుమార్లు ప్రకటించింది. గాజాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ఇటీవల సౌదీతో శాంతి సంబంధాలు తన కల అని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ వ్యూహకర్తలు సౌదీతో సంబంధాల సాధారణీకరణ ఎప్పుడనేది మాత్రమే ప్రశ్న, అది జరుగుతుందా లేదా అనేది కాదనే ధోరణితో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సౌదీ మాత్రం పాలస్తీనా అంశంలో పురోగతి లేకుండా ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. అందువల్ల ఈ పైప్‌లైన్ ప్రణాళిక ఇంధన భద్రతకు ఉపయోగపడినా, దాన్ని అమలు చేయడానికి అవసరమైన రాజకీయ అంగీకారం ఇప్పట్లో లభిస్తుందా అన్నది అనిశ్చితంగా ఉంది.

ఇప్పటి ఉపగ్రహ సాంకేతికత, అంతర్జాతీయ వాణిజ్య పర్యవేక్షణ వ్యవస్థల కారణంగా ఇలాంటి చమురు రవాణాను పూర్తిగా రహస్యంగా నిర్వహించడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. చిన్న స్థాయిలో కొంతకాలం గోప్యంగా ఉంచినా, భారీ స్థాయిలో చమురు ప్రవాహాలను దాచడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఒప్పందం కుదిరితే ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముందని, హౌతీలు కూడా ఈ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించడం, సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడం, ఐరోపాకు ప్రత్యామ్నాయ చమురు మార్గాన్ని అందించడం వంటి కారణాలతో అమెరికా మాత్రం ఈ ప్రణాళికకు పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Featured post

పార్లమెంట్‌లో హైడ్రామా..

  రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లు రాహుల్-బీజేపీ మధ్య మాటల యుద్ధంతో వేడెక్కిన వర్షాకాల సమావేశాల...