- కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- తదుపరి విచారణ ఆగస్టు 18కు వాయిదా
దేశంలో చెల్లుబాటయ్యే మోటార్ వాహన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా కోట్లాది వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలోని సుమారు 30 కోట్ల వాహనాల్లో 16.54 కోట్ల వాహనాలకు, అంటే దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేదని పార్లమెంటరీ కమిటీ నివేదికను ప్రస్తావిస్తూ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో "ఇన్సూరెన్స్ లేకుంటే ఇంధనం లేదు (No Insurance, No Fuel)" అనే విధానాన్ని అమలుచేసే పైలట్ ప్రాజెక్ట్ను రూపొందించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI)లను సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొత్త కార్లకు మూడు సంవత్సరాలు, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేసినప్పటికీ, ఇప్పటికీ భారీ సంఖ్యలో వాహనాలు బీమా లేకుండా తిరుగుతున్నాయని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త వాహనాలకు కార్లకు నాలుగేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఆరేళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద బాధితులకు త్వరగా న్యాయం అందించడమే కాకుండా, సుదీర్ఘ న్యాయపోరాటాలను నివారించేందుకు మోటార్ వాహనాల చట్టంలోని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నిబంధనలు అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కింద జీవించే హక్కుతో ముడిపడి ఉన్న అంశమని ధర్మాసనం పేర్కొంది.
ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను బీమా డేటాబేస్, వాహన్ పోర్టల్తో అనుసంధానం చేయాలని కోర్టు సూచించింది. అలాగే పెట్రోల్ బంకుల్లోనే వాహన బీమా స్థితిని తనిఖీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేసి, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వకుండా నిరోధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని పేర్కొంది. దీంతో వాహన యజమానులు సమయానికి బీమాను పునరుద్ధరించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు వాహన బీమా వివరాలను అక్కడికక్కడే తనిఖీ చేసి జరిమానాలు విధించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్లు లేదా డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించింది. మోటార్ బీమా ప్రక్రియను సులభతరం చేసేందుకు నాలుగు స్థాయిల బీమా విధానాన్ని కూడా కోర్టు ఆమోదించింది. ఇందులో తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్తో పాటు ప్రయాణికులకు లీగల్ లయబిలిటీ కవర్, యజమాని, డ్రైవర్, ప్రయాణికులకు వ్యక్తిగత ప్రమాద బీమా, వాహన నష్టాలకు అదనపు బీమా వంటి ఎంపికలను సులభమైన భాషలో వినియోగదారులకు వివరించాలని బీమా కంపెనీలకు ఆదేశించింది.
తెలంగాణకు చెందిన ఒక రోడ్డు ప్రమాద పరిహార కేసు విచారణ సందర్భంగా ఈ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. బీమా కలిగిన వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రూ.10,00,500 పరిహారం, 7.5 శాతం వడ్డీతో చెల్లించాలన్న తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ వాహన యజమానికీ రక్షణ కల్పిస్తుందని, ఇలాంటి కేసుల్లో అతిగా సాంకేతిక కారణాలు చూపరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలుపై సంబంధిత శాఖలు ఆగస్టు 14లోగా అమలు నివేదిక సమర్పించాలని, తదుపరి విచారణను ఆగస్టు 18కు వాయిదా వేసింది.