Thursday, 23 July 2026

విద్యార్థుల ఆందోళనకు మురళీ మనోహర్ జోషి మద్దతు

 

  • పోలీసుల బలప్రయోగంపై బీజేపీ సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం




నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి గురువారం తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన 'సంసద్ చలో' నిరసన ప్రదర్శన సందర్భంగా ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలు విద్యార్థులపై చూపించిన విచక్షణా రహిత అణచివేత వైఖరిని, బలప్రయోగాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ విచారకర ఘటనపై 92 ఏళ్ల వయోవృద్ధ నాయకుడు జోషి 'ఎక్స్' (X) వేదికగా స్పందిస్తూ.. ఆందోళన చేస్తున్న చిన్న వయసు అమ్మాయిలను కూడా పోలీసులు అత్యంత దారుణంగా కొట్టడం, విచక్షణారహితంగా వ్యవహరించడం తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు విద్యార్థులపై ఇలాంటి విచక్షణా రహితమైన బలప్రయోగానికి దిగడం వల్ల దేశంలోని మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా యువత.. ప్రధాని మోడీ ఆకాంక్షించే 'వికసిత్ భారత్' జాతీయ లక్ష్యానికి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో (1998-2004) విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న జోషి, దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం అనేక రోజులుగా రాజధాని ఢిల్లీ వీధుల్లో కాలం వెళ్లదీయడం చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందన్నారు. నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం , విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలో నిరసనలు ఉధృతమవుతున్న తరుణంలో సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


మన సమాధానం పువ్వులు మాత్రమే కావాలి


  • జంతర్ మంతర్ వద్ద హింసను ఖండిస్తూ సోనమ్ వాంగ్‌చుక్ శాంతి పిలుపు


నీట్ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ అక్రమాలపై దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపడుతున్న ఆందోళన 26వ రోజుకు చేరుకున్న సందర్భంలో, ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన మద్దతుదారులకు, నిరసనకారులకు అత్యంత ఆవేదనతో శాంతియుత పిలుపునిచ్చారు. ఈ శాంతియుత ప్రజా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కొన్ని అసాంఘికశక్తులు ప్రయత్నిస్తున్నాయనే ఆందోళనల మధ్య, ఆయన గాంధేయ మార్గంలో హింసకు తావులేకుండా నిరసనలు సాగించాలని మరోసారి స్పష్టం చేశారు.  ప్రధాన నిరసన ప్రదేశం వెలుపల కొన్ని అసాంఘికశక్తులు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలను రేకెత్తించడానికి, అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయనే వార్తలపై వాంగ్‌చుక్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా సంపూర్ణ నిగ్రహాన్ని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. 



ఈ మేరకు ఆయన 'ఎక్స్' (X) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "26వ రోజు: శాంతి, కేవలం శాంతి ఒక్కటే నా మార్గం! జంతర్ మంతర్ వద్ద నిరసనలు శాంతియుతంగా జరుగుతుంటే, బయట కొందరు అసాంఘికశక్తులు ఈ అవకాశాన్ని వాడుకుని హింసను ప్రేరేపిస్తున్నారని తెలిసి తీవ్రంగా బాధపడ్డాను. ఎదుటివారు ఏది చేసినా, మన సమాధానం కేవలం పువ్వులు మాత్రమే కావాలి. ఏది ఏమైనా ఈ శాంతియుత సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు.  సఫ్రదర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించిన అనంతరం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. 25 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష వల్ల ఆయన 11 కిలోల బరువు తగ్గినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన కట్టుబాటు మారలేదని తెలిపారు. 'చలో సంసద్' ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన లేదా కక్షసాధింపు హెచ్‌ఐఆర్‌లు (FIRs), అరెస్టులు ఉండవని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే తాను దీక్ష విరమిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులపై బలప్రయోగానికి దిగవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, హామీ లభిస్తే వెంటనే దీక్ష విరమించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

యువత వీధుల్లో ఉంటే ప్రధాని మోదీ సభకు రావడం లేదు


  •  నీట్ లీకేజీ రగడపై ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీల తీవ్ర ఆగ్రహం

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET-UG) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై పార్లమెంట్ వెలుపల, లోపల నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. దేశ యువత అంతా రోడ్లపైకి వచ్చి పోరాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌కు రాకుండా ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ భవిష్యత్తు అయిన యువత సభ వెలుపల ఆందోళన చేస్తుంటే, సభను సజావుగా ఎలా నడపగలమని పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.  మరోవైపు నీట్ పరీక్షల లీకేజీ ఆందోళనల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రయోజనాలు, వారి భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, పేపర్ లీకేజీలకు పాల్పడి యువత జీవితాలతో ఆటలాడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై వేగంగా, కఠినంగా విచారణ జరిపి తక్షణమే శిక్షలు పడేలా చేయడానికి ప్రత్యేకంగా 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులను' ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.



అయితే ప్రధాని ప్రకటనపై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకు కావాల్సింది సోషల్ మీడియా ట్వీట్లు కాదని, స్పష్టమైన చర్యలు , న్యాయం మాత్రమేనని కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ స్పష్టం చేశారు.  సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ.. నీట్ లీకేజీ కారణంగా మనస్తాపంతో 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు, దానికి బాధ్యత ఎందుకు వహించడం లేదని నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జులై 20న విచక్షణారహితంగా పోలీసులతో దాడి చేయించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని ఆమె ఒత్తిడి తెచ్చారు. అలాగే శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న ఆడపిల్లలపై పోలీసులు కొట్టిస్తుంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముందుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా తీసుకున్న తర్వాతే ఇతర విషయాలపై మాట్లాడాలని విమర్శించారు.  మరోవైపు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉందని, విద్యార్థుల ప్రతినిధులకు ఇప్పటికే నాలుగుసార్లు చర్చలకు అధికారిక ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి పట్టింపులకు పోవడం లేదని, విద్యార్థులు కోరిన సమయానికి ఎప్పుడైనా ముఖాముఖి చర్చలు జరిపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. జులై 20నాటి 'చలో సంసద్' మార్చ్ తర్వాత ఢిల్లీ సహా ఇతర నగరాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో గురువారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా పడ్డాయి.

గ్లోబరీనా వివాదంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు


  • 48 గంటల్లో బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్


గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, దానిని తన బెనామీ కంపెనీగా చిత్రించి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన, హానికరమైన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా బేషరతు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ పరిణామాలతో పాటు నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్లోబరీనా సంస్థలో తనకు ఎలాంటి భాగస్వామ్యం గానీ, ఆర్థిక ప్రయోజనాలు గానీ లేవని స్పష్టం చేసిన కేటీఆర్, తనపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు ఆధారాలు చూపించాలని సీఎంకు సవాలు విసిరారు. ఒకవేళ అది తన బెనామీ కంపెనీయే అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సంస్థతో ఒప్పందాలు ఎందుకు చేసుకుందో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాలని నిలదీశారు.



కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నీట్ పరీక్షల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఇటువంటి రాజకీయ నాటకాలకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పడానికి కూడా సీఎం భయపడుతున్నారని విమర్శించారు. పగలు కాంగ్రెస్‌లో, రాత్రి బీజేపీలో ఉంటూ పాత కేసులకు భయపడి రేవంత్ రెడ్డి కేంద్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గ్లోబరీనా వ్యవహారంపై సీబీఐ, సీఐడీ, సిట్ వంటి ఏ విచారణ సంస్థల చేతనైనా విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన కేటీఆర్.. ప్రజల సమక్షంలో లై డిటెక్టర్ (Lie Detector) పరీక్షకు సిద్ధమా అని సవాలు విసిరారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవుల్లో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Wednesday, 22 July 2026

చర్చలకు మేము సిద్ధం


  • జంతర్ మంతర్ లేదా తటస్థ వేదిక వద్దే కలవాలని ప్రభుత్వానికి సీజేపీ స్పష్టీకరణ



న్యూఢిల్లీ:పోటీ పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ సంప్రదింపులు జంతర్ మంతర్ వద్ద లేదా దానికి దగ్గరలోని ఏదైనా తటస్థ ప్రాంతంలోనే జరగాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తమను చర్చలకు రమ్మని తన నివాసానికి ఆహ్వానించారని, కానీ ప్రజా సమస్యలపై మంత్రులే ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాలని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ వెల్లడించారు. భద్రతా పరమైన కారణాలు ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని తటస్థ ప్రదేశంలోనైనా కలవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం అందించాలని, శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని సీజేపీ మరోసారి డిమాండ్ చేసింది. దీంతోపాటు ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోమని కేంద్రం నుండి స్పష్టమైన హామీ కావాలని కోరింది. ఢిల్లీతో పాటు ముంబై, గోవా, జైపూర్ వంటి పలు నగరాలకు ఈ ఉద్యమం విస్తరించిందని, విద్యార్థుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను ఆమోదించాలని సీజేపీ డిమాండ్ చేసింది. 

5 రుచికరమైన, ఆరోగ్యకరమైన రోల్డ్/ఇన్‌స్టంట్ ఓట్స్ వంటకాలు




ఓవర్‌నైట్ ఓట్స్ విత్ ఫ్రూట్స్ & నట్స్ (Overnight Oats): 

ఓట్స్‌ను పాలు లేదా పెరుగులో కలిపి, అందులో చియా సీడ్స్ వేసి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి.  మరుసటి రోజు ఉదయం అందులో మీకు ఇష్టమైన తాజా పండ్ల ముక్కలు (రసాల బాదం, అరటి మొదలైనవి), బాదం , వాల్ నట్స్ కలిపి నేరుగా తినవచ్చు. ఇది ఉదయాన్నే శ్రమ లేకుండా చేసుకునే ప్రొటీన్ రిచ్ టిఫిన్. 



ఓట్స్ ఉప్మా (Oats Upma): 

బొంబాయి రవ్వకు బదులుగా ఓట్స్‌తో ఈ ఉప్మా తయారుచేసుకోవచ్చు.  ఓట్స్‌ను దోరగా వేయించి పక్కన పెట్టుకుని, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ , బఠానీలతో తాలింపు వేసి ఉడికించాలి. చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండితే రుచికరమైన ఓట్స్ ఉప్మా సిద్ధమవుతుంది. 


బనానా ఓట్ పాన్‌కేక్స్ (Banana Oat Pancakes): 

ఓట్స్, బాగా పండిన అరటిపండ్లు, గుడ్లు (Eggs), కొద్దిగా దాల్చినచెక్క పొడి ,చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి మిక్సీలో మెత్తటి పిండిలా (Batter) రుబ్బుకోవాలి.  ఈ పిండిని నాన్-స్టిక్ పెనంపై పాన్‌కేక్‌లా వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చాలి. దీనిపై తేనె లేదా తాజా పండ్ల ముక్కలు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. 



ఓట్స్ కట్లెట్ (Oats Cutlet):

ఉడికించిన ఓట్స్‌లో ఉడకబెట్టి మెదపిన బంగాళాదుంపలు, తురిమిన క్యారెట్, పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ , తగినంత కారం, మసాలాలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.  ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీలు/ప్యాటీలుగా చేసుకుని పెనంపై తక్కువ నూనెతో కాల్చడం (Pan-fry) లేదా ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి. వీటిని పుదీనా చట్నీతో స్నాక్‌గా తినవచ్చు. 



ఓట్స్ చీలా (Oats Cheela):

  సాధారణ శనగపిండి/వరిపిండికి బదులుగా ఓట్స్‌ను మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఆ ఓట్స్ పొడిలో కొద్దిగా పెరుగు, తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి , ఉప్పు వేసి దోస పిండిలా కలుపుకోవాలి.  వేడి వేడి పెనంపై అట్లు (చీలా) లా వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఫైబర్ సమృద్ధిగా లభించే పౌష్టికాహారం తయారవుతుంది. 





నీట్ రగడ: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత



  • సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల బాష్పవాయు ప్రయోగం

న్యూఢిల్లీ: నీట్‌ యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం సీజీపీ (Cockroach Janta Party - CJP) నేతృత్వంలో విద్యార్థులు, యువత చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆందోళనకారులు పార్లమెంట్ వైపు మార్చ్‌కు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనగా, పరిస్థితిని అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై  బాష్పవాయువు (టీయర్‌ గ్యాస్) ప్రయోగించారు.  వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజులుగా నీట్ లీకేజీ అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం నాటి ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు చేతబూని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జంతర్ మంతర్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీసు బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకెళ్లేందుకు నిరసనకారులు యత్నించడంతో పోలీసులు లాఠీఛార్జీ చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున టీర్ గ్యాస్ షెల్స్ వదిలి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, పోలీసు సిబ్బంది గాయపడగా, ఆ ప్రాంతమంతా పొగచూరి తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తుంటే లాఠీలు, బాష్పవాయువుతో అణచివేయాలని చూడటం అమానుషమని సీజేపీ ప్రతినిధులు మండిపడ్డారు.

Featured post

విద్యార్థుల ఆందోళనకు మురళీ మనోహర్ జోషి మద్దతు

  పోలీసుల బలప్రయోగంపై బీజేపీ సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన బాట పట్ట...