- చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్
న్యూఢిల్లీ: పాస్పోర్ట్ వ్యవస్థ, ఈ-పాస్పోర్ట్ విధానం, పోలీసు వెరిఫికేషన్, పౌరసత్వ అంశాలు, పాస్పోర్ట్ చట్టం తదితర కీలక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం విస్తృతంగా చర్చించింది. విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అనంతరం ఆ సంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ వివరాలు వెల్లడించారు.పాస్పోర్ట్ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై సమావేశంలో సమగ్రంగా, లోతుగా చర్చించినట్లు శశి థరూర్ తెలిపారు. ఈ-పాస్పోర్ట్ విధానం, పోలీసు ధ్రువీకరణ, పౌరసత్వ సమస్యలు, పాస్పోర్ట్ చట్టం తదితర విస్తృత అంశాలు చర్చకు వచ్చినట్లు చెప్పారు. సమావేశానికి సుమారు 15 మంది ఎంపీలు హాజరైనట్లు వెల్లడించారు.
1967 నాటి పాస్పోర్ట్ చట్టానికి సవరణ అవసరం
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 1967 పాస్పోర్ట్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని కొంతమంది ఎంపీలు సూచించినట్లు శశి థరూర్ తెలిపారు. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందుకు వెళ్లాల్సిన పని చాలా ఉందన్నారు.అయితే, కమిటీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న విచారణ మాత్రమేనని తెలిపారు.ఇటీవల జమ్మూకశ్మీర్, లద్దాఖ్ పర్యటన సందర్భంగా పాస్పోర్ట్ అధికారులతోనూ కమిటీ సభ్యులు చర్చలు జరిపినట్లు శశి థరూర్ వెల్లడించారు. పాస్పోర్ట్ వ్యవస్థకు సంబంధించి ఇంకా అనేక అంశాలపై తదుపరి వివరాలు సేకరించి, వాటిపై చర్చించాల్సి ఉందని చెప్పారు.