Raju Asari
Sunday, 23 August 2026
Saturday, 22 August 2026
నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ హవా
- చిరంజీవి కెరీర్లో ఈ ఐదు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని మరపురాని చిత్రాలను మరోసారి గుర్తు చేసుకుందాం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్ కేవలం బాక్సాఫీస్ విజయాలకే పరిమితం కాలేదు. అద్భుతమైన డ్యాన్స్, స్టైలిష్ యాక్షన్, కామెడీ టైమింగ్, భావోద్వేగభరితమైన నటనతో తెలుగు కమర్షియల్ సినిమాకు చిరంజీవి కొత్త నిర్వచనం ఇచ్చారు. నటుడిగా తన పరిధిని విస్తరిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాలున్నాయి. అందులో చిరంజీవి స్టార్డమ్ను, నటనా ప్రతిభను, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ను ప్రతిబింబించే ఐదు చిత్రాలు ఇవి.
ఖైదీ (1983)
చిరంజీవిని ఒక్కసారిగా స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం ‘ఖైదీ’. యాక్షన్, ప్రతీకారం, భావోద్వేగాలను మేళవించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, రా యాక్షన్ స్టైల్, డ్యాన్స్ ప్రత్యేకత ప్రేక్షకులకు మరింత చేరువయ్యాయి. కమర్షియల్ హీరో ఎలా ఉండాలనే దానికి ‘ఖైదీ’ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.
స్వయంకృషి (1987)
దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘స్వయంకృషి’ చిరంజీవి నటనా ప్రతిభకు మరో కోణాన్ని పరిచయం చేసింది. సాధారణ కమర్షియల్ హీరో ఇమేజ్కు భిన్నంగా నిరక్షరాస్యుడైన చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో చిరంజీవి జీవించారు. నిజాయితీగా, కష్టపడి ఎదిగే సామాన్యుడి పాత్రను ఎంతో సహజంగా పోషించారు. ఈ చిత్రంలోని అద్భుత నటనకు ఆయన ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డును అందుకున్నారు.
రుద్రవీణ (1988)
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుత చిత్రం ‘రుద్రవీణ’. సంప్రదాయ భావాలు కలిగిన శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన తండ్రికి, సామాజిక స్పృహతో ముందుకు సాగే కుమారుడికి మధ్య జరిగే భావజాల సంఘర్షణను ఈ సినిమా ఆవిష్కరించింది. చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కడంతో పాటు జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా ఈ చిత్రం అందుకుంది.
జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
శ్రీదేవి సరసన చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెలుగు ప్రేక్షకులకు మరపురాని ఫాంటసీ ఎంటర్టైనర్గా నిలిచింది. సాహసోపేతమైన టూరిస్ట్ గైడ్గా చిరంజీవి, దివ్యలోకం నుంచి వచ్చిన అతిలోకసుందరిగా శ్రీదేవి ఆకట్టుకున్నారు. చిరంజీవి కామెడీ టైమింగ్, పాటల్లో ఆయన చూపించిన గ్రేస్, అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని ఎవర్గ్రీన్ బ్లాక్బస్టర్గా మార్చాయి.
గ్యాంగ్ లీడర్ (1991)
1990ల మాస్ ఎంటర్టైనర్కు అసలైన నిర్వచనంగా నిలిచిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. చిరంజీవి స్టైల్, యాటిట్యూడ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా ఆయన చేసిన జాకెట్ స్లైడ్ డ్యాన్స్ అప్పట్లో ఓ ట్రెండ్గా మారింది. సినిమాలోని క్యాచీ డైలాగ్స్, మాస్ అప్పీల్ చిరంజీవిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాతి తరాల హీరోలకు కూడా ‘గ్యాంగ్ లీడర్’లోని చిరంజీవి స్టైల్ ఎంతో స్ఫూర్తిగా నిలిచింది.
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో చిరంజీవి ఎన్నో పాత్రలు, ఎన్నో విజయాలు, ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అయితే ‘ఖైదీ’ నుంచి ‘గ్యాంగ్ లీడర్’ వరకు ఈ ఐదు చిత్రాలు ఆయన మెగాస్టార్ ప్రస్థానంలో ప్రత్యేక అధ్యాయాలుగా నిలిచిపోయాయి.
అత్త ఇప్పుడు ఓ జ్ఞాపకం
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అత్త ( గెల్లు ఓదమ్మ - బావ వాళ్ల అమ్మ) మృత్యువుతో పోరాడింది. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడిన అత్త ఎప్పుడూ మంచానికే పరిమితమైంది లేదు. జ్వరం లాంటివి వచ్చినా ఒకటి రెండు రోజుల్లోనే పనికి పోయేది. అక్క దగ్గరికి హిమ్మత్నగర్కు ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినవ్ బిడ్డా రాజు అని పలకరించేది. పిల్లలు అంత మంచిగున్నరా అని అడిగేది. మంచిగ బతుకుతే చాలు బిడ్డ అనేది. ఆమె పలకరింపు లేకుండా నా హిమ్మత్నగర్ టూర్ ముగిసేది కాదు. ఎందుకంటే ఏ రాత్రి అయినా తను వచ్చి మాట్లాడేది. మూడు దశాబ్దాలకు పైగా అత్తతో అనుబంధం శుక్రవారం పొద్దున శేఖర్ కాల్తో కలగా మిగిలిపోయింది. శుక్రవారం పొద్దుగాల 6.03 గంటలకు శేఖర్ నుంచి కాల్ రాగానే నా మనసు ఏదో కీడును శంకించింది. బాపమ్మ అని కాలం చేసింది అనగానే కొంతసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఊ అని మాత్రమే అంతే. అత్త మీద ఎందుకు ఇంత అభిమానం ఎందుకు అంటే కొడుకులు, కోడండ్లు వ్యవసాయ పనులకు పోతే తల్లి కోడి లెక్క మనుమలను, మనుమరాండ్లను కంటికి రెప్పలా చూసుకునేది. నిజానికి వాళ్లకు జీవిత పాఠాలో బోధించింది ఓదక్కే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గట్టిగా నిలబడాలనే ధైర్యాన్ని వాళ్లకు చిన్నప్పుడే నూరిపోసింది. అందుకే ఓదక్క వాళ్లకు రోల్ మోడల్ అయ్యింది.
ఎన్నడూ ధైర్యం చెడని అత్త ఐదు నెలల కిందట అనారోగ్యానికి గురైనప్పుడు కొంత ఆందోళనపడ్డది. జీవిత పోరాటం చివరి దశకు వచ్చిందని ఊహించింది కావొచ్చు. ఇక మనుపటిలా కోలుకుని పని వెళ్లలేను అనుకుని ఉండొచ్చు. జీవితకాలమంతా పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు శ్రమకోర్చే వాళ్లకు ఒక్క పూట ఖాళీగా ఉంటే ఏమీ తోచదు. అట్లాఈ చివరి ఐదు నెలలు హాస్పటల్ లో రెండు నెలలు, ఇంటి వద్ద మూడు నెలలుగా మంచం పట్టునే ఉండటంతో మనాదిలో పడింది. హన్మకొండలో డాక్టర్లు రెండు నెలల చికిత్స అనంతరం వృద్ధాప్యం కారణంగా ఆమె శరీరం సహకరించడం లేదని తేల్చారు. ఇంటికి తీసుకెళ్లమని సూచించారు. పది రోజుల కంటే ఎక్కువ బతకదు అని డాక్టర్లు చెప్పారట. కానీ తన సంకల్పం తన జీవితకాలాన్ని మూడు నెలలకు పెంచింది. తిండి లేదు. నమిలే అవకాశం లేదు. అప్పుడప్పుడు గొంతు తడపడానికి ఇచ్చిన జ్యూసులు, మంచినీళ్లతోనే మూడు నెలలు మనుగడ సాగించింది. మామ (కనకయ్య) పోయినప్పుడు ఆ లోటు కనిపించలేదు. కానీ మొన్న అత్త ఇక కనిపించదు అన్నప్పుడు ఏదో వెలతి అనిపించింది. ఎప్పుడు వచ్చినవ్ బిడ్డా అనే అనే అత్త ఆత్మీయ పిలుపు ఇక వినిపించదు. అత్త ఇప్పుడు ఒక జ్ఞాపకం. ఓదవ్వకు అశ్రునివాళి.
Friday, 21 August 2026
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ
- ‘నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం’తో రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదన్న విదేశాంగ శాఖ..
- లండన్ నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ విదేశీ పర్యటనలో కీలక మార్పు చోటుచేసుకుంది. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో సీఎం తన షెడ్యూల్ను మార్చుకున్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న రేవంత్రెడ్డి ఆగస్టు 23న అక్కడి నుంచి హైదరాబాద్కు తిరిగి రానున్నారు.వాస్తవానికి సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 20న లండన్ బయలుదేరి.. బ్రిటన్, అమెరికాల్లో 10 రోజుల పాటు పర్యటించి ఆగస్టు 30న హైదరాబాద్కు చేరుకోవాల్సి ఉంది. ఈ పర్యటనలో ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను తెలంగాణకు ఆకర్షించడం, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
- అమెరికా పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ నిరాకరణ
అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. పర్యటనకు ‘రాజకీయ కోణంలో క్లియరెన్స్ నిరాకరించబడింది’ అని విదేశాంగ శాఖ పేర్కొన్నట్లు సీఎంవో తెలిపింది. బ్రిటన్, అమెరికా పర్యటనలకు కేంద్రం నుంచి అనుమతి కోరగా.. బ్రిటన్ పర్యటనకు మాత్రమే అనుమతి లభించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే అధికారిక ప్రతినిధి బృందం ఇప్పటికే బ్రిటన్కు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని తెలిపింది.
కేంద్ర నిర్ణయంతో తాను తీవ్రంగా నిరాశ చెందినప్పటికీ, దాన్ని గౌరవిస్తూ లండన్ నుంచే భారత్కు తిరిగి రావాలని సీఎం నిర్ణయించుకున్నారని సీఎంవో పేర్కొంది.‘ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యం’ అమెరికా పర్యటన ఉద్దేశం పూర్తిగా విద్యారంగానికి సంబంధించినదేనని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్కు, ముఖ్యంగా తెలంగాణకు, హైదరాబాద్కు తీసుకురావడమే తన పర్యటన లక్ష్యమని చెప్పారు. కేంద్ర నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి యువతకు అత్యుత్తమ విద్య, నైపుణ్యాలు, శిక్షణ అందించాలన్నదే ఉద్దేశమని వివరించారు.దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తాను ఎప్పటి నుంచో విశ్వసిస్తున్నానని సీఎం అన్నారు.
- అమెరికా కార్యక్రమాలు అధికారులతో పూర్తి చేయించనున్న సీఎం
తాను అమెరికా వెళ్లకపోయినా.. అక్కడి ప్రతిపాదిత పర్యటనను అధికారులు కొనసాగించాలని రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదిత అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సూచించారు.మరోవైపు బ్రిటన్లో ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమాలను సీఎం కొనసాగించనున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు.హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నగరానికి గొప్ప మానవ వనరులను అందించాయని గుర్తుచేశారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా వంటి ప్రముఖులు ఎదిగారని సీఎం ప్రస్తావించారు. ఐఐటీ, ఐఎస్బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్కు ప్రపంచస్థాయి సంస్థలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు ఆకర్షితమయ్యాయని తెలిపారు.హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, ఎల్బీఎస్, ఎల్ఎస్ఈ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో చదివే అవకాశాన్ని భారతీయులకు హైదరాబాద్లోనే అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన సంకల్పమని రేవంత్రెడ్డి చెప్పారు.
- అనుమతి నిరాకరణలో రాజకీయ కోణం లేదు
అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంలో రాజకీయ కోణం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు అన్నారు. విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే సమయంలో విదేశాంగ శాఖ అనేక అంశాలను పరిశీలిస్తుందని తెలిపారు.పర్యటన అవసరం, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, అంతర్జాతీయ ప్రోటోకాల్, దౌత్యపరమైన అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్సీఆర్ఏ నిబంధనలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.గతంలో 2012లో యూపీఏ ప్రభుత్వం అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని రామచందర్రావు గుర్తుచేశారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ నేతలు లేఖలు రాశారని ఆరోపించారు.రేవంత్రెడ్డి గతంలో విదేశీ పర్యటనలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ప్రస్తుత నిర్ణయం నిబంధనల ప్రకారమే తీసుకున్నదని ఆయన అన్నారు.
- అమెరికాలో షెడ్యూల్లో కీలక కార్యక్రమాలు
అమెరికా పర్యటనలో భాగంగా ఆగస్టు 24న హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ క్యాంపస్లను సందర్శించాలని రేవంత్రెడ్డి తొలుత నిర్ణయించారు. ఆగస్టు 25న బోస్టన్లోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం కావాల్సి ఉంది. ఆగస్టు 26న న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. ఆగస్టు 30న హైదరాబాద్కు తిరిగి రావాల్సిన షెడ్యూల్ ఉంది.అయితే కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో ఈ కార్యక్రమాలను సీఎం స్వయంగా హాజరుకాకుండానే అధికారుల ద్వారా కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారత్ పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోని బంగ్లాదేశ్ ప్రధాని
- బ్రిక్స్ సదస్సుకు హాజరుపై అనిశ్చితి..
- షేక్ హసీనా అప్పగింతపై ఢిల్లీ స్పందన కోసం ఢాకా ఎదురుచూపులు
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహ్మాన్ భారత్ పర్యటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వచ్చే నెల భారత్లో జరగనున్న బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. మాజీ ప్రధాని షేక్ హసీనా, ఇతర పరారీలో ఉన్న నిందితులను అప్పగించాలన్న ఢాకా అభ్యర్థనపై భారత్ స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
తారిఖ్ రహ్మాన్ కార్యాలయ ప్రెస్ సెక్రటరీ ఏఏఎం సలేహ్ షిబ్లీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని భారత్ పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.
హసీనా అప్పగింతపై ఢిల్లీ స్పందన కోసం ఎదురుచూపులు
భారత్లో ప్రస్తుతం ఉంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా, ఇతర ‘పరారీలో ఉన్న నేరస్థులను’ తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ఇప్పటికే ఢిల్లీని కోరింది. ఈ అంశంపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన కోసం ఢాకా ఎదురుచూస్తోందని షిబ్లీ తెలిపారు.
తారిఖ్ రహ్మాన్ భారత్ పర్యటనపై తొందరపడాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయున్ కబీర్ పేర్కొన్న మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. జాతీయ ప్రయోజనాలు స్పష్టంగా నిర్వచించకుండా ఉన్నతస్థాయి పర్యటనను ఏర్పాటు చేయడంలో తొందర అవసరం లేదని ఆయన అన్నారు.
సంబంధాల మెరుగుదలకు భారత్ ప్రయత్నాలు
ఇదిలా ఉండగా, భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది బంగ్లాదేశ్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇటీవలి వారాల్లో ప్రధాని తారిఖ్ రహ్మాన్తో పాటు పలువురు కీలక రాజకీయ నేతలతో ఆయన వరుసగా సమావేశమయ్యారు.
‘భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ’ బంగ్లాదేశ్ ప్రధాని భారత్ పర్యటన వీలైనంత త్వరగా జరగాలని త్రివేది సోమవారం అభిప్రాయపడ్డారు. సమస్యలను పరిష్కరించుకోవాలంటే పరస్పరం సమావేశమై చర్చించుకోవాల్సిందేనని, ఈ విషయంలో తాను ఆశావహంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
షేక్ హసీనా విషయంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా గతంలో ఉన్నతస్థాయి ద్వైపాక్షిక పర్యటనకు ముందు ‘అనుకూలమైన, సానుకూల వాతావరణం’ ఏర్పడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆగస్టు 5, 2026న షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ విలేకరుల సమావేశం భారత్–బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలను మరింత సంక్లిష్టం చేసిందని ఢాకా పేర్కొంది.
78 ఏళ్ల షేక్ హసీనా 2024 ఆగస్టులో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన తీవ్ర ఆందోళనల నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయారు. అదే ఏడాది ఆగస్టు 5న ఢాకా నుంచి బయలుదేరి భారత్కు చేరుకున్న ఆమె అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు.
అనంతరం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై ప్రత్యేక న్యాయస్థానంలో ఆమె గైర్హాజరీలో విచారణ జరిపింది. ఆందోళనలను అణచివేసేందుకు జరిగిన ప్రాణాంతక చర్యలకు ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెకు మరణశిక్ష విధించింది.
‘సమానత్వం, పరస్పర గౌరవంతోనే భారత్తో సంబంధాలు’
మరోవైపు బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేత, జమాత్-ఎ-ఇస్లామీ అధినేత షఫీకుర్ రహ్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఏ దేశానికైనా, భారత్కైనా వెళ్లవచ్చని, అయితే అలాంటి పర్యటనలు ‘సమానత్వం, పరస్పర గౌరవం, స్నేహం’ ప్రాతిపదికన ఉండాలని అన్నారు.
దేశ ప్రజలు ఇకపై ఎలాంటి ఆధిపత్యాన్ని అంగీకరించబోరని, భారత్తో స్నేహం, పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా సంబంధాలను కోరుకుంటున్నారని రాజ్షాహీలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో తారిఖ్ రహ్మాన్ భారత్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. హసీనా అప్పగింత, ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తు వంటి అంశాలు ఈ పర్యటన నిర్ణయంలో కీలకంగా మారే అవకాశముంది.
ఝార్ఖండ్లో ఉద్యోగ పరీక్షల రగడ
- విద్యార్థులు–పోలీసుల మధ్య ఘర్షణలు
- పలు నియామకాల రద్దుపై హైకోర్టు స్టే..
- పరీక్షల అక్రమాలపై ఆందోళనలు ఉధృతం
రాంచీ: ఝార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. శుక్రవారం రాంచీతో పాటు మరికొన్ని జిల్లాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో పలు నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఝార్ఖండ్ హైకోర్టు మధ్యంతర స్టే విధించడం నిరసనకారులకు ఊరటనిచ్చింది.
‘జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్’ ఆధ్వర్యంలో విద్యార్థులు రాంచీలోని ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఈ వ్యవహారాలకు సంబంధించిన కేసులను సమర్థంగా ఎదుర్కోవడం లేదంటూ కూడా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్బర్ట్ చౌక్ వద్ద ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప బలప్రయోగం చేసినట్లు అధికారులు తెలిపారు.
అనుమతి లేకుండా జేపీఎస్సీ కార్యాలయం వద్దకు విద్యార్థులు చేరుకున్నారని రాంచీ సిటీ డీఎస్పీ కేవీ రామన్ తెలిపారు. నిర్దేశించిన మార్గాన్ని మార్చుకుని విద్యార్థులు ర్యాలీగా వెళ్లడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిందని లాల్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి రూపేశ్ కుమార్ సింగ్ చెప్పారు. సదర్ ఆసుపత్రి సమీపంలోనూ ఆందోళనకారుల కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రోగులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు జోక్యం చేసుకున్నారని తెలిపారు.
అయితే పోలీసులు, అధికార జేఎంఎం కార్యకర్తలు తమ శాంతియుత ఆందోళనను అడ్డుకున్నారని విద్యార్థులు ఆరోపించారు. మహిళా నిరసనకారులపై కూడా దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న కోర్ కమిటీ సభ్యుడు కునాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ర్యాలీ సమయంలో స్పృహ కోల్పోవడంతో అతడిని ఆసుపత్రికి తరలించారని విద్యార్థి నాయకుడు తెలిపారు.
రాంచీతో పాటు హజారీబాగ్, గిరిడీహ్ జిల్లాల్లోనూ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సోరెన్, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థులను జేఎంఎం కార్యకర్తలు అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఉద్యోగ పరీక్షల అంశాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని జేఎంఎం ఆరోపించింది.
22 పరీక్షల రద్దుతో మొదలైన వివాదం
ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 25 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 18న ఝార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ, ఔట్సోర్సింగ్ సంస్థ టీపీఎల్ నిర్వహించిన 22 నియామక పరీక్షలను రద్దు చేసింది. మరో 23 పరీక్షలపై దర్యాప్తునకు ఆదేశించింది.ఈ నిర్ణయంతో ఇప్పటికే ఎంపికైన సుమారు 2,700 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షల్లో అక్రమాలు జరిగితే అందుకు తాము బాధ్యులు కాదని, మెరిట్ ఆధారంగా ఎంపికైన తమ ఉద్యోగాలను రద్దు చేయడం అన్యాయమని వారు వాదిస్తున్నారు.
నియామకాల రద్దుపై హైకోర్టు స్టే
విద్యార్థుల ఆందోళనల మధ్య హైకోర్టు ఉత్తర్వులు వారికి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించాయి. 11వ, 13వ జేపీఎస్సీ పరీక్షల ద్వారా జరిగిన నియామకాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై గురువారం కోర్టు స్టే విధించింది.శుక్రవారం జస్టిస్ దీపక్ రోషన్ నేతృత్వంలోని ధర్మాసనం జేఎస్ఎస్సీ–సీజీఎల్ ద్వారా జరిగిన నియామకాలతో పాటు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ల నియామకాలను రద్దు చేయడంపైనా మధ్యంతర స్టే విధించింది.
ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారంటూ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాంచీ, హజారీబాగ్, గిరిడీహ్లలో విద్యార్థులపై జరిగిన చర్యలు దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, కోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయ అధికారులు సమర్థంగా వాదించలేదని ‘జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్’ ఆరోపించింది. ఝార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా నేత దేవేంద్రనాథ్ మహతో ఆగస్టు 24 నుంచి ‘రిక్రూట్మెంట్ సిస్టమ్ రిఫార్మ్స్ యాత్ర’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15న హైకోర్టులో ప్రభుత్వం తన వాదనను సమర్థంగా వినిపించకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉందని హెచ్చరించారు.
దర్యాప్తును ముమ్మరం చేసిన సీఐడీ
మరోవైపు ఉద్యోగ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తును సీఐడీ మరింత ముమ్మరం చేసింది. అవకతవకలకు సంబంధించిన సమాచారం ఎవరి వద్ద ఉన్నా తమకు అందించాలని ప్రజలను కోరింది. 2023లో జరిగిన జేఎస్ఎస్సీ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అక్రమాల ఆరోపణలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 37 మంది అనుమానితులను విచారించింది. ఝార్ఖండ్లో ఉద్యోగ నియామక పరీక్షల రద్దు, ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలపై వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది.
వందేమాతరం వివాదం.. షర్మిలా ఠాగూర్ వర్సెస్ కంగనా రనౌత్
- మతపరమైన ప్రస్తావనలపై ఫర్మిలా అభ్యంతరం
- కళను మతానికి పరిమితం చేయొద్దన్న కంగనా
న్యూఢిల్లీ: దేశభక్తి గీతం ‘వందేమాతరం’పై మరోసారి రాజకీయ, సాంస్కృతిక చర్చ మొదలైంది. సినీ దిగ్గజం షర్మిలా ఠాగూర్, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఈ అంశంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. వందేమాతరంలోని కొన్ని చరణాల్లో దేవతల ప్రస్తావన ఉండటంపై షర్మిలా ఠాగూర్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కవిత్వాన్ని, కళను కేవలం మతపరమైన కోణంలో చూడటం సరికాదని కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.
ఇటీవల పార్లమెంట్ జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా వందేమాతరానికి అవమానాల నుంచి రక్షణ కల్పించడంతో పాటు జాతీయ గీతంతో సమానమైన ప్రాధాన్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకున్నారు. అంతకుముందు జనవరిలో కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేస్తూ.. జాతీయ గీతంతో పాటు వందేమాతరం రెండింటినీ ఆలపించే సందర్భంలో ముందుగా పూర్తి వందేమాతరాన్ని పాడాలని సూచించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం స్వాతంత్య్రానికి ముందు అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తూ వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని ప్రకటించడం తాజాగా వివాదానికి దారితీసింది.
- వందేమాతరంలోని మతపరమైన ప్రస్తావనలపై షర్మిలా ఠాగూర్
వార్తా సంస్థ ఐఏఎన్ఎస్కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో షర్మిలా ఠాగూర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అనేకమంది ఒకే దేవుడిని విశ్వసించే మతాలకు చెందినవారని, అందువల్ల వందేమాతరంలోని తర్వాతి చరణాల్లో ఉన్న మతపరమైన ప్రస్తావనలు కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చని అన్నారు. ముఖ్యంగా కాళీ, దుర్గ వంటి దేవతల ప్రస్తావనలను ఆమె ప్రస్తావించారు. ఏకేశ్వరవాదాన్ని విశ్వసించే మతాలకు చెందిన వారు అలాంటి చరణాలను ఆలపించడంలో ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని అన్నిమతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుంటే తొలి రెండు చరణాలు అందరికీ అనుకూలంగా ఉంటాయని షర్మిలా ఠాగూర్ పేర్కొన్నారు.
- షర్మిలా వ్యాఖ్యలపై కంగనా ఘాటు స్పందన
షర్మిలా ఠాగూర్ వ్యాఖ్యలతో విభేదించిన కంగనా రనౌత్.. ఆమె వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. షర్మిలాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు గౌరవం ఉందని చెబుతూనే, ఒక కళాకారిణిగా ఆమె కళ, కవిత్వాన్ని ఇంత పరిమితమైన దృష్టితో ఎలా చూడగలిగారో ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. కవిత్వంలో, పాటల్లో పదాలు తరచూ రూపకాలుగా ఉంటాయని కంగనా వివరించారు. కవి లేదా కళాకారుడు తన భావాన్ని బలంగా వ్యక్తీకరించేందుకు ఊహలు, ప్రతీకలు, ఉపమానాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. వందేమాతరం కేవలం ఒక మతపరమైన గీతం కాదని.. అది భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే మహత్తర రచన అని కంగనా అన్నారు. బంకించంద్ర ఛటోపాధ్యాయ దేశంలో అంతర్లీనంగా ఉన్న శక్తిని మేల్కొలిపేందుకు వందేమాతరాన్ని రచించారని పేర్కొన్నారు.
వివేకానందుడు ‘ఇనుము వంటి శరీరం, ఉక్కు వంటి ఎముకలు, పిడుగులా ప్రవహించే శక్తి కలిగిన యువత కావాలి’ అని చెప్పిన విషయాన్ని కంగనా ప్రస్తావించారు. అది వాతావరణం గురించి చెప్పిన మాటలు కాదని, ప్రజల్లోని శక్తి మేల్కొనాలని ఆయన ఇచ్చిన పిలుపు అని వివరించారు. మతాల మధ్య విభేదాల దృష్టితో కాకుండా వందేమాతరాన్ని చూడాలని కంగనా సూచించారు. ఒకే దేవుడిని విశ్వసించే వారు కూడా ‘శక్తి’ అనే భావనను అర్థం చేసుకోగలరని పేర్కొంటూ.. పరస్పరం ఆత్మీయతతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.
వందేమాతరం చుట్టూ సాగుతున్న ఈ తాజా చర్చలో.. ఒకవైపు గీతంలోని మతపరమైన ప్రతీకలపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు వాటిని భారతీయ సంస్కృతి, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకలుగా చూడాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
Featured post
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని అధికారికంగా జరు...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...

