Thursday, 20 August 2026

పాస్‌పోర్ట్‌ వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ విస్తృత చర్చ



  • చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్‌ 


న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వ్యవస్థ, ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు వెరిఫికేషన్‌, పౌరసత్వ అంశాలు, పాస్‌పోర్ట్‌ చట్టం తదితర కీలక అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం విస్తృతంగా చర్చించింది. విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం అనంతరం ఆ సంఘం చైర్మన్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఈ వివరాలు వెల్లడించారు.పాస్‌పోర్ట్‌ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై సమావేశంలో సమగ్రంగా, లోతుగా చర్చించినట్లు శశి థరూర్‌ తెలిపారు. ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు ధ్రువీకరణ, పౌరసత్వ సమస్యలు, పాస్‌పోర్ట్‌ చట్టం తదితర విస్తృత అంశాలు చర్చకు వచ్చినట్లు చెప్పారు. సమావేశానికి సుమారు 15 మంది ఎంపీలు హాజరైనట్లు వెల్లడించారు.


1967 నాటి పాస్‌పోర్ట్‌ చట్టానికి సవరణ అవసరం

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 1967 పాస్‌పోర్ట్‌ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని కొంతమంది ఎంపీలు సూచించినట్లు శశి థరూర్‌ తెలిపారు. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందుకు వెళ్లాల్సిన పని చాలా ఉందన్నారు.అయితే, కమిటీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న విచారణ మాత్రమేనని తెలిపారు.ఇటీవల జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ పర్యటన సందర్భంగా పాస్‌పోర్ట్‌ అధికారులతోనూ కమిటీ సభ్యులు చర్చలు జరిపినట్లు శశి థరూర్‌ వెల్లడించారు. పాస్‌పోర్ట్‌ వ్యవస్థకు సంబంధించి ఇంకా అనేక అంశాలపై తదుపరి వివరాలు సేకరించి, వాటిపై చర్చించాల్సి ఉందని చెప్పారు.

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ 300 కి.మీ. పాదయాత్ర





  • ఎర్రవల్లిలో అభిమానులకు ఆత్మీయ స్వాగతం

ఎర్రవల్లి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలనే ఆకాంక్షతో కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి నుంచి ఎర్రవల్లి వరకు ఇద్దరు సామాన్య గిరిజనులు సుమారు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో 11 రోజుల పాటు రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడిచిన ఆటోడ్రైవర్‌ జాడే తిరుపతి, హోటల్‌ కార్మికుడు దుర్గం శంకర్‌ గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు.

ఆసిఫాబాద్‌ నియోజకవర్గం వాంకిడి మండలానికి చెందిన ఈ ఇద్దరు ఆదివాసీ యువకులు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేకుండా, ఎలాంటి వినతిపత్రం సమర్పించాలనే ఉద్దేశం లేకుండా కేవలం “కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి” అనే సంకల్పంతో ఈ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్‌ పాలనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకే ఈ ప్రయాణం చేసినట్లు వెల్లడించారు.

ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో కేసీఆర్‌ను కలిసే అవకాశం లభించింది. ఎర్రవల్లికి చేరుకున్న తిరుపతి, శంకర్‌ను కేసీఆర్‌ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసినందుకు వారిని అభినందిస్తూ, వారి అభిమానాన్ని ప్రశంసించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ వారితో మాట్లాడుతూ “మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి” అంటూ వారి భుజం తట్టి ప్రోత్సహించినట్లు తెలిపారు. అనంతరం వారిని ఆత్మీయంగా వీడ్కోలు పలికిన కేసీఆర్‌, తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు.

కేసీఆర్‌పై తమకు ఉన్న అభిమానమే కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని, ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా ఆయన మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే వాంకిడి నుంచి ఎర్రవల్లి వరకు కాలినడకన వచ్చినట్లు తిరుపతి, శంకర్‌ తెలిపారు. ఈ పాదయాత్ర బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

22A పేరుతో ప్రజలను రెచ్చగొట్టొద్దు



  • అక్రమ ఆస్తులు కాపాడుకునే పగటి కలలు ఇక చెల్లవు: మంత్రి పొంగులేటి


సత్తుపల్లి: 22A నిబంధనను భూతంగా చూపిస్తూ అమాయక ప్రజలను రెచ్చగొట్టి, దాని ముసుగులో అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వారి పప్పులు ఉడకవని, అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రజల సొమ్మును కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. సత్తుపల్లి, నారాయణపురంలో నిర్వహించిన భూభారతి భూ రీసర్వే అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 22A అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని అన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో సాగవని స్పష్టం చేశారు.ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుని అనుభవిస్తే వంట పట్టదని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. వేల ఎకరాల భూములను అక్రమంగా ఎలా సంపాదించారన్న విషయాలను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. భూముల వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు.

భూభారతి భూ రీసర్వే ద్వారా భూములకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. ప్రభుత్వ భూ విధానాలపై అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

ఆక్స్‌ఫర్డ్ సంస్థ భారత్‌కు వ్యతిరేకం

 


  • సీఎం రేవంత్ పర్యటనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు


హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేపట్టిన 9-10 రోజుల యూకే, యూఎస్ పర్యటనపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం పర్యటనలో మొదటి భేటీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని 'బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్' (Blavatnik School of Governance) లో జరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌కు వ్యతిరేకంగా, అలాగే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయస్థాయిలో అసత్య ప్రచారాలు చేయడానికి కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ధర్మపురి అరవింద్.. "2014 తర్వాత భారతదేశంలో యూపీఏ హయాంలో జరిగినట్లుగా ఎలాంటి పెద్ద వరుస బాంబు పేలుళ్లు జరగలేదన్న విషయం గమనించాలి. 2004 నుంచి 2014 మధ్య దేశంలో 27 వరుస బాంబు పేలుళ్లు జరిగి దాదాపు 1,100 మంది నిర్దోషులు ప్రాణాలు కోల్పోయారు" అని గుర్తుచేశారు. సదరు సంస్థ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వ్యాసాలు అంతర్జాతీయ సమాజం స్వచ్ఛంద సంస్థలు (NGOలు), పౌర సమాజాల ద్వారా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాయని విమర్శించారు. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా, అయోధ్య ఉద్యమానికి మరియు దాని తర్వాతి అభివృద్ధికి వ్యతిరేకంగా కూడా ఆ సైట్‌లో రాసుకొచ్చారని తెలిపారు. భారతదేశంపై రోజూ విషం చిమ్మే సంస్థలను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు.

పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చర్యలు



  • కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌


హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి నాయకుడు, ఎంతటి స్థాయిలో ఉన్నా పార్టీ నిర్దేశించిన హద్దుల్లోనే ఉండాలనే క్రమశిక్షణ ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే సంబంధిత నేతలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతామని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై వ్యక్తిగతంగా నిరసన లేదా అభ్యంతరం వ్యక్తం చేయాలని సూచించారు. అయితే, బహిరంగంగా పార్టీపై అసమ్మతిని వ్యక్తం చేయడం సరికాదని, ఇలాంటి చర్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తుందని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

'వందేమాతరం' విభజనే దేశ విభజనకు పునాది


  • కాంగ్రెస్‌పై మండిపడిన అమిత్ షా



చెంగల్పట్టు (తమిళనాడు): కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) 'వందేమాతరం' గేయంపై తీసుకున్న తీర్మానంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఒక "దేశవ్యతిరేక నిర్ణయం" అని అభివర్ణించారు. 1937లో తీసుకున్న తీర్మానాన్నే మళ్లీ అనుసరిస్తూ వందేమాతరంలోని కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. "1937లో ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు, ఓటు బ్యాంక్ తుష్టీకరణ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందేమాతరం గేయాన్ని రెండుగా విభజించింది. ఆ రోజు వేసిన విత్తనమే తర్వాతి కాలంలో దేశ విభజనకు పునాదిగా మారింది. ఆ చారిత్రక తప్పును ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దింది. జాతీయ ఐక్యతను చాటుతూ పూర్తి గేయాన్ని ఆలపించేలా చట్టబద్ధమైన నిబంధనలను రూపొందించింది. కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చేసిన చట్టాన్ని తోసిపుచ్చి, తన పాత తీర్మానాన్నే అమలు చేస్తాననడం వారి తుష్టీకరణ విధానానికి పరాకాష్ట" అని మండిపడ్డారు.


బంకిం చంద్ర ఛటోపాధ్యాయ సృష్టించిన  గేయాన్ని, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన లక్షలాది మంది త్యాగధనులను కాంగ్రెస్ ఈ నిర్ణయం ద్వారా అవమానించిందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ ప్రతీకార, విభజన రాజకీయం చేస్తోందని విమర్శించారు. వందేమాతరాన్ని విభజించి గతంలో దేశం మూల్యం చెల్లించుకుందని, మళ్లీ అలాంటి పరిణామాలను దేశ ప్రజలు సహించరని చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చిన అమిత్ షా, ఈ వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.

విపక్షాలను, దళితులను తొక్కేస్తున్న బీజేపీ



  • ‘హరా భరా స్వరాజ్’ సభలో ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ 


న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడూ తాను ఈ దేశంలో భాగమేనన్న భావనతో జీవించే పరిస్థితిని కల్పించాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘హరా భరా స్వరాజ్‌: ఎ ట్రిబ్యూట్‌ టు రాజీవ్‌ గాంధీస్‌ విజన్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు సహా మైనారిటీ వర్గాలకు తమ ఉనికికి విలువ లేదన్న భావన కలిగించేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘‘మీరు నోరు విప్పితే మీపై ఏం చేస్తామో చూస్తారు’’ అన్న భయాన్ని ఆ వర్గాల్లో కలిగిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోందని రాహుల్‌ అన్నారు. తమకు నచ్చినప్పుడు వారి భూములను తీసుకుంటామని, వాటి కోసం వారు పోరాడితే కాల్చివేస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న దళితుల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘‘కుల వ్యవస్థలో ఎలాంటి తప్పూ లేదని, అంతా సవ్యంగానే ఉందని చెబుతూ దళితుల ఆవేదనను పట్టించుకోవడం లేదు’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. ఇలాంటి పరిస్థితులే దేశంలో నెలకొన్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మతం, సామాజిక వర్గం, వయసు, లింగభేదం వంటి ఏ అంశంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ దేశంలో తనకంటూ ఒక స్థానం ఉందన్న భావన కలగాలని రాహుల్‌ గాంధీ అన్నారు. ‘‘ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ ‘నేను ఇక్కడివాడినే, ఈ దేశంలో నాకూ భాగస్వామ్యం ఉంది’ అని భావించే పరిస్థితి రావాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

Featured post

పాస్‌పోర్ట్‌ వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ విస్తృత చర్చ

చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్‌  న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వ్యవస్థ, ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు వెరిఫికేషన్‌, పౌరసత్వ అంశాలు, పాస్‌పోర్ట్...