Monday, 24 August 2026

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

 



న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ఆమె ముఖం, ప్రశాంతమైన స్వరం, హుందా ప్రదర్శనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు.

సోషల్‌ మీడియా, 24 గంటల వార్తా చానళ్లకు ముందున్న కాలంలో దూరదర్శన్‌ వార్తలకు ప్రత్యేకమైన విశ్వసనీయత ఉండేది. సరళా మహేశ్వరి ఆ తరానికి ప్రతినిధిగా నిలిచారు. స్పష్టమైన ఉచ్చారణ, నిగ్రహంతో కూడిన భాష, విశ్వాసాన్ని కలిగించే వార్తా ప్రదర్శనతో దేశవ్యాప్తంగా అనేక కుటుంబాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

వార్తలను సంచలనంగా కాకుండా బాధ్యతాయుతంగా, సూటిగా అందించడం ఆమె శైలిలో ప్రత్యేకత. దూరదర్శన్‌ స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకునే ప్రేక్షకులకు ఆమె ఇప్పటికీ ఓ చిరస్మరణీయ వార్తా వ్యాఖ్యాతగానే నిలిచారు.

ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, మాజీ సహచరులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. భారత టెలివిజన్‌ చరిత్రలో సరళా మహేశ్వరి అందించిన సేవలు, ఆమె ప్రశాంతమైన ప్రదర్శన శైలి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.


అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 



హైదరాబాద్‌: తన అమెరికా పర్యటన రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు అవసరమైన భద్రత కల్పించడంతో పాటు, రాష్ట్రంలో వారికి లాభదాయకమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఏ దేశమైనా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకుంటే స్వాగతిస్తాం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం అందిస్తాం. పెట్టుబడులను కాపాడుతూ.. తెలంగాణ నుంచి వారికి లాభాలు వచ్చేలా చూస్తాం. ఇది చాలా సులభమైన విషయం’’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తాను అమెరికా పర్యటనకు వెళ్లకుండా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. ‘‘తెలంగాణను ప్రమోట్‌ చేసేందుకు నేను అమెరికా వెళ్లకుండా నరేంద్ర మోడీ అడ్డుకోవడానికి ఉన్న ఏకైక రాజకీయ కారణం ఇదే’’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

వీధి పోరాటాలతో రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ



  • ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటున్న విశ్లేషకులు


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ రాజకీయ శైలిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. పార్లమెంటరీ రాజకీయాలకే పరిమితం కాకుండా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వంపై నేరుగా పోరాటం చేయడం ఆయనకు కొత్త రాజకీయ బలాన్ని తెచ్చిపెడుతోంది. అయితే ఈ దూకుడును అతిగా ప్రదర్శించడం వల్ల విస్తృత ప్రతిపక్ష శిబిరంలో ఆయనపై ఉన్న నమ్మకానికి దెబ్బతగిలే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



జంతర్‌ మంతర్‌ ఘటన కీలక మలుపు


జూలై 20న జంతర్‌ మంతర్‌ వద్ద ప్రశ్నపత్రాల లీకేజీలను నిరసిస్తూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది యువత ఆందోళన చేపట్టారు. పోలీసులు, పారామిలటరీ బలగాలు ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌, లాఠీలతో దాడి చేయడంతో పాటు పెల్లెట్లు ప్రయోగించడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో సహిల్‌ లోచబ్‌ ఒకరు. పెల్లెట్ల కారణంగా ఆయన ఒక కన్ను చూపును కోల్పోయారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో రాహుల్‌ గాంధీ నేరుగా పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నిరసన చేపట్టారు. దాదాపు ఏడు గంటల పాటు అక్కడే ఉండి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించే వరకు వెనక్కి తగ్గలేదు. చివరకు పోలీసులు కేసు నమోదు చేయడం రాహుల్‌ గాంధీకి రాజకీయంగా   మైలేజీని తెచ్చిపెట్టింది. పార్లమెంటరీ రాజకీయాలతో పాటు వీధి పోరాటాన్ని సమర్థంగా మిళితం చేయగల నాయకుడిగా ఆయనకు కొత్త గుర్తింపు లభించిందనే విశ్లేషణలు వెలువడ్డాయి.



2014 తర్వాత మారిన రాహుల్‌ రాజకీయ ప్రస్థానం


2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ గాంధీకి రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కాంగ్రెస్‌ బలహీనపడటం, సోనియా గాంధీ ప్రభావం నుంచి తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవడం ఆయనకు కష్టంగా మారింది. 2019లో అమేథీలో ఓడిపోయినా, కేరళలోని వయనాడ్‌ నుంచి గెలుపొందిన రాహుల్‌ రాజకీయంగా వెనక్కి తగ్గలేదు. 2024 లోక్‌సభ ఎన్నికలు ఆయనకు కీలక మలుపుగా మారాయి. బీజేపీ సొంత మెజారిటీ సాధించలేకపోగా.. కాంగ్రెస్‌ దాదాపు 100 స్థానాలకు చేరువైంది. రాహుల్‌ గాంధీ రెండు స్థానాల్లోనూ విజయం సాధించడం ఆయనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అనంతరం రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటములకు ఎదురుదెబ్బలు తగిలినా, లోక్‌సభలో ప్రభుత్వంపై ఆయన దూకుడైన వైఖరి కొనసాగించారు.



వీధి ఉద్యమాలతో మరింత బలం


జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఉద్యమం రాజకీయ సమీకరణాలను మరింతగా మార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువత ఆందోళనలకు రాహుల్‌ గాంధీ బహిరంగంగా మద్దతు ఇవ్వడం, పోలీసుల చర్యలను ప్రశ్నించడం ఆయనకు ప్రజల్లో మరింత ఆదరణ తెచ్చిపెట్టింది. అయితే ఇక్కడే ఆయనకు అసలు సవాలు మొదలవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. యువత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఇతర రాజకీయ, సామాజిక శక్తులను పూర్తిగా పక్కన పెట్టి, మొత్తం ఉద్యమాన్ని తన చుట్టూ తిప్పుకోవాలని ప్రయత్నిస్తే అది ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చని హెచ్చరిస్తున్నారు.


ప్రతిపక్ష ఐక్యతే కీలకం


కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు మిత్రపక్షాలను కూడా అసంతృప్తికి గురిచేశాయి. ప్రతిపక్ష శక్తులన్నింటినీ కలుపుకొని విస్తృత ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించాలంటే రాహుల్‌ గాంధీ మరింత సమన్వయ ధోరణిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిన విషయాన్ని కూడా ఆ పార్టీ విస్మరించరాదని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, పాలన వంటి అంశాల్లో కాంగ్రెస్‌పై వచ్చిన విమర్శలు ఇప్పటికీ రాజకీయ చర్చలో ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.


దూకుడు సరే.. అందరినీ కలుపుకోవాలి


ప్రస్తుతం బీజేపీపై దూకుడైన పోరాటం రాహుల్‌ గాంధీకి రాజకీయంగా కొత్త ఊపునిచ్చింది. అయితే ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం ప్రభుత్వ వ్యతిరేకతకే పరిమితం కాకుండా, ఇతర ప్రతిపక్ష పార్టీలతోనూ సానుకూల సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.బీజేపీ బలహీనపడుతున్న పరిస్థితిని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మలుచుకోవాలంటే విభజన రాజకీయాలకు దూరంగా ఉండి విస్తృత ప్రజాస్వామ్య కూటమిని నిర్మించాల్సి ఉంటుంది. సోనియా గాంధీ గతంలో అనుసరించిన సమన్వయ రాజకీయ శైలిని రాహుల్‌ గాంధీ కూడా అనుసరిస్తేనే ఆయన ప్రస్తుత దూకుడు దీర్ఘకాలిక రాజకీయ బలంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

Saturday, 22 August 2026

నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌ హవా

  • చిరంజీవి కెరీర్‌లో ఈ ఐదు సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకమే!

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలోని మరపురాని చిత్రాలను మరోసారి గుర్తు చేసుకుందాం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్‌ కేవలం బాక్సాఫీస్‌ విజయాలకే పరిమితం కాలేదు. అద్భుతమైన డ్యాన్స్‌, స్టైలిష్‌ యాక్షన్‌, కామెడీ టైమింగ్‌, భావోద్వేగభరితమైన నటనతో తెలుగు కమర్షియల్‌ సినిమాకు చిరంజీవి కొత్త నిర్వచనం ఇచ్చారు. నటుడిగా తన పరిధిని విస్తరిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన కెరీర్‌లో ఎన్నో అద్భుత చిత్రాలున్నాయి. అందులో చిరంజీవి స్టార్‌డమ్‌ను, నటనా ప్రతిభను, ప్రత్యేకమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను ప్రతిబింబించే ఐదు చిత్రాలు ఇవి.



ఖైదీ (1983)

చిరంజీవిని ఒక్కసారిగా స్టార్‌ హీరోగా నిలబెట్టిన చిత్రం ‘ఖైదీ’. యాక్షన్‌, ప్రతీకారం, భావోద్వేగాలను మేళవించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో చిరంజీవి స్క్రీన్‌ ప్రెజెన్స్‌, రా యాక్షన్‌ స్టైల్‌, డ్యాన్స్‌ ప్రత్యేకత ప్రేక్షకులకు మరింత చేరువయ్యాయి. కమర్షియల్‌ హీరో ఎలా ఉండాలనే దానికి ‘ఖైదీ’ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.



స్వయంకృషి (1987)

దర్శకుడు కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘స్వయంకృషి’ చిరంజీవి నటనా ప్రతిభకు మరో కోణాన్ని పరిచయం చేసింది. సాధారణ కమర్షియల్‌ హీరో ఇమేజ్‌కు భిన్నంగా నిరక్షరాస్యుడైన చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో చిరంజీవి జీవించారు. నిజాయితీగా, కష్టపడి ఎదిగే సామాన్యుడి పాత్రను ఎంతో సహజంగా పోషించారు. ఈ చిత్రంలోని అద్భుత నటనకు ఆయన ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డును అందుకున్నారు.



రుద్రవీణ (1988)

కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుత చిత్రం ‘రుద్రవీణ’. సంప్రదాయ భావాలు కలిగిన శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన తండ్రికి, సామాజిక స్పృహతో ముందుకు సాగే కుమారుడికి మధ్య జరిగే భావజాల సంఘర్షణను ఈ సినిమా ఆవిష్కరించింది. చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కడంతో పాటు జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా ఈ చిత్రం అందుకుంది.



జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

శ్రీదేవి సరసన చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తెలుగు ప్రేక్షకులకు మరపురాని ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. సాహసోపేతమైన టూరిస్ట్‌ గైడ్‌గా చిరంజీవి, దివ్యలోకం నుంచి వచ్చిన అతిలోకసుందరిగా శ్రీదేవి ఆకట్టుకున్నారు. చిరంజీవి కామెడీ టైమింగ్‌, పాటల్లో ఆయన చూపించిన గ్రేస్‌, అద్భుతమైన స్క్రీన్‌ కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని ఎవర్‌గ్రీన్‌ బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి.



గ్యాంగ్‌ లీడర్‌ (1991)

1990ల మాస్‌ ఎంటర్‌టైనర్‌కు అసలైన నిర్వచనంగా నిలిచిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. చిరంజీవి స్టైల్‌, యాటిట్యూడ్‌, డ్యాన్స్‌, డైలాగ్‌ డెలివరీ, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా ఆయన చేసిన జాకెట్‌ స్లైడ్‌ డ్యాన్స్‌ అప్పట్లో ఓ ట్రెండ్‌గా మారింది. సినిమాలోని క్యాచీ డైలాగ్స్‌, మాస్‌ అప్పీల్‌ చిరంజీవిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాతి తరాల హీరోలకు కూడా ‘గ్యాంగ్‌ లీడర్‌’లోని చిరంజీవి స్టైల్‌ ఎంతో స్ఫూర్తిగా నిలిచింది.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో చిరంజీవి ఎన్నో పాత్రలు, ఎన్నో విజయాలు, ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అయితే ‘ఖైదీ’ నుంచి ‘గ్యాంగ్‌ లీడర్‌’ వరకు ఈ ఐదు చిత్రాలు ఆయన మెగాస్టార్‌ ప్రస్థానంలో ప్రత్యేక అధ్యాయాలుగా నిలిచిపోయాయి.

అత్త ఇప్పుడు ఓ జ్ఞాపకం



కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అత్త ( గెల్లు ఓదమ్మ - బావ వాళ్ల అమ్మ) మృత్యువుతో పోరాడింది. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడిన అత్త ఎప్పుడూ మంచానికే పరిమితమైంది లేదు. జ్వరం లాంటివి వచ్చినా ఒకటి రెండు రోజుల్లోనే పనికి పోయేది. అక్క దగ్గరికి హిమ్మత్‌నగర్‌కు ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినవ్‌ బిడ్డా రాజు అని పలకరించేది. పిల్లలు అంత మంచిగున్నరా అని అడిగేది. మంచిగ బతుకుతే చాలు బిడ్డ అనేది. ఆమె పలకరింపు లేకుండా నా హిమ్మత్‌నగర్‌ టూర్‌ ముగిసేది కాదు. ఎందుకంటే ఏ రాత్రి అయినా తను వచ్చి మాట్లాడేది. మూడు దశాబ్దాలకు పైగా అత్తతో అనుబంధం శుక్రవారం పొద్దున శేఖర్‌ కాల్‌తో కలగా మిగిలిపోయింది. శుక్రవారం పొద్దుగాల 6.03 గంటలకు శేఖర్‌ నుంచి కాల్‌ రాగానే నా మనసు ఏదో కీడును శంకించింది. బాపమ్మ అని కాలం చేసింది అనగానే కొంతసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఊ అని మాత్రమే అంతే.  అత్త మీద ఎందుకు ఇంత అభిమానం ఎందుకు అంటే కొడుకులు, కోడండ్లు వ్యవసాయ పనులకు పోతే  తల్లి కోడి లెక్క మనుమలను, మనుమరాండ్లను కంటికి రెప్పలా చూసుకునేది. నిజానికి వాళ్లకు జీవిత పాఠాలో బోధించింది ఓదక్కే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గట్టిగా నిలబడాలనే ధైర్యాన్ని వాళ్లకు చిన్నప్పుడే నూరిపోసింది. అందుకే ఓదక్క వాళ్లకు రోల్‌ మోడల్‌ అయ్యింది. 


ఎన్నడూ ధైర్యం చెడని అత్త ఐదు నెలల కిందట అనారోగ్యానికి గురైనప్పుడు కొంత ఆందోళనపడ్డది. జీవిత పోరాటం చివరి దశకు వచ్చిందని ఊహించింది కావొచ్చు. ఇక మనుపటిలా కోలుకుని పని వెళ్లలేను అనుకుని ఉండొచ్చు. జీవితకాలమంతా పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు శ్రమకోర్చే వాళ్లకు ఒక్క పూట ఖాళీగా ఉంటే ఏమీ తోచదు. అట్లాఈ చివరి ఐదు నెలలు హాస్పటల్‌ లో రెండు నెలలు, ఇంటి వద్ద మూడు నెలలుగా మంచం పట్టునే ఉండటంతో మనాదిలో పడింది. హన్మకొండలో డాక్టర్లు  రెండు నెలల చికిత్స అనంతరం వృద్ధాప్యం కారణంగా ఆమె శరీరం సహకరించడం లేదని తేల్చారు. ఇంటికి తీసుకెళ్లమని సూచించారు. పది రోజుల కంటే ఎక్కువ బతకదు అని డాక్టర్లు చెప్పారట. కానీ తన సంకల్పం తన జీవితకాలాన్ని మూడు నెలలకు పెంచింది. తిండి లేదు. నమిలే అవకాశం లేదు. అప్పుడప్పుడు గొంతు తడపడానికి ఇచ్చిన  జ్యూసులు, మంచినీళ్లతోనే మూడు నెలలు మనుగడ సాగించింది. మామ (కనకయ్య) పోయినప్పుడు ఆ లోటు కనిపించలేదు. కానీ మొన్న అత్త ఇక కనిపించదు అన్నప్పుడు ఏదో వెలతి అనిపించింది. ఎప్పుడు వచ్చినవ్‌ బిడ్డా అనే అనే అత్త ఆత్మీయ పిలుపు ఇక వినిపించదు. అత్త ఇప్పుడు ఒక జ్ఞాపకం. ఓదవ్వకు అశ్రునివాళి. 

Friday, 21 August 2026

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ



  • ‘నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం’తో రాజకీయ క్లియరెన్స్‌ ఇవ్వలేదన్న విదేశాంగ శాఖ.. 
  • లండన్‌ నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం


హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్‌’ విదేశీ పర్యటనలో కీలక మార్పు చోటుచేసుకుంది. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో సీఎం తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఆగస్టు 23న అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 20న లండన్‌ బయలుదేరి.. బ్రిటన్‌, అమెరికాల్లో 10 రోజుల పాటు పర్యటించి ఆగస్టు 30న హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ పర్యటనలో ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను తెలంగాణకు ఆకర్షించడం, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.


  • అమెరికా పర్యటనకు రాజకీయ క్లియరెన్స్‌ నిరాకరణ


అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. పర్యటనకు ‘రాజకీయ కోణంలో క్లియరెన్స్‌ నిరాకరించబడింది’ అని విదేశాంగ శాఖ పేర్కొన్నట్లు సీఎంవో తెలిపింది. బ్రిటన్‌, అమెరికా పర్యటనలకు కేంద్రం నుంచి అనుమతి కోరగా.. బ్రిటన్‌ పర్యటనకు మాత్రమే అనుమతి లభించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే అధికారిక ప్రతినిధి బృందం ఇప్పటికే బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని తెలిపింది. 


కేంద్ర నిర్ణయంతో తాను తీవ్రంగా నిరాశ చెందినప్పటికీ, దాన్ని గౌరవిస్తూ లండన్‌ నుంచే భారత్‌కు తిరిగి రావాలని సీఎం నిర్ణయించుకున్నారని సీఎంవో పేర్కొంది.‘ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యం’ అమెరికా పర్యటన ఉద్దేశం పూర్తిగా విద్యారంగానికి సంబంధించినదేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్‌కు, ముఖ్యంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడమే తన పర్యటన లక్ష్యమని చెప్పారు. కేంద్ర నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి యువతకు అత్యుత్తమ విద్య, నైపుణ్యాలు, శిక్షణ అందించాలన్నదే ఉద్దేశమని వివరించారు.దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తాను ఎప్పటి నుంచో విశ్వసిస్తున్నానని సీఎం అన్నారు. 



  • అమెరికా కార్యక్రమాలు అధికారులతో పూర్తి చేయించనున్న సీఎం


తాను అమెరికా వెళ్లకపోయినా.. అక్కడి ప్రతిపాదిత పర్యటనను అధికారులు కొనసాగించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదిత అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సూచించారు.మరోవైపు బ్రిటన్‌లో ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమాలను సీఎం కొనసాగించనున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన బ్లావత్నిక్‌ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌, కేంబ్రిడ్జ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ తదితర సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు.హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నగరానికి గొప్ప మానవ వనరులను అందించాయని గుర్తుచేశారు.హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా వంటి ప్రముఖులు ఎదిగారని సీఎం ప్రస్తావించారు. ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్‌ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి సంస్థలు, గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు ఆకర్షితమయ్యాయని తెలిపారు.హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎంఐటీ, ఎల్‌బీఎస్‌, ఎల్‌ఎస్‌ఈ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో చదివే అవకాశాన్ని భారతీయులకు హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన సంకల్పమని రేవంత్‌రెడ్డి చెప్పారు.


  • అనుమతి నిరాకరణలో రాజకీయ కోణం లేదు


అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంలో రాజకీయ కోణం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు అన్నారు. విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే సమయంలో విదేశాంగ శాఖ అనేక అంశాలను పరిశీలిస్తుందని తెలిపారు.పర్యటన అవసరం, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, అంతర్జాతీయ ప్రోటోకాల్‌, దౌత్యపరమైన అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.గతంలో 2012లో యూపీఏ ప్రభుత్వం అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ అమెరికా, ఇజ్రాయెల్‌ పర్యటనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని రామచందర్‌రావు గుర్తుచేశారు. అప్పట్లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్‌ నేతలు లేఖలు రాశారని ఆరోపించారు.రేవంత్‌రెడ్డి గతంలో విదేశీ పర్యటనలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ప్రస్తుత నిర్ణయం నిబంధనల ప్రకారమే తీసుకున్నదని ఆయన అన్నారు.


  • అమెరికాలో షెడ్యూల్‌లో కీలక కార్యక్రమాలు


అమెరికా పర్యటనలో భాగంగా ఆగస్టు 24న హార్వర్డ్‌ యూనివర్సిటీ, ఎంఐటీ క్యాంపస్‌లను సందర్శించాలని రేవంత్‌రెడ్డి తొలుత నిర్ణయించారు. ఆగస్టు 25న బోస్టన్‌లోని వర్జీనియా టెక్‌ యూనివర్సిటీ బృందంతో సమావేశం కావాల్సి ఉంది. ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ నిర్వహించే ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. ఆగస్టు 30న హైదరాబాద్‌కు తిరిగి రావాల్సిన షెడ్యూల్‌ ఉంది.అయితే కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో ఈ కార్యక్రమాలను సీఎం స్వయంగా హాజరుకాకుండానే అధికారుల ద్వారా కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...