Tuesday, 18 August 2026

టెస్టుల్లో 100 సిక్సులు.. భారత తొలి బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ చరిత్ర




శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున 100 సిక్సులు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 66 పరుగులు చేసిన పంత్‌ రెండు సిక్సులు కొట్టడంతో ఈ మైలురాయిని అందుకున్నాడు. భారత్‌ తరఫున వీరేంద్ర సెహ్వాగ్‌ 90, రోహిత్‌ శర్మ 88 సిక్సులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 82 సిక్సులతో పంత్‌కు దగ్గరగా ఉన్నాడు.


అంతర్జాతీయంగా టెస్టుల్లో 100 సిక్సులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్‌గా పంత్‌ నిలిచాడు. అతడి కంటే ముందు బెన్‌ స్టోక్స్‌ 138, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ 108, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 100 సిక్సులు సాధించారు. అయితే కేవలం 51 టెస్టుల్లోనే 100 సిక్సుల మైలురాయిని చేరుకోవడం ద్వారా ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్‌గా పంత్‌ నిలిచాడు.

ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. ఆస్పత్రికి తరలించాలని పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశం




ఇస్లామాబాద్‌: జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్‌ వైద్య నివేదికలు, కుటుంబ సభ్యులు, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ నేతల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ప్రైవేట్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని పీటీఐ ప్రతినిధి జుల్ఫికర్‌ బుఖారీ కోరారు.


ఇమ్రాన్‌ ఆరోగ్యంపై మాజీ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల జైలు జీవితం, ఒంటరితనం కారణంగా ఆయన తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. తోషాఖానా, అల్‌-ఖాదిర్‌ ట్రస్ట్‌ తదితర కేసుల్లో శిక్ష పడటంతో ఇమ్రాన్‌ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.

ఓట్ల తొలగింపుపై ఈసీపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు




హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో బీఎల్‌వోలు పలువురి ఇళ్లకు వెళ్లలేదని, ముఖ్యంగా పేదలు, వలస కార్మికుల ఓట్లే ఎక్కువగా తొలగించారని అన్నారు. రాష్ట్రంలో 73 లక్షల ఓట్లను కారణం లేకుండా తొలగించారని, మరో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయని ఆయన పేర్కొన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటు హక్కును ముడిపెట్టడం సరికాదని, డీలిమిటేషన్‌, పోలింగ్‌ కేంద్రాల మార్పుల కారణంగా పాత వివరాలు అందరికీ అందుబాటులో లేవని విమర్శించారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిలో పనిచేస్తోందని ఆరోపించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఓట్ల తొలగింపుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

యుద్ధ ప్రభావం.. కోల్గేట్‌ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం






న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ముడిసరుకుల వ్యయం పెరగడంతో కోల్గేట్‌-పామోలివ్‌ ఉత్పత్తుల ధరలు రానున్న త్రైమాసికాల్లో పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న వ్యయాలను తట్టుకుని లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ధరల పెంపు అవసరమని కంపెనీ సీఈవో, ఎండీ ప్రభా నరసింహన్‌ తెలిపారు. యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల సరఫరాపై ప్రభావం పడుతోందని, ధరలు పెంచకపోతే భవిష్యత్తులో ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. మరోవైపు ప్రీమియం టూత్‌పేస్ట్‌, టూత్‌బ్రష్‌ ఉత్పత్తులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. పామోలివ్‌ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు బాంబే షేవింగ్‌ కంపెనీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఖేల్‌రత్నకు ఈసారి ‘నో’.. 17 మందికి అర్జున అవార్డులు




న్యూఢిల్లీ: 2025 సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నను ఎవరికి ప్రకటించలేదు. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు దక్కాయి. అథ్లెటిక్స్‌లో తేజస్విన్‌ శంకర్‌, మహమ్మద్‌ అజ్మల్‌, ప్రియాంక గోస్వామి, బ్యాడ్మింటన్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌, చెస్‌లో విదిత్‌ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్‌ సహా పలువురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. హాకీలో లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్‌ పాల్‌, కబడ్డీలో సుర్జీత్‌, పూజ, షూటింగ్‌లో అఖిల్‌ షియోరాన్‌, పారా షూటింగ్‌లో ధనుష్‌ శ్రీకాంత్‌, రుద్రాంశ్‌ ఖండేల్వాల్‌, రోయింగ్‌లో అరవింద్‌ సింగ్‌ తదితరులు అవార్డులు అందుకోనున్నారు. ఫుట్‌బాల్‌లో అరుమై నాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్‌) లభించింది. పలువురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించారు.

భారత్‌ ఎన్నికల విధానమే ఆదర్శం: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు



వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేయాలని పట్టుబడుతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’ను తక్షణమే ఆమోదించాలని మరోసారి కోరారు. ఈ సందర్భంగా భారత్‌ ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ, అమెరికా దానిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారత్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, ఒక శాతం కంటే తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని ట్రంప్‌ తెలిపారు. భారత్‌లో ప్రతి ఓటరుకూ చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఉంటుందని పేర్కొంటూ, అమెరికాలోనూ ఇలాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని తన ‘ట్రూత్‌ సోషల్‌’ పోస్టులో పిలుపునిచ్చారు.

Monday, 17 August 2026

పీయూష్‌ గోయల్‌కు బీజేపీలో కీలక బాధ్యత

 

  • మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంకేతమా?

 న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరచర్చకు దారితీసింది. బీజేపీ అనుసరిస్తున్న ‘ఒక వ్యక్తి – ఒక పదవి’ అనే అనధికారిక విధానం నేపథ్యంలో గోయల్‌కు ఈ కీలక పార్టీ బాధ్యతలు అప్పగించడం.. త్వరలో జరగబోయే మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సంకేతమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గోయల్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రోత్సహించిన ‘ఒక వ్యక్తి–ఒక పదవి’ విధానం ప్రకారం సాధారణంగా ఒక నేత ఒకేసారి కీలకమైన ప్రభుత్వ, పార్టీ సంస్థాగత బాధ్యతలు రెండింటినీ నిర్వహించకుండా చూడటం ఆనవాయితీగా ఉంది. ఈ నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల శాఖను నిర్వహిస్తున్న గోయల్‌కు పార్టీ జాతీయ కోశాధికారి పదవి ఇవ్వడం.. ఆయన భవిష్యత్‌ మంత్రిపదవిపై ఊహాగానాలకు కారణమైంది. అయితే ఈ నియామకం కేవలం పార్టీ వ్యవహారాల్లో గోయల్‌ అనుభవాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతోనూ జరిగి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై కొనసాగుతున్న చర్చలకు గోయల్‌ నేతృత్వం వహిస్తున్నారు. కాబట్టి వాణిజ్య మంత్రిగా ఆయనను కొనసాగించడమా, లేక పార్టీ బాధ్యతలకు పూర్తిస్థాయిలో కేటాయించడమా అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. పీయూష్‌ గోయల్‌ కుటుంబానికీ బీజేపీ కోశాధికారి పదవితో అనుబంధం ఉంది. ఆయన తండ్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ కూడా రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ జాతీయ కోశాధికారిగా పనిచేశారు. గతంలో పీయూష్‌ గోయల్‌ కూడా పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు.


 


  • ‘ఒక వ్యక్తి–ఒక పదవి’ విధానానికి మినహాయింపులు


అయితే బీజేపీ ‘ఒక వ్యక్తి–ఒక పదవి’ విధానానికి మినహాయింపులు కూడా ఉన్నాయి. మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇందుకు ప్రధాన ఉదాహరణ. 2020లో బీజేపీ అధ్యక్షుడైన నడ్డా పదవీకాలం 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పొడిగించబడింది. ఆ తర్వాత ఆయన మోడీ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖతో పాటు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా కొంతకాలం పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగారు. 2026 జనవరిలో నితిన్‌ నబిన్‌ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో నడ్డా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో అవసరాన్ని బట్టి పార్టీ తన విధానానికి మినహాయింపులు ఇవ్వగలదన్న విషయం స్పష్టమవుతోంది.






ఇదిలా ఉంటే, నితిన్‌ నబిన్‌ నేతృత్వంలో సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ బృందంలో పలువురు ప్రముఖ నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కేంద్ర సంస్థాగత వ్యవస్థలోకి తిరిగి వచ్చారు. మాజీ కేంద్ర మంత్రి రామ్‌ మాధవ్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా తిరిగి కీలక బాధ్యతలు చేపట్టారు. మాజీ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, బైజయంత్‌ పాండా, రేఖా వర్మ, తారిఖ్‌ మన్సూర్‌ తదితరులు జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వినోద్‌ తావ్డే, సునీల్‌ బన్సల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతుండగా, బీఎల్‌ సంతోష్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా కొనసాగుతున్నారు. అనిల్‌ ఆంటోనీ జాతీయ కార్యదర్శిగా, అనిల్‌ బలూనీ జాతీయ మీడియా బాధ్యతల్లో కొనసాగుతున్నారు.


వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా పీయూష్‌ గోయల్‌ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాణిజ్య చర్చలు, పెట్టుబడులు, ఎగుమతులు, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆయన ఆధ్వర్యంలో భారత్‌ యూరోపియన్‌ యూనియన్‌, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ సహా పలు దేశాలు, ఆర్థిక వ్యవస్థలతో తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసింది. అలాంటి కీలకమైన కేంద్ర మంత్రిని పార్టీ సంస్థాగత వ్యవస్థలోకి తీసుకురావడం సాధారణ నియామకమేనా, లేక భవిష్యత్తులో కేబినెట్‌ మార్పులకు సంకేతమా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గోయల్‌ ఆర్థిక, ఎన్నికల నిర్వహణ, సంస్థాగత వ్యవహారాల్లో ఉన్న అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవాలని భావించి ఉండవచ్చు. మరోవైపు ప్రభుత్వ, పార్టీ బాధ్యతలను వేరు చేయాలనే ఉద్దేశంతో ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించి ఉండే అవకాశమూ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


 


  • కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు


మోడీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల ముందు ఈ చర్చ మరింత ఊపందుకుంది. ప్రతిపక్షాల ఆందోళనలు, నీట్‌ అంశంపై యువత నుంచి వచ్చిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు వచ్చిన డిమాండ్లు వంటి కారణాలతో కేబినెట్‌ మార్పు వాయిదా పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.తాజా బీజేపీ సంస్థాగత నియామకాలతో మరోసారి కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది.

Featured post

టెస్టుల్లో 100 సిక్సులు.. భారత తొలి బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ చరిత్ర

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున 100 సిక్స...