Wednesday, 19 August 2026

నా జీవితం గురించి రాయడం అంత సులభం కాదు



  •  సోనియా గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు, ప్రేమ, విషాదాలు, రాజకీయ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రాసిన 544 పేజీల ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ నవంబర్‌లో విడుదల కానుంది. తన వ్యక్తిగత జీవితాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించడం అంత సులభంగా అనిపించలేదని సోనియా గాంధీ తెలిపారు. తనలోనే దాచుకున్న ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలను బయటపెట్టాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రముఖ ప్రచురణ సంస్థ ఆల్ఫ్రెడ్‌ ఏ. నాఫ్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సోనియా తన పుస్తక రచన అనుభవాలను పంచుకున్నారు. ‘‘వేదన, నష్టాలే నన్ను రాజకీయాల బహిరంగ ప్రపంచంలోకి నెట్టాయి. అప్పటివరకు నా వ్యక్తిగత జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాను’’ అని ఆమె చెప్పారు. తన జీవితాన్ని రాయడం తనకు సహజంగా అనిపించలేదని, తనలోనే దాచుకున్న అనుభవాలు, భావోద్వేగాలను పాఠకులతో పంచుకోవాల్సి వచ్చిందని వివరించారు.


ఇటలీ నుంచి భారత్‌ వరకు.. ప్రేమతో మొదలైన ప్రయాణం


‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పేరుతో వెలువడనున్న ఈ పుస్తకం హార్డ్‌కవర్‌, ఈ-బుక్‌ రూపాల్లో నవంబర్‌ 10న విడుదల కానుంది. ఆడియో ఎడిషన్‌ను పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ప్రచురించనుంది. తొలివిడతగా లక్ష ప్రతులను ముద్రించనున్నట్లు ప్రచురణ సంస్థ తెలిపింది.

తన జీవితంలోని ఆనందాలు, చీకటి విషాదాల మధ్య సాగిన ప్రయాణానికి ఈ పుస్తకం ప్రతిబింబంగా నిలవాలని సోనియా ఆకాంక్షించారు. ‘‘నా జీవితంలో ఎన్నో విషయాలు రాశారు. అయితే నా కుటుంబ సభ్యుల నిర్ణయాలు, వారి చర్యలు, వారి మానవీయ బలహీనతల వెనుక ఉన్న నిజాలను చాలా కథనాలు పూర్తిగా ఆవిష్కరించలేకపోయాయి’’ అని ఆమె పేర్కొన్నారు. అందుకే ఈ పుస్తకం తన కుటుంబంలోని మానవీయ కోణానికి ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. సోనియా గాంధీ బాల్యం నుంచి భారత్‌లో ఆమె జీవిత ప్రస్థానం వరకు పుస్తకంలో వివరించినట్లు ప్రచురణ సంస్థ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతర ఇటలీలోని చిన్న పట్టణంలో గడిచిన బాల్యం నుంచి భారత్‌లోకి అడుగుపెట్టిన సందర్భాలు, రాజీవ్‌ గాంధీతో వివాహం, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కోడలిగా మారిన దశలను ఆమె ఇందులో ప్రస్తావించారు.


1965లో రాజీవ్‌తో తొలి పరిచయం


ఈ పుస్తకం 1965లో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ నుంచి ప్రారంభమవుతుంది. అప్పటికి 19 ఏళ్ల విద్యార్థినిగా ఉన్న సోనియా మైనో.. రాజీవ్‌ గాంధీని తొలిసారి కలుసుకుని ప్రేమలో పడిన సందర్భాలను వివరించినట్లు ప్రచురణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత ఇందిరా గాంధీతో తన పరిచయం, భారతీయ సంస్కృతికి అలవాటు పడేందుకు చేసిన ప్రయత్నాలు, హిందీ నేర్చుకోవడం, చీర ధరించడం, భారతీయ వంటకాలను ఆస్వాదించడం వంటి వ్యక్తిగత అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. అయితే గాంధీ కుటుంబంలో చోటుచేసుకున్న వరుస విషాదాలు ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రాజీవ్‌ గాంధీ తమ్ముడు సంజయ్‌ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం, 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురికావడం, ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఏడేళ్లకే ఎన్నికల ప్రచారంలో ఆయన కూడా హత్యకు గురికావడం వంటి విషాద ఘటనలు పుస్తకంలో కీలకంగా ఉండనున్నాయి.


రాజకీయాల్లోకి రావడం.. 2004లో ప్రధాని పదవిని తిరస్కరించడం


రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడిని చాలాకాలం పాటు సోనియా గాంధీ తిరస్కరించారు. అయితే కుటుంబంలో వరుసగా చోటుచేసుకున్న విషాదాల అనంతరం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహిస్తూ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ప్రధాని పదవిని స్వీకరించేందుకు నిరాకరించిన నిర్ణయాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు.. ప్రేమ, కుటుంబం, విధేయత అనే అంశాలు తన ప్రయాణంలో నిరంతరం కొనసాగిన అంతర్లీన బంధంగా కనిపించాయని సోనియా పేర్కొన్నారు.


ఆరు దశాబ్దాల భారతీయ సామాజిక, రాజకీయ మార్పులకు తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని ఆమె చెప్పారు. భారత్‌ను తన ‘సొంత దేశం’గా అభివర్ణిస్తూ, ఈ దేశంలో తాను చూసిన పరిణామాలు, అనుభవాలను పాఠకులతో పంచుకోవడమే పుస్తకం ఉద్దేశమని తెలిపారు.

ప్రచురణ సంస్థ నాఫ్‌ ఈ పుస్తకాన్ని సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, ప్రేమ, కుటుంబం, భారత్‌తో ఆమె అనుబంధాన్ని ప్రతిబింబించే ఆత్మీయ కథనంగా పేర్కొంది. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో చోటుచేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలతో పాటు ప్రస్తుత రాజకీయ సవాళ్లపై ఆమె దృష్టికోణం కూడా ఇందులో కనిపిస్తుందని తెలిపింది.భారత్‌లో ఆరు దశాబ్దాలుగా జరిగిన ఆర్థిక, సామాజిక మార్పులపై అంతర్గత దృష్టితో పాటు.. గుర్తింపు, బాధ్యత, కుటుంబం, సొంత ఇల్లు అనే భావన వంటి అంశాలపై సోనియా గాంధీ ఆత్మపరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని ప్రచురణ సంస్థ వెల్లడించింది.

అమిత్‌ మాలవీయకు ఉద్వాసన ఎందుకు?

 


  • బీజేపీలో ‘పదవిని మించి ఎదగొద్దు’ అనే సంకేతమా?


న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ సెల్‌, సోషల్‌ మీడియా విభాగాన్ని దాదాపు 11 ఏళ్లపాటు నడిపించిన అమిత్‌ మాలవీయను ఆ బాధ్యతల నుంచి తప్పించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన నేపథ్యంలో మాలవీయను కీలక బాధ్యత నుంచి తప్పించడం వెనుక అసలు కారణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ వ్యవహారాలను విశ్లేషిస్తున్న వారి అభిప్రాయం ప్రకారం.. మాలవీయ చేసిన ప్రధాన తప్పిదం ఒక్కటే — తాను నిర్వహిస్తున్న పదవి కంటే తానే పెద్ద వ్యక్తిగా కనిపించడం.


బీజేపీ ఐటీ సెల్‌, సోషల్‌ మీడియా విభాగం ప్రస్తుత రూపానికి 2008లో అప్పటి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ హయాంలో పునాది పడింది. 2009 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థను బలోపేతం చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియా రాజకీయాల్లో బీజేపీ దూసుకెళ్లడంతో అమిత్‌ మాలవీయ కీలకపాత్ర పోషించారు. పార్టీ సందేశాలను డిజిటల్‌ వేదికలపై విస్తృతంగా తీసుకెళ్లడంలో ఆయన ప్రభావం పెరిగింది. అయితే కాలక్రమంలో ఐటీ సెల్‌, సోషల్‌ మీడియా అంటే మాలవీయనే అన్న స్థాయికి ఆయన వ్యక్తిగత గుర్తింపు పెరగడం పార్టీ నాయకత్వానికి అసౌకర్యంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.



మాలవీయను తొలగించిన తర్వాతే బీజేపీ సోషల్‌ మీడియా వ్యూహంలో లోపాలపై విమర్శలు బయటకు రావడం కూడా గమనార్హం. ఇటీవల యువత, విద్యార్థుల ఆందోళనలు అనూహ్యంగా వేగం పుంజుకోవడం, సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకోవడం పార్టీకి సవాలుగా మారినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జులై 20న వేలాది మంది యువకులు ఢిల్లీ వైపు కదిలిన సమయంలో పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలు ముందస్తు అంచనా వేయలేకపోయాయనే విమర్శలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో మాలవీయను తప్పించడం కేవలం వ్యక్తిగత మార్పు కాదని, పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సందేశమని విశ్లేషకులు అంటున్నారు. ‘‘పార్టీ అప్పగించిన బాధ్యత కంటే ఎవరూ పెద్దవారిగా మారకూడదు’’ అనే స్పష్టమైన సంకేతం ఇందులో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత బీజేపీ వ్యవస్థలో నిర్ణయాలు అత్యున్నతస్థాయిలో తీసుకోబడుతున్నందున.. కీలక పదవుల్లో ఉన్నవారు ప్రధానంగా వాటిని అమలు చేసే పాత్రకే పరిమితమవుతున్నారని విశ్లేషణ.



ఇలాంటి పరిణామాలను అర్థం చేసుకోవాలంటే బీజేపీలో మారిన అంతర్గత పని విధానాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు ఎల్‌.కె. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, శాంతకుమార్‌, యశ్వంత్‌ సిన్హా అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు లేఖ రాశారు. బిహార్‌ ఓటమికి అందరూ బాధ్యులేనని చెప్పడం అంటే అసలు ఎవరినీ బాధ్యులను చేయకపోవడమేనని వారు ప్రశ్నించారు. పార్టీ ఒకప్పుడు సామూహిక చర్చలు, భిన్నాభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చేదని, ఇప్పుడు కొద్దిమంది చేతుల్లో నిర్ణయాలు కేంద్రీకృతమవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లేఖకు సమాధానం రాలేదని విశ్లేషణ పేర్కొంటోంది.


ఇప్పుడు బీజేపీ ఒకప్పుడు ఆలోచనలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లిన పార్టీ నుంచి.. పైస్థాయిలో నిర్ణయించిన విధానాలను అమలు చేసే వ్యవస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్ల జాతీయ కార్యవర్గంలో మార్పులు జరిగినా అసలు నిర్ణయ ప్రక్రియలో వాటి ప్రభావం పరిమితమేననే అభిప్రాయం ఉంది.



స్మృతి ఇరానీకి మళ్లీ కీలక బాధ్యతలు


కొత్త నియామకాల్లో మరో ఆసక్తికర పరిణామం స్మృతి ఇరానీ తిరిగి బీజేపీ కేంద్ర కార్యాలయ వ్యవస్థలోకి రావడం. 2014లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా సంచలనాత్మక ఆరంభం చేసిన ఆమె.. అనంతరం తక్కువ ప్రాధాన్యమున్న శాఖలకు పరిమితమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ఓటమి తర్వాత ఆమె రాజకీయ ప్రాధాన్యం తగ్గినట్లు కనిపించింది. ఇప్పుడు ఆమెను ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నియమించడం ద్వారా పార్టీ మరోసారి ఆమెకు రాజకీయ బాధ్యతలు అప్పగించింది. అయితే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంస్థాగత బాధ్యతలను ఆమెకు ఇవ్వకపోవడం.. ఆమెపై పార్టీ నాయకత్వం ఇంకా ఒక రకమైన పర్యవేక్షణ కొనసాగిస్తోందనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె సామర్థ్యాన్ని మాత్రం పార్టీ వినియోగించుకోవచ్చని అంచనా వేస్తున్నారు.


పీయూష్‌ గోయల్‌ కొనసాగింపు వెనుక ఏ సంకేతం?


పార్టీ కోశాధికారిగా పీయూష్‌ గోయల్‌ను కొనసాగించడం కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన తండ్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ బీజేపీ ఆవిర్భావం తర్వాత దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ కోశాధికారిగా పనిచేశారు. పీయూష్‌ గోయల్‌ కూడా అదే బాధ్యతను నిర్వహించిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ పార్టీ కోశాధికారిగా నియమించడంతో భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉండవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే బీజేపీలో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సూత్రం ఎప్పుడూ కచ్చితంగా అమలవుతుందా అన్నది మరో ప్రశ్న. జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా ఉండగానే కేంద్ర మంత్రిగా కొనసాగిన సందర్భం ఇందుకు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.


రామ్‌ మాధవ్‌కు పునరాగమనం


ఆర్‌ఎస్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన రామ్‌ మాధవ్‌కు కూడా బీజేపీలో మరోసారి స్థానం లభించింది. రాజకీయంగా కొంతకాలం పక్కకు వెళ్లిన ఆయన.. ఇటీవలి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంతో సంబంధాలను పునరుద్ధరించడంలో విజయవంతమయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఈ పదవికి సంస్థాగతంగా పెద్ద అధికారాలు లేకపోయినా.. భవిష్యత్తులో ఆయనకు పార్టీ అప్పగించే ప్రత్యేక బాధ్యతలు కీలకంగా మారే అవకాశం ఉందని అంచనా.


మొత్తంగా చూస్తే బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గ కూర్పు కేవలం పదవుల భర్తీ ప్రక్రియ కాదని, నాయకత్వం తనకు అనుకూలంగా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించుకుంటున్న సంకేతాలు ఇందులో కనిపిస్తున్నాయని విశ్లేషణ. అమిత్‌ మాలవీయ ఉద్వాసన, స్మృతి ఇరానీ పునరాగమనం, రామ్‌ మాధవ్‌కు చోటు, పీయూష్‌ గోయల్‌ కొనసాగింపు వంటి పరిణామాలు పార్టీ అంతర్గత రాజకీయాల్లో భిన్నమైన సందేశాలను ఇస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీలో వ్యక్తి కంటే వ్యవస్థ, పదవి కంటే నాయకత్వానికి విధేయతే కీలకం. అప్పగించిన బాధ్యతను మించి వ్యక్తిగత ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే.. ఆ పరిణామాలకు మూల్యం చెల్లించాల్సి రావచ్చనే సంకేతాన్ని మాలవీయ ఉదంతం ఇస్తోంది.

నా యవ్వనం, వ్యక్తిగత జీవితం గురించి కలలు కనొద్దు



  • బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు


జనరేషన్‌ జెడ్‌పై తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ ఘాటుగా స్పందించారు. తన యవ్వనం, వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు చేయవద్దంటూ సోషల్‌ మీడియా వేదికగా రామ్‌దేవ్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన యువత నిరసనలపై కంగనా గతంలో చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. కొందరు యువ నిరసనకారులను ఆమె ‘జనరేషన్‌ గట్టర్‌’గా అభివర్ణించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, జంతర్‌ మంతర్‌లో జరిగిన నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న యువత మొత్తాన్ని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని కంగనా వివరణ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, మహిళలను మాత్రమే ఉద్దేశించి మాట్లాడానని స్పష్టం చేశారు. యువతలో కొందరు మాదకద్రవ్యాలు, బెట్టింగ్‌, జూదం, డార్క్‌ వెబ్‌ వంటి వ్యసనాలకు గురవుతున్న అంశాన్ని ప్రస్తావించానని కంగనా తెలిపారు. ఒక నిర్దిష్ట వర్గం యువత గురించి మాట్లాడటం అంటే మొత్తం యువతను కించపరిచినట్లు కాదని ఆమె అన్నారు.


ఈ వివాదంపై స్పందించిన బాబా రామ్‌దేవ్‌.. కంగనా గత జీవితం, ఆమె యవ్వనం ఎలా ఉండేదో ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్తా కథనాన్ని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘‘బాబాజీ.. నా యవ్వనం, బెడ్‌రూమ్‌ గురించి కలలు కనొద్దు. వదంతులు, గాసిప్‌ల ఆధారంగానే ఎవరైనా ఊహాగానాలు చేయగలరు’’ అంటూ కంగనా వ్యాఖ్యానించారు. తప్పుడు లేదా మోసపూరితమైన ప్రచారానికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి తనకు ఎప్పుడూ మందలింపు రాలేదని పేర్కొన్నారు. ‘‘కాబట్టి నాకు వ్యక్తిత్వ పాఠాలు చెప్పొద్దు. నా క్యారెక్టర్‌ మీకంటే చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడ ఎలాంటి మోసం బయటపడలేదు’’ అంటూ రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో జనరేషన్‌ జెడ్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది.

మోడీని ఎదుర్కోవాలంటే రాజీవ్‌ ఆలోచనలు చదవాలి

 


  • మణిశంకర్‌ అయ్యర్‌


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆలోచనలు, దేశ స్వభావంపై ఆయన చేసిన వ్యాఖ్యలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దిమాగీ నక్సల్స్‌’ పేరుతో కొందరిని అరెస్టు చేయడం లేదా దేశం విడిచి వెళ్లేలా చేయడం జరుగుతుందని వ్యాఖ్యానించిన అయ్యర్‌.. ఇలాంటి పరిస్థితుల్లో రాజీవ్‌ గాంధీ ఆలోచనలను గుర్తు చేసుకోవడం మరింత ముఖ్యమని అన్నారు. దేశ స్వభావం, ప్రజాస్వామ్యం, భిన్నత్వంపై రాజీవ్‌ గాంధీ ఏం చెప్పారో కార్యక్రమానికి హాజరైన వారు చదవాలని సూచించారు. ‘‘రాజీవ్‌ గాంధీ ఆలోచనలు, మన దేశ స్వభావం గురించి ఆయన మాట్లాడిన విషయాలను మనం చదవాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా మోడీని ఎదుర్కోవడం కష్టం’’ అని మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ‘దిమాగీ నక్సల్స్‌’పై కొనసాగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.

రేవంత్‌ ప్రకటనతో కొండా దంపతులకు షాక్‌

  •  సుష్మిత ఘాటు వ్యాఖ్యలు



వరంగల్‌: తెలంగాణ రాజకీయాల్లో పరకాల నియోజకవర్గం కేంద్రంగా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డినే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపేలా చేసిన వ్యాఖ్యలు కొండా దంపతుల రాజకీయ ఆశలకు గండికొట్టినట్లు చర్చ జరుగుతోంది.


వచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె కొండా సుష్మితను పోటీ చేయించాలని కొండా సురేఖ, కొండా మురళి దంపతులు పలుమార్లు ప్రకటించారు. అయితే వరంగల్‌ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల నుంచే పోటీ చేస్తారని, ఆయనను ఆశీర్వదించాలని కోరారు. దీంతో రేవంత్‌ వ్యాఖ్యలు కొండా దంపతులకు రాజకీయంగా షాక్‌ ఇచ్చినట్లుగా కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ మొదలైంది.


ఈ నేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొందరికి కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. తమ కుటుంబం చేసిన సహకారంతోనే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాలలో గెలిచారని ఆమె పేర్కొన్నారు. గతంలో ఆయనకు సహాయం చేసిన తన తండ్రి కొండా మురళి ఇప్పుడు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.


రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడటం ఎందుకని సుష్మిత ప్రశ్నించారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఇప్పుడే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా వచ్చి ప్రచారం చేసినా రేవూరి ప్రకాశ్‌రెడ్డి గెలవలేరని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.


మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో కొండా సురేఖ దంపతుల పరకాల రాజకీయ వ్యూహానికి బ్రేక్‌ పడినట్లేనని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పరకాల నుంచి సుష్మితను పోటీకి దింపుతామని కొండా దంపతులు ప్రకటించిన నేపథ్యంలో, రేవూరి ప్రకాశ్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సంకేతాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇదిలా ఉండగా, వరంగల్‌ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలకు కొండా దంపతులు దూరంగా ఉండటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజా పరిణామాలతో పరకాల కాంగ్రెస్‌లో అంతర్గత సమీకరణాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇరాన్‌తో యుద్ధం తర్వాత గల్ఫ్‌లో సైనిక బలగాలను తగ్గించనున్న అమెరికా?

 


  • పెంటగాన్‌లో కీలక కసరత్తు

వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌తో అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని పునఃసమీక్షించాలని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) భావిస్తోంది. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాలను తగ్గించడం, దాడుల్లో దెబ్బతిన్న సైనిక స్థావరాలను మునుపటి స్థాయిలో పునర్నిర్మించాలా లేదా అనే అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

ఎనిమిది మంది అధికారులను ఉటంకిస్తూ వచ్చిన ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం జరుగుతున్నది అధికారిక సమీక్ష కాకపోయినా, యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా సైనిక స్థావరాలు, బలగాల మోహరింపుపై తీసుకోవాల్సిన నిర్ణయాలకు ఇది ప్రాథమిక ప్రణాళికగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఇరాన్‌ దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా స్థావరాల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. యుద్ధానికి ముందు ఉన్న విధంగానే అన్ని స్థావరాలను తిరిగి నిర్మించకపోవచ్చని అమెరికా రక్షణ శాఖ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

ఈ కసరత్తుకు పెంటగాన్ పాలసీ కార్యాలయం నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయని ఓ సీనియర్ పెంటగాన్ అధికారి తెలిపారు. అయితే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇప్పటివరకు పశ్చిమాసియాలో అమెరికా సైనిక వ్యవస్థపై అధికారిక సమీక్షకు ఆదేశాలు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియను భవిష్యత్ నిర్ణయాలకు ఉపయోగపడే ‘‘వివేకవంతమైన ముందస్తు ప్రణాళిక’’గా అభివర్ణిస్తున్నారు.

ప్రస్తుతం యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో జోర్డాన్ నుంచి ఒమన్ వరకు సుమారు 1,500 మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 20 ప్రాంతాల్లో 40 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి యుద్ధం నేపథ్యంలో అమెరికా యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, ఇతర సైనిక పరికరాలను భారీగా ఈ ప్రాంతానికి తరలించింది. ఇరాన్‌పై అమెరికా 13 వేలకు పైగా దాడులు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది.

పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలు తమ రక్షణ కోసం చాలాకాలంగా అమెరికా సైనిక బలగాలపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ ప్రాంతం నుంచి అమెరికా బలగాలను తగ్గిస్తే, ఇరాన్‌ నుంచి ఎదురయ్యే దాడులను ఎదుర్కొనే విషయంలో ఆయా దేశాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా బలగాల లోటును భర్తీ చేసుకునేందుకు సొంత రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడం లేదా ఇతర దేశాలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలకు నెలల నుంచి సంవత్సరాల వరకు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు, ఈ పరిణామం అమెరికా ప్రభుత్వంలో ఇప్పటికే ఉన్న రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ సైనిక జోక్యాలను సమర్థించే వర్గం ఒకవైపు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా అమెరికా భద్రతా బాధ్యతలను కొంతమేర తగ్గించి దేశ రక్షణపై, అలాగే చైనా వంటి శక్తివంతమైన ప్రత్యర్థులను నిరోధించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని మరో వర్గం వాదిస్తోంది.

యూఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్లీ కూపర్ కూడా పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా సైనికులను మరింత పశ్చిమ దిశగా తరలించే అవకాశాలపై జరుగుతున్న చర్చల్లో పాల్గొన్నట్లు ఓ అమెరికా అధికారి వెల్లడించారు. అయితే సెంట్రల్ కమాండ్ ప్రతినిధి దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమయ్యే ముందు నుంచే అమెరికా తన కొన్ని స్థావరాల నుంచి సిబ్బందిని తరలించింది. ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్ల దాడులకు ఆ స్థావరాలు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యుద్ధం ముగిసిన తర్వాత కూడా గల్ఫ్‌లోని కొన్ని ప్రధాన స్థావరాల నుంచి సైనిక బలగాలను దూరంగా ఉంచే మార్పులు కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు.

అయితే అమెరికా సైనిక వ్యవస్థలో శాశ్వత మార్పులు ఇప్పటికిప్పుడు ఖరారయ్యే పరిస్థితి లేదని పెంటగాన్‌ వ్యవహారాలపై అవగాహన ఉన్న పలువురు అధికారులు హెచ్చరించారు. తుది నిర్ణయాలకు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నేతల అనుమతి అవసరం కానుంది.

ఇదిలా ఉండగా, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి సెప్టెంబర్‌ చివరి నాటికి అమెరికాకు సుమారు 37.5 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని పెంటగాన్ అంచనా వేసింది. అయితే యుద్ధంలో దెబ్బతిన్న పశ్చిమాసియా సైనిక స్థావరాలను పునర్నిర్మించేందుకు అయ్యే వ్యయం ఈ అంచనాలో చేర్చలేదని ది వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

అమెరికా బలగాలకు సాయం చేస్తే యుద్ధంలో భాగస్వామ్యమే

 

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

తెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు సహకరించవద్దని పర్షియన్‌ గల్ఫ్‌ దక్షిణ తీరంలోని దేశాలను ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మేజర్‌ జనరల్‌ అలీ అబ్దొల్లాహీ హెచ్చరించారు. అమెరికా సైనిక బలగాలకు ఎలాంటి సాయం చేసినా, సదుపాయాలు కల్పించినా దాన్ని అమెరికా సైనిక చర్యలో భాగస్వామ్యంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

గల్ఫ్‌ ప్రాంతంలోని సైనిక స్థావరాల్లో అమెరికా కార్యకలాపాలను ఇరాన్‌ నిశితంగా గమనిస్తోందని అబ్దొల్లాహీ తెలిపారు. ఇరాన్‌పై తమ భూభాగాన్ని అమెరికా ఉపయోగించుకునేందుకు అనుమతించబోమని ఇప్పటికే ప్రకటించిన గల్ఫ్‌ దేశాలు.. తమ ప్రాంతంలోని పరిణామాలు తమ దృష్టికి రాకుండా జరుగుతున్నాయని భావించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రాంతీయ స్థావరాల్లో భారీ సంఖ్యలో సైనిక విమానాలు, ఇంధన సరఫరా విమానాలు మోహరించడం ఆతిథ్య దేశాల అనుమతి లేదా కనీసం అవగాహన లేకుండా సాధ్యమయ్యే విషయం కాదని ఆయన పేర్కొన్నారు.



‘‘అమెరికా సైన్యానికి ఎలాంటి సహాయం లేదా సదుపాయం కల్పించినా, అది అమెరికా సైనిక బలగాలతో కలిసి పనిచేయడంగా పరిగణిస్తాం’’ అని అబ్దొల్లాహీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలు తమ భూభాగాలను అమెరికా సైనిక కార్యకలాపాలకు ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఇటీవల ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా అబ్దొల్లాహీ నియమితులయ్యారు. ఆగస్టు 10న ఇరాన్‌ సుప్రీం లీడర్‌, సాయుధ దళాల కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ అయతొల్లా మొజ్తబా హొస్సేని ఖమేనీ ఆరుగురు సీనియర్‌ కమాండర్లను కీలక పదవుల్లో నియమించారు. ఇందులో అబ్దొల్లాహీకి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ బాధ్యతలు అప్పగించగా, కియోమర్స్‌ హైదరీ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమితులయ్యారు.

మరోవైపు అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని తగ్గించే అంశాన్ని అమెరికా రక్షణ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పర్షియన్‌ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు నెలల తరబడి ఇరాన్‌ దాడులకు గురికావడంతో వాటిని తిరిగి నిర్మించాలా, లేక ప్రాంతంలో అమెరికా బలగాల సంఖ్యను తగ్గించాలా అనే అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం.

దాడుల్లో దెబ్బతిన్న స్థావరాలను గతంలో ఉన్న స్థాయిలోనే పునర్నిర్మించకపోవచ్చన్న సంకేతాలను కూడా అమెరికా రక్షణ శాఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా సెప్టెంబర్‌ చివరి నాటికి అమెరికాకు సుమారు 37.5 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుందని పెంటగాన్‌ అంచనా వేసినట్లు సమాచారం. అయితే పశ్చిమాసియాలో దెబ్బతిన్న సైనిక స్థావరాలను పునర్నిర్మించేందుకు అయ్యే ఖర్చు ఇందులో లెక్కలోకి రాలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన చర్చల బృందానికి తాత్కాలికంగా వేచి ఉండాలని సూచించినట్లు సమాచారం. ఇరాన్‌ ఒప్పందానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల విషయంలో అమెరికా ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

Featured post

నా జీవితం గురించి రాయడం అంత సులభం కాదు

 సోనియా గాంధీ భావోద్వేగ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని అనుభవాలు, ప్రేమ, విషాదాలు, రాజకీయ ప్రస్థానాన్ని ...