Saturday, 1 August 2026

రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ ఆహ్వాన పత్రికలో భారత కళా వైభవం


  • మహేశ్వరి చేనేత నుంచి గోవా అజులేజో కళ వరకు విశేష ఆకర్షణ




న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 15న నిర్వహించే వార్షిక ‘ఎట్ హోమ్’ విందు కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఈసారి భారతదేశ గొప్ప కళా, చేనేత, హస్తకళల వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం ఇవ్వనున్న ఈ కార్యక్రమం కోసం రూపొందించిన ఆహ్వాన పత్రికలో దేశవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ చేనేత కళలు, జానపద కళలు, హస్తకళలు, ప్రకృతి పరిరక్షణ సంప్రదాయాలను అందంగా ఆవిష్కరించారు. త్రివర్ణ పతాక రంగులతో రూపొందించిన వస్త్ర కవర్‌పై రాష్ట్రపతి భవన్ చిత్రాన్ని ముద్రించగా, ‘ఇండిపెండెన్స్ డే–2026’ గుర్తుతో చెక్కిన వెదురు కోస్టర్‌ను కూడా జత చేశారు. అంతేకాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల కళా సంప్రదాయాలను పరిచయం చేసే ప్రత్యేక సమాచార కార్డులను ఆహ్వాన పత్రికలో చేర్చారు.



ఈసారి కార్యక్రమానికి విచ్చేసే అతిథులకు స్వాగత సూచకంగా ప్రత్యేకంగా రూపొందించిన మహేశ్వరి స్టోల్‌ను కప్పి ఆహ్వానించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ పట్టు–పత్తి నేయ పద్ధతిలో చేతితో నేసిన ఈ స్టోల్‌లో మహారాష్ట్ర కర్వత్ కాఠి చీర నమూనా, గోవా కున్బీ చీర అంచు, మధ్యప్రదేశ్ మహేశ్వరి నేయ కళలోని కంగ్రా డిజైన్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చింతా చౌక్ నమూనాలను సమన్వయం చేశారు. దీంతో నాలుగు రాష్ట్రాల వస్త్ర సంప్రదాయాలను ఒకే రూపంలో ప్రతిబింబించే అరుదైన కళాఖండంగా ఇది నిలిచింది.



ఆహ్వాన పత్రికలో గోవాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన అజులేజో టైల్స్ సంప్రదాయాన్నీ పరిచయం చేశారు. నీలం–తెలుపు రంగులతో చేతితో చిత్రించిన ఈ టైల్స్‌లో గోవా గ్రామీణ జీవనం, మత్స్యకారుల సంస్కృతి, ప్రకృతి దృశ్యాలు, స్థానిక వృక్షజాలం, జంతుజాలాన్ని కళాత్మకంగా చిత్రీకరించారు. శతాబ్దాల కిందట ప్రారంభమైన ఈ కళను గోవా కళాకారులు భారతీయ శైలిలో అభివృద్ధి చేసి నేటికీ ఇళ్లలో, ప్రజా భవనాల్లో అలంకరణగా వినియోగిస్తున్నారు. అలాగే తరతరాలుగా గ్రామీణ సమాజాలు సంరక్షిస్తున్న పవిత్ర అటవీ ప్రాంతాల ప్రాధాన్యాన్ని కూడా ఆహ్వాన పత్రికలో వివరించారు. జీవవైవిధ్యానికి నిలయాలుగా ఉన్న ఈ అడవులు సంప్రదాయ జ్ఞానంతో సంరక్షించబడుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆహారం, నూనె, కలపతో పాటు గ్రామీణ జీవనోపాధికి ఆధారంగా నిలిచే మహువా చెట్టును ‘జీవన వృక్షం’గా అభివర్ణించారు.



ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఇనుప హస్తకళకు కూడా ఆహ్వాన పత్రికలో ప్రత్యేక స్థానం కల్పించారు. గిరిజన కళాకారులు ఇనుముతో ప్రకృతి, పురాణాలు, దైనందిన జీవితాన్ని ప్రతిబింబించే అలంకార, వినియోగ వస్తువులను తయారు చేసే సంప్రదాయాన్ని చిత్రాలు, వివరణలతో పరిచయం చేశారు. భారతీయ సంప్రదాయం, కళాత్మకత, పర్యావరణహిత దృక్పథాన్ని సమన్వయం చేస్తూ రూపొందించిన ఈ ఆహ్వాన పత్రిక దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెబుతోందని అధికారులు పేర్కొన్నారు.










Thursday, 30 July 2026

దక్షిణాది గానకోకిల జమునారాణి కన్నుమూత


  • ‘ఓ దేవదా’ గాయని మధుర స్వరానికి శాశ్వత వీడ్కోలు



దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నేపథ్య గాయని కోకా జమునారాణి కన్నుమూశారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత రంగం ఓ గొప్ప గాయనిని కోల్పోయింది.

1938లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణి.. ఏడేళ్ల వయస్సులోనే 1946లో విడుదలైన తెలుగు క్లాసిక్ చిత్రం ‘త్యాగయ్య’ ద్వారా సినీ గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 1940ల నుంచి 1960ల వరకు దక్షిణ భారత సినీ సంగీత రంగంలో అగ్రగామి గాయనిగా వెలుగొందారు. తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషల్లో కలిపి 6,000కు పైగా పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. 1980ల వరకు కూడా ఆమె గాన సేవలు కొనసాగాయి. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకుడు’ చిత్రంలో ఇళయరాజా స్వరపరిచిన “నా నవ్వే దీపావళి” ఆమె చివరి దశలో గుర్తుండిపోయే పాటల్లో ఒకటి. తెలుగులో ద్రోహి, రత్నమాల, లైలా మజ్ను, చంద్రిరాణి, దేవదాసు, సంతానం, ఆలీబాబా 40 దొంగలు, వద్దంటే పెళ్లి, బడి పంతులు, అన్నదమ్ముడు, బంగారు తిమ్మరాజు వంటి ఎన్నో చిత్రాలకు ఆమె తన స్వరాన్ని అందించారు.


ఆమె ఆలపించిన “ఓ దేవదా”, “చెలియా లేదు” (దేవదాసు), “పద పదవే వయ్యారి గాలిపటమా” (అభిమానం), “నాగమల్లి కోనలోన నక్కింది లేడీ కూన” (బంగారు తిమ్మరాజు), “మామా మామా మామా ఏమే ఏమే భామా” (మంచి మనుషులు), “శారద శారద సిగరెట్టు” (రాముడు-భీముడు), “విరిసే చల్లని వెన్నెల” (లవకుశ) వంటి పాటలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.తెలుగు మాత్రమే కాకుండా తమిళ సినీ పరిశ్రమలో కూడా జమునారాణి విశేష గుర్తింపు పొందారు. విభిన్న భావాలను ఆవిష్కరించే ఆమె గాత్రం, మాధుర్యం, స్పష్టమైన ఉచ్చారణ ఆమెను దక్షిణాది సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

పార్లమెంట్‌లో హైడ్రామా..

 

  • రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు
  • లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బిల్లు
  • రాహుల్-బీజేపీ మధ్య మాటల యుద్ధంతో వేడెక్కిన వర్షాకాల సమావేశాలు 



పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించిన సుప్రీంకోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) సవరణ బిల్లు–2026 చర్చకు రాగా, మరోవైపు రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026తో పాటు ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టారు. అయితే బిల్లుల కంటే ఎక్కువగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలతో సభా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.


లోక్‌సభ ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. అనంతరం గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖల మంత్రులు పత్రాలు సభ ముందుంచారు. భారతదేశం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పోషిస్తున్న పాత్ర, భారత్-బంగ్లాదేశ్ భవిష్యత్ సంబంధాలపై విదేశాంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలను కూడా సభలో ప్రవేశపెట్టారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం సంబంధిత బిల్లును పరిశీలించారు.


రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్న ప్రభుత్వ అత్యున్నత నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి నిబంధనలతో పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని వివరించారు.


బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. "పేపర్ దొంగలు స్వేచ్ఛగా తిరుగుతుంటే, కష్టపడి చదివిన విద్యార్థులే శిక్ష అనుభవిస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం?" అని ప్రశ్నించారు. అసలు దోషులు నవ్వుకుంటూ తిరుగుతుంటే అమాయక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత గంభీరంగా తీసుకుని సమగ్ర సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చ ప్రతిధ్వని గురువారం కూడా కొనసాగింది. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక విద్యార్థితో జరిగిన సంభాషణను వివరిస్తూ రాహుల్ ఉపయోగించిన ఒక పదాన్ని స్పీకర్ ఓం బిర్లా సభా రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీ ప్రాథమిక పార్లమెంటరీ నియమాలపై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తూ, దేశ భవిష్యత్తైన యువతను అవమానించేలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమని విమర్శించారు.


జూలై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా కాల్పులు జరిగాయని, అందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర స్పష్టంగా స్పందిస్తూ విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని, కాల్పులకు సంబంధించిన ఆదేశాలు మంత్రులు కాదు, మేజిస్ట్రేట్ మాత్రమే జారీ చేస్తారని తెలిపారు. అమిత్ షా కాల్పులకు ఆదేశించారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.


మరోవైపు కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టారు. జూలై 20న విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసు చర్యపై హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై కూడా కేంద్రాన్ని నిలదీశారు. ప్రతీకాత్మకంగా విరాళాల పెట్టెను ఉంచి నిరసన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా అమిత్ షా సభకు వచ్చి ప్రతిపక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా, విద్యార్థులపై పెలెట్ గన్స్ వినియోగానికి బాధ్యులైన వారు క్షమాపణ చెప్పాలని, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కపిల్ సిబల్ కూడా ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి మౌనం ఎందుకని ప్రశ్నించారు.


అయితే బీజేపీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. జేపీ నడ్డా రాజ్యసభలో మాట్లాడుతూ, ప్రతిపక్షం మొదటి రోజు నుంచే సభా కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం నిరంతరం కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తోందని విమర్శించారు. బీజేపీ ఎంపీలు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, గజేంద్ర సింగ్ షెఖావత్ తదితరులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనని కంగనా రనౌత్ వ్యాఖ్యానించగా, గజేంద్ర సింగ్ షెఖావత్ ఎన్నికల పరాజయాల వల్లే కాంగ్రెస్ నిరాశతో ఆధారంలేని ఆరోపణలు చేస్తోందని అన్నారు.


ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ రాజకీయ ఫిరాయింపులను అరికట్టేందుకు కొత్త యాంటీ డిఫెక్షన్ చట్టంపై చర్చ జరపాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభలో రణదీప్ సింగ్ సూర్జేవాలా అయోధ్య శ్రీరామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై అత్యవసర చర్చ కోరారు.


అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఆ రాష్ట్రాల ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివరించగా, బాధిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు వర్గాలు తెలిపాయి.


సభలో పదేపదే నినాదాలు, నిరసనల కారణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై విస్తృత చర్చ ప్రారంభమైంది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ బిల్లుతో ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం పేర్కొనగా, కేవలం చట్టాలు తీసుకురావడం కాకుండా విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని ప్రతిపక్షం అభిప్రాయపడింది.

Wednesday, 29 July 2026

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం



  • హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం
  •  నంది, గాయత్రి పంప్ హౌస్‌లలో మోటార్లు షురూ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ , కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌లోని బాహుబలి మోటార్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఆన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం చేసిన నిరంతర పోరాటానికి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టుదలకు లభించిన విజయంగా ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల మోటార్లను స్టార్ట్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. రైతుల పంట పొలాలకు, తాగునీటి అవసరాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరంతర పోరాటం సాగించారు. ప్రతిపక్షాల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు , రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి మోటార్లను ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసింది.  ప్రస్తుతం అధికారులు పంప్ హౌస్‌లలోని రెండు బాహుబలి మోటార్లను అందుబాటులోకి తెచ్చి, దాని ద్వారా 6,300 క్యూసెక్కుల గోదావరి నీటిని దిగువనున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్) వైపు ఎత్తిపోస్తున్నారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పంప్ హౌస్‌లను ఐడిల్‌గా ఉంచడంపై బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించి, నీటి విడుదల ప్రారంభం కావడంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం పరిధిలోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజాక్షేత్రంలో రైతుల తరఫున నిలబడి పోరాడితే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరి వీడైనా దిగిరాక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించిందని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. 

సీఎం సన్నిహితుడి వేధింపుల వల్లే పెద్ది కి ఈ పరిస్థితి

  •  తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, కాంగ్రెస్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో నిరూపించేందుకు ఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనమని బీఆర్ఎస్ నేత, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి ఈ రకమైన తీవ్ర ఇబ్బందులకు గురికావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫహీం ఖురేషీనే ప్రధాన కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారం వెనుక ఉన్న వివరాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాకు వివరిస్తూ.. నర్సంపేటకు చెందిన కొందరు స్థానిక వ్యాపారవేత్తలు వాసవి బిల్డర్స్‌కు తమ భూమిని విక్రయించారని, అయితే ఆ భూమిపై ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన ఫహీం ఖురేషీ కన్నుపడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాసవి బిల్డర్స్‌కు చెందిన విజయ్ కుమార్ మరియు ఫహీం ఖురేషీ ఇద్దరూ కలిసి సైబరాబాద్‌లోని 'ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్' (EOW) లో ఒక కేసు నమోదు చేయించారని తెలిపారు. అనంతరం నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులతో తీవ్రమైన మానసిక, శారీరక హింసకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యాపారులను వేధిస్తూ.. ప్రతీ విషయంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఏ విధంగానైనా ఆయనను ఈ కేసులో నిందితుడిగా (అక్యూజ్డ్) చేర్చాలనే కుట్రపూరిత ప్లాన్ నడుస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ అక్రమ వేధింపులపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ.. "నా చేతిలో ఏమీ లేదు, ఈ వ్యవహారమంతా ఫహీం ఖురేషీ , ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పర్యవేక్షణలోనే జరుగుతోంది" అని ఆయన చేతులు దులుపుకున్నారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన గురుకులాల్లో బెంకర్ బెడ్ల కుంభకోణంపై సుదర్శన్ రెడ్డి గళమెత్తి వాస్తవాలను బయటపెట్టినందుకే, కక్షపూరితంగా ఆయనను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ స్థాయి వేధింపులకు పాల్పడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు.

రాహుల్ గాంధీ తనే ఉచ్చులో చిక్కుకున్నారు

 అమిత్ షాపై ఆరోపణలపై కిరణ్ రిజిజు ఘాటు విమర్శలు

న్యూఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రెండు కారణాల వల్ల తీవ్ర నిరాశ కలిగించారని ఆయన అన్నారు. పేపర్ లీక్ నిరోధక సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేతగా ఒక్క నిర్మాణాత్మక అంశాన్ని కూడా ప్రస్తావించలేకపోయారని, బిల్లుపై మాట్లాడాల్సిన సమయంలో అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ సభను తప్పుదారి పట్టించారని విమర్శించారు.



అంతేకాకుండా పార్లమెంటుకు తగని పదజాలాన్ని ఉపయోగించడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నిరాధార ఆరోపణలు చేశారని రిజిజు మండిపడ్డారు. కాల్పులు జరపాలని ఆదేశించే అధికారం హోంమంత్రికీ, మరే ఇతర మంత్రికీ ఉండదని స్పష్టం చేశారు. అలాంటి ఆదేశాలు ఇవ్వడం మంత్రుల పరిధిలో ఉండదని, సంఘటన స్థలంలో ఉన్న మేజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటారని చెప్పారు.

ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి ఇంత ప్రాథమిక విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని రిజిజు వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ తనే తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారని, "తానే తనను ఉచ్చులోకి నెట్టుకున్నారు" అని అన్నారు. ఆయన పరిస్థితి పట్ల తనకు బాధగా ఉందని కూడా పేర్కొన్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రతిపక్ష నేత సభలో నిర్మాణాత్మక చర్చకు తోడ్పడతారని తాను ఎప్పుడూ ఆశిస్తానని, అయితే ఈసారి రాహుల్ గాంధీ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని కిరణ్ రిజిజు విమర్శించారు.

జెన్-జెడ్‌తో భారత రాజకీయ పార్టీల ‘సిట్యుయేషన్‌షిప్’

ఒకప్పుడు రాజకీయపార్టీలు యువతను ఆకర్షించాలంటే ఎన్నికల హామీలు, ఉద్యోగాల ప్రకటనలు, సంక్షేమ పథకాలు సరిపోతాయని భావించేవి. కానీ నేటి జెన్-జెడ్ (1997-2012 మధ్య జన్మించిన తరం) పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ముందుకు వస్తోంది. వీరిని కేవలం హామీలతో గానీ, సోషల్ మీడియా ప్రచారంతో గానీ ప్రభావితం చేయడం అంత సులభం కాదు. వీరి ఆలోచనా విధానం, భాష, ఆశయాలు, నిరసన తెలిపే శైలి, రాజకీయాలపై దృష్టి అన్నీ గత తరాల కంటే విభిన్నంగా ఉండటంతో భారత రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక విచిత్రమైన "సిట్యుయేషన్‌షిప్"లో చిక్కుకున్నాయి. జంతర్ మంతర్‌లో కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఉద్యమం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష సంబంధం లేకుండా, సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని, మీమ్స్‌, వీడియోలు, సృజనాత్మక ప్రచారం, చర్చలు, వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా ఈ తరం తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించగలదని నిరూపించింది.



జెన్-జెడ్‌ను చాలామంది అహంకారంతో కూడిన తరం, సౌకర్యాలు మాత్రమే కోరుకునే యువతగా చిత్రీకరిస్తుంటారు. ఉద్యోగంలో మైక్రో మేనేజ్‌మెంట్ వద్దు, ఇంటి నుంచే పని చేసే అవకాశం ఉండాలి, జాయినింగ్ బోనస్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వంటి డిమాండ్లు వారి స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావిస్తారు. అయితే అదే సమయంలో నిరుద్యోగం, తీవ్రమైన పోటీ, కెరీర్‌పై అనిశ్చితి, పరీక్షలలో అవకతవకలు వంటి అంశాలు వారిలో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహాన్ని కూడా రేకెత్తిస్తున్నాయి. బయటకు ఆత్మవిశ్వాసంగా కనిపించే ఈ తరం లోపల తీవ్రమైన భవిష్యత్ ఆందోళనతో జీవిస్తోంది. అయితే జెన్-జెడ్‌ను ఒకే కోణంలో చూడడం పొరపాటే. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్ కావాలని కలలు కనే యువత ఉన్నారు. మరోవైపు మెట్రో నగరాల్లో ఆధునిక జీవనశైలిని అనుసరించే యువత కూడా ఉన్నారు. కులం, భాష, ఆర్థిక స్థితి, ప్రాంతం వంటి అనేక అంశాల్లో వీరిలో వైవిధ్యం ఉన్నప్పటికీ, ఒక విషయంలో మాత్రం అందరూ ఒకేలా ఉంటారు. తమను ఎవరూ తక్కువ అంచనా వేయడం వీరికి ఇష్టం ఉండదు. తాము సరైందని నమ్మితే ఎంతటి అధికారాన్నైనా ప్రశ్నించడానికి వెనుకాడరు.


సీజేపీ ఉద్యమం మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అధికారికంగా అనుబంధం లేకపోయినా, అవసరమైతే అత్యంత క్రమశిక్షణతో ఉద్యమాన్ని నడిపించగల సామర్థ్యం ఈ తరానికి ఉందని చూపించింది. సోషల్ మీడియా, మీమ్స్‌, స్టాండ్-అప్ కామెడీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, వైరల్ వీడియోలు వీరి రాజకీయ చైతన్యానికి కొత్త వేదికలుగా మారాయి. గతంలో పత్రికల సంపాదకీయాలు, టీవీ చర్చలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని సోషల్ మీడియా కంటెంట్ ఆక్రమిస్తోంది. ఈ మార్పును రాజకీయ పార్టీలు ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా యువతతో అనుసంధానం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సీజేపీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ యువతకు చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ జెన్-జెడ్‌కు కేవలం ప్రచారం కాదు, తమ మాట వినే నాయకత్వం కావాలి. వారికి ఉపన్యాసాల కంటే సంభాషణ ముఖ్యం. ప్రచారం కంటే పారదర్శకత అవసరం.


జెన్-జెడ్ భాష కూడా రాజకీయ నాయకులకు కొత్త సవాలుగా మారింది. "గ్యాస్‌లైటింగ్", "రెడ్ ఫ్లాగ్", "నో క్యాప్", "బెట్" వంటి పదాలు వీరి రోజువారీ సంభాషణలో భాగమయ్యాయి. అదే సమయంలో భగత్‌సింగ్‌, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి చారిత్రక నాయకుల చిత్రాలను ప్రదర్శిస్తూ, మరోవైపు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో కూడిన వ్యక్తీకరణలను కూడా వినియోగిస్తున్నారు. సంప్రదాయం, ఆధునికత రెండింటినీ కలిపి ముందుకు సాగే ఈ తరం రాజకీయ విశ్లేషకులకు కూడా కొత్త పాఠాలు నేర్పుతోంది. ఈ తరం స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో త్యాగాలకు సిద్ధపడే ఆదర్శవాదులు కాకపోవచ్చు. కానీ తమ హక్కులు, అవకాశాలు, భవిష్యత్తు విషయంలో మాత్రం రాజీ పడే స్వభావం వీరిది కాదు. అందుకే వీరి నిరసనలు భావోద్వేగాల కంటే ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయి. పరీక్షల్లో పారదర్శకత, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, మెరుగైన పాలన వంటి అంశాలపై స్పష్టమైన డిమాండ్లతో ముందుకు వస్తున్నారు.


ఇటీవలి తమిళనాడు ఎన్నికల్లో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆర్థికాభివృద్ధి, సంక్షేమ పథకాల పరంగా మంచి పనితీరు కనబరిచినప్పటికీ డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. సోషల్ మీడియాలో చురుకుగా ప్రచారం నిర్వహించిన టీవీకే యువతను ప్రభావితం చేయడంలో విజయవంతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. యువత తమ కుటుంబ సభ్యుల ఓటింగ్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగల స్థాయికి చేరుకుందని ఈ ఎన్నికలు సూచించాయి. భారత రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. జెన్-జెడ్‌ను కేవలం ఓటు బ్యాంకుగా చూడడం, ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకోవడం, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం ద్వారా వారి మద్దతు పొందడం ఇక సాధ్యం కాదు. ఈ తరం ఆలోచనా విధానాన్ని, ఆశయాలను, ఆందోళనలను, కమ్యూనికేషన్ శైలిని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఏర్పడింది.


క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్ నుంచి టీ20 ఫార్మాట్‌కు మారినంత పెద్ద మార్పు ఇప్పుడు భారత రాజకీయాల్లో చోటుచేసుకుంటోంది. పాత రాజకీయ వ్యూహాలు కొత్త తరంపై పనిచేయడం లేదు. జెన్-జెడ్ విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే రాజకీయ పార్టీలు ముందు వారిని అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ "పాలిటికల్ సిట్యుయేషన్‌షిప్" ఎప్పటికీ నిజమైన రాజకీయ సంబంధంగా మారకపోవచ్చు.

Featured post

రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ ఆహ్వాన పత్రికలో భారత కళా వైభవం

మహేశ్వరి చేనేత నుంచి గోవా అజులేజో కళ వరకు విశేష ఆకర్షణ న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 15న నిర్వహించే ...