Friday, 4 September 2026

టీచర్స్‌ డే.. మా శంకర్‌ సార్‌




సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మా రాసకట్ట శంకర్‌ సార్‌ గుర్తుకు వస్తారు. ఆసరి రాజు లాంటి వందలాది మందికి అక్షర జ్ఞానం నేర్పించిన గురువు.  గోదావరిఖని రాంనగర్‌ భగత్‌ సింగ్‌ స్కూల్‌లో చదివిన చాలామంది చదువుల్లోనే కాదు కల్చరల్‌ యాక్టివిటీలలో ప్రతిభను చాటడంలో ఆయన కృషి ఉన్నది. మా స్కూల్‌ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే పత్రికా పఠనాన్ని అలవాటు చేసింది ఆయనే. రాసేటప్పుడు అక్షరాలు అందంగా ఉండాలని పిల్లలను మోటివేటి చేశారు. అట్లా మా పోలు సంపత్‌ లాంటి వాళ్లు రాస్తుంటే ప్రింటింగ్‌ ప్రెస్‌ అక్షరాల్లా కనిపిస్తుంటాయంటే దానికి కారణం ఆయనే. 


టీచర్స్‌ డే రోజున మమ్మల్ని టీచర్స్‌ చేసి వాళ్లు స్టూడెంట్స్‌ గా మారిపోయారు. అదో అందమైన జ్ఞాపకం. అప్పుడు మమ్మల్ని అందరినీ ఫొటో తీయించారు. అది చూసినప్పుడల్లా నా జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఎందుకంటే శంకర్‌ సార్‌ మాత్రమే కాదు మా కనకరాజు సార్‌, మా రాజేశ్‌ సార్‌, మా పద్మావతి మేడం  వీళ్లంతా పిల్లలను హ్యాండిల్ చేసిన విధానం  బాగుండేది. సాయంత్రం కాగానే కంజర, డమ్స్‌తో  కలిపి పాటల కచేరీ ఉండేది. సామాజిక స్పృహ కలిగించే పాటలను మాతో  పాడించేవారు. నాడు సారు వేసిన ఆ బీజం ఫలితంగా వాణినికేతన్‌ స్కూల్‌లో చదువుతున్నప్పుడు మండలస్థాయిలో పాటల పోటీలో ఫస్ట్‌ ప్రైజ్‌ రావడానికి కారణమైంది. ప్రజానాట్యమండలి కళాకారుడు అనుకుంటా మల్లిక్‌ రాసి, ట్యూన్‌ 'రాయలేలిన నాటి రతనాల సీమ' పాట ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్ర లాతూర్‌లో భూకంపం సృష్టించిన విలయంపై ఆయనే రాసిన ' ఆదమరిచి జనులు నిదురించువేళలో' అనే పాటకు మా సార్‌ ఆ బాణిని ఉపయోగించి నేర్పించారు. ఆ పాట పాడిందుకు మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్‌ రావడమే కాదు వందలాది మంది ఉండే మా వాణినికేతన్‌ స్కూల్‌లో నా కంటూ గుర్తింపు వచ్చింది. 



చిన్నతనంలో నేర్చుకునే విషయాలే తర్వాత కాలంలో ప్రతి విద్యార్థి ఉన్నత విద్యలో రాణించడానికి దోహదపడుతుంది అనడానికి మా భగత్‌ సింగ్‌ స్కూల్‌లో చదివి ఇవాళ వివిధ వృత్తుల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నవారిని చూస్తే అర్థమౌతుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సామాజిక చైతన్యం, ఆట, పాటల్లో రాణించడం ఇవన్నీ మాకు మా స్కూల్‌ నుంచే మొదలయ్యాయి. మాకు విద్యా బుద్దులు నేర్పి, మేము ఇవాళ ఎంతో కొంత రాయగలుగుతున్నామంటే దానికి మూలం మా రాసకట్ల శంకర్‌ సార్‌. అందుకే టీచర్స్‌ డే అంటే మా సార్‌.. మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. క్యాన్సర్‌ మా సార్‌ను మా నుంచి దూరం చేసినా నా లాంటి వందలాది మంది విద్యార్థుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.  అక్షరజ్ఞానాన్ని అందిస్తూ  విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రతీ టీచర్ కు  హ్యాపీ టీచర్స్‌ డే.





భారత్-పోలాండ్ దౌత్య సంబంధాలలో నూతన అధ్యాయం



  • వ్యూహాత్మక భాగస్వామ్యంపై మరింత ముందడుగు
  • రక్షణ, వాణిజ్యం నుంచి ఏఐ, అంతరిక్షం వరకు విస్తరిస్తున్న సహకారం
  • అక్టోబర్‌లో జామ్‌ సాహెబ్‌ మెమోరియల్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌


వార్సా: భారత్‌-పోలాండ్‌ దౌత్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. పోలాండ్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రడోస్లా సికోర్స్కీతో ఉన్నతస్థాయి ద్వైపాక్షిక చర్చల అనంతరం వార్సాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఇరు దేశాల సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’గా ఎదిగిన తర్వాత సహకారం మరింత బలోపేతమైందన్నారు.


రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్‌ పర్యటన సందర్భంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఇరువురు మంత్రులు సమీక్షించినట్లు జైశంకర్‌ వెల్లడించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. మైనింగ్‌, ఇంధనం వంటి సంప్రదాయ రంగాలతో పాటు అంతరిక్షం, డిజిటల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ), ఆవిష్కరణల రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.


  • పలు కీలక ఒప్పందాలపై కసరత్తు


సైబర్‌ భద్రత, అంతరిక్షం, క్లీన్‌ కోల్‌, రహస్య సమాచార మార్పిడి, కీలక ఖనిజాలు తదితర రంగాల్లో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు పనిచేస్తున్నాయని జైశంకర్‌ తెలిపారు. త్వరలో డిఫెన్స్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం కానుందని వెల్లడించారు. ఈ చర్యలు భారత్‌-పోలాండ్‌ సంబంధాలకు మరింత లోతు, బలాన్ని చేకూరుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.


  • అక్టోబర్‌లో యువత మార్పిడి కార్యక్రమం


ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ‘జామ్‌ సాహెబ్‌ మెమోరియల్‌ యూత్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌’ రెండో విడత అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు జైశంకర్‌ ప్రకటించారు. పోలాండ్‌లో నవానగర్‌ జామ్‌ సాహెబ్‌ దిగ్విజయ్‌సింహ్‌జీని ‘దోబ్రీ మహారాజా’గా గౌరవంగా గుర్తుచేసుకుంటారని తెలిపారు. పోలిష్‌ విశ్వవిద్యాలయాల్లో ఇండాలజీ, సంస్కృత అధ్యయన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, దీనిని భారత్‌ అభినందిస్తోందన్నారు.

Thursday, 3 September 2026

రామమందిరం ట్రస్ట్‌ నిర్ణయం అభినందనీయం




  • దేశభక్తుడైన అధికారికి బాధ్యతలు: ఆచార్య ప్రమోద్‌ కృష్ణం

షామ్లీ: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక నిర్ణయంపై ఆధ్యాత్మికవేత్త ఆచార్య ప్రమోద్‌ కృష్ణం ప్రశంసలు కురిపించారు. రామమందిరం నిర్వహణకు సంబంధించి మాజీ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రాను ట్రస్ట్‌ తొలి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా నియమించడాన్ని ఆయన స్వాగతించారు.


రామమందిరాన్ని సందర్శించని వారు, ఆలయాన్ని స్వయంగా చూసే అవకాశం పొందని వారు.. ఆలయంలోని ఏర్పాట్లు, నిర్వహణపై వ్యాఖ్యానించే హక్కు లేదని ఆచార్య ప్రమోద్‌ కృష్ణం అన్నారు. ఆలయంలోని వాస్తవ పరిస్థితులు తెలియకుండా విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.


జితేంద్ర మిశ్రా వంటి దేశభక్తి కలిగిన అధికారిని సీఈఓగా నియమించడం అభినందనీయమైన నిర్ణయమని ఆయన అన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ట్రస్ట్‌ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


రామమందిరం నిర్మాణం అనంతరం ఆలయ నిర్వహణ, భద్రత, పరిపాలన వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో.. అనుభవజ్ఞుడైన మాజీ సైనిక అధికారికి కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇస్రోకు మరో అద్భుత విజయం.. గర్వకారణమైన క్షణం: ప్రధాని మోదీ




న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4: జియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే భారత్‌ తొలి ఇమేజింగ్‌ ఉపగ్రహం EOS-05ను విజయవంతంగా ప్రయోగించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా 2,300 కిలోలకుపైగా బరువున్న EOS-05ను నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత కచ్చితత్వంతో ఇస్రో ప్రవేశపెట్టింది. దీంతో భారత అంతరిక్ష రంగం మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది.


‘‘ఇస్రోకు మరో అద్భుత విజయం.. మన దేశానికి గర్వకారణమైన క్షణం. EOS-05ను మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 విజయవంతంగా ప్రయోగించడమంటే.. జియోసింక్రనస్‌ కక్ష్య నుంచి పనిచేసే భారత్‌ తొలి ఇమేజింగ్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడమే. భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని మోదీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఇస్రోతో భారత పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని ప్రధాని తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన మొత్తం వ్యవస్థలో భారత్‌ సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతోందని చెప్పారు.


2026లో ఇస్రోకు తొలి విజయం


2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇది తొలి విజయవంతమైన మిషన్‌గా నిలిచింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లిన సుమారు 18 నిమిషాల తర్వాత EOS-05ను నిర్దేశిత సబ్‌-జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టారు.

చిన్నారెడ్డిపై వేటు.. తదుపరి పయనమెటు?

 



  • నాలుగు దశాబ్దాల కాంగ్రెస్‌ ప్రస్థానంలో చేదు అనుభవం

మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం.. పార్టీ బలోపేతానికి నిరంతర కృషి.. రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు.. అధిష్ఠానం ఆదేశాలను పాటించిన సీనియర్‌ నేత.. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి అనూహ్య పరిణామం ఎదురైంది. పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అధిష్ఠానం నిర్ణయంతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

  • ఎమ్మెల్యేపై వ్యాఖ్యలతో వివాదం

గోపాల్‌పేట మండలంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఎమ్మెల్యే బి.ఫారాలను పార్టీ, నాయకులు డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి.. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

ఈ వ్యవహారంపై టీపీసీసీతో పాటు దిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ అంశంపై విచారణ జరిపి నివేదికను అధిష్ఠానానికి సమర్పించింది. ముఖ్యమంత్రి సైతం ఏఐసీసీ నేతలతో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది. చివరకు చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.

  • షోకాజ్‌ నోటీసుకు లేఖతో వివరణ

తన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో చిన్నారెడ్డి లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అందులో పేర్కొన్నారు.

గోపాల్‌పేటలో కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వారి మనోభావాలు, ఆవేదనను మాత్రమే తాను ఆ రోజు వ్యక్తం చేశానని వివరించారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే అధిష్ఠానం మాత్రం ఆయన వివరణతో సంతృప్తి చెందకపోవడంతో చర్యలకు సిద్ధమైంది.

  • సొంతూరులోనే మౌనం

వనపర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం దాదాపు 15 రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం అధిష్ఠానం తన నిర్ణయాన్ని ప్రకటించడంతో చిన్నారెడ్డితో పాటు ఆయన అనుచరుల్లోనూ నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది.అధిష్ఠానం నిర్ణయం వెలువడిన అనంతరం చిన్నారెడ్డి తన సొంతూరు గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపూర్‌కు వెళ్లారు. అక్కడ పొలం గట్ల మధ్య కొంతసేపు గడుపుతూ కనిపించారు. పార్టీ నిర్ణయంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

  • తదుపరి అడుగు ఏమిటి?

దాదాపు 48 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న సీనియర్‌ నేతపై అధిష్ఠానం ఇంతటి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు చిన్నారెడ్డి తదుపరి అడుగుపై ఆసక్తి నెలకొంది. తన క్యాడర్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పదవులపై తనకు ఎలాంటి వ్యామోహం లేదని కూడా స్పష్టం చేశారు.అయితే తన సీనియారిటీకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివరణ ఇచ్చినప్పటికీ పదవి నుంచి తొలగించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన అనంతరం చిన్నారెడ్డి తన తదుపరి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంత సుదీర్ఘ కాంగ్రెస్‌ ప్రస్థానం సాగించిన చిన్నారెడ్డి.. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఆకాశంలో నిఘా నేత్రం



  • భారత్‌ తొలి జియో-ఆర్బిట్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం


శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దేశంలోనే తొలిసారిగా జియో-ఆర్బిట్‌లో పనిచేసే అధునాతన ఇమేజింగ్‌ ఉపగ్రహం EOS-05ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా కీలక రంగాల్లో రియల్‌టైమ్‌ భూ చిత్రాలను అందించడంలో ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.


  • 27 గంటల కౌంట్‌డౌన్‌.. తెల్లవారుజామున ప్రయోగం


బుధవారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్‌ సజావుగా పూర్తయింది. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లింది. 2,367 కిలోల బరువున్న EOS-05 ఉపగ్రహాన్ని రాకెట్‌ మోసుకెళ్లింది. వర్షం పడుతున్నప్పటికీ.. తెల్లవారుజామున కావడంతో సమయం అసాధారణంగా ఉన్నప్పటికీ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఉత్సాహంతో శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల అనంతరం EOS-05ను నిర్దేశిత సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (సబ్‌-GTO)లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.


  • ‘ఆకాశంలో నిఘా నేత్రం’గా EOS-05


ఈ ఉపగ్రహాన్ని మిషన్‌లో పాల్గొన్న ఓ సీనియర్‌ శాస్త్రవేత్త ‘ఆకాశంలో నిఘా నేత్రం’గా అభివర్ణించారు. భూమిపై జరుగుతున్న పరిణామాలను దాదాపు రియల్‌టైమ్‌లో పరిశీలించేందుకు ఇది ఉపయోగపడనుంది. ముఖ్యంగా వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వంటి రంగాలకు అవసరమైన కీలక సమాచారాన్ని అందించనుంది.ప్రస్తుతం అనేక ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహాలు లో ఎర్త్‌ ఆర్బిట్‌ (LEO)లో పనిచేస్తున్నాయి. అయితే EOS-05 భూమికి సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్‌ ఆర్బిట్‌లో పనిచేయనుంది. ఈ కక్ష్యలో ఉపగ్రహం భ్రమణ వేగం భూమి భ్రమణ వేగంతో సరిపోలేలా ఉంటుంది.జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17.. భారత జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (GSLV) సిరీస్‌లో 19వ ప్రయోగం. మూడు దశల ఈ రాకెట్‌ 51.7 మీటర్ల పొడవు, 420.5 టన్నుల లిఫ్ట్‌ఆఫ్‌ బరువుతో ఉంది. మూడో దశలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఉపయోగించారు.


  • 2021 విఫల ప్రయోగానికి కొనసాగింపుగా..


జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17/EOS-05 మిషన్‌ను 2021లో విఫలమైన GSLV-F10/EOS-03 మిషన్‌కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో 307 సెకన్లకే ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌ మిషన్‌ను నిలిపివేసింది. అనంతరం నిర్వహించిన విశ్లేషణలో క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌లో తలెత్తిన లోపమే మిషన్‌ వైఫల్యానికి కారణమని ఇస్రో వెల్లడించింది.


  • ఎనిమిది నెలల తర్వాత ఇస్రోకు మరో ప్రయోగం


దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలను మోసుకెళ్లిన ఇస్రోకు చెందిన PSLV-C62 రాకెట్‌ కీలకమైన మూడో దశలో ‘అసాధారణత’ తలెత్తడంతో నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన ఏకైక ప్రయోగం అదే కాగా.. అది విఫలమైంది. అంతకుముందు 2025 మేలో చేపట్టిన PSLV-C61/EOS-09 ప్రయోగం కూడా విజయవంతం కాలేదు. మోటార్‌ ప్రెజర్‌ సమస్య కారణంగా చాంబర్‌ ప్రెజర్‌లో తగ్గుదల ఏర్పడటంతో ఆ మిషన్‌ విఫలమైంది.



  • భారత్‌కు కీలక వ్యూహాత్మక సమాచారం


EOS-05 విజయవంతంగా కక్ష్యలోకి చేరిన అనంతరం ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ ఆనందం వ్యక్తం చేశారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 వాహక నౌక EOS-05ను అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు.ఉపగ్రహం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత.. జియో ఆర్బిట్‌ నుంచి పనిచేసే భారత్‌ తొలి ప్రత్యేక ఇమేజింగ్‌ ఉపగ్రహంగా EOS-05 నిలుస్తుందని నారాయణన్‌ చెప్పారు. దేశానికి అవసరమైన కీలక వ్యూహాత్మక సమాచారాన్ని అందించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ మిషన్‌ విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలు చేసినట్లు సమాచారం.

ఓల్డ్ సిటీకి మెట్రో తెస్తాం.. అదే మెట్రోలో వచ్చి ఓట్లు అడుగుతాం: సీఎం రేవంత్ రెడ్డి

 



హైదరాబాద్: ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొస్తామని, వచ్చే ఎన్నికల్లో అదే మెట్రోలో ప్రయాణించి వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తాను గతంలో ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీకి మెట్రో అవసరంపై అసదుద్దీన్ ఒవైసీ గతంలో లేవనెత్తిన ప్రశ్న నూటికి నూరు శాతం సరైనదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘మెట్రో రైలు మొత్తం న్యూ సిటీలో నిర్మించారు. మరి ఓల్డ్ సిటీలో రోజూ పనులకు వెళ్లే మన ముస్లిం సోదరులకు మెట్రో అవసరం లేదా? మేము మెట్రో ఎక్కకూడదా?’’ అని అసద్ సాబ్ అడిగారని గుర్తుచేశారు.ఆ ప్రశ్న తనను ఆలోచింపజేసిందని, అందుకే అప్పుడే తాను స్పందించానని సీఎం తెలిపారు. ‘‘సాబ్.. డబ్బులు నేను ఇస్తాను. రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాలను ఇప్పించే బాధ్యత మీది’’ అని తాను చెప్పినట్లు వెల్లడించారు.

మెట్రో పనులకు అవసరమైన 900 ఆస్తుల్లో ఇప్పటికే 850 ఆస్తులను ఇప్పించారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంకా 50 ఆస్తులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ మంత్రికి సూచించినట్లు వెల్లడించారు.‘‘వెళ్లి అసద్ సాబ్‌తో మాట్లాడి ఆ 50 ఆస్తులను కూడా క్లియర్ చేయించండి. ఎంత డబ్బులు అడిగినా ఇచ్చేయండి’’ అని తాను చెప్పినట్లు సీఎం వివరించారు.

డిసెంబర్‌లో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పనులు సజావుగా సాగి, ప్రజల సహకారం లభిస్తే రెండున్నరేళ్లలో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో అదే మెట్రో రైలులో ప్రయాణించి వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఓట్లు అడుగుతాం. ఆ మాటకు నేను ఈ రోజుకీ కట్టుబడి ఉన్నాను. అందుకే పట్టుబట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Featured post

టీచర్స్‌ డే.. మా శంకర్‌ సార్‌

సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మా రాసకట్ట శంకర్‌ సార్‌ గుర్తుకు వస్తారు. ఆసరి రాజు లాంటి వందలాది మందికి అక్షర జ్ఞానం నేర్పించిన గుర...