- గందరగోళం మధ్య ‘కేరళం’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం కూడా తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. విద్యార్థులపై పోలీసుల చర్య, అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై ప్రతిపక్షాలు నిరసనలు, నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఈ గందరగోళం మధ్యే లోక్సభలో కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే బిల్లును చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ‘కేరళ (పేరు మార్పు) బిల్లు-2026’ను సభలో ప్రవేశపెట్టారు. అయితే జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. సభను సజావుగా నడవనివ్వాలని చైర్లో ఉన్న కృష్ణ ప్రసాద్ తెనేటి విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు.
కేరళ అసెంబ్లీ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని తీర్మానం చేయడంతో కేంద్రం ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్లో మార్పు చేసి అధికారిక పేరును ‘కేరళ’ నుంచి ‘కేరళం’గా మార్చడం బిల్లు ఉద్దేశం.
చర్చకు ప్రతిపక్షం అడ్డుపడిందన్న రిజిజు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆందోళనలపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అమిత్ షా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షమే చర్చను అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సభ నుంచి బయటకు వెళ్లి నినాదాలు చేస్తున్నారని విమర్శించారు.అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఆరోపణలను ఖండించారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి, కాల్పులకు ఆదేశాలిచ్చింది ఎవరో హోంమంత్రి స్పష్టంగా చెప్పాలని ప్రతిపక్షం కోరుతోందన్నారు. పోలీసుల చర్యలో పలువురు విద్యార్థులు గాయపడ్డారని, ఈ అంశంపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం, ప్రభుత్వ క్షమాపణ డిమాండ్ కూడా తమ ప్రధాన అంశాల్లో ఉన్నాయని ఖర్గే తెలిపారు.
‘రాహుల్ గాంధీ పారిపోవద్దు’ అంటూ ఎన్డీయే నిరసన
మరోవైపు విద్యార్థుల ఆందోళనపై చర్చకు ప్రతిపక్షం వెనుకడుగు వేస్తోందంటూ ఎన్డీయే ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ‘‘రాహుల్ గాంధీ పారిపోవద్దు.. హోంమంత్రి సమాధానాన్ని ఎదుర్కోవాలి’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అమిత్ షా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఇప్పటికే జార్ఖండ్ ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిశారని తెలిపారు. కాబట్టి ఆయన విద్యార్థుల సమస్యల నుంచి పారిపోతున్నారన్న ఆరోపణలు అర్థరహితమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
రామమందిర విరాళాలపై చర్చకు కే.సీ. వేణుగోపాల్ నోటీసు
అయోధ్య రామమందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాల్లో భారీ ఆర్థిక అవకతవకలు, చోరీ, దుర్వినియోగం జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులోనే ఒక వ్యవస్థీకృత అక్రమ వ్యవహారం నడుస్తోందని ఆయన ఆరోపించారు. కోట్లాదిమంది భక్తులు సమర్పించిన నగదు, విలువైన ఆభరణాల విషయంలో వచ్చిన ఆరోపణలపై అత్యవసర చర్చ జరపాలని కోరారు.
మరో మూడు కీలక బిల్లులు
కేరళం పేరుమార్పు బిల్లుతో పాటు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) సవరణ బిల్లు-2026ను కూడా లోక్సభలో ప్రవేశపెట్టారు. సహకార సంస్థలకు నిధుల అందజేతను మరింత వేగవంతంగా, సులభంగా మార్చడం, NCDC పరిధిని విస్తరించడం ఈ బిల్లు లక్ష్యంగా ఉంది. ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు-2026లో భాగంగా దేశంలోని 16 ప్రధాన ట్రిబ్యునళ్ల నియామకాలు, పనితీరును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పరిపాలన, ఆదాయపు పన్ను, వినియోగదారుల వ్యవహారాలు, పర్యావరణం, కంపెనీ చట్టం, సాయుధ దళాలు, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలకు సంబంధించిన వివాదాలను ఈ ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి. ఇక గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్ట సవరణ బిల్లు ద్వారా మైనింగ్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, కీలక ఖనిజాల అన్వేషణకు ఊతమివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
బడ్జెట్లో 99.78 శాతం ఖర్చు
కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన బడ్జెట్ కేటాయింపుల్లో 99.78 శాతం వినియోగించినట్లు పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. రూ.57,203.78 కోట్ల సవరించిన అంచనాకు గాను రూ.57,075.19 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అయితే పారిశ్రామిక గృహ నిర్మాణం, నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు కేటాయింపులు ఉన్నప్పటికీ ఆ పథకాల కింద ఎలాంటి ఖర్చు జరగలేదని కమిటీ గుర్తించింది.