Tuesday, 8 September 2026

9/11 తర్వాత నెలల పాటు గాల్లో క్యాన్సర్‌ కారకాలు



  • 1.70 లక్షల పేజీల్లో సంచలన వివరాలు

న్యూయార్క్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రదాడుల్లో ఒకటైన 9/11 ఘటనకు ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాటి దాడులకు సంబంధించిన పలు కీలక పత్రాలను న్యూయార్క్‌ నగర యంత్రాంగం బహిర్గతం చేయనుంది. ఈ పత్రాల్లో కొన్నింటిని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ పరిశీలించగా.. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్లు కూలిపోయిన కొన్ని నెలల తర్వాత కూడా అక్కడి గాలిలో క్యాన్సర్‌ కారక పదార్థాలు ఉన్నట్లు వెల్లడైంది.

2001 సెప్టెంబర్‌ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్‌ చేసి న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్లను ఢీకొట్టించారు. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టవర్లు కూలిన అనంతరం భారీగా వెలువడిన దుమ్ము, పొగ న్యూయార్క్‌ నగరాన్ని కమ్మేసింది. ప్రమాదకరమైన విష పదార్థాలు గాలిలో కలిసినట్లు తరువాత పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

అయితే ఆ సమయంలో అధికారులు గాలి కాలుష్యంపై వచ్చిన ఆందోళనలను పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గాలిలో కాలుష్యం ఉన్నప్పటికీ స్థానిక వ్యాపారాలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించారు. అనంతరం పలువురు బాధితులు ఊపిరితిత్తులు, రక్త సంబంధిత క్యాన్సర్లతో పాటు గుండె, శ్వాసకోశ సమస్యలకు గురైనట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి. ఈ అనారోగ్యాలతో కొందరు మరణించినట్లు కూడా సమాచారం.

పదినెలల తర్వాతా ఆస్బెస్టాస్‌ ఆనవాళ్లు

దాడి జరిగిన దాదాపు 10 నెలల తర్వాత.. 2002 జులైలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సమీపంలోని శిథిలాల వద్ద పరిశోధకులు దుమ్ము నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించగా క్యాన్సర్‌ కారక ఆస్బెస్టాస్‌ రేణువులు ఉన్నట్లు గుర్తించారు.

నాటి వాయు కాలుష్యానికి సంబంధించిన వివరాలను సుమారు 1.70 లక్షల పేజీల పత్రాల్లో నమోదు చేశారు. ఈ పత్రాలను న్యూయార్క్‌ సిటీ కార్యాలయంలోని 68 బాక్సుల్లో కొన్ని దశాబ్దాలుగా భద్రపరిచారు.

ఈ వివరాలను బహిర్గతం చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై 9/11 హెల్త్‌వాచ్‌ అనే సంస్థ కోర్టును కూడా ఆశ్రయించింది. దాడి అనంతరం గాలి సురక్షితంగా లేదని నిరూపితమైతే బాధిత కుటుంబాలకు పరిహారం పొందే అవకాశం ఉంటుందని ఆ సంస్థ వాదిస్తోంది.

ఆన్‌లైన్‌లో పత్రాల విడుదలకు ఆదేశాలు

ఈ నేపథ్యంలో సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ వారంలోనే పత్రాలు బహిర్గతం కానున్నాయి.

‘‘ఆ భయంకర ఘటన ఎన్నో జీవితాలను తారుమారు చేసింది. వారందరికీ నేను చేయగలిగింది పారదర్శకత, జవాబుదారీతనాన్ని అందించడమే’’ అని మమ్దానీ పేర్కొన్నారు.

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి

  • హరీశ్‌రావుపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఆగ్రహం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలపై మంగళవారం కూడా శాసనసభలో వాగ్యుద్ధం కొనసాగింది. సభ రెండో రోజు ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్‌ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. సీనియర్‌ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అవమానించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా సభ్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తిరిగి తమపైనే అక్రమ కేసులు పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ ఘటనను రాష్ట్రంలోని మహిళలందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని చెప్పారు.‘‘కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరవ సభ కాస్తా కౌరవ సభగా మారింది. ఆనాడు కౌరవులకు పట్టిన గతే రేపు కాంగ్రెస్‌ పార్టీకి పడుతుంది’’ అంటూ హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



‘ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి’

హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా సభ్యులంటే తనకు, సభకు ఎంతో గౌరవం ఉందన్నారు.

‘‘మీరు చెబితే నేను వినట్లేదా? ఎందుకంత ఆవేశం? ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి. నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు’’ అంటూ స్పీకర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పట్ల తనకు కూడా గౌరవం ఉందని ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. తనకు ఉన్న ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లతో పాటు వారిని కూడా సోదరీమణులుగానే భావిస్తానని చెప్పారు. మహిళా సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

స్పీకర్‌ను బెదిరించేలా బీఆర్‌ఎస్‌ తీరు: శ్రీధర్‌బాబు

శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. స్పీకర్‌ను బెదిరించే విధంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

సభలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే స్పీకర్‌ తగిన చర్యలు తీసుకుంటారని, సభను ఎలా నడపాలో స్పీకర్‌కు సూచించే హక్కు ఇతరులకు లేదని అన్నారు. స్పీకర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియో రికార్డులను ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు స్పష్టమవుతాయని శ్రీధర్‌బాబు అన్నారు. మహిళా సభ్యుల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ స్పష్టం చేసినా బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుండా బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కూడా మండిపడ్డారు.

ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్‌ నందన.. ఎల్‌వోసీ ఆధారంగా అదుపులోకి



ఇబ్రహీంపట్నం: శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న యూట్యూబర్‌ నందనను పోలీసులు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు నందన, ఆమె భర్తపై ఉన్నాయి. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నందన దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఏపీ పోలీసులు వారి పేర్లపై లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేశారు. ఈ క్రమంలో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో నందన సోమవారం ఒంటరిగా స్వదేశానికి బయలుదేరారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ఆమె పాస్‌పోర్టు, వీసా పత్రాలను ఇమిగ్రేషన్‌ అధికారులు తనిఖీ చేశారు. ఎల్‌వోసీ ఉన్నట్లు గుర్తించిన అధికారులు నందనను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. అనంతరం విచారణ నిమిత్తం ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ కేసుకు సంబంధించి నందనను పోలీసులు విచారిస్తున్నారు.

Monday, 7 September 2026

అక్రమ నిర్మాణాలపై స్వతంత్ర దర్యాప్తు చేయాలి



  • విద్యార్థుల వసతులపై నిర్మాణ ఆడిట్‌ తప్పనిసరి: సీజేపీ


న్యూఢిల్లీ: అక్రమ నిర్మాణాలు, విద్యార్థుల వసతుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సీజేపీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఏడు అంశాలతో కూడిన డిమాండ్లను సమర్పించినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాల వ్యవహారంపై స్వతంత్ర క్రిమినల్‌ దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. కేవలం భవన యజమానులపై మాత్రమే కాకుండా.. అక్రమ నిర్మాణాలు, కార్యకలాపాలు సాగేందుకు రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు సహకరిస్తున్న యజమానులు, అధికారంలో ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకుల మధ్య ఉన్న విస్తృత సంబంధాలపై దర్యాప్తు జరగాలి. పెద్ద ఎత్తున కొనసాగుతున్న పీజీ మాఫియాపైనా విచారణ చేపట్టాలి’’ అని సౌరవ్‌ దాస్‌ పేర్కొన్నారు.


విద్యార్థులు ఉంటున్న భవనాలపై ప్రత్యేక ఆడిట్‌


ప్రభుత్వం అన్ని భవనాలకూ ఇంజినీరింగ్‌ ప్రమాణాలతో కూడిన నిర్మాణ భద్రతా ఆడిట్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలలు, విద్యార్థులు నివసించే పీజీలు, ఇతర వసతి గృహాలను ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. ‘‘విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు. వారు నివసించే, చదువుకునే ప్రదేశాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సౌరవ్‌ దాస్‌ అన్నారు. అక్రమ నిర్మాణాలకు, విద్యార్థుల భద్రతకు ముప్పు కలిగించే వసతులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని సీజేపీ డిమాండ్‌ చేసింది.

విద్యా వ్యవస్థ కుప్పకూలింది



  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి: రామచందర్‌రావు


హైదరాబాద్‌: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు ఆరోపించారు. 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ.15 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోందని తెలిపారు.

బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను కూడా తమ వద్దే ఉంచుకుంటున్నాయని రామచందర్‌రావు అన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒక బ్యాచ్‌ విద్యార్థులకు సంబంధించిన నిధులను విడుదల చేసినప్పటికీ, పాత బకాయిలు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.


ఈ సమస్యపై తాను వారం రోజుల్లోనే దాదాపు ఐదుసార్లు పోలీసుల అదుపులోకి తీసుకున్నారని రామచందర్‌రావు తెలిపారు. బకాయిల విడుదల కోసం సోమవారం నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు.తాజాగా సోమవారం ఉదయం తనతో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల తెలంగాణలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని రామచందర్‌రావు పేర్కొన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌



  • తెలంగాణ అసెంబ్లీలో భావోద్వేగ ఘటన


హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం తీవ్ర భావోద్వేగ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు తనపై, తన తల్లిపై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీవ్ర వ్యాఖ్యలతో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పరిణామంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ స్థానానికి, ఆయన కుటుంబానికి అవమానం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత గౌరవప్రదమైన స్పీకర్‌ పదవిని కించపరిచేలా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.


  • తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి


స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని సీతక్క డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పదవికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా సభా ప్రాంగణంలో అందరికీ క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ స్థానానికి, ఆయన కుటుంబానికి జరిగిన అవమానంపై బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కన్నీళ్లు పెట్టుకోవడం తెలంగాణ శాసనసభ చరిత్రలో అరుదైన ఘటనగా అధికార పక్ష సభ్యులు పేర్కొన్నారు. స్పీకర్‌ కళ్లలో కన్నీళ్లు, తీవ్ర ఆవేదనతో తలవంచిన దృశ్యాలు సభలో భావోద్వేగ వాతావరణానికి దారితీశాయి.

రేవంత్‌రెడ్డికి మూడు విషయాలే తెలుసు

 


డిస్ట్రక్షన్‌, డిస్ట్రాక్షన్‌, డైవర్షన్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూడు విషయాలు తప్ప మరేమీ తెలియదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ‘‘డిస్ట్రక్షన్‌, డిస్ట్రాక్షన్‌, డైవర్షన్‌ .. ఇవే ఆయనకు తెలుసు. మరేదీ తెలియదు’’ అని అన్నారు.

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యులను లోపలికి రాకుండా చేసేందుకు మరోసారి దృష్టి మళ్లింపు నాటకానికి తెరతీశారని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌, అసెంబ్లీలో నిబంధనల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు.

‘‘రాహుల్‌ గాంధీ టీషర్ట్‌ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్లొచ్చు. అదానీ, మోదీ చిత్రాలు ఉన్న టీషర్ట్‌ వేసుకుని కూడా ఆయన సభకు వెళ్లొచ్చు. అలాంటప్పుడు పార్లమెంట్‌కు ఒక నిబంధన, శాసనసభకు మరో నిబంధన ఉంటుందా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్‌సభకు వర్తించే నిబంధనలే శాసనసభకూ వర్తించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నినాదాలతో కూడిన టీషర్టులు ధరించి పార్లమెంట్‌కు వెళ్తున్నారు. మరి మాకు మాత్రం వేరే నిబంధనలు ఎందుకు?’’ అని నిలదీశారు.

తమను సభలోకి రాకుండా అడ్డుకోవడంపై పోలీసులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని కేటీఆర్‌ తెలిపారు. స్పీకర్‌, చీఫ్‌ మార్షల్‌ ఆదేశాల మేరకే తమను అడ్డుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Featured post

9/11 తర్వాత నెలల పాటు గాల్లో క్యాన్సర్‌ కారకాలు

1.70 లక్షల పేజీల్లో సంచలన వివరాలు న్యూయార్క్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రదాడుల్లో ఒకటైన 9/11 ఘటనకు ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తవుతున్...