Tuesday, 4 August 2026

ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంధనం కట్



  • కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
  • తదుపరి విచారణ ఆగస్టు 18కు వాయిదా 

దేశంలో చెల్లుబాటయ్యే మోటార్ వాహన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా కోట్లాది వాహనాలు రోడ్లపై తిరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలోని సుమారు 30 కోట్ల వాహనాల్లో 16.54 కోట్ల వాహనాలకు, అంటే దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేదని పార్లమెంటరీ కమిటీ నివేదికను ప్రస్తావిస్తూ కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో "ఇన్సూరెన్స్ లేకుంటే ఇంధనం లేదు (No Insurance, No Fuel)" అనే విధానాన్ని అమలుచేసే పైలట్ ప్రాజెక్ట్‌ను రూపొందించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH), బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI)లను సుప్రీంకోర్టు ఆదేశించింది.


న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొత్త కార్లకు మూడు సంవత్సరాలు, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేసినప్పటికీ, ఇప్పటికీ భారీ సంఖ్యలో వాహనాలు బీమా లేకుండా తిరుగుతున్నాయని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.


రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త వాహనాలకు కార్లకు నాలుగేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఆరేళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద బాధితులకు త్వరగా న్యాయం అందించడమే కాకుండా, సుదీర్ఘ న్యాయపోరాటాలను నివారించేందుకు మోటార్ వాహనాల చట్టంలోని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నిబంధనలు అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కింద జీవించే హక్కుతో ముడిపడి ఉన్న అంశమని ధర్మాసనం పేర్కొంది.



ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను బీమా డేటాబేస్, వాహన్ పోర్టల్‌తో అనుసంధానం చేయాలని కోర్టు సూచించింది. అలాగే పెట్రోల్ బంకుల్లోనే వాహన బీమా స్థితిని తనిఖీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేసి, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వకుండా నిరోధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని పేర్కొంది. దీంతో వాహన యజమానులు సమయానికి బీమాను పునరుద్ధరించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.


అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు వాహన బీమా వివరాలను అక్కడికక్కడే తనిఖీ చేసి జరిమానాలు విధించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌లు లేదా డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించింది. మోటార్ బీమా ప్రక్రియను సులభతరం చేసేందుకు నాలుగు స్థాయిల బీమా విధానాన్ని కూడా కోర్టు ఆమోదించింది. ఇందులో తప్పనిసరి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో పాటు ప్రయాణికులకు లీగల్ లయబిలిటీ కవర్, యజమాని, డ్రైవర్, ప్రయాణికులకు వ్యక్తిగత ప్రమాద బీమా, వాహన నష్టాలకు అదనపు బీమా వంటి ఎంపికలను సులభమైన భాషలో వినియోగదారులకు వివరించాలని బీమా కంపెనీలకు ఆదేశించింది.



తెలంగాణకు చెందిన ఒక రోడ్డు ప్రమాద పరిహార కేసు విచారణ సందర్భంగా ఈ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. బీమా కలిగిన వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రూ.10,00,500 పరిహారం, 7.5 శాతం వడ్డీతో చెల్లించాలన్న తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ వాహన యజమానికీ రక్షణ కల్పిస్తుందని, ఇలాంటి కేసుల్లో అతిగా సాంకేతిక కారణాలు చూపరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలుపై సంబంధిత శాఖలు ఆగస్టు 14లోగా అమలు నివేదిక సమర్పించాలని, తదుపరి విచారణను ఆగస్టు 18కు వాయిదా వేసింది.

కిషోర్ దా జయంతి... ఐదు ఆల్-టైమ్ సూపర్ హిట్ పాటలు




భారతీయ చలనచిత్ర రంగాన స్వరాభిషేకంతో శ్రోతలను  ఆనందంలో ముంచెత్తిన అరుదైన గాంధర్వ గాత్రం కిషోర్ కుమార్. అభిమానులు ఆప్యాయంగా 'కిషోర్ దా' అని పిలుచుకునే ఆభాస్ కుమార్ గంగూలీ జయంతి సందర్భంగా ఆయన కలకాలం నిలిచిపోయే మధురమైన గొంతును ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు స్మరించుకుంటున్నారు. ఎలాంటి సంప్రదాయ శాస్త్రీయ సంగీత శిక్షణ లేకపోయినప్పటికీ, తన సహజసిద్ధమైన ప్రతిభతో నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా , దర్శకుడిగా అద్భుతాలు సృష్టించి ఏకంగా రికార్డు స్థాయిలో ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఇప్పటికీ ప్రతి గుండెను మీటుతున్న ఆయన ఐదు చిరస్మరణీయమైన గీతాల విశేషాలు ఇవే.




1973లో వచ్చిన 'బ్లాక్‌మెయిల్' చిత్రం కోసం కిషోర్ పాడిన "పల్ పల్ దిల్ కే పాస్" పాట బాలీవుడ్‌లోనే అత్యుత్తమ ప్రణయ గీతంగా నిలిచిపోయింది. మధురమైన భావోద్వేగాలు, ప్రేమికుల ఆరాటాన్ని అత్యంత ఆర్ద్రంగా పండించిన ఈ పాట ఇప్పటికీ ప్రేమజంటలకు ఆల్-టైమ్ ఫేవరెట్‌గా విలసిల్లుతోంది. అలాగే 1971 నాటి 'అందాజ్' చిత్రంలోని "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా" పాటలో ఆయన పలికించిన ప్రత్యేకమైన 'యోడలింగ్' శైలి , నిరంతర ఉత్సాహం ఈ గీతాన్ని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించమనే జీవిత సందేశంగా మార్చేశాయి.ఆయన స్వర ప్రస్థానంలో 1969లో వచ్చిన 'ఆరాధన' చిత్రంలోని "రూప్ తేరా మస్తానా" అత్యంత కీలకమైనది. ఈ పాటలోనే కిషోర్ కుమార్‌కు తన తొలి ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఆయన లోతైన మత్తు గొంతు వెండితెరపై శృంగార భావనలకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ శ్రోతలను కట్టిపడేసింది. 




సరదా పాటలకే కాకుండా విషాద గీతాలలోని ఆవేదనను పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని 1978లో వచ్చిన 'ముఖద్దర్ కా సికందర్' చిత్రంలోని "ఓ సాథీ రే" పాట నిరూపిస్తుంది. గుండెకోతను, తీవ్రమైన విరహాన్ని అత్యంత సహజ సిద్ధమైన స్వరంతో ఆయన వినిపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆయనలోని అపారమైన హాస్య చతురతకు , బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం 1962 నాటి 'హాఫ్ టికెట్' చిత్రంలోని "ఆకే సీధీ లాగే దిల్ పే" గీతం. ఈ డ్యూయెట్ పాటలో అత్యంత వినూత్నంగా పురుష , స్త్రీ స్వరాలు రెండింటినీ కిషోర్ కుమారే స్వయంగా పాడటం ఆయన స్వర పరిధికి, అసాధారణ ప్రతిభకు , మరే గాయకుడికీ సాధ్యం కాని సృజనాత్మకతకు మైలురాయిగా నిలిచింది.



ప్రజారోగ్య మౌలిక వసతులకు రూ.32,961 కోట్ల ఆమోదం

 


ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద దేశవ్యాప్తంగా ప్రజారోగ్య మౌలిక వసతుల బలోపేతానికి రూ.32,961 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ రాజ్యసభలో తెలిపారు. 11 వేల సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలోని ఎయిమ్స్ బీబీనగర్ పొరుగు రాష్ట్రాలకు కూడా తృతీయ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న కీలక సంస్థగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

274 మంది పరారీలోని నేరస్థుల రప్పింపు

 



2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థులను భారత్‌కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. గత మూడేళ్లలో 401 మంది నేరస్థులపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. భారత్‌పోల్ వేదిక ద్వారా 1,400కుపైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించామని, పీఎంఎల్‌ఏ కింద రూ.17,874 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది.

భారీ వర్షాలకు రెడ్ అలర్ట్.. పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

 



అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్-నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

పీవోకే ఎన్నికలు ప్రహసనం.. పాక్ పై భారత్ విమర్శలు



పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికలను భారత్ ప్రహసనంగా అభివర్ణించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ప్రజా నిరసనలను అణచివేస్తూ విచక్షణారహిత కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్ వాస్తవాలను దాచేందుకు ఎన్నికల పేరుతో నాటకం ఆడుతోందని వి

సింగరేణికి కేంద్రం పూర్తి సహకారం



  • కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. తాడిపల్లి-2 ఓపెన్‌కాస్ట్ గనిని వేలం లేకుండానే సింగరేణికి కేటాయించామని చెప్పారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్ డిప్‌సైడ్ బ్లాక్ కూడా సింగరేణికి దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు.

Featured post

ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంధనం కట్

కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు తదుపరి విచారణ ఆగస్టు 18కు వాయిదా  దేశంలో చెల్లుబాటయ్యే మోటార్ వాహన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా కోట్లాద...