Thursday, 6 August 2026

ప్రధానితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ



  • ప్రపంచ కంటెంట్ హబ్‌గా భారత్‌పై చర్చ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరాండోస్‌తో సమావేశమయ్యారు. భారతదేశానికి గొప్ప కథన సంప్రదాయం, అపార సృజనాత్మక ప్రతిభ ఉన్నాయని, వాటిని ప్రపంచ స్థాయి కంటెంట్ సృష్టికి వినియోగించే అవకాశాలపై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. భారత్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మీడియా, వినోద రంగ సామర్థ్యాలపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్టోరీటెల్లింగ్ ఇనిషియేటివ్’ను ప్రకటించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (IICT), నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) భాగస్వామ్యంతో యువ సృజనాత్మక ప్రతిభకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.



టోల్ ప్లాజాల్లో అక్రమ వసూళ్లకు తావులేదు



  •  ‘మెకానికల్ పాస్’ లేదన్న కేంద్రం


జాతీయ రహదారుల టోల్ ప్లాజాల్లో వినియోగదారుల రుసుములు పూర్తిగా నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నామని కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్య వాహనాలకు ‘మెకానికల్ పాస్’ పేరుతో ఎలాంటి పాస్ జారీ చేయడం లేదని, అలాంటి అక్రమ వసూళ్లు జరుగుతున్న జాతీయ రహదారి భాగం ఏదీ గుర్తించలేదని తెలిపారు. టోల్ వసూళ్లలో పారదర్శకత కోసం ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక ప్రామాణిక విధానాలు అమలు చేస్తోందని, నగదు, ఫాస్‌ట్యాగ్ లావాదేవీలన్నీ టోల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ద్వారానే జరుగుతున్నాయని వెల్లడించారు.



‘పీఎం సూర్యఘర్’కు 50 లక్షల కుటుంబాలు



  • 19 లక్షల మందికి జీరో విద్యుత్ బిల్లు


ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 50 లక్షలు దాటిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుతో ప్రయోజనం పొందుతున్నాయని వెల్లడించారు. అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విక్రయించి 12 లక్షలకుపైగా కుటుంబాలు రూ.421 కోట్ల ఆదాయం సంపాదించాయని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దేశం చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిది నెలల్లో రోజువారీ రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు 5 వేల నుంచి 16 వేలకుపైగా పెరిగినట్లు వెల్లడించారు.



గోబర్‌ధన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం



  • 1.5 లక్షల ఉద్యోగాలతో బయోఎనర్జీకి భారీ ఊతం


దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని విస్తరించేందుకు రూ.23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్‌ధన్’ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశంలో సుమారు 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతో పాటు వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, మున్సిపల్ సేంద్రియ వ్యర్థాలను స్వచ్ఛ ఇంధనంగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. దేశీయ సీబీజీ ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడంతో పాటు భారీ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించనుంది. ఇదే సమావేశంలో అసోంలోని బైహాటా చారియాలి నుంచి తేజ్‌పూర్ వరకు 135.87 కి.మీ. పొడవైన నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.8,970 కోట్ల ప్రాజెక్టును కూడా ఆమోదించారు. ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం సగానికి తగ్గి, రహదారి భద్రత, ఇంధన సామర్థ్యం మెరుగుపడనున్నాయి.



అప్రోప్రియేషన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్



  • రూ.54 వేల కోట్ల అదనపు వ్యయానికి పార్లమెంట్ ఆమోదం


2026 అప్రోప్రియేషన్ (నెం.3) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును చర్చ అనంతరం రాజ్యసభ కూడా ఆమోదించి తిరిగి లోక్‌సభకు పంపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులను మించి జరిగిన ఖర్చులకు భారత సమీకృత నిధి నుంచి నిధులు వినియోగించేందుకు ఈ బిల్లు అనుమతి ఇస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.54 వేల కోట్లకు పైగా అదనపు నిధులను కోరింది. ఇందులో రైల్వే శాఖకు సంబంధించిన రూ.196 కోట్ల అదనపు వ్యయంతో పాటు రూ.53,871 కోట్ల రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ అదనపు వ్యయాలను ప్రజా లెక్కల సంఘం నివేదిక ఆధారంగా పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చామని ఆమె వివరించారు.



జాతీయ చేనేత దినోత్సవానికి రాష్ట్రపతి


  • 22 మంది చేనేత కళాకారులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందించనున్న ముర్ము



భారత చేనేత వైభవాన్ని ఘనంగా చాటిచెప్పే 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఘనంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా పాల్గొననున్నారు. దేశ చేనేత సంపదను, చేనేత కార్మికుల సృజనాత్మకతను, భారత సాంస్కృతిక, ఆర్థికాభివృద్ధికి వారి సేవలను గుర్తించి సత్కరించడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశమని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను మూడు సంత్ కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులు కలిపి మొత్తం 22 మంది చేనేత కళాకారులకు ప్రదానం చేయనున్నారు. అలాగే భారత చేనేత సంప్రదాయాన్ని ప్రతిబింబించే నాలుగు ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయడంతో పాటు ‘Earth. Root. Thread’, ‘Handloom Awards Book 2025’ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.

దతియా ఉపఎన్నిక జోష్




  •  స్థానిక సమస్యలతో మధ్యప్రదేశ్‌లో బీజేపీని చుట్టుముట్టనున్న కాంగ్రెస్‌

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దతియా శాసనసభ ఉపఎన్నికలో లభించిన ఘనవిజయంతో తీవ్ర ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించేందుకు స్థానిక ప్రజా సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జితు పట్వారీ , ఆయన కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, దానికి నిరసనగా ఇండోర్‌లో త్వరలోనే భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ భారీ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ రాబోయే పోరాట వ్యూహాలకు సంబంధించి ఆగస్టు 11న భోపాల్‌లో జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో పూర్తి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు జితు పట్వారితో పాటు మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి, అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ తదితర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. దతియా ఉపఎన్నిక విజయం అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలోనే స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే, స్థానిక స్థాయిలో నియోజకవర్గాల వారీగా ఉన్న ప్రజా సమస్యలపై విస్తృత ఉద్యమాలు నిర్మించాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జితు పట్వారీ సోదరుడిపై ఎటువంటి సంబంధం లేని కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే పీఏసీ సమావేశం ద్వారా ప్రతిపక్ష పాత్రను మరింత ప్రజారంగంలోకి తీసుకెళ్తామని, ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు తమ ప్రాంతాల్లోని స్థానిక సమస్యలను గుర్తించి పార్టీ పరంగా గళం విప్పుతారని కాంగ్రెస్ మీడియా విభాగం వెల్లడించింది.

Featured post

ప్రధానితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ

ప్రపంచ కంటెంట్ హబ్‌గా భారత్‌పై చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరాండోస్‌తో సమావేశమయ్యారు. భారతదేశానిక...