Tuesday, 11 August 2026

ఓటరు జాబితా నుంచి నా పేరు తొలగించారు

  •  ‘జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఫైర్‌

బెంగళూరు: కర్ణాటకలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాశ్‌రాజ్‌ తీవ్రంగా స్పందించారు. బెంగళూరు నియోజకవర్గానికి చెందిన 65 లక్షల మంది ఓటర్లలో తన పేరు కూడా తొలగించారని ఆయన ఆరోపించారు. ‘‘జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’’ అంటూ ప్రభుత్వ, ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేశారు.



ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది ఈ నియోజకవర్గంలోనే. ఇక్కడే చదువుకున్నాను. కాలేజీ, థియేటర్‌ జీవితమంతా ఇక్కడే కొనసాగింది. అంతేకాదు, ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభ అభ్యర్థిగానూ పోటీ చేశాను. అలాంటి నా ఓటు హక్కును SIR తర్వాత తొలగించారంటున్నారు. జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’’ అని వ్యాఖ్యానించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఓటరు జాబితా సవరణ సమయంలో తన ఓటు హక్కు తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరిగి ఓటరు గుర్తింపు కార్డు పొందేందుకు ఎలాంటి ప్రక్రియను పూర్తి చేయాలి, ఎలాంటి పత్రాలు సమర్పించాలంటూ ఆయన ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా, ప్రకాశ్‌రాజ్‌పై గతంలో పలు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసులో బెంగళూరు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయగా, గత నెలలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో నాలుగు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. అయితే ప్రస్తుత SIR ప్రక్రియలో తన పేరు తొలగించడంపై ప్రకాశ్‌రాజ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించే హక్కు ప్రజలకు ఉంది. మీకు ఓటు వేయని కొందరి ఓటు హక్కును అధికారాన్ని ఉపయోగించి నిరాకరించవచ్చు. కానీ మా గొంతును ఆపలేరు. మా శక్తితో మిమ్మల్ని రాజకీయంగా కిందికి దించుతాం’’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో జరుగుతున్న SIR ప్రక్రియలో బెంగళూరు వ్యవహారం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటింటి ఓటరు వివరాల పరిశీలనలో గైర్హాజరు, వేరే ప్రాంతాలకు తరలిపోయిన, డూప్లికేట్‌, మరణించిన తదితర కారణాలతో ASDDO కేటగిరీలో భారీ సంఖ్యలో ఓటర్లను గుర్తించారు. కర్ణాటకలో మొత్తం 5.54 కోట్ల మంది ఓటర్లలో 1,09,83,901 మంది అంటే 19.81 శాతం మంది ASDDO కేటగిరీలో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.

బెంగళూరు అర్బన్‌లోనే అత్యధికంగా 17,74,626 ASDDO కేసులు నమోదయ్యాయి. అక్కడ SIRకు ముందు ఉన్న 40,21,039 మంది ఓటర్లలో ఇది 44.13 శాతంగా ఉంది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (BBMP) సౌత్‌ పరిధిలో పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. అక్కడ 21,44,784 మంది ఓటర్లలో 10,87,829 మందిని ASDDO కేటగిరీలో గుర్తించారు. ఇది మొత్తం ఓటర్లలో 50.72 శాతానికి సమానం.

కర్ణాటకలో SIR గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. ఇంటింటి గణన ప్రక్రియ ఆగస్టు 17తో ముగియనుంది. ఆగస్టు 24న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణకు సెప్టెంబర్‌ 23 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్‌ 22 వరకు వాటిని పరిష్కరించనున్నారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్‌ 27న ప్రకటించనున్నారు.

Friday, 7 August 2026

అరిజిత్ సింగ్ ఒక ఫకీరు లాంటివాడు

  •  బాలీవుడ్‌కు దూరంగా సొంత ఊళ్లో ప్రశాంత జీవనం
  • ఆ నిర్ణయంపై నీలేష్ మిస్రా కీలక వ్యాఖ్యలు


ప్రముఖ గాయకుడు అరిజిత్‌ సింగ్‌ సినిమాల కోసం ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు గుడ్‌బై చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ముంబై నగర జీవితంలోని హడావుడికి దూరంగా పశ్చిమ బెంగాల్‌లోని తన స్వస్థలం జియాగంజ్‌, ముర్షిదాబాద్‌లో ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకోవడం కూడా అరిజిత్‌ గురించి పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆయన ఎక్కువగా తన స్వస్థలం నుంచే పని చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌, అంతర్జాతీయ గాయకుడు ఎడ్‌ షీరన్‌ వంటి ప్రముఖులు సైతం ఆయనను స్వగ్రామంలోని ఇంటికి వెళ్లి కలిశారు.

గ్రామీణ జీవన విధానాన్ని ప్రోత్సహించే రేడియో కథకుడు, స్క్రిప్ట్‌రైటర్‌, గేయరచయిత నీलेశ్‌ మిశ్రా.. అరిజిత్‌ ఎంపికను తన అనుభవాలతో పోల్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ సమీపంలోని కునౌరా గ్రామంలో నిర్వహించిన తన పాడ్‌కాస్ట్‌లో ఆయన ‘స్లో లివింగ్‌’ గురించి మాట్లాడారు. అదే గ్రామం నుంచి ‘ది స్లో ఇంటర్వ్యూ విత్‌ నీलेశ్‌ మిశ్రా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో పాటు, ఆయన గ్రామీణ వార్తా సంస్థ ‘గావ్‌ కనెక్షన్‌’కు కూడా అక్కడే పునాదులు పడ్డాయి.

ముంబై జీవితంలోని వేగం, ఒత్తిడిని వదిలి అరిజిత్‌ సింగ్‌ సొంతూరిలో ప్రశాంత జీవనాన్ని ఎంచుకోవడాన్ని ప్రస్తావిస్తూ నీलेశ్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అరిజిత్‌ సింగ్‌ ఒక ఫకీర్‌ లాంటి మనిషి. ఆయన నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆత్మగౌరవంతో వచ్చిన నిర్ణయంగా చెప్పొచ్చు. ఇందులో గర్వం లేదు, ఇతరులను తీర్పు చెప్పడం లేదు’’ అని అన్నారు. తాను కూడా ముంబై నుంచి తన గ్రామంతో అనుబంధాన్ని కొనసాగించడం కష్టమైందని, అందుకే జీవితాన్ని నిజమైన రూపంలో ఆస్వాదించేందుకు గ్రామానికి తిరిగి వచ్చానని తెలిపారు. లక్షలాది మంది కూడా నగరాల హడావుడికి దూరంగా సొంత మూలాలకు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నారని చెప్పారు.

ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు అరిజిత్‌ గుడ్‌బై

కొత్త ఏడాది సందర్భంగా అభిమానులను ఉద్దేశించి అరిజిత్‌ సింగ్‌ చేసిన ప్రకటన సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇన్నేళ్లుగా తన పాటలను ఆదరించిన శ్రోతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇకపై కొత్త ప్లేబ్యాక్‌ సింగింగ్‌ ప్రాజెక్టులను స్వీకరించబోనని ప్రకటించారు. అద్భుతమైన ప్రయాణంగా తన సంగీత జీవితాన్ని అభివర్ణిస్తూ, సినిమాల కోసం పాటలు పాడటానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు.

అరిజిత్‌ నిర్ణయంపై సంగీత పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భావోద్వేగంగా స్పందించారు. ప్రముఖ గాయకుడు కుమార్‌ సాను ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించే ధైర్యం అరిజిత్‌కు ఉందని కొనియాడారు. శ్రేయా ఘోషల్‌ మాత్రం ఇది అరిజిత్‌ కెరీర్‌కు ముగింపు కాదని, కొత్త దశకు ఆరంభమని పేర్కొన్నారు. ఆయనలాంటి ప్రతిభావంతుడైన కళాకారుడిని సంప్రదాయ సంగీత పరిధుల్లో బంధించలేమని అన్నారు.

రాపర్‌ బాద్‌షా ‘‘శతాబ్దానికి ఒకరు’’ అంటూ అరిజిత్‌ను ప్రశంసించగా, బి. ప్రాక్‌ ‘‘జీవితాంతం అభిమానినే’’ అంటూ తన స్పందనను తెలిపారు. బిగ్‌బాస్‌-19లో ఇటీవల కనిపించిన అమాల్‌ మాలిక్‌ అరిజిత్‌ నిర్ణయం విని తాను అయోమయానికి గురయ్యానని, అయితే ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. అర్మాన్‌ మాలిక్‌ కూడా అరిజిత్‌పై తనకు ఎప్పటికీ ప్రేమ, గౌరవం ఉంటాయని పేర్కొన్నారు.

దశాబ్దానికి పైగా తిరుగులేని మెలోడీ కింగ్‌

దశాబ్దానికి పైగా అరిజిత్‌ సింగ్‌ కొత్త తరం సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రేమ, విరహ గీతాలకు ఆయన గాత్రం ప్రత్యేక గుర్తింపుగా మారింది. షారుఖ్‌ ఖాన్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌ వరకు, రణ్‌బీర్‌ కపూర్‌ నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ వరకు పలువురు అగ్ర హీరోల సినిమాలకు అరిజిత్‌ గాత్రం సంగీత దర్శకుల తొలి ఎంపికగా నిలిచింది.

‘తుమ్‌ హీ హో’, ‘లాల్‌ ఇష్క్‌’, ‘రాబ్తా’, ‘కభీ జో బాదల్‌ బర్సే’, ‘ఆజ్‌ ఫిర్‌’ వంటి అనేక హిట్‌ పాటలతో అరిజిత్‌ సింగ్‌ తనదైన ముద్ర వేశారు. సినిమాల పాటలకు దూరమైనా, సంగీతంపై ఆయన ప్రయాణం కొత్త రూపంలో కొనసాగుతుందనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

థాయ్‌లాండ్‌ స్కూల్‌లో కాల్పులు.. ఏడుగురు మృతి



థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నొంతబురి ప్రావిన్స్‌లోని బాంగ్‌ క్రువాయ్‌ జిల్లాలో ఉన్న డెబ్సిరిన్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై థాయ్‌ ఉప ప్రధాని అనుతిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, దాడికి గల కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

  • స్కూల్‌కు వెళ్లే ముందు తాత, బామ్మను కూడా కాల్చిన విద్యార్థి

స్కూల్‌లో కాల్పులకు పాల్పడిన విద్యార్థి.. పాఠశాలకు వెళ్లే ముందు తన ఇంట్లో తాత, బామ్మపై కూడా కాల్పులు జరిపినట్లు థాయ్‌లాండ్‌ ప్రజారోగ్య మంత్రి తెలిపారు. ఈ ఘటనలో వారు కూడా మృతి చెందినట్లు వెల్లడించారు.

కాల్పులకు ఉపయోగించిన 9 ఎంఎం హ్యాండ్‌గన్‌ విద్యార్థి తాతకు చెందినదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడి తాత గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు పేర్కొన్నారు. స్కూల్‌లో కాల్పులకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కావేరీ కోసం ఎన్ని అవమానాలకైనా సిద్ధమే

 


  • తమిళనాడు సీఎం విజయ్‌

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి విజయ్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం కావేరీ సమస్య పరిష్కారానికి అవసరమైతే ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

మేకెదాటు ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం చేపట్టకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. కావేరీ అంశంపై కర్ణాటక అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఐకమత్యాన్ని చాటిందని, అయితే తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి నిరాకరిస్తోందని విమర్శించారు. మేకెదాటు అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

దీనిపై సీఎం విజయ్‌ స్పందిస్తూ.. మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించామని తెలిపారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు. 1969లో ఈ ప్రాజెక్టుకు తొలిసారిగా అనుమతి ఇచ్చింది డీఎంకే ప్రభుత్వమేనంటూ ఉదయనిధి విమర్శలకు బదులిచ్చారు.

తన బెంగళూరు పర్యటనను కూడా విజయ్‌ సమర్థించుకున్నారు. శత్రు దేశాలు సైతం తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు.. పొరుగు రాష్ట్రంతో సమస్య పరిష్కారం కోసం చర్చించేందుకు వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నించారు.

‘‘తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం కావేరీ సమస్యను పరిష్కరించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా నాకు అవమానం ఎదురైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం’’ అని విజయ్‌ స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీక్‌లో విస్తుపోయే విషయాలు

  • చీటీలపై ప్రశ్నలు రాసుకున్న నిందితులు


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ పేపర్ లీక్‌ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసేందుకు కొందరు ఎన్‌టీఏ నిపుణులు, మధ్యవర్తులు కలిసి ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా పనిచేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ప్రశ్నలను గుర్తుపెట్టుకోవడం, వాటిని చీటీలపై రాసుకోవడం, పుస్తకాల్లో సంబంధిత పేరాలను గుర్తించడం వంటి పద్ధతులను నిందితులు అనుసరించినట్లు పేర్కొంది.

దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ 94 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నీట్‌ ప్రశ్నపత్రం తయారీ ప్రక్రియలో భాగమైన కెమిస్ట్రీ నిపుణుడు పీవీ కులకర్ణి, బోటనీ నిపుణురాలు మనీషా మాందరే, ఫిజిక్స్‌ నిపుణురాలు మనీషా హవల్దార్‌ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ పేర్కొంది. అరెస్టయిన 13 మందిలో వీరు కూడా ఉన్నారు.

ఎన్‌టీఏ కేంద్రంలో ప్రశ్నల రూపకల్పన, అనువాదం జరుగుతున్న సమయంలో వివిధ విభాగాల్లోకి నిపుణులకు ప్రవేశం ఉండేదని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తెలిపింది. ఈ సమయంలో వారు ప్రశ్నలను చీటీలపై రాసుకోవడం లేదా పుస్తకాల్లో సంబంధిత అంశాలను మార్క్‌ చేసుకునేవారని పేర్కొంది. అనంతరం తమ నెట్‌వర్క్‌లోని మధ్యవర్తులు, కోచింగ్‌ సెంటర్ల ద్వారా ఆ సమాచారాన్ని విద్యార్థులకు చేరవేసినట్లు ఆరోపించింది.

డిజిటల్‌ పద్ధతులను ఉపయోగిస్తే తమ వ్యవహారం బయటపడే అవకాశం ఉండటంతో.. నిందితులు ఈ పాత పద్ధతిని ఎంచుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలతో పాటు కోచింగ్‌ సెంటర్ల విజయశాతాన్ని పెంచుకోవడమే ఈ కుట్ర వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా చేతిరాతతో ఉన్న పలు నోట్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. పేపర్‌ సెట్టింగ్‌ ప్రక్రియలో ఎన్‌టీఏ అనుసరిస్తున్న భద్రతా విధానాల్లోనూ లోపాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రశ్నపత్రాల తయారీకి వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నిపుణులను తనిఖీ చేసే వ్యవస్థ లేదని పేర్కొంది.

కులకర్ణి మూడు సెట్ల పరీక్షపత్రాల నుంచి మూడు రోజుల్లో 135 ప్రశ్నలను అనువదించినట్లు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. ఈ ప్రక్రియలో ప్రశ్నలకు నిపుణులకు సులభంగా పరిచయం ఏర్పడే అవకాశం ఉండటంతో లీకేజీకి మార్గం సుగమమైందని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

చంద్రుడిపై కూలిన స్పేస్‌ఎక్స్ రాకెట్ శకలం

 


  • దృశ్యాలు తీసిన కొరియా శాటిలైట్

చంద్రుడి ఉపరితలంపై స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్ శకలం ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను దక్షిణ కొరియాకు చెందిన ‘దనూరి’ అంతరిక్ష నౌక రికార్డు చేసింది. రాకెట్ శకలం చంద్రుడిని ఢీకొట్టడానికి ముందు, ఆ తర్వాత ప్రభావిత ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను దనూరి తన కెమెరాలో బంధించింది.

చంద్రుడి కక్ష్యలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. రాకెట్ శకలం ఢీకొన్న ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడటంతో పాటు దుమ్ము, రాళ్లు పెద్ద ఎత్తున ఎగసిపడినట్లు చిత్రాల్లో కనిపించింది. ఢీకొట్టడానికి ముందు తీసిన చిత్రాలతో పోలిస్తే.. ప్రభావిత ప్రాంతం అనంతరం మరింత నల్లగా కనిపిస్తున్నట్లు దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ వెల్లడించింది.

దనూరి దక్షిణ కొరియా తొలి చంద్ర మిషన్‌. 2022 ఆగస్టులో ఈ అంతరిక్ష నౌకను ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉపరితలాన్ని పరిశీలిస్తోంది.

Thursday, 6 August 2026

ప్రధానితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ



  • ప్రపంచ కంటెంట్ హబ్‌గా భారత్‌పై చర్చ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరాండోస్‌తో సమావేశమయ్యారు. భారతదేశానికి గొప్ప కథన సంప్రదాయం, అపార సృజనాత్మక ప్రతిభ ఉన్నాయని, వాటిని ప్రపంచ స్థాయి కంటెంట్ సృష్టికి వినియోగించే అవకాశాలపై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. భారత్‌ను గ్లోబల్ కంటెంట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మీడియా, వినోద రంగ సామర్థ్యాలపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్టోరీటెల్లింగ్ ఇనిషియేటివ్’ను ప్రకటించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (IICT), నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) భాగస్వామ్యంతో యువ సృజనాత్మక ప్రతిభకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది.



Featured post

ఓటరు జాబితా నుంచి నా పేరు తొలగించారు

 ‘జోక్‌ బాగుంది.. గేమ్‌ ఆన్‌’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ఫైర్‌ బెంగళూరు: కర్ణాటకలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై నటుడు, రాజకీయ వ...