Tuesday, 8 September 2026

ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సురక్షితమేనా?



  • మణిపూర్‌ సంగీతకారుడి హత్యపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం


న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీతకారుడు చోంగ్తమ్‌ విక్రమ్‌ సింగ్‌ హత్యపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి బయట శబ్దం తగ్గించమని చెప్పేందుకు వెళ్లిన విక్రమ్‌ సింగ్‌ను కొందరు వ్యక్తులు కొట్టి చంపారని ఆయన పేర్కొన్నారు.‘‘తన ఇంటి బయట పెద్దగా శబ్దం చేస్తున్న కొందరిని తగ్గించమని చెప్పేందుకు విక్రమ్‌ సింగ్‌ కిందికి వెళ్లారు. అక్కడే ఆయనపై దాడి చేసి హత్య చేశారు. తన సొంత ఇంటి బయట, తన సొంత దేశ రాజధానిలో ఓ తండ్రి హత్యకు గురయ్యారు’’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు.


ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలపై వరుసగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావించిన ఆయన.. దేశ రాజధానిలో తాము సురక్షితంగా ఉన్నామా? అనే ప్రశ్న ప్రతి ఈశాన్య రాష్ట్ర కుటుంబాన్ని వెంటాడుతోందని అన్నారు.‘‘ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగిన తర్వాత ఢిల్లీలోని ప్రతి ఈశాన్య కుటుంబం ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతోంది.. ఇక్కడ మేం సురక్షితమేనా? పెరుగుతున్న ఈ అరాచకాన్ని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అమిత్‌ షా నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు?’’ అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. విక్రమ్‌ సింగ్‌ హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రాహుల్‌ గాంధీ తన సానుభూతిని తెలిపారు.



కశ్మీర్‌ నాకు స్వర్గంలా అనిపిస్తోంది

 


  • ఇక్కడి నుంచి వెళ్లాలని అనిపించడం లేదు: సునిధి చౌహాన్‌

శ్రీనగర్‌: కశ్మీర్‌ పర్యటనపై ప్రముఖ గాయని సునిధి చౌహాన్‌ ఆనందం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి కశ్మీర్‌ను సందర్శించాలన్నది తన కల అని, ఇన్నేళ్లుగా దేశంలోని ఎన్నో ప్రాంతాలను సందర్శించినా ఇక్కడికి వచ్చే అవకాశం మాత్రం రాలేదని ఆమె తెలిపారు. ఈసారి ఎట్టకేలకు కశ్మీర్‌లో అడుగుపెట్టానని, ఇక్కడి వాతావరణం తనకు స్వర్గంలా అనిపిస్తోందని చెప్పారు. కశ్మీర్‌ ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారని సునిధి పేర్కొన్నారు. ఇక్కడి ఆహారం, ప్రశాంతమైన వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ‘‘ఇక్కడి నుంచి తిరిగి వెళ్లాలని నాకు అసలు అనిపించడం లేదు. కశ్మీర్‌లో తప్పకుండా ఒక సంగీత కచేరీ నిర్వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. నేను కశ్మీర్‌ను ప్రేమిస్తున్నాను’’ అని ఆమె అన్నారు.


కశ్మీర్‌లో నిర్వహిస్తున్న సినీ కార్యక్రమాన్ని కూడా సునిధి చౌహాన్‌ ప్రశంసించారు. పెద్దగా ఆదరణ పొందని సినిమాలను కూడా ఎంతో కష్టపడి రూపొందించిన చిత్రబృందాలకు ఇలాంటి వేదికలు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయని చెప్పారు. ఆ చిత్రాలను వీక్షించేందుకు సినీప్రియులు తరలిరావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ‘‘ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఎంతో కష్టపడి సినిమాలు తీసినా తగినంత ప్రశంసలు పొందని చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసేందుకు సినిమా ప్రేమికులు వస్తున్నారు. ఇది మంచి ఆరంభమని నేను భావిస్తున్నాను’’ అని సునిధి చౌహాన్‌ అన్నారు.



పంజాబ్‌లో మహిళలకు రక్షణ ఎక్కడ?: హర్‌సిమ్రత్‌ కౌర్‌




న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో పంజాబ్‌ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌  బాదల్‌ ఆరోపించారు. జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

గత ఐదేళ్లలో అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వ పాలనలో పంజాబ్‌ ఎన్నడూ లేనంతగా అప్పుల్లో కూరుకుపోయిందని హర్‌సిమ్రత్‌ కౌర్‌  అన్నారు. రాష్ట్ర అప్పులు సుమారు రూ.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇంత భారీగా అప్పులు ఉన్నప్పటికీ వాటికి తగ్గట్లుగా కనిపించే ఆస్తులు ఎక్కడా లేవని విమర్శించారు. సమాజంలోని ఏ వర్గానికీ ప్రభుత్వం ఉపశమనం కల్పించలేదని ఆరోపించారు.ముఖ్యమంత్రి నివాసం డ్రగ్స్‌ కార్యకలాపాలకు కేంద్రంగా మారిందనే విషయం ఇప్పటికే బయటకు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ భార్య డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌, ఆమె బావ అత్యాచారం కేసులో జైలులో ఉన్న నిందితుడికి రూ.5 కోట్లు చెల్లించి క్లీన్‌చిట్‌ ఇప్పించేందుకు ప్రయత్నించారని హర్‌సిమ్రత్‌ కౌర్‌  ఆరోపించారు.


మహిళలు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను, ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తున్న సమయంలోనే ఈ వ్యవహారం చోటుచేసుకుందని ఆమె అన్నారు. రెండు నెలల్లో కేసులన్నింటినీ పరిష్కరించేలా నిందితుడితో సంబంధం ఉన్న వ్యక్తులతో చర్చలు జరిపి రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను పంజాబ్‌-హర్యానా హైకోర్టుకు సమర్పించినట్లు హర్‌సిమ్రత్‌ కౌర్‌  తెలిపారు. బాధిత మహిళలకు రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. “హోంమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి భార్య డబ్బులు తీసుకుని ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పుడు పంజాబ్‌ బాలికలు ఎవరిని ఆశ్రయించాలి?” అని ఆమె ప్రశ్నించారు.


ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని హర్‌సిమ్రత్‌ కౌర్‌ డిమాండ్‌ చేశారు. నిందితుడి ఫోన్‌ను పరిశీలించి అందులో ఎంతమంది మహిళలకు సంబంధించిన అభ్యంతరకరమైన సమాచారం ఉందో, ఎంతమందిని ఎక్కడ, ఎలా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారో వెలుగులోకి తీసుకురావాలని కోరారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుందని, కోర్టు సైతం దీనిపై దృష్టి సారించిందని ఆమె చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయడం లేదని విమర్శించారు.


జాతీయ మహిళా కమిషన్‌ తన పరిధిలోకి వచ్చే అంశాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని హర్‌సిమ్రత్‌ కౌర్‌ తెలిపారు. బాధిత మహిళలను స్వయంగా కలిసి వారికి భద్రత కల్పిస్తామని భరోసా ఇవ్వాలని కమిషన్‌ను కోరినట్లు చెప్పారు. పంజాబ్‌ ప్రభుత్వం బాధితులను భయపెట్టేందుకు, బెదిరించేందుకు, కేసులను మూసివేయించేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

మా కుటుంబానికి భయం లేదు.. రెండింతలు తిరిగి కొట్లాడతాం: పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి




హైదరాబాద్‌: అసెంబ్లీ వద్ద తన తల్లితో పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అలా వ్యవహరించారని ఆరోపిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. “అలా చేస్తే మేము భయపడతామని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారు. నేను ఇంద్రారెడ్డి కొడుకును.. ఆమె ఇంద్రారెడ్డి భార్య. మా వ్యవస్థలో భయం పెట్టడం తప్ప.. భయపడటం ఉండదు” అని కార్తీక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబ చరిత్రను మర్చిపోయినట్లున్నారని అన్నారు. తన తండ్రి ఇంద్రారెడ్డి నక్సలైట్ల ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. పోలీసులు ఎన్‌కౌంటర్‌కు తీసుకెళ్లే పరిస్థితులు వచ్చినా భయపడలేదని, ఇప్పుడు పోలీసుల చర్యలకు భయపడతామా? అని ప్రశ్నించారు. ఇంద్రారెడ్డి హోంమంత్రి పదవి కోల్పోయినప్పుడు, అనంతరం చంద్రబాబు అక్రమంగా జైలులో పెట్టిన సమయంలోనూ తమ కుటుంబం భయపడలేదని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి మృతి చెందిన సమయంలో తన వెంట ఎవరూ లేకపోయినా తన తల్లి ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చారని, అప్పుడే భయపడలేదని అన్నారు. “నేను కానీ, నా కార్యకర్తలు కానీ, ఇంద్రారెడ్డి అభిమానులు కానీ ఒక్క చుక్క కూడా భయపడం. రెండింతలు తిరిగి కొట్లాడతాం” అని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు.


అసెంబ్లీ సమావేశాల తీరుపై ప్రజలు విసిగిపోయారు.. బండి సంజయ్‌




హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ కార్యకలాపాలు జరుగుతున్న తీరును చూసి ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఉపయోగిస్తున్న దూషణలు, వీధి స్థాయి భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.ఒకే అంశంపై రెండు రోజులపాటు చర్చిస్తూ విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేయడం దురదృష్టకరమని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనపెట్టి రాజకీయ విమర్శలకు సభా సమయాన్ని కేటాయించడం సరికాదన్నారు.


22ఏ భూముల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వేల కోట్ల రూపాయల భూ లావాదేవీల్లో మంత్రులు, అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారని తెలిపారు.దక్షిణ తెలంగాణలో రైతులకు సాగునీరు అందక ఆందోళన చెందుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆరోపించారు. డీఏ, పదవీ విరమణ ప్రయోజనాలు, పెండింగ్‌ బిల్లులు అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.


ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలని వారు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తారా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు.దోమలు, వ్యాధులు, పారిశుద్ధ్య లోపాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందన్నారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బయటకు పరస్పరం పోరాడుతున్నట్లు నటిస్తూ.. లోపల మాత్రం చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయని బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలు, ఇతర ఆందోళనకారులతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం మాత్రమే తెలంగాణలో నిజమైన అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని మార్చగలదని ఆయన పేర్కొన్నారు.

తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి.. అక్బరుద్దీన్‌ ఒవైసీ




హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కోరారు. శాసనసభలో మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. తన పార్టీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని అన్నారు. గతంలో కేసీఆర్‌ శాసనసభ ఉప సభాపతిగా కూడా పనిచేశారని అక్బరుద్దీన్‌ గుర్తుచేశారు. “స్పీకర్‌ గారికి మాత్రమే కాదు.. ఆయన తల్లికి మాత్రమే కాదు.. ఆ వ్యాఖ్యలతో బాధపడిన తెలంగాణలోని ప్రతి తల్లికి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి” అని అక్బరుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. కేసీఆర్‌ క్షమాపణ చెబితే ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకవచ్చని, సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. సభలో నెలకొన్న పరిస్థితులకు ముగింపు పలికేందుకు కేసీఆర్‌ ముందుకు రావాలని అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆకాంక్షించారు.

ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు



హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరినీ ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేశారు.

ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించిన ఛైర్మన్‌.. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని సెషన్‌ మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం శాసనమండలి వాయిదా పడింది.

అంతకుముందు శాసనసభ కూడా తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఇద్దరు ఎమ్మెల్సీలు చేసిన దూషణలను శాసనసభ తీవ్రంగా ఖండించింది. సభా మర్యాదలకు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసింది. మహిళల ఎదుట అనుచితంగా ప్రవర్తించిన తీరును కూడా సభ తప్పుబట్టింది.

బీఆర్‌ఎస్‌ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ బాధ్యత వహించాలని శాసనసభ తీర్మానించింది. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. నిబంధనలకు అనుగుణంగా తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై శాసనమండలి ఛైర్మన్‌ చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొంది.

Featured post

ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సురక్షితమేనా?

మణిపూర్‌ సంగీతకారుడి హత్యపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీతకారుడు చోంగ్తమ్‌ విక్రమ్‌ సింగ్‌ హత్యపై కాంగ్రెస్...