Saturday, 30 May 2026

అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో దాడి


  • గాయపడిన అభిషేక్ ను ఆసుపత్రికి తరలింపు
  • బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింస, ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ 24 పరగణాల పరిధిలోని సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసలో ప్రాణాలు కోల్పోయిన తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికులు తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. ఆయనను చుట్టుముట్టిన నిరసనకారులు నెట్టివేస్తూ, ఆయనపై కోడిగుడ్లు విసిరి, "చోర్.. చోర్" (దొంగ.. దొంగ) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ తోపులాటలో గాయపడిన అభిషేక్ బెనర్జీని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన మేనత్త, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు.




హెల్మెట్ ధరించినా తప్పని ముట్టడి

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెల్లటి చొక్కా, భద్రత కోసం క్రికెట్ హెల్మెట్ ధరించిన అభిషేక్ బెనర్జీ.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనసముద్రం మధ్య నడుస్తుండగా, జనం ఆయనను చుట్టుముట్టి నెట్టేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి చేదాటిపోవడంతో రక్షణ కవచాలు ధరించిన పోలీసులు అక్కడికి చేరుకుని, ఎలాగోలా ఆయనను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. "ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి. నన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఇక్కడ కనీసం పోలీసులు కూడా లేరు. బాధితుల కుటుంబాలకు రక్షణ కల్పించే వరకు నేను ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లను" అని అభిషేక్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.


బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు: కౌంటర్ ఇచ్చిన అధికార పక్షం

ఈ దాడి వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న టీఎంసీ ఆరోపణలను ఆ పార్టీ బెంగాల్ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య పూర్తిగా కొట్టిపారేశారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో టీఎంసీ సాగించిన అరాచక పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి, కోపానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హింస బాధితులను పరామర్శించే నైతిక హక్కు టీఎంసీకి లేదని విమర్శించారు. మరోవైపు, టీఎంసీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ, దేశంలోనే రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతపై బీజేపీ మద్దతుదారులు ఈ దారుణానికి ఒడిగట్టారని, ఓట్ల లెక్కింపు రోజునే ఆయన భద్రతను ఎందుకు ఉపసంహరించుకున్నారో కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


నేతల తిరుగుబాటు.. మారుతున్న బెంగాల్ రాజకీయాలు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 208 స్థానాల భారీ మెజారిటీతో తొలిసారిగా ఒంటరిగా అధికారంలోకి రాగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. స్వయంగా మమతా బెనర్జీ కూడా భవానీపూర్ స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఈ ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. పార్టీలోని అవినీతి, వసూళ్ల వల్లే ప్రజలు తమకు ఈ తీర్పు ఇచ్చారని సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితమే దమ్ దమ్ ఎంపీ సౌగతా రాయ్‌ను కూడా స్థానిక ప్రజలు నిలదీశారు. దశాబ్దాలుగా బెంగాల్‌లో సాగిన కుంటుపడిన పరిపాలన, శాంతిభద్రతల క్షీణత, మహిళల భద్రత లోపించడం వల్లే ప్రజల్లో ఈ స్థాయి నిగూఢ ఆగ్రహం వెల్లువెత్తిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు

 ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు
రాజస్థాన్ రాష్ట్రాన్ని భీకర ఇసుక తుపాను  వణికించింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులకు దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో పగటిపూటే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఈ ఊహించని ప్రకృతి పరిణామంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్‌, బికనీర్‌, సీకర్‌ తదితర ప్రాంతాలపై ఈ ఇసుక తుపాను తీవ్ర ప్రభావం చూపింది. నిమిషాల వ్యవధిలోనే వందల అడుగుల ఎత్తున ఇసుక గోడల తరహాలో మేఘాలు దూసుకురావడంతో దారిపొడవునా ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తమ వాహనాల లైట్లు వేసుకుని రోడ్లపైనే నిలిపివేయాల్సి వచ్చింది. ఇసుక తుపాను సృష్టించిన ఈ బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి.

వెనువెంటనే భారీ వర్షం
ఇసుక గాలులు వీచిన కాసేపటికే వాతావరణం పూర్తిగా చల్లబడి ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంతకుముందు శుక్రవారం కూడా రాజధాని జైపుర్‌ సహా పలు ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణం కనిపించింది. రాష్ట్రంలోని ధోల్‌పుర్‌ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఇసుక తుపాను తెచ్చిన ముప్పుతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

మరో ఐదు రోజులు అలర్ట్
రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని జైపుర్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జైపుర్‌, అజ్‌మేర్‌, బికనీర్‌, కోటా, జోధ్‌ఫుర్‌, ఉదయ్‌పుర్‌ డివిజన్లలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.


సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి


  • ఫలితాల వేళ 50 మంది విద్యార్థుల అక్రమ ప్రవేశం

కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) అధికారిక వెబ్‌సైట్ , పోర్టల్ ఇటీవల  సైబర్ దాడికి గురైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యే కీలక సమయంలో ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరగడం విద్యా రంగంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటన వెనుక బాహ్య శక్తుల ప్రమేయం ఉండటంతో పాటు సుమారు 50 మంది విద్యార్థులు అక్రమ మార్గాల్లో సిస్టమ్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం.



  • ఫలితాల డేటాను మార్చేందుకు కుట్ర

పరీక్షల ఫలితాల ప్రకటనకు ముందే సీబీఎస్ఈ అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారు. వెబ్‌సైట్‌ను స్తంభింపజేయడం లేదా ఫలితాల డేటాను తారుమారు చేయడం వీరి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 50 మంది విద్యార్థులు అనధికారికంగా బోర్డు భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. వీరు తమ మార్కులను పెంచుకోవడానికి లేదా ఫలితాలను ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే బోర్డు వద్ద ఉన్న అధునాతన ఐటీ భద్రతా వ్యవస్థలు ఈ చొరబాటును సకాలంలో గుర్తించి హెచ్చరించడంతో పెద్ద ముప్పు తప్పిందని తెలుస్తోంది.


  • రంగంలోకి సైబర్ క్రైమ్ విభాగాలు

ఈ సైబర్ దాడి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సీబీఎస్ఈ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. భద్రతా లోపాలను సరిచేయడంతో పాటు ఈ చొరబాటుకు కారణమైన ఐపీ అడ్రస్‌లను  గుర్తించే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దీనిపై సమగ్ర విచారణ ప్రారంభమైంది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవస్థలోకి ప్రవేశించిన సదరు 50 మంది విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు హెచ్చరించాయి. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు పోర్టల్ భద్రతను మరింత బలోపేతం చేశామని, విద్యార్థుల డేటా అంతా సురక్షితంగానే ఉందని బోర్డు స్పష్టం చేసింది. 

భారత్‌ లో పేలుళ్లకు కుట్ర భగ్నం


  •  ఐఎస్‌ఐ, దావూద్ అనుచరులైన తొమ్మిది మంది ముష్కరుల అరెస్ట్

భారతదేశంలో మరోసారి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన ఒక భారీ కుట్రను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్న తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భారీ దాడులకు వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


  • కీలక స్థావరాలే లక్ష్యంగా కుట్ర

అరెస్ట్ అయిన నిందితులు ఢిల్లీ, ముంబై, పంజాబ్ ప్రాంతాలకు చెందినవారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలను, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనేది వీరి ప్రధాన ఉద్దేశమని దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు , పవర్ గ్రిడ్‌లను ధ్వంసం చేయడానికి వీరు జాబితాను సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ ఉగ్రవాద ముఠా కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచినట్లు తెలిపిన అధికారులు.. వీరికి సరిహద్దుల అవతల నుంచి అందుతున్న నిధులు, విదేశీ హ్యాండ్లర్ల పాత్రపై ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు.



  • హై అలర్ట్‌లో దేశ రాజధాని

ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాలు, సెంట్రల్ ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, వాహన ఆధారిత ఐఈడీ పేలుళ్లు, కాల్పులతో సమన్వయ దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. అన్నిజిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర పారామిలటరీ దళాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


గత ఏడాది ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 15 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక అన్సార్ గజ్వతుల్ హింద్ అనే అల్-ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 'వైట్ కాలర్' ఉగ్రవాద ముఠా హస్తం ఉన్నట్లు తేలింది. ఫరీదాబాద్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాశ్మీరీ వైద్యుడు ఉమర్-ఉన్-నబితో పాటు ముజమ్మిల్ షకీల్ గనాయ్, అదీల్ అహ్మద్ రాథర్, ముజఫర్ అహ్మద్ రాథర్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే మరియు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షాహీన్ సయీద్ వంటి విద్యావంతులు ఆ ముఠాలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత అరెస్టుల నేపథ్యంలో పాత ముఠాలకు, తాజా కుట్రకు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

భార్య వేధింపులు తట్టుకోలేక, న్యాయం జరగక...


  • కారుణ్య మరణం ప్రసాదించాలంటూ సూరత్ వ్యక్తి వేడుకోలు

సూరత్:గుజరాత్‌లోని సూరత్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన భార్య పెడుతున్న మానసిక, చట్టపరమైన వేధింపులను తట్టుకోలేక, అధికారులు తన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిరీట్ పటేల్ అనే వ్యక్తి తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ సూరత్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.



మహిళా చట్టాల దుర్వినియోగం 

కిరీట్ పటేల్ తన దరఖాస్తులో తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. చిన్నపాటి గృహ వివాదాల తర్వాత కూడా ఆమె కావాలనే గొడవలను పెద్దవి చేసి, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తూ తనపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపణలు గుప్పించాడు. భార్య, అత్తమామలు, ఆమె బంధువులు తనను నిరంతరం డబ్బుల కోసం వేధిస్తున్నారని, గృహ హింస , భరణం కేసుల ద్వారా తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నాడు. అంతేకాకుండా, తమ ఇద్దరికీ ఇది మూడో వివాహమని చెబుతూ.. తన భార్య ఒక దోపిడీ పెళ్లికూతురు అని ఆరోపించాడు. గతంలో కూడా ఆమె తన మాజీ భర్తల నుంచి చట్టపరమైన చర్యలు , ఆర్థిక డిమాండ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిందని, వివాహ బంధాన్ని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా వాడుకుంటోందని తెలిపాడు.


బిడ్డకు ప్రాణాపాయం ఉన్నా స్పందించని పోలీసులు

తన మునుపటి వివాహం ద్వారా కలిగిన కుమారుడికి తన ప్రస్తుత భార్య వల్ల ప్రాణాపాయం ఉందని, ఆమె ఆ బాబుకు హాని చేయడానికి ప్రయత్నించిందని పటేల్ ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు ఎటువంటి ఎఫ్ఐఆర్  నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని తెలిపాడు.


పురుషులకు చట్టపరమైన రక్షణ ఏది?

కుటుంబ వివాదాల్లో పురుషులకు లభించే చట్టపరమైన రక్షణలపై పటేల్ తన దరఖాస్తులో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కేవలం హామీలే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి న్యాయం జరగడం లేదని వాపోయాడు. ఈ నిరంతర వేధింపులు, చట్టపరమైన వివాదాల నుంచి బయటపడటానికి తనకు చావు ఒక్కటే మార్గంగా కనిపిస్తోందని, అందుకే జిల్లా కలెక్టర్‌కు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు సమర్పించానని స్పష్టం చేశాడు. అంతేకాదు, నిర్దేశిత సమయంలోగా తన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయకపోతే తానే ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించాడు.ప్రస్తుతానికి ఈ ఆరోపణలపై అధికారుల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. 

Wednesday, 27 May 2026

నన్ను ఎవరూ తొలగించలేదు, అవన్నీ వదంతులే


  • ప్రధాని మోడీపై వ్యాఖ్యల వల్లే 'ఇండియన్ ఐడల్ 16' నుంచి అవుట్ అన్న వార్తలపై విశాల్ దద్లానీ క్లారిటీ


ముంబై: ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ తనపై సోషల్ మీడియాలో వస్తున్న  వార్తను తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీడింగ్ సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ 16' (Indian Idol 16) నుంచి ఆయనను జడ్జిగా తొలగించారంటూ కొన్నిరోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్తలపై ఆయన ఎట్టకేలకు నోరు విప్పారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఇటీవల తాను చేసిన కొన్ని రాజకీయ వ్యాఖ్యల (Remark on PM Modi) కారణంగానే, ఛానెల్ యాజమాన్యం మరియు షో నిర్వాహకులు ఆయనపై వేటు వేసి షో నుండి బయటకు పంపించేశారనే వాదనలను విశాల్ దద్లానీ ముక్కుసూటిగా తోసిపుచ్చారు. అవన్నీ కేవలం కొందరు కావాలనే సృష్టించిన కల్పిత పుకార్లని, ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.



ఈ వివాదాస్పద వైరల్ పోస్టులపై విశాల్ దద్లానీ స్పందిస్తూ.. "ఇండియన్ ఐడల్ షోతో నా బంధం ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా నేను ఈ వేదికతో కలిసి ప్రయాణిస్తున్నాను. నన్ను షో నుంచి తొలగించారనే వార్త పూర్తిగా నిరాధారం. నా వ్యక్తిగత సంగీత కచేరీలు (మ్యూజిక్ కాన్సెర్ట్స్), కొత్త సినిమాల కంపోజిషన్ షెడ్యూల్స్ వల్ల కొన్ని ఎపిసోడ్‌ల చిత్రీకరణకు నేను అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలకు తెరలేపారు. దీనికి రాజకీయ రంగు పులమడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. షో నిర్వాహకులకు, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు, భవిష్యత్తులో కూడా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది" అని రూమర్లకు గట్టి సమాధానం ఇచ్చారు.


సంగీత ప్రపంచంలోనే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై కూడా సోషల్ మీడియాలో ముక్కుసూటిగా స్పందించే స్వభావం ఉన్న విశాల్ దద్లానీ.. గతంలోనూ పలుమార్లు ఇటువంటి వివాదాలను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి ఏకంగా ఆయన జీవనోపాధి , బుల్లితెర క్రేజ్‌ను దెబ్బతీసేలా 'ఇండియన్ ఐడల్' నుండి తొలగింపు వార్తలు రావడంతో ఆయన అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు స్వయంగా విశాల్ ఈ వదంతులపై అధికారిక వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి పూర్తి స్థాయిలో తెరపడినట్లయింది. సోనీ టీవీ యాజమాన్యం కూడా ఈ ఉదంతంపై అంతర్గతంగా స్పందిస్తూ.. విశాల్ దద్లానీ తమ షోలో ఒక కీలక భాగమని, ఆయన స్థానాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

‘చునరీ చునరీ’ పాట ఈరోజుకూ సూపర్ హిట్టే!

  •  వరుణ్ ధావన్‌పై విమర్శల దుమారం
  • బాలీవుడ్ హీరోకు అండగా నిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్



ముంబై: బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్.. యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు మద్దతుగా నిలిచారు. ఇటీవల ఒక వేదికపై వరుణ్ ధావన్ చేసిన డ్యాన్స్ ప్రదర్శన , బాలీవుడ్ ఐకానిక్ హిట్ సాంగ్ 'చునరీ చునరీ' (Chunnari Chunnari) రీమిక్స్ వెర్షన్‌పై నెటిజన్లు, విమర్శకులు సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తుండటంతో అను మాలిక్ గట్టిగా స్పందించారు. 1999లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'బీవీ నెం.1' (Biwi No.1) లోని ఈ ఒరిజినల్ సాంగ్‌కు తానే సంగీతం అందించానని గుర్తుచేసిన ఆయన.. దశాబ్దాలు గడిచినా ఈ పాట క్రేజ్ అస్సలు తగ్గలేదని, నేటికీ ఈ గానా ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ హిట్ ఆంథమ్‌గా నిలిచిందని స్పష్టం చేశారు.



ఈ వివాదంపై అను మాలిక్ స్పందిస్తూ.. "చునరీ చునరీ పాట విడుదలై 25 ఏళ్లకు పైగా అవుతున్నా, ఇప్పటికీ పెళ్లిళ్లు, పార్టీలు, పబ్‌లలో ఈ పాట ప్లే చేయకుండా ఏ ఈవెంట్ పూర్తి కాదు. సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్ అలరించిన ఈ ఒరిజినల్ సాంగ్ ఒక క్లాసిక్. అయితే వరుణ్ ధావన్ లాంటి నటుడు ఈ తరం శైలికి తగ్గట్టుగా దాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు విమర్శించడం సరికాదు. వరుణ్ ఒక అద్భుతమైన డ్యాన్సర్, గొప్ప ఎనర్జీ ఉన్న నటుడు. క్లాసిక్ పాటలను కొత్తగా ప్రెజెంట్ చేసినప్పుడు భిన్నమైన స్పందనలు రావడం సహజం, కానీ కేవలం విమర్శల కోసమే వరుణ్‌ను టార్గెట్ చేయడం తగదు. ఈ పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్" అని వరుణ్ ధావన్ వెనూక నిలిచారు.



ఈ రీమిక్స్ సాంగ్‌లో సంగీత విలువలను తగ్గించేశారంటూ నెటిజన్లు చేస్తున్న ఆరోపణలను కూడా అను మాలిక్ కొట్టిపారేశారు. కొత్తదనంతో కూడిన ప్రయోగాలు చేసినప్పుడు పాత తరం అభిమానులకు కొంత అసంతృప్తి ఉండొచ్చని, కానీ యువత ఈ బీట్స్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వరుణ్ ధావన్ కూడా అను మాలిక్ ఇచ్చిన ఈ మద్దతుపై స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తాజా పరిణామంతో బాలీవుడ్ క్లాసిక్ సాంగ్స్ రీమిక్స్ ట్రెండ్‌పై పరిశ్రమలో , సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

Featured post

అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో దాడి

గాయపడిన అభిషేక్ ను ఆసుపత్రికి తరలింపు బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింస, ఉద్...