Sunday, 7 June 2026

బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’..


  • ‘పెద్ది’ ప్రభంజనం ముంగిట తేలిపోయిన డేవిడ్ ధావన్ చిత్రం
  • రెండు రోజుల్లో రూ. 23 కోట్లు మాత్రమే వసూలు

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ ల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోతోంది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు అతి సాధారణ వసూళ్లతో సరిపెట్టుకోగా, రెండో రోజైన శనివారం నాడు కూడా అదే మందకొడి ధోరణిని కొనసాగించింది. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ 'శాక్‌నిల్క్' నివేదికల ప్రకారం, ఈ సినిమా శనివారం భారతదేశంలో కేవలం రూ. 7.25 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. దీంతో రెండు రోజుల్లో దేశీయంగా ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 4.75 కోట్లుగా, గ్రాస్ వసూళ్లు రూ. 17.70 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ నుండి వచ్చిన రూ. 3 కోట్లను కలుపుకుంటే, రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్లు కేవలం రూ. 23.20 కోట్లు మాత్రమే.



దేశవ్యాప్తంగా దాదాపు 8,813 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి శనివారం కేవలం 21.38 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ మాత్రమే లభించడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురిచేసింది. ఆశ్చర్యకరంగా ఉత్తరాది మార్కెట్ల కంటే దక్షిణాదిలోనే ఈ సినిమాకు కొంత మెరుగైన ఆదరణ కనిపించింది. చెన్నైలో 49 షోలలో అత్యధికంగా 47 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, హైదరాబాద్‌లో 192 షోలలో 31.8 శాతం, బెంగళూరులో 219 షోలలో 29 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముంబైలో 548 షోలకు గానూ 24 శాతం ఆక్యుపెన్సీ రాగా, దిల్లీ పరిసర ప్రాంతాలలో (NCR) ఏకంగా 980 షోలు ఉన్నప్పటికీ కేవలం 16.3 శాతం మంది మాత్రమే థియేటర్లకు వచ్చారు. వరుణ్ ధావన్ గత చిత్రం ‘బోర్డర్ 2’ మొదటి రోజే రూ. 30 కోట్లు, రెండో రోజు రూ. 36.50 కోట్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. దానితో పోలిస్తే ఈ సినిమా వసూళ్లు చాలా వెనుకబడి ఉన్నాయి.


ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెమ్మదించడానికి ప్రధాన కారణం.. అదే సమయంలో థియేటర్లలోకి వచ్చిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీయేనని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు యాక్షన్ డ్రామా అయిన ‘పెద్ది’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్లకు పైగా వసూళ్లతో థియేటర్లను శాసిస్తుండటంతో, వరుణ్ ధావన్ సినిమాకు గట్టి పోటీ ఎదురైంది. రమేష్ తౌరానీ నిర్మాణంలో, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ ధావన్‌తో పాటు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్, చంకీ పాండే, మనీష్ పాల్ కీలకపాత్రలు పోషించగా.. జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్, మనోజ్ పహ్వా, కృతి సనన్ , వరుణ్ సూద్ ప్రత్యేక పాత్రలలో మెరిశారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్‌లో పస లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

బాక్సాఫీస్ వద్ద పుంజుకుంటున్న ‘బందర్’


  • రెండో రోజు రెట్టింపు వసూళ్లతో బాబీ డియోల్ చిత్రం జోరు
  • అనురాగ్ కశ్యప్ మేకింగ్‌కు దక్కుతున్న ఆదరణ

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘బందర్’ బాక్సాఫీస్ వద్ద క్రమంగా తన పట్టును సాధిస్తోంది. థియేటర్లలో పలు భారీ చిత్రాల పోటీని తట్టుకుంటూ, ఈ సినిమా రెండో రోజు వసూళ్లలో ఊహించని వృద్ధిని కనబరిచింది. మొదటి రోజుతో పోలిస్తే శనివారం నాటి కలెక్షన్లు దాదాపు రెట్టింపు కావడం విశేషం. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ 'శాక్‌నిల్క్' గణాంకాల ప్రకారం, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తొలిరోజు రూ. 50 లక్షల నెట్ వసూళ్లను సాధించగా, రెండో రోజైన శనివారం నాటికి అది ఏకంగా రూ. 95 లక్షలకు చేరుకుంది. ఈ అద్భుతమైన జంప్‌తో భారతదేశంలో ఈ సినిమా రెండు రోజుల మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 1.45 కోట్లకు చేరాయి. ప్రస్తుతం దేశీయంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 1.75 కోట్లుగా నమోదయ్యాయి.



ప్రస్తుతం థియేటర్లలో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేల కలయికలో వచ్చిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంతో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి భారీ చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ‘బందర్’ చిత్రం మంచి స్క్రీన్లను, ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ ‘సమర్’ అనే ఒక ప్రముఖ సింగర్ , నటుడి పాత్రను పోషించారు. సమాజంలో ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్న అతని జీవితం.. గాయత్రి (సప్నా పబ్బి) అనే మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా తలకిందులవుతుంది.


ఈ ఆరోపణలు మీడియాలో సంచలనంగా మారడంతో సమర్ చుట్టూ చట్టపరమైన పోరాటాలు, పోలీసు పరిశోధనలు, మీడియా ట్రోలింగ్ ముసురుకుంటాయి. తాను నిర్దోషినని, సదరు మహిళ తనను పిచ్చిగా వెంబడించే ఒక స్టాకర్ (Stalker) అని అతను వాదించినప్పటికీ, వ్యవస్థ మొత్తం అతనికి వ్యతిరేకంగా ఎలా మారింది అనే అంశాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎంతో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. బాబీ డియోల్‌తో పాటు ఈ చిత్రంలో సాన్యా మల్హోత్రా, సబా ఆజాద్, రాజ్ బి శెట్టి, జితేంద్ర జోషి, రిద్ధి సేన్, ఇంద్రజిత్ సుకుమారన్ , నగేష్ భోంస్లే వంటి సీనియర్ నటులు కీలకపాత్రల్లో నటించారు. మౌత్ టాక్ బాగుండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నటిని నిందించకండి.. వ్యవస్థది, మేకర్స్‌దే తప్పు


  • ‘పెద్ది’ వివాదంలో జాన్వీ కపూర్‌కు బాసటగా నిలిచిన టాలీవుడ్ హీరోయిన్ డింపల్ హయాతి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, మరోవైపు చిత్రంలో హీరోయిన్ పాత్రను గ్లామర్ వస్తువులా చూపించారనే (ఆబ్జెక్టిఫికేషన్) వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్న జాన్వీ కపూర్‌కు టాలీవుడ్ నటి డింపల్ హయాతి తన మద్దతు ప్రకటించారు. సినిమాలో మహిళా పాత్రను తక్కువ చేసి చూపించినందుకు నటిని నిందించడం సరికాదని, దీనికి చిత్ర పరిశ్రమలోని ‘వ్యవస్థ , మేకర్స్’ (చిత్ర నిర్మాతలు, దర్శకులు) మాత్రమే బాధ్యులని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఒక సుదీర్ఘమైన భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.



సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను రాసే విధానంపై, అలాగే తమకు లభించిన పాత్రలలో నటించినందుకు నటీమణులనే తప్పుబట్టే ధోరణిపై ఈరోజు అందరూ బహిరంగంగా మాట్లాడుతుండటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని డింపల్ హయాతి పేర్కొన్నారు. ఒక నటికి వచ్చిన అవకాశాల పరిధిలోనే ఆమె పని చేస్తుందని, ఇండస్ట్రీలో ఎదగాలని, పెద్ద సినిమాల ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలని ఆశిస్తుందని ఆమె వివరించారు. కేవలం ఇలాంటి గ్లామర్ పాత్రలే అమ్ముడుపోతాయని (సినిమాలు ఆడుతాయని) భావించే మేకర్స్ మైండ్‌సెట్ మారాలని పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు పరిశ్రమలో నటీమణులను ఒక నిర్దిష్టమైన ఇమేజ్‌తో స్టీరియోటైప్ చేస్తారని, వారిలోని పూర్తి నటన నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు ఇవ్వరని, అదే సమయంలో హీరో కేంద్రంగా సాగే కథలకు మాత్రం అన్ని రకాల స్వేచ్ఛలు ఉంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా మేకింగ్ అనేది కేవలం ఒక్కరి చేతిలో ఉండేది కాదని, అయితే ప్రేక్షకులుగా, నటీనటులుగా మనమంతా మరింత మెరుగైన చిత్రాలను, గౌరవప్రదమైన అనుభవాన్ని పొందేందుకు అర్హులమని డింపల్ స్పష్టం చేశారు.

https://x.com/DimpleHayathi/status/2063386199201636498?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2063386199201636498%7Ctwgr%5Ee1988b244ded609d3ed3e2838ec8d664127c16a9%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fentertainment%2Fdimple-hayathi-defends-janhvi-kapoor-amid-peddi-backlash-11603217

 

మరోవైపు ఈ వివాదం తీవ్రం కావడంతో దర్శకుడు బుచ్చిబాబు సనా శనివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. తెరపైనా, నిజ జీవితంలోనూ తనకు మహిళల పట్ల ఎంతో గౌరవం ఉందని, ఏ మహిళా పాత్రను కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తాము తీవ్రంగా పరిగణించామని, సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న ఆయా సీన్లను తొలగించి తగిన మార్పులు (మోడిఫికేషన్స్) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వివాదంపై హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పటివరకు నేరుగా స్పందించనప్పటికీ, పరిశ్రమ నుండి ఆమెకు మద్దతు పెరుగుతోంది. 1980ల కాలం నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, కుల వివక్షను ఎదుర్కొంటూ తన సమాజం కోసం కుస్తీ (రెజ్లింగ్) పోటీల్లో పోరాడే ఒక యువకుడి కథగా జూన్ 4న విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

తప్పు నటిది కాదు.. డైరెక్టర్ హద్దులు దాటారు


  • ‘పెద్ది’ సినిమా వివాదంపై జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలిచిన మేకప్ ఆర్టిస్ట్
  • బాక్సాఫీస్ వసూళ్ల కోసమే దర్శకుడు అలా చేశారంటూ సంచలన వ్యాఖ్యలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, మరోవైపు ఈ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై, ముఖ్యంగా కొన్ని సీన్లలో ఆమెను అమితంగా శృంగారభరితంగా ప్రదర్శించారంటూ వస్తున్న విమర్శల నడుమ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర నెటిజన్ల ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వివాదంలో జాన్వీ కపూర్‌కు ఊరటనిస్తూ ఆమె వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మంచందా మద్దతుగా నిలిచారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు నటిది కాదని, కేవలం థియేటర్లకు జనాన్ని రప్పించి బాక్సాఫీస్ వసూళ్లను పెంచుకోవడం కోసమే దర్శకుడు బుచ్చిబాబు సనా నటి విధించిన ప్రొఫెషనల్ హద్దులను దాటారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.



సావ్లీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకుంటూ.. తెరపై నటి కనబడే విధానాన్ని బట్టి ఆమెను నిందించడం చాలా సులువని, కానీ అసలు నిజం వేరే ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో, పోస్ట్ ప్రొడక్షన్ (ఎడిటింగ్) దశలో కొన్ని నిర్దిష్టమైన కెమెరా యాంగిల్స్ , విజువల్స్ పట్ల జాన్వీ కపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు. సినిమాల్లో మహిళలను కేవలం ఒక గ్లామర్ వస్తువులా చేసే పరిశ్రమ ధోరణికి వ్యతిరేకంగా జాన్వీ ఎల్లప్పుడూ బహిరంగంగా మాట్లాడుతుందని, అదే విధంగా ఈ సినిమాలోని కొన్ని అభ్యంతరకరమైన షాట్లను తొలగించాలని ఆమె ఎడిటింగ్ రూమ్‌లోనే గట్టిగా ప్రశ్నించిందని సావ్లీన్ స్పష్టం చేశారు.



నటిగా జాన్వీ కపూర్ తన ప్రొఫెషనల్ పరిమితులను స్పష్టంగా చెప్పినప్పటికీ, చివరి ఎడిటింగ్‌లో ఆ దృశ్యాలను అలాగే ఉంచారని ఆమె ఆరోపించారు. ఇది ఒక నటి తన గౌరవం కోసం నిలబడటంలో విఫలమైన సందర్భం కాదని, కేవలం సినిమా కలెక్షన్ల కోసమే ఒక మహిళ అనుమతి ,ఆమె పెట్టిన నిబంధనల కంటే బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం అని భావించిన దర్శకుడు ఆ హద్దులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని సావ్లీన్ ఘాటుగా విమర్శించారు. ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సనా.. ప్రేక్షకుల విమర్శల మేరకు ఆయా సీన్లను సినిమాలో నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో, జాన్వీ మేకప్ ఆర్టిస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో మరింత చర్చకు దారితీశాయి.

ఆ హర్రర్ సినిమా చూసి పిచ్చెక్కిపోయింది


  • రూ. 7 కోట్లతో తీసి రూ. 1,600 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘అబ్సెషన్’ చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాలీవుడ్ సైకలాజికల్ హర్రర్చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మేకింగ్, ఎడిటింగ్ , సౌండ్ డిజైన్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూ.. ‘నేను అబ్సెషన్‌తో అబ్సెస్ అయిపోయాను’ (నాకు ఈ సినిమా పిచ్చి పట్టుకుంది) అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'  వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. కేవలం అగ్ర నటులు, భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఉన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవనే పరిశ్రమ పాత నమ్మకాలను ఈ సినిమా పూర్తిగా మార్చేసిందని ఆర్‌జీవీ కొనియాడారు. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 7 కోట్ల (750,000 డాలర్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా రూ. 1,600 కోట్లకు పైగా (179 మిలియన్ డాలర్లు) వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని వర్మ గుర్తుచేశారు.



ఈ సినిమాలో పెద్ద నటులు, అందమైన విదేశీ లోకేషన్లు, ఆడంబరమైన ప్రొడక్షన్ డిజైన్ లేదా అగ్ర సాంకేతిక నిపుణులు ఎవరూ లేరని ఆర్‌జీవీ విశ్లేషించారు. సాంకేతిక నిపుణుల ఫీజులు పక్కన పెడితే, కేవలం ఒక చిన్న ఇల్లు, కారు ,ఒక చిన్న స్టోర్.. ఇలా కేవలం మూడు ప్రదేశాలలోనే సినిమా మొత్తాన్ని చిత్రీకరించారని, దీని అసలు మేకింగ్ ఖర్చు రూ. 70 లక్షల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని అంచనా వేశారు. దర్శకుడు కర్రీ బార్కర్ అనుసరించిన విజువల్ స్టైల్, ముఖ్యంగా ఫ్రేమ్‌లలో తల భాగం పైన ఎక్కువ ఖాళీ స్థలాన్ని (హెడ్‌స్పేస్) వదిలేయడం వంటి కొత్త ప్రయోగాలు సినిమా మూడ్‌ను అద్భుతంగా పెంచాయని మెచ్చుకున్నారు. ఎడిటింగ్‌ను కేవలం ఒక సాంకేతిక ప్రక్రియగా కాకుండా, ప్రేక్షకులను మానసికంగా భయపెట్టే ఒక ఆయుధంగా దర్శకుడు ఉపయోగించారని, ఇంటర్వెల్ సీన్‌లో హీరోయిన్ నిక్కీ ముఖాన్ని చాలా సేపు ఒకే షాట్‌లో చూపించడం ద్వారా ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచారని ఆర్‌జీవీ వివరించారు.


సినిమాలోని పాత్రలు మానసికంగా అస్థిరంగా ఉన్నప్పుడు, చూసే ప్రేక్షకుడికి కూడా అదే ఫీలింగ్ వచ్చేలా ఎడిటింగ్ రూల్స్‌ను పక్కన పెట్టి చేసిన ప్రయోగం అద్భుతంగా పనిచేసిందని వర్మ కొనియాడారు. తలుపు వేయడం, నవ్వడం, గుండె చప్పుడు వంటి శబ్దాలకు అనుగుణంగా సీన్లను కట్ చేసిన విధానం , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ఫించర్ శైలిని తలపించేలా సింగిల్-సోర్స్ లైటింగ్ ఉపయోగించిన తీరు అద్భుతమని ప్రశంసించారు. బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ వసూళ్ల కంటే కూడా, ఈ సినిమాలో ఉపయోగించిన వినూత్నమైన ఎడిటింగ్, సౌండ్ డిజైన్ ,క్యారెక్టర్ డిజైనింగ్ గురించి సినిమా విద్యార్థులు ఎక్కువగా అధ్యయనం చేయాలని ఆర్‌జీవీ సూచించారు. మైఖేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక అలౌకిక శక్తులున్న బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం మే 29న భారతదేశంలో విడుదలై ఇక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

మిస్ యూనివర్స్‌తో డేటింగ్.. చేతిలో మాత్రం పైసా లేదు


  • సుస్మితా సేన్‌తో ప్రేమాయణంపై విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు
  • ఒకప్పుడు విషం కొనడానికి కూడా డబ్బుల్లేవంటూ ఆవేదన

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను, నటి సుస్మితా సేన్‌తో ఉన్న పాత బంధాన్ని గుర్తుచేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోని అగ్ర నటులతో సినిమాలు చేస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా తాను ఎంతటి దారిద్య్రాన్ని అనుభవించాడో ఆయన బహిరంగంగా పంచుకున్నారు. సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో విక్రమ్ భట్ మాట్లాడుతూ.. "నేను అప్పట్లో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సాధారణ దర్శకుడిని. నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే.. కనీసం ‘విషం కొనుక్కుని చావడానికి కూడా నా దగ్గర పైసల్లేవు’. ఒకవైపు అమీర్ ఖాన్‌తో ‘గులామ్’ లాంటి భారీ సినిమాకు దర్శకత్వం వహిస్తూ, మరోవైపు మిస్ యూనివర్స్ (సుస్మితా సేన్) తో డేటింగ్ చేస్తున్నాను.. కానీ నా జేబులో మాత్రం ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. కనీసం ఒక మ్యూజిక్ సీడీ కొనేందుకు కూడా నా దగ్గర డబ్బుల్లేక ఒక ఫకీరులా జీవితాన్ని గడిపాను" అని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.



1996లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘దస్తక్’ సినిమా ద్వారా సుస్మితా సేన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకుడు కాగా, విక్రమ్ భట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. విక్రమ్ భట్ చేసిన ఈ వ్యాఖ్యలు.. గతంలో ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిబింబిస్తున్నాయి. సుస్మితా సేన్‌ను కొందరు 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు కోసం ఆశపడేది) అని విమర్శించినప్పుడు లలిత్ మోదీ ఆమెకు మద్దతుగా నిలిచారు. తామిద్దరం కలిసి బయటకు వెళ్లినప్పుడు చాలాసార్లు సుస్మితా సేనే బిల్లులు కట్టేదని, ఆమె ఎంతో స్వావలంబన గల మహిళ అని లలిత్ మోదీ స్పష్టం చేశారు. విక్రమ్ భట్ అనుభవం కూడా అలాగే ఉండటం గమనార్హం. సుస్మితతో బంధం ముగిసిన తర్వాత విక్రమ్ భట్ 2002 నుండి 2007 వరకు నటి అమీషా పటేల్‌తో కూడా డేటింగ్ చేశారు. తన జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తనకు ఏదో ఒక మంచి పాఠాన్ని నేర్పించారని, తన వ్యక్తిగత బంధాలు ఎక్కువ కాలం నిలవకపోయినా, తను తీసిన సినిమాలు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు.


సినిమా ముచ్చట్లు పక్కన పెడితే, విక్రమ్ భట్ , ఆయన భార్య శ్వేతాంబరి సోని (ఆర్ట్ క్యూరేటర్) ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక సినిమా ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ. 30 కోట్ల ఆర్థిక మోసానికి, నమ్మకద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలతో గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. జనవరిలో రాజస్థాన్ హైకోర్టు వీరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినప్పటికీ, ఆ తర్వాత వీరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని (సుప్రీం కోర్టు) ఆశ్రయించారు. ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని వీరికి బెయిల్ మంజూరు చేయడంతో ఈ జంటకు పెద్ద ఊరట లభించింది. ఆ న్యాయపోరాటం ముగిసిన కొన్ని నెలలకే విక్రమ్ భట్ తన పాత ప్రేమాయణంపై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే తప్పేంటి?


  •  ఆమిర్ ఖాన్ మూడో వివాహంపై వస్తున్న విమర్శలకు సీనియర్ నటి రాఖీ గుల్జార్ ఘాటు కౌంటర్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన 60వ ఏట ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ వయసులో మూడో పెళ్లి ఏంటంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుండగా, వారికి మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటి రాఖీ గుల్జార్ నిలిచారు. ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని, తోడును వెతుక్కోవడానికి వయసుతో అస్సలు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. రీనా దత్తా, కిరణ్ రావులతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆమిర్ ఖాన్.. వచ్చే జూలై 5వ తేదీన బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో రాఖీ గుల్జార్ మాట్లాడుతూ.. హాలీవుడ్ దిగ్గజ నటుడు రాబర్ట్ డి నిరో తన 80 ఏళ్ల వయసులో భాగస్వామితో కలిసి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వివాహ బంధంలో సంతోషం అనేది వయసుపై ఆధారపడి ఉండదని, తాను కూడా గుల్జార్‌ను ఆయనకు 40 ఏళ్లు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నానని వివరించారు.



సినిమా పరిశ్రమలో జరిగే విషయాలతో తనకు పెద్దగా సంబంధం లేకపోయినా, ఆమిర్‌ ఖాన్‌తో కలిసి ఎప్పుడూ పని చేయకపోయినా.. అతను వ్యక్తిగతంగా చాలా నిజాయితీ గల మనిషి అని రాఖీ గుల్జార్ కొనియాడారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా తన ఇద్దరు మాజీ భార్యలైన రీనా దత్తా, కిరణ్ రావులతో ఆమిర్ ఖాన్ ఇప్పటికీ ఎంతో ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగిస్తున్న తీరు అద్భుతమని ప్రశంసించారు. ఈ ఒక్క విషయమే ఆమిర్ ఖాన్ ఎంతటి సంస్కారవంతుడో చెబుతుందని ఆమె పేర్కొన్నారు.


ఇటీవలే తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా ముంబైలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమిర్ ఖాన్ తన ప్రియురాలిని ప్రపంచానికి పరిచయం చేశారు. తామిద్దరం 25 ఏళ్ల క్రితమే కలుసుకున్నామని, గత ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తూ ఒకరికొకరు ఎంతో అంకితభావంతో ఉన్నామని ప్రకటించారు. బాలీవుడ్ అగ్ర హీరోలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కూడా ఇప్పటికే గౌరీని పరిచయం చేసినట్లు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తుండగా, ఆమిర్ ఖాన్ ప్రతిరోజూ ఆమె కోసం పాటలు పాడుతుంటానని ప్రేమగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాఖీ ఇచ్చిన మద్దతు ఆమిర్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Featured post

బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’..

‘పెద్ది’ ప్రభంజనం ముంగిట తేలిపోయిన డేవిడ్ ధావన్ చిత్రం రెండు రోజుల్లో రూ. 23 కోట్లు మాత్రమే వసూలు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, ప్రముఖ ద...