- గ్లోబల్ స్టడీలో 60వ ర్యాంకు
- వృద్ధుల కంటే యువతే వెనుకబాటు
న్యూఢిల్లీ: నేటి ఆధునిక కాలంలో భారతీయ యువత ఎదుర్కొంటున్న మానసిక సవాళ్లపై ఒక దిగ్భ్రాంతికరమైన నివేదిక వెలువడింది. అమెరికాకు చెందిన ‘సేపియన్ ల్యాబ్స్’ నిర్వహించిన ‘గ్లోబల్ మైండ్ హెల్త్ 2025’ అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 84 దేశాలలో జరిగిన సర్వేలో భారతీయ యువత మానసిక ఆరోగ్య సూచీలో (MHQ) 60వ స్థానానికి పరిమితమైంది. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేశంలోని వృద్ధుల కంటే యువతే మానసిక ఆరోగ్యం విషయంలో దారుణమైన స్థితిలో ఉన్నారు. 55 ఏళ్లు పైబడిన భారతీయులు 49వ ర్యాంకుతో మెరుగైన స్థితిలో ఉండగా, 18 నుండి 34 ఏళ్ల లోపు యువత మాత్రం తీవ్రమైన మానసిక ఒత్తిడి మరియు పోరాటంతో (Distressed or Struggling) గడుపుతున్నట్లు వెల్లడైంది. వృద్ధుల సగటు స్కోరు 100 వద్ద ఉంటే, యువత స్కోరు కేవలం 33 వద్దే ఆగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్షీణతకు గల కారణాలను విశ్లేషిస్తూ సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు తారా త్యాగరాజన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సంపన్న, అభివృద్ధి చెందిన దేశాల్లోనే యువత మానసికస్థితి ఎక్కువగా దెబ్బతింటోందని ఆమె పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేకపోవడం, అతి చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్ల వాడకం, ఆధ్యాత్మికత తగ్గడం , అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం (Ultra-processed food) తీసుకోవడం వంటివి యువతను కుంగదీస్తున్నాయి. భారతదేశంలో 18-34 ఏళ్ల యువతలో దాదాపు 44 శాతం మంది నిత్యం ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటుండగా, వృద్ధులలో ఈ సంఖ్య కేవలం 11 శాతంగానే ఉండటం గమనార్హం. అలాగే, కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని, ఆదాయం కంటే కుటుంబ బంధాలే మానసిక ప్రశాంతతకు ప్రధాన కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
మరోవైపు, పాశ్చాత్య దేశాలు మానసిక ఆరోగ్య పరిశోధనల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని నివేదిక ఎత్తిచూపింది. కేవలం వ్యాధి లక్షణాలకు చికిత్స అందించడం కంటే, సమస్య మూలాలను గుర్తించి పరిష్కరించడంలో వైఫల్యం చెందుతున్నాయని విమర్శించింది. ఆసక్తికరంగా, ఈ సూచీలో ఘనా, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాలు మెరుగైన స్థానాల్లో ఉండగా.. జపాన్, హాంకాంగ్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు అట్టడుగున నిలిచాయి. కరోనా మహమ్మారి తర్వాత యువత మానసిక స్థితి మరింత దిగజారిందని, ఇప్పటికీ వారు ఆ షాక్ నుండి కోలుకోలేదని నివేదిక హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం యువతలో పెరుగుతున్న ఈ డిజిటల్ వ్యసనాన్ని, ఆహారపు అలవాట్లను మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

