Friday, 5 June 2026

అసలైన తృణమూల్ మాదే

  •  అసలైన తృణమూల్ మాదే
  • రెబెల్ నేత రితబ్రతపై మమతా బెనర్జీ వ్యూహాత్మక ఎదురుదాడి
  • తిరిగి కాళీఘాట్‌కు క్యూ కడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు!

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీలో మొదలైన అంతర్గత పోరు ఇప్పుడు ‘అసలైన తృణమూల్ కాంగ్రెస్ ఎవరిది?’ అనే స్థాయికి చేరుకుంది. 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 60 మంది మద్దతు తనకే ఉందంటూ కొత్తగా అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన రెబెల్ నాయకుడు రితబ్రత బెనర్జీ, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని కేవలం ఒక ‘సలహాదారు’ పాత్రకే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత రితబ్రత తిరుగుబాటు సజావుగానే సాగినట్లు కనిపించినప్పటికీ, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి నమ్మకంగా ఉన్న అసలైన లాయలిస్ట్ వర్గం వ్యూహాత్మక ఎదురుదాడికి తెరలేపింది.



ఈ సంక్షోభాన్ని తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ వర్గం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటగా, రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఇది పార్టీ అధినాయకత్వానికి అంతర్గతంగా పుంజుకోవడానికి తగిన సమయాన్ని ఇస్తుంది. ఇక రెండో వ్యూహంలో భాగంగా, అసంతృప్త రెబెల్ నేతలతో రాయబారాలు నడుపుతూ వారిని తిరిగి సొంత గూటికి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ వ్యూహం ఇప్పటికే పలించిందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే శోభన్ దేబ్ ఛటర్జీ ‘ఎన్డీటీవీ’తో పేర్కొన్నారు. రితబ్రతను అనుసరించి ‘న్యూ తృణమూల్’ (కొత్త తృణమూల్) నినాదాన్ని ఎత్తుకున్న చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మనసు మార్చుకుని, కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసమైన కాళీఘాట్‌కు నిరంతరం ఫోన్లు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. తాము తిరిగి పాత తృణమూల్ గూటికి వచ్చేస్తామని కోరుతున్నారని చెప్పారు. అలాగే రితబ్రత బెనర్జీ స్పీకర్‌కు సమర్పించిన 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల సంతకాల జాబితా ఫోర్జరీ అని, దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తమ వైపు ప్రస్తుతం 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.



మరోవైపు, రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ క్యాంపులో కూడా అప్పుడే అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయి. మమతా బెనర్జీని కేవలం ‘గైడ్’ లేదా ‘సలహాదారు’గా మార్చి ఆమెను రాజకీయ సన్యాసంలోకి నెట్టాలనే రితబ్రత ఆలోచనను పంచ్లా టీఎంసీ ఎమ్మెల్యే గుల్షన్ మల్లిక్ తీవ్రంగా వ్యతిరేకించారు. మమతా బెనర్జీయే తమ శాశ్వత నాయకురాలని, ఆమె నాయకత్వం విషయంలో ఎలాంటి రాజీ లేదని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. అయితే రితబ్రత బెనర్జీ మాత్రం ఎంటల్లీ ఎమ్మెల్యే సందీపన్ సాహా నివాసంలో జావేద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ వంటి నేతలతో కలిసి సమావేశమై, తమ వైపు మరికొంత మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారని, ఆ సంఖ్య ఎక్కడికి చేరుతుందో వేచి చూడాలని సవాల్ విసిరారు.



ఈ అస్తిత్వ సంక్షోభం ఎదురైనప్పటికీ మమతా బెనర్జీకి పార్టీ అగ్రనేతల మద్దతు గట్టిగానే ఉంది. శుక్రవారం ఆమె కాళీఘాట్ నివాసంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీ, మదన్ మిత్ర వంటి కీలక నేతలు హాజరయ్యారు. ఈ అసంతృప్తి అంతా మమతపై కాదని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ శైలిపైనేనని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పార్టీ మాత్రం ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా పూర్తిస్థాయిలో సమర్థిస్తోంది. అలాగే పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పశ్చిమ బెంగాల్ టీఎంసీ అధ్యక్షురాలిగా చంద్రిమా భట్టాచార్యను, మహిళా విభాగానికి మాలా రాయ్‌ను నియమించారు. కాగా, దాదాపు 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారనే వార్తలు , బెంగాల్‌లో తృణమూల్ అవినీతిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో, ఈ అంతర్గత అసమ్మతి వెనుక అధికార బీజేపీ హస్తం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

Thursday, 4 June 2026

బీజేపీకి కె. అన్నామలై రాజీనామా

  •  బీజేపీకి కె. అన్నామలై రాజీనామా
  • ఆమోదించిన అధిష్ఠానం

తమిళనాడు రాజకీయాల్లో  కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆ రాష్ట్రంలో బీజేప)కి అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖచిత్రంగా నిలిచిన కె. అన్నామలై ఆ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించినట్లు పార్టీ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నామలై ప్రజలతో ఒక బహిరంగ, ఆత్మీయ సంభాషణ (లైవ్ సెషన్) నిర్వహించడానికి సరిగ్గా కొన్నిగంటల ముందే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.



ఈ 41 ఏళ్ల యువ నేత మంగళవారం ఢిల్లీకి చేరుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసి, ఎంతో సౌమ్యమైన వాతావరణంలో ఈ ఐదేళ్ల బంధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా, అలాగే తనలోని నాయకత్వ పటిమను గుర్తించి ప్రోత్సహించిన బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్‌లతో కూడా ఆయన సమావేశమయ్యారు. అప్పట్లో పార్టీ అధిష్ఠానం ఆయనను కొద్దిరోజులు వేచి చూడాలని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను ఢిల్లీకి పిలిపించి మరో విడత తెరవెనుక చర్చలు జరిపినప్పటికీ, అంతిమంగా అన్నామలై నిర్ణయాన్నే గౌరవిస్తూ శుక్రవారం ఆయన రాజీనామాను ఆమోదించారు. బీజేపీని వీడిన అన్నామలై, తమిళనాడు వ్యాప్తంగా యువ నాయకులను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి సరైన రీతిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఒక సరికొత్త 'ప్రజా ఉద్యమాన్ని' ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఈ ఉద్యమమే ఒక నూతన రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందని, ఇప్పటికే ఆయన నడుపుతున్న "వి ది లీడర్స్" (We The Leaders) అనే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థే ఈ రాబోయే భారీ రాజకీయ ప్రాజెక్టుకు పునాది కానుందని తెలుస్తోంది.


ప్రధాని నరేంద్ర మోడీకి వీరాభిమాని అయిన అన్నామలై, ఐపీఎస్ (IPS) సివిల్ సర్వీసెస్ ఉద్యోగానికి రాజీనామా చేసి 2020లో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన కొద్ది వారాల్లోనే ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాతి ఏడాదిలోనే కేవలం 37 ఏళ్ల వయసులోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. ద్రవిడ రాజకీయాల కోటలో బీజేపీ ఓటు బ్యాంకును, ఉనికిని పెంచిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న అన్నామలైకి కేంద్ర పెద్దలు 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కో-ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే (AIADMK)తో బీజేపీ తిరిగి పొత్తు పెట్టుకోవడంతో ఇరు పక్షాల మధ్య విభేదాలు తీవ్రమయినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఒంటరిగా పోటీ చేయడం ద్వారానే పార్టీ పునాది బలపడుతుందని అన్నామలై భావించగా, కేంద్ర నాయకత్వం మాత్రం పొత్తుకే మొగ్గు చూపింది. పైగా, పొత్తు కుదరాలంటే అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి షరతు విధించడంతోనే ఆయనను పదవి నుండి తొలగించినట్లు అప్పట్లో రాజకీయ విశ్లేషకులు భావించారు. తమిళనాడులో బీజేపీకి విపరీతమైన పాపులారిటీ తెచ్చినప్పటికీ, అన్నామలై 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీజేపీతో బంధాన్ని పూర్తిగా తెంచుకున్న అన్నామలై రాబోయే రోజుల్లో తమిళనాడులో ఎలాంటి సరికొత్త రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాలి.

భూమికి భారం పెరగకుండా చూసుకుందాం

 


'భూమ్మీద మానవాళి మనుగడ కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. మనవల్ల భూమికి భారం పెరగకుండా చూసుకోవాలి'- భగత్‌ పూరణ్‌ సింగ్‌, పర్యావరణవేత్త 



కొవిడ్‌ కు ముందు ఒక లెక్క తర్వాత మరో లెక్క అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు సంభవించాయి. ఆ మహమ్మారి చేసిన హెచ్చరిక ఈ భూభాగంపై జీవరాశుల్లో అత్యంత తెలివిగలవాడు, అత్యంత ప్రమాదకారి మనిషే అని చెప్పకనే చెప్పింది. అందుకే లాక్‌డౌన్‌ కాలంలో ఆధునిక అభివృద్ధికి చిహ్నాలుగా కనిపించే హైవే రోడ్లపైకి అడవిలో ఉండే జంతువులు వచ్చాయి. మనుషులు కనిపించనిచోట మనల్ని ఎవడు రా ఆపేది అన్నట్టు ఆ కాలమంతా స్వేచ్ఛగా తిరిగాయి. వాటికి కొవిడ్‌ భయం లేదు. వ్యాక్సిన్‌ వాటికి అవసరం కాలేదు. గుంపులు గుంపులుగా ఉండొద్దు అన్న నిబంధనలేవీ వాటికి వర్తించలేదు. స్థూలంగా చెప్పాలంటే ప్రకృతి ప్రపంచానికి చాలా ఇచ్చింది. వాటిని మనిషి తన అవసరం మేరకే వాడుకోవాలని తదుపరి భవిష్యత్తు తరాలకు మిగల్చాలని సూచన చేసింది. ప్రకృతి తనను కాపాడితే కడుపులో పెట్టుకుంటానని, లేకపోతే కన్నెర్ర చేస్తానని అప్పుడప్పుడు పాఠాలు చెబుతూనే ఉంటుంది. అందుకే మన కోసం అన్నీ ఇస్తున్న నేచర్‌కు మనం కృతజ్ఞులుగా ఉండాలి.


కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నది? బడిత ఉన్న వాడిదే బర్రె అన్నట్టు ఆర్థికంగా, ఆయుధపరంగా బలంగా ఉన్న దేశాలు బలహీనదేశాలపై దాడులు చేస్తున్నాయి. ఫలితంగా యుద్ధంతో సంబంధంలేని అనేక దేశాల్లోని మారుమూల గ్రామాల్లో గ్యాస్‌ కొరత, నిత్యావసర వస్తువుల పెరుగుదల, పెట్రోల్‌, డీజీల్‌ ధరల మోత, ఎరువుల కొరత ఇట్లా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రెండు ప్రపంచయుద్ధాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి మనుషులు ఇంకా గుణపాఠాలు నేర్చుకోవడం లేదని అనిపిస్తుంది. యుద్ధం వల్ల పర్యావరణం దెబ్బతింటున్నది. వేలల్లో మనుషులు చనిపోతున్నారు. కోట్లల్లో నిరాశ్రయులు అవుతున్నారు. ఉపాధి కోల్పోయి వలస బాట పడుతున్నారు. కొంతమంది స్వార్థాలకు కోట్లాదిమంది బలవుతున్నారు.


ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే.. ఈ మద్య నా ఇంటర్మీడియట్‌ దోస్తు స్వామి కాల్‌ చేసి మన గోదావరిఖనిలో ఉండలేకపోతున్నాం రా. ఎండల తీవ్రత అట్లా ఉన్నది. పెద్ద పెద్ద కూలర్లు కూడా పనిచేయడం లేదన్నాడు. 80వ, 90వ దశకం పిల్లలు ఇదే నడీ ఎండకాలంలోనూ సింగరేణి స్టేడియంలో పొద్దంతా క్రికెట్‌ ఆడినరోజులున్నాయి. కానీ ఇప్పుడు బైటికి వస్తే వడదెబ్బకు బలవుతారు అన్నట్టు పరిస్థితులు నెలకొన్నాయి. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ లాంటి పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉపాధి కోసం ఊళ్లు వదిలి గోదావరిఖని వచ్చిన వాళ్లు ప్రమాదకర పరిస్థితుల మధ్య పని చేశారు. సంస్థ అభివృద్ధికి తమ చెమట చుక్కలు ధారపోశారు. కాలం గడిచే కొద్దీ ఉత్పత్తి పెరిగింది. ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పర్యావరణం విధ్వంసమైంది. ఇవాళ జూన్‌ 5.  

ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా అనేక ఏళ్లుగా ప్రతిజ్ఞలు చేస్తున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి సరిగా అమలుచేయలేకపోతున్నాం. పర్యావరణ వరణ పరిరక్షణ అన్నది నినాదంగా కాకుండా మనిషి జీవన విధానంగా మారనంత కాలం అనేక విపత్తులు వస్తుంటాయి. తద్వారా ప్రకృతి తనను తాను ప్రక్షాళన చేసుకుంటుంది. తన పరిరక్షణ బాధ్యతను తానే తీసుకుంటున్నది.  ప్రకృతి హెచ్చరికలను అనుక్షణం గుర్తుచేసుకుంటూ బాధ్యతగా మెలిగితే ప్రపంచం బాగుటుంది. ప్రకృతి బాగుంటుంది. భూమ్మీద మనమూ బాగుంటాం కదా!

బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' జాతర


  • తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లతో రామ్ చరణ్ రికార్డుల వేట

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ శాక్‌నిల్క్ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ చిత్రం భారతదేశ వ్యాప్తంగా మొదటి రోజే 16.25 కోట్ల రూపాయల నికర (నెట్) వసూళ్లను సాధించగా, గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఏకంగా 19.18 కోట్ల రూపాయలను రాబట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 5,695 షోలలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం తొలిరోజు 41.4 శాతం సగటు ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. ఈ వసూళ్లలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే రావడం విశేషం. మొత్తం వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచే 15.43 కోట్ల రూపాయలు రాగా, 3,463 షోలలో రికార్డుస్థాయిలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీ వెర్షన్ 1,705 షోల ద్వారా 64 లక్షల రూపాయలు వసూలు చేయగా, తమిళం 9 లక్షలు, కన్నడ 6 లక్షలు, మలయాళం 3 లక్షల రూపాయల చొప్పున వసూళ్లను సాధించాయి.



ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా వైజాగ్ అత్యధికంగా 91 శాతం ఆక్యుపెన్సీతో అగ్రస్థానంలో నిలవగా, కాకినాడ 88 శాతం, విజయవాడ 80 శాతం ఆక్యుపెన్సాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు గుంటూరులో 77 శాతం, వరంగల్‌లో 76 శాతం, మహబూబ్‌నగర్‌లో 75 శాతం మేర థియేటర్లు నిండాయి. అత్యధికంగా 1,128 షోలతో నడుస్తున్న హైదరాబాద్‌లో 67 శాతం సాలిడ్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇతర రాష్ట్రాల్లో చూస్తే చెన్నైలో 39 శాతం, బెంగళూరులో 31 శాతం, ముంబైలో తెలుగు వెర్షన్‌కు 27 శాతం ఆక్యుపెన్సీ లభించింది. అయితే ఉత్తరాది మార్కెట్లయిన సూరత్, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో మాత్రం హిందీ వెర్షన్‌కు కేవలం 4 నుండి 5 శాతం ఆక్యుపెన్సీతో కాస్త మందకొడి స్పందన వచ్చింది. కాగా, హైదరాబాద్‌లోని తెలుగు హెచ్‌డిఆర్ (HDR) షోలు 100 శాతం, ఎపిక్ (EPIQ) స్క్రీన్స్ 99 శాతం ఆక్యుపెన్సీతో సరికొత్త రికార్డు సృష్టించాయి.


విడుదలకు ముందే జూన్ 4 నాటికి 'పెద్ది' చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. కేవలం భారతదేశంలోనే 3.85 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవగా, బ్లాక్ బుకింగ్స్‌తో కలిపి అడ్వాన్స్ సేల్స్ ద్వారానే 15.4 కోట్ల గ్రాస్ వసూలైంది. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, ఒక శక్తివంతమైన ప్రత్యర్థి నుండి తమ ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి క్రీడల ద్వారా గ్రామస్థులను ఒక తాటిపైకి తెచ్చే యువకుడిగా రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతి బాబు , శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. తొలిరోజు వచ్చిన అద్భుతమైన స్పందన, భారీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఈ వీకెండ్‌లో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు

  •  కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు
  • ఐఎండీ అధికారిక ప్రకటన


న్యూఢిల్లీ/తిరువనంతపురం: తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు కేరళంను తాకాయి. ఈ ఏడాది రుతుపవనాల రాక అధికారికంగా ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. దీనితో దేశంలో నాలుగు నెలల పాటు సాగే వర్షపాత కాలం ప్రారంభమైంది. సాధారణంగా జూన్ 1వ తేదీనే రుతుపవనాలు కేరళంను తాకాల్సి ఉన్నప్పటికీ, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న ఇవి ప్రవేశించాయి. ప్రస్తుతానికి ఈ రుతుపవనాలు లక్షద్వీప్, కేరళం, మాహే ప్రాంతాలను పూర్తిగా చుట్టేసి, ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి.



మరో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..

రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది. ఇవి మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, గోవా మొత్తానికి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 90 శాతం మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గడిచిన రెండు రోజులుగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయని, పశ్చిమ గాలులు బలపడ్డాయని పేర్కొంది.



భారీ వర్షాల హెచ్చరిక

గడిచిన రెండు రోజులుగా కేరళంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల పాటు కేరళంలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు (7-20 సెం.మీ) కురిసే అవకాశం ఉందని, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కనీస ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అక్కడ రాబోయే రోజుల్లో వర్షాలు , ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.

Tuesday, 2 June 2026

కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి..


  • అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రకటన
  • మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత
  • బహ్రెయిన్‌లో మోగిన ప్రమాద సైరన్లు
  • ‘కేష్మ్’ ద్వీపంపై ఎదురుదాడిని ధృవీకరించిన పెంటగాన్

మధ్యప్రాచ్యంలో  భద్రతా పరిస్థితులు ఒక్కసారిగా క్షీణించాయి. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బుధవారం కువైట్‌పై శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే రంగంలోకి దిగిన కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు (ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్స్) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, శత్రువులు పంపిన క్షిపణులను, డ్రోన్లను గాల్లోనే సమర్థవంతంగా అడ్డుకుని కూల్చివేశాయి. ఈ విషయాన్ని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ అధికారికంగా ధృవీకరించారు. స్థానికులకు వినబడిన పేలుడు శబ్దాలు తమ రక్షణ వ్యవస్థలు శత్రువుల దాడులను తిప్పికొట్టడం వల్ల వచ్చినవేనని సైనిక కమాండ్ స్పష్టం చేసింది.


ఈ దాడుల అనంతరం కువైట్ సైన్యం ప్రజలకు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది. ఆకాశం నుంచి కూలిపోయిన క్షిపణుల అవశేషాలు, శకలాలు లేదా గుర్తుతెలియని వస్తువులను ఎవరూ తాకవద్దని, వాటి వల్ల తీవ్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. ఏదైనా అనుమానాస్పద శకలాలు కనిపిస్తే వెంటనే 112 హెల్ప్‌లైన్ ద్వారా అత్యవసర సేవలకు సమాచారం అందించాలని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-ఒతైబీ ప్రజలను కోరారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక ఛానెళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.



మరోవైపు ఈ దాడుల వెనుక ఉన్న భౌగోళిక రాజకీయ కారణాలపై ఇరాన్ ప్రభుత్వ రంగ ఛానెల్ 'ఐఆర్ఐబి' (IRIB) కీలక ప్రకటన చేసింది. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి, కేష్మ్ ద్వీపంలో అమెరికా ఇటీవల చేపట్టిన చర్యలకు ప్రతిచర్యగా కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా సైనిక మౌలిక సదుపాయాలపై తాము విజయవంతంగా దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా దళాలు , ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఈ సరిహద్దు దాటిన దాడులు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.




సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ పౌరులకు అత్యవసర ఆదేశాలు!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన వేళ బహ్రెయిన్ రాజ్యంలో తీవ్ర కలకలం రేగింది. బుధవారం తెల్లవారుజామున దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ప్రమాద సూచిక సైరన్లు (వార్నింగ్ సైరన్లు) మోగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సరిహద్దుల్లో మారుతున్న భద్రతా సమీకరణాలు, గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న సైనిక దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యంత అప్రమత్తమైంది. సైరన్ శబ్దాలు వినబడిన వెంటనే పౌరులు, నివాసితులు ఎవరూ ఆందోళన చెందకుండా, తక్షణమే సురక్షితమైన ఆశ్రయ ప్రాంతాలకు లేదా భూగర్భ బంకర్లలోకి వెళ్లాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల ద్వారా అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది.



ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దేశ రక్షణే ధ్యేయంగా బహ్రెయిన్ భద్రతా బలగాలు అన్నిరకాల ముందస్తు చర్యలను ప్రారంభించాయి. ప్రజల భద్రతను పర్యవేక్షించడానికి , ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా దేశవ్యాప్తంగా రక్షణ నెట్‌వర్క్‌ను పూర్తిగా సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా దళాలు జారీ చేసే ప్రతి సూచనను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న ఎలాంటి తప్పుడు ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రజలకు స్పష్టం చేసింది. కేవలం ప్రభుత్వ అధికారిక వనరులు, అధికారిక వార్తా ఛానెళ్ల ద్వారా వచ్చే కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పొరుగున ఉన్న కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగిన కొద్దిసేపటికే బహ్రెయిన్‌లో కూడా ఈ రకమైన అత్యవసర హెచ్చరికలు జారీ కావడం గల్ఫ్ రీజియన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి అద్దం పడుతోంది.



ఇరాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టిన అమెరికా సైన్యం


మధ్యప్రాచ్యంలో ఇరాన్ జరిపిన భారీ వైమానిక దాడులను తమ దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులు, డ్రోన్ దాడులను అమెరికా సైనిక రక్షణ వ్యవస్థలు గాల్లోనే సమర్థవంతంగా తిప్పికొట్టాయని పెంటగాన్ ధృవీకరించింది. తమ సైనిక స్థావరాలతో పాటు మిత్రదేశాల రక్షణే ధ్యేయంగా ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికా వైమానిక, నౌకాదళ విభాగాలు శత్రువుల వ్యూహాలను పూర్తిగా భగ్నం చేశాయని, ఈ దాడుల వల్ల తమ దళాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది.



ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా సైన్యం ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తీసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్‌కు చెందిన ‘కేష్మ్’ (Qeshm) ద్వీపంలోని సైనిక మౌలిక సదుపాయాలపై తాము విజయవంతంగా ఎదురుదాడి జరిపినట్లు అమెరికా రక్షణ అధికారులు ధృవీకరించారు. గల్ఫ్ రీజియన్‌లో నౌకాయాన భద్రతకు విఘాతం కలిగిస్తూ, సరిహద్దు దేశాలపై దాడులకు ఉసిగొల్పుతున్న ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు అమెరికా పేర్కొంది. 


ప్రస్తుత పరిస్థితులపై అమెరికా ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. గల్ఫ్ భాగస్వామ్య దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి, అంతర్జాతీయ జలాల్లో రక్షణ కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో హై అలర్ట్ ప్రకటించిన కొద్దిసేపటికే అమెరికా ఈ రకమైన వ్యూహాత్మక ఎదురుదాడికి దిగడం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉత్కంఠను మరింత తీవ్రతరం చేసింది.

ఢిల్లీ వేదికగా ‘ఇండియా’ కూటమి కీలక భేటీ


  • హాజరుకానున్న మమతా బెనర్జీ, అభిషేక్

కోల్‌కతా: జాతీయ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 8వ తేదీన ‘ఇండియా’ కూటమి పార్టీలన్నింటితో ఒక ముఖ్యమైన సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇటీవలే మే నెలలో జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కూటమి నేతలు ఒకచోట చేరి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పరాజయం పాలై, అక్కడ 15 ఏళ్ల తమ పాలనకు ముగింపు పలికిన తరుణంలో ఈ భేటీ జరగడం గమనార్హం.



మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ నేతలపై జరుగుతున్న రాజకీయ దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్‌కతాలోని రాణి రాష్మణి అవెన్యూలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఈ నిరసనను ప్రారంభించారు. ఎంపీలు డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ సహా పలువురు సీనియర్ నేతలతో కలిసి రాజ్యాంగ ప్రతిని చేతబూని ఆమె ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇటీవల సౌత్ 24 పరగణాస్ పర్యటనలో అభిషేక్ బెనర్జీపై ఇటుకలు, రాళ్లు, గుడ్లతో జరిగిన దాడితో పాటు చండీతల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై జరిగిన హత్యాయత్నం ఘటనలను నిరసిస్తూ ఈ ధర్నా నిర్వహించారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులను బెదిరించి తృణమూల్ కాంగ్రెస్‌ను బలహీనపరచాలని కొందరు చూస్తున్నారని, కానీ ఇలాంటి చర్యల వల్ల తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్‌కతాలో తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోతే, కేంద్ర ప్రభుత్వంపై ఈ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లోకి తీసుకెళ్తామని ఆమె హెచ్చరించారు. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ జూన్ 8న జరిగే ‘ఇండియా’ కూటమి సమావేశంలో మమతా బెనర్జీ ఎలాంటి వ్యూహాన్ని పంచుకోబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం

 ఇరాన్ యుద్ధ సెగ

2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం

రూపాయి విలువపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక విశ్లేషణ!

అంతర్జాతీయంగా ఇరాన్ సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు మండుతుండటం, ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ పడిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ డి. సుబ్బారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2013 నాటి కరెన్సీ సంక్షోభ కాలంతో పోలిస్తే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, అప్పట్లో లాగా భారత్ ఇప్పుడు బలహీనమైన దేశాల జాబితాలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీటీవీ (NDTV) ప్రతినిధి గౌరీ ద్వివేదితో మాట్లాడిన ఆయన, డాలర్‌తో రూపాయి మార్పిడి విలువను మార్కెట్శక్తులకే వదిలేయాలని, దానిని కట్టడి చేయడానికి ఆర్బీఐ భారీగా నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఆయిల్ సరఫరాలో 20 శాతానికి పైగా వాటా ఉన్న హార్ముజ్ జలసంధి వద్ద పదే పదే అంతరాయాలు కలగడం వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు ఫిబ్రవరి నాటికంటే 30 శాతం పెరిగి, గరిష్టంగా బ్యారెల్‌కు 110 డాలర్ల పైకి చేరడం ప్రపంచవ్యాప్తంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచిందని ఆయన పేర్కొన్నారు.



ప్రస్తుతం డాలర్‌తో రూపాయి విలువ దాదాపు 7 శాతం క్షీణించి ఒక దశలో 97 మార్కును తాకినప్పటికీ, దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని సుబ్బారావు గుర్తుచేశారు. ముడిచమురు ధరల పెరుగుదల వల్ల దేశ చాల్తీ ఖాతా లోటు (Current Account Deficit) జీడీపీలో గత ఏడాది ఉన్న 1 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగే అవకాశం ఉన్న మాట నిజమేనని, అయితే ఈ లోటును పూడ్చడానికి రూపాయి విలువ సహజంగానే తగ్గడం (డిప్రిసియేషన్) అవసరమని ఆయన విశ్లేషించారు. ఆర్బీఐ కేవలం మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలే తప్ప, బలవంతంగా రూపాయి విలువను పెంచాలని చూస్తే అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని హెచ్చరించారు. 2013లో భారత్ తీవ్ర ద్రవ్యోల్బణం, తక్కువ వృద్ధి రేటు, పాలనాపరమైన పక్షవాతం (Policy Paralysis) వంటి సమస్యలతో 'ఫ్రైజైల్ ఫైవ్' (Fragile Five - ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థలు) లో ఒకటిగా ఉండేదని, కానీ ఇప్పుడు మన దేశ వృద్ధి రేటు బాగుందని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, అన్నింటికీ మించి మన విదేశీ మారక నిల్వలు (Forex Reserves) రికార్డుస్థాయిలో 700 బిలియన్ డాలర్లకు చేరువలో ఉన్నాయని ఆయన వివరించారు.


అయితే, ముడిచమురు ధరలు ప్రతీ 10 డాలర్లు పెరిగినప్పుడల్లా దేశ ఆర్థికవృద్ధి 20 నుండి 30 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని, ద్రవ్యోల్బణం 30 నుండి 40 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని ఆర్బీఐ అంచనాలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వృద్ధిని కాపాడుకుంటూనే, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం మరియు రూపాయిని స్థిరపరచడం అనే ఒక అసాధ్యమైన సవాల్‌ను (Impossible Trinity) కేంద్ర బ్యాంకు ఎదుర్కొంటోందని చెప్పారు. దిగుమతులను తగ్గించడానికి బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, ఎక్సైజ్ సుంకం తగ్గించి ఇంధన ధరల భారాన్ని ప్రభుత్వం పంచుకోవడం వంటి చర్యలను ఆయన అభినందించారు. ఇంధన ధరలను పెంచడం రాజకీయంగా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ, ఇలాంటి సంక్షోభ సమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకే ప్రజలు నాయకులను ఎన్నుకుంటారని పరోక్షంగా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించారు. మున్ముందు చమురు ధరలు సగటున 90 డాలర్ల వద్ద ఉన్నా సవాలు తప్పదని, భవిష్యత్ భౌగోళిక రాజకీయ అనిశ్చితిని తట్టుకోవడానికి భారత్ కేవలం వృద్ధి పైనే కాకుండా వ్యూహాత్మక ఇంధన నిల్వలను (Strategic Energy Reserves) పెంచుకుంటూ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతపై దృష్టి పెట్టాలని సుబ్బారావు సూచించారు.


ndtv.com సౌజన్యంతో..

తెలంగాణలో పోటీ చేస్తాం



ప్రాంతీయ విద్వేషాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిప్పులు

రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తనకు ఏమైనా పాస్‌పోర్ట్ అవసరమా?



హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, రాబోయే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా బరిలోకి దిగుతామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమేనని, ఇక్కడి ప్రతి సమస్యపై తాను స్వయంగా పర్యటించి గళం విప్పుతానని, ఏ అన్యాయం జరిగినా నిలదీస్తానని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేషాలు చాలా ప్రమాదకరమైనవని హెచ్చరించిన పవన్ కల్యాణ్, తెలంగాణకు రావద్దని చెప్పడానికి అసలు మీరెవరని, తెలంగాణ ఎవరికైనా వ్యక్తిగత జాగీరా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది భారతదేశమని, దేశంలో తాను ఏ ప్రాంతానికైనా ప్రయాణించవచ్చని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తనకు ఏమైనా పాస్‌పోర్ట్ అవసరమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు అనుకోలేదని, కానీ ఇప్పుడు చెబుతున్నాను. తెలంగాణలో జనసేన ఉంటుంది. తాము పోటీ చేస్తామన్నారు. అట్లనే తాను తెలంగాణ అంతటా తిరుగుతానని, సమస్యలపై పోరాడాతాను అన్నారు 


పాలకుల ఆలోచనలు, ప్రజల మనోభావాలు వేర్వేరుగా ఉంటాయని చెబుతూ, తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల సమాజాల మధ్య అనవసరమైన విభేదాలను రెచ్చగొట్టవద్దని ఆయన హెచ్చరించారు. గతంలో కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) పరిపాలన సాగిన సమయంలో కూడా తాను తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని, అనవసరమైన ఘర్షణలను సృష్టించడంపై తనకు నమ్మకం లేదని పవన్ స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను, విమర్శలను ఓపికగా భరించానని, ఇలాంటి బెదిరింపులకు తాను ఎంతమాత్రం భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక తనపై వస్తున్న భూఆక్రమణల ఆరోపణలపై స్పందిస్తూ, తాను గనుక ఏదైనా చెరువును అక్రమంగా ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే, ఆ భూమిని తక్షణమే ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు.

ఇరాన్ మోకాళ్లపై పడ్డా అమెరికాదే ఓటమి అంటారు



  • డెమొక్రాట్లు, మీడియాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం

పశ్చిమాసియా  సంక్షోభంపై అమెరికా ప్రధాన స్రవంతి మీడియా, డెమొక్రాటిక్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ ఇరాన్ దేశం అమెరికా ముందు పూర్తిగా మోకాళ్లపై పడి, లొంగిపోయినట్లు ప్రకటించినా సరే, ఇక్కడ ఉన్న మీడియా, డెమొక్రాట్లు దానిని ఇరాన్ సాధించిన అద్భుత విజయంగానే చిత్రీకరిస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో పెట్టిన పోస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులు, మీడియా సంస్థలు తన పరిపాలనపై తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇరాన్ సైన్యం తన ఆయుధాలను కిందపడేసి, తెల్లజెండా ఊపుతూ చేతులెత్తి తాము లొంగిపోతున్నామని టెహ్రాన్ వీధుల్లో కేకలు వేసినా, వారి నావికాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందని అంగీకరించినా సరే.. ఇక్కడి విపక్షాలు మారవని ట్రంప్ పేర్కొన్నారు. 'ది ఫెయిలింగ్ న్యూయార్క్ టైమ్స్', 'ది చైనా స్ట్రీట్ జర్నల్' (వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉద్దేశిస్తూ), 'టోటల్ అవినీతిమయమైన సీఎన్‌ఎన్' వంటి సంస్థలు ఇరాన్‌దే పైచేయి అయిందంటూ తప్పుడు కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తాయని మండిపడ్డారు. డెమొక్రాట్లను 'డుమాక్రాట్లు' (Dumacrats) అని సంబోధిస్తూ, వారంతా పూర్తిగా పిచ్చివాళ్లయిపోయారని, విచక్షణ కోల్పోయారని మండిపడ్డారు. ఇరాన్‌తో శాంతి చర్చలు వేగంగా సాగుతున్నాయని, తాము అనుకున్న విధంగానే అగ్రరాజ్య వ్యూహాలు ఫలించబోతున్నాయని చెబుతూనే, మీడియా దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

కొత్త దారి వెతుకుతున్న ‘సింగం’



  • బీజేపీ వీడే యోచనలో అన్నామలై
  • ఢిల్లీలో హైకమాండ్‌తో భేటీ

తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో కీలక భేటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా , తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, బీజేపీలో తనకు భవిష్యత్తు లేదని భావిస్తున్నట్లు ఆయన అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. ఇకపై రాజకీయంగా తన సొంత దారిని ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన అగ్రనాయకత్వానికి తెలియజేశారు. అయితే, మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చూసేందుకు అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జాతీయస్థాయిలో ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై స్పందించిన అన్నామలై, మరో రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ , తదుపరి రాజకీయ అడుగులపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, ఆయన ఒక నూతన ప్రాంతీయ పార్టీని లేదా జాతీయ భావజాలంతో కూడిన ఉద్యమాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఆలస్యమైనా అంకితభావానికే దక్కిన పీఠం



  • కర్ణాటక కు కాబోయే సీఎం డీకే శివకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు

బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి చేపట్టడంపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం తనను సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. తనకు ఈ పదవి దక్కడం కొంత ఆలస్యమై ఉండవచ్చు కానీ, ఎన్నడూ తిరస్కరణకు గురికాలేదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన వ్యక్తిగత విజయం కాదని, ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తకు దక్కిన గౌరవమని అభివర్ణించారు. 1979లో ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం ప్రారంభించిన తాను, దశాబ్దాలుగా నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని గుర్తుచేశారు. తన ఎదుగుదల వెనుక పార్టీ కార్యకర్తల నిరంతర శ్రమ, అండదండలు ఉన్నాయని డీకే శివకుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను క్రమశిక్షణతో నెరవేర్చానని చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ, కార్యకర్తల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని, అయితే వేడుకలను హద్దుల్లో ఉంచుకుని ప్రజాసేవకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు.


నా తెలంగాణ ఒక చరిత్ర

అరవై ఏండ్ల పోరాటం.. అమరుల త్యాగఫలం ఫలితం తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాల కంటే తెలంగాణకు భిన్నమైన చరిత్ర ఉన్నది. స్వతంత్య్రం ఏర్పడే నాటికి దేశంలో కలిసిన అనేక సంస్థానాల్లో హైదరాబాద్‌ అప్పటికే అభివృద్ధి చెంది ఉన్నది. ప్రపంచంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అట్లా అన్నిరంగాల్లో ముందున్న  హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపారు. ఒప్పందాల ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు భావ సారూప్యత లేదు. సాంస్కృతికంగా కూడా ఈ రెండు ప్రాంతాలు చాలా భిన్నమైనవి. తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటే అనే పిడివాదం తప్ప తెలంగాణకు ఆంధ్రాకు ఎప్పుడూ పోలిక లేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంతో విలీనాన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు. ఫజల్‌ అలీ కమిషన్‌ కూడా 1962 సార్వత్రిక ఎన్నికల నాటి వరకు వాయిదా ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కానీ ఆంధ్ర నేతల లాబీయింగ్‌ కు తలొగ్గిన నాటి నెహ్రూ ప్రభుత్వం కండీషన్ల మీద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.  ఆంధ్ర రాష్ట్రంతో కలుపవద్దని తెలంగాణ వాదులు ఎందుకు అన్నారో త్వరగానే తేలిపోయింది. ఒప్పందాలన్నీ తుంగలో తొక్కారు. ఇక్కడి నిధులు, నీళ్లు, నియామకాలు కొల్లగొట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అందుకే 1969 నాటికి మా రాష్ట్రం మాగ్గావాలె అని ఉవ్వెత్తున్న ఉద్యమం ఎగిసిపడింది. ఉద్యమాన్ని అణిచివేయడానికి నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 369 మందిని కాల్చివేసింది. 



ముల్కీ రూల్స్‌ చారిత్రక తీర్పులు




1969 జై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తొలిరోజుల్లో, స్థానికత రక్షణలను పటిష్ఠంగా అమలు చేసేందుకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969 జనవరి 21న ప్రతిష్టాత్మకమైన జీఓ నంబరు 36ను జారీ చేసింది. అయితే, ఈ జీఓ వెలువడక ముందే విద్యుత్ మండలి (APSEB) నియామకాలకు ముల్కీ నిబంధనలు వర్తించవని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుప్పుస్వామి తీర్పునివ్వడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు జీఓ 36 రాజ్యాంగబద్ధతను సవాలు చేయగా, హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి ఆ జీఓ చెల్లదంటూ కొట్టివేశారు. అంతేకాకుండా, తెలంగాణ వారికి ఉద్యోగ రక్షణలు కల్పించిన 1957 నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3 రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(3)కి విరుద్ధమని, ఒక రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే ప్రత్యేక నివాస అర్హతలు కల్పించడం కుదరదని స్పష్టం చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీలు చేయగా, జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి మరియు జస్టిస్ ఆవుల సాంబశివరావులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ చట్టాన్ని సమర్థిస్తూ జీఓ 36 రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందని తీర్పునిచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగించింది.


కాని ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు; ఎ.వి.ఎస్. నర్సింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఈ జీఓను సుప్రీంకోర్టులో సవాలు చేయగా, 1969 మార్చి 28న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జీఓ 36ను, 1957 చట్టంలోని సెక్షన్ 3ను రాజ్యాంగ విరుద్ధమంటూ పూర్తిగా రద్దు చేసింది. దీనితో తెలంగాణలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవగా, 1970 డిసెంబరు 9న పి. లక్ష్మణరావు కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమరయ్య నేతృత్వంలోని ఫుల్ బెంచ్ మరో కీలక మలుపు తిప్పింది. సుప్రీంకోర్టు కేవలం 1957 చట్టాన్ని మాత్రమే కొట్టివేసిందని, కాబట్టి ఆ చట్టం కంటే ముందు అమల్లో ఉన్న నిజాం కాలం నాటి పాత ముల్కీ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని తీర్పునిచ్చింది. అయితే, 1972లో వి. వెంకట్రెడ్డి కేసులో చీఫ్ జస్టిస్ ఓబుల్ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 మెజారిటీతో పాత ముల్కీ రూల్స్ చెల్లవని మళ్లీ బాంబు పేల్చింది. ఈ బెంచ్‌లో ఉన్న ఏకైక తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి మాత్రం మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ, పాత ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని తన ప్రసిద్ధ భిన్న తీర్పును రికార్డు చేశారు.


హైకోర్టు ఇచ్చిన ఈ వ్యతిరేక తీర్పుపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, దేశ అత్యున్నత న్యాయస్థానం తెలంగాణకు చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చింది. అక్టోబర్ 3, 1972న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎమ్. సిక్రీ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పును పక్కనపెట్టి, జస్టిస్ కొండా మాధవరెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించింది. రాజ్యాంగంలోని ప్రకరణ 35(బి) ప్రకారం నిజాం నాటి ముల్కీ నిబంధనలు ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తాయని మరియు అవి పూర్తిగా రాజ్యాంగబద్ధమైనవని తేల్చి చెప్పింది. ఈ చారిత్రక తీర్పుపై ఇక ఎలాంటి అప్పీలుకు అవకాశం లేకపోవడంతో, న్యాయపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయాయని, ముల్కీ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని నాటి ముఖ్యమంత్రి పి.వి. నర్సింహారావు అధికారికంగా ప్రకటించారు. ఈ తీర్పుతో ముల్కీ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ అమలు కావడం ప్రారంభమైంది. అయితే, తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ఈ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ 1972 అక్టోబర్ 18 నుంచి ఆంధ్ర ప్రాంతంలో 'జై ఆంధ్రా' ఉద్యమం ఉవ్వెత్తున ప్రారంభమైంది.



1972 నాటి నుంచి 2014 వరకు తెలంగాణ  ఉద్యమం కొనసాగింది. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో తెలంగాణ రాష్ట్రం రాజకీయ డిమాండ్‌ గా మారింది. కానీ 1996 నుంచే మేధావులు, విద్యావంతులు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం విశేష కృషి చేశారు. అందుకే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఫణికర మల్లయ్య నాటి సీఎం చంద్రబాబు నాయుడు ను మా తెలంగాణ మాకు కావాలి అని నిలదీసేంత చైతన్యం తీసుకొచ్చింది. తన జీవితకాలమంతా తెలంగాణ కోసం కొట్లాడిన ఆచార్య కొత్త పల్లి జయశంకర్‌ చెప్పినట్టు తెలంగాణపై వేసినన్ని కమిటీలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వేయలేదన్నది వందశాతం వాస్తవం.. ఫజల్‌ అలీ కమిషన్‌ మొదలు శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి వివరించిన ఏకైక వ్యక్తి . తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలున్నాయి.   ముఖ్యంగా కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష, విద్యార్థులు, సకల జనులు రోడ్లపైకి వచ్చి చేసిన 11 రోజుల ఉద్యమ (2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు) ఫలితంగా చరిత్రలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. దీంతో అప్పటివరకు జై తెలంగాణ అన్న ఆంధ్రపార్టీలన్నీ యూటర్న్‌ తీసుకున్నాయి. డిసెంబర్‌ 23 ప్రకటన నాటికి నారా చంద్రబాబు, నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిలు కలిసి ఆడిన నాటకంలో నాటి పీఆర్‌పీ అధ్యక్షుడు చిరంజీవి పాత్రధారి. అయినా తెలంగాణ ఉద్యమం ఆగిపోలేదు. పోరాటలు, వందలాది బలిదానాలు దేశ పార్లమెంటును కదిలించాయి. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ప్రజా తీర్పు ద్వారా స్పష్టమైన  సంకేతం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు ప్రత్యామ్నాయం ఏదీ లేదని తేల్చిచెప్పారు.  ఇదందా చరిత్ర. దీన్ని ఎవరూ మార్చలేరు. తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటో నిక్షిప్తమై ఉన్నది. కొత్త మతం పుచ్చుకున్న వాళ్లకు నామాలు ఎక్కువ అన్నట్టు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకున్నంత మాత్రానా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. 



రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ సమయంలో నాటి ఉద్యమనేత కేసీఆర్‌ చెప్పింది ఒక్కటే. ప్రాంతాలు విడిపోదాం. ప్రజలుగా కలిసుందాం అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఉద్వేగపూరిత ప్రసంగాలను పరిగణనలోకి తీసుకున్నకొంతమంది ఆందోళన చెందారు. కానీ పాలకుడిగా తన బాధ్యత ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అయినదానికి కానిదానికి పేచీలు పెట్టినా పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించారు. శాంతిభద్రల విషయంలో రాజీ పడలేదు. అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. దాని ఫలితంగా మొదటి రెండు ఎన్నికల్లోనే కాదు 2023 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్‌ నాయకత్వానికి జనాలు జై కొట్టారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం జరుగుతున్నది. ఇచ్చిన హామీ సంగతి అటుంచితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే అనేక ప్రయత్నాలు రేవంత్‌ ప్రభుత్వం చేసింది. అందుకే మళ్లీ తెలంగాణ సమాజం నినదిస్తున్నది. తెలంగాన అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రజాసంఘాలు, ప్రజలు మళ్లీ పోరు బాట పట్టారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ పవన్‌ కల్యాణ్‌ లాంటి వాళ్లు దానిని ఎదుర్కోలేక తెలంగాణపై దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు పొద్దున లేస్తే తానే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని గప్పాలు కొడుతుంటారు. మరి ఈ పుష్కరకాలంలో అమరావతిలో ఒక సచివాలయాన్ని ఎందుకు నిర్మించలేదు అంటే సమాధానం ఉండదు. హైదరాబాద్‌ కు శతాబ్దాల చరిత్ర ఉన్నది. అది ఒక స్వతంత్ర దేశంగా ఉన్న నాటి నుంచి వెల్లడి పాలనా కాలంలో, ఆ తర్వాత స్వరాష్ట్రంగా, అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్నా నాటి అభివృద్దికి కొనసాగింపు మాత్రమే. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ పదాన్ని నిషేధించిన చోటనే జై తెలంగాణ అనిపించిన ఘనత  తెలంగాణ ఉద్యమానిది. నాటి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయిన నాటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక రాజధాని. దాన్ని నెరవేర్చే ప్రయత్నం అక్కడి పాలకులు ఇప్పటికీ చేయలేదు. కాగితాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కనిపిస్తుంది. ముందు అక్కడి ప్రజల ఆకాంక్ష అయిన రాజధాని నిర్మాణం, హైదరాబాద్‌ లాంటి నగర నిర్మాణం కోసం కృషి చేయాలి. అంతేగాని తెలంగాణ పై దండయాత్ర చేస్తే రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు.  చివరగా తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరకులకు జోహర్లు. ఆచార్య కొత్త పల్లి జయశంక్‌ సార్‌కు జోహార్లు. తెలంగాణ కోసం దశాబ్దాల పాటు కొట్లాడిన ప్రజలకు జేజేలు. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. 


Sunday, 31 May 2026

'ఈ ఆర్‌సీబీ జట్టుతో ప్రతిసారీ నేనే గెలిపించాల్సిన అవసరం లేదు'

 




  • సహచరుల సత్తాను కొనియాడిన రన్ మెషీన్!
  • కింగ్ కోహ్లీ భావోద్వేగం

అహ్మదాబాద్: ఐపీఎల్ (IPL 2026) ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా జట్టు అంచనాల భారాన్ని ఒంటరిగా మోస్తూ వచ్చిన తనకు, ప్రస్తుత ఆర్‌సీబీ జట్టులో ఆడటం ఎంతో ఊరటనిస్తోందని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ జట్టులో మ్యాచ్‌లను ఒంటరి చేత్తో గెలిపించగల ఎందరో వీరులు ఉన్నారని, కాబట్టి ప్రతి మ్యాచ్‌లోనూ తానే ముందుండి జట్టును నడిపించాల్సిన అవసరం లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేశారు. తాము మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు తమకు అండగా నిలిచే ఆటగాళ్లు చుట్టూ ఉన్నారనే నమ్మకం కలిగిస్తోందని, అందుకే ఈ సీజన్‌లో తమ జట్టులో వేర్వేరు ఆటగాళ్లకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు దక్కాయని కోహ్లీ గుర్తుచేశారు.


ప్రపంచ స్థాయి బౌలింగ్ సత్తా.. సమతుల్యతే ఆర్‌సీబీ బలానికి కారణం

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ సమష్టి ప్రదర్శనను కోహ్లీ ప్రత్యేకంగా అభినందించారు. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లతో పాటు ఎప్పుడూ నమ్మదగిన క్రునాల్ పాండ్యా మరియు ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన రసిఖ్ సలామ్ దార్ రూపంలో బలమైన బౌలింగ్ విభాగం తమకు ఉందన్నారు. అలాగే బ్యాటింగ్ విభాగంలోనూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్‌సీబీ జట్టులో అద్భుతమైన సమతుల్యత (Balance), తిరుగులేని బలం ఉన్నాయని, మైదానంలో జట్టు ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసానికి ఇదే ప్రధాన కారణమని కోహ్లీ వివరించారు. లీగ్ దశలో తాము పట్టికలో అగ్రస్థానంలో నిలవడానికి గల కారణాన్ని ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆటగాళ్ల పరిణతి , ప్రశాంతత మరోసారి నిరూపించాయని కొనియాడారు.


ముంబై ఇండియన్స్‌పై సాధించిన ఆ క్లోజ్ విక్టరీనే టర్నింగ్ పాయింట్

గతేడాది ఫైనల్‌తో పోలిస్తే ఈసారి ఒత్తిడి చాలా తక్కువగా అనిపించిందని కోహ్లీ వెల్లడించారు. తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే టోర్నీలోనే అత్యుత్తమ జట్టు మనదేనని ఆటగాళ్లకు ముందే చెప్పానని ఆయన పేర్కొన్నారు. టోర్నీ మధ్యలో వచ్చిన చిన్న విరామం తర్వాత ఒక మ్యాచ్‌లో ఓడిపోవడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ, రాయ్‌పూర్‌లో ముంబై ఇండియన్స్‌పై సాధించిన ఉత్కంఠ భరిత విజయం జట్టులో తిరిగి బలమైన నమ్మకాన్ని నింపిందని కోహ్లీ గుర్తుచేసుకున్నారు. ఆ విజయం తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సాధించిన ఘన విజయంతో పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుని, అదే జోష్‌తో ఫైనల్‌కు దూసుకొచ్చి చాంపియన్స్‌గా నిలిచామని ఆర్‌సీబీ రన్ మెషీన్ సగర్వంగా ప్రకటించారు.

కింగ్ కోహ్లీ వీరోచిత పోరాటం


  • గుజరాత్‌ను మట్టికరిపించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్‌సీబీ!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ (IPL 2026) మహా సంగ్రామంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT) పై ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో అండగా నిలిచాడు. మ్యాచ్ మధ్యలో గాయపడినప్పటికీ వెనకడుగు వేయకుండా, తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులు చేసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి ఆర్‌సీబీని గెలిపించాడు.




  • పవర్‌ప్లేలోనే కుప్పకూలిన గుజరాత్ టాప్ ఆర్డర్.. రాణించిన వాషింగ్టన్ సుందర్

అంతకుముందు టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, అతని నిర్ణయాన్ని బౌలర్లు పూర్తిగా సమర్థించారు. పవర్‌ప్లేలోనే గుజరాత్ టైటాన్స్ ప్రమాదకర ఓపెనర్లు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరియు సాయి సుదర్శన్‌లను పెవిలియన్ చేర్చి ఆర్‌సీబీ బౌలర్లు కోలుకోలేని దెబ్బతీశారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. తనకు లభించిన లైఫ్‌లైన్‌ను చక్కగా ఉపయోగించుకున్న సుందర్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లతో చెలరేగగా, జోష్ హేజిల్‌వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది.

Saturday, 30 May 2026

అభిషేక్ బెనర్జీపై కోడిగుడ్లతో దాడి


  • గాయపడిన అభిషేక్ ను ఆసుపత్రికి తరలింపు
  • బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింస, ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ 24 పరగణాల పరిధిలోని సోనార్‌పూర్‌లో ఎన్నికల అనంతర హింసలో ప్రాణాలు కోల్పోయిన తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికులు తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. ఆయనను చుట్టుముట్టిన నిరసనకారులు నెట్టివేస్తూ, ఆయనపై కోడిగుడ్లు విసిరి, "చోర్.. చోర్" (దొంగ.. దొంగ) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ తోపులాటలో గాయపడిన అభిషేక్ బెనర్జీని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన మేనత్త, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు.




హెల్మెట్ ధరించినా తప్పని ముట్టడి

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెల్లటి చొక్కా, భద్రత కోసం క్రికెట్ హెల్మెట్ ధరించిన అభిషేక్ బెనర్జీ.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనసముద్రం మధ్య నడుస్తుండగా, జనం ఆయనను చుట్టుముట్టి నెట్టేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి చేదాటిపోవడంతో రక్షణ కవచాలు ధరించిన పోలీసులు అక్కడికి చేరుకుని, ఎలాగోలా ఆయనను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. "ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి. నన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఇక్కడ కనీసం పోలీసులు కూడా లేరు. బాధితుల కుటుంబాలకు రక్షణ కల్పించే వరకు నేను ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లను" అని అభిషేక్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.


బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు: కౌంటర్ ఇచ్చిన అధికార పక్షం

ఈ దాడి వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న టీఎంసీ ఆరోపణలను ఆ పార్టీ బెంగాల్ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య పూర్తిగా కొట్టిపారేశారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో టీఎంసీ సాగించిన అరాచక పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి, కోపానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హింస బాధితులను పరామర్శించే నైతిక హక్కు టీఎంసీకి లేదని విమర్శించారు. మరోవైపు, టీఎంసీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ, దేశంలోనే రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతపై బీజేపీ మద్దతుదారులు ఈ దారుణానికి ఒడిగట్టారని, ఓట్ల లెక్కింపు రోజునే ఆయన భద్రతను ఎందుకు ఉపసంహరించుకున్నారో కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


నేతల తిరుగుబాటు.. మారుతున్న బెంగాల్ రాజకీయాలు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 208 స్థానాల భారీ మెజారిటీతో తొలిసారిగా ఒంటరిగా అధికారంలోకి రాగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. స్వయంగా మమతా బెనర్జీ కూడా భవానీపూర్ స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఈ ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. పార్టీలోని అవినీతి, వసూళ్ల వల్లే ప్రజలు తమకు ఈ తీర్పు ఇచ్చారని సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితమే దమ్ దమ్ ఎంపీ సౌగతా రాయ్‌ను కూడా స్థానిక ప్రజలు నిలదీశారు. దశాబ్దాలుగా బెంగాల్‌లో సాగిన కుంటుపడిన పరిపాలన, శాంతిభద్రతల క్షీణత, మహిళల భద్రత లోపించడం వల్లే ప్రజల్లో ఈ స్థాయి నిగూఢ ఆగ్రహం వెల్లువెత్తిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు

 ఎడారి రాష్ట్రంలో ఇసుక తుపాను బీభత్సం: ఒక్కసారిగా కమ్ముకున్న చిమ్మచీకట్లు
రాజస్థాన్ రాష్ట్రాన్ని భీకర ఇసుక తుపాను  వణికించింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులకు దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో పగటిపూటే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఈ ఊహించని ప్రకృతి పరిణామంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్‌, బికనీర్‌, సీకర్‌ తదితర ప్రాంతాలపై ఈ ఇసుక తుపాను తీవ్ర ప్రభావం చూపింది. నిమిషాల వ్యవధిలోనే వందల అడుగుల ఎత్తున ఇసుక గోడల తరహాలో మేఘాలు దూసుకురావడంతో దారిపొడవునా ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తమ వాహనాల లైట్లు వేసుకుని రోడ్లపైనే నిలిపివేయాల్సి వచ్చింది. ఇసుక తుపాను సృష్టించిన ఈ బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి.

వెనువెంటనే భారీ వర్షం
ఇసుక గాలులు వీచిన కాసేపటికే వాతావరణం పూర్తిగా చల్లబడి ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంతకుముందు శుక్రవారం కూడా రాజధాని జైపుర్‌ సహా పలు ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణం కనిపించింది. రాష్ట్రంలోని ధోల్‌పుర్‌ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఇసుక తుపాను తెచ్చిన ముప్పుతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

మరో ఐదు రోజులు అలర్ట్
రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని జైపుర్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జైపుర్‌, అజ్‌మేర్‌, బికనీర్‌, కోటా, జోధ్‌ఫుర్‌, ఉదయ్‌పుర్‌ డివిజన్లలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.


సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి


  • ఫలితాల వేళ 50 మంది విద్యార్థుల అక్రమ ప్రవేశం

కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) అధికారిక వెబ్‌సైట్ , పోర్టల్ ఇటీవల  సైబర్ దాడికి గురైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యే కీలక సమయంలో ఈ హ్యాకింగ్ ప్రయత్నం జరగడం విద్యా రంగంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటన వెనుక బాహ్య శక్తుల ప్రమేయం ఉండటంతో పాటు సుమారు 50 మంది విద్యార్థులు అక్రమ మార్గాల్లో సిస్టమ్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం.



  • ఫలితాల డేటాను మార్చేందుకు కుట్ర

పరీక్షల ఫలితాల ప్రకటనకు ముందే సీబీఎస్ఈ అంతర్గత సర్వర్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారు. వెబ్‌సైట్‌ను స్తంభింపజేయడం లేదా ఫలితాల డేటాను తారుమారు చేయడం వీరి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 50 మంది విద్యార్థులు అనధికారికంగా బోర్డు భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. వీరు తమ మార్కులను పెంచుకోవడానికి లేదా ఫలితాలను ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే బోర్డు వద్ద ఉన్న అధునాతన ఐటీ భద్రతా వ్యవస్థలు ఈ చొరబాటును సకాలంలో గుర్తించి హెచ్చరించడంతో పెద్ద ముప్పు తప్పిందని తెలుస్తోంది.


  • రంగంలోకి సైబర్ క్రైమ్ విభాగాలు

ఈ సైబర్ దాడి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సీబీఎస్ఈ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. భద్రతా లోపాలను సరిచేయడంతో పాటు ఈ చొరబాటుకు కారణమైన ఐపీ అడ్రస్‌లను  గుర్తించే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దీనిపై సమగ్ర విచారణ ప్రారంభమైంది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవస్థలోకి ప్రవేశించిన సదరు 50 మంది విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు హెచ్చరించాయి. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక దాడులు పునరావృతం కాకుండా ఉండేందుకు పోర్టల్ భద్రతను మరింత బలోపేతం చేశామని, విద్యార్థుల డేటా అంతా సురక్షితంగానే ఉందని బోర్డు స్పష్టం చేసింది. 

భారత్‌ లో పేలుళ్లకు కుట్ర భగ్నం


  •  ఐఎస్‌ఐ, దావూద్ అనుచరులైన తొమ్మిది మంది ముష్కరుల అరెస్ట్

భారతదేశంలో మరోసారి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన ఒక భారీ కుట్రను భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్న తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భారీ దాడులకు వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


  • కీలక స్థావరాలే లక్ష్యంగా కుట్ర

అరెస్ట్ అయిన నిందితులు ఢిల్లీ, ముంబై, పంజాబ్ ప్రాంతాలకు చెందినవారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలను, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలు, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనేది వీరి ప్రధాన ఉద్దేశమని దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు , పవర్ గ్రిడ్‌లను ధ్వంసం చేయడానికి వీరు జాబితాను సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ ఉగ్రవాద ముఠా కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచినట్లు తెలిపిన అధికారులు.. వీరికి సరిహద్దుల అవతల నుంచి అందుతున్న నిధులు, విదేశీ హ్యాండ్లర్ల పాత్రపై ప్రస్తుతం లోతుగా విచారణ జరుపుతున్నారు.



  • హై అలర్ట్‌లో దేశ రాజధాని

ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాలు, సెంట్రల్ ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, వాహన ఆధారిత ఐఈడీ పేలుళ్లు, కాల్పులతో సమన్వయ దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. అన్నిజిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర పారామిలటరీ దళాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


గత ఏడాది ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 15 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక అన్సార్ గజ్వతుల్ హింద్ అనే అల్-ఖైదా అనుబంధ సంస్థకు చెందిన 'వైట్ కాలర్' ఉగ్రవాద ముఠా హస్తం ఉన్నట్లు తేలింది. ఫరీదాబాద్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాశ్మీరీ వైద్యుడు ఉమర్-ఉన్-నబితో పాటు ముజమ్మిల్ షకీల్ గనాయ్, అదీల్ అహ్మద్ రాథర్, ముజఫర్ అహ్మద్ రాథర్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే మరియు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షాహీన్ సయీద్ వంటి విద్యావంతులు ఆ ముఠాలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత అరెస్టుల నేపథ్యంలో పాత ముఠాలకు, తాజా కుట్రకు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

భార్య వేధింపులు తట్టుకోలేక, న్యాయం జరగక...


  • కారుణ్య మరణం ప్రసాదించాలంటూ సూరత్ వ్యక్తి వేడుకోలు

సూరత్:గుజరాత్‌లోని సూరత్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన భార్య పెడుతున్న మానసిక, చట్టపరమైన వేధింపులను తట్టుకోలేక, అధికారులు తన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిరీట్ పటేల్ అనే వ్యక్తి తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ సూరత్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.



మహిళా చట్టాల దుర్వినియోగం 

కిరీట్ పటేల్ తన దరఖాస్తులో తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. చిన్నపాటి గృహ వివాదాల తర్వాత కూడా ఆమె కావాలనే గొడవలను పెద్దవి చేసి, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తూ తనపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపణలు గుప్పించాడు. భార్య, అత్తమామలు, ఆమె బంధువులు తనను నిరంతరం డబ్బుల కోసం వేధిస్తున్నారని, గృహ హింస , భరణం కేసుల ద్వారా తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నాడు. అంతేకాకుండా, తమ ఇద్దరికీ ఇది మూడో వివాహమని చెబుతూ.. తన భార్య ఒక దోపిడీ పెళ్లికూతురు అని ఆరోపించాడు. గతంలో కూడా ఆమె తన మాజీ భర్తల నుంచి చట్టపరమైన చర్యలు , ఆర్థిక డిమాండ్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిందని, వివాహ బంధాన్ని కేవలం డబ్బు సంపాదించే మార్గంగా వాడుకుంటోందని తెలిపాడు.


బిడ్డకు ప్రాణాపాయం ఉన్నా స్పందించని పోలీసులు

తన మునుపటి వివాహం ద్వారా కలిగిన కుమారుడికి తన ప్రస్తుత భార్య వల్ల ప్రాణాపాయం ఉందని, ఆమె ఆ బాబుకు హాని చేయడానికి ప్రయత్నించిందని పటేల్ ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు ఎటువంటి ఎఫ్ఐఆర్  నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని తెలిపాడు.


పురుషులకు చట్టపరమైన రక్షణ ఏది?

కుటుంబ వివాదాల్లో పురుషులకు లభించే చట్టపరమైన రక్షణలపై పటేల్ తన దరఖాస్తులో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కేవలం హామీలే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి న్యాయం జరగడం లేదని వాపోయాడు. ఈ నిరంతర వేధింపులు, చట్టపరమైన వివాదాల నుంచి బయటపడటానికి తనకు చావు ఒక్కటే మార్గంగా కనిపిస్తోందని, అందుకే జిల్లా కలెక్టర్‌కు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు సమర్పించానని స్పష్టం చేశాడు. అంతేకాదు, నిర్దేశిత సమయంలోగా తన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయకపోతే తానే ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించాడు.ప్రస్తుతానికి ఈ ఆరోపణలపై అధికారుల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. 

Wednesday, 27 May 2026

నన్ను ఎవరూ తొలగించలేదు, అవన్నీ వదంతులే


  • ప్రధాని మోడీపై వ్యాఖ్యల వల్లే 'ఇండియన్ ఐడల్ 16' నుంచి అవుట్ అన్న వార్తలపై విశాల్ దద్లానీ క్లారిటీ


ముంబై: ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ తనపై సోషల్ మీడియాలో వస్తున్న  వార్తను తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీడింగ్ సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ 16' (Indian Idol 16) నుంచి ఆయనను జడ్జిగా తొలగించారంటూ కొన్నిరోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వార్తలపై ఆయన ఎట్టకేలకు నోరు విప్పారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఇటీవల తాను చేసిన కొన్ని రాజకీయ వ్యాఖ్యల (Remark on PM Modi) కారణంగానే, ఛానెల్ యాజమాన్యం మరియు షో నిర్వాహకులు ఆయనపై వేటు వేసి షో నుండి బయటకు పంపించేశారనే వాదనలను విశాల్ దద్లానీ ముక్కుసూటిగా తోసిపుచ్చారు. అవన్నీ కేవలం కొందరు కావాలనే సృష్టించిన కల్పిత పుకార్లని, ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.



ఈ వివాదాస్పద వైరల్ పోస్టులపై విశాల్ దద్లానీ స్పందిస్తూ.. "ఇండియన్ ఐడల్ షోతో నా బంధం ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా నేను ఈ వేదికతో కలిసి ప్రయాణిస్తున్నాను. నన్ను షో నుంచి తొలగించారనే వార్త పూర్తిగా నిరాధారం. నా వ్యక్తిగత సంగీత కచేరీలు (మ్యూజిక్ కాన్సెర్ట్స్), కొత్త సినిమాల కంపోజిషన్ షెడ్యూల్స్ వల్ల కొన్ని ఎపిసోడ్‌ల చిత్రీకరణకు నేను అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ప్రచారాలకు తెరలేపారు. దీనికి రాజకీయ రంగు పులమడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. షో నిర్వాహకులకు, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు, భవిష్యత్తులో కూడా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది" అని రూమర్లకు గట్టి సమాధానం ఇచ్చారు.


సంగీత ప్రపంచంలోనే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై కూడా సోషల్ మీడియాలో ముక్కుసూటిగా స్పందించే స్వభావం ఉన్న విశాల్ దద్లానీ.. గతంలోనూ పలుమార్లు ఇటువంటి వివాదాలను ఎదుర్కొన్నారు. అయితే ఈసారి ఏకంగా ఆయన జీవనోపాధి , బుల్లితెర క్రేజ్‌ను దెబ్బతీసేలా 'ఇండియన్ ఐడల్' నుండి తొలగింపు వార్తలు రావడంతో ఆయన అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు స్వయంగా విశాల్ ఈ వదంతులపై అధికారిక వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి పూర్తి స్థాయిలో తెరపడినట్లయింది. సోనీ టీవీ యాజమాన్యం కూడా ఈ ఉదంతంపై అంతర్గతంగా స్పందిస్తూ.. విశాల్ దద్లానీ తమ షోలో ఒక కీలక భాగమని, ఆయన స్థానాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

‘చునరీ చునరీ’ పాట ఈరోజుకూ సూపర్ హిట్టే!

  •  వరుణ్ ధావన్‌పై విమర్శల దుమారం
  • బాలీవుడ్ హీరోకు అండగా నిలిచిన మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్



ముంబై: బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అను మాలిక్.. యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు మద్దతుగా నిలిచారు. ఇటీవల ఒక వేదికపై వరుణ్ ధావన్ చేసిన డ్యాన్స్ ప్రదర్శన , బాలీవుడ్ ఐకానిక్ హిట్ సాంగ్ 'చునరీ చునరీ' (Chunnari Chunnari) రీమిక్స్ వెర్షన్‌పై నెటిజన్లు, విమర్శకులు సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తుండటంతో అను మాలిక్ గట్టిగా స్పందించారు. 1999లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'బీవీ నెం.1' (Biwi No.1) లోని ఈ ఒరిజినల్ సాంగ్‌కు తానే సంగీతం అందించానని గుర్తుచేసిన ఆయన.. దశాబ్దాలు గడిచినా ఈ పాట క్రేజ్ అస్సలు తగ్గలేదని, నేటికీ ఈ గానా ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ హిట్ ఆంథమ్‌గా నిలిచిందని స్పష్టం చేశారు.



ఈ వివాదంపై అను మాలిక్ స్పందిస్తూ.. "చునరీ చునరీ పాట విడుదలై 25 ఏళ్లకు పైగా అవుతున్నా, ఇప్పటికీ పెళ్లిళ్లు, పార్టీలు, పబ్‌లలో ఈ పాట ప్లే చేయకుండా ఏ ఈవెంట్ పూర్తి కాదు. సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్ అలరించిన ఈ ఒరిజినల్ సాంగ్ ఒక క్లాసిక్. అయితే వరుణ్ ధావన్ లాంటి నటుడు ఈ తరం శైలికి తగ్గట్టుగా దాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు విమర్శించడం సరికాదు. వరుణ్ ఒక అద్భుతమైన డ్యాన్సర్, గొప్ప ఎనర్జీ ఉన్న నటుడు. క్లాసిక్ పాటలను కొత్తగా ప్రెజెంట్ చేసినప్పుడు భిన్నమైన స్పందనలు రావడం సహజం, కానీ కేవలం విమర్శల కోసమే వరుణ్‌ను టార్గెట్ చేయడం తగదు. ఈ పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్" అని వరుణ్ ధావన్ వెనూక నిలిచారు.



ఈ రీమిక్స్ సాంగ్‌లో సంగీత విలువలను తగ్గించేశారంటూ నెటిజన్లు చేస్తున్న ఆరోపణలను కూడా అను మాలిక్ కొట్టిపారేశారు. కొత్తదనంతో కూడిన ప్రయోగాలు చేసినప్పుడు పాత తరం అభిమానులకు కొంత అసంతృప్తి ఉండొచ్చని, కానీ యువత ఈ బీట్స్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వరుణ్ ధావన్ కూడా అను మాలిక్ ఇచ్చిన ఈ మద్దతుపై స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తాజా పరిణామంతో బాలీవుడ్ క్లాసిక్ సాంగ్స్ రీమిక్స్ ట్రెండ్‌పై పరిశ్రమలో , సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

'చున్నరి చున్నరి' రీమేక్‌పై ఒరిజినల్ సింగర్ అభిజీత్ నిప్పులు


  •  ఆ పాట పాడి వరుణ్ ధావన్ ఎప్పటికీ సల్మాన్ ఖాన్ కాలేడు!


ముంబై: బాలీవుడ్‌లో పాత ఐకానిక్ హిట్ పాటలను రీమిక్స్ చేసే ట్రెండ్‌పై మరోసారి తీవ్ర వివాదం చెలరేగింది. 1999 లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'బీవీ నెం. 1' లోని సూపర్ హిట్ సాంగ్ ‘చున్నరి చున్నరి’ (Chunnari Chunnari) ని.. వరుణ్ ధావన్ నటిస్తున్న తాజా చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' కోసం రీమేక్ చేశారు. ఈ రీమిక్స్ వర్షన్‌పై ఒరిజినల్ పాటను పాడిన ప్రముఖ సీనియర్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సరికొత్త రీమేక్ పాటను ఆయన ఒక 'భజన'తో పోల్చడమే కాకుండా, హీరో వరుణ్ ధావన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో అభిజీత్ మాట్లాడుతూ.. ఒరిజినల్ ‘చున్నరి చున్నరి’ అనేది ఎంతో ఎనర్జిటిక్, రొమాంటిక్ ట్రాక్ అని, కానీ తాజా రీమేక్‌లో దాన్ని పూర్తిగా మార్చేసి ఒక భజన పాటలా తయారు చేశారని ఎద్దేవా చేశారు.



వరుసగా రీమేక్ సినిమాలు, పాత హిట్ పాటలనే నమ్ముకుంటున్న వరుణ్ ధావన్ వైఖరిని అభిజీత్ తీవ్రంగా తప్పుపట్టారు. "వరుణ్ ధావన్ కేవలం సెకండ్ హ్యాండ్ (రీమేక్) సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ముఖ్యంగా అతని తండ్రి డేవిడ్ ధావన్ గతంలో దర్శకత్వం వహించిన ఒరిజినల్ హిట్ సినిమాలను, అప్పట్లో హిట్టయిన పాటలను మాత్రమే తిరిగి వాడుకుంటున్నాడు. నా పాటలను రీమేక్ చేసినంత మాత్రాన వరుణ్ ధావన్ ఎప్పటికీ సల్మాన్ ఖాన్ కాలేడు. సల్మాన్ ఖాన్‌కు, వరుణ్ ధావన్‌కు మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది" అంటూ అభిజీత్ భట్టాచార్య ఘాటుగా విమర్శించారు. ఒకప్పటి రైజింగ్ స్టార్ అయిన సల్మాన్ కెరీర్‌లో ‘చున్నరి చున్నరి’ ఒక అతిపెద్ద మైలురాయి అని, ఆ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉందని ఆయన గుర్తుచేశారు.


ఈ ఐకానిక్ సాంగ్‌ను రీక్రియేట్ చేసే ముందు కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఆ చిత్ర నిర్మాతలు గానీ, సంగీత దర్శకులు గానీ తనను సంప్రదించలేదని అభిజీత్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనతో మాట్లాడే ధైర్యం కూడా వారికి లేకపోయిందని విమర్శించారు. అయితే, ఒక రకంగా ఈ కొత్త పాటలో తను భాగం కాకపోవడమే మంచిదైందని, లేదంటే ఆ పాటకున్న క్రేజ్, వారసత్వం దెబ్బతినేదని ఆయన అభిప్రాయపడ్డారు. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ లపై చిత్రీకరించిన ఈ రీమిక్స్ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే నెటిజన్ల నుండి కూడా తీవ్ర ప్రతికూల స్పందనను ఎదుర్కొంది. ఒరిజినల్ పాటలోని మ్యాజిక్‌ను, అనురాధ శ్రీరామ్ , అభిజీత్ గాత్రాలకున్న ప్రత్యేకతను ఈ రీమిక్స్ పూర్తిగా చెడగొట్టిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

భారత క్రీడా రంగంలో తీరని లోటు

 భారత క్రీడా రంగంలో తీరని లోటు

 ఆసియా క్రీడల తొలి షూటింగ్ స్వర్ణ విజేత, దిగ్గజ క్రీడా అడ్మినిస్ట్రేటర్ రాజా రణధీర్ సింగ్ కన్నుమూత!


న్యూఢిల్లీ: భారత క్రీడా ప్రపంచంలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ షూటింగ్ దిగ్గజం, ఒలింపియన్ మరియు అంతర్జాతీయ క్రీడా నిర్వాహకుడు రాజా రణధీర్ సింగ్ (79) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, దిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన నివాసంలోనే బుధవారం (మే 27, 2026) ఆఖరి శ్వాస విడిచారు. ఆసియా క్రీడల (Asian Games) చరిత్రలో షూటింగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించిన  వీరుడిగా రణధీర్ సింగ్ క్రీడా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన మరణవార్తను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) సెక్రటరీ జనరల్ రాజీవ్ భాటియా తీవ్ర విచారంతో అధికారికంగా ధ్రువీకరించారు. రణధీర్ సింగ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, ప్రముఖులు తీవ్ర సెంతాపాన్ని ప్రకటిస్తున్నారు.



పటియాలా రాజకుటుంబానికి చెందిన రణధీర్ సింగ్.. కేవలం మైదానంలోనే కాకుండా, మైదానం వెలుపల కూడా క్రీడల అభివృద్ధికి దశాబ్దాల పాటు నిరుపమానమైన సేవలు అందించారు. 1978లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడల 'ట్రాప్ షూటింగ్' విభాగంలో ఆయన సాధించిన స్వర్ణ పతకం.. భారత షూటింగ్ రంగానికి ఒక సరికొత్త దిశను చూపింది. ఆ ఘనతకు గానూ 1979లో ఆయన ప్రతిష్టాత్మక 'అర్జున అవార్డు'ను అందుకున్నారు. ఒక అథ్లెట్‌గా ఆయన ఏకంగా ఐదుసార్లు ఒలింపిక్స్ (1968 మెక్సికో, 1972 మ్యూనిచ్, 1976 మాంట్రియల్, 1980 మాస్కో, 2014 లాస్ ఏంజెల్స్) లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించారు. 1994లో క్రీడా జీవితం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, ఆయన క్రీడా పరిపాలనా రంగంలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తిని ఇనుమడింపజేశారు.


ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సెక్రటరీ జనరల్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన రణధీర్ సింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) లో కూడా కీలక సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024లో ఆయన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడిగా ఎన్నికై, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఇటీవలి కాలంలో ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. భారతదేశంలో 2010 కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించడంలో కూడా ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. రణధీర్ సింగ్ క్రీడా వారసత్వాన్ని ఆయన కుమార్తె రాజేశ్వరి సింగ్ కూడా కొనసాగిస్తూ ట్రాప్ షూటింగ్‌లో అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నారు. రణధీర్ సింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, భారత మరియు ఆసియా క్రీడారంగంలో ఆయన వదిలివెళ్లిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని క్రీడా వర్గాలు కొనియాడాయి.

ఎండల తీవ్రతపై ప్రధాని మోడీ ముందస్తు హెచ్చరికలు

  •  ఎండల తీవ్రతపై ప్రధాని మోడీ ముందస్తు హెచ్చరికలు
  •  ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 45 నగరాలు మన దేశంలోనే!


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో భారతదేశం అగ్నిగుండంగా మారుతుండటంతో తీవ్రమైన వడగాల్పుల (హీట్‌వేవ్) ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం దేశ ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యధిక వేడి నమోదైన మొదటి 45 నగరాలు భారతదేశంలోనే ఉండటం, అవన్నీ కూడా 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేయడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు విపరీతమైన ఎండలతో అల్లాడుతున్నాయని, దీనివల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధాని మోడీ తన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలంతా సాధ్యమైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఎండలో బయట పనిచేసే కూలీలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.



దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలోనే గత వారం వడదెబ్బ కారణంగా కనీసం 16 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ శాఖ (IMD) లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని బందా నగరంలో మంగళవారం అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని దిల్లీలో కూడా బుధవారం మధ్యాహ్నానికి ఎండలు 40 డిగ్రీలను తాకాయి. ఈ విపరీతమైన ఎండల కారణంగా నదులు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి నీటి కొరత సమస్యలు తలెత్తుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నీటి సంక్షోభం ముంచుకొస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది. పగటిపూట నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు, రాత్రి వేళల్లో కూడా కనీస ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలకు అస్సలు ఉపశమనం లభించడం లేదు.


వాతావరణ మార్పుల (క్లైమేట్ చేంజ్) కారణంగానే ఈ వడగాల్పుల తీవ్రత , కాలవ్యవధి పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు అడవుల్లో కార్చిచ్చులకు కూడా కారణమవుతున్నాయి. హిమాలయ పర్వత ప్రాంతంలోని కసౌలి కొండల వద్ద చెలరేగిన భారీ అడవి మంటలను అదుపు చేయడానికి భారత సైన్యం, వాయుసేన హెలికాప్టర్ల సహాయంతో దాదాపు 16 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. రుతుపవనాల రాకకు ముందే దేశాన్ని వణికిస్తున్న ఈ ఎండల తీవ్రత జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా 2016 లో రాజస్థాన్‌లోని ఫలోడిలో 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైన రికార్డు ఉంది.

గాల్లో ఎనిమిది గంటల ప్రయాణం.. చైనా గగనతలం నుంచి యూ-టర్న్

 గాల్లో ఎనిమిది గంటల ప్రయాణం

చైనా గగనతలం నుంచి యూ-టర్న్

సాంకేతిక లోపంతో ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఒక భయానక, నరకప్రాయమైన అనుభవం ఎదురైంది. దాదాపు 230 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఆ విమానం.. గాల్లో ఏకంగా ఎనిమిది గంటల పాటు ప్రయాణించిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మే 27 బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన విమానయాన రంగంలో తీవ్ర కలకలం రేపింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ173 (AI173) నంబర్ గల బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత, చైనా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన సమయంలో విమానంలో ఒక తీవ్రమైన సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించారు. విమాన భద్రతా నిబంధనల ప్రకారం ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడం ప్రమాదకరమని భావించిన క్రూ సిబ్బంది, చైనా ఆకాశం నుంచే విమానాన్ని వెనక్కి మళ్లించారు.



ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని పూర్తిగా ఎయిర్ ఇండియా రక్షణ ప్రమాణాల ప్రకారం సాంకేతిక తనిఖీల కోసం పంపినట్లు యాజమాన్యం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల , సిబ్బంది భద్రతే తమకు అన్నింటికంటే 'అత్యంత ప్రాధాన్యం' అని సంస్థ స్పష్టం చేసింది. ఈ హఠాత్ పరిణామం వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ల్యాండ్ అయిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ లోగా విమానాశ్రయంలో ఉన్న తమ గ్రౌండ్ టీమ్స్ ప్రయాణికులకు అవసరమైన అల్పాహారం, హోటల్ వసతి లేదా వారి ఇష్టప్రకారం టికెట్ల రీషెడ్యూలింగ్ సదుపాయాలను అందిస్తున్నట్లు పేర్కొంది.


ఎయిర్ ఇండియా విమానాల్లో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. కేవలం వారం రోజుల క్రితం, మే 21న బెంగళూరు నుంచి దిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న తరుణంలో దాని ఒక ఇంజిన్‌లో మంటలు అంటుకున్న సంకేతాలు కాక్‌పిట్ సిబ్బందికి అందాయి. ఆ సమయంలో కూడా పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులందరినీ సురక్షితంగా ల్యాండ్ చేశారు. వరుసగా విమానాల్లో ఇలాంటి లోపాలు తలెత్తుతుండటంపై విమాన ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

22 శాతం దేశీయ సర్వీసులను రద్దు చేయనున్న ఎయిర్ ఇండియా

 


  •  ఇంధన ధరల విపరీతంగా పెరగడంతో నిర్ణయం


న్యూఢిల్లీ: విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి నిరాశ కలిగించే వార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) తమ దేశీయ విమాన సర్వీసులను భారీగా తగ్గించుకోవాలని నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ATF) ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో సుమారు 20 నుండి 22 శాతం వరకు దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బుధవారం సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ఈ ఎయిర్‌లైన్.. గతంలోనే తమ అంతర్జాతీయ సర్వీసులను కూడా దాదాపు 27 శాతం వరకు తగ్గించుకున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో దేశీయ రూట్లలో ప్రయాణించే వారికి టికెట్ల లభ్యత తగ్గడమే కాకుండా, విమాన ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.



ఎయిర్ ఇండియా ప్రస్తుతం వారానికి సగటున 4,400 విమాన సర్వీసులను నడుపుతోంది. ఇందులో దాదాపు 3,600 దేశీయ సర్వీసులు కాగా, మిగిలిన 800 అంతర్జాతీయ సేవలు. జూన్ నుండి ఆగస్టు 2026 మధ్య కాలానికి సంబంధించి కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ సర్వీసుల్లో గతంలో ప్రకటించిన మార్పుల కొనసాగింపుగానే, ఇప్పుడు కొన్ని నిర్దిష్ట దేశీయ రూట్లలో కూడా విమానాల ఫ్రీక్వెన్సీని (నడిచే సంఖ్యను) తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తున్నట్లు ఎయిర్ ఇండియా బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇంధన ధరల నిరంతర పెరుగుదల కారణంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, మార్కెట్ పరిస్థితులు చక్కబడి, డిమాండ్ స్థిరపడిన తర్వాత తిరిగి యథావిధిగా అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ పేర్కొంది.


ఈ హఠాత్ మార్పుల వల్ల ఇబ్బంది పడే ప్రయాణికులకు తాము అన్నివిధాలా అండగా ఉంటామని ఎయిర్ ఇండియా భరోసా ఇచ్చింది. రద్దయిన విమాన టికెట్లు కలిగిన ప్రయాణికులను ముందస్తుగానే సంప్రదించి, వారిని ఇతర ప్రత్యామ్నాయ విమానాల్లో సర్దుబాటు చేయడం (Re-accommodation) లేదా ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలనుకునే వారికి ఎలాంటి కోతలు లేకుండా పూర్తి రీఫండ్ (సొమ్ము వాపస్) అందిస్తామని ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పష్టం చేసింది.

తమిళనాడు రాజకీయాల్లో పెను మలుపు


  • టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ ఈపీఎస్ గూటికి
  • అనర్హత వేటు పిటిషన్ ఉపసంహరణ!


చెన్నై: రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు అనడానికి తమిళనాడు తాజా పరిణామాలే నిదర్శనం. కేవలం రెండు వారాల వ్యవధిలోనే అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో తీవ్ర విభేదాలు, విడాకులు, ఆ తర్వాత నాటకీయ రీతిలో రాజీ కుదిరిపోయాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) కి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అసెంబ్లీ బలపరీక్షలో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన రెబెల్ ఎమ్మెల్యేలు అంతా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. శుక్రవారం నాడు ఈపీఎస్ వర్గం, తిరుగుబాటు నేతలు కలిసి ఉమ్మడిగా అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి తామంతా మళ్లీ ఒకే పార్టీగా ఒక్కటయ్యామని అధికారికంగా స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ ఐక్యంగానే ఉంటామని, పార్టీ పట్ల తమకు పూర్తి విధేయత ఉందని రెబెల్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ప్రకటించారు. తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గడంతో, వారిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కార్యాలయానికి అంతకుముందు పళనిస్వామి సమర్పించిన దరఖాస్తును ఆయన తక్షణమే ఉపసంహరించుకున్నారు.



రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో మాజీ మంత్రి సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అధికార టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇద్దామన్న ఈ వర్గం ప్రతిపాదనను ఈపీఎస్ పూర్తిగా తిరస్కరించినప్పటికీ.. దాదాపు 25 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ మే 13న విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనితో ఆగ్రహించిన పళనిస్వామి వారందరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే, స్పీకర్ వద్ద ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే.. తిరుగుబాటు బృందం నుండి నలుగురు ఎమ్మెల్యేలు హఠాత్తుగా తమ పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకే పార్టీలో చేరిపోవడంతో రెబెల్స్ క్యాంప్‌కు మొదటి షాక్ తగిలింది. స్పీకర్ నిర్ణయం రాకముందే వారు రాజీనామా చేయడాన్ని ఈపీఎస్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు.


ఈ పరిణామాల మధ్య ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తమ పదవులు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయంతో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు వెంటనే యూ-టర్న్ తీసుకుని పళనిస్వామి క్యాంప్‌నకు వచ్చేసారు. బలపరీక్షలో విప్ ధిక్కరించినందుకు స్పీకర్‌కు, పార్టీ అధినేతకు క్షమాపణ లేఖలు సమర్పించారు. దీనితో రెబెల్స్ బలం 25 నుండి ఒక్కసారిగా 15కి పడిపోవడంతో తిరుగుబాటు నీరుగారిపోయింది. మరో దారి లేక రెబెల్ గ్రూప్ టాప్ లీడర్ ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని బృందం పళనిస్వామి నివాసానికి వెళ్లి ఆయనతో సంధి చర్చలు జరిపింది. ఎడప్పాడి పళనిస్వామి మాత్రమే తమ ఏకైక నాయకుడని వారు బహిరంగంగా ప్రకటించారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే తాము తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు సమస్యలన్నీ సర్దుకున్నాయని, తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామంతో అన్నాడీఎంకే పార్టీపై ఈపీఎస్ తన పట్టును మరోసారి నిరూపించుకుని తిరుగులేని బాస్‌గా నిలిచారు.

Featured post

అసలైన తృణమూల్ మాదే

 అసలైన తృణమూల్ మాదే రెబెల్ నేత రితబ్రతపై మమతా బెనర్జీ వ్యూహాత్మక ఎదురుదాడి తిరిగి కాళీఘాట్‌కు క్యూ కడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు! పశ్చిమ బెంగా...