- కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం ఆపండి
- బాధ్యతారాహిత్యాన్ని వీడకుంటే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
- ముంచుకొస్తున్న కరవుపై కాంగ్రెస్ సర్కార్పై సాగు నీటి నిపుణులు, సీనియర్ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి హెచ్చరిక
- కన్నెపల్లి నీళ్లను ఎత్తిపోయకుంటే ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్కు తాగునీటి ముప్పు తప్పదని హెచ్చరిక!
తెలంగాణలో నీటి సంక్షోభం , కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. నిజానికి ప్రతి ఒక్కరికీ మెదడుతో పాటు కాస్త హృదయం కూడా ఉండాలని, అసలు ఎవరికి బుద్ధి ఉంది, ఎవరికి లేదు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరంగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి పంపింగ్ చేయడం అత్యంత ప్రధానమని నీటి నిపుణులు, సీనియర్ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరవు వచ్చే అవకాశం ఉందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరిలోకి వరద నీరు వచ్చే అవకాశం అస్సలు లేదని స్వయంగా ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి అంగీకరిస్తున్నారని.. అయినప్పటికీ కనీస అవగాహన లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కన్నెపల్లి నుండి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నింపితే అవి కుప్పకూలిపోతాయని, గ్రామాలు మునిగిపోతాయని, భద్రాచలం కొట్టుకుపోతుందని ప్రభుత్వం అనవసరపు భయాందోళనలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో 20 లక్షల క్యూసెక్కుల అసాధారణ వరదలు వచ్చినప్పుడే ఈ బ్యారేజీలకు గానీ, భద్రాచలానికి గానీ ఎలాంటి నష్టం జరగలేదని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద ఏర్పడిన చిన్నపాటి బుంగలను గ్రాటింగ్ ద్వారా ఎప్పుడో సరిచేశారని గుర్తుచేస్తున్నారు.
ఈ బ్యారేజీలను వాటి పూర్తి సామర్థ్యం వరకు నింపాల్సిన అవసరం లేదని, కేవలం సగం మట్టానికి నింపినా అన్నారం, సుందిళ్ల పంప్ హౌస్ల ద్వారా ఎల్లంపల్లికి నీటిని సులభంగా పంప్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎగువ నుండి భారీగా వరదలు వచ్చినప్పుడే బ్యారేజీలపై ఒత్తిడి పెరుగుతుందని, పంపింగ్ చేసే నీటి ఒత్తిడి వల్ల బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఏమాత్రం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలను సాకుగా చూపిస్తూ తన బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. బ్యారేజీల్లో సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు.. గత రెండున్నరేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేయకుండా కాలయాపన ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వాస్తవ పరిస్థితులు కళ్లముందు ఉన్నప్పుడు మేధస్సు గురించి మాట్లాడటం సమంజసం కాదని, ఇప్పటికే హైదరాబాద్ మహానగరం తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నీటిని లిఫ్ట్ చేసి సరఫరా చేయకుంటే, హైదరాబాద్ నీటి కష్టాలకు , ఉత్తర తెలంగాణ కరవు పరిస్థితులకు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, ఎల్లంపల్లి నుండి బస్వాలపూర్ వరకు నిర్మించిన రిజర్వాయర్లన్నీ అందులో భాగమేనని గుర్తుంచుకోవాలి. గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును 60 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేయగా, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏకంగా 150 టీఎంసీల మొత్తం సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారు. కానీ ప్రస్తుతం ఈ రిజర్వాయర్లన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. గత రెండున్నరేళ్లుగా కేవలం గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, రాజకీయ పగతీర్చుకోవడానికే సమయాన్ని వృథా చేశారని.. ఇకనైనా ఈ బ్లేమ్ గేమ్ ఆపి మేడిగడ్డ బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ఇలాగే సాగదీస్తూ పోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు.













